వివాహేతర సంబంధంతోనే హత్య | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధంతోనే హత్య

Published Tue, Mar 4 2025 1:02 AM | Last Updated on Tue, Mar 4 2025 1:02 AM

వివాహేతర సంబంధంతోనే హత్య

వివాహేతర సంబంధంతోనే హత్య

పుట్టపర్తి టౌన్‌: వివాహేతర సంబంధంపై మోజు ఓ వ్యక్తిని దారుణంగా పొట్టనబెట్టుకుంది. ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్యను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఉదయం పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు.

ఈ నెల 1న హత్య..

బుక్కపట్నం మండలం కొత్తకోటకు చెందిన చియ్యేడు గంగన్న కుటుంబం సుమారు 15 ఏళ్ల క్రితం వెంగళమ్మచెరువులో స్థిరపడింది. గంగన్న కుమారుడు చియ్యేడు నగేష్‌(35) సొంతంగా ట్రాక్టర్‌ పెట్టుకొని బాడుగలకు తిప్పడంతోపాటు బేల్దారి పనులకు వెళ్లేవాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగిరాలేదు. స్థానిక షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలోని వెంకటేషు మామిడి తోటలో శనివారం సాయంత్రం నగేష్‌ మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపరుల సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని బోరునవిలపించారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి రూరల్‌ ఎస్‌ఐ లింగన్న సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ రప్పించి ఆధారాల కోసం గాలింపు చేపట్టారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు పడి ఉండటంతో మద్యం మత్తులో గొడవ జరిగి హత్యకు గురయ్యాడా లేదా అక్రమ సంబంధం నేపథ్యంలో ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగింది.

మిస్టరీ వీడిందిలా...

సీసీటీవీ ఫుటేజీల్లో అదే గ్రామానికి చెందిన దివాకర్‌ అనే వ్యక్తి నగేష్‌ను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వెళ్లినట్లుగా ఫుటేజీలు లభ్యం కావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ వేగవంతం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నగేష్‌ ఇంటికి దివాకర్‌ తరచూ రాకపోకలు సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో నగేష్‌ భార్య సునీతతో ఏర్పడిన చనువు కాస్త వివాహేతర సంబంధంగా మార్చుకున్నాడు. వీరిద్దరూ రోజూ గంటల తరబడి వీడియో కాల్‌లో మాట్లాడుకుంటుండడం గమనించిన నగేష్‌ పలుమార్లు తన భార్యను మందలించాడు. దీంతో నగేష్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు దివాకర్‌తో కలసి సునీత పథకం వేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 1న నగేష్‌ను నమ్మించి మందు పార్టీ చేసుకుందామంటూ ద్విచక్ర వాహనంపై దివాకర్‌ పిలుచుకుని వెళ్లాడు. కర్ణాటక నాగేపల్లి శివారున ఉన్న మద్యం దుకాణంలో రెండు బాటిళ్ల మద్యం కొనుగోలుచేసి వీరాంజనేయపల్లి గ్రామ శివారన ఉన్న వెంకటేష్‌ మామిడి తోటలోకి వెళ్లారు. అక్కడ నగేష్‌తో ఫుల్‌గా మద్యం తాపించి అనంతరం తాను తెచ్చుకున్న కొడవలితో దాడి చేసి హతమార్చాడు. నిందితులను సోమవారం వారి ఇంటి వద్దనే పోలీసులు అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. హత్య కేసులో మిస్టరీని ఛేదించి, నిందితులను అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐ సురేష్‌, ఎస్‌ఐలు లింగన్న, కృష్ణమూర్తితో పాటు సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు.

ప్రియుడితో కలసి

భర్తను హతమార్చిన భార్య

నిందితుల అరెస్ట్‌

వివరాలు వెట్టడించిన

డీఎస్పీ విజయకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement