
ఈ భవనాన్ని ఏమంటారు?
శ్రీకాకుళంలో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ కార్యాలయ నిర్మాణం
99 ఏళ్లకు స్థలాన్ని లీజుకు ఇచ్చేసిన వైనం
దళితుల ఇళ్ల కోసం కొనుగోలు చేసిన భూముల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం
రూ. 60కోట్ల నుంచి రూ.80కోట్ల విలువైన భూమిలో అనుమతులు పొందకుండా కట్టడం
ప్లాన్ కోసం రూ. 6లక్షల 7వేల 50 ఫీజు చెల్లించాలన్న కార్పొరేషన్
పట్టించుకోకుండా వదిలేసిన వైనం
ఇన్ని అక్రమాలకు పాల్పడి వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దుష్ప్రచారం
పాత శ్రీకాకుళం పరిధిలోని 80అడుగుల రోడ్డులో ఎన్టీఆర్ భవన్ పేరుతో కొనసాగుతున్న టీడీపీ కార్యాలయమిది. ఎంతో సుందరంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించారు. 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించారు. రెండెకరాల ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించారు. అయితే ఈ స్థలాన్ని ఆ పార్టీ కొనుగోలు చేయలేదు. ఎన్నో ఏళ్ల కిందట దళితుల సంక్షేమం కోసం సేకరించి ఉన్న సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన స్థలాన్ని 2014–19లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యాలయం కోసం కట్టబెట్టేశారు.
ఆ సమయంలో ఇక్కడ ఎకరా రూ. 30కోట్లకు పైగా ఉండేది. ఇప్పుడు రూ.40 కోట్లు దాటిపోయింది. దాదాపు రూ. 60కోట్ల నుంచి రూ.80కోట్ల విలువైన ఈ రెండెకరాల భూమిని సంవత్సరానికి రూ. 25వేలు ఫీజుతో లీజుకింద కేటాయించారు. అంతటితో ఆగలేదు. 33 ఏళ్లకు ఇవ్వాల్సిన లీజును 99 ఏళ్లకు ఇస్తున్నట్టు నిబంధనలు కూడా మార్చారు. పోనీ అనుమతులైనా తీసుకున్నారా.. అంటే అదీ లేదు. వుడా, టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేకుండానే ఏకంగా (జీప్లస్2) రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించేశారు. పనిలో పనిగా పక్కనున్న కొంత స్థలాన్ని ఆక్రమించేసి నిర్మాణం చేపట్టారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : టీడీపీ కడితే అది పార్టీ కార్యాలయం.. అదే వైఎస్సార్సీపీ నిర్మిస్తే మాత్రం ప్యాలెస్. టీడీపీ ఆధ్వర్యంలో 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేసినా చట్టబద్ధం.. అదే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో లీజుకు తీసుకుంటే మాత్రం అక్రమం. టీడీపీ చేస్తున్న ఈ దుష్ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులు, దాన్ని సమర్థిస్తూ టీడీపీ నాయ కులు చేస్తున్న ప్రచారాలు చూసి జనం ముక్కున వే లేసుకుంటున్నారు.
గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల కు కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను కేటాయించవచ్చు అన్న నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే అన్ని రాజకీయ పార్టీలు భూములు లీజుకు తీసుకుని తమ కార్యాలయాలను నిర్మించుకుంటాయి. కానీ టీడీపీ ప్రభుత్వ భూములు తీసుకుని కార్యాలయాలు నిర్మిస్తే... అవేమో పార్టీ కార్యాలయాలు.. వైఎస్సార్సీపీ శ్రీకాకుళానికి శివారులో పెదపాడుకు సమీపంలో కేటాయించిన భూమిలో కార్యాలయం నిర్మిస్తే మాత్రం ప్యాలెస్ అంటూ వెగటు ప్రచారం చేస్తున్నా రు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ ఆ రకంగా ట్వీట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
అనుమతుల్లేకుండానే
శ్రీకాకుళంలో జీ ప్లస్2 భవనం కోసం 2017 ఫిబ్రవరిలో విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథానిటీ (వుడా) అధికారులకు అప్పటి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష దరఖాస్తు చేశారు. ఆ మేరకు వుడా, కార్పొరేషన్ టౌ న్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి వివిధ ఫీజుల తో పాటు బెటర్మెంట్ చార్జి కింద రూ. 6లక్షల 7వేల 50 చెల్లించాలని నోటీసు జారీ చేశారు. అయి తే, ఇంత మొత్తం చెల్లించలేమని, రెండెకరాల విస్తీర్ణం ఉన్నప్పటికీ కేవలం 25సెంట్లలో మాత్రమే నిర్మాణం చేపట్టామని, ఆ మేరకు తమకు ప్లాన్ అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు మళ్లీ కోరారు.
ఆ అధికారం తమకు లేదని, మొత్తం విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకుంటామని, భవనం మేరకు ప్లాన్ ఇవ్వలేమని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. కట్టడం ఎంత ఉన్నా ప్రహరీతో కూడిన విస్తీర్ణానికే ప్లాన్ తీసుకోవాలి. ఆ మేర కు కార్పొరేషన్ అధికారులు నిర్దేశించిన ఫీజు చెల్లించి అనుమతి పొందాలి. కానీ బెటర్మెంట్ చార్జీ ఎ క్కువగా ఉందని చెప్పి రెండెకరాల విస్తీర్ణంలో ప్రహ రీ, భవనం నిర్మించినా కేవలం భవనానికే మాత్రమే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని అధికారులపై కత్తి పెట్టా రు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అలా చేయలేమని చెప్పగానే ప్రభుత్వానికి పంపిస్తే తా ము అక్కడ పని చేయించుకుంటామని బలవంతంగా అధికారుల ద్వారా ఫైలు పెట్టించుకున్నారు. ప్రభుత్వం వారిదే కావడంతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి సానుకూలంగా చేయించుకున్నారు.
తమ మచ్చను చూసుకోకుండా
పార్టీ కార్యాలయాల కోసం స్థలాలు కేటాయింపులు చేసేందుకు తగు నిబంధనలు ఉన్నాయి. గుర్తింపు కలిగిన పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల కోసం 33 ఏళ్లకు లీజు కింద నామినల్ ఫీజుతో కేటాయించవచ్చు. కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ జీఓను కాదని కొన్ని షరతులు పెట్టి శ్రీకాకుళంలో భూమిని 99 ఏళ్లకు లీజుకని తీసుకుంది. అదేమీ నిరుపయోగంగా ఉన్న భూమి కాదు. షెడ్యూల్ కులాల ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ కొన్నేళ్ల క్రితం రైతుల నుంచి కొనుగోలు చేసి సేకరించిన భూమి అది. దాన్ని 2015 సెప్టెంబర్ 4వ తేదీన టీడీపీ కార్యాలయం కోసం కేటాయించేశారు. టౌన్ సర్వే నంబర్ 700–1లో 1.29ఎకరాలు, టౌన్ సర్వే నంబర్ 701–1లో 71సెంట్లు భూమిని టీడీపీకి అప్పగించేశారు.
వెలుగు చూసిన ఆక్రమణ
ప్రభుత్వ ఉన్నతాధికారులు 25 సెంట్లకే ప్లాన్ అప్రూవల్ చేయాలని ఆదేశాలు ఇవ్వడమే తరువాయి వుడా అధికారులు జాగ్రత్తపడ్డారు. ఇదేదో సమస్యగా మారి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని తమకున్న అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా రాసి పెట్టారు. టీడీపీ భవన్కు దక్షిణ వైపు ఉన్న రోడ్డుకు ఆనుకుని కొంత ఆక్రమిత స్థలంలో ప్రహరీ నిర్మించారని, దాన్ని తొలగించి, రిమార్క్స్తో కూడిన ప్లాన్ ఫైలు పెట్టాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతల దృష్టికి కార్పొరేషన్ అధికారులు తీసుకెళ్లారు. కానీ వారంతా గమ్మున ఉండిపోయారు. అధికారం చేతిలో ఉంది ఎవరేం చేస్తారు అన్న ధోరణితో వుడా అధికారులు సూచించిన విధంగా ప్లాన్కు దరఖాస్తు పెట్టుకోలేదు. ప్లాన్ అనుమతి పొందకుండానే చంద్రబాబు చేతుల మీదుగా అట్టహాసంగా కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయించారు.
రాష్ట్రంలో తాజాగా మొదలైన టీడీపీ పాలనలో వైఎస్సార్సీపీకి సంబంధించిన ఆస్తులను ఎలాగైనా ధ్వంసం చేయాలన్న ఆలోచనతో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీయడం, లేదంటే నోటీసులంటించి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి 80 అడుగుల రోడ్డులో అనుమతుల్లేకుండా ఎప్పుడో నిర్మించిన టీడీపీ కార్యాలయం వైపు వెళ్తారో అధికారంలో టీడీపీ ఉందని చూసీ చూడనట్టు వదిలేస్తారో చూడాలి.

ఈ భవనాన్ని ఏమంటారు?
Comments
Please login to add a commentAdd a comment