తిరువొత్తియూరు: మదురై ఆర్మ్డ్ ఫోర్స్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన పోలీస్ గ్రీవెన్స్డే లో డీజీపీ శంకర్ జివాల్ పాల్గొని, పోలీసులు, కిందిస్థాయి అధికారుల సమస్యలను విన్నారు. డీజీపీ శంకర్ జివాల్ గురువారం మధురై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శాంతిభద్రతలు, వివిధ నేరాల నివారణకు సంబంధించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మదురై సాయుధ దళాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన పోలీసు ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో డీజీపీ శంకర్ జివాల్ పాల్గొని పోలీసులు, వారి కుటుంబసభ్యుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అదే ఆవరణలో మొక్కలు నాటారు.
ప్లస్ ఒన్ విద్యార్థిని ఆత్మహత్య
అన్నానగర్: ప్రభుత్వ పరీక్షలు జరుగుతుండగా పాఠశాల హాస్టల్ మూడో అంతస్తు నుంచి దూకి ప్లస్–1 విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా మీంజూర్ ప్రాంతానికి చెందిన మాలిక్ కుమార్తె రబియా బేగం (16) వండలూరు జూ ఎదురుగా ఉన్న క్రెసెంట్ మెట్రిక్ స్కూల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. ప్రస్తుతం ప్లస్–1 పబ్లిక్ పరీక్ష రాస్తోంది. ఈ స్థితిలో గురువారం మధ్యాహ్నం రబియాబేగం పాఠశాల హాస్టల్ మూడో అంతస్తు నుంచి అకస్మాత్తుగా కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్కూల్ యాజమాన్యం వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అనంతరం అక్కడి నుంచి తదుపరి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కీళంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి, పబ్లిక్ పరీక్షల భయంతో విద్యార్థిని నేలపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక మరేదైనా కారణమా? వారు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న
అరుదైన పక్షులు మృతి
కొరుక్కుపేట: విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన ఆరు అరుదైన విదేశీ పక్షులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్ విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేశారు. తనిఖీల్లో థాయిల్యాండ్ నుంచి టూరిస్టుగా చైన్నెకి వచ్చిన ప్రయాణికుడి వద్ద అరుదైన విదేశీ బ్లాక్ కాలర్డ్ స్టెర్వింగ్ జాతికి చెందిన ఆరు పక్షులను అక్రమంగా తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పక్షులు అపస్మారక స్థితిలో ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని బిసెంట్నగర్లోని యూనియన్ ఫారెస్ట్రీ కన్జర్వేషన్ క్రైమ్ బ్రాంచ్కు సమాచారం అందించారు. ఆరు పక్షులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ చైనా, తైవాన్, మలేషియా, సింగపూర్ దేశాలకు చెందిన అరుదైన పక్షులుగా గుర్తించారు.
నిప్పంటించుకున్న మహిళా ఉద్యోగి
అన్నానగర్: తేనంపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పారిశుద్ధ్య కార్మికురాలు నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది. చైన్నె తేనాంపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో స్వీపర్గా పనిచేస్తున్న సుమతి (37) కార్యాలయంలోనే పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. అక్కడున్న వారు ఆమెని రక్షించి కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పని నుంచి తొలగించినందుకే మహిళ నిప్పు అంటించుకునట్లు పోలీసులు జరిపిన విచారణలో తేలింది. ఈ ఘటన పై పోలీసులు ప్రైవేటు అటవీశాఖ అధికారులను విచారిస్తున్నారు.
మహిళపై లైంగికదాడి
అన్నానగర్: వివాహం చేసుకుంటానని నమ్మించి, ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడడంతోపాటు ఆమె నుంచి నగలు, నగదు, ల్యాప్టాప్ తీసుకుని ఉడాయించాడు. ఈ ఘటనపై చైన్నెలోని అన్నానగర్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతి అన్నానగర్ ఆల్ మహిళా పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 2022లో ఓ మహిళ మ్యాట్రిమోనియల్ ద్వారా వివాహం చేసుకోవడానికి వరుడి కోసం వెతికింది. అప్పుడు, ఒక యువకుడు ఆమెను సెల్ఫోన్బర్లో సంప్రదించాడు. ‘మిమ్మల్ని వివాహం చేసుకుంటాను.. ఒంటరిగా చూడవచ్చ?’ అని అడిగాడు. వెంటనే అందుకు ఆమె అంగీకరించింది. ఆ యువకుడి మాటలను నమ్మి క్లోజ్గా ఉంటూ వచ్చింది. అనంతరం కోయంబేడు ప్రాంతంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె నిరాకరించి పెళ్లికి ముందు ఇలా చేయకు అని చెప్పింది. అందుకు ఆ యువకుడు ‘నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను’ అని ఆశ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యాపారం చేయబోతున్నానని రూ.10 లక్షల నగదు, 9 సవర్ల నగలు, ల్యాప్టాప్ ఆమె వద్ద తీసుకున్నాడు. ఆ తర్వాత హఠాత్తుగా పెళ్లికి నిరాకరించాడు. ‘మనమిద్దరం సన్నిహితంగా ఉన్న అసభ్యకర వీడియోను వెబ్సైట్లో ప్రచురిస్తాను’ అని బెదిరించాడు. తనని మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొంది. పోలీసులు ప్రత్యేక స్క్వాడ్ను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment