రసూల్పురా (హైదరాబాద్): అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని పురస్కరించుకుని 25 రోజుల కౌంట్డౌన్ సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, కేంద్ర ఆయుష్, ఓడరేవుల, షిప్పింగ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, కార్మిక, ఉపాధి, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముంజపరా మహేంద్రభాయ్ కాలూభాయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ దీపావళి, ఉగాదిలాగా యోగా కూడా ఒక పండుగలా సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి యోగా చేయాలని సూచించారు. కౌంట్డౌన్కు హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విషయమని అన్నారు.
యోగా మన జీవన విధానం: కిషన్రెడ్డి
మన దేశంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన యోగా మన జ్ఞాన సంపద, జీవన విధానమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. జూన్ 21న యోగా దినోత్సవం రోజున అనేక దేశాల్లో యోగా చేస్తారని, ఆరోజు మన దేశంలోనూ ప్రతిఒక్కరూ యోగా చే యాలన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 13 నుంచి దేశవ్యాప్తంగా వంద రోజులపాటు యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు హైదరాబాద్లో 25 రోజుల కౌంట్డౌన్ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి సోనోవాల్ మాట్లాడుతూ, యోగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా మనసు సుసంపన్నం అవుతుందని అన్నారు.
జూన్ 21న మైసూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. ఈ 25 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సినీ ఆరి్టస్టులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన పదివేల మంది పైగా యోగా మహోత్సవ్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment