
సాక్షి, పెద్దపల్లి: వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కాలనీలు, ఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. బొక్కల వాగు బ్యాక్ వాటర్తో పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్, దొంతలవాడ, బోయిన్ పేట, లైన్ గడ్డలోని బర్రెకుంటలో ఉన్న ఇళ్లు నీటమునిగాయి. దీంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఓ కుటుంబం తమ నెలల పసిపాపను వరద నీటి నుంచి రక్షించేందుకు పడ్డ కష్టం బాహుబలి సినిమాలోని దృశ్యాన్ని తలపించింది. సినిమాలో గ్రాఫిక్స్తో క్రియేటివిటీ చేస్తే ఇక్కడ మాత్రం ప్రత్యక్ష్యంగా సాక్షాత్కరించిందీ దృశ్యం. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల పసికందును కుటుంబ సభ్యులు బుట్టలో పెట్టుకొని తరలించారు. భుజాల వరకు వచ్చిన నీటిలో చిన్నారిని ఉంచిన బుట్టను తల్లిదండ్రులు తమ తలపై ఉంచుకుని అడుగులో అడుడేస్తూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. మంథని పట్టణంలో వరద పరిస్థితి తీవ్రతను ఈ దృశ్యాలు కల్లకు కడుతున్నాయి.
చదవండి: కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం
Comments
Please login to add a commentAdd a comment