
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఒక్క అడుగే ముందుకు
ఏ దరఖాస్తు వచి్చనా తహసీల్దార్కు కనపడే ఆప్షన్ అందుబాటులోకి
మిగిలిన ప్రక్రియ అంతా యథాతథం.. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు చక్కర్లు కొట్టాల్సిందే
ఆన్లైన్, ఆఫ్లైన్ పేరిట మొత్తం 4 సార్లు కిందికి.. పైకి తిరగాల్సిందే
ఈ ప్రహసనంలో మార్పు వస్తేనే ధరణి దరఖాస్తుల శీఘ్ర పరిష్కారానికి అవకాశం
నేడు జిల్లా కలెక్టర్లతో ధరణి పోర్టల్పై సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కార రూటు మారింది. గతంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ఏ దరఖాస్తు వచ్చినా, ఆ దరఖాస్తు కేవలం కలెక్టర్ లాగిన్లో మాత్రమే కనిపించేది. కలెక్టర్ వేలిముద్రతో తన లాగిన్ను ఓపెన్ చేసి సదరు దరఖాస్తును కిందిస్థాయికి పంపాల్సి వచ్చేది. కానీ తాజాగా ధరణి పోర్టల్లో ఓ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ధరణి కింద ఏ దరఖాస్తు వచ్చినా అది తహసీల్దార్కు కనిపించేలా, తహసీల్దార్ ఆ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం కోసం పైఅధికారులకు పంపేలా లాగిన్ లభించింది.
ప్రయోజనం లేదంటున్న తహసీల్దార్లు
దరఖాస్తు పరిష్కారం చేసే రూటు మారింది కానీ ఆ పరిష్కారం కోసం సదరు దరఖాస్తు చేయాల్సిన ప్రయాణం (జర్నీ) మాత్రం మారలేదని, అలాంటప్పుడు రూటు మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని తహసీల్దార్లు చెబుతున్నారు.
⇒ ప్రస్తుతమున్న విధానంలో ధరణి దరఖాస్తులను తహసీల్దార్ ఓపెన్ చేసినా..ఆన్లైన్, ఆఫ్లైన్ రికార్డులను ఆర్డీఓ, జేసీ,కలెక్టర్లకు నాలుగు స్థాయిల్లో పంపాలని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఆన్లైన్లో, ప్రింట్లు తీసి ఆఫ్లైన్లో పంపాల్సి వస్తోందని వాపోతున్నారు.
⇒ఇలా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే రిమార్క్స్ పంపితే సరిపోతుందని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లతో కూడిన ఆఫ్లైన్ రికార్డును నిక్షిప్తం చేసి సదరు దరఖాస్తులకు పరిష్కారం చూపెడితే బాగుంటుందని వారంటున్నారు.
⇒నాలుగుసార్లు ఆన్లైన్లో, నాలుగుసార్లు ఆఫ్లైన్లో దరఖాస్తు చక్కర్లు కొట్టిన తర్వాత పరిష్కారానికి ప్రత్యేక ఫైల్పెట్టి మళ్లీ ఆన్లైన్లో పరిష్కరించాల్సి వస్తుందని, ఈ పద్ధతిలో మార్పు తీసుకురావడంపై ఉన్నతస్థాయిలో సమీక్ష జరగాల్సి ఉందని వారంటున్నారు.
⇒ ఆ మార్పు జరిగినప్పుడే ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు.
మూడు వారికి... రెండు వీరికి..
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్లు, ఆర్డీఓలకు ప్రస్తుతం చాలా తక్కువ అధికారాలున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ), గ్రీవెన్స్ ల్యాండ్మ్యాటర్స్ (కులం, ఆధార్కార్డుల్లో తప్పులు నమోదు, పేర్లలో అక్షర దోషాలు సవరించడం) లాంటి అధికారాలు తహసీల్దార్లకు ఉండగా, కోర్టు కేసుల సమాచారం, పాస్బుక్ లేకుండా నాలా, సంస్థాగత పాస్బుక్కులిచ్చే అధికారాలు మాత్రం ఆర్డీఓలకు ఉన్నాయి.
ఈ అధికారాలు మినహా అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు ఇప్పటికీ కలెక్టర్లకు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వికేంద్రీకరణ వీలున్నంత త్వరగా జరగాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాగలిగిన దరఖాస్తులను అక్కడే పరిష్కరించే అధికారాలు సదరు సిబ్బందికి కలి్పంచినప్పుడే ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.
నేడు వీడియో కాన్ఫరెన్స్లు
ధరణి దరఖాస్తుల పురోగతిపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్మిత్తల్ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి నిర్వహించనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, మహబూబ్నగర్, మంచిర్యాల, వికారాబాద్, వనపర్తి, వరంగల్, ములుగు, నిర్మల్ జిల్లాలు, 12 నుంచి ఒంటి గంట వరకు మిగిలిన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎంఆర్ఓ పీడీ వి. లచి్చరెడ్డి విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment