land issues
-
Andhra Pradesh: కష్టాలు చెబితే.. కస్సుబుస్సు
గన్నవరంలో గబగబ..కృష్ణా జిల్లా గన్నవరంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగిన తీరును ‘సాక్షి’ బృందం పరిశీలించగా పట్టుమని 20 మంది కూడా పాల్గొన లేదు. భూముల సమస్యలు అత్యధికంగా ఉండే గన్నవరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సభలో ఇతర పనుల మీద వచ్చిన వారిని కూర్చోబెట్టారు. సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వచ్చిన వారిలో చాలా మంది టీడీపీ సానుభూతిపరులే. గ్రామాలకు సంబంధించి పార్టీ పరమైన సమస్యలను వారు ప్రస్తావించారు. గత సర్కారుపై నిందలు మోపడం, ఈ ప్రభుత్వం ఏదో చేసేసినట్లు చెప్పుకోవడానికి ఆరాట పడ్డారు. తహశీల్దార్, ఇతర అధికారులు ప్రసంగించిన అనంతరం వినతులు స్వీకరించారు. ఇదంతా కేవలం గంటన్నరలోనే ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరగాల్సిన కార్యక్రమాన్ని తూతూమంత్రంగా జరిపారు.సాక్షి, అమరావతి: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రచారం చేసిన కూటమి సర్కారు వాటిని మొక్కుబడి తంతుగా మార్చి తుస్సుమనిపించింది. లక్షల్లో ఫిర్యాదులు అందుతున్నా వేలల్లో కూడా పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఉసూరుమంటూ కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలకు అవే సమస్యలతో పోటెత్తుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన భూ సంస్కరణలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం వాటిపై నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకుంది. ల్యాండ్ టైట్లింగ్ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ రెవెన్యూ సదస్సులు చేపట్టింది. తూతూమంత్రంగా నిర్వహిస్తుండటంతో స్థానికుల భాగస్వామ్యం పెద్దగా ఉండడం లేదు. పెద్ద గ్రామాల్లో నిర్వహించే సభల్లోనూ 30, 40 మందికి మించి ప్రజలు కనపడడంలేదు. దీంతో కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చేవారిని సభల్లో కూర్చోబెట్టి ఫొటోలు తీసి పంపుతున్నారు. అసలు ఈ సభలను అధికారులే సీరియస్గా తీసుకోవడం లేదు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో ఎలాగోలా నిర్వహించి మమ అనిపిస్తున్నారు. ఓ మోస్తరుగానైనా జనం వచ్చి ఫిర్యాదులు ఇచ్చిన చోట వాటికి పరిష్కారం కనిపించడంలేదు. కేవలం తాము పరిష్కారం చూపించగలమన్న అంశాలకు సంబంధించిన వినతులను మాత్రమే అధికారులు స్వీకరిస్తున్నారు. భూ వివాదాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ప్రస్తావిస్తే కోర్టుకు వెళ్లాలని, అది తమ పరిధిలో లేదంటూ తప్పించుకుంటున్నారు. తప్పుడు ఆరోపణలతో.. సీఎంను కలిసినా ఏం లాభం? పలు చోట్ల రెవెన్యూ సదస్సులకు జనం రాకపోవడంతో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. వారంతా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలతో అందచేసే వినతి పత్రాలను స్వీకరిస్తూ నమోదు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నేతల పేర్లు ప్రస్తావిస్తూ ఇచ్చే ఫిర్యాదులు తీసుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సమస్య ఏదైనా సరే వైఎస్సార్సీపీ బాధితులమని చెప్పాల్సిందిగా ఫిర్యాదుదారులకు టీడీపీ నేతలు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇలాగే పలువురిని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తరలించి సీఎం చంద్రబాబు, మంత్రులకు విజ్ఞాపనలు ఇప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ బాధితులమని, కబ్జా చేశారని చెబితేనే ప్రయోజనం దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. నిజానికి నేరుగా సీఎం చంద్రబాబుకు అందచేసే విజ్ఞాపనలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన్ను కలిసిన వారు వాపోతున్నారు. లక్షల్లో ఫిర్యాదులు.. ఇప్పటివరకు 12,862 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పూర్తయ్యాయి. సోమవారం వరకు 1,75,182 వినతి పత్రాలు అందగా 12,409 అర్జీలను పరిష్కరించారు. దీన్నిబట్టి రెవెన్యూ సదస్సులు ఎంత మొక్కుబడిగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత నెల 6న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రోజూ 800 నుంచి వెయ్యి గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ చెబుతోంది. జనం లేక వెలవెలబోతున్న సభలో మాట్లాడుతున్న గన్నవరం తహసీల్దార్ సదస్సులతో ఫలితం లేక కలెక్టరేట్లకు..⇒ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. మొదటి రెండు మూడు రోజులు హడావుడి చేసి ఆ తరువాత వదిలేశారు. సదస్సుల్లో ఇప్పటి వరకు 9,155 అర్జీలు నమోదు కాగా కేవలం 142 మాత్రమే పరిశీలించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజలు అర్జీలతో పోటెత్తుతున్నారు. డిసెంబర్ 23న చిత్తూరు కలెక్టరేట్లో పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి 145 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో స్పందన లేకపోవడంతోనే ప్రజలు కలెక్టరేట్కు తరలివస్తున్నారు. ⇒ తిరుపతి జిల్లాలో గత నెల 28 వరకు రెవెన్యూ సదస్సుల్లో 13,803 అర్జీలు అందగా అందులో 10 వేలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. 22 ఏ భూ సమస్యలు, పట్టాల మార్పులు, మ్యుటేషన్లు, భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల సమస్యలే అధికం. విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం, తాగునీరు, పారిశుద్ద్యం, రేషన్, ఫించన్ సమస్యలపై 3,803 అర్జీలు వచ్చాయి. అయితే విద్యార్థులకు సర్టిఫికెట్స్ సమస్యలను మాత్రమే అక్కడిక్కడే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. నోడల్ ఆఫీసర్లు ఎక్కడా దర్శనం ఇవ్వడం లేదు. ⇒ కాకినాడ జిల్లా రెవెన్యూ సదస్సుల్లో అర్జీలను స్వీకరించడం, సమస్యలపై చర్చించడం మినహా ఏ ఒక్కటీ పరిష్కరించిన దాఖలాలు లేవు. కొన్నింటిని వీఆర్వోలకు అప్పగించి ఆ సమస్యలు పరిష్కారమైనట్లు చూపుతున్నారు. ఇప్పటి వరకూ 4,635 సమస్యలపై అర్జీలు వచ్చాయని చెబుతున్నారు. ⇒ విశాఖ జిల్లాలో 4,666 వినతులు రాగా 3,167 అర్జీలను ఇంకా పరిష్కరించాల్సి ఉంది. భూఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు చేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వినతులు వస్తున్నాయి. రెవెన్యూ పరంగా వచ్చే దరఖాస్తులను జాయింట్ కలెక్టర్కు నివేదిస్తున్నారు. ⇒ అనకాపల్లి జిల్లా రెవెన్యూ సదస్సుల్లో 5,984 వినతులు రాగా 284 అర్జీలను పరిష్కరించారు. భూ ఆక్రమణలు, పట్టాదారు పాసు పుస్తకాలు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వినతులు వస్తున్నాయి. ⇒ అనంతపురం జిల్లా రెవెన్యూ సదస్సుల్లో ఆర్భాటమే కానీ ఫలితం కనిపించడంలేదు. భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు వేల సంఖ్యలో అందుతున్నాయి. 5,450 ఫిర్యాదులు అందగా 366 మాత్రమే పరిష్కరించారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఇప్పటివరకు 9,311 భూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు ఫిర్యాదులు అందాయి. 8,871 సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. ⇒ అన్నమయ్య జిల్లా పరిధిలో సదస్సుల ద్వారా 10,421 సమస్యలపై ప్రజలనుంచి వినతులు అందాయి. 924 సమస్యలకు అధికారులు పరిష్కారం చూపారు. 80 శాతం ఫిర్యాదులు భూ సమస్యలపైనే అందాయి. ⇒ కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 6,908 అర్జీలను స్వీకరించిన అధికారులు కేవలం 513 సమస్యలకు మాత్రమే పరిష్కారాలు చూపారు. అర్జీల పరిష్కారంపై కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. 21 రోజులైనా ఎందుకు పరిష్కారం కావడం లేదని ఇటీవల సమీక్షలో నిలదీశారు. దేవనకొండ మండలంలో ఒక్క అర్జీకి కూడా పరిష్కారం చూపకపోవడంపై సంబంధిత తహసీల్దార్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల సమస్యలే అధికం.. రెవెన్యూ సదస్సుల్లో అందుతున్న ఫిర్యాదుల్లో 60 శాతం పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించినవే ఉంటున్నాయి. తప్పులు, ఆన్లైన్ సమస్యలు, హద్దుల తేడాలు లాంటి సమస్యలే అధికం. భూముల రీ సర్వే మొత్తం తప్పుల తడకని కూటమి నేతలు ప్రచారం చేసినప్పటికీ వాటికి సంబంధించిన వినతులు చాలా తక్కువ సంఖ్యలో రావడం గమనార్హం. అసైన్డ్ భూముల సమస్యలు, నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములు, డీ పట్టాలు, ఇళ్ల పట్టాలకు చెందిన వినతులు ఉంటున్నాయి. అయితే రశీదులు ఇవ్వడమే కానీ పరిష్కారం మాత్రం చూపకపోవడంతో దరఖాస్తుదారులు ఉసూరుమంటున్నారు. నెల తరువాత చూద్దాం.. గన్నవరానికి చెందిన పొక్కునూరి సోమలింగేశ్వరరావు, ఆయన సోదరుడు తమకు తండ్రి శోభనాచలపతిరావు నుంచి వారసత్వంగా వచ్చిన 3.3 ఎకరాల భూమిని పంచుకుని మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంతవరకు వారి పేర్లు ఆన్లైన్లో కనిపించడంలేదు. దీనిపై గన్నవరం రెవెన్యూ సదస్సులో వినతి పత్రం అందచేయగా నెల తర్వాత పరిష్కరించేందుకు ప్రయతి్నస్తామని అధికారులు చెప్పారు. -
సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి
భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆన్లైన్లోకి తెచ్చిన తర్వాత 2014కు ముందు సబ్ రిజ్రిస్టార్ల వద్ద ఉన్న రికార్డులను అప్డేట్ చేస్తాం. 2014కు ముందు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండి తర్వాత అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ధరణి లోపాలను పూర్తిగా సవరించి, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించాం..’’ సాక్షి, హైదరాబాద్: సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆర్వోఆర్ –భూభారతి’ చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం అద్భుతంగా పనిచేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ నాలుగు గోడల మధ్య అసంబద్ధంగా రూపొందించిన ‘ధరణి’తో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని అమల్లోకి తెచ్చి... దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త భూభారతి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు పొంగులేటి మాటల్లోనే... ‘‘కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి, చర్చావేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టాన్ని రూపొందించాం. మాజీ మంత్రి హరీశ్రావు వంటి వారు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచాం. ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దుతాం గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. రవి అనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నా వద్దకు వచ్చి.. 1,398 ఎకరాల భూములపై గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ధరణిలో వాటిని అటవీ భూములుగా చూపారని వాపోయారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలను సైతం ధరణి దెబ్బతీసింది.భూయజమానికి తెలియకుండానే భూమి చేతులు మారిపోయేలా చేసింది. గత చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి భూ–భారతి ద్వారా సరిదిద్దేలా ఏర్పాట్లు చేశాం. ధరణి పోర్టల్ పార్టు–బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు తెరపడుతుంది. భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ప్రత్యేక సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రిజ్రిస్టేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. రిజ్రిస్టేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటు కలి్పంచటం ధరణిలో మెరుగైన అంశం. ఆ సమయంలో పొరపాట్లు జరిగితే కూడా సరిదిద్దే కొత్త ఏర్పాటుతో దాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. ఆధార్ తరహాలో భూదార్.. ఆధార్ నంబర్ తరహాలో ‘భూదార్’ నంబర్ తీసుకొస్తాం. ప్రతి రైతుకు ఒక కోడ్ ఇస్తాం. గతంలో రెవెన్యూ గ్రామాల్లో ఒక ఏడాదిలో జరిగిన భూలావాదేవీలను పొందుపరిచేందుకు నిర్వహించే జమాబందీని బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. దానిని తిరిగి తీసుకొస్తున్నాం. రైతుల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదు. దీనికోసం గతంలో కొనసాగిన ల్యాండ్ ట్రిబ్యునల్స్ను పునరుద్ధరించనున్నాం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు సీసీఎల్ఏ ద్వారా చర్యలు తీసుకోనున్నాం. గతంలో పట్టదారు పాస్బుక్లలో ఉన్న అనుభవదారులు, కాస్తుదారుల కాలం (నిలువు వరుస)ను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు ఆన్లైన్లో ధరణి తీసుకొచ్చిన తర్వాత భూములకు సంబంధించిన పాత రికార్డులు లేకుండా చేశారు. ఇకపై ఆన్లైన్తోపాటు మాన్యువల్ పహాణీలను నమోదుచేయాలని కొత్త చట్టంలో పొందుపరిచాం. ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగానో, ప్రలోభాలకు లోనైగానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. సులువుగా తెలుసుకునేలా భూముల వివరాలు గత ప్రభుత్వం ధరణిని 3 మాడ్యూల్స్తో ప్రారంభించి 33 మాడ్యూల్స్కు తీసుకొచ్చింది. తద్వారా పేద, చిన్నకారు రైతుల భూములు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మేం భూభారతి ద్వారా 33 మాడ్యుల్స్ బదులు 6 మాడ్యుల్స్ తెస్తున్నాం. అలాగే గతంలో 32 కాలమ్స్ (నిలువు వరుసలు)లో ఉన్న పహాణీలను ఒకే కాలమ్లోకి తెచ్చారు. దీనిని భూభారతిలో 11 కాలమ్స్కు పెంచాం. ధరణి పోర్టల్లో సొంత భూమిని కూడా చూసుకునే వీలు లేకుండా దాచేవారు. భూభారతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నంబర్ల ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవచ్చు..’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
చేతిలో సంచి.. అందులో కత్తి.. పుట్టపర్తి కలెక్టరేట్కు మహిళ!
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా): అచ్చం ఫ్యాక్షన్ సినిమా మాదిరిగానే ఉంది తాజా ఘటన. చేతిలో సంచి.. అందులో కత్తి పెట్టుకుని ఒక మహిళ ప్రభుత్వ కార్యాలయానికి రావడం ఫ్యాక్షన్ సినిమాను తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పుట్టపర్తి కలెక్టరేట్కు ఓ మహిళ కత్తితో రావడం తీవ్ర కలకలం రేపింది. చేతిలో సంచి పట్టుకుని అందులో కొన్ని డాక్యుమెంట్స్తో పాటు కత్తిని తీసుకుని కలెక్టరేట్కు రావడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా తనకున్న భూ సమస్యతో ఆమె కలెక్టరేట్కు వచ్చారు. అయితే తన భూ సమస్యకు సంబంధించి డాక్యుమెంట్స్ ను సంచిలో తీసుకొచ్చింది ప్రేమలత అనే మహిళ.అయితే సంచిలో కత్తి కూడా ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. కలెక్టరేట్కు వచ్చిన ప్రతీ ఒక్కర్నీ తనిఖీలు చేసే క్రమంలో ఆమెను కూడా తనిఖీ చేయగా కత్తి బయటపడింది. దాంతో అక్కడున్న పోలీస్ సెక్యూరిటీ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. అసలు ఆమెను కత్తిని ఎందుకు తీసుకొచ్చావ్ అని ప్రశ్నించగా, ఆత్మరక్షణ కోసం అంటూ సమాధానమిచ్చింది. దాంట్లో ఎంత వరకూ వాస్తవం ఉందని పదే పదే ప్రశ్నించిన పోలీసులు.. ఆమెను విడిచిపెట్టి కత్తిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. -
భూమి లేదు.. ఉన్నా హక్కుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల సమస్యలు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త చట్టాలను, విధానాలను రూపొందించుకోవడంతోపాటు కొన్నిరకాల సంస్కరణలు, మరికొన్ని కొత్త పద్ధతులను అవలంబించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 అంశాలతో కూడిన నివేదికను అందజేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించింది.రాష్ట్రంలోని 56శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదని కమిటీ తమ నివేదికలో తెలిపింది. భూములున్న రైతాంగం కూడా హక్కుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంది. రాష్ట్రంలోని 50శాతం మంది పట్టాదారులకు భూముల విషయంలో పలు సమస్యలు ఉన్నాయని.. వారికి సమగ్ర హక్కుల కల్పన ఇంకా పూర్తికాలేదని వెల్లడించింది. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన భూముల సర్వే తర్వాత తెలంగాణలో సర్వేనే జరగలేదని, వెంటనే భూముల డిజిటల్ సర్వేకు పూనుకోవాలని సిఫార్సు చేసింది. కోర్టు కేసుల్లో భూములు నలిగిపోతున్నాయని, దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ హక్కుల కోసం తిరగాల్సి వస్తోందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో 66శాతం సివిల్ కేసులే ఉన్నాయని.. ఇందులో భూవివాదాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక రెవెన్యూ కోర్టులను రద్దు చేసే నాటికి వాటిలో 25వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని, అవి ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపింది. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య 4 లక్షల ఎకరాల భూముల విషయంలో వివాదాలు ఉన్నాయని.. అటవీ శాఖ చెప్తున్న దానికి, ధరణిలో నమోదు చేసిన భూములకు 23.72 లక్షల ఎకరాల తేడా ఉందని వెల్లడించింది. వక్ఫ్, దేవాదాయ భూముల వివరాల్లో కూడా పొంతన లేదని తెలిపింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలని.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. పహాణీలను డిజిటలైజ్ చేయాలని, గ్రామానికో రెవెన్యూ నిర్వాహకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అయితే, తమ సిఫారసులన్నీ ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కాదని.. అందుకే మూడు విభాగాల్లో ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. అందులో కొన్ని తక్షణమే చేపట్టాల్సి ఉండగా, మరికొన్ని స్వల్పకాలిక, ఇంకొన్ని దీర్ఘకాలిక వ్యూహాలు, ప్రణాళికలతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదికలో ధరణి కమిటీ స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలోని ముఖ్య సిఫారసులివీ.. గ్రామస్థాయిలోనే ల్యాండ్ గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలి. కమ్యూనిటీ పారాలీగల్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్లు, ఐటీడీఏలు, సీసీఎల్ఏలో లీగల్ సెల్స్ ఏర్పాటు చేయాలి. ఆర్వోఆర్ కొత్త చట్టం తీసుకురావాలి. సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ నివాస ప్రాంతాల (ఆబాదీ)ను సర్వే చేయాలి. – రాష్ట్రంలోని అన్ని భూములను రీసర్వే చేసి శాశ్వత భూఆధార్ ఇవ్వాలి. టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలి. – అసైన్డ్ భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ మంజూరు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలి. సీలింగ్ భూములకు కూడా హక్కులివ్వాలి. – ఇనాం భూములకు ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) ఇవ్వాలి. ఆ ఓఆర్ఎసీ వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలి. – అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే చేపట్టాలి. అటవీ భూముల వివరాలను ధరణి పోర్టల్లో మరోమారు నమోదు చేయాలి. – భూదాన బోర్డును ఏర్పాటు చేయాలి. భూదాన భూముల వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలి. దేవాదాయ, వక్ఫ్ భూములను కూడా ధరణిలో పొందుపర్చాలి. – నిషేధిత భూముల జాబితా (22ఏ)ను సవరించాలి. అప్డేట్ చేయాలి. భూసేకరణ జరిగిన భూములను పట్టాదారు ఖాతాల నుంచి తొలగించాలి. – రాష్ట్రంలోని అన్ని భూచట్టాల స్థానంలో రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం) అమల్లోకి తేవాలి. నల్సార్ న్యాయ వర్సిటీలోని ల్యాండ్ రైట్స్ సెంటర్ను అభివృద్ధి చేయాలి. – భూసంస్కరణల విషయంలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉండేందుకు ‘ఇన్నోవేషన్స్ అండ్ లీగల్ సపోర్ట్ సెల్’ను ఏర్పాటు చేయాలి. – తహసీల్దార్ స్థాయిలో ల్యాండ్ సపోర్ట్ సెల్స్ ఏర్పాటు చేయాలి. గ్రామానికో భూమి నిర్వహణ అధికారిని నియమించాలి. – రెవెన్యూ సిబ్బంది సామర్థ్యాలు, పనితీరును మెరుగుపర్చేలా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం కోసం ల్యాండ్ అకాడమీని ఏర్పాటు చేయాలి. కొత్త ల్యాండ్ పాలసీ రూపొందించాలి. – కోనేరు రంగారావు, గిర్గ్లానీ కమిటీలతోపాటు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ’ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. ల్యాండ్ గవర్నెన్స్ అసెస్మెంట్ రిపోర్టు తయారు చేయాలి. – ధరణి పోర్టల్ను ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించాలి. గతంలో జరిగిన ధరణి లావాదేవీలపై థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలి. – ధరణి పోర్టల్లో ఉన్న అన్ని మాడ్యూళ్ల స్థానంలో ఒక్కటే మాడ్యూల్ ఉంచాలి. పార్ట్–బీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. సేత్వార్, ఖాస్రా, సెస్లా, పాత పహాణీలను డిజిటలైజ్ చేయాలి. -
‘పార్ట్–బీ’పై ప్రత్యేక సదస్సులు!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను చిన్నచిన్న కారణాలు, కోర్టు కేసులు, ఆధార్కార్డు రికార్డుల ఆధారంగా పార్ట్–బీలో పెట్టారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బీలో చేరిన ఈ భూములకు ఇప్పటివరకు మోక్షం కలగలేదు. తమ పట్టా భూములను అకారణంగా పార్ట్–బీలో చేర్చారని, ఆ కేటగిరీ నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ సదరు భూముల యజమానులు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అసలు ధరణి పోర్టల్లోని ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలో చాలామందికి తెలియదు, తెలిసి కొందరు దరఖాస్తు చేసుకున్నా, సమస్య పరిష్కారం కాక, కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో పార్ట్–బీ భూములు రెవెన్యూ వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఎకరాలు పార్ట్–బీలో ఉన్నాయని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలో సిఫారసు చేసింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ ఇచ్చిన ఈ నివేదికలో ప్రత్యేక కార్యాచరణను ప్రతిపాదించింది. ధరణి కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పార్ట్–బీ భూముల గురించి గణాంకాలతో సహా వివరించింది. ఏ కారణంతో ఎన్ని ఎకరాల భూమిని పార్ట్–బీలో చేర్చారో లెక్కలు వెల్లడించిన ధరణి కమిటీ ఎలాంటి కారణాలు లేకుండానే 5,07,091 ఎకరాల భూములను పార్ట్–బీలో పెట్టారని, ఈ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేసింది. కమిటీ చేసిన సిఫారసులివే » పార్ట్–బీ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధరణి పోర్టల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రతి మండలానికి 2–3 బృందాలు ఏర్పాటు చేయాలి. ళీ ఈ బృందాల్లో రెవెన్యూ సిబ్బందితో పాటు డీఆర్డీఏల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్లు, పారా లీగల్ కార్యకర్తలు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించి శిక్షణ ఇవ్వాలి. » అవసరమైనప్పుడు అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల అధికారులను కూడా చేర్చాలి. ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని వివరాలను పరిశీలించి నివేదికలు తయారు చేయాలి. ళీ ఈ నివేదికల ప్రకారం సర్వే నంబర్ లేదా ఖాతానంబర్ వారీగా రైతులకు నోటీసులివ్వాలి. సేత్వార్, ఖాస్రా పహాణీ, సెస్లా పహాణీ, పాత పహాణీలు, 1బీ రిజిస్టర్, ధరణి పోర్టల్లోని వివరాలను పరిశీలించాలి. ఆ భూములు అసైన్డ్, ఇనాం, భూ బదలాయింపు నిషేధ పట్టిక, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, అటవీ భూముల జాబితాలో ఉన్నాయో లేవో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ళీ గ్రామాల వారీగా పార్ట్–బీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి, అక్కడే తుది నిర్ణయం తీసుకోవాలి. -
ప్రజావాణిలో పెట్రోల్ సీసాల కలకలం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్)/ మంచిర్యాల అగ్రికల్చర్/ పెద్దకొడప్గల్ (జుక్కల్): భూ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ సోమవారం మహబూబ్నగర్, మంచిర్యాల, కలెక్టరేట్లకు కొందరు పెట్రోల్ సీసాలతో రావడం సంచలనం రేపింది. పెద్దకొడప్గల్ తహసీల్ కార్యాలయంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకున్న ఎకరం భూమి తనకు కాకుండా చేస్తున్నారంటూ మనస్తాపంతో ఓ రైతు మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హన్వాడ మండలం హనుమాన్ టెంపుల్ తండాకు చెందిన కేతావత్ రాములు సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై చల్లుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ఏఎస్, పోలీసులు ఆయన చేతిలో ఉన్న సీసాను లాక్కున్నారు. రైతు మాట్లాడుతూ తన తండ్రి రేఖ్యానాయక్ పేరుతో సర్వే నం.108లో లావణి పట్టా ఎకరం వ్యవసాయ భూమి ఉందని, అయితే ఇటీవల తన చిన్నాన్న కుమారులు రమేశ్, లచ్యానాయక్, రవి, గోపాల్ తనతో గొడవ పెట్టుకుంటూ పొలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సైతం తనపై దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కలెక్టర్ స్పందించి తన భూమి ఇప్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ విజయేందిరకు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. మరోఘటనలో... కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన శీలం బానక్క, శీలం పోశయ్య, శీలం సత్తయ్య ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్కు వచ్చారు. టేకులపల్లి గ్రామ శివారులో తమకు ఉన్న భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్కు అర్జీ సమర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో కాసేపు కూర్చున్న వాళ్లు.. తర్వాత పెట్రోల్ బాటిల్ తీసేందుకు యత్నించారు.గమనించిన కలెక్టర్ గన్మెన్ పెట్రోల్ బాటిల్ లాక్కున్నాడు. ఈ సందర్భంగా బానక్క, పోశయ్య, సత్తయ్య మాట్లాడుతూ బానక్క పేరుమీద ఉన్న 12 ఎకరాల భూమి నలుగురు అన్నదమ్ములకు చెందాల్సి ఉండగా భూమిని శీలం కిష్టయ్య కొడుకు శీలం శ్రీనివాస్ పింఛన్ ఇప్పిస్తానని నమ్మబలికి కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నాడని వివరించారు. ఈ విషయమై కలెక్టర్కు, ఆర్డీవోకు పలుమార్లు ఫిర్యాదు చేశామని, పట్టా రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. మా చావుతోనైనా అక్రమ పట్టాదారుపై చర్యలు తీసుకుంటారని పెట్రోల్ బాటిల్తో వచ్చామని పేర్కొన్నారు. వారిని నస్పూర్ పోలీస్స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. లంచం ఇచ్చినా పనికాలేదంటూ... కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ తహసీల్ కార్యాలయంలో ప్రజావాణికి వచ్చిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన గైని అంజయ్య, అన్నదమ్ముల పేరిట గ్రామ శివారులో మూడెకరాల 14 గుంటల భూమి ఉంది. ఈ భూమిని తమ పేరిట రిజి్రస్టేషన్ చేయాలని కోరుతూ ఆర్ఐ పండరి వద్దకు ఆరు నెలల క్రితం వెళ్లారు. ఈ భూమి పార్ట్ ‘బి’లో ఉందని, రూ. 20 వేలు ఇస్తే పార్ట్ ‘బి’నుంచి తొలగించి పట్టా చేసి పాస్ బుక్ ఇస్తానని పండరి చెప్పినట్లు బాధితులు తెలిపారు. ఆర్ఐకి ఫిబ్రవరిలో రూ. 19 వేల నగదు, రూ. 1000 ఫోన్ పే ఇతరుల ఫోన్కు చెల్లించామన్నారు. అయితే ఆరు నెలల నుంచి తిరుగుతున్నా పనికాకపోవడంతో విసుగు చెందిన అంజయ్య తహసీల్దార్ చాంబర్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండగా తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర మండల అధికారుల సమక్షంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్నవారు రైతును చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై తహసీల్దార్ దశరథ్ను సంప్రదించగా అంజయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని, ఆర్ఐ పండరి డబ్బులు తీసుకున్న విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. -
15 నుంచి రెవెన్యూ సదస్సులు
సాక్షి, అమరావతి: భూములకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. 15న అన్ని జిల్లాలో ప్రారంభించి 16–30 వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదివారం మెమో ఇచ్చారు. గ్రామ స్థాయిలో భూముల సమస్యలు పరిష్కారానికి ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని అందులో అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. భూకబ్జాలు, 22ఏ జాబితా దురి్వనియోగంతో పాటు అన్ని భూ సంబంధిత విషయాలపై అర్జీలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి జిల్లాల వారీగా సదస్సుల షెడ్యూల్ రూపొందిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వినతులు స్వీకరించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రత్యేక అధికారి సమీక్షిస్తారని, వచి్చన అన్ని పిటిషన్లను.. వినతుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.జేసీలు సదస్సులకు కో–ఆర్డినేటర్లుగా ఉంటారని, సబ్ కలెక్టర్లు/ఆర్డీవోలు, తహశీల్దార్లు తమ పరిధిలోని ప్రతి గ్రామంలో సదస్సు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలన్నారు. ప్రతి సదస్సుకి తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వో, మండల సర్వేయర్ ఇతర అన్ని శాఖలకు చెందిన వారు వెళ్లాలని, జిల్లా కలెక్టర్ జిల్లా నుంచి మండల నోడల్ అధికారులను నియమించాలని సూచించారు. సెపె్టంబర్ నెలాఖరుకి సదస్సులన్నీ పూర్తి కావాలని, ఆ తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారాల ఆదేశాలను 45 రోజుల్లో ఇవ్వాలని సూచించారు. -
భూ కబ్జాకు రైతు బలి
ఖమ్మం రూరల్: భూమి కబ్జా చేశారనే ఆవేదన కు తోడు పోలీసులు సైతం కబ్జాదారులకే కొ మ్ము కాస్తున్నారనే ఆక్రందనతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి(50)కి అర ఎకరం, ఆయన సోదరుడు భూపాల్రెడ్డికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో 25 గుంటలకు సంబంధించి వివాదం నెలకొనగా.. అదే గ్రామానికి చెందిన జాటోతు వీరన్న ఆక్రమించాడని వెంకటరెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ వెంకటరెడ్డి ఈనెల 4న పురుగు మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవా రుజామున మృతి చెందాడు. సెల్ఫీ వీడియోలో ఏముందంటే... వెంకటరెడ్డి ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు. ‘మా భూమి ఆక్రమించుకుని జాటోతు వీరన్న సాగు చేస్తుండగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పోలీసులు ఆయన వద్ద లంచం తీసుకుని మమ్మల్నే ఇబ్బందిపెడుతున్నారు. మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి ప్రోద్బలంతో జాటోతు వీరన్నతోపాటు సురేష్, దేవిక, చిన్ని, ఉపేందర్ మమ్మల్ని వేధిస్తున్నారు. వారం క్రితం ప్రైవేట్ కేసు వేయించినా మాకు న్యాయం జరగ లేదు’అని వీడియోలో వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇదే భూవివాదంలో వెంకటరెడ్డి సోదరుడు ఏలేటి భూపాల్రెడ్డి కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. కాగా, వెంకటరెడ్డి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు జాటోతు వీరన్న, మాజీ ఎంపీటీసీ కళింగరెడ్డి, సురే‹Ù, దేవిక, చిన్ని, ఉపేందర్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రామారావు తెలిపారు. -
ధరణికి ‘యాచారం’ దారి!
మేకల కల్యాణ్ చక్రవర్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మంథన్ గౌరెల్లి గ్రామానికి చెందిన రమావత్ జగ్నాకు మూడెకరాల 26 గుంటల భూమి ఉంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత వచ్చిన కొత్త పాస్బుక్లో రెండెకరాల 29 గుంటల విస్తీర్ణమే నమోదైంది. అంటే నికరంగా 37 గుంటలు తగ్గింది. కరెంటోతు జకాలి అనే మహిళకు ఎకరం 23 గుంటల భూమి ఉంటే.. కొత్త పాస్బుక్లో 20 గుంటలే నమోదైంది. ఇదే గ్రామానికి చెందిన నేనావత్ రాముకు చెందిన రెండెకరాల 3 గుంటల పొలాన్ని వివాదాస్పద భూమి అంటూ పార్ట్–బీలో పెట్టారు. కొత్త పాస్బుక్ ఇవ్వలేదు. ఇక గనమోని మల్లయ్యకు ఉన్న రెండెకరాల 14 గుంటల పట్టా భూమికి ఎమ్మార్వో ప్రొసీడింగ్స్ నంబర్ కూడా ఇచ్చారు. కానీ కొత్త పాస్బుక్ రాలేదు...‘లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ (లీఫ్స్)’ స్వచ్ఛంద సంస్థ మంథన్ గౌరెల్లి గ్రామంలో నిర్వహించిన భూన్యాయ శిబిరానికి వచ్చిన రైతుల్లో ఓ నలుగురి సమస్యలివి. వారు తమ భూములకు సంబంధించిన ఆధారాలతో సహా వచ్చి మరీ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నలుగురనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది రైతులు ధరణి పోర్టల్తో తిప్పలు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ఎప్పుడూ లక్షన్నర నుంచి 2 లక్షల వరకు దరఖాస్తులు ధరణి పోర్టల్లో పెండింగ్లో కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా డ్రైవ్లు చేపట్టినా, అధికార వికేంద్రీకరణ జరిగినా ఈ దరఖాస్తులకు సంతృప్తస్థాయిలో పరిష్కారం లభించే అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ‘లీఫ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూన్యాయ శిబిరాలు.. ధరణి సమస్యల గుర్తింపు, పరిష్కారానికి మార్గం చూపిస్తున్నాయి. సమస్యలెలా తెలుసుకున్నారంటే..? ఆయా గ్రామాల్లో భూన్యాయ శిబిరం ఏర్పాటుకు ముందే ప్రజలకు చాటింపు వేయించారు. శిబిరానికి వచ్చి భూసంబంధిత సమస్యలపై దరఖాస్తులు ఇవ్వా లని సూచించారు. శిబిరం జరిగిన రోజు న ‘భూమి సమస్యల వివరాలు’ పేరిట ప్రత్యేక ఫార్మాట్లో రూపొందించిన దరఖాస్తుల ద్వారా వివరాలు తీసుకున్నారు. భూయజమాని వ్యక్తిగత వివరాలు, భూమి ఖాతా నంబర్, పాసుపుస్తకం ఉందా లేదా? సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్, విస్తీర్ణం, భూమి స్వభావం, భూమి సంక్రమించిన విధానం, ఏ విధమైన భూసమస్య ఉందనే వివరాలు అందులో ఉన్నాయి. ప్రతి సమస్యకు ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్ ప్రకారం దరఖాస్తులను పూర్తి చేయించి.. సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్లు తీసుకుని ఫైల్ చేశారు. రెండో దశలో.. ఆ దరఖాస్తులను పరిశీలించి, ఏ సమస్యలు ఎన్ని వచ్చాయి? పరిష్కారానికి అవసరమైన ఇతర డాక్యుమెంట్లు ఏవి అనే స్పష్టతకు వచ్చారు. ఈ వివరాలను రైతులకు చెప్పి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 14న యాచారం మండలంలోని మంథన్ గౌరెల్లి గ్రామంలో ప్రారంభమైన భూన్యాయ శిబిరాలు.. ఈ నెల 8న అదే గ్రామంలో ముగిశాయి. మొత్తం 10 గ్రామాల్లో కలిపి 2,200 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువగా ఏ సమస్యలు వచ్చాయంటే! భూన్యాయ శిబిరాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి చూస్తే.. యాచారం మండలంలోని 10 గ్రామాల్లో ఎక్కువగా అసైన్డ్ భూముల సమస్యలు ఉన్నాయి. అసైన్డ్ భూములు మ్యుటేషన్ కావడం లేదని, కొత్త పాస్పుస్తకాలు రాలేదని, వచ్చిన పుస్తకాల్లో విస్తీర్ణం తగ్గిందని దరఖాస్తులు వచ్చాయి. తర్వాత అత్యధికంగా నిషేధిత జాబితాలో పట్టా భూములను చేర్చిన సమస్య కనిపించింది. ఇక సర్వే నంబర్లు మిస్సింగ్, సేత్వార్ సరిపోలకపోవడం వంటివాటితోపాటు పార్ట్–బీ కింద (కొత్త పాస్పుస్తకాలు రాని పట్టా భూములు) సమస్యల దరఖాస్తులు వచ్చాయి. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా పార్ట్–బీలో చేర్చిన 18 లక్షల ఎకరాల భూముల్లో.. సుమారు 5 లక్షల ఎకరాలను ఎందుకు చేర్చారో కూడా తెలియదని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారు. ఆధార్ నంబర్ ఇవ్వలేదని 4 లక్షల ఎకరాలను ఈ జాబితాలో చర్చగా.. మొత్తంగా ఆధార్ సంబంధిత అంశాల ప్రాతిపదికన 6 లక్షల ఎకరాల విషయంలో ఇబ్బందులు వచ్చాయి. తర్వాతి దశలో ఏం చేస్తారు? ‘లీఫ్స్’ సంస్థ ఆధ్వర్యంలో రెండు దశల్లో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయిన నేపథ్యంలో.. మిగతా పని అంతా రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంటుంది. అధికారులు గ్రామాల వారీగా భూరికార్డులను (సేత్వార్, పహాణీ, 1–బీ, ఇతర రికార్డులు) పరిశీలించి ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ రిపోర్టు తయారు చేయాలి. తహసీల్దార్ స్థాయిలో జరిగే ఈ మూడో దశ పూర్తయ్యాక.. చివరిగా నాలుగో దశలో సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుందని లీఫ్స్ ప్రతినిధి ఎం.సునీల్కుమార్ వెల్లడించారు. ఈ పద్ధతిని రాష్ట్రమంతటా అమలు చేయడం ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రికి నివేదిక! ఈ యాచారం పైలట్ ప్రాజెక్టు అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాచారం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా యాచారం మండలంలో జరిగిన భూన్యాయ శిబిరాల వివరాలను తెలుసుకున్నారని తెలిసింది. లీఫ్స్ సంస్థ ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను త్వరలోనే రెవెన్యూ మంత్రికి అందజేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏం చేయాలి? వాస్తవానికి, రాష్ట్రంలోని వ్యవసాయ భూసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్కు గత నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 16 లక్షలు. అందులో 8లక్షలకు పైగా దరఖాస్తులను రెవెన్యూ వర్గాలు తిరస్కరించి ఉంటాయని అంచనా. ఇప్పుడు యాచారం మండలంలోని 10 గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సగటున 200 భూసమస్యలు ఉన్నాయని.. 11 వేల రెవెన్యూ గ్రామాల్లో కలిపి 22 లక్షల సమస్యలు ఉంటాయని అంచనా వేశారు. ఇప్పుడీ సమస్యలన్నింటినీ ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించడం ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. పరిష్కరించడమంటే దరఖాస్తులను తిరస్కరించడం కాదని.. కచ్చితమైన రికార్డు, వివరణలతో తగిన పరిష్కారం చూపాలని రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించినప్పుడు భూసమస్యలపై 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. అందులో 8లక్షలు పరిష్కారం అయ్యాయని చెప్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లినప్పుడే భూసమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని.. ఇందుకు యాచారం మండలంలో చేపట్టిన అధ్యయనం దోహదపడుతుందని అంటున్నారు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వాలు చేసిందేమిటి? భూసమస్యల పరిష్కారం కోసం గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 2006లో ఉమ్మడి రాష్ట్రంలోని వ్యవసాయ భూముల పాస్బుక్లకు యూనిక్ కోడ్ ఇచ్చారు. ఇందుకోసం ఏడాది వరకు సమయం పట్టింది. 2007–2011 మధ్య మండలానికి మూడు గ్రామాల చొప్పున దత్తత తీసుకుని... పారాలీగల్ కార్యకర్తల ద్వారా ప్రతి గ్రామంలో 15 రోజుల పాటు భూసమస్యల గుర్తింపు, పరిష్కరం ప్రక్రియ చేపట్టారు. 2009–10లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న భూముల పరిశీలన జరిగింది. అప్పుడే 5 లక్షల వరకు భూసమస్యలు ఉన్నట్టు గుర్తించారు. 2011–12 మధ్య రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ సదస్సుల్లో మొత్తం 21 లక్షల దరఖాస్తులురాగా.. 8 లక్షల సమస్యలను పరిష్కరించారు. ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక 2017 డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన జరిగింది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం పేరుతో కొత్త పాస్పుస్తకాలు ఇచ్చారు. అనంతరం ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పోర్టల్ ద్వారానే భూసమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం జరుగుతోంది. -
రూటు మారినా.. జర్నీ అదే!
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కార రూటు మారింది. గతంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ఏ దరఖాస్తు వచ్చినా, ఆ దరఖాస్తు కేవలం కలెక్టర్ లాగిన్లో మాత్రమే కనిపించేది. కలెక్టర్ వేలిముద్రతో తన లాగిన్ను ఓపెన్ చేసి సదరు దరఖాస్తును కిందిస్థాయికి పంపాల్సి వచ్చేది. కానీ తాజాగా ధరణి పోర్టల్లో ఓ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ధరణి కింద ఏ దరఖాస్తు వచ్చినా అది తహసీల్దార్కు కనిపించేలా, తహసీల్దార్ ఆ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం కోసం పైఅధికారులకు పంపేలా లాగిన్ లభించింది. ప్రయోజనం లేదంటున్న తహసీల్దార్లు దరఖాస్తు పరిష్కారం చేసే రూటు మారింది కానీ ఆ పరిష్కారం కోసం సదరు దరఖాస్తు చేయాల్సిన ప్రయాణం (జర్నీ) మాత్రం మారలేదని, అలాంటప్పుడు రూటు మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. ⇒ ప్రస్తుతమున్న విధానంలో ధరణి దరఖాస్తులను తహసీల్దార్ ఓపెన్ చేసినా..ఆన్లైన్, ఆఫ్లైన్ రికార్డులను ఆర్డీఓ, జేసీ,కలెక్టర్లకు నాలుగు స్థాయిల్లో పంపాలని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఆన్లైన్లో, ప్రింట్లు తీసి ఆఫ్లైన్లో పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. ⇒ఇలా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే రిమార్క్స్ పంపితే సరిపోతుందని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లతో కూడిన ఆఫ్లైన్ రికార్డును నిక్షిప్తం చేసి సదరు దరఖాస్తులకు పరిష్కారం చూపెడితే బాగుంటుందని వారంటున్నారు. ⇒నాలుగుసార్లు ఆన్లైన్లో, నాలుగుసార్లు ఆఫ్లైన్లో దరఖాస్తు చక్కర్లు కొట్టిన తర్వాత పరిష్కారానికి ప్రత్యేక ఫైల్పెట్టి మళ్లీ ఆన్లైన్లో పరిష్కరించాల్సి వస్తుందని, ఈ పద్ధతిలో మార్పు తీసుకురావడంపై ఉన్నతస్థాయిలో సమీక్ష జరగాల్సి ఉందని వారంటున్నారు. ⇒ ఆ మార్పు జరిగినప్పుడే ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. మూడు వారికి... రెండు వీరికి.. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్లు, ఆర్డీఓలకు ప్రస్తుతం చాలా తక్కువ అధికారాలున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ), గ్రీవెన్స్ ల్యాండ్మ్యాటర్స్ (కులం, ఆధార్కార్డుల్లో తప్పులు నమోదు, పేర్లలో అక్షర దోషాలు సవరించడం) లాంటి అధికారాలు తహసీల్దార్లకు ఉండగా, కోర్టు కేసుల సమాచారం, పాస్బుక్ లేకుండా నాలా, సంస్థాగత పాస్బుక్కులిచ్చే అధికారాలు మాత్రం ఆర్డీఓలకు ఉన్నాయి.ఈ అధికారాలు మినహా అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు ఇప్పటికీ కలెక్టర్లకు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వికేంద్రీకరణ వీలున్నంత త్వరగా జరగాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాగలిగిన దరఖాస్తులను అక్కడే పరిష్కరించే అధికారాలు సదరు సిబ్బందికి కలి్పంచినప్పుడే ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. నేడు వీడియో కాన్ఫరెన్స్లు ధరణి దరఖాస్తుల పురోగతిపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్మిత్తల్ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి నిర్వహించనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, మహబూబ్నగర్, మంచిర్యాల, వికారాబాద్, వనపర్తి, వరంగల్, ములుగు, నిర్మల్ జిల్లాలు, 12 నుంచి ఒంటి గంట వరకు మిగిలిన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎంఆర్ఓ పీడీ వి. లచి్చరెడ్డి విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు. -
కొత్త చట్టమే..! భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కారు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతమున్న ఆర్వోఆర్ చట్టం ఉపయోగ పడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–2020) చట్టాన్ని పూర్తిగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురానుంది. అనేక అంశాల్లో స్పష్టతనిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. ముసాయిదా చట్టం సిద్ధమవుతోందని, వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఆమోదం తెలిపే బిల్లును తీసుకువస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. కొత్త చట్టమే ఉత్తమం! గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ను అమల్లోకి తెస్తున్న సందర్భంగా, ఇంతకుముందున్న చట్టం స్థానంలో ఆర్వోఆర్–2020 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన ప్రత్యేక కమిటీ ఈ చట్టాన్ని అధ్యయనం చేసింది. ఈ చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని, చాలా అంశాలపై ఇది స్పష్టత ఇవ్వడం లేదని, దీని ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయని కమిటీలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. పాత చట్టంలో చేయాల్సిన సవరణల గురించి పలు సిఫారసులు చేశారు. లేనిపక్షంలో పూర్తిగా కొత్త చట్టాన్నైనా తీసుకురావాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే లోపభూయిష్టమైన పాత చట్టానికి మార్పులు చేయడం కన్నా తమ ముద్ర ఉండే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడమే సమంజసమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచి్చనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత చట్టంలోని కొన్ని అంశాలను తీసుకుంటూనే, అవసరమైన కీలక సవరణలు చేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–2024) చట్టాన్ని రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. ముసాయిదా చట్టంపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత రాష్ట్ర కేబినెట్లో ఆమోదించి, ఆ తర్వాత జూలైలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం పొందేలా ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కీలకాంశాల్లో మార్పులతో.. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టంలోని కీలకాంశాల్లో మార్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా భూసమస్యల పరిష్కారం కోసం పలు స్థాయిల్లోని అధికారులకు ఉండే అధికారాల వికేంద్రీకరణపై కొత్త చట్టంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వాలి, ఆయా స్థాయిల్లోని అధికారులు ఎలాంటి నిర్ణయాలకు బాధ్యత వహిస్తారనే అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పార్ట్–బీలో పెట్టిన 18 లక్షల ఎకరాలు, సాదాబైనామాల కింద లావాదేవీలు జరిగి పాస్ పుస్తకాలు రాని 9 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం చూపించే దిశలో చట్టం రూపొందుతోందని తెలుస్తోంది. అసైన్డ్, భూదాన్ కంగాళీకీ చెక్!అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములకు సంబంధించిన కంగాళీ కూడా లేకుండా అన్ని సమస్యలకు పరిష్కారం చూపే విధంగా పాత చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తయారుచేస్తున్నారని, రెవెన్యూ ట్రిబ్యునళ్ల పునరుద్ధరణ లాంటి కీలక అంశాలు కొత్త చట్టంలో ఉంటాయని తెలుస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను జాయింట్ సబ్ రిజి్రస్టార్ హోదాలో తహసీల్దార్లకే ఉంచాలా లేక డిప్యూటీ తహసీల్దార్లకు అప్పజెప్పాలా అన్న దానిపై కూడా కొత్త చట్టంలో స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది. -
సింహాచలం భూ సమస్యలపై ప్రజలకు అవంతి హామీ
-
భూసమస్యలన్నీ పరిష్కారమయ్యేలా...
దాదాపు వందేళ్ళ క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ సర్వేలో భూమిని అనుభవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించారు. అయితే రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు.ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని (భూ యాజ మాన్య హక్కు చట్టం) తెచ్చింది. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఎదురవుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూకమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భారతీయుల్లో భూమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంస్కృతులు భూ యాజమాన్యానికి అనుకూలంగా ఉండడం వల్ల అందరూ దాన్ని కోరుకుంటారు. దేశంలోని గ్రామీణ కుటుంబాల మొత్తం ఆస్తిలో భూమి 73 శాతం ఉండగా, పట్టణ గృహాల ఆస్తిలో భూమి, భవనాలు 90 శాతం ఉన్నట్లు 2013 ఎన్ఎస్ఎస్ఓ నివేదికలో తేలింది. అందుకే పెట్టుబడిదారులు, రుణదాతలు, బ్యాంకర్లు స్పష్టమైన టైటిల్, స్పష్టమైన ల్యాండ్ మ్యాపింగ్, రికార్డుల నిర్వహణ, స్పష్టమైన హక్కులు ఉండాలని కోరుకుంటారు. కానీ మెకెన్సీ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో దేశంలోని ఎక్కువ భూముల యాజమాన్యానికి సంబంధించి చట్టపరమైన వివాదాలున్నాయని తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా భూముల వివాదాలు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. కానీ మన దేశంలో దాదాపు 70 శాతం సివిల్ వివాదాలున్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ప్రాథమికంగా బ్రిటిష్ ప్రభుత్వం 100 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వే ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. అవన్నీ ప్రభుత్వానికి భూముల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో రూపొందించినవి. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సాగు చేసేవారికి సురక్షితమైన హక్కులు ఉండేలా ప్రోత్సహించడానికి అనేక భూ సంస్కరణలు ప్రవేశపెట్టాయి. ‘ఎస్టేట్లు – ఇనామ్ నిర్మూలన చట్టం’, ‘వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం’, ‘పీఓటీ’ చట్టం, ‘ఆర్ఓఎఫ్ఆర్’ వంటి చట్టా లను వరుసగా వచ్చిన ప్రభుత్వాలు సాగుదారులకు అనుకూలంగా తీసుకువచ్చాయి. భూముల యాజమాన్యంలో జరిగిన ఈ మార్పు లన్నీ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కినా... కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల క్రమం తప్పకుండా నవీకరణ (అప్డేట్) అవలేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలో భూమిని అను భవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించినా... రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థి తులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు. ఈ సమస్య లను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అలాగే ఆ చట్టాన్ని సవరించడం ద్వారా గ్రామాల వారీగా ప్రతి వ్యక్తి అధీనంలో ఉన్న భూమి వివరాలను రికార్డుల్లో అప్డేట్ చేసింది. ఇలా హక్కుల రికార్డును ప్రవేశపెట్టిన తర్వాత కూడా భూ వివాదాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ఊహాజనిత హక్కును మాత్రమే కల్పిస్తాయి. కొన్ని కేసుల్లో రికార్డులు క్షేత్ర స్థాయి పరిస్థితికి విభిన్నంగా ఉంటాయి. కోర్టు కేసులు, వారసత్వాలు, తనఖా వంటి భూమికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించే ఎలాంటి ఒకే ఒక్క మూలాధారం ప్రస్తుత రికార్డుల్లో లేదు. దీనివల్ల భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తాన్ని డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూ కమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భూ యాజమాన్యంపై ఉన్న గందరగోళాన్ని తొలగించేలా రీ సర్వేలో ప్రతి భూభాగానికి జియో రిఫెరెన్స్ ఇస్తున్నారు. భూమి, దానికి సంబంధించిన రికార్డులను అనేక శాఖలు (రెవెన్యూ, పంచాయితీ రాజ్, పట్టణ స్థానిక సంస్థలు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రిజిస్ట్రేషన్ శాఖలు) నిర్వహిస్తుండడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. అలాగే పౌరులు వాటికి సంబంధించిన అనుమతులు, సేవలు పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకంటే? భూమి యాజమాన్యం సార్వభౌమాధికారంతో ఉంటుందని దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం. అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా నిశ్చయాత్మకమైన టైటిల్ విధా నానికి (కన్క్లూజివ్ టైటిల్ విధానం) మన దేశం వెళ్లలేదు. ఇప్పుడు ఉన్న ల్యాండ్ టైటిల్ విధానం... యాజమాన్యాన్ని ధ్రువీకరించే నిశ్చ యాత్మక టైటిల్కు విరుద్ధంగా ‘అనుకూల టైటిల్ కాన్సెప్ట్’ (ప్రిజెమ్టివ్ టైటిల్) ఆధారంగా రూపొందించబడింది. అంటే భూమి అధీనంలో ఉన్న వ్యక్తి సదరు భూమికి సంబంధించి రెవెన్యూ శాఖకు పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా భావించబడే అర్థంలో ఇచ్చిన టైటిల్ మాత్రమే. అది కూడా ‘1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్’ ప్రకారం చట్టపరమైన స్వాధీనమే. భూమిపై లావాదేవీ జరిగినప్పుడు కూడా టైటిల్ వెరిఫి కేషన్ అవసరం లేని వ్యవస్థ కారణంగా భూమి టైటిల్ విధానం పేల వంగా ఉంది. ‘1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ కూడా పత్రాల నమోదుకు సంబంధించిన చట్టమే తప్ప భూమి లేదా టైటిల్ రిజి స్ట్రేషన్కి సంబంధించినది కాదు. 1982 ఆస్తి బదిలీ చట్టానికి యాజ మాన్యం యొక్క ధ్రువీకరణ అవసరం లేదు. భూమి లావాదేవీల విషయంలో ఆదాయాన్ని పెంచడానికి మాత్రమే ఈ చట్టాలు పరిమి తమయ్యాయి. ఆ భూముల యాజమాన్యానికి సంబంధించి ఏదైనా ప్రశ్న తలెత్తితే, అది తనదేనని నిరూపించుకోవాల్సి బాధ్యత యజమా నిపైనే ఉంటుంది. తక్షణ సంస్కరణలు అవసరం ఈ నేపథ్యంలో భూ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు ఎలా ముందుకు వెళ్లాలో సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ను నియమించింది. ఈ ‘టైటిల్ సర్టిఫికేషన్ టాస్క్ఫోర్స్’ ఒక సమగ్రమైన భూమి టైటిల్ వ్యవస్థను దేశంలో వీలైనంత త్వరగా తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించింది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2011లో ఒక ముసాయిదా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తీసు కువచ్చింది. నిశ్చయాత్మకమైన ఆస్తి హక్కుల (కన్క్లూజివ్ ప్రాపర్టీ టైటిల్స్) వ్యవస్థను ఏర్పాటు చేయడం, పాలన, నిర్వహించడం దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ‘టోరెన్స్’ వ్యవస్థ ఆధారంగా దీన్ని రూపొందించారు. టోరెన్స్ వ్యవస్థ 3 సూత్రాలతో ఉంటుంది. 1. మిర్రర్ సూత్రం. ఇది టైటిల్ రిజిస్ట్రేషన్ను సూచిస్తుంది. క్షేత్ర స్థాయి వాస్తవికత (గ్రౌండ్ రియాలిటీ)ను కచ్చితంగా ప్రతిబింబిస్తుంది. 2. కర్టెన్ సూత్రం. ఇది గతానికి అడ్డుగా ఒక తెర ఉన్నన్నట్లు సూచిస్తుంది. టైటిల్ను రిజిస్టర్లో టైటిల్ నమోదు కావడమే ప్రస్తుత టైటిల్ నిశ్చయాత్మక రుజువు అనీ, గతాన్ని పరిశోధించాల్సిన అవ సరం లేదనీ చెబుతోంది. 3. హామీ సూత్రం. ఇది టైటిల్ను రిజిస్టర్ చేసే క్రమంలోనూ, భూ యజమానులకు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలలోనూ దొర్లే తప్పు లకు నష్టపరిహారానికి ప్రభుత్వ సంస్థల హామీని ఇస్తుంది. ఇది కోర్టుల్లో కూడా చెల్లుబాటయ్యే పూర్తి అజేయమైన యాజమాన్య ధ్రువీకరణ పత్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ శాసనసభ 2019లో ‘ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టా’న్ని ఆమోదించి దాన్ని భారత రాష్ట్రపతి అంగీకారం కోసం పంపింది. దాన్ని అందుకున్న కేంద్రం భూమి వ్యవహారాలు పర్యవేక్షించే కేంద్ర ఎల్ఓఆర్, ఐటీ, న్యాయ తదితర శాఖల పరిశీలనకు పంపింది. ఆ యా శాఖలు కొంత సమయం తీసుకుని ఈ చట్టంపై అభిప్రా యాలు, వ్యాఖ్యలు పంపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకనుగుణంగా టైట్లింగ్ బిల్లుకు పలు సవరణలు చేసి శాసనసభకు పంపింది. దీనిని 2023లో సభ ఆమోదించింది. ఆ బిల్లును మళ్లీ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా ఇటీవలే దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నోటిఫై చేసి అమలు చేయడానికి కావల్సిన నియమాలు, మార్గదర్శకాలను రూపొందిస్తోంది. కానీ చర్చించకుండా హడావిడిగా చట్టం తెచ్చారని కొందరు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. రెండు సార్లు పూర్తిగా చర్చించి సంతృప్తి చెందిన తర్వాతే అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. మన దేశంలో చట్టాలు ఇదే విధానంలో రూపుదిద్దు కుంటాయి తప్ప వేరే విధానంలో కాదు. ప్రజాస్వామ్యంలో చట్ట సభలు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. రాజ్యాంగ సవరణలు కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లవు. దీన్ని సమగ్రంగా పరిశీ లించడానికి, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పలు దఫాలుగా పంపిన వివరణలు చూసి ఆమోదించడానికి కేంద ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టింది. భూముల వ్యవహారంలో రెవెన్యూ శాఖ సమర్థతను ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు పత్రికలకు ఎక్కడం కూడా దురదృష్టకరం. బహుశా ఈ దేశంలో భూ యాజమాన్య వ్యవస్థల పరిణామం గురించి వారికి తెలియకపోవచ్చు. బ్రిటిష్వారు మొదటిసారిగా రైత్వారీ సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, రెవెన్యూ సిబ్బంది అయిన సెటిల్మెంట్ అధికారులే భూమిని అనుభవిస్తున్న ప్రజలకు హక్కులు ఇచ్చారు తప్ప వేరే వారు కాదు. ఆర్ఓఆర్, ఎస్టేట్ల రద్దు, ఇనాం రద్దు, ల్యాండ్ సీలింగ్ వంటి భూమికి సంబంధించిన ప్రతి చట్టంలోనూ హక్కుదారులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే అధికారం రెవెన్యూ అధికారులకే ఉంది. భూ సమస్యలను పరిష్కరించడంలో, పట్టా హక్కులు లేదా యాజమాన్య హక్కులు ఇవ్వడంలో రెవెన్యూ సిబ్బందికి మించిన జ్ఞానం ఎవరికీ ఉండదు. రెవెన్యూ సిబ్బందికి భూ చట్టాలు/సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం లేదని చెప్పడం సరికాదు. అదే సందర్భంలో ఏ సీనియారిటీ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమిస్తారనే విషయం రాష్ట్ర ప్రభు త్వానికే వదిలేయాలి. అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఖరారు చేస్తుంది. చట్టం ప్రకారం అప్పీలేట్ అధికారులుగా సర్వీసులో ఉన్న లేదా రిటైర్ అయిన జాయింట్ కలెక్టర్ స్థాయి కంటే తక్కువ కాకుండా ఉన్న వారే నియమితులవుతారు. అప్పీలేట్ అధికారులుగా ఎవరిని నియ మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయించలేదు. ఈ దశలో ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకోవడం సరికాదు. టైటిల్ రిజిస్టర్లో నమోదైన ఎంట్రీలపై అప్పీల్ చేసుకునేందుకు రెండేళ్ల సమయం ఎలా సరిపోతుందని కొందరు ప్రశ్నించారు. ఇది చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. మ్యుటేషన్ చట్టం, ఆర్ఓఆర్ వంటి ఏ ఇతర చట్టాల ప్రకారమైనా రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి చరిత్రలో ఎన్నడూ కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఇవ్వలేదు. రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఇస్తారు. కానీ ల్యాండ్ టైట్లింగ్ చట్టంలో రెండు సంవత్సరాల సమయం ఇచ్చారు. పైన చెప్పిన టోరెన్స్ వ్యవస్థ ప్రకారం పునఃసమీక్ష, పరిష్కారం తర్వాత, రికార్డింగ్ చేయబడుతుంది, ఇది తాత్కాలికంగా మాత్రమే పరిగణించబడుతుంది. ఈ ప్రక్రియలో పట్టాదారులకు నోటీసులు ఇవ్వబడతాయి. ఈ తాత్కా లికాన్ని సవాలు చేయడానికి ప్రజలకు 2 సంవత్సరాల సమయం ఇస్తారు. 2 సంవత్సరాలలోపు ఎటువంటి ఛాలెంజ్ లేకపోతే, తాత్కా లికమే ఫైనల్ అవుతుంది. ఈ విషయంలో పరిమితి చట్టంలోని నిబంధనలను కోట్ చేయడం అసంబద్ధం. అజేయ కల్లం వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు -
ఓపిక పట్టండి అన్నీ పరిష్కరిస్తాం
లక్డీకాపూల్: ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ప్రధానంగా ధరణి, భూ సమస్యలను పరిష్కరించాలంటూ ఎక్కువమంది రాగా, కొండ పోచమ్మ సాగర్ బాధితులు, టీఎస్పీఎస్సీ రద్దు చేయాలంటూ నిరుద్యోగులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు విన్నవించారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన వారితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మంత్రితో పాటు ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన ఉన్నారు. ఆటోవాలాలపై విధానపరమైన నిర్ణయం ప్రజావాణి అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అందరి సమస్యలనూ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, కాస్త ఓపిక పట్టాలని సూచించారు. మంగళవారం ప్రజా వాణి కార్యక్రమంలో 5,324 వినతి పత్రాలందాయని తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోవాలాలు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారికి కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇళ్లు, రేషన్, భూసమస్యల వంటివన్నీ ఆరు గ్యారంటీల అమలుతో పరిష్కారమవుతాయని మంత్రి అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాదీనం చేసుకోవాలి తెలంగాణలోని అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డిపాజిట్దారులకు తక్షణమే డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. బాలమల్లేష్ ప్రజావాణిలో కోరారు. మాజీ హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల మాజీ హోంగార్డుల ప్రతినిధులు ఇందిర, యూనస్ మహ్మద్ వ్రిజ్ఞప్తి చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికి న్యాయం జరగలేదన్నారు. ఇంకా పలు సమస్యలపై.. ప్రభుత్వ పాఠశాల్లోని స్వచ్ఛ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబ్నగర్ జిల్లా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నెమ్మది వెంకటేశ్వర్లు, ప్రమీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 28 వేల మంది కార్మికులకు నిధుల కొరత పేరిట గ్రా మ పంచాయతీలు వేతనాలు చెల్లించడం లేదన్నా రు. కాళేశ్వరం బాధితుల భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో బాధితులు పాదయాత్రగా ప్రజాభవన్కు వచ్చి కొండపోచమ్మ సాగర్ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. నిలిచిపోయిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలకు అనుమతించాలని స్పౌజ్ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి 10గంటల్లోపు వచ్చిన వారికి మాత్రమే శుక్రవారం నుంచి ఉదయం 10 గంటలలోపు వచ్చిన వారికే ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు ప్రజా భవన్ అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ప్రజాభవన్ వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. -
10 రోజుల్లో నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూసంబంధిత సమస్యలు, ధరణి పోర్టల్ అంశాలపై పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘ధరణి పోర్టల్ను ఎలా డిజైన్ చేశారు? భూ రికార్డులు అందులో ఎలా భద్రపరిచారు? సదరు డేటా ఎక్కడ ఉంది? పోర్టల్ నిర్వహిస్తున్న కంపెనీ కాంట్రాక్టు ఎప్పటివరకు ఉంది? ఆ కంపెనీ మళ్లీ ఎందుకు వేరే కంపెనీలకు లీజుకిచ్చింది? ఈ పోర్టల్ నిర్వహిస్తున్న, నిర్వహించిన కంపెనీలకు ఉన్న చట్టబద్ధత ఏంటి? ఒకవేళ పోర్టల్లోని రికార్డులు కరప్ట్ అయి వివరాలన్నీ పోతే రాష్ట్రంలోని భూములకు మాన్యువల్ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? ఈ పోర్టల్ ద్వారా వస్తున్న దరఖాస్తులు ఏడాదిన్నరగా ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి?’ అని ప్రశ్నించారు. అన్ని అంశాల తో నివేదిక రూపొందించిన తర్వాత మళ్లీ సమావేశమవుదామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిటీ తరహాలో రాష్ట్రంలోని భూసమస్యల అధ్యయనానికి క మిటీ కూర్పుపై అధ్యయనం చేయాలని చెప్పారు. భూదాన్, అసైన్డ్ భూముల అంశాలపై ఇంకోసారి సమావేశమై సమగ్రంగా చర్చిద్దామని అన్నారు. బు ధవారం మధ్యాహ్నం సచివాలయంలో ధరణి పోర్ట ల్ నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిత్తల్, అధికారులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం సమీక్ష సందర్భంగా సీఎంతో పాటు పలువురు మంత్రులు రెవెన్యూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నారాయణపేట జెడ్పీ చైర్మన్ ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తు పరిష్కారం కాకపోగా ఆ డబ్బులు మీరు తిరిగి ఇవ్వలేదు. ఆయన కోర్టుకు వెళ్లి తన డబ్బులు తనకివ్వాలని ఆర్డర్ తెచ్చుకున్నా మీరు స్పందించలేదు. ధరణి పోర్టల్ కింద చేసుకునే ప్రతి దరఖాస్తుకు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు? ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖాతాకే వస్తున్నాయా? ప్రైవేటు కంపెనీకి వెళ్లి మళ్లీ ప్రభుత్వానికి వస్తున్నాయా? భూముల రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల భూ యజమానుల హక్కులకు భంగం కలుగుతుంది కదా? డేటాను దుర్వినియోగం చేయకుండా నియంత్రించే మెకానిజం ఏంటి? స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రద్దు చేసుకుంటే ఆ డబ్బులు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై విచారణ సుమోటోగా ఎందుకు చేయొద్దు? నోషనల్ ఖాతా అంటే ఏంటి? ఆ ఖాతాలో భూములెందుకున్నాయి? 31 కాలమ్స్ ఉన్న పహాణీలో 16వది అయిన అనుభవదారు కాలమ్ ఎందుకు తీసేశారు?..’ అని రేవంత్ ప్రశ్నించారు. నివేదికపై సంతకం పెట్టి ఇవ్వండి ధరణి పోర్టల్కు, రైతుబంధుకు సంబంధమేంటని సీసీఎల్ఏ మిత్తల్ను సీఎం ప్రశ్నించారు. సంబంధమేమీ లేదని మిత్తల్ చెప్పగా, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో పొందుపర్చాలని రే వంత్ సూచించినట్టు తెలిసింది. నివేదికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో కాకుండా అధికారికంగా సంతకం పెట్టి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్ జగన్ వేగం మీకెందుకు లేదు? కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ సదస్సులు పెట్టిన తీరు, అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేత కోదండరెడ్డి నివేదికను సమర్పించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వేగం మీకెందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. భూముల సర్వే, టైటిల్ గ్యారంటీ, అసైన్డ్ భూముల చట్టం, కౌలు రైతుల చట్టం అమలు లాంటి విషయాల్లో జగన్ వేగంగా దూసుకుపోతుంటే మీరేం చేశారని ప్రశ్నించారు. కమిటీ ఏర్పాటు చేయండి: భూమి సునీల్ రాష్ట్రంలోని భూసమస్యలపై సమగ్రంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ఈ సమస్యలపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భూమి సునీల్ కోరారు. భూ సంబంధిత అంశాలపై ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు. సాదా బైనామాల చట్ట సవరణ చేయాలని, రెవెన్యూ సదస్సులు పెట్టి సుమోటోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో 2.30 లక్షల దరఖాస్తులు సమీక్షలో భాగంగా రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ అధికారులు ధరణిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన మాడ్యూల్స్లో ఎన్ని దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కారమయ్యాయో వివరించారు. టెక్నికల్ మాడ్యూల్ 1 నుంచి టీఎం 33 వరకు మొత్తం 2.30 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, 1.80 లక్షల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. సమీక్షలో కాంగ్రెస్ నేతలు అన్వేష్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, మన్నె నర్సింహారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, ఎన్నం శ్రీనివాస్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, రాజ్ ఠాకూర్లతో పాటు ట్రెసా ప్రతినిధులు వంగ రవీందర్రెడ్డి, కె.గౌతమ్కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం తరఫున వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేల మీదకు రండి!
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఎన్నెన్నో హామీలతో కూడిన మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నా, వాటిలో ఎక్కడా కూడా భూమి ఎజెండా కావడం లేదు. ఇందుకు కారణాలేవైనా తెలంగాణలో భూమి చుట్టూ తిరగాల్సిన రాజకీయం డబ్బు చుట్టూ తిరుగుతోందని వర్తమాన పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, రాజకీయ పార్టీలు దృష్టి సారించాల్సిన అంశాలపై తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో–2023 పేరుతో తెలంగాణ సమాఖ్య 15 కీలక అంశాలను తెరపైకి తెచ్చింది. లీఫ్స్ సంస్థ, గ్రామీణ న్యాయపీఠం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నిర్వహించిన తెలంగాణ భూమి కారవాన్, భూన్యాయ శిబిరాలు, న్యాయగంట, చర్చా వేదికల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల అభిప్రాయాల ఆధారంగా ఈ డిమాండ్లను పార్టీల ముందుంచింది. మూడే కీలకం.. ఆ ఒకటే రికార్డు–ఒకటే పట్టా–ఒకటే చట్టం నినాదాన్ని ఎన్నికల ఎజెండా చేయాలని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. ఇది సాధ్యమైతే 90 శాతం సమస్యలు పరిష్కారమైనట్లేనని అంటున్నారు. ఒకటే రికార్డు కావాలంటే భూముల సమగ్ర సర్వే జరగాలి. ఒకటే పట్టా కావాలంటే ప్రభుత్వమే టైటిల్ గ్యారంటీ ఇవ్వాలి. ఒకటే చట్టం కావాలంటే రెవెన్యూ కోడ్ అమల్లోకి రావాలి. ఇవి మూడూ జరగాలంటే రాజకీయ నిబద్ధత కావాల్సిందే. వీటితో పాటు లా కమిషన్, సర్వీస్ కమిషన్, స్టేట్ఫైనాన్స్ కమిషన్ తరహాలో భూ కమిషన్ ఏర్పాటు డిమాండ్ కూడా ఉంది. కౌలు–వ్యవసాయ భూముల చట్టం (1950) ప్రకారం అధికారులు, నిపుణులు, ప్రజాప్రతినిధులతో ఈ కమిషన్ ఏర్పాటు తప్పనిసరి. అయితే 1950 నుంచి ఓ దశాబ్దంపాటు అమల్లో ఉన్న ఈ కమిషన్ ఆ తర్వాత క్రమంగా కనుమరుగైంది. భూమికి సంబంధించిన ఇతర డిమాండ్లు ఇవి ♦ ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించి పట్టాలివ్వాలి. ♦ పోడు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలను అందించాలి. ♦ భూపంపిణీకి ప్రత్యేక పథకం రూపొందించాలి. సీలింగ్ చట్టంతో మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ పేద కుటుంబాలకు పునఃపంపిణీ చేయాలి. ♦ భూవివాదాల పరిష్కారానికి జిల్లాకో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుతోపాటు పేదలకు ఉచిత న్యాయ సాయం, పారాలీగల్ పథకాలను అమలు చేయాలి. ♦ ధరణి సమస్యల పరిష్కారం కోసం గ్రామ స్థాయిలో రెవెన్యూ కోర్టులు నిర్వహించాలి. కంప్యూటర్లో ఉన్న భూరికార్డులు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలి. రికార్డుల్లో తప్పులను సత్వరమే సవరించేలా సాఫ్ట్వేర్ రూపొందించాలి. కంప్యూటర్లో ఉన్న రికార్డులకు భద్రత కల్పించాలి. ♦ నిషేధిత జాబితా (22ఏ)లో పొరపాటున నమోదైన పట్టా భూములను వెంటనే జాబితా నుంచి తొలగించాలి. ♦ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూపరిపాలన యంత్రాంగాన్ని పటిష్టపర్చాలి. అవసరాలకు తగినట్టు వారికి తగిన శిక్షణ ఇవ్వడం కోసం భూ అకాడమీని ఏర్పాటు చేయాలి. ♦ భూవిధానం, భూమి వినియోగ విధానం, 2014లో చేసిన భూసేకరణ చట్టం యథాతథంగా అమలు చేయాలి. ♦ కౌలుదారులను సాగుదారులుగా గుర్తించి వారికి పట్టా రైతులుగా అందాల్సిన అన్ని రకాల సాయం అందించాలి. కొత్త కౌలు చట్టం రూపొందించాలి. ‘సర్వే’జనా..! భూముల సమగ్ర సర్వే కూడా రాజకీయ ఎజెండా కావాల్సిందేననేది రైతుహితుల అభిప్రాయం. గుజరాత్తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్లలో భూసర్వే జరిగింది. ఏపీలో జరుగుతున్న సర్వే దక్షిణాదిలో ఉత్తమమైన సర్వేగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే భూముల సమగ్ర సర్వే చేసిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందుతుంది. తెలంగాణలో ఈ సర్వే చేసేందుకు 2016లో రూ.580 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇప్పుడు అది రూ.800 కోట్లకు చేరింది. శాటిలైట్, డ్రోన్, డీజీపీఎస్ (డిజిటల్ జియో పొజిషనింగ్ సిస్టమ్స్)ల ద్వారా గ్రామ సరిహద్దులు, హైస్కేల్ మెజర్మెంట్స్ తీసుకొని యునీక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఎల్పిన్) లేదా ల్యాండ్ పార్సిల్ నంబర్ ఇవ్వడం ద్వారానే భూమి హక్కులకు భద్రత కలగనుంది. ఇక మరో కీలకాంశం అసైన్డ్ భూములకు పట్టా హక్కుల కల్పన. ప్రస్తుతం బీఆర్ఎస్ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్లో ఈ అంశం పొందుపర్చారు. భూ బదలాయింపు (పీఓటీ) చట్టాన్ని సవరించడం ద్వారా ఆ భూములు కేటాయించిన 20 ఏళ్ల తర్వాత ఏపీ, కర్ణాటకల్లో, 15 ఏళ్ల తర్వాత తమిళనాడులో పూర్తిస్థాయి యాజమాన్య హక్కులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. తెలంగాణలో కూడా 1950 నుంచి పేదలకు అసైన్ చేసిన 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఈ భూములపై హక్కులకల్పన రాజకీయ ఎజెండా అయితే పేదల ఆర్థిక ముఖచిత్రంలో ఊహించని మార్పులు రానున్నాయి. -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
..భూమార్గం పట్టిద్దాం!
‘తెలంగాణలో భూమి అనేది చాలా ప్రధానమైన అంశం. ప్రపంచంలోని ఎక్కడా లేని భూపోరాటాలు ఇక్కడే జరిగినా 75 ఏళ్ల తర్వాత కూడా∙భూసమస్యలు అసంపూర్తి పనిగానే మిగిలిపోయాయి. అసంపూర్ణమైన భూసంస్కరణలే ఇందుకు కారణం. ప్రభుత్వాలు చేసే పనుల కారణంగా పేదల భూములకు భద్రత కల్పించడం మాట అటుంచితే పేదల భూములు లాక్కుంటున్నారని, ఉన్న కాసిన్ని భూములు పేదల చేతుల నుంచి పోతున్నాయని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఇదీ అసలు సమస్య. ప్రజలకున్న అసలు సమస్యలే కదా ఎన్నికల ఎజెండా కావాలి. ప్రజల ప్రతి సమస్యా ఎజెండా అయితే ఆ సమస్యలు తీరుస్తామని రాజకీయ పార్టీలు చెప్పాలి..’ అని భూచట్టాల నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం.సునీల్కుమార్ అన్నారు. తెలంగాణలో ధరణి ఒక్కటే భూ సమస్య కాదని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటున్న భూవిధానాలను తీసుకురావడం ఎన్నికల ఎజెండా అయినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు. 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ.. భూమిని ప్రజల కోణంలో చూడాలి. భూమి లేని వారికి భూమి ఇవ్వడం, భూమి ఉన్న వారి హక్కులకు భద్రత ఉన్నప్పుడే ఆస్తి సంపదగా మారుతుంది. అయితే ఈ రెండింటి విషయంలో 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ ఉంది. భూమి లేని గ్రామీణ కుటుంబాలు తెలంగాణలో 56 శాతం ఉన్నాయని లెక్కలు చెపుతున్నాయి. భూములున్న కుటుంబాల విషయంలో ఊరికో 200 సమస్యలున్నాయి. ఈ సమస్యలు ఎన్నికల ఎజెండా కావాలి. దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు. గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే.. 2014 ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల్లో భూమి ప్రస్తావన ఉంది. 2018లో కొందరే ప్రస్తావించారు. కానీ ఈసారి భూమి అంశం చర్చకే రావడం లేదు. ధరణిని రద్దు చేస్తామని ఒకరు అంటుంటే, అసైన్డ్ భూములపై హక్కులు కలి్పస్తామని బీఆర్ఎస్ అంటోంది. తెలంగాణలో భూసమస్య అంటే ధరణి ఒక్కటేనా? కీలకమైన భూసర్వే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా ఉందా? అంటే మెల్లగా భూమి అనేది ఎన్నికల ఎజెండా కాకుండా మాయమైపోతోందన్న మాట. సమస్యలు కొనసాగితేనే పార్టీలకు ఉపయోగం రాజకీయ పార్టీలు ఎన్నికల్లో భూమిని ఎజెండాగా చేయాలనుకోవడం లేదనే చెప్పాలి. ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ, లేదంటే పరిష్కరించలేక పోవడం వల్ల కానీ భూమి అంశాన్ని పార్టీలు చేపట్టలేకపోతున్నాయి. భూమి సమస్యను యథాతథంగా కొనసాగించాలన్న ఆలోచన కూడా రాజకీయ పార్టీలకు ఉండొచ్చు. భూములకు సంబంధించిన సమస్యలు ఉంటేనే కదా రాజకీయ పార్టీలకు ఉపయోగం. ప్రతి గుంట భూమిని సర్వే చేయాలి తెలంగాణలో భూముల సమగ్ర సర్వే చేయాలి. ఇందుకు రూ.700–800 కోట్ల వరకు ఖర్చవుతుంది. తెలంగాణలో ప్రతి గుంట భూమిని సమగ్రంగా సర్వే చేసి కొత్త రికార్డులను తయారు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. కానీ సర్వే చేస్తామని ఎవరైనా చెప్తున్నారా? భూ చట్టాల్లో సమగ్ర మార్పు రావాలి. ఆర్వోఆర్, పీవోటీ, కౌలు చట్టాలు మార్చాలి. ఏ పార్టీ అయినా భూ చట్టాల్లో మార్పు తెస్తామని ప్రకటిస్తోందా? రెవెన్యూ కోడ్ తెస్తామని చెప్తోందా? భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం తెస్తామని ఏ పార్టీ అయినా చెపుతోందా? భూమి లేని పేదలకు భూములిస్తామని ఎవరైనా అన్నారా? తెలంగాణలో 10 లక్షల మందికి పైగా ఉన్న కౌలు రైతులను గుర్తిస్తామని ఎవరైనా చెపుతున్నారా? సమగ్ర చట్టం లేకుండా కౌలుదారులను ఎలా గుర్తిస్తారు? ఎలా డబ్బులిస్తారు? భూపరిపాలన మెరుగుపరుస్తామని ఎవరైనా అంటున్నారా? ఇవి ప్రజలు చేసే డిమాండ్లే. కంప్యూటర్ రికార్డు తప్పనిసరి పేరేదైనా సరే.. భూమికి కంప్యూటర్ రికార్డు ఉండి తీరాలి. తెలంగాణలో భూమి కంప్యూటర్ రికార్డులు బ్రహ్మాండంగా ఉన్నాయమని అధికారపక్షం చెపుతోంది. ప్రతిపక్షమేమో చెండాలంగా ఉందని అంటోంది. వీళ్లు రద్దు చేస్తామంటారు. వాళ్లు యథాతథంగా కొనసాగిస్తామంటున్నారు. ఇద్దరూ చెబుతున్నదీ తప్పే. రద్దు సమస్యకు పరిష్కారం కాదు. అసలు కంప్యూటర్ రికార్డు అయితే ఉండాలి కదా? ఏదో ఒక రికార్డుండాలి. కొత్త రికార్డు ఎలా తెస్తారు? అనేది చెప్పాలి కదా? ఏం చేస్తారనే పరిష్కారం చెప్పకుండా రద్దు సమంజసం కాదు. అంతా బాగుందని చెప్పడం సరైంది కాదు. అంటే ఈ రెండు పక్షాలు ప్రజలేం కోరుకునేదానివైపు వెళ్లడం లేదన్నది అర్థమవుతోంది. కంప్యూటరీకరణ అవసరమా? భూమికి కాగితాలిచ్చే ప్రక్రియ ప్రపంచమంతా జరుగుతోంది. ఎందుకంటే భూమి ఉన్నా.. ఆ భూమికి సరైన కాగితాలున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 30 శాతమేనట. అంటే రికార్డులు లేని వారే ఎక్కువ ఉన్నారు. ఈ రికార్డులను కల్పించడంలో భాగంగా జరిగే ప్రక్రియనే ఫార్ములైజేషన్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ అంటారు. అంటే భూములకు రికార్డులు రూపొందించాలి. వాటిని కంప్యూటరీకరించాలి. అమ్మకాలు, కొనుగోళ్లు సులభంగా జరగాలి. వీటి వల్ల భూమి హక్కులకు భద్రత ఏర్పడుతుంది. పేదలకు కూడా భూములు కొనుగోలుచేయగలిగిన ధైర్యం వస్తుంది. భూవినియోగ విధానం ఉండాలి భూమి విధానం, భూమి వినియోగ విధానాలు ప్రతి రాష్ట్రానికి ఉండాలి. ఎన్నికల సమయంలోనే ఇవి చర్చకు రావాలి. ఉచితాలు అనేవి తాత్కాలిక లబ్ధి చేకూర్చేవి. అందువల్ల రాజకీయ పార్టీల హామీలు భూమి చుట్టూ తిరగాలి. స్థిరాస్తి కల్పనపై అవి దృష్టి సారించాలి. గుంట భూమి ఉంటే ఎన్ని సమస్యలో.. అది కూడా లేని వారి పరిస్థితేంటో అందరికీ తెలిసిందే. భూములివ్వడం, ఉన్న భూములను కాపాడడం చుట్టూ ఎన్నికల ఎజెండా తిరిగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. - మేకల కళ్యాణ్ చక్రవర్తి -
సుప్రీం కోర్ట్ తీర్పును వెంటనే అమలుపర్చాలిని ప్రభుత్వానికి విజ్ఞప్తి
-
డీబార్ దానయ్యకు కోటు తొడిగి..! ఈనాడు పరువు తీసిన సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మనది. నా ప్రతి అడుగులోనూ రైతు సంక్షేమం ఉంటుంది. భూమితో వారికున్న అనుబంధం తెలిసిన వ్యక్తిగా రైతన్నలకు మేలు చేసే కార్యక్రమాలను చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 97 వేలకుపైగా రైతు కుటుంబాలకు మంచి చేస్తూ చుక్కల భూములపై సర్వ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములపై రైతులకు హక్కుపత్రాలపంపిణీ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఆ వివరాలివీ.. సర్వ హక్కులు కల్పిస్తూ.. రాష్ట్రంలో దాదాపు లక్ష కుటుంబాలకు మేలు చేస్తూ దేవుడి దయతో ఇవాళ మరో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తగిన మార్పులు చేసి రైతులకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22–ఏ నుంచి వాటిని తొలగిస్తూ మంచి చేస్తున్నాం. ఇన్నాళ్లూ 22–ఏలో ఉన్న ఈ భూముల రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ.8 వేల కోట్లు. బయట వీటి మార్కెట్ విలువ కనీసం రూ.20 వేల కోట్లు ఉంటుంది. పుండుపై కారం చల్లిన చంద్రబాబు దాదాపు వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో జరిగిన భూముల సర్వేలో ఒక భూమిని ప్రభుత్వ భూమా? లేక ప్రైవేట్ భూమా? అనే విషయాన్ని సరిగా నిర్ధారణ చేయలేదు. రెవెన్యూ రికార్డుల్లో అంటే రీ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లో ఆ పట్టాదారుడి గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. బ్రిటీష్ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి లెక్కలు తేల్చకుండా వదిలేసిన భూములను రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ వస్తున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్నా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరగని అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పరిష్కారం చూపాల్సిన చంద్రబాబు ప్రభుత్వం 2016లో పుండుమీద కారం చల్లినట్లుగా రిజిస్ట్రేషన్లు జరగకుండా ఒక మెమో ద్వారా 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చి అన్నదాతల జీవితాలతో ఆడుకుంది. ఇలా అన్యాయానికి గురైన రైతులు తమ పిల్లల పెళ్లిళ్లు, వైద్యం, ఇతర అవసరాలకు భూమిని విక్రయించేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. చుక్కల భూముల యజమానులు నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేయించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో పడ్డ కష్టాలను నా సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా చూశా. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 43 వేల ఎకరాలు, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో మరో 37 వేల ఎకరాలు, కడప, అన్నమయ్య జిల్లాల్లో 22 వేల ఎకరాల చుక్కల భూములున్నాయి. చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రదక్షిణలు, లంచాలతో పని లేకుండా... కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ గుర్తించాం. 22–ఏ నిషేధిత జాబితా నుంచి చుక్కల భూములకు విముక్తి కల్పిస్తూ రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి 2 లక్షల ఎకరాలకు చెందిన దాదాపు లక్ష రైతు కుటుంబాలకు మంచి చేస్తూ వారికి ఈ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తున్నాం. షరతులు గల పట్టా భూములూ పరిష్కారం చుక్కల భూముల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటున్న షరతులు గల పట్టా భూములు మరో 35 వేల ఎకరాలకు సంబంధించి 22 వేల మంది రైతులకు మేలు చేస్తూ ఆర్నెళ్ల క్రితమే అవనిగడ్డ నియోజకవర్గంలో అందించాం. నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగిస్తూ ఆ ప్రాంత రైతులందరికి మంచి చేశాం. ఇది కూడా మీ బిడ్డ హయాంలోనే జరిగింది. భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడో వందేళ్ల నాటి భూముల సర్వే తర్వాత రికార్డులు అప్డేట్ కాకపోవడంతో గ్రామాల్లో నెలకొన్న విభేదాలు, వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో సమగ్ర సర్వే చేపట్టాం. 17,476 రెవెన్యూ గ్రామాలకి సంబంధించి ప్రతి గ్రామంలో సర్వే చేస్తూ రైతులందరికి హక్కు పత్రాలిచ్చే కార్యక్రమానికి నాంది పలికాం. ఇప్పటికే రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి హక్కు పత్రాలిచ్చే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. సుమారు 7 లక్షలకు పైగా భూహక్కు పత్రాలను అప్డేట్ చేసి రైతులకు అందించాం. సరిహద్దు రాళ్లను కూడా ఉచితంగా పాతే కార్యక్రమాన్ని రెండు వేల గ్రామాల్లో మే 20 నాటికి పూర్తి చేస్తాం. ఆ తర్వాత మే నెలాఖరు నుంచి మరో 2 వేల గ్రామాల చొప్పున మూడు నెలలకు ఒకసారి రెండు వేల గ్రామాల్లో పూర్తి చేసుకుంటూ వెళతాం. మనసున్న ప్రభుత్వంగా, రైతులకు మంచి జరగాలన్న ఆలోచనతో మనస్ఫూర్తిగా ఇవన్నీ చేస్తున్నాం. రైతు బాంధవుల వేషం.. రావణ సైన్యం నాలుగేళ్లుగా ప్రతి అడుగులో రైతులకు మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. రైతులను చేయి పట్టుకుని నడిపించే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, సీజన్ ముగియక ముందే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ, భూరక్ష, ఈ–క్రాప్తోపాటు దళారులు లేకుండా ఆర్బీకేల స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం. పంట నష్టపోయి¯నా ధాన్యం తడిసినా, రంగు మారినా కొనుగోలు చేస్తామని చెప్పాం. కేంద్రం ఎంఎస్పీ ఇవ్వని పంటలకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించి ఆర్బీకేల్లో బోర్డులు ఏర్పాటు చేశాం. రైతన్నల కోసం మన ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. ఏటా కనీసం 300 మండలాల్లో కరువు తాండవిస్తున్నా రైతులను గాలికి వదిలేసిన చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న దత్తపుత్రుడు ఇవాళ రైతు బాంధవుల వేషంలో రోడెక్కారు. వారికి మద్దతుగా రావణ సైన్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీళ్లంతా రామాయణంలో శూర్పణక మాదిరిగా రైతులపై దొంగ ప్రేమ నటిస్తున్నారు. ప్యాకేజీలు.. పొలిటికల్ యాక్షన్ అక్షరాలా రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను తొలి సంతకంతో మాఫీ చేస్తానన్న చంద్రబాబు రైతులను నమ్మించి దగా చేశాడు. రుణమాఫీ దేవుడెరుగు.. చివరకు సున్నా వడ్డీ కూడా ఎగ్గొట్టిన ఘనుడు ఆయనే. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల భయంతో రోడ్డెక్కుతున్నారు. చంద్రబాబుకి డేట్లు ఇచ్చి ఆయన స్క్రిప్ట్ ప్రకారం డైలాగులు చెబుతూ పొలిటికల్ యాక్షన్ చేస్తూ ప్యాకేజీలు తీసుకుని నటిస్తున్న స్టార్ ఒకవైపు.. వారి డ్రామాలను రక్తి కట్టించేందుకు ఎల్లో మీడియా మరోవైపు పోటీ పడుతున్నాయి. ఎవరి డ్రామా వారు ఆడుతున్నారు. నాలుగేళ్లుగా కొన్నదెవరు మరి? ప్రతి రైతన్నకూ చెబుతున్నా. వీళ్ల డ్రామాలను నమ్మొద్దు. తాము వస్తేగానీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెబుతున్నారు. మరి నాలుగేళ్లుగా కొన్నది ఎవరు? రైతన్నలకు తోడుగా జగన్ ప్రభుత్వం కనిపిస్తున్నా వక్రీకరిస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. చివరికి మీ జగనన్నకు ఓటు వేయకపోయినా సరే.. అర్హత ఉంటే చాలు తోడుగా నిలిచాడు. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ అడుగులు పడుతున్నాయి. సంక్షేమ పథకాలు దండగట! పేదలకు జగన్ ఉచితంగా డబ్బులు పంచిపెడుతున్నారని, ఇదంతా బాధ్యతారాహిత్యమంటూ టీడీపీ, గజదొంగల ముఠా చేస్తున్న ప్రచారాలను గమనించండి. వారి టీవీ డిబేట్లలోనూ ఇవే వార్తలు చూస్తున్నాం. గతంలో ఇదే ఈనాడు, ఎల్లో మీడియాలో సంక్షేమ పథకాలను రద్దు చేయాలని ఇద్దరు మాజీ ఐఏఎస్లతో చెప్పించారు. చంద్రబాబు మాటగా సంక్షేమ పథకాలు దండగని మొదటి పేజీలో అచ్చు వేసి చెప్పారు. అంటే చంద్రబాబుకు ఓటు వేయడమంటే ఇక పేదలెవరికీ పథకాలు రావనే దాని అర్థం. అందరూ దీనిపై ఆలోచన చేయండి. కులాల యుద్ధం కాదు.. క్లాస్వార్ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. క్లాస్ వార్ జరుగుతోంది. పేదవాడు ఒకవైపు, పెత్తందారీ మనస్తత్వం ఉన్నవారు మరోవైపున యుద్ధం జరుగుతోంది. పేదల ప్రతినిధిగా ఇక్కడ మీ జగన్ ఉన్నాడు. పేదరికం నుంచి ఎలా బయటకు తేవాలని మీ బిడ్డ అడుగులు వేస్తున్నాడు. అందుకే ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపిస్తున్నాయి. ప్రతి 50 ఇళ్లకు వలంటీర్ కనిపిస్తాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన కనిపిస్తోంది. మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి. నైపుణ్యం ఉన్న వ్యక్తులుగా మారాలని చదువులపై పెట్టుబడులు పెడుతున్నాం. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో మన రాష్ట్రం దేశానికే దిక్సూచి అవుతుంది. నైపుణ్యం ఉన్నవారు లేక జర్మనీ ఇబ్బంది పడుతోందని ఓ ఆర్టికల్ చదివా. నిపుణులైన మానవ వనరులు ఉండాలంటే ఒక విత్తనం పడి వృక్షం కావాలి. మీరంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో మంచి జరిగిందా..? లేదా..? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైన్యంగా నిలబడండి. డీబార్ దానయ్యకు కోటు తొడిగి..! రెండు రోజుల క్రితం ఈనాడులో జీవీ రావు అనే వ్యక్తి ఇంటర్వ్యూ ప్రచురించారు. ఆ పెద్ద మనిషి ఎవరని ఆరా తీస్తే.. చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ)గా ఆయనకు ప్రాక్టీసు రద్దైంది. చార్టెడ్ అకౌంటెన్సీ వారు ఆయన సర్టిఫికెట్ను రద్దు చేసి డీబార్ చేశారు. అలాంటి డీబార్ అయిన దానయ్యను పట్టుకుని ఓ కోటు తొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపిస్తూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు. అది ఈనాడు రాస్తుంది. ఎల్లో మీడియా డిబేట్లు పెడుతుంది. జగన్ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందట.. అప్పులు పాలవుతుందని చెప్పిస్తారు. అబద్ధాలు చెప్పించడానికి వీరంతా అలా వాడుకుంటారు. కావలి కరువుతీరేలా వరాలు! కావలి నియోజకవర్గానికి సంబంధించి టౌన్లో ట్యాంకు కెపాసిటీ పెంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే మంచి జరుగుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కోరారు. అందుకు రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నాం. కావలికి హైలెవల్ కెనాల్ నుంచి నీళ్లు రావడంలో ఇబ్బందులు ఉన్నందున సంగం బ్యారేజీ నుంచి లింక్ కెనాల్కు రూ.20 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాం. రూ.56 కోట్లతో కావలి ట్రంక్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. మరో రూ.15 కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నాం. కావలి మున్సిపాలిటీ 16 వార్డులో ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాలకు మరో రూ.80 కోట్లు ఖర్చు చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కోట్లుపెట్టి కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు?: కిషన్ రెడ్డి
సాక్షి, వికారాబాద్: కేసీఆర్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం భూ ఆక్రమణలకు పాల్పడుతోందన్నారు కిషన్ రెడ్డి. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, కిషన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. ధరణితో లక్షలాది మంది రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోర్టల్ కారణంగా చట్టబద్ధమైన లక్షల ఎకరాల భూమి ప్రొబేటరీ ల్యాండ్గా ప్రకటించడం వల్ల చాలా మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పోర్టల్ ను అడ్డుపెట్టుకుని మధ్యవర్తులు, దళారీలను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేక దళారీల ఉచ్చులో పడి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. హైకోర్టును ఆశ్రయించడం తప్ప ఎవరిని కలిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందనేది తెలియడంలేదు గతంలో గతంలో కొన్ని భూ సంబంధిత సమస్యలు ఉంటే ధరణి పోర్టల్ వల్ల ఇవి భారీగా పెరిగిపోయాయి. పాస్ పుస్తకంలో తప్పులను సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ధరణిలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా అది ప్రగతిభవన్ నుంచే చేపట్టాలి. సాక్షాత్తు ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యేవి.. కానీ నేడు ప్రగతిభవన్ వరకు అది వచ్చిందంటే ప్రభుత్వం ఎంత ఆక్రమణలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా?. కొందరు ప్రజాప్రతినిధులు, రియల్ వ్యాపారులు కుమ్మక్కై ప్రజల నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములకు విక్రయాలు చేపడుతున్నారు. ధరణిలో తప్పొప్పుల సవరణ కూడా జరగకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ఇతర స్కీమ్ లు సామాన్యులకు చేరడం లేదు. వాటిని బీఆర్ఎస్ నేతలు గద్దల్లా తన్నుకుపోతున్నారు బ్రోకర్లను పెంచి పోషిస్తున్నట్లుగా ధరణి పోర్టల్ ఉందని న్యాయస్థానాలు కూడా చెప్పాయి. రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని అందించిన దరఖాస్తులు ఏమయ్యాయి? ధరణి బాగానే ఉంటే కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేసినట్లు కేసీఆర్. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముంది? బయటపెట్టాలి. ధరణిలో భూ సమస్యలపై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారో బయటపెట్టండి. ప్రగతిభవన్లో అవినీతి, అక్రమాలకు ఆలోచన చేసే వ్యక్తులు ఇచ్చే సలహాలను అమలుచేస్తున్నారు తప్ప.. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను అమలుచేయడం లేదు. ఒవైసీ గతంలోనే చెప్పాడు.. కారు స్టీరింగ్ నా చేతిలోనే ఉందని. తాను బ్రేకులు వేస్తేనే ఆగుతుంది.. తాను యాక్సిలరేటర్ ఇస్తేనే ముందుకు పోతుందని చెప్పాడు. రాజాసింగ్ సెక్రటేరియట్కు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారు?. ఒక ఎమ్మెల్యేను అడ్డుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది?. జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా సెక్రటేరియట్కు వెళ్లేందుకు అనుమతిలేదు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి వారినే లోనికి పంపించడం లేదు. పాతబస్తీలోకి ఓ పోలీస్, ఓ ప్రభుత్వ అధికారి కానీ ధైర్యంగా వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం ఎంతసేపు ఫోన్లు ట్యాప్ చేయడం, ధర్నాలు చేసేవారిని అడ్డుకోవడం వంటి పనులు మాత్రమే చేస్తోంది. తెలంగాణ పోలీసుల చాలా ధైర్యవంతులు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. హైదరాబాద్లో రూ.కోట్లతో కట్టిన కమాండ్ కంట్రోల్ రూం ఏం చేస్తోంది. పోలీసులకు ప్రభుత్వం స్వేచ్చ ఇవ్వాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు -
‘ధరణి’ దంగల్! రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ల మధ్య ‘కోల్డ్ వార్’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలోని రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ల మధ్య ‘కోల్డ్ వార్’నడుస్తోంది. పోర్టల్ అందుబాటులో వచ్చినప్పటి నుంచి భూసమస్యల తుది పరిష్కార అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు కట్టబెట్టినా.. సదరు పరిష్కార ఉత్తర్వులను మాత్రం తహసీల్దార్ల డిజిటల్ సంతకాలతో జారీ చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్లు విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయాలకు తమ డిజిటల్ సంతకాలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది తలెత్తితే తాము బాధ్యులం కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏం చేయాలి? సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేవాలి? అన్న దానిపై రెవెన్యూ వర్గాల్లో తర్జన భర్జన జరుగుతోంది. నిర్ణయం కలెక్టర్ది.. సంతకం తహసీల్దార్ది ధరణి పోర్టల్లో వివరాల నమోదులో తప్పులతో లక్షల కొద్దీ భూసంబంధిత సమస్యలు తలెత్తాయి. వాటి పరిష్కారం కోసం రైతులు ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే.. అది నేరుగా జిల్లా కలెక్టర్/ కలెక్టర్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్ లాగిన్కు వెళుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఈ దరఖాస్తును ఆన్లైన్లోనే తహసీల్దార్కు పంపుతుంది. తహసీల్దార్లు దానిపై విచారణ జరిపి.. ఆన్లైన్, ఆఫ్లైన్లో రెండు నివేదికలు తయారుచేసి ఆర్డీవో కార్యాలయానికి పంపుతారు. ఆర్డీవో కార్యాలయంలో పరిశీలన తర్వాత దరఖాస్తులు ఆన్లైన్లోనే తిరిగి కలెక్టర్ లాగిన్కు చేరుతాయి. తహసీల్దార్లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా, ఆర్డీవో అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని సదరు దరఖాస్తును అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అన్నదానిపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయంలో కేవలం బయోమెట్రిక్, డిజిటల్ కీ మాత్రమే కలెక్టర్ది వాడుతున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రొసీడింగ్స్ రావడం లేదు. కేవలం కలెక్టర్లు ఆమోదించినదీ, తిరస్కరించినదీ మాత్రమే ఆన్లైన్లో కనిపిస్తుంది. ఈ ఆన్లైన్ ధ్రువీకరణపై తహసీల్దార్ డిజిటల్ సంతకం వస్తోంది. ఇక్కడ సమస్య ఏమిటంటే.. తహసీల్దార్ విచారణ పూర్తయి నివేదిక పంపాక కూడా పలు దరఖాస్తుల విషయంలో జిల్లాల కలెక్టర్లపై రాజకీయ, ఇతర ఒత్తిడులు వస్తున్నాయి. దీంతో తహసీల్దార్ల నివేదిక ఎలా ఉన్నా కలెక్టర్లు ధ్రువీకరిస్తున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 20 శాతానికిపైగా దరఖాస్తుల్లో తహసీల్దార్ల అభిప్రాయానికి, నివేదికకు భిన్నంగా కలెక్టర్లు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అంచనా. ఏదైనా సమస్య వస్తే బాధ్యులెవరు? తమ అభిప్రాయాలకు భిన్నంగా జారీ అయ్యే ధరణి ఉత్తర్వులపై.. తమ డిజిటల్ సంతకాలే ఉండటంపై తహసీల్దార్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ, ఇతర కారణాలతో భూముల ఉత్తర్వులపై ఫిర్యాదులు వస్తే.. సదరు నిర్ణయాలపై తమ సంతకాలు ఉంటాయని, తాము కూడా బాధ్యులం కావాల్సి వస్తుందని తహసీల్దార్లు వాపోతున్నారు. కలెక్టర్లతోపాటు తాము కూడా బదిలీ కావడమో, విచారణ ఎదుర్కోవాల్సి రావడమో జరిగితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా భూసమస్య కోర్టుకు వెళితే అక్కడ తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, లేకుంటే తమపై చర్యలు తప్పవని అంటున్నారు. ఈ క్రమంలో ధరణి ఉత్తర్వులపై జిల్లా కలెక్టర్ల సంతకాలే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ చట్టాల ప్రకారం సంతకంతో సమస్యలు పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు లేనందున.. భూసమస్యల పరిష్కార విచక్షణాధికారం తమకే ఇవ్వాలని కోరుతున్నారు. అలాగైతే నిర్ణయాలకు తామే బాధ్యత వహిస్తామని చెప్తున్నారు. ట్రెసాపై ఒత్తిడి ‘ధరణి’సంతకాల విషయమై వారం, పది రోజులుగా రెవెన్యూ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేకుంటే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయాలని, లేదంటే కొందరు తహసీల్దార్లు కలిసి పిటిషన్ వేయాలనే అభిప్రాయం ఆ చర్చల్లో వ్యక్తమవుతోంది. కోర్టుకు వెళ్లడం కుదరకపోతే మానవ హక్కుల సంఘం (హెచ్చార్సీ), లోకాయుక్త వంటి సంస్థలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. మరోవైపు తమ ఆందోళనను బహిరంగంగా ప్రభుత్వానికి తెలియపర్చాలని, ఇందుకోసం జిల్లాల్లో కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు అందజేయాలనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అవసరమైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు విధుల బహిష్కరణకు పిలుపునివ్వాలని ‘తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)’పై తహసీల్దార్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. -
AP: భూ వివాదాలకు చెక్
సాక్షి, రాజమహేంద్రవరం: భూ వివాదాల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్ష’ పథకం కింద మూడు దశల్లో భూముల సమగ్ర సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. తద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా తొలి దశ సర్వే ప్రక్రియను అధికార యంత్రాంగం చేపట్టింది. అప్పట్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి, శాశ్వత భూహక్కు పత్రాలు సైతం పంపిణీ చేసింది. ప్రస్తుతం రెండో దశ సర్వే జిల్లాలో యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. రెండో దశ 50 శాతం పూర్తి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 272 గ్రామాల పరిధిలోని 16,52,706 ఎకరాల్లో వివిధ దశల్లో రీసర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. తొలి దశలో 44 గ్రామాల్లోని 64,336 ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో దశలో జిల్లా వ్యాప్తంగా 17 గ్రామాలను ఎంపిక చేశారు. మొత్తం 47,189.2 ఎకరాల రీసర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 10 గ్రామాల్లోని 22,223.91 ఎకరాల్లో సర్వే పూర్తి చేసి, సుమారు 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. మిగిలిన 7 గ్రామాల పరిధిలోని 24,965.78 ఎకరాల్లో సైతం త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఈ నెలాఖరుకు లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉండగా.. కొన్ని సమస్యల కారణంగా మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. పకడ్బందీగా.. రెండో దశ రీసర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములు, నివాస గృహాలు, వీధులు, ప్రైవేటు భూములు, పరిశ్రమలు.. ఇలా గ్రామానికి చెందిన మొత్తం విస్తీర్ణాన్ని సర్వే చేస్తున్నారు. తొలుత గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ పూర్తి చేస్తున్నారు. సర్వే చేస్తున్న గ్రామానికి పొరుగున ఉన్న వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి గట్టూ తిరిగి సరిహద్దులు నిర్ధారిస్తున్నారు. ఫలితంగా సమయం అవుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రీసర్వేలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ నెట్వర్క్ సాయంతో ఈ ప్రక్రియ సాగుతోంది. చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద కమతాల వరకూ ప్రతీది నమోదు చేస్తున్నారు. డ్రోన్లను రంగంలోకి దింపి సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. మొదటి రెండు దశల్లో ఇప్పటి వరకూ 1,474.629 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే నిర్వహించారు. హద్దు రాళ్లు సర్వే పూర్తయిన రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్రీజోన్ యాక్టివిటీస్ కింద భూముల హద్దులకు సంప్రదాయ పద్ధతిలో సున్నం మార్కింగ్ చేపట్టారు. రాళ్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. రెండో దశలో 15,113 రాళ్లు పాతాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ 5,522 రాళ్లు పాతారు. కొలిక్కి వస్తున్న వివాదాలు ఈ సర్వే పుణ్యమా అని దశాబ్ద కాలం నాటి భూ వివాదాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. దశాబ్దం క్రితం నిర్వహించిన సర్వేలో 5 శాతం అలవెన్సు అమలు చేశారు. అప్పట్లో చైన్లతో కొలతలు వేయడంతో అటూ ఇటూ భూ విస్తీర్ణంలో 5 % సరిహద్దులు నిర్ణయించారు. ఈ క్రమంలో రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, భూమి మీద ఉన్న విస్తీర్ణానికి తేడాలు రావడంతో కొందరు రైతులు వాగ్వాదాలకు దిగుతున్నారు. 1906లో నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రస్తుతం భూ సంబంధిత లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఒకే సర్వే నంబరుపై పలుమార్లు లావాదేవీలు జరిగాయి. వారసులు పంచుకోవడం, బహుమతిగా ఇవ్వడం, క్రయవిక్రయాలు జరిగినా అందుకు అనుగుణంగా భూమి మీద సబ్ డివిజన్ జరగకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. పత్రాల మీద లావాదేవీలు జరిగినా క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండానే నోషనల్ ఖాతాల వల్ల అనేక సమస్యలు మొదలయ్యాయి. తప్పుడు సర్వే నంబర్లతో భూములు రిజిస్ట్రేషన్ కావడం, రిజిస్ట్రేషన్ అయిన భూమికి, వాస్తవంగా భూమి మీద ఉన్న విస్తీర్ణానికి తేడాలు ఉండటం, నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ చేయడం వంటి కారణాలతో రెవెన్యూ సమస్యలు నిత్యకృతమయ్యాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం రీసర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి, ప్రక్రియ పర్యవేక్షిస్తున్నా. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా పకడ్బందీగా సర్వే చేస్తున్నాం. రెండో దశలో ఇప్పటికే 50 శాతం లక్ష్యాలను అధిగమించాం. మిగిలిన వాటిని సైతం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. నిజమైన హక్కుదారుకు న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నాం. – ఎన్.తేజ్భరత్, జాయింట్ కలెక్టర్ లక్ష్యాలను అధిగమిస్తాం రెండో దశ రీసర్వే ప్రక్రియ వేగంగా చేపడుతున్నాం. వివాదాల పరిష్కారానికి సలహాలు ఇస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని 22,223.91 ఎకరాల్లో పూర్తి చేశాం. మిగిలినది సైతం త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. – పి.లక్ష్మణరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అధికారి -
కామారెడ్డి ‘మాస్టర్ప్లాన్’ వెనక్కి!
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: ‘భూమిని మింగే మాస్టర్ ప్లాన్ మాకొద్దు’అంటూ నెలన్నర కాలంగా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ చేస్తున్న పోరాటం ఫలించింది. కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం మాస్టర్ప్లాన్ రద్దుకు ముందుకు వచ్చింది. ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో గడచిన నెలన్నర రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు ఫుల్స్టాప్ పడనుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతు ఐక్యకార్యాచరణ కమిటీ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్లు నిర్వహించింది. విలీన గ్రామాల కౌన్సిలర్లు తొమ్మిది మంది రాజీనామా చేయాలని గురువారం సాయంత్రం వరకు డెడ్లైన్ విధించింది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమషనర్కు అందించారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లపై ఒత్తిడి పెరిగింది. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా వారి పరిస్థితి తయారైంది. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చర్చించి ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు రైతుల పోరాటాల ఫలితంగా బల్దియా పాలకవర్గం మాస్టర్ప్లాన్ ముసాయిదా రద్దుకు సిద్ధమైంది. -
మరో రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, కామారెడ్డి: తన భూమిని రిక్రియేషన్ జోన్లో కలిపారన్న ఆవేదనతో మంగళవారం ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కామారెడ్డి కొత్త మాస్టర్ప్లాన్లో పంట భూములను ఇండస్ట్రియల్, గ్రీన్, రిక్రియేషన్ జోన్ల కింద పేర్కొనడంపై రైతాంగం నెలన్నర రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రామేశ్వర్పల్లికి చెందిన రైతు మర్రిపల్లి బాలక్రిష్ణ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. తనకున్న ఎకరం భూమి రిక్రియేషన్ జోన్లోపోతే పిల్లలను ఎలా పెంచాలి, పెళ్లిళ్లు ఎలా చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు, మాస్టర్ప్లాన్ను రద్దు చేయాలంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 8గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ముట్టడి, కుటుంబ సభ్యులతో ర్యాలీ వంటి నిరసన వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆయా గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు ఈనెల 19లోపు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డెడ్లైన్ విధించింది. దీంతో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు రాజీనామా లేఖలను రైతు జేఏసీకి అందించారు. -
పరిహారం కోసం రైతు ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి: సింగరేణి ఓపెన్కాస్ట్ ఏర్పాటులో ఉన్న భూమి పోయింది. పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో విసిగివేసారిన ఓ రైతు కలెక్టరేట్లో ప్రజావాణి వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం కలెక్టరేట్ పక్కన ఉన్న ఇల్లందు క్లబ్హౌస్లోని మీటింగ్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో గణపురం మండలం మాధవరావుపల్లికి చెందిన జిట్టబోయిన సాంబయ్య అనే రైతు క్లబ్హౌస్ బయట క్రిమిసంహారక మందు తాగి పడిపోయాడు. అక్కడున్న వారు అతడిని లేపి ఏమైందని అడగ్గా.. తనకు అన్యాయం జరిగిందని, ఎవరూ పట్టించుకోకపోవడంతో పురుగుమందు తాగానని చెప్పాడు. మాధవరావుపల్లిలో సర్వే నంబర్ 318/92లో తనకు ఎకరన్నర భూమిలో 500 టేకు చెట్లు ఉండేవని, 2019లో సింగరేణి సంస్థ ఓపెన్కాస్ట్–3 నిర్మాణంలో భాగంగా ఆ భూమిని సేకరించిందన్నాడు. ఎకరన్నర భూమికి గాను ఎకరాకే పరిహారం వచ్చిందని, మిగిలిన 20 గుంటల పరిహారం ఓ దళారి పేరుపై వచ్చిందని వాపోయాడు. అలాగే, 78 చెట్లకు కూడా పరిహారం రాలేదన్నాడు. నష్టపరిహారం కోసం మూడేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పాడు. గతంలో గణపురం తహసీల్దార్ను ప్రశ్నిస్తే.. విధులకు ఆటంకం కలిగించానని పోలీసులకు ఫిర్యాదు చేశారని, పది రోజులు జైల్లో ఉండి వచ్చానని సాంబయ్య పేర్కొన్నాడు. రైతు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న కలెక్టర్ భవేష్ మిశ్రా వెంటనే సిబ్బందిని పంపి రైతును ఆస్పత్రిలో చేర్పించారు. సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. -
మా భూములకూ పట్టాలు ఇవ్వండి
సాక్షి, మహబూబాబాద్: ‘తాతలు, తండ్రుల కాలం నుంచి అడవి బిడ్డలతో కలసి బతుకుతున్నాం. అడవిలోనే పుట్టాం.. ఇక్కడే పెరిగాం. మేం సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోతే ఎలా? మేము ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలి’అంటూ మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనేతర రైతులు తమ గోడు వినిపించారు. తమకు పట్టాలు ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డేవిడ్కు గురువారం వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో గిరిజనేతరులకు పట్టా లు ఇచ్చేందుకు సాధ్యం కాని నిబంధనలు విధించింది. దీంతో తమకు పట్టాలు వచ్చే అవకాశం లేదని భావించిన గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం ఏజెన్సీ మండలాలకు చెందిన రైతుల ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ పాటించారు. అనంతరం ట్రాక్టర్లు, ఆటోల ద్వారా పెద్ద ఎత్తున గిరిజనేతరులు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే కలెక్టరేట్కు వెళ్తున్న ర్యాలీని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ముఖ్య నాయకులను తమ వాహనాల్లో కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ అదనపు కలెక్టర్ డేవిడ్కు వినతిపత్రం అందజేసేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం తిరిగి వారిని ర్యాలీ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజనులతో సమానంగా తమకు కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పీరయ్య, శ్రీనివాస్రెడ్డి, చల్ల నారాయణరెడ్డి, కొమ్మెనబోయిన వేణు, ఖాసీం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
భూమి పోతోందని.. సెల్ టవర్పై ఉరేసుకున్న రైతు
లింగంపేట (ఎల్లారెడ్డి): చెరువు కింద కాస్త భూమి ఉంది.. తూము నుంచి నీళ్లు వదిలితే ఆ భూమిలో నీళ్లు నిలుస్తాయి.. ఏ పంటా వేయలేని పరిస్థితి.. పైగా ఆ భూమి నుంచే కాల్వ తవ్వేందుకు గ్రామస్తులు నిర్ణయించడంతో ఓ రైతు ఆవేదన చెందాడు. తనకు అన్యాయం జరుగుతోందని, అధికారులు పట్టించుకోవడం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అందరూ చూస్తుండగానే టవర్పై రుమాలుతో ఉరివేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారంలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. చెరువు నీళ్లు నిలుస్తుండటంతో.. మెంగారం గ్రామానికి చెందిన రైతు పుట్ట ఆంజనేయులు (32)కు గ్రామ శివార్లలోని చెరువు ముందు 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది. చెరువు దిగువన అర గుంట భూమి ఉంది. దిగువన ఉన్న పంట భూములకు చెరువు నుంచి తూము ద్వారా నీళ్లు వదులుతుంటారు. అలా నీళ్లు వదిలినప్పుడు పక్కనే ఉన్న ఆంజనేయులు భూమిలో నీళ్లు నిలుస్తాయి. దీనివల్ల కొన్నేళ్లుగా ఆ భూమిలో పంట వేయలేక పోతున్నాడు. ఒకట్రెండు సార్లు పంట వేసినా నీళ్లకు కొట్టుకుపోయి దెబ్బతింది. దీనితో తనకు నష్టపరిహారం చెల్లించాలని, తన పొలం నుంచి నీళ్లు పోకుండా చేయాలని గతంలోనే ఆంజనేయులు అధికారులు, గ్రామస్తులను కోరాడు. దానితో గత ఏడాది రూ.2వేలు నష్టపరిహారంగా ఇచ్చారు. ఇక గత ఏడాది తన పొలం మీదుగా కాల్వ తవ్వడానికి అధికారులు, గ్రామస్తులు ప్రయత్నించగా జేసీబీకి అడ్డునిలిచి ఆపేశాడు. కాల్వ తవ్వుతారని.. ప్రస్తుతం యాసంగి పంటకు నీళ్లు ఇచ్చేందుకు గ్రామ పంచాయతీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. చెరువు తూము దిగువ నుంచి పంట కాల్వ తీయాలని నిర్ణయించిన గ్రామస్తులు.. ఆయకట్టు రైతుల నుంచి ఎకరానికి రూ.500 చొప్పున వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇది తెలిసిన ఆంజనేయులు తన పొలం నుంచి కాల్వ తవ్వుతారని, భూమి తనదికాకుండా పోతుందని ఆందోళన చెందాడు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ‘నాన్నా దిగి రా’ అంటూ పిల్లలు రోదించినా.. రైతు ఆంజనేయులు సెల్ టవర్ ఎక్కిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ మారుతి, ఎస్సై శంకర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని, దిగి రావాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆంజనేయులు భార్య సుజాత కూడా సెల్ టవర్ దిగాలని వేడుకుంది. ఆయన ముగ్గురు పిల్లలు ‘నాన్నా దిగి రా’ అంటూ రోదించినా వినిపించుకోలేదు. సుమారు గంటసేపు సెల్ టవర్పైనే ఉన్న ఆంజనేయులు.. అందరూ చూస్తుండగానే టవర్పై ఇనుప రాడ్కు తన రుమాలును కట్టి ఉరివేసుకున్నాడు. కాసేపటికే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరిశీలించారు. రైతు ఆత్మహత్యకు కారణాలు, ఇతర అంశాలను ఆరా తీశారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా ఇచ్చారు. -
ధరణితోనే సమస్యలు
తుక్కుగూడ: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి యాప్తో రైతులకు భూ సమస్యలు ఎదురవుతున్నాయని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు ‘భూమి’ సునీల్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఏర్పాటు చేసిన భూ న్యాయ శిబిరంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు న్యాయవాదులు, రెవెన్యూ నిపుణులు న్యాయ సలహాలు అందించారు. భూ సమస్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నామని సునీల్ పేర్కొన్నారు. తెలంగాణలో రీసర్వే చేస్తేనే భూసమస్యలు పరిష్కారమవుతాయని, దీనికోసం ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమగ్ర సర్వే చేస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి చెప్పారు. రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించడం కోసమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) ఉపాధ్యక్షుడు జీవన్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పి.నిరూప్ రెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రైతు నాయకులు కోదండరెడ్డి, భూదా న్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిపోతున్న భూసమస్యలు.. కొత్త రెవెన్యూ చట్టంలో లోపాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. 1971 నాటి ఆర్వోఆర్ చట్టం స్థానంలో 2020 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఇంకా బాలారిష్టాలను దాటని పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ విషయంలో కొత్త చట్టంతో మేలు జరిగినా.. అదే సమయంలో భూముల సమస్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చట్టంలో మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని, స్పష్టమైన అధికారాలను కల్పించి రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసినప్పుడే ఈ చట్టం మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొంటున్నారు. కొత్త చట్టం లక్ష్యం ఇదీ.. రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం భూసంబంధిత అంశాల్లో చాలా ప్రధానమైంది. 1971 నుంచి 2020 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉన్న ఈ చట్టానికే రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూముల మ్యుటేషన్, రిజి్రస్టేషన్ ప్రక్రియలను సులభతరం చేయడం.. భూసంబంధ సమస్యలన్నీ పరిష్కరించడం.. రెవెన్యూ పాలనలో పారదర్శకత తీసుకురావడం.. రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న విచక్షణాధికారాలు ఎత్తివేసే విధంగా మార్పులు చేయడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మరి ఏం జరిగింది? ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగంగా జరిగి పాసు పుస్తకాలు త్వరగా చేతికి అందడమే. రిజిస్ట్రేషన్ల తర్వాత గతంలోలా నెలల తరబడి మ్యుటేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు పూర్తిగా కంప్యూటర్లో నిక్షిప్తమవుతోంది. కానీ ఈ చట్టం పరిధిలోకి వచ్చే ధరణి పోర్టల్ కారణంగా సమస్యలు భారీగా పెరిగాయి. 2006లో వచ్చిన కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం 2012–13లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల ప్రకారం ప్రతి గ్రామంలో 50 నుంచి 100 వరకు భూసమస్యలు ఉండగా.. అవి ఇప్పుడు 200 వరకు చేరాయన్నది ఓ అంచనా. సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తే 277 భూసంబంధిత సమస్యల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఉన్న ఆర్డీవో, జేసీ కోర్టులు రద్దు కావడంతో భూసమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇక ధరణి పోర్టల్లో నమోదవుతున్న సమస్యలను పరిష్కరించే అధికారాలు చ ట్టం ప్రకారం కలెక్టర్లకు లేవు. అయినా వారు పరిష్కరిస్తున్నారు. కానీ లక్షలకొద్దీ సమస్యలను 33 మంది కలెక్టర్లు పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇక కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబదీ్ధకరణకు ఎలాంటి నియమం పొందుపరచలేదని, దీంతో దాదాపు 9లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో పడ్డాయని తెలుస్తోంది. ఎన్నో రకాల సమస్యలతో.. ఇక భూయజమాని బయోమెట్రిక్ లేకుండా రికార్డుల్లో మార్పులు జరగవని, కొత్త చట్టం అమలుతో కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ భూయజమానికి తెలియకుండానే రికార్డులు మారిన ఘటనలు అనేకం కనిపించాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బి కింద నమోదు చేసిన సుమారు 10లక్షల ఎకరాల భూముల సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇనాం, పీవోటీ కేసులు, 38(ఈ) కింద రక్షిత కౌలుదారులకిచ్చే సర్టిఫికెట్, ఎల్టీఆర్ (భూబదలాయింపు చట్టం) అధికారాలను ఈ చట్టం తమకు కల్పించలేదని రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. గత చట్టంలో రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికారాలను కొత్త చట్టం ద్వారా ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటోంది. ఇప్పుడేం చేయాలి? కొత్త చట్టం ద్వారా రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి వెంటనే కొన్ని మార్పులు చేయాల్సి ఉందని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. ఆర్వోఆర్ చట్టం కింద రాసుకునే రికార్డు (ధరణి రికార్డు)ను సవరించే అధికారాన్ని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలని.. ఈ అధికారాలు ఇప్పుడున్న అధికారులకు అప్పగించడమా లేక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్వోఆర్ చట్టంలో నియమాన్ని అత్యవసరంగా చేర్చాలని, 1971 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న సెక్షన్ 5(ఏ)ను యథాతథంగా కొత్త చట్టంలోకి సంగ్రహించాలని.. ఈ చట్టం కింద ధరణిలో మార్పులను గ్రామాలకు పంపి సవరించాలని స్పష్టం చేస్తున్నారు. ఆ చట్టాల అనుభవాలను పరిగణనలోని తీసుకోవాలి.. ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు ఆర్వోఆర్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల అమలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్వోఆర్ చట్టం మాత్రమే కాకుండా మిగతా 123 చట్టాలను కూడా మార్చి ఒకే చట్టాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది – భూమి సునీల్కుమార్, భూచట్టాల నిపుణుడు -
భూ సమస్య పరిష్కరించడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం
నర్సింహులపేట: భూ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని, పరిష్కరించడం లేదని ఓ మహిళ ఆత్మ హత్యాయత్నం చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగింది. బాధితురాలు సుంకరి సరిత తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన సుంకరి వెంకనర్సు, కిష్టమ్మలకు కుమారులు సుంకరి లక్ష్మయ్య, నారాయణ, భద్రయ్య, సోమయ్య, సాంబయ్య. వీరికి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 1127, 1128, 1129లో 2.10 ఎకరాల భూమి ఉంది. వాటాల ప్రకారం సుంకరి భద్రయ్య, వెంకటమ్మలకు రావాల్సిన 20 గుంటల భూమిని సుంకరి సుధాకర్, సుంకరి సాంబయ్యలు 10 గుంటల చొప్పున తెలియకుండా రికార్డుల్లో ఎక్కించుకున్నారు. తన తల్లిదండ్రుల భూమిని తన పేరుమీదకు మార్చుకోవాలని సరిత ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతోంది. పట్టించుకోకపోవడంతో విసుగుచెందిన ఆమె.. సోమవారం కార్యాల యానికి వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. అక్కడే ఉన్న సిబ్బంది అమెను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై మంగీలాల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, తహసీల్దార్ వివేక్తో కలిసి భూ సమస్యపై సరితతో మాట్లాడారు. తన తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తెనని, వారు చనిపోవడంతో, ఆ భూమిని తమ పేర ఎక్కించాలని మొరపెట్టుకుంటున్నా వినడం లేదని సరిత తెలిపింది. ఈ విషయంపై తహసీల్దార్ను వివరణ కోరగా, ఈ సమస్య కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
AP: నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక ముందడుగు
సాక్షి, అమరావతి: దీర్ఘకాలంగా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూముల (22–ఏ) సమస్యలను పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఏళ్ల తరబడి పెద్దఎత్తున పేరుకుపోయిన 22 ఏ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా రిటైర్డ్ జిల్లా జడ్జిల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను నియమించాలని నిర్ణయించింది. తొలుత విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటయ్యే ఈ కమిటీలు 22 ఏ దరఖాస్తులను పరిశీలించి క్లియరెన్స్కు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన సిఫారసులు చేస్తాయి. వాటిని బట్టి కలెక్టర్లు ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 22–ఏ భూముల వ్యవహారం సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లకు అధికారాలిచ్చినా.. ఎక్స్ సర్వీస్మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించిన భూములతోపాటు 1954కి ముందు పేదలకు కేటాయించిన భూములు, పలు రకాల కారణాలతో మరికొన్ని భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22 ఏ (నిషేధిత జాబితా) కింద చేర్చారు. ఈ జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్టర్ చేయదు. దీంతో వీటి క్రయవిక్రయాలు సాధ్యం కావడంలేదు. నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని భూ యజమానులు చేసుకుంటున్న దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేరుకుపోతున్నాయి. చిక్కులు, వివాదాల కారణంగా రెవెన్యూ యంత్రాంగం వాటిపై నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడుతోంది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం వీటిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఇందుకోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి కలెక్టర్లకు అధికారాలిచ్చినా 22 ఏ దరఖాస్తుల పరిష్కారంలో సరైన పురోగతి లేదని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. వీటికి సంబంధించి ప్రభుత్వం, సీసీఎల్ఏకి అందే విజ్ఞప్తుల పరిష్కారం ఆశించిన స్థాయిలో జరగడం లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో 22–ఏ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జిల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను నియమించాలని నిర్ణయించారు. తొలుత విశాఖపట్నం (విశాఖ, అనకాపల్లి జిల్లాలకు), విజయవాడ (ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు), తిరుపతి (తిరుపతి, నెల్లూరు జిల్లాలకు) ఈ కమిటీలు ఏర్పాటవుతాయి. రిటైర్డ్ జిల్లా జడ్జి, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, సర్వే, భూమి రికార్డుల శాఖ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్, సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్, సబ్కలెక్టర్/ఆర్డీవో, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్ ఇందులో సభ్యులుగా ఉంటారు. రిటైర్డ్ జడ్జి, ఇతర రిటైర్డ్ అధికారులను ప్రభుత్వమే నియమించి తగిన వేతనాలు చెల్లిస్తుంది. ఈమేరకు కమిటీల ఏర్పాటు, విధివిధానాలపై ప్రభుత్వం జీవో నెంబర్ 681 జారీ చేసింది. కమిటీలు ఏం చేస్తాయంటే... ఈ కమిటీలు 22–ఏకి సంబంధించిన ప్రతి కేసుకు సమయం నిర్దేశించి సంబంధిత అధికారుల సమక్షంలో రికార్డులను పరిశీలిస్తాయి. అన్ని అంశాలు పరిశీలించి దానిపై జిల్లా కలెక్టర్కు కచ్చితమైన సిఫారసు చేయాలి. కలెక్టర్ సంబంధిత దరఖాస్తును సాధారణ ప్రక్రియలో ఆమోదించేలా ఆ సిఫారసు ఉండాలి. ఒకవేళ దానిపై ఏదైనా అభ్యంతరం ఉంటే ప్రభుత్వానికి పూర్తి వివరాలతో కలెక్టర్ నివేదిక పంపాలి. ఈ కేసుల్లో రూ.50 కోట్లకు పైగా విలువైన భూములపై తీసుకున్న నిర్ణయాన్ని సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వానికి తెలియచేయాలి. అయితే అలాంటి కేసుల్లో సైతం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ నిర్ణయం గురించి వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఆ భూములపై జరిగిన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియచేసి నిర్ణయం తీసుకోవాలి. 1908 రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22–ఏ పరిధిలోకి వచ్చే అన్ని కేసులు ఈ కమిటీల పరిధిలోకి వస్తాయి. ఎక్స్ సర్వీస్మెన్, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతోపాటు చుక్కల భూములు, మ్యుటేషన్లు కూడా ఈ కమిటీలు పరిశీలించవచ్చు. లక్షల సంఖ్యలో పేరుకుపోయిన 22–ఏ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. లీగల్, రెవెన్యూ అంశాల కారణంగా పెద్ద ఎత్తున కేసులు పెండింగ్లో ఉండడంతో నిపుణులైన రిటైర్డ్ అధికారులు, ప్రస్తుత అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పరిష్కారానికి నడుం బిగించింది. -
ఠాణా ఆవరణలో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
శాయంపేట: భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఏఎస్సై సమ్మూలాల్ వారిని అడ్డుకున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కోడిమాల లక్ష్మి, మల్లయ్య దంపతులకు సర్వే నం.114/బీలో 1.05 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి మల్లయ్యకు తండ్రి ఓదెలు నుంచి వారసత్వంగా సంక్రమించింది. దీంతో ఆ భూమిని సాగు చేసుకుంటూ దంపతులు జీవనం సాగిస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన బండ నారాయణరెడ్డి.. ఆ భూమి తనకు ఇస్తే సర్వే నం.507/బీలోని చిట్టిరెడ్డి రాజిరెడ్డికి చెందిన 2.12 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పి.. జనవరి 1990లో రాజిరెడ్డి భూమి విక్రయించినట్లుగా..అందుకు బయానా రూ.2వేలు తీసుకున్నట్లు వీరికి కాగితం రాసిచ్చాడు. దీంతో వీరు రెండెకరాల 12 గుంటల భూమిలో కాస్తులో ఉన్నారు. అయితే రాజిరెడ్డి ఆ భూమిని గ్రామంలోని అన్నబోయిన రఘుపతికి విక్రయించాడని బాధితులకు తెలియడంతో పలుమార్లు పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లారు. నారాయణరెడ్డి ఎకరం ఐదు గుంటల భూమి తీసుకొని ఇచ్చిన రెండెకరాల 12 గుంటల భూమిని రాజిరెడ్డి, రఘుపతికి అప్పగించడంతో ఉన్న భూమి కోల్పోయి వృద్ధాప్యంలో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఇటీవల మార్కెట్లో సర్పంచ్ రాజిరెడ్డిని దుర్భాషలాడారు. దీంతో సర్పంచ్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై బాధితులు తమకు సర్పంచ్ అన్యాయం చేస్తున్నారని విన్నవించుకున్నారు. భూమిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని, తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ ఆదివారం లక్ష్మి, మల్లయ్యలు పోలీస్స్టేషన్కు చేరుకొని ఆవరణలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే ఏఎస్సై అడ్డుకొని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. దీనిపై ఎస్సై ఇమ్మడి వీరభద్రరావును వివరణ కోరగా.. సర్పంచ్ రాజిరెడ్డి తనను లక్ష్మి, మల్లయ్య తిట్టారని ఫిర్యాదు చేయడంతో వారిని స్టేషన్కు పిలిపించామని తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నామని వివరించారు. -
పల్లెపల్లెకు వెళ్తేనే పరిష్కారం.. చేతిరాత పహాణీలతో ధరణిని ఆధునీకరించాలి
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినా భూ సమస్యలు తీరకపోవడంతో సర్కారు సహా అన్ని రాజకీయ పక్షాలు మళ్లీ భూసర్వే రికార్డులు, సమస్యలపై దృష్టి సారించాయి. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 15 నుంచి ప్రభుత్వం మండల స్థాయి రెవెన్యూ సదస్సులకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యాయ శిబిరాలతో భూ సమస్యలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి గ్రామీణ న్యాయ పీఠం ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్న భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్ర: మళ్లీ రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారమవుతాయా? జ: భూ సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించాలి. ఈ సదస్సులు జరగడానికంటే ముందే ఆ ఊరిలోని భూ సమస్యలను గుర్తించాలి. ఇందుకోసం ఆ గ్రామ యువతకు తర్ఫీదు ఇచ్చి వారిని ఇందులో భాగస్వాములను చేయాలి. గ్రామంలోనే రెవెన్యూ కోర్టు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి. చేతిరాతతో పహాణి రాసి ఆ తరువాత ధరణి రికార్డును సవరించాలి. ప్రతి గ్రామానికి ఒక బృందం ఏర్పాటు చేసి వారికి కనీసం 3–6 నెలల గడువు ఇవ్వాలి. ప్ర: కొత్త రెవెన్యూ చట్టం భూ యాజమాన్య హక్కులకు పూర్తి హామీ ఇస్తుందా? జ: భూ రికార్డుల్లోని వివరాలకు ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉంటుంది. రికార్డుల్లో పేరు ఉన్నా భూ యజమాని హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వమే జరిమానా కడుతుంది. అలాంటి వ్యవస్థను తెస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు. కానీ ఇంకా అలాంటి చట్టమేదీరాలేదు. భూ హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ వ్యవస్థను తెచ్చే ప్రయత్నాలు ఈ దేశంలో మూడు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఒకప్పటి ఎన్ఎల్ఆర్ఎంపీ, ఇప్పటి డీఐఎల్ఆర్ఎం పథకం అందుకు ఉద్దేశించిందే. టైటిల్ గ్యారెంటీ చట్టం ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీని ఆధారంగా ఇప్పటికే రాజస్తాన్, ఏపీ చట్టాలు రూపొందించుకున్నాయి. టైటిల్ గ్యారెంటీ చట్టం అమల్లోకి వస్తే భూములన్నింటికీ ఒకే రికార్డు ఉంటుంది. ఆ రికార్డులోని వివరాలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది. యజమానికి నష్టం జరిగితే నష్టపరిహారం అందుతుంది. తెలంగాణ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఆ భరోసా ఇవ్వదు. ప్ర: భూ సమస్యలను ‘ధరణి’ ఏ మేరకు పరిష్కరించగలిగింది? జ: భూమి రికార్డులన్నీ కంప్యూటర్లలోకి నిక్షిప్తమయ్యాయి. అందరికీ అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగవంతం, సులభతరం అయ్యాయి. కానీ భూ సమస్యల పరిష్కారం క్లిష్టతరంగా మారింది. ధరణిలో తప్పులను సరి చేయించుకోవడం రైతులకు చాలా కష్టంగా ఉంది. ధరణిలో వివరాలను సరిచేయడానికి పెట్టుకున్న వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే రికార్డు (ధరణి)లో తప్పుల సవరణ కోసం రూ. వెయ్యి ఫీజు తీసుకోవడం పేద రైతులకు భారంగా మారింది. అనేక సమస్యలకు ఆప్షన్లు ఇవ్వనేలేదు. ప్ర: రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుతో ఏ మేరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయి? జ: భూ సమస్యల పరిష్కారాల కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో తాత్కాలిక జిల్లా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసి పాత కేసులను పరిష్కరించింది. కొత్త కేసులన్నీ సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ఓఆర్ చట్టం కింద భూ రికార్డులను సవరించే అధికారం మాత్రమే రెవెన్యూ కోర్టుల నుంచి తీసివేశారు. కానీ అసైన్డ్ భూముల అన్యాక్రాంతం, ఇనాం, పీటీ భూముల సమస్యలు, ఇతర భూ వివాదాలు ఇంకా రెవెన్యూ కోర్టుల పరిధిలోనే ఉన్నాయి. అయినా ఈ అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల రెవెన్యూ యంత్రాంగం భూమి సమస్యలను పరిష్కరించకుండా కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు. ధరణిలోని సమస్యలను పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కొత్త వ్యవస్థ భూ సమస్యల పరిష్కారాన్ని రైతులకు భారంగా మార్చింది. సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. భూ వివాదాలు పరిష్కారం కావాలంటే జిల్లాకొక ట్రిబునల్ను ఏర్పాటు చెయ్యాలి. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలు పరిష్కారమయ్యేలా భూ వివాద పరిష్కర చట్టాన్ని రూపొందించాలి. ప్ర: భూమి హక్కులకు చిక్కులు లేకుండా చూడాలంటే ఏం చేయాలి? జ: భూమి హద్దులకు, హక్కులకు స్పష్టత, భద్రత ఇచ్చే వ్యవస్థ కావాలి. భూ చట్టాలన్నీ కలిపి ఒక రెవెన్యూ కోడ్ను రూపొందించాలి. సమస్యల పరిష్కారానికి జిలాకొక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి. ఒక్కసారన్నా చేతిరాత పహాణీ రాసి దాని ఆధారంగా ధరణిని సవరించాలి. గ్రామ రెవెన్యూ కోర్టులను నిర్వహించి భూ వివాదాలు పరిష్కరించాలి. పారాలీగల్ వ్యవస్థను మళ్లీ తేవాలి. భూముల సర్వే జరగాలి. మొత్తంగా తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో అమలు జరగాలి. ప్రజల భూమి ఆకాంక్షలు నెరవేరకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదు. భూ హక్కుల చిక్కులు లేని తెలంగాణ సాకారం కావాలంటే భూమి ఎజెండా అందరి ఎజెండా కావాలి. -
భూ తగాదా.. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు.. చివరికి
రాయగడ(భువనేశ్వర్): పోలీసులు తనకు న్యాయం చేయడం లేదనే మనస్థాపంతో ఒక యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చందిలి పోలీస్స్టేషన్ పరిధిలోని ఒంటామడ గ్రామానికి చెందిన తిరుపతి జరువా గ్రామంలోని శివ మందిరం దగ్గరలో ఉండే హోమశాల పైకప్పుకు తాడుతో ఉరి వేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తన భర్త సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య చుట్టుపక్కల వెతికింది. ఈ సమయంలో తన భర్త ఉరికి వేలాడుతూ కనిపించడంతో బోరుమని విలపించింది. చుట్టుపక్కల వారు అక్కడికు వచ్చి పొలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో ఒక భూ తగాదాకు సంబంధించి కొంతమంది వ్యక్తులతో తిరుపతికి వైరం కొనసాగుతోంది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ చందిలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు న్యాయ చేయడం లేదని, ప్రత్యర్థులు తనను నిత్యం వేధిస్తుండడంతో గత్యంతరం లేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్లో రాశాడు. విషయం తెలుసుకున్న పొలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి అనుమానుతులుగా భావిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్డీపీవో దేవజఓతి దాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చదవండి: Road Accident Today: సత్యసాయి జిల్లా: ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం -
బతికున్న మనిషి చనిపోయినట్లు నమ్మించి..
తిరువళ్లూరు(చెన్నై): బతికి ఉన్న వృద్ధురాలు మృతి చెందినట్లు నమ్మించి 30 ఎకరాల ఆస్తిని కాజేసిన వారిపై చర్యలు తీసుకుని, తమ భూములను అప్పగించాలని ఒకే కుటుంబానికి చెందిన బాధితులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం వెలుగుచూసింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పుదువల్లూరు నయపాక్కం గ్రామానికి చెందిన పచ్చయప్పన్కు అదే గ్రామంలో 30 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. గత 40 ఏళ్ల క్రితం కుటుంబ తగాదాల కారణంగా పుదువల్లూరు నయపాక్కం నుంచి పాక్కంకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల క్రితం పచ్చయప్పన్ మృతి చెందాడు. అతని కుమారులు కృష్ణన్, రాజన్ కలిసి తహసీల్దార్ను సంప్రదించారు. అయితే అప్పటికే పట్టాభూమితో సంబంధం లేని ముగ్గురు వ్యక్తుల పేరిట మారినట్లు తెలిసి షాక్కు గురయ్యారు. పచ్చయప్పన్ భార్య మృతి చెందినట్లు తప్పుడు సమాచారం ఇచ్చి డెత్ సర్టిఫికెట్తో పాటు మొత్తం రికార్డులను మార్చేసి కబ్జా చేసినట్లు నిర్ధారించారు. దీంతో పచ్చయప్పన్ భార్య సుశీల, ఇద్దరు కొడుకులు, ఏడుగురు కుమార్తెలు కలిసి తిరువళ్లూరు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్తో సహా పలువురు ఉన్నతాధికారులకు గత ఏడేళ్లుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. న్యాయం జరగకపోవడంతో ఆవేదన చెందిన వారు గురువారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. చదవండి: భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే? -
మా హామీ!
చిత్తూరు కలెక్టరేట్: ‘భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. పచ్చని గ్రామాల మధ్య కక్షలు, కార్పణ్యాలకు తావులేకుండా చూడాలి. అన్నదాతల మధ్య అనుబంధాన్ని నెలకొల్పాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసి వారి భూములకు సర్వహక్కులు కల్పించాలి. ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వాలి. రికార్డులను సైతం సమూలంగా మార్పు చేయాలి’.. అన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న భూ రక్ష– శాశ్వత భూ హక్కు పథకానికి శ్రీకారం చుట్టింది. వందేళ్ల తర్వాత దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా సమగ్ర భూ రీ సర్వేని ప్రారంభించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటి దశ సర్వేను దిగ్విజయంగా పూర్తి చేసి.. రెండో దశ సర్వేకు శ్రీకారం చుట్టింది. 27 రెవెన్యూ గ్రామాల్లో రెండో దశ ఉమ్మడి జిల్లాలో చంద్రగిరి, గుడిపాల, జీడీనెల్లూరు, వాల్మీకిపురం మండలాల్లోని నరసింగాపురం, ముత్తుకూరుపల్లె, అగరమంగళం, జమ్మాలపల్లెల్లో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద భూ రీసర్వే పూర్తిచేశారు. ప్రస్తుతం రెండో దశలో 27 రెవెన్యూ గ్రామాల్లో సర్వే ప్రారంభించగా, ఇప్పటికి ఆరు గ్రామాల్లో పూర్తిచేశారు. రోవర్లకు సంబంధించి జిల్లాలో 7 కార్స్బేస్ స్టేషన్లు అనుసంధానం చేశారు. 2023 డిసెంబర్ నాటికి సచివాలయాల్లో రికార్డులు, సేవలు అందుబాటులోకి రావడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నారు. మొదటి దశలో పూర్తి చేసిన భూ రికార్డులను గత జనవరి 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అంకితం చేశారు. అత్యాధునిక సాంకేతికత భూ రీ సర్వేకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్కోడ్తో కూడిన భూ కమత పటాన్ని జారీచేస్తారు. గ్రామ స్థాయిలో భూ రికార్డులను క్రోడీకరించి, మ్యాప్లు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు గ్రామాల్లోనే అందుబాటులో ఉంచనున్నారు. మీ భూమి మా హామీ (మహాయజ్ఞాన్ని) చేపట్టి భూములు, ఆస్తుల రక్షణకు చర్యలు చేపడుతున్నారు. ప్రయోజనం ఇలా... శాశ్వత భూహక్కు: సింగిల్ విండో పద్ధతిలో ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీచేస్తారు. భూ లావాదేవీలు, బ్యాంకు రుణాలు సులభం అవుతాయి. భూ రక్ష : ప్రతి భూ కమతానికి ఉచితంగా భూ రక్ష హద్దు రాళ్లు వేస్తారు. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు తావుండదు. దళారీ వ్యవస్థ కనుమరుగు అవుతుంది. లంచాలకు చోటుఉండదు. భద్రత : నకిలీ పత్రాలకు ఇక తావు ఉండదు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులకు వీలుపడదు. అవసరమైన చోట సబ్ డివిజన్ మార్పులు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు. పారదర్శకత : సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగస్వామ్యం, మండల మొబైల్ మేజిస్ట్రేట్ బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కారం, తొలిసారిగా గ్రామ కంఠాల్లోని స్థిరాస్తులు సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. గ్రామాల చెంతకే సేవలు : ఇకపై గ్రామ సర్వేయర్ల ద్వారానే ఎఫ్లైన్ దరఖాస్తులు 15 రోజుల్లో, పట్టా, సబ్డివిజన్ దరఖాస్తులు 30 రోజుల్లో పరిష్కరించనున్నారు.గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా పొందవచ్చు. గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఇక తీరినట్లే. రీ సర్వే బృహత్తర పథకం జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష పథకం రాష్ట్ర చరిత్రలో వందేళ్ల తర్వాత చేపట్టిన ఒక బృహత్తర పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. రైతులకు శాశ్వత భూ హక్కుతో పాటు వారి భూములకు రక్షణ కల్పించే పథకం ఇది. ఈ సర్వేని మూడు దశల్లో 1/3 వంతు గ్రామాల్లో నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం. – హరినారాయణన్, కలెక్టర్ నాలుగు బృందాల ద్వారా సర్వే గుడిపాల మండలం, పాపసముద్రం గ్రామంలో నాలుగు బృందాలు రీ సర్వే చేస్తున్నాయి. రోజుకు కనీసం ఒక బృందం 20 ఎకరాలు రీ సర్వే చేయాల్సి ఉంటుంది. సరిహద్దు రాళ్లు నాటడం, వాటిలో గ్రామ సరిహద్దులు తెలిపే విధంగా, గ్రామాల కూడలి అయితే సరిహద్దు తెలిపే విధంగా మూడు సరిహద్దు రాళ్లు నాటి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ భూమి, పట్టా భూమి, కాలువలు, చెరువులు గుర్తింపు చేసి సంబం«ధిత శాఖకు సమాచారం అందిస్తున్నాం. – కిరణ్కుమార్, సర్వేయర్, పాపసముద్రం, గుడిపాల మండలం. -
AP: ఎక్కడికక్కడే పరిష్కారం
► 2023 జూలై ఆఖరుకు 5,200 గ్రామాల్లో, 2023 ఆగస్టు ఆఖరుకు 5,700 గ్రామాల్లో, 2023 సెప్టెంబరు ఆఖరుకు 6,460 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, క్లియర్ టైటిల్స్ ఇచ్చేలా కార్యాచరణ పూర్తి చేశాం. ► సచివాలయాల వారీగా భూ వివరాల అప్డేషన్ వల్ల గతంలో వెబ్ల్యాండ్ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. – సీఎంతో అధికారులు సాక్షి, అమరావతి: భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనివల్ల స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయన్నారు. భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చే నాటికి దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో న్యాయ శాఖకు కూడా భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో రాష్ట్రం.. దేశానికి ఒక దిక్సూచిగా నిలవాలని స్పష్టం చేశారు. అందుకే సీనియర్ అధికారులను, సీనియర్ మంత్రులను ఇందులో భాగస్వాములు చేశామని తెలిపారు. గతంలో వెబ్ ల్యాండ్లో ఉన్న సమస్యలను అత్యంత పారదర్శక పద్ధతుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకు అనుసరించాల్సిన విధానాలు, ఎస్ఓపీలతో రోడ్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు. రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, టాంపర్ చేయలేని విధంగా చేయాలని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్ రికార్డులు కూడా తయారు చేయాలని చెప్పారు. ఈ ఫిజికల్ డాక్యుమెంట్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. సబ్ డివిజన్ కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్నారు. ఎక్కడా అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా ఈ వ్యవస్థ నడవాలని, ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలన్నారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూ సర్వే కోసం 154 డ్రోన్ల వినియోగం ► సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించారు. డ్రోన్ పనితీరు గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏప్రిల్ 5 నాటికి భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమై ఉంటాయన్నారు. ► మరింత వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కొనుగోలు చేస్తున్నామని, మొత్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 1,441 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందన్నారు. ► వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్ సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నామని, రెవిన్యూ విలేజ్ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సర్వే ఫలితాలు పూర్తిగా అందేలా అదే సమయంలో రికార్డుల స్వఛ్చీకరణ ఉండేలా చూస్తున్నామన్నారు. ► వెబ్ ల్యాండ్ అప్డేషన్, గ్రామ ల్యాండ్ రిజిస్టర్ అప్డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్, దీంతోపాటు జగనన్న భూ హక్కు పత్రం ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. సచివాలయాల వారీగా భూ వివరాల అప్డేషన్ ► సచివాలయాల వారీగా భూ వివరాల అప్డేషన్ వల్ల గతంలో వెబ్ల్యాండ్ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. 5,200 గ్రామాల్లో 2023 జూలై ఆఖరుకు, 5,700 గ్రామాల్లో 2023 ఆగస్టు ఆఖరుకు, 6,460 గ్రామాల్లో 2023 సెప్టెంబరు ఆఖరుకు సర్వే పూర్తి చేసి, క్లియర్ టైటిల్స్ ఇచ్చేలా కార్యాచరణ పూర్తిచేశామన్నారు. ► ఓఆర్ఐ (ఆర్థోరెక్టిఫైడ్ రాడార్ ఇమేజెస్) చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబర్ ఆఖరుకు, రెండో విడత గ్రామాల్లో డిసెంబర్ ఆఖరుకు, మూడో విడత గ్రామాల్లో జనవరి ఆఖరుకు పూర్తవుతాయని చెప్పారు. ► సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి.సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రెవెన్యూ శాఖ కమిషనర్ సిద్దార్ధ జైన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ధరణి సమస్యలపై కాంగ్రెస్ పోరాటం
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ధరణి బాధితులకు అండగా ‘భూపరిరక్షణ ఉద్యమం’పేరుతో వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించనుంది. మండల కేంద్రాలను వేదికగా చేసుకుని ధరణి బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించనుంది. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో జరిగిన ధరణి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి బి.మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కిసాన్సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్, ధరణి కమిటీ సభ్యులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, నాగరిగారి ప్రీతమ్, దయాసాగర్, రామ్మోహన్రెడ్డిలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాసోజు శ్రావణ్ మాట్లాడారు. బిచ్చగాళ్లను చేశారు: శ్రావణ్ ధరణి పోర్టల్ కారణంగా భూయజమానులు బిచ్చగాళ్లుగా మారారని, తమ భూ రికార్డులు పట్టుకుని తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని శ్రావణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే ప్రధాని, రాష్ట్రపతిలను కలుస్తామని చెప్పారు. పెట్టుబడిదారులకు అప్పగించే కుట్ర: దయాకర్ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ పేదలకు అసైన్ చేస్తే, వాటిని అన్యాక్రాంతం చేస్తున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. భూములను పెట్టుబడిదారులకు కట్టబెట్టాలన్న కుట్రను అడ్డుకుంటామన్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తోందని బెల్లయ్య నాయక్ విమర్శించారు. -
దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దీర్ఘకాలిక భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏళ్ల తరబడి పరి ష్కారం కాకుండా పెండింగ్లో పడిపోయిన సమస్యల వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో సమస్యల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గ్రామం, మండలం, సర్వే నంబర్, భూ విస్తీర్ణం, సమస్య ఏంటి, పరిష్కారం ఎలా చేయాలి తదితర వివరాలతో నివేదికలు పంపాలని సూచించారు. దీంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లు ఈ అంశంపై దృష్టి పెట్టి ప్రభుత్వం అడిగిన ఫార్మాట్లో నివేదికలను కలెక్టరేట్లకు పంపినట్టు సమాచారం. ఈ నివేదికల్లో పలు ఆసక్తికర భూ సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలు స్తోంది. అయితే వీటిల్లో అనేక సమస్యల పరిష్కారం అంత సులభంగా అయ్యే పని కాదని, భూ సంబంధిత చట్టాలు మార్చాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. చట్టాలు మారిస్తేనే పరిష్కారం దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంపై రెవెన్యూ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సమస్యలు పరి ష్కారం కావాలంటే చట్టాలు మార్చాల్సిం దేనని అంటున్నాయి. గత 20–30 ఏళ్లుగా రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ భూముల్లో పేద రైతులు సాగు చేసుకుంటున్నారని, వారికి ఆ ప్రభుత్వ భూమిని అధికారికంగా కేటాయించేందుకు రాష్ట్రంలో అమల్లో ఉన్న భూ చట్టాలు అనుమతించవని అంటున్నారు. అదే విధంగా జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల లోపు భూములను అసైన్ చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయని, ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఈ సమస్య మరింత జఠిలం అయిందని పేర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అసైన్డ్ చట్టంలో మార్పులు చేయాలని అభిప్రాయపడుతున్నాయి. సమరయోధుల భూములూ చిక్కుముడులే.. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన భూములపై జరిగిన క్రయవిక్రయ లావాదేవీల పరిష్కారం కూడా అంత సులభం కాదని తెలుస్తోంది. వాస్తవానికి స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను పదేళ్ల తర్వాత నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకుని అమ్ముకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే ఎలాంటి ఎన్వోసీలు లేకుండానే చాలాచోట్ల సబ్ రిజిస్ట్రార్లు ఈ భూములను నిర్దిష్ట గడువు తర్వాత ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేశారు. సేల్డీడ్లు కూడా అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ భూములన్నీ ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూములుగా కనబడుతున్నాయి. ఈ భూములకు ఎన్వోసీని కేవలం లబ్ధిదారుడైన స్వాతంత్య్ర సమరయోధుడు లేదా మాజీ సైనికుడి పేరిట ఇచ్చేందుకు మాత్రమే చట్టాలు అనుమతిస్తాయి. అందువల్ల ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ప్రజోపయోగ కార్యక్రమాల నిమిత్తం సేకరించిన పట్టా భూముల విస్తీర్ణాన్ని ఎడాపెడా నమోదు చేయడంతో చాలాచోట్ల సేకరించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణం ప్రభుత్వ ఖాతాలో జమ అయింది. ఇప్పుడు ఆ భూమిని పట్టాదారుకు ఇవ్వాలంటే ప్రభుత్వ భూమిని ఇతరులకు బదలాయించేందుకు అనుమతి ఉండదు. ఇలాంటి సమస్యలన్నీ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, వీటిని తీర్చాలంటే చట్టాలు మార్చాలనేది రెవెన్యూ వర్గాల అభిప్రాయం. సాదా బైనామాల సంక్లిష్టత భూ సంబంధిత సమస్యల్లో ప్రధానమైనది సాదా బైనామాలు. తెల్ల కాగితాల ద్వారా జరిగిన క్రయ విక్రయాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనేకసార్లు దరఖాస్తులు స్వీకరించింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో తహశీల్దార్లు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదే విధంగా ధరణి పోర్టల్లో కొత్త సర్వే నంబర్ల నమోదు, పట్టాదారు పేరు మార్పు, విస్తీర్ణంలో తేడాల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. -
ధరణి దిద్దుబాట! సమస్యల పరిష్కారానికి రంగం సిద్ధం..!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. పట్టాదారుల పేర్లు తప్పుగా నమోదవడం నుంచి నిషేధిత జాబితాల దాకా ఇబ్బందులను సరిచేసేందుకు ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం కీలక సిఫార్సులు చేసింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలోనే హరీశ్తోపాటు సబ్కమిటీ సభ్యులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్లు ఈ మేరకు నివేదికను సమర్పించారని.. సిఫార్సులపై దాదాపు నాలుగు గంటల పాటు చర్చించారని సమాచారం. ఈ సందర్భంగా రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న 20 సమస్యల పరిష్కారానికి గాను ఏడు కొత్త మాడ్యూళ్ల ఏర్పాటును సబ్ కమిటీ ప్రతిపాదించింది. విస్తృత చర్చల్లో వచ్చిన సూచనల మేరకు.. క్రెడాయ్, ట్రెడా, ట్రెసా లాంటి సంఘాలు, సంస్థలతో జరిపిన చర్చల్లో వచ్చిన సూచనలతోపాటు ప్రజలు, భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులను సబ్కమిటీ పరిశీలించింది. వాటికి అనుగుణంగా ధరణి పోర్టల్ను సరళంగా మార్చేలా, సమస్యలను సులభంగా పరిష్కరించేలా సిఫార్సులను చేసింది. ‘ధరణి’లో ప్రధాన సమస్యలు.. పరిష్కారాలివీ.. కేబినెట్ సబ్కమిటీ ధరణి పోర్టల్లో ఎదురవుతున్న వందలాది సమస్యలపై విస్తృతంగా చర్చించింది. మూడు సార్లు సమావేశమైన ఈ కమిటీ.. సీఎస్ సోమేశ్కుమార్తోపాటు కమిటీ కన్వీనర్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి తదితరుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు నివేదికలో ప్రధాన సమస్యలను, వాటికి తగిన పరిష్కారాలను చేర్చింది. సబ్కమిటీ నివేదిక ప్రకారం.. – చాలాచోట్ల పట్టాదారు పేరులో అక్షర దోషాలు, ఇతర తప్పులు నమోదయ్యాయి. ఇలాంటి వాటిని సరిచేసేందుకు ధరణి పోర్టల్లో ఒక కొత్త మాడ్యూల్ను అందుబాటులోకి తేవాలని.. ఈ ఫిర్యాదుల స్వీకరణకు సమయమిచ్చి తప్పులను ఆన్లైన్లో కలెక్టర్ల ద్వారా సరిచేయించాలని ప్రతిపాదించింది. – కొన్నిచోట్ల పట్టా భూములు లావణి భూములుగా, మరికొన్ని చోట్ల భూదాన్, దేవాదాయ భూములుగా ధరణిలో పేర్కొన్నారు. వీటిని సరిచేసేందుకు కూడా కొత్త మాడ్యూల్ ఏర్పాటు చేయాల్సి ఉందని సబ్కమిటీ సూచించింది. – పట్టాభూములు కూడా నిషేధిత జాబితాలో నమోదవడం ధరణిలో మరో ముఖ్యమైన సమస్య. అలా పొరపాటుగా నమోదైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడానికీ ప్రత్యేక మాడ్యూల్ అవసరమని సబ్కమిటీ తెలిపింది. – మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యకు కూడా సబ్కమిటీ పరిష్కారాన్ని ప్రతిపాదించింది. సబ్కమిటీ గుర్తించిన ప్రకారం.. ఈ ఒక్క అంశంపైనే 35వేల వరకు ఫిర్యాదులు ఉన్నాయి. అంటే చాలాచోట్ల సర్వే నంబర్లు, వాటి సబ్ డివిజన్లు ధరణి పోర్టల్లో కనిపించడం లేదు. ధరణి పోర్టల్ అప్గ్రెడేషన్ సమయానికి.. ఆ సర్వే నంబర్లకు సంబంధించిన పాస్ పుస్తకాలను రైతులకు ఇవ్వకపోవడంతో పోర్టల్లో నమోదు కాలేదు. దీనికి కూడా సబ్కమిటీ ప్రత్యేక మాడ్యూల్ను ప్రతిపాదించింది. – ఇప్పటివరకు ధరణి పోర్టల్లో కొనుగోలు/అమ్మకం కోసం ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతిస్తున్నారు. అలా కాకుండా.. ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మంది కొనుగోలు/అమ్మకం దారులకు అనుమతి ఇచ్చేలా పోర్టల్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడంతోపాటు ప్రత్యేక మాడ్యూల్ను కూడా రూపొందించాలని సబ్కమిటీ సూచించింది. – ఎన్నారైల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు.. భూక్రయ, విక్రయ లావాదేవీల సమయంలో వారు నియమించుకున్న ప్రతినిధిని ‘స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ)’గా గుర్తించేందుకు రిజిస్ట్రేషన్ల చట్టానికి అనుగుణంగా మార్పులు చేయాలని సబ్ కమిటీ పేర్కొంది. – ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ), ప్రొటెక్టెడ్ టెనెంట్స్ సర్టిఫికెట్ (పీటీసీ)లను జారీ చేసేందుకు ప్రత్యేక మాడ్యూల్ను అభివృద్ధి చేసి కలెక్టర్ల ద్వారా జారీ చేయించాలని ప్రతిపాదించింది. – భూవిస్తీర్ణంలో నమోదైన తప్పులను కూడా సరిచేసేందుకు ఓ మాడ్యూల్ రూపొందించాలని సబ్కమిటీ అభిప్రాయపడింది. ఈ విషయంలో 16 వేల వరకు ఫిర్యాదులు వచ్చాయని.. పాత రికార్డులను పరిశీలించి తప్పులను సరిచేయాలని సూచించింది. ఒకవేళ హద్దుల్లోని పట్టాదారుల భూములను కూడా సర్వే చేయాల్సి వస్తే... రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేటలలో అమలవుతున్న పైలట్ ప్రాజెక్టును పరిశీలించి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ ప్రతిపాదించింది. సబ్కమిటీ చేసిన ఇతర సూచనలివీ.. – ధరణి పోర్టల్పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం, తగిన అవగాహన కల్పించడం కోసం జిల్లా స్థాయిలో ధరణి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలి. – ధరణి పోర్టల్ను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇవ్వాలి. జడ్పీ, మున్సిపల్ సమావేశాలకు జిల్లా కలెక్టర్లు హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలి. – ఏజెన్సీ ప్రాంతాల్లోని భూముల వారసత్వ మార్పునకు కార్యాచరణ రూపొందించాలి. ధరణికి ముందు జరిగిన లావాదేవీలను తగిన కారణాలతో తిరస్కరించేందుకు వీలుగా మాడ్యూల్లో మార్పులు చేర్పులు చేయాలి. – హైకోర్టులో దాఖలైన మూడు రిట్ పిటిషన్లను అధ్యయనం చేయాలి. సాఫ్ట్వేర్ సమస్యల పరిష్కారానికి నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలి. ధరణిలో పరిష్కారం కోసం దరఖాస్తులు సమర్పించేటప్పుడు నిర్దేశిత ఫీజు వసూలు చేయాలి. – దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తీసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. వాటిని పరిశీలించి కలెక్టర్ జారీచేసే ఉత్తర్వులను పోర్టల్లో పొందుపరిచేలా డేటా మేనేజ్మెంట్ మాడ్యూల్ను అందుబాటులోకి తేవాలి. -
అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి..
సిరిసిల్లక్రైం/సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రంలోని రెండో బైపాస్రోడ్డులో సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడు గ్రామానికి చెందిన వంగ వీరయ్య(52) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 19 గుంటల భూమి పంచాయితీ తమ కుటుంబ పెద్ద దిక్కును బలి తీసుకుందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. వివాదానికి కారణాలు వివాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులు వివరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడు ఎల్లమ్మ ఆలయం ఎదురుగా తెట్టకుంట శివారులోని సర్వేనంబర్ 51/2లో 19 గుంటల స్థలాన్ని ఆరేళ్ల క్రితం వంగ వీరయ్య, వంగ హన్మండ్లు కొనుగోలు చేశారు. దీన్ని ఓర్వలేని వారి బంధువులు ఆ భూమి గౌడ కులస్తులకు చెందితే బాగుంటుందని ఇద్దరిపై పంచాయితీకి ఉసిగొల్పారు. ఈ విషయమై సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ అనిల్కుమార్ ఇరువర్గాలను పిలిచి అడుగగా, పంచాయితీ నిర్వహించుకుని సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు పంచాయితీ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఆదివారం రాత్రి పంచాయితీ పెద్దలను పిలవడానికి వీరయ్య ఒకవైపు, హన్మండ్లు మరోవైపు వెళ్లారు. పెద్దలను కలిసిన వీరయ్య ఇంటికి వస్తున్నానని కుటుంబీకుల్లో ఒకరికి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాడు. తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు. ఉదయం సిరిసిల్ల రెండో బైపాస్లో వీరయ్య మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య చేశారని ఆరోపణలు భూమి విషయంలో తగాదాలను మనసులో పెట్టుకుని వీరయ్యను హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బైక్ నుంచి పడితే కేవలం తల మాత్రమే ఎలా పగులుతుందన్న అనుమానాలున్నాయి. అంతేకాకుండా మృతుడి మర్మాంగాలపై తీవ్రంగా కొట్టారని మృతదేహాన్ని చూసిన స్థానికుల్లో కొందరు ఆరోపించారు. పంచాయితీ రోజుకు ముందు కొన్ని గంటల వ్యవధిలో ఎవరో కావాలని హత్యచేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం వీరయ్యకు భార్య రేణుక, ముగ్గురు కూతుళ్లు శ్రావణి, ప్రవళిక, మానస, కుమారుడు ప్రణయ్ ఉన్నారు. పెద్దమ్మాయికి వివాహం జరిగింది. మిగతావారు చదువుకుంటున్నారు. కల్లుగీత కార్మికుడిగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో ఇంటి పెద్ద మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. న్యాయం చేయాలని వేడుకోలు తమ కుటుంబ పెద్దను చంపిన వ్యక్తులను పట్టుకుని న్యాయం చేయాలని వీరయ్య భార్య అతడి పిల్లలు టౌన్ సీఐ అనిల్కుమార్ను వేడుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, కేసును అనుమానాస్పదంగా భావించి 174 సెక్షన్లో నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు హత్యగా 30 శాతం తెలిపినా మర్డర్ కేసుగా అల్టర్ చేస్తానని హామీ ఇచ్చారు. హత్య అని తేలితే ఎంత పెద్ద మనుషులున్నా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చదవండి: Balanagar: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు -
సర్వే నివేదిక వచ్చాక చర్యలు
వెల్దుర్తి (తూప్రాన్): జమునా హేచరీస్ భూ వ్యవహారంపై సర్వేతుది నివేదిక వచి్చన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. మాజీ మంత్రి ఈటల కుటుంబీకులకు సంబంధించి మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట శివారుల్లో కొనసాగుతున్న భూముల సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో సర్వే పనులకు సంబంధించి వివరాలు వెల్లడించారు. అచ్చంపేట, హకీంపేట గ్రామాల దళితులు, బలహీన వర్గాల వారు తమ భూములను కొందరు కబ్జాచేసి, పాలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని గత ఏప్రిల్లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే అధికారులు విచారణ చేపట్టి ప్రాథమిక నివేదిక రూపొందించారని కలెక్టర్ తెలిపారు. అయితే ప్రాథమిక నివేదికకు వ్యతిరేకంగా జమునా హేచరీస్ హైకోర్టులో పిటిషన్ వేయగా పూర్తిస్థాయిలో సర్వే చేపట్టాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. ఈ మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారిణి, తహసీల్దార్ ఆధ్వర్యంలో అచ్చంపేట, హకీంపేట శివార్లలో రెవెన్యూ అధికారులు మూడు రోజులుగా రీ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. నివేదిక వచి్చన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సీలింగ్ భూముల్లో ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి, ఆ భూముల్లోకి వెళ్లకుండా ఎంతమంది రైతులను అడ్డుకున్నారనే దానిపై నిజ నిర్ధారణ చేయడానికి సర్వే కొనసాగుతుందన్నారు. భూముల కబ్జాపై రైతులు ఎవరూ భయపడొద్దని, విచారణ తర్వాత బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఆక్రమణదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
అడవి కబ్జాపై ఆకాశరామన్న ఉత్తరాలు రాయండి
సిరిసిల్ల: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిపాటు డిజిటల్ భూసర్వేలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో శనివారం పోడుభూములపై అఖిలపక్ష నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అడవిని.. పుడమిని కాపాడేందుకు నవంబర్ 8వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో అర్జీలు స్వీకరిస్తున్నామని, వాటిని పరిశీలించి శాస్త్రీయంగా గూగుల్ మ్యాప్స్తో విశ్లేషించి అర్హులకు పట్టాలిస్తామని తెలిపారు. మళ్లీ అడవుల జోలికి వెళ్లకుండా కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ కృషితో హరితహారంలో అగ్రస్థానంలో ఉన్నామని, నాలుగున్నర శాతం అడవి పెరిగిందని అన్నారు. ‘ధరణి’తో అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని, ఇప్పటికే 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. ధరణితో నేరుగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని, రెవెన్యూ అవినీతి తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. దేశం మొత్తంగా ధరణిని అనుసరించే రోజులు వస్తాయన్నారు. అక్షాంశాలు.. రేఖాంశాలతో సర్వే అక్షాంశాలు.. రేఖాంశాల ఆధారంగా సంపూర్ణ డిజిటల్ భూసర్వే చేయిస్తామని కేటీఆర్ అన్నారు. ఇది పూర్తయితే భూముల హద్దులు, వాటి యజమానుల వివరాలు పక్కాగా నమోదవుతాయని తెలిపారు. అంతకంటే ముందు 2005 నాటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల చట్టం ఆధారంగా భూమిని నమ్ముకున్న గిరిజనుల్లో అర్హులకు పారదర్శకంగా పట్టాలిస్తామన్నారు. ఇందులోనూ ఎవరైనా పైరవీలు చేసినా, అనర్హులకు అండగా ఉన్నా జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించారు. ఎవరైనా అటవీ భూములను కబ్జా చేస్తే వెంటనే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని, ఆకాశరామన్న ఉత్తరం రాసినా.. సరిపోతుందని మంత్రి వివరించారు. అడవులను నరికివేసే వారిపై కఠినంగా ఉంటామన్నారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందం అటవీ భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు పట్టాలిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టమే ప్రతిబంధకంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ చట్ట సవరణకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తానని చెప్పారని వివరించారు. క్షేత్రస్థాయిలో అర్జీల స్వీకరణ పూర్తయిన తర్వాత సమగ్ర సమాచారంతో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్లో అటవీభూములను ఆక్రమించబోమని, ఎవరైనా కబ్జా చేసినా సహించబోమని అఖిల పక్షనేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్హెగ్డే, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
భూములపై త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లేందుకు అవసరమైన సమస్త సమాచా రాన్ని సేకరిస్తోంది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, కొన్ని రకాల భూముల స్వాధీనంతో పాటు ధరణి రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలను పక్కాగా క్రోడీకరించే పని మొదలుపెట్టింది. రాష్ట్రం లోని అన్ని రకాల భూముల వివరాలను నిర్దేశించిన ఫార్మాట్లో పంపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. మొత్తం 9 రకాల భూముల వివరాలను మండలాలు, సర్వే నంబర్ల వారీగా పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ ఇంటిస్థలాల అంశంపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ముందుంచాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని కోరారు. ఈ లేఖకు జత చేసిన ఫార్మాట్లో ప్రతి కేటగిరీ భూమికి సంబం ధించిన ధర (చదరపు అడుగుకు)ను పేర్కొనాలని, లబ్ధిదారుల సంఖ్యతోపాటు ప్రస్తుత పరిస్థితి, సిఫారసులను కూడా జత పర్చాలని కోరడంతో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తోందని, అందులో భాగంగానే ఈ వివరాలను అడిగిందనే చర్చ జరుగుతోంది. గ్రామకంఠం నుంచి సీలింగ్ భూముల వరకు ప్రభుత్వం మొత్తం తొమ్మిది కేటగిరీల కింద సమా చారాన్ని కోరింది. ఇందులో సీలింగ్ భూములు, 2008లో విడుదల చేసిన జీవో నం:166 ప్రకారం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, జీవో 58, 59ల కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్, అటవీ, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, గ్రామకంఠాలు, ప్రభు త్వం లీజుకిచ్చిన భూములు ఉన్నాయి. వీటితో పాటు రైతులు ధరణి పోర్టల్ ద్వారా క్రయ విక్రయాలు జరుపుకునేందుకు వీల్లేకుండా నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లలో గల ప్రభుత్వ, పట్టా భూముల వివరాలను పంపాలని కూడా ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. వేల సర్వే నంబర్లలోని పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉండగా రైతులు వీటిని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. గత రెండు, మూడు నెలల క్రితం వరకు ఈ విషయంలో ఏం చేయాలో రెవెన్యూ వర్గాలకు కూడా అంతు చిక్కలేదు. మొత్తానికి ఇటీవల ఈ జాబితా నుంచి పట్టా భూములను తొలగించుకునేందుకు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం రైతులకు కల్పించారు. కానీ ఆ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం, కొన్ని కేసుల్లో అన్యాయం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మండలాల వారీగా. సర్వే నంబర్ల వారీగా ఈ భూముల వివరాలను సేకరించి వాటిని ధరణి పోర్టల్లో తాజాగా నమోదు చేసి తప్పులు సరిదిద్దే క్రమంలోనే ఈ వివరాలను ప్రభుత్వం అడిగిందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు దేవాదాయ, అటవీ శాఖలతో చాలామంది పట్టాదారులకు సమస్యలున్నాయి. గతంలో పట్టా భూములుగా ఉన్న వాటిని ఉన్నట్టుండి ధరణి పోర్టల్లో అటవీ, దేవాదాయ భూముల జాబితాలో చేర్చారు. తాజాగా వీటి వివరాలను సేకరిస్తుండటంతో ఈ రెండు కేటగిరీల్లోని పట్టాదారుల భూములకు విముక్తి కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామ కంఠాలపై అటోఇటో! రాష్ట్రంలోని భూముల విషయంలో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య గ్రామ కంఠాలు. ఈ భూములు పట్టా భూములతో సమానమని, ఈ భూముల్లో నిర్మాణాలున్నా లేకపోయినా కబ్జాలో ఉన్నవారికి హక్కులు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు గతంలో చెప్పింది. కానీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు పర్చలేదు. హైదరాబాద్ శివార్లలోని నానక్రాంగూడ, బాలానగర్, ఉప్పల్, ఖాజాగూడ, మజీద్గూడ లాంటి ప్రాంతాల్లో గ్రామ కంఠం భూములున్నాయి. ఇప్పుడు వీటి ధర చాలా ఎక్కువగా ఉంది. అయితే ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి వీటిని స్వాధీనం చేసుకునేందుకు 2018లో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి చేసిన ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. సీలింగ్, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, స్వాధీనం! ఇక రాష్ట్రంలోని ఆరు లక్షల ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూముల్లో పేదలు కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించుకోగా, కొన్నిచోట్ల ఇంటి స్థలాలుగా కబ్జాలో ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల విషయంలోనూ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ భూముల్లో లక్ష ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని రెవెన్యూ వర్గాలు గతంలోనే నిర్ధారించాయి. అసలు ప్రభుత్వం ఎవరికి అసైన్ చేసింది, ఎవరి కబ్జాలో ఇప్పుడు ఆ భూమి ఉంది, కబ్జాలో ఉన్న వారి సామాజిక హోదా ఏంటనే అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించింది. హైదరాబాద్ శివార్లలోని కోకాపేట, శంషాబాద్ తదితర మండలాల్లో ఉన్న అసైన్డ్ భూములను పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుని అమ్మాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీంతో ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం వివరాలను సేకరిస్తోందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద 58, 59 జీవోల కింద దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, సీలింగ్, అసైన్డ్ భూముల్లోని నిర్మాణాలు, స్థలాల క్రమబద్ధీకరణతో పాటు అవసరమైన గ్రామకంఠాలు, అసైన్డ్ భూములను పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవడం, తాజా వివరాలను ధరణి పోర్టల్లో అప్లోడ్ చేసి తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా ఈ వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పోడు భూముల కమిటీ పై ఆదివాసీల తిరుగుబాటు
-
ధరణి పోర్టల్ ఉపసంఘం చైర్మన్గా హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చైర్మన్గా, సభ్యులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీష్రెడ్డి, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. ఈ ఉప సంఘం కన్వీనర్గా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం ఉత్త ర్వులు జారీ చేశారు. ధరణి పోర్టల్ సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు ఇవ్వాలి -
భూ సమస్యలపై నిరంతర ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: భూ సమస్యలపై నిరంతర ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగానే ధరణి పోర్టల్ లొసుగులను ఎత్తిచూపుతూ సెప్టెంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. అలాగే జీవో 58 ప్రకారం పేదలకు పట్టాలు, డబుల్ బెడ్రూంల సాధనకు సెప్టెంబర్ 10లోపు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం, కార్యవర్గ సమావేశ వివరాలను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి చాడ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మోదీ ప్రభు త్వం అన్ని రంగాల్లో విఫలమైందని, చట్టాల ఉల్లంఘనతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. జాతీయస్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీల పిలుపు మేరకు సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు తెలంగాణ లో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పా రు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను సంప్రదించి, నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నుసన్నల్లోనే అసైన్డ్, పట్టా, వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూములు కబ్జాకు గుర య్యాయని ఆరోపించారు. 2014లో 125 గజాల ఇళ్ల స్థలాలకు పట్టా సర్టిఫికెట్ ఇస్తామని ప్రభుత్వం 58 జీవో విడుదల చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరికీ కూడా పట్టా ఇవ్వలేదని విమర్శించారు. 11న బస్సుయాత్ర కృష్ణా–గోదావరి జలాలపై రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించిందని చాడ ధ్వజమెత్తారు. జల వివాదంపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించకపోతే తామే రాష్ట్రస్థాయిలో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. పోడు భూముల అంశంపైనా అన్ని పార్టీలతో కలిసి పోరాటాల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు వివరించారు. తెలంగాణ సాయుధ పోరాట స్మృతులను గుర్తుచేస్తూ సెప్టెంబర్ 11న బస్సుయాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు. 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పొలం తగాదా.. చనిపోయిన వ్యక్తిపై కేసు..
సాక్షి, వనపర్తి (మహబూబ్నగర్): పొలం తగాదా విషయంలో ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే వనపర్తి పురపాలిక పరిధిలోని నాగవరానికి చెందిన లక్ష్మి, ఆమె కుమారుడు ఆంజనేయులు ఓ పొలం తగాదాకు సంబంధించి చిమనగుంటపల్లికి చెందిన జబ్బు చిన్ననారాయణ, జబ్బు పెద్ద నారాయణ, రవి, పవన్పై వేర్వేరుగా వనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. తీరా విచారణలో చిన్ననారాయణ 2015లో చనిపోయినట్లు తేలింది. అలాగే పెద్ద నారాయణ అనారోగ్యంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. దీనిపై ఎస్ఐ షేక్షఫీను వివరణ కోరగా.. లక్ష్మి ఫిర్యాదు మేరకు నలుగురిపై ఎఫ్ఐఆర్ చేశామన్నారు. తమ విచారణలో జబ్బు చిన్న నారాయణ గతంలోనే చనిపోయాడని గుర్తించాం. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనేది తదుపరి దర్యాప్తులో తేలుతుందన్నారు. -
పోడు..‘గోడు’ వినే వారేరీ?
ఈ ఫొటోలో కనిపిస్తున్న గ్రామం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి. కాకతీయుల కాలం నుంచే ఉన్న ఈ గ్రామంలో సామంత రాజులు అప్పట్లోనే వేలుబెల్లి పెద్ద చెరువును తవ్వించారు. 600 కుటుం బాలు, 2 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలోని గిరిజనులు, గిరిజనేతరులు కలిసి.. 3వేల ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారు. అందులో 200 ఎకరాలకు 1/70 ద్వారా పట్టాలు ఇవ్వగా.. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 36 మంది గిరిజనులకు మరో 200 ఎకరాలకు హక్కుపత్రాలు ఇచ్చారు. మిగతా 2,600 ఎకరాలకు పట్టాలు లేవు. 2018 తర్వాత నిర్వహించిన రెవెన్యూ– ఫారెస్టు సరిహద్దుల గుర్తింపులో భాగంగా.. ఈ గ్రామస్తులు సాగుచేసుకుంటున్న భూమి అడవిపరిధిలో ఉందని రికార్డుల్లో నమోదు చేశారు. అటవీశాఖ అధికారులు సరిహద్దు గుర్తులు పెట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వందల ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి అటవీశాఖదేనని అంటుండటం తో.. గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. కేసులు భరించలేక వలస బాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మొండికట్ట గ్రామంలో గిరిజనేతర రైతులు సుమారు 250 ఎకరాల పోడు భూముల్లో రెండేళ్ల కిందటి వరకు వ్యవసాయం చేశారు. కానీ అటవీశాఖ అధికారులు రైతులను అడ్డుకున్నారు. మొదట 22 మందిపై, తర్వాత మరో 18 మందిపై కేసులు పెట్టారు. ఆ రైతులు కోర్టు చుట్టూ తిరగలేక, కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక.. ఆ గ్రామం వదిలి జీవనోపా«ధి కోసం వలస పోయారు. అటవీశాఖ సిబ్బంది ఆ పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటారు. .. ఇలా ఒకటి రెండు చోట్ల కాదు.. రాష్ట్రంలోని ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజనుల పరిస్థితి ఇది. అవి ఫారెస్టు భూములంటూ స్వాధీనం చేసుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తుండగా.. అడవినే నమ్ముకొని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై తమకు హక్కు ఉందని, వాటిని వదిలి ఎక్కడికి వెళ్లాలని గిరిజనులు వాపోతున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పోడు భూమి సమస్య ఎప్పుడు తీరుతుందా అని ఎదురుచూస్తున్నారు. గూగుల్ సర్వేతో.. ప్రభుత్వం భూప్రక్షాళన, అటవీ భూముల క్రమబద్ధీకరణ, అడవుల సంరక్షణ పేర్లతో గూగుల్ సర్వే నిర్వహించి.. ఆ డేటాను జీఏఆర్ఎస్ (గ్లోబల్ ఏరి యా రిఫరెన్స్ సిస్టమ్)కు అనుసంధానం చేసింది. వందల ఏళ్ల నాటి అడవుల సరిహద్దులను నిక్షిప్తం చేసింది. ఈ క్రమంలో గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములు కూడా అడవుల పరిధిలోనే ఉన్నాయని చూపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ట్రెంచ్లు వేస్తున్నారు. ఇదేమిటంటూ గిరిజనులు ఆందోళనలో మునిగిపోతున్నారు. 3,31,070 ఎకరాలకు పట్టాలిచ్చిన వైఎస్సార్ 2004 సార్వత్రిక ఎన్నికల ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పోడు సమస్యను గుర్తించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2006లో తెలంగాణలో హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో 99,486 మంది రైతులు సాగుచేసుకునే 3,31,070 ఎకరాల భూములకు భూమిహక్కు పత్రాలను ఇచ్చారు. ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరు 2006 ఏడాదిలో, ఆ తర్వాత కూడా కొందరు గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. దానికితోడు అప్పటికే పోడు చేస్తున్నా దరఖాస్తు చేసుకోని వారు కూడా ఉన్నట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. వారందరికీ హక్కు పత్రాలివ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ, పలు కారణాలతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కలిపి 8 లక్షల ఎకరాల మేర పోడు భూముల సమస్య ఉందని గిరిజన సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ భూములకు హక్కుపత్రాలిచ్చి అడవుల అభివృద్ధిలో భాగంగా పండ్ల తోటలను పెంచేలా ప్రోత్సహిస్తే.. ఇటు ప్రభుత్వ లక్ష్యం, ఇటు గిరిజనులకు ఉపాధి రెండూ నెరవేరుతాయని అంటున్నారు. – సాక్షి, మహబూబాబాద్ -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతపై కేసు నమోదు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి కల్యాణ్ పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని ఫిల్మ్నగర్కు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సి కల్యాణ్ పేరుతో షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
ఎస్ఐ వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం
నర్సాపూర్: ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నం చేసిన వ్యక్తి ఉదంతమిది. శివ్వంపేట మండలం కొత్తపేటకు చెందిన కంచన్పల్లి శేఖర్ శివ్వంపేట ఎస్ఐ రమేష్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడారు. ఆయన కథనం ప్రకారం.. స్వగ్రామంలో తనకు చెందిన ఎకరం 5గుంటల భూమిని అమ్మకానికి పెట్టగా ఏజంట్లు సత్యనారాయణ, శేఖర్గౌడ్, పాండరిగౌడ్ మధ్యవర్తిత్వం వహించగా పిల్లుట్ల గ్రామానికి చెందిన శ్రీధర్గౌడ్కు ఎకరానికి రూ.33లక్షల ధరకు సుమారు మూడు నెలల క్రితం విక్రయించానని, అడ్వాన్సు కింద తనకు 8లక్షల రూపాయలు ఇచ్చారని తెలిపారు. 60రోజుల అగ్రిమెంటుతో భూమి అమ్మగా సమయం దాటిన తర్వాత ఏజెంట్లు వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయమనడంతో దానికి తాను నిరాకరించినట్లు తెలిపారు. ఏజెంట్ శేఖర్గౌడ్ తల్లి పోచమ్మ తమ ఇంటికి వచ్చి తన భార్య లలితను దుర్భషలాడుతూ.. దాడిచేయడంతో ఈనెల 5న శివ్వంపేట పోలీస్స్టేషన్కు వెల్లి తాము ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం తాను పోలీస్ స్టేషన్కు వెళ్లగా ఎస్ఐ రమేష్ దుర్భాషలాడటంతో పాటు రూ. 40వేలు ఇస్తేనే నీకు న్యాయం చేస్తానని లేనిపక్షంలో వ్యతిరేక వర్గానికి అనుకూలంగా కేసు చేస్తానని హెచ్చరించారని చెప్పారు. రాత్రి ఏడున్నరకు తనను పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టారని, తన వద్ద డబ్బులు లేవని, తనకు అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చడానికే భూమి అమ్మినట్లు చెప్పారు. ఎస్ఐ రమేష్ డబ్బులు అడగడంతో పాటు దుర్భాషలాడటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో పోలీస్ స్టేషన్ నుంచి గ్రామ శివారులోకి రాగానే పురుగుల మందు తాగినట్లు ఆయన చెప్పారు. తాను ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు తాగుతున్నట్లు తన మొబైల్లో రికార్డు చేసినట్లు తెలిపారు. అది చూసిన గ్రామస్తులు నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్సచేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఎస్ఐ రమేష్ వివరణ.. తమకు కంచనపల్లిశేకర్ దంపతులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని శివ్వంపేట ఎస్ఐ రమేష్ చెప్పారు. గ్రామంలో జరిగిన గొడవ కావడంతో అక్కడే కూర్చుని మాట్లాడుకోవాలని ఇరు వర్గాలకు సూచించానని చెప్పారు. చిన్న గొడవ కావడంతో ఇరు వర్గాలు శాంతపజేయటం కోసం పీఎస్కు పిలిపించానని చెప్పారు. తాను శేఖర్ను తిట్టలేదని, డబ్బులు అడగలేదని ఆయన వివరించారు. తాను డబ్బులు అడగినట్లు, దుర్భషలాడుతూ తిట్టినట్లు శేఖర్ నాఎదుట చెబితే తాను ఉద్యోగానికి రాజీనామా చేసి వెల్లిపోతానని ఎస్ఐ స్పష్టం చేశారు. -
‘రెవెన్యూ’లో ఆత్మహత్య కలకలం
సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్కుమార్ ఆత్మహత్య రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం సృష్టించింది. ఏసీబీ అధికారుల దాడిలో ఇంట్లో దొరికిన నగదుకు లెక్క చూపినా.. విచారణ పేరిట కుటుంబసభ్యులను వేధించడంతోనే అజయ్కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న రెవెన్యూ ఉద్యోగసంఘాలు.. ఈ వ్యవహారంలో ఏసీబీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నారు. వివాదాస్పద భూ వ్యవహారంలో ఆర్ఐ, ఎస్ఐలను అరెస్టు చేసిన పోలీసులు.. ఎలాంటి ప్రమేయంలేని తహసీల్దార్ను అరెస్టు చేయడమేగాకుండా తప్పులు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూను అవినీతి శాఖగా చిత్రీకరించడంలో భాగంగానే పద్ధతి ప్రకారం ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన సంఘటనలోనూ ఆమెదే తప్పిదం అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేసిన తీరును గుర్తు చేస్తున్న ఉద్యోగ సంఘాలు.. తాజా ఘటన నేపథ్యంలో ఆందోళనబాట పట్టాలని యోచిస్తున్నారు. పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన భూముల వ్యవహారంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై దాడులు జరిగాయని, మాన్యువల్ పహాణీగాకుండా.. ఏకంగా ఆన్లైన్లోనే రికార్డులు నమోదు చేయడంతో ఆనేక తప్పు లు దొర్లాయని, వీటిని సవరించడానికి అనుమతినివ్వాలని కోరినా పట్టించుకోని అధికారు లు.. తప్పంతా రెవెన్యూ ఉద్యోగులదే అన్నట్లుగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందన్నారు. స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా.. అడ్డగోలు నిర్ణయాలతో రాత్రికి రాత్రే అమలు చేయాలనే ఉన్నతాధికారుల వ్యవహారశైలితో రెవెన్యూశాఖకు చెడ్డ పేరు వస్తోందని వాపోతున్నారు. ఈ క్రమం లోనే వీఆర్వోల వ్యవస్థ రద్దు, రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంటూ సీఎం కేసీఆర్ ప్రకటనలు చేయడంతో మానసిక ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులపై ఏసీబీ అధికారులు అవినీతి ముద్ర వేస్తుండటం మరింత కుంగదీస్తోందని అంటున్నారు. ఏసీబీ వేధింపులతోనే: ట్రెసా షేక్పేట్ తహసీల్దార్ సుజాత భర్త ప్రొఫెసర్ అజయ్కుమార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్రెడ్డి, గౌతమ్కుమార్ మాట్లాడుతూ.. ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి కేసులో ఆధారాలు లేకపోయిన అరెస్ట్ చేసిన తహసీల్దార్ సుజాతకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే బాగుండేదని, ఇప్పటికైనా ఆమెను విడుదల చేసి కేసును విచారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షుడు కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
షేక్పేట తహసీల్దార్ భర్త బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్పేట తహసీల్దార్ సుజాత భర్త ప్రొఫెసర్ అజయ్కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కడపల్లిలో లలిత మాన్షెన్లోని తన రెండో అక్క రేఖ ఇంట్లో తన కుమారుడితో అజయ్ ఉంటున్నారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు అజయ్కు ఓ ఫోన్ కాల్ రాగా మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తుపైకి వెళ్లి మాట్లాడుతూ.. అపార్ట్మెంట్ పైనుంచి కిందకు దూకారు. తీవ్రంగా గాయపడిన అజయ్కుమార్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరోపణలు భరించలేకే.. చిన్నప్పట్నుంచే సున్నిత మనస్కుడైన అజయ్ తన భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఉన్నత కుటుంబం, భార్యాభర్తలిద్దరికీ మంచి ఉద్యోగాలు.. నల్లేరుపై నడకలా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. అవి నీతి ఆరోపణలు ఎదుర్కొని ఒకరు జైలుపాలు కాగా.. మరొకరు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. ఇక అజయ్కుమార్ది విద్యావంతుల కుటుంబం. గత 15 ఏళ్లుగా ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మొదట్లో సివిల్స్ కోసం శిక్షణ పొంది ఇంటర్వూ్య వరకు వెళ్లారు. తొలుత మహబూబ్నగర్ పీజీ కళాశాలలో, నిజాం కళాశాలలో, కోఠి ఉమెన్స్ కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పీహెచ్డీ పూర్తిచేసిన అజయ్ తన థీసిస్ సబ్మిషన్ దశలో ఉన్నారు. అంతకుముందు ఓ జూనియర్ కళాశాలలో పనిచేస్తుండగా తన కొలీగ్స్ ద్వారా పరిచయమైన ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన సుజాతను పెళ్లి చేసుకున్నారు. ఇక అజయ్ బాబాయ్లు, పెద్దనాన్నలు కూడా ఉన్నత విద్యావంతులే. పెదనాన్న గోకా రామలింగం ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే తన రెండో పెదనాన్న రామస్వామి అప్పటి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక తండ్రి ఆంజనేయులు డీఎస్పీగా పనిచేసి రిటైరయ్యారు. తన బాబాయ్లు మోహన్ కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా, మరో బాబాయ్ గోకా మురళీ డాక్టర్గా ఉన్నతస్థాయిల్లో పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో అజయ్ చురుగ్గా పాల్గొన్నారు. ఇక సుజాత కూడా గ్రూప్–2 ఆఫీసర్గా ఎంపికై మొదట మెదక్ జిల్లాలో, తర్వాత నగరంలోని ముషీరాబాద్, హిమాయత్నగర్ తదితర ప్రాంతాల్లో తహశీల్దార్గా పనిచేశారు. కావాలనే టార్గెట్ చేశారా? షేక్పేట తహసీల్దార్ సుజాతను ఆమె కుటుంబాన్ని కొందరు రెవెన్యూ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కావాలానే టార్గెట్ చేశారని ఫిర్యాదులు వస్తున్నాయి. సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఆమె భర్త ప్రొఫెసర్ అజయ్ను సైతం అరెస్ట్ చేస్తామన్న సంకేతాల నేపథ్యంలోనే బుధవారం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవానికి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సర్వే నెంబర్ 403/పీలో 4,865 గజాల భూవివాదంలో తనను ఎస్ఐ రవీందర్నాయక్ వేధిస్తున్నాడని అబ్దుల్కాలీద్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేయగా.. ఏసీబీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) నాగార్జునరెడ్డిని వలపన్ని పట్టుకుంది. ఆపై కాలీద్ను పోలీస్లు విచారించిన సమయంలో అతను తహశీల్దార్ సుజాత ప్రస్తావనే తీసుకురాలేదని సమాచారం. అయినా కేసును ముందుకు తీసుకెళ్లే దిశగా ఆమె నివాసంలో సోదాలు చేయటం రూ.30 లక్షల నగదుకు సరైన లెక్కలు చూపని కారణంగా ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అనంతరం భర్త అజయ్కు ఏసీబీ నుంచి తరచూ ఫోన్లు రావటం, తాము అడిగిన వివరాలు చెప్పకపోతే అరెస్ట్ తప్పదన్న సంకేతాలివ్వటం వల్లే అజయ్ ఆత్మహత్యకు ఒడిగట్టారని సమీప బంధువులతో పాటు రెవెన్యూ సంఘాలు ఆరోపించాయి. అయితే సుజాతను ఏసీబీ వివాదంలో ఇరికించేందుకు నగర రెవెన్యూశాఖలోని ఒకరిద్దరు అధికారులు సైతం ఏసీబీకి తప్పుడు సమాచారం ఇచ్చారన్న అంశం తెరమీదకు వచ్చింది. రెండు మార్లే ఫోన్ చేశాం..: ఏసీబీ డీఎస్పీ అజయ్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్రావును ‘సాక్షి’ప్రశ్నించగా.. కేసు విచారణలో భాగంగానే తహశీల్దార్ సుజాతను అరెస్ట్ చేసిన విషయాన్ని ఆమె భర్త అజయ్కు ఫోన్లో ధ్రువీకరించామని, ఆపై హన్మకొండ సమీపంలో తమకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉందని సుజాత తమకు చెప్పగా, అదే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు తాము అజయ్ను అడిగితే ఒకే ఎకరం ఉందని చెప్పారని ఈ రెండు సమయాల్లో తప్పితే తాము మరే కాల్ చేయలేదని చెప్పారు. తహసీల్దార్ సుజాత, ఆమె కుమారుడు భరత్ను ఓదారుస్తున్న బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరైన సుజాత.. సుందరయ్య విజ్ఞానకేంద్రం: భర్త అజయ్కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో చర్లపల్లి జైలు నుంచి కండీషనల్ బెయిల్పై తహశీల్దార్ సుజాత విడుదలయ్యారు. సాయంత్రం చిక్కడపల్లిలోని తన ఆడపడుచు ఇంటికి చేరుకొని ఒక్కగానొక్క కొడుకు భరత్ను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇటు ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అజయ్ అక్కలు ఆరోపించారు. సుజాత అరెస్టైనప్పటి నుంచి అజయ్ డిప్రెషన్లోకి వెళ్లారని, చేయని తప్పుకు తన భార్య అరెస్టు కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడన్నారు. ఏసీబీ అధికారి వేధింపులు తట్టుకోలేక తాను చనిపోతున్నట్లుగా తన తమ్ముడు ఆ అధికారికి మెసేజ్ కూడా పెట్టాడని అక్క మంగళ తెలిపారు. సుజాత కుటుంబానికి అండగా ఉంటాం.. ఈ నేపథ్యంలోనే సుజాతను పలువురు రెవెన్యూ అధికారులు పరామర్శించారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్కుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, డిప్యూటీ కలెక్టర్లు సంగీత, అశోక్కుమార్, రాధిక రమణి, తహశీల్దార్ లలిత సుజాతను ఓదార్చారు. ‘తహశీల్దార్ సుజాత కుటుంబానికి అండగా ఉంటాం. షేక్పేట్ ఆర్ఐ నాగార్జునరెడ్డి డబ్బులు తీసుకున్న కేసుకు సుజాతకు ఎలాంటి సంబంధం లేదు. సుజాతకు రెవెన్యూశాఖలో ఎలాంటి చెడ్డపేరు లేదు. మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకవేళ సుజాత నేరస్తురాలైతే కోర్టులో తేలుతుంది. సుజాత విషయంలో ఏసీబీ అధికారులు ఆమె భర్తకు ఫోన్ చేసి వేధించడం సరైంది కాదు..’అని గౌతమ్కుమార్ అన్నారు. అజయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. అఫ్జల్గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో ప్రొఫెసర్ అజయ్ మృతదేహానికి ఫొరెన్సిక్ నిపుణులు డాక్టర్ ఝాన్సీ నేతృత్వంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం పూర్తి చేసింది. కాగా మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో మార్చురీలో భద్రపరిచారు. గురువారం అజయ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. -
అన్న చెప్పుతో కొట్టాడని..
తమిళనాడు, తిరువళ్లూరు: ఇంటి స్థలం వివాదంలో అన్న చెప్పుతో కొట్టి అవమానించారన్న మనస్తాపంతో తమ్ముడు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువళ్లూరులో విషాదాన్ని నింపింది. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి ఆచూకీ కానరాలేదు. వివరాలు.. పళవేర్కాడు సమీపంలోని కొక్కుపాళ్యం గ్రామానికి చెందిన రవి(51)కి శివ, రామదాసు సహా ఐదుగురు సోదరులు. శివ–రవి మధ్య ఐదేళ్ల నుంచి ఇంటి స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. ఇటీవల రెండు కుటుంబాలు ఘర్షణపడి పోలీస్స్టేషన్ వరకు వెళ్లాయి. మూడు రోజుల క్రితం రవి–శివ మధ్య మరోసారి వివాదం నెలకొంది. ఆగ్రహించిన శివ తమ్ముడు రవిపై దాడి చేయడంతో పాటు అందరి ముందు చెప్పుతో కొట్టి అవమానించాడు. దీంతో రవి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కుటుంబంతో సహా ఆత్మహత్యకు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం తన బాధను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. ఈ వీడియో తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పళవేర్కాడు చెరువులో 18 ఏళ్ల యువతి మృతదేహాం, మంగళవారం ఉదయం మరో మహిళ మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించారు. తిరుపాళ్యవనం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు. విచారణలో మృతి చెందిన మహిళ రవి భార్య వీరమ్మాల్(42), కుమార్తె భవానీ(18)గా గుర్తించారు. రవి, అతని కుమారుడు బాలమురుగన్(24) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రవి మరో అన్న రామదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ భూ అక్రమ వ్యవహారంలో కొత్త కోణం
నారాయణపేట జిల్లా ఊట్కూరులో ప్రభుత్వ భూ బదలాయింపు వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. 21.81 ఎకరాల సర్కారు స్థలాన్ని తమ కుటుంబీకులు, బంధువుల పేరు మీద పట్టా చేసి అడ్డంగా దొరికిపోయిన ఓ వీఆర్వో, ముగ్గురు వీఆర్ఏలను కాపాడేందుకు ఓ అధికారి వారితో డీల్ కుదుర్చుకున్నారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అందుకోసం సదరు అధికారి ఓ ఉద్యోగిని మధ్యవర్తిగా నియమించుకున్నట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్యవర్తి సదరు అధికారికి, ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఉద్యోగుల మధ్య ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే మండలంలో చర్చనీయాంశమైన భూ అక్రమ వ్యవహారాన్ని సదరు అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, మహబూబ్నగర్: భూ అక్రమ బదలాయింపుపై ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించడం.. దీనిపై కలెక్టర్ హరిచందన దాసరి ప్రత్యేక దృష్టి సారించడంతో తనను నమ్ముకున్న ఉద్యోగులను కాపాడేందుకు ఓ అధికారి తర్జనభర్జన పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తనకున్న అధికారంతో వీఆర్ఏలు రాజప్ప, భీంరావు, బాపూర్ వీఆర్ఏ జ్యోతిను సస్పెండ్ చేసిన తహసీల్దార్ దానయ్య.. తన పరిధిలో లేకపోవడంతో వీఆర్వో భూమయ్యను సస్పెండ్ చేయలేదు. కానీ.. వీఆర్వోపై నివేదిక సిద్ధం చేసి ఆర్డీఓకు పంపాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం వరకూ సదరు తహసీల్దార్ నివేదికను సిద్ధం చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. భూమయ్యపై నివేదిక పంపించాల్సిన తహసీల్దార్ ఇంత వరకు తనకు పంపలేదని.. అందుకే సస్పెండ్ చేయలేదని నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. ఇక్కడా అదే తీరు.. కేవలం 21.81 ఎకరాలే కాదూ.. అదే మండలంలోని బాపూర్లో అన్యాక్రాంతమైన సుమారు 75 ఎకరాల ప్రభుత్వ స్థలం విషయంలోనూ సదరు అధికారి అదే తీరుగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. రెవెన్యూ ఉద్యోగి ఒకరు బాపూర్లో ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట అక్రమ పట్టాలు చేశారంటూ గ్రామానికి చెందిన రాఘవారెడ్డి అనే రైతు పలువురు గ్రామస్తులతో కలిసి జూన్ 11, 2018లోనే అప్పటి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇంత వరకు ఆ భూములకు సంబంధించిన విచారణలో ఎలాంటి పురోగతి లేదు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసలు ఆ గ్రామంలో భూ అక్రమాలపై విచారణ జరిగిందా? లేదా? జరిగితే అధికారుల విచారణలో ఏం తేలింది? విచారణాధికారులు ఉన్నతాధికారులకు ఏం నివేదిక ఇచ్చారు? అనే ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి. మరోవైపు 75 ఎకరాల ప్రభుత్వ భూమి ఇతరుల పేరిట పట్టా అయినట్లు గ్రామస్తులు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో గ్రామస్తులు నిజం చెబుతున్నారా? లేక గతంలో విచారణ చేపట్టిన అధికారులు తమ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారా? అనేది జిల్లా కలెక్టర్ దృష్టిసారిస్తేనే నిగ్గు తేలుతుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. పునర్విచారణ చేపడితేనే తప్ప సదరు అవినీతి అధికారి బండారం బయటపడని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ హరిచందన ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ జోరుగా జరుగుతోంది. -
స్తంభానికి కట్టి మహిళపై చెప్పులతో దాడి
-
స్తంభానికి కట్టి మహిళపై చెప్పులతో దాడి
కోహెడరూరల్: ఓ మహిళను విద్యుత్ స్తంభానికి తాళ్లతో కట్టేసి చెప్పులతో దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. కోహెడ మండలం పోరెడ్డిపల్లి తండాకు చెందిన జ్యోతి, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన హంస, స్వరూపల వ్యవసాయ భూములు పోరెడ్డిపల్లి గ్రామ పరిధిలో ఉంటాయి. ఈ క్రమంలో వారు తరచూ గొడవలకు పాల్పడేవారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న హంస, స్వరూప.. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన కృష్ణ సాయంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న జ్యోతిని ట్రాక్టర్లో ఎక్కించుకొని లక్ష్మీపూర్కు తీసుకువెళ్లి స్తంభానికి కట్టి చెప్పులతో దాడిచేశారు. ఇది గమనించిన స్థానికులు 100కు కాల్ చేశారు. నిందితులు హంస, కృష్ణ, స్వరూప, శంకర్, రమలపై కేసు నమోదు చేశారు. -
బంధాలను కాలరాసి.. కత్తులతో దాడిచేసి..
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల : పొలం తగాదా నేపథ్యంలో ఒక కుటుంబంలోని సభ్యులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్న సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా రెండు ద్విచక్రవాహనాలు బుగ్గయ్యాయి. మండలంలోని రామన్నగూడెం పంచాయతీ నాగేశ్వరరావుమెట్ట వద్ద ఆదివారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్రెల లక్ష్మణస్వామి ముగ్గురు కుమారులు శ్రీను, సత్యనారాయణ, పల్లయ్య పదేళ్ల క్రితం దుబాయి వెళ్లి అక్కడ సంపాదించిన సొమ్మును తండ్రికి పంపారు. ఈ మొత్తంతో లక్ష్మణస్వామి ఇక్కడ మూడున్నర ఎకరాల భూమిని తన పేరున కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దుబాయి నుంచి కుమారులు వచ్చిన తర్వాత ఆ భూమిని అందరూ పంచుకుని సాగు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర క్రితం తండ్రి లక్ష్మణస్వామిని బ్యాంకు రుణం నిమిత్తం సంతకం పెట్టాలని శ్రీను అత్తిలి తీసుకెళ్లి మొత్తం భూమిని తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. దీనిపై పోలీస్టేషన్లో కేసులు, ఆర్డీఓ కోర్టులో వ్యాజ్యం నడవగా దస్తావేజు రద్దుకు ఆర్డీఓ సిఫార్సు చేశారు. అనంతరం ఎవరి వాటాల్లో వారు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఆదివారం లక్ష్మణస్వామి, పల్లయ్య వారి భూమి లో వ్యవసాయ పనులు చేస్తుండగా శ్రీను, అతడికి సంబంధించిన వ్యక్తు లు వీరి ద్విచక్రవాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. లక్ష్మణస్వామిపై కత్తులతో దాడికి దిగారు. విషయం తెలిసి సత్యనారాయణ, మిగిలిన కుటుంబసభ్యులు కూడా పొలానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడిచేసుకోవడంతో శ్రీను, అతని భార్య సుజా త, సత్యనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మీ‘బండ’బడ.. ఇదేం రాజకీయం!
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు బీకేఎస్ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నడిపి సిద్దరామప్ప కుమారుడు నాగరాజుది. చిత్రంలో కనిపిస్తున్నట్లుగా ఇంటికి దక్షిణాన సిమెంట్ రోడ్డు ఉండగా.. నాగరాజు మాత్రం తూర్పువైపున్న వెంకటనారాయణరెడ్డి స్థలంలోకి గేటు పెట్టాడు. దీంతో వెంకటనారాయణరెడ్డి తన స్థలం చుట్టూ బండలు పాతుకోగా.. తన ఇంటిచుట్టూ బండలు పాతారంటూ నాగరాజు గగ్గోలు పెడుతున్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నాయకులు కూడా కొన్నిరోజులుగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా పలువురు నాయకులు వెంకటాపురం వెళ్లేందుకు ప్రయత్నించగా శాంతిభద్రతలకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు వారిని అడ్డుకుని స్వగృహాలకు తరలించారు. ఈ చిత్రం చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.. టీడీపీ ‘బండ’ రాజకీయం. ఆధారాలు చూపించి మాట్లాడండి బుక్కరాయసముద్రం : వెంకటాపురంలో టీడీపీ నాయకుడు నాగరాజు స్థలానికి సంబంధించిన పత్రాలు చూపించి మాట్లాడాలని, స్థల యజమాని బండలు పాతితే తప్పా అంటూ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే తన స్వగృహంలో కురుబ సంఘం నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో ఇద్దరి వ్యక్తుల మద్య ఉన్న స్థల వివాదానికి రాజకీయ రంగు పులిమి కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి రోడ్లపైకి ఆందోళనలు నిర్వహించడం సిగ్గు చేటన్నారు. వెంకటనారాయణరెడ్డి సొంత స్థలంలో నాగరాజు అప్పటి కాంట్రాక్టర్కు కొంత మొత్తం చెల్లించి సిమెంట్ రోడ్డు వేయించుకున్నాడన్నారు. సదరు స్థలాన్ని వెంకట నారాయణరెడ్డి పంచాయతీకి గానీ, ప్రభుత్వానికి గానీ రాసివ్వలేదన్నారు. ఎలాంటి తీర్మానాన్ని కూడా స్థలయజమాని నుంచి తీసుకోలేదని, దీంతో అతడు తన స్థలానికి హద్దుల ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా బండలు పాతడాన్నారు. అయితే ఈస్థలం పక్కనే ఉన్న నాగరాజు ఇటీవలే ఇల్లు నిర్మించాడన్నారు. ఆ ఇంటికి దక్షిణ వైపు సిమెంట్ రోడ్డు ఉందని, తూర్పు వైపు ఉన్న వెంకటనారాయణరెడ్డి స్థలంపై కూడా తమకు హక్కు ఉందంటూ బండలు తొలగించాలంటూ టీడీపీ నేతలు రాద్దాంతం చేయడం దారుణమన్నారు. ఈ వివాదంపై టీడీపీ నాయకులు రోజూ ధర్నాలు, ఆందోళనలు అంటూ గొడవలకు దారి తీసేలా ప్రయత్నిండం ఏమాత్రం సరికాదన్నారు. 10 రోజులుగా నాగరాజు సిమెంట్ రోడ్డుకు సంబంధించిన పత్రాలు ఏమాత్రం చూపించకుండా ఈ రోడ్డుపై తమకు హక్కు ఉందని చెప్పడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ ఆందోళనల వెనుక జేసీ హస్తం ఉందని, ఈ రోజు కూడా బీకేఎస్లో ఆందోళనల షో చేశారన్నారు. వ్యక్తిగత విమర్శలు తగదు.. టీడీపీ నాయకులు అనవసరంగా తనపై, తన కుటుంబంపై సీఎం జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాగే మరోసారి విమర్శలు చేస్తే వారిపై కేసులు వేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత సమస్యను కులాల సమస్యగా చిత్రీకరించడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు గత ఎన్నికలలో కోలుకోలేని దెబ్బతిన్నారని, ప్రజల్లో ఉనికి కోసం పాకులాడుతున్నారన్నారు. ఒక వర్గం మీడియా కూడా కేవలం వెంకటనారాయణరెడ్డి నాటిన బండలనే చూపించడం దారుణమన్నారు. నాగరాజు ఇంటికి దక్షిణ వైపు ఉన్న సిమెంట్ రోడ్డు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ అంకే నరేష్, కురుబ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుల్లే నారాయణస్వామి, జిల్లా కార్యదర్శి బుల్లే వీర నారప్ప, సీఎం వెంకటేశు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల భరతం పడదాం
రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకంలోని భూ విస్తీర్ణం కంటే అడంగల్లో16 లక్షల ఎకరాలకు పైగా అధిక భూమి ఉంది.అంటే లేని భూమి ఉన్నట్లు నమోదు చేశారు. ‘రెవెన్యూ రికార్డుల్లో తప్పులు వెతకడమంటే గొంగళిలో వెంట్రుకలు వెతకడం లాంటిదే. అందుకే వీటిని స్వచ్ఛీకరించడం అనడం కంటే ప్రక్షాళన చేయాలనడం సబబుగా ఉంటుంది’ అని రెవెన్యూ నిపుణులు చెబుతున్న మాటలు ఈ శాఖలో కుప్పలు తెప్పలుగా ఉన్న లోపాలకు అద్దం పడుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా, తప్పుల తడకలుగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన (స్వచ్ఛీకరించి) చేసి, లోప రహితంగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్లిష్టమైన ఈ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేయాలని సర్కారు నడుం బిగించింది. ఇందులో భాగంగా ఒక్కో మండలం నుంచి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి రాష్ట్రంలోని మొత్తం 670 మండలాల్లోని 670 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా (పైలెట్) తక్షణమే అమలు చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్రామాల్లో రికార్డుల అప్డేషన్లో వచ్చే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవస రమైన మార్పులు చేర్పులతో రెండు నెలల్లోగా రాష్ట్రమంతటా రికార్డుల ప్రక్షాళన/ స్వచ్ఛీకరణ యజ్ఞాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేసింది. ఈ నెలాఖరులోగా 670 గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి.. తద్వారా వచ్చిన అనుభవాలు, మార్పుచేర్పులపై నివేదికను రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్కు పంపించాలని ఆదేశించింది. సులభంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం కోసం ఆరు రకాల నమూనా పత్రాలను కూడా తహసీల్దారు కార్యాలయాలకు పంపింది. గ్రామసభలు పెట్టి అందరితో చర్చించి రికార్డులు, ఆధారాలు పరిశీలించి ఈ నమూనా పత్రాలను నింపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను నియమించింది. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఇవీ.. – వారసత్వంగా తమ తండ్రి నుంచి తమకు రావాల్సిన భూమిని కూడా తమకు ఆన్లైన్, మ్యుటేషన్ చేయడం లేదని కొందరు.. తమ తండ్రి భూమిని వేరేవారు అక్రమంగా నకిలీ పాసుపుస్తకాలతో ఆక్రమించారని మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారు. – కొన్ని ప్రాంతాల్లో చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఆన్లైన్ కావడంలో ఇబ్బందులు, పాసు పుస్తకం చేతికి అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు. – మరి కొద్దిమంది అయితే.. నమ్మకంతో రిజిస్ట్రేషన్ లేకుండానే కేవలం అగ్రిమెంటు ప్రకారం భూమిని కొనుగోలు చేశారు. దీనిని సాధారణంగా సాదాబైనామాగా పేర్కొంటారు. అయితే, తమ పేరు మీద చట్టప్రకారం రిజిస్ట్రేషన్ కాకపోవడంతో పాసుపుస్తకం రాక ఇబ్బందులు పడుతున్న వారు మరికొందరు. – కొన్ని ప్రాంతాల్లో ఉన్న భూమి సబ్డివిజన్ చేసి పంపకాలు జరిగి ఉంటాయి. అయితే, ఇవి రికార్డుల్లోకి ఎక్కకుండా కేవలం నోషనల్గానే ఉన్నాయి. అయితే, రికార్డుల్లోకి ఎక్కకపోవడంతో ఆన్లైన్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి. – కొన్నిచోట్ల ఒకే పేరు మీద వివిధ ఖాతా నంబర్లు ఉంటున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తికి ఒకే ఖాతా నంబరు ఉండాలి. సదరు వ్యక్తికి ఎన్ని సర్వే నంబర్లలో భూమి ఉన్నప్పటికీ ఖాతా నంబరు మాత్రం ఒక్కటే ఉండాలి. అయితే, అనేక ప్రాంతాల్లో డూప్లికేట్ ఖాతా నంబర్లతో ఒకే భూమికి ఇద్దరు, ముగ్గురు పేర్లతో దొంగ పాసుపుస్తకాలు పుట్టించుకుని నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. – అన్నింటికీ మించి.. రెవెన్యూ సిబ్బంది మాయతో అనేక ప్రాంతాల్లో ఉన్న భూ విస్తీర్ణం కంటే అదనంగా పాసుపుస్తకాల్లో భూమి రికార్డు అయ్యింది. తద్వారా వెబ్ల్యాండ్లో ఉన్న భూ విస్తీర్ణానికి, ఆర్ఎస్ఆర్ (రెవెన్యూ సర్వీసు రికార్డ్)కు మధ్య వ్యత్యాసం వస్తోంది. – ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా, ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో రికార్డులున్న సంఘటనలు అనేకం. – వివిధ కారణాల వల్ల భూ యాజమాన్య హక్కు పత్రాలు లేకుండానే వంశపారంపర్యంగా భూములను అనుభవిస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆరు నమూనా పత్రాలతో మార్గదర్శకాలు 1. వారసుల పేరుతో మార్పు (చనిపోయిన పట్టాదారు పేరు, ఇతర వివరాలకు సంబంధించి మొత్తం పది కాలంలు పెట్టారు. ఈ నమూనా పత్రం ప్రకారం మృతుల పేర్లతో ఉన్న భూములను వారి వారసుల పేర్లతో మ్యుటేషన్ చేస్తారు.) 2. భూమి కొనుగోలు చేసిన వారి పేరుతో మార్పు (అమ్మిన వ్యక్తి పేరుతో ఉన్న భూమిని కొనుగోలు చేసిన వారి పేరుతో మార్చడం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా గ్రామంలో విచారించి కొనుగోలుదారుల పేర్లతో అడంగల్, 1బీలో మార్పులు చేస్తారు. ఇందుకోసం గత అయిదేళ్లలో జరిగిన క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్ వివరాలను తహసీల్దార్లకు పంపించాలని ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే గత 20 ఏళ్ల రిజిస్ట్రేషన్ డేటా కూడా పంపాలని కూడా ఆదేశించింది. ఈ వివరాల ప్రకారం విచారించి మ్యుటేషన్లు చేస్తారు.) 3. వారసత్వం, రిజిస్ట్రేషన్ ద్వారా కాకుండా ఇతరత్రా మ్యుటేషన్లు (ఆధారాలను పరిశీలించి గ్రామసభలో చర్చించి అనుభవదారు/ పిటిషనర్ పేరుతో భూమిని మ్యుటేషన్ చేస్తారు. సాదాబైనామా కింద అంటే.. రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం అగ్రిమెంట్ ద్వారా జరిగిన భూ లావాదేవీలను పరిష్కరించడం.) 4. ఒక వ్యక్తి పేరుతో ఒకే ఖాతా (ఒక వ్యక్తి పేరుతో రెండు మూడు ఖాతాలు ఉంటే తొలగించి ఒకే ఖాతాగా మార్పు చేస్తారు. గ్రామ సభలో చర్చించి పట్టాదారుకు నోటీసు జారీ చేసి, నిబంధనల ప్రకారం డూప్లికేట్ ఖాతాలను తొలగిస్తారు.) 5. శాశ్వత ఖాతాలుగా మార్పు (వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో 10 లక్షలకు పైగా తాత్కాలిక (నోషనల్) ఖాతాలు ఉన్నాయి. వీటిని శాశ్వత ఖాతాలుగా మారుస్తారు. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారులందరూ తమ పరిధిలోని గ్రామాల్లో తాత్కాలిక ఖాతాలన్నింటినీ శాశ్వత ఖాతాలుగా మార్చడానికి తహసీల్దారుకు ప్రతిపాదనలు ఇవ్వాలి. అనంతరం తహసీల్దారు వీటిని శాశ్వత ఖాతాగా మార్పు చేస్తారు.) 6. భూ విస్తీర్ణం తేడాల్లో మార్పు (రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), వెబ్ల్యాండ్ అడంగల్/ మాన్యువల్ అడంగల్ మధ్య భూమి విస్తీర్ణం చాలా సర్వే నంబర్లలో తేడా ఉంది. దీని ప్రకారం గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తహసీల్దారుకు నివేదిక ఇచ్చిన అనంతరం సరిచేస్తారు.) గ్రామ సభల్లో ఇలా.. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఆరు రకాల నమూనా పత్రాలను పంపిన ఉన్నతాధికారులు గ్రామసభల్లోనే వీటిని పూరించాలని పేర్కొన్నారు. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలను స్పష్టంగా వివరించారు. ఏ తేదీన ఏ రెవెన్యూ గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తారో ముందుగా తెలియజేస్తారు. రెవెన్యూ రికార్డులను ఆ గ్రామానికి తీసుకెళ్లి సర్వే నంబర్ల వారీగా భూమి విస్తీర్ణం, అది ఎవరి పేర్లతో ఉందో చదువుతారు. మార్పులు, చేర్పులు ఎవరైనా కోరితే వారి వద్ద ఉన్న ఆధారాలు తీసుకుని గ్రామ సభలో చర్చిస్తారు. అనంతరం ఆర్ఎస్ఆర్లో ఉన్న భూ విస్తీర్ణానికి, వెబ్ల్యాండ్లో ఉన్న భూ విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం లేకుండా వాస్తవ భూ విస్తీర్ణానికి అనుగుణంగా రికార్డులను సరిచేస్తారు. ఈ గ్రామ సభలకు గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దారు/ తహసీల్దారు హాజరవుతారు. పైలెట్ ప్రాజెక్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేప్పుడు తహసీల్దార్ నేతృత్వంలో ఒక బృందం, డిప్యూటీ తహసీల్దార్ అధ్యక్షతన మరో బృందం వేర్వేరు గ్రామాలకు వెళతాయి. – వైస్సార్ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం 15–20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసింది. ఇప్పటికీ అడంగల్లో ఈ భూమి ప్రైవేట్ వ్యక్తి పేరుతోనే ఉంది. – గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో వందలాది ఎకరాల పట్టా భూములు ప్రైవేట్ వ్యక్తులవి అయినప్పటికీ అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారు. – వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలం అనంత సముద్రం గ్రామంలో ఒకే సర్వే నంబరులోని ఒకే భూమికి ఓబుల గంగిరెడ్డి (పట్టా నంబరు 514), హెచ్.చంగమ్మ (పట్టా నంబరు 537) పట్టాదారులుగా ఉన్నారు. – రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకంలోని భూ విస్తీర్ణం కంటే అడంగల్లో 16 లక్షల ఎకరాలకు పైగా అధిక భూమి ఉంది. అంటే లేని భూమి ఉన్నట్లు నమోదు చేశారు. – శ్రీకాకుళం జిల్లాలోని 95 గ్రామాల్లో అధికారులు సర్వే చేయగా ఒక్కో గ్రామంలో 40 నుంచి 80 శాతం వరకు తప్పులు ఉన్నట్లు తేలింది. – రాష్ట్రంలో మొత్తం భూ కమతాలు, సబ్ డివిజన్ల మధ్య 77 లక్షల భారీ వ్యత్యాసం ఉంది. కష్టమైనా సరే చేయాల్సిందే.. భూముల సమగ్ర రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాలంటే ముందుగా భూ రికార్డులు సరిదిద్దాలి. ఇందుకోసమే ప్రక్షాళన చేయాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేశాం. దశాబ్దాలుగా బూజుపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సులభమైన ప్రక్రియ కాదు. కానీ, ఎంత కష్టమైనా ప్రజల కోసం ఈ మార్పు చేయాలనుకున్నాం. రాష్ట్రమంతా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. క్షేత్ర స్థాయిలో వచ్చే సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలతో ముందుకెళ్లేందుకే ఒక్కో మండలంలో ఒక్కో రెవెన్యూ గ్రామాన్ని ఎంచుకున్నాం. ఆ తర్వాత రాష్ట్రమంతటా రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ చేపడతాం. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. – పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి -
అ‘పరిష్కృతి’..!
సాక్షి, కొత్తగూడెం: సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం అనుకున్న మేర లక్ష్యం సాధించడం లేదు. ఇక్కడికొచ్చే సమస్యల్లో కొన్ని పరిష్కారం అవుతున్నా.. భూసంబంధ సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ప్రతి గ్రీవెన్స్కు ఆయా విభాగాల ప్రధాన అధికారులను కలెక్టర్ పిలిపించి తక్షణమే సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నం అంతగా ఫలితాలనివ్వడం లేదు. సోమవారం ‘సాక్షి’ రెండు భూ ఆక్రమణల కేసులను పరిశీలించింది. ఇ.పుష్పకుమారి అనే ఓ మాజీ నక్సలైట్కు పునరావాసం కింద ఇచ్చిన మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారు. ఈ విషయమై ఆమె ప్రతి అధికారి చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. చివరకు సోమవారం.. ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని కలెక్టరేట్ ఏఓకు జాయింట్ కలెక్టర్ సూచించారు. కాగా సదరు ఏఓ బాధిత మహిళతో ‘నీకు ఈ స్థలం ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, తహసీల్దారుకు చెప్పి మరోచోట ఇప్పిస్తా’ అనడంతో పాటు భూముల ధరలు పెరుగుతండడంతో ఇలా ఆక్రమణలు జరగడం సహజమేనని సెలవిచ్చారు. చివరకు సమస్యను సశేషంగానే ఉంచారు. దీంతో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాలనే ఆలోచన వస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక కొత్తగూడెం జిల్లాకేంద్రం నడిబొడ్డులో కొదురుపాక మీనాకు మారి అనే ఓ మహిళా న్యాయవాదికి వంశపారంపర్యంగా వచ్చిన ఇంటిని మున్సిపల్ అధికారులు ఆమెకు తెలియకుండానే మరొకరి పేరుపై మార్చారు. స్థానిక నాయకులు కొందరు ఆక్రమణదారులకు మద్దతు తెలుపుతుండడంతో వారు తనపై అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని న్యాయవాది వాపోయారు. పునరావాసం కింద ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు జనశక్తి దళంలో పనిచేస్తూ 2000 సంవత్సరంలో పోలీసుల ఎదుట లొంగిపోయాను. 2004లో తిరిగి జనశక్తి దళంలో చేరాను. 2006లో మళ్లీ లొంగిపోయాను. ప్రభుత్వం ఇచ్చే పునరావాసం కింద నాకు 2010లో సమితి సింగారం పంచాయతీ రాజీవ్గాంధీ నగర్లో మూడు సెంట్ల స్థలాన్ని అధికారులు కేటాయించారు. అయితే ఆర్థిక స్తోమత లేక ఇప్పటికీ ఇల్లు నిర్మించుకోలేదు. స్థానికులైన కమ్మంపాటి శ్రీను, రేగళ్ల శంకర్, కె.సాయిపద్మ, ఎం.పద్మ, ఎస్.ఎ.కోటి, యెదరి రామకృష్ణ ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి కూడా తీసుకెళ్లా. అదే సమయంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కూడా వివరించా. అయినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. చివరికి హైదరాబాద్లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు కూడా వెళ్లి మొరపెట్టుకోగా ప్రస్తుత కలెక్టర్కు లేఖ పంపారు. దీనిని కూడా కలెక్టర్కు గ్రీవెన్స్లో ఇచ్చిన వినతిపత్రంలో జతచేశా. భర్త మరణించి అనాథగా ఉన్న గిరిజనురాలినైన నాకు ఈ స్థలాన్ని న్యాయబద్ధంగా ఇప్పించాలని కోరుతున్నా. – పుష్పకుమారి, సమితి సింగారం, మణుగూరు మండలం. నాకు తెలియకుండా మ్యుటేషన్ చేశారు కొత్తగూడెం మున్సిపాలిటీలోని గాజులరాజం బస్తీలో 4–2–144 నంబర్లో నాకు ఇల్లు ఉంది. మా అమ్మ సముద్రాల భారతి ద్వారా వంశపారంపర్యంగా ఆ ఇల్లు లభించింది. నేను 2015 నుంచి హైదరాబాద్లో ఉంటున్నా. ఈ ఇల్లు నివాసయోగ్యంగా లేక ఎవరికీ అద్దెకు కూడా ఇవ్వలేదు. ఇటీవల జీఓ రావడంతో పట్టా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొత్తగూడెం వచ్చాను. అయితే నా పేరుపై ఉన్న ఇంటిని 2013లో నాకు తెలియకుండా రెడ్డి కృష్ణకుమారి పేరుతో ముటేషన్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఈ విషయమై మున్సిపల్ అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆక్రమించుకున్న వారిని అడిగితే..నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఎక్కువగా మాట్లాతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. 2009 నుంచి 2015 మొదటి అర్థసంవత్సరం వరకు ఇంటి పన్ను కూడా చెల్లించా. నా ఇంటిపై సర్వహక్కులు కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్కు విన్నవించుకున్నాను. – కొదురుపాక మీనాకుమారి, కొత్తగూడెం మున్సిపాలిటీ -
శభాష్ సిద్ధార్థ్ అంటూ సీఎం జగన్ ప్రశంసలు
గ్రామాల్లో భూ వివాదాలతో నిత్యం గొడవలు జరుగుతూ ఉండడం చూస్తున్నాం. రెవెన్యూ అధికారులు చేసిన తప్పులకు నిజమైన భూ యజమానులు పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూనే ఉన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల్లో సగానికి పైగా భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఉంటున్నాయి. ముఖ్యంగా పోలీస్ గ్రీవెన్స్కు వచ్చే ఫిర్యాదుల్లో ఇవే అధికంగా ఉంటున్నాయి. సివిల్ వివాదం కావడంతో ఇప్పటి వరకు పోలీసులు ఇందులో తామేమీ చేయలేమని చెబుతూ వస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ భూ వివాదాలపై దృష్టి సారించడంతో పాటు వాటికి చెక్ పెట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇది పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులతో కూడా సమన్వయంతో కూడి చేయాల్సిన పని కావడంతో స్పందనపై సీఎం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో తమ ప్రణాళికను సీఎంకు వివరించారు. ఎస్పీ సూచన సరైనదేనని భావించిన సీఎం వైఎస్ జగన్ దానిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆచరణలో పెట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వెల్డన్ సిద్ధార్థ్ అంటూ ఎస్పీని అభినందించారు. సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆలోచన వల్ల ఇందులో మరో అడుగు ముందుకు పడింది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్, ఎస్పీ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో భూ వివాదాలపై వచ్చే ఫిర్యాదులకు ఐదు రోజుల్లో పరిష్కారం చూపించాలని ప్రభుత్వం, అధికారులు ప్రణాళిక రూపొందించారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం స్పందనలో ఫిర్యాదులు అందిన వెంటనే వాటిలో నుంచి భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను వేరు చేసి మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి వాటిని పంపుతారు. కలెక్టరేట్కు వచ్చిన ఫిర్యాదులను ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాలకు బుధవారం చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. గురువారం మండల కేంద్రంలో తహశీల్దార్, స్థానిక పోలీస్ అధికారి, సర్వేయర్, పంచాయతీ అధికారి ఇలా సంబంధిత అధికారులంతా సమావేశమై ఉన్నతాధికారుల నుంచి అందిన భూవివాదాల ఫిర్యాదులను పరిశీలిస్తారు. అధికారులంతా కలిసి శుక్రవారం ఫిర్యాదుదారుడిని పొలం లేదా స్థలం వద్దకు జాయింట్ ఇన్స్పెక్షన్కు వెళ్లి వివాదం ఉన్న వ్యక్తితో పాటు గ్రామ పెద్దలను పిలిపించి దానిపై చర్చిస్తారు. అక్కడికక్కడే పరిష్కారం అయ్యే వాటిని పరిష్కరించి, పెద్ద మనుషుల సమక్షంలో లిఖిత పూర్వక ఒప్పంద పత్రాలు రాయిస్తారు. ఇందులో ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని తేలితే పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. తహశీల్దార్ దీనిపై నోటీసులు జారీ చేస్తారు. నిజమైన భూ యజమానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. ఒక వేళ న్యాయపరమైన చిక్కులు ఉంటే తాత్కాలిక చర్యలు చేపట్టి కోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరించేలా చర్యలు చేపడతారు. ఇలా ఐదు రోజుల్లో స్పందనకు వచ్చిన భూ వివాదాల ఫిర్యాదులను పరిష్కరించే దిశగా తొలి అడుగు పడింది. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చిన 20 భూ వివాదాల ఫిర్యాదులను కలెక్టర్ కార్యాలయానికి పంపారు. కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్లు వీటిపై మంగళవారం చర్చించారు. బుధవారం నుంచి పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భూ వివాదాల పరిష్కారం ఇక సులభతరం.. గ్రామాల్లో రైతులు, గ్రామస్థుల మధ్య భూ వివాదాలే ఎక్కువుగా జరుగుతుంటాయి. సివిల్ వివాదాలంటూ పోలీసులు పట్టించుకోక పోవడం... రికార్డుల ఆధారంగా చర్యలంటూ రెవెన్యూ అధికారులు చెబుతుండడం, సర్వే నిర్వహించేందుకు సర్వేయర్లు నిరాకరిస్తుండడంతో ఈ వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. కొంత మంది కోర్టుల చుట్టూ తిరుగుతుండగా మరి కొందరు మాత్రం నిత్యం గొడవలు పడుతూనే ఉన్నారు. స్పందనలో వచ్చే భూ వివాదాలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కారం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడంతో ఇక భూ వివాదాలకు చెక్పెట్టడం సులభతరం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల గ్రామాల్లో ప్రజల మధ్య వైషమ్యాలు తగ్గి శాంతి భద్రతలకు సైతం విఘాతం కలగకుండా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఫిర్యాదులు అంటే కింది స్థాయి అధికారులకు పంపి చేతులు దులుపుకోవడం కాకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీలు నేరుగా రంగంలోకి దిగి వీటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టడంపై అభినందనీయం. -
మర్లగూడెం.. రణరంగం
సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమగోదారి) : బుట్టాయగూడెం మండలం లోని మర్లగూడెం అటవీ ప్రాంతంలో మళ్లీ భూ వివాదం చెలరేగింది. బూసరాజుపల్లి, తూర్పురేగులకుంటకు చెందిన కొందరు గిరిజనులు అడవి భూములపై తమకు హక్కు ఉందంటూ అడవిలోని మొక్కలను మంగళవారం నరికే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం రేంజర్ కె.శ్రీవాణి ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గిరిజనులను అడ్డుకున్నారు. ఈ సమయంలో అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కంపేటకు చెందిన కొందరు ఆ భూములపై తమకూ హక్కు ఉందంటూ వచ్చారు. ఆ సమయంలో గిరిజనులకు, అక్కంపేటకు చెందిన వారికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బూసరాజుపల్లికి చెందిన కొవ్వాసు రామచల్లాయమ్మ అనే గిరిజన యువతిపై అక్కంపేటకు చెందిన వ్యక్తి దౌర్జన్యం చేసినట్టు గిరిజనులు ఆరోపించారు. ఆమె చేతికి గాయం కావడంతో వైద్యం చేయించి తీసుకువచ్చారు. మధ్యాహ్నం వరకూ ప్రశాంతమైన వాతావరణం ఉన్నా అనుకోకుండా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చల్లాయమ్మను కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ ఫారెస్ట్ అధికారులను గిరిజనులు నిర్బంధించారు. అడవి నుంచి బయటకు రాకుండా రహదారిపై అడ్డంగా కూర్చున్నారు. సమాచారం అందుకున్న బుట్టాయగూడెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గిరిజనులతో ఏఎస్సై ఐ.భాస్కర్ చర్చలు జరిపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అయితే యువతిపై దౌర్జన్యం చేసిన వ్యక్తిని పోలీసులు తీసుకువచ్చే ప్రయత్నం చేయగా అతడు అందుబాటులో లేకపోవడంతో తిరిగి వచ్చారు. చీకటిపడే సమయం కావడంతో పోలీసులు రహదారికి అడ్డంగా కూర్చున్న గిరిజనులను తప్పించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. గిరిజనులను తొలగిస్తూ నిర్బంధంలో ఉన్న వాహనాన్ని బయటకు తీసుకువచ్చే సమయంలో గిరిజనులకు, ఏఎస్సై భాస్కర్కు మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదం జరిగింది. అదే సమయంలో రేంజ్ అధికారి శ్రీవాణిని గిరిజన మహిళలు చుట్టుముట్టారు. వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులు రేంజ్ అధికారి శ్రీవాణిని వాహనంలో బయటకు తరలించారు. మహిళా పోలీసులు లేకుండా తమపై అధికారులు దౌర్జన్యం చేశారంటూ గిరి జన మహిళలు మడకం శారద, కొవ్వాసి వరలక్ష్మి, పైదా రాములమ్మ, ముచ్చిక గంగమ్మ ఆరోపించారు. చీకటి పడంతో అటవీ ప్రాంతం నుంచి ఎవరికి వారు వెళ్లిపోయారు. -
శాశ్వత పరిష్కారం చూపుతాం - మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సింహాచలం పంచ గ్రామాల భూసమస్య పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు ఎన్నికలకు ముందు తప్పుడు జీవోల పేరుతో మాయ చేసిందే తప్ప సమస్యకు పరిష్కారం చూపలేదు. ఫలితంగా పీఠాధిపతులు కోర్టును ఆశ్రయించారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు విన్నవించిన ఈ సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ హామీని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు జరపడమే కాకుండా.. పంచ గ్రామాల భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం లభించేలా సమగ్రమైన జీవో ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. -
దంపతుల దారుణహత్య
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్) : భూ తగాదా దంపతుల దారుణహత్యకు దారితీసిన సంఘటన మండలంలోని ఖిర్డీ గ్రామశివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఖిర్డీ గ్రామ శివారులో సర్వే నం.71లో తొమ్మిది ఎకరాల భూమి విషయమై శుక్రవారం రెండు కుటుంబాల మధ్య జరిగిన తగాద హత్యకు దారి తీసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాయిసిడాం శ్యాంరావు నానమ్మ మారుబాయి పేరుతో ఖిర్డీ శివారులో సర్వే నం.71లో తొమ్మిది ఎకరాల భూమి ఉంది. అట్టి భూమిని ఇన్నాళ్లు రాయిసిడాం మారుబాయి కూతురి కుమారులు తెలంగ్రావు కుటుంబ సభ్యులు కౌలుకు ఇస్తూ అనుభవిస్తూ వస్తున్నారు. అట్టి భూమి శ్యాంరావు నానమ్మ పేరున ఉండడంతో తాతల సంతతీ మనుమలకు చెల్లుతుందని శుక్రవారం శ్యాంరావు అతని భార్యతో కలిసి అదే చేనులో పనులకు వెళ్లాడు. విషయం తెలుకున్న సెడ్మక తెలంగ్రావుతో పాటు కుటుంబ సభ్యులైన శారద, బోజ్జిరావు, జంగుబాయి, యశ్వంత్రావు, గంగారాం శ్యాంరావు వద్దకు వెళ్లారు. ఈభూమి మాది.. నువ్వెలా చేస్తావని అతనితో వాదనకు దిగారు. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ పెరగడంతో తెలంగ్రావు కుటుంబ సభ్యులు శ్యాంరావు దంపతులపై గొడ్డిలితో దాడిచేయడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వాంకిడి ఎస్పై చంద్రశేఖర్, ఆసిఫాబాద్ సీఐ రాజు, డీఎస్పీ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ మల్లారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పథకం ప్రకారం హతమార్చారు రాయిసిడాం శ్యాంరావు నానమ్మ అయిన మారుబాయి పేరుమీద ఉన్న భూమిని మనుమడైన రాయిసిడాం శ్యాంరావుకు చెందుతుందని, అట్టి భూమిలో సేద్యం చేయడానికి శుక్రవారం శ్యాంరావు, అతని భార్య తారాబాయితో కలిసి చేను పనులకు వెల్లారు. విషయం తెలుసుకున్న తెలంగ్రావు కుటుంబసభ్యులతో వచ్చి తగాదాకు దిగాడు. మాటామాట పెరగడంతో పధకం ప్రకారం గొడ్డలితో దాడిచేసి హతమార్చారని శ్యాంరావు కుమారులు రాజు, విలాస్, కూతురు నీల ఆరోపించారు. గతంలో సైతం భూతగాదాల విషయం పోలీసులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. అట్టి తగాదాలే హత్యకు దారితీశాయని, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దంపతుల పెద్ద కుమారుడు రాయిసిడాం విలాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. -
సీఎం కేసీఆర్కు సెల్ఫీ వీడియో.. ముగ్గురు పిల్లలతో అదృశ్యం
-
ఉలిక్కిపడిన బహదూర్గూడ
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): మూడు తరాలుగా ఆ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. గ్రామంలో 90 శాతం మందికి ఆ పొలమే జీవనాధారం. సుమారు 70 ఏళ్ల క్రితం అధికారులు వారికి పట్టా పాసు పుస్తకాలు సైతం జారీ చేశారు. ఆ తర్వాత వారసుల పేరిట హక్కుల మార్పిడితో పట్టా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉలిక్కిపడ్డారు. బహదూర్గూడ భూములు ప్రభుత్వానివే అంటూ న్యాయస్థానం తీర్పు చెప్పడంతో తాము జీవనాధారం కోల్పోతామని, ఎలా బతకాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల నుంచి వివాదాస్పదంగా మారిన శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ భూములు ప్రభుత్వానికి చెందినవంటూ తీర్పు రావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాలు.. బహదూర్గూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1 నుంచి 101లో 1,351 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో సుమారు 80 ఏళ్ల నుంచి స్థానిక రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పలు దఫాలుగా అధికారులు రైతులకు పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారు. అంతేకాకుండా రైతులు ఈ భూములకు సంబంధించి శిస్తు కూడా చెల్లించారు. ఈ భూముల్లో ప్రస్తుతం బహదూర్గూడ, లక్ష్మీ తండాకు చెందిన దాదాపు 500లకు పైగా సన్న, చిన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములు వివాదాస్పదం కావడంతో ఇప్పటివరకు రెండుసార్లు ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేశారు. గతేడాది జూన్లో జాయింట్ కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఈ భూములను పరిశీలించి, రైతులకు పట్టా పుస్తకాలు, రైతుబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వివాదం మొదలైంది ఇక్కడే.. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూములకు పహాణీ, నక్షలో సర్వే నంబర్లు వ్యత్యాసం రావడంతో వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా ఈ భూములు ప్రభుత్వానివంటూ అధికారులు చెబుతూ వస్తున్నారు. దీంతో రైతుల అభ్యర్థనతో 2002లో ఎంజాయ్మెంట్ సర్వే చేసి కొందరికి పట్టా పుస్తకాలు కూడా జారీ చేశారు. ఇక్కడే సమస్యకు ఆజ్యం పోసింది. ఎంజాయ్మెంట్ సర్వే చేసిన తర్వాత ప్రకటించిన సర్వే నంబర్లు, పాత సర్వే నంబర్లకు పొంతన కుదరలేదు. దీంతో ఈ భూములన్నీ వివాదాస్పదంగా మారిపోయాయి. మరో వైపు రైతులకు జారీ చేసిన పట్టా పుస్తకాలతో రైతులకు ఎలాంటి సబ్సిడీ, రుణ సదుపాయాలు కల్పించలేదు. ఇదే సమయంలో ఈ భూములను ఆనుకుని అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడంతో నేతల కన్ను ఈ భూములపై పడింది. భూములను ప్రభుత్వం సేకరించనుందని అపోహలు సృష్టించిన కొందరు మధ్యవర్తులు.. రైతులను మభ్యపెట్టి బేరమాడి విక్రయించేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ భూములను కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ బినామీల పేర్లతో రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత కేంద్రం, రాష్ట్రంలో అధికారం మారడంతో నాయకులు తెరవెనక కనుమరుగయ్యారు. రంగంలోకి ప్రైవేటు వ్యక్తులు సర్వే నంబర్లు 1 నుంచి 101 వరకు ఉన్న 1,351 ఎకరాల్లోని సగం భూములు ప్రభుత్వ భూములంటూ రెవెన్యూ అధికారులు వాదించసాగారు. సర్వే నంబరు 62, 28లోని 701 ఎకరాలు ప్రభుత్వ భూములంటూ 2014లో తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు పొలాలను స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడంతో వాటిని ఆసరా చేసుకుని రికార్డులను తారుమారు చేయగా.. తహసీల్దార్ ఉత్తర్వులతో వారి ఆగడాలకు అడ్డుకట్ట పడింది. కొన్నాళ్లకు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూములను ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. 2017లో హైకోర్టులో ఈ భూములపై పిటిషన్ వేయగా.. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవంటూ తాజాగా హైకోర్టు తీర్పు వెలువడింది. రైతుల వాదన ఇదీ.. అధికారులు చెబుతున్నట్లుగా సర్వే నంబర్లు 62, 28లో 701 ఎకరాల ప్రభుత్వ భూమి లేదని రైతులు వాదిస్తున్నారు. సేత్వారు, నక్షలో ఎక్కడ కూడా ఈ భూములు ప్రభుత్వ భూములని రికార్డుల్లో లేదంటున్నారు. çసర్వే నంబర్లు 76 నుంచి 101 వరకు రైతులు కబ్జాలో ఉన్న భూములను ప్రభుత్వం సర్వే నంబర్లు 62, 28గా పేర్కొంటోందని చెబుతున్నారు. 1952లో ఈ భూముల యజమాని లతా పునిసాబేగం ఇక్కడి రైతులకు కొంత భూమిని పట్టా చేసి, మరికొంత భూమిని కబ్జా ఇచ్చిందని అంటున్నారు. 2014లో ఈ భూములపై తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వుల విషయం కూడా ఇప్పటి వరకు తమకు తెలియదని చెబుతున్నారు. హైకోర్టు తీర్పు పత్రికల్లో రావడంతోనే తమకు విషయం తెలిసిందంటున్నారు. న్యాయం కోసం ఎమ్మెల్యే సహాయంతో సీఎంను కలిసి సమస్య వివరిస్తామని చెబుతున్నారు . మా నాన్న భూమి నాకు సంక్రమించింది... సర్వే నంబరు 37, 38, 39లో 2 ఎకరాల 25 గుంటల పొలానికి మా నాన్న ఆశన్న పేరుతో 1981లో పాసు పుస్తకం ఇచ్చారు. ఆ తర్వాత ఈ భూమిని నా పేరుతో 2006లో పట్టా పుస్తకం జారీ చేశారు. ఈ భూమి పైనే ఆధారపడి బతుకుతున్నాం. పొలాలు రైతులవని కావదని చెబితే మేం ఎక్కడికి వెళ్లాలి. – కుమ్మరి ఎంకయ్య, రైతు, బహదూర్గూడ మాకు పొలమే జీవనాధారం వారసత్వంగా నాకు సర్వే నంబరు 25లో 8 గుంటల భూమిపై నాకు 2009లో పట్టా పుస్తకం ఇచ్చారు. నాకు ఈ పొలమే జీవనాధారం. మాకు రైతు బంధు, బీమా కూడా ఇవ్వడం లేదు. బ్యాంకుల్లో రుణాలు ఇస్తలేరు. ఈ భూములు తీసుకుంటే మేమెలా బతికేది. – నక్క పర్వతాలు, రైతు, బహదూర్గూడ -
అందరికీ పాస్ పుస్తకాలు అందేలా కృషి
సాక్షి, దమ్మపేట: ఏళ్లతరబడి సాగులో ఉన్న భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ విషయంలో జరుగుతున్న జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అర్హులైన రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దమ్మపేటలోని టీడీపీ మండల కన్వీనర్ నాయుడు చెన్నారావు ఇంటికి గురువారం వచ్చిన ఎమ్మెల్యేను వచ్చారు. దమ్మపేట, మందలపల్లి రైతులు కొందరు రైతులు కలిశారు. రైతులు గడ్డిపాటి సత్యం, అడపా సుబ్బారావు, ఎంఏ కబీర్, గడ్డిపాటి బాబు తదితరులు మాట్లాడుతూ... భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని అన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ, ఏళ్లతరబడి పట్టాదార్ పాçస్ పుస్తకాలు పంపిణీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాల కోసం ఇంట్లో అందరం తిరుగుతున్నామని అన్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగా రైతుబంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ రుణాలు అందడం లేదని, భూమి క్రయ–విక్రయాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూలో ఏమైనా పొరపాట్లుంటే సరిచేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో మండలంలో అన్ని సర్వే నంబర్లను అధికారులు ప్రక్షాళన చేయలేదని ఫిర్యాదు చేశారు దమ్మపేట శివారు నల్లకుంటలోని 273/1, జమేదార్ బంజర్లోని 884/1 సర్వే నంబర్లతోపాటు పట్వారీగూడెం, నాగుపల్లి రెవెన్యూ గ్రామాల్లోని కొన్ని సర్వే నంబర్లోని భూ రికార్డులను ప్రక్షాళన చేయలేదని వివరించారు. ఈ కారణంగా ఆయా నంబర్లలోని రైతులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు అందలేదని చెప్పారు.దీనికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందించారు. ఈ సమస్యలు నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. వీటి పరిష్కారంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘రెవెన్యూ రికార్డుల్లో లోపాలు, అర్హులైన రైతులకు పట్టాదార్ పాస్ పుసస్తకాలు, పోడుదారులకు పట్టాల పంపిణీపై ఆదివాసీ ఎమ్మెల్యేలం ఐదుగురం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఈ సమస్యను వివరించాం. సమగ్ర సర్వే చేసి, రైతులకు న్యాయం చేద్దామని అన్నారు. రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరో రెండు నెలల్లో ఈ సమస్యలు పరిష్కారమవుతాయి’’ అని చెప్పారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ అత్తులూరి వెంకటరామారావు, రైతులు– నాయకులు ఎండీ వలీపాష, ఎండీ అబ్దుల్ జిన్నా, బొల్లిన రవికుమార్, గన్నమనేని విజయ్కుమార్, చెప్పుల జగదీష్, ఉయ్యాల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
ప్రభాస్ పిటిషన్పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లో తనకు చెందిన 2,083 చదరపు అడగుల స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ సినీనటుడు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. తమ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ ప్రభాస్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ఆయన బుధవారం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్ విచారణ ప్రారంభించగా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్.శరత్కుమార్ స్పందిస్తూ.. ప్రభాస్ స్థల వివాదం సివిల్ సూట్ 7, 14లకు సంబంధించిందని, దీనిపై మరో ధర్మాసనం విచారణ జరుపుతోందని తెలిపారు. దీంతో న్యాయమూర్తి తన ముందున్న ప్రభాస్ పిటిషన్ను ధర్మాసనానికి బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. గురువారం నాటి విచారణ జాబితాలో ఈ కేసు లేకపోవడంతో జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రభాస్ న్యాయవాది తమ పిటిషన్పై ప్రస్తావించారు. -
తల్లీకొడుకు కలిసి చంపేశారు
తిరుమలాయపాలెం: ఏడు కుంటల భూమి కోసం కట్టుకున్న భర్తను కుమారుడితో గొడ్డలితో నరికి చంపేసింది. మండలంలోని బీరోలు గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... బీరోలుకు చెందిన బుడిగె సీతారాములు(65)కు భార్య సోమలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో సోమలక్ష్మి మృతిచెందింది. అప్పుడే సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ వివాహితులు. సత్యవతి, కొన్నేళ్ల క్రితం తన భర్తను వదిలేసి ఖమ్మంలో ఉంటోంది. రెండేళ్ల నుంచి కుమారుడు శ్రీధర్, కోడలితో కలిసి భర్త సీతారాములు ఇంట్లోనే ఓ గదిలో ఉంటోంది. సీతారాములుకు 15 కుంటల భూమి ఉంది. అందులో వాటా కోసం గొడవలు జరిగాయి. ఏడు కుంటల భూమిని సత్యవతి పేరిట స్టాంప్ పేపర్పై సీతారాములు రాసిచ్చాడు. భూమి పట్టా మాత్రం సీతారాములు పేరిటనే ఉంది. తన పేరున పట్టా చేయించాలని ఆమె పట్టుబట్టింది. దీనికి అతడు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అతడి ఆలనాపాలనను వారు పట్టించుకోవడం లేదు. దీంతో, అతడు గ్రామంలోనే భిక్షాటన చేసుకుంటున్నాడు. పగ పెంచుకున్న సత్యవతి, తన కుమారుడు శ్రీధర్తో కలిసి శుక్రవారం అర్థరాత్రి సీతారాములును గొడ్డలితో నరికి చంపింది. శనివారం తెల్లవారుజామున ఇది వెలుగు చూసింది. మృతదేహాన్ని ఎస్ఐ సర్వయ్య, ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజి రమేష్, కూసుమంచి సీఐ ఓం మురళి పరిశీలించారు. నిందితులైన సత్యవతిని, శ్రీధర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. కేసును కూసుమంచి సీఐ ఓం మురళి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్న చేతిలో చెల్లెలు దారుణ హత్య
ప్రకాశం, స్వర్ణ (కారంచేడు): కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే కాలయముడయ్యాడు. తాతల కాలం నుంచి వస్తున్న కేవలం 7 సెంట్ల స్థలం వివాదం చెల్లి ప్రాణం తీస్తే.. అన్నను జైలు పాలు చేయనుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే స్వర్ణ గ్రామంలో హత్య జరగడంతో ప్రజలు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. తోడ పుట్టిన వాడు కాకపోయినా పెద్దనాన్న కొడుకు అయిన అన్నే తనను హతమారుస్తాడని ఆ చెల్లి ఊహించలేకపోయింది. చీరాల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కారంచేడు మండలం స్వర్ణ ఉత్తర బజారుకు చెందిన సుంకల పద్మావతి (28)ని ఈ ఏడాది మార్చి నెలలో జిల్లాలోని బేస్తవారిపేట మండలం రెట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు. హైదరాబాద్ నుంచి స్వర్ణ వచ్చిన పద్మావతిని అదే గ్రామానికి చెందిన సూదా శింగయ్య శివాలయం సమీపంలో మాటు వేసి బజారుకు వెళ్లి వస్తున్న ఆమెను కత్తితో పొడిచి చంపాడు. మొదట శివాలయం ప్రహరీ గోడకు తలను బలంగా గుద్దాడు. అనంతరం ఛాతీ భాగంలో కత్తితో బలంగా పొడిచి కేశవరప్పాడు రోడ్డు గుండా పారిపోయాడు. మృతురాలు వివాహం అనంతరం ఆమె భర్త ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో నివాసముంటున్నారు. గతంలో మృతురాలు నేషనల్ యువజన కేంద్రీయ విద్యలో ఉద్యోగం చేసింది. దీనిలో భాగంగా అక్టోబర్ 2వ తేదీన రివార్డు తీసుకోవడానికి సోమవారం సాయత్రం స్వగ్రామానికి చేరుకుంది. అప్పటికే ఆస్తుల గొడవలతో ఆమెపై కక్ష పెంచుకున్న వరుసకు అన్న అయిన సూదా శింగయ్య హత్య చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సోమవారం రాత్రి కూడా ఇంటి పరిసరాల్లో సంచరించాడని మృతురాలి తల్లి వెంకాయమ్మ భోరున విలపించింది. ఆస్తి తగాదాలే కారణమా.. తాతల కాలం నుంచి వచ్చే కేవలం 7 సెంట్ల వ్యవసాయ భూమితో పాటు ఇంటి సరిహద్దు వివాదమే హత్యకు కారణమై ఉంటాయని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి గొడవలు జరగడం లేదని, ప్రశాంతంగా ఉంటున్న ఈ సమయంలో తన కుమార్తెను శింగయ్య పొట్టన పెట్టుకున్నాడని మృతురాలి తండ్రి బోరున విలపించాడు. మాకు కూడా ప్రాణగండం ఉంది.. కొద్దిపాటి ఆస్తి తగాదాలతో తమ చెల్లిని పొట్టన పెట్టుకున్న శింగయ్య చేతిలో తమకు కూడా ప్రాణ గండం ఉందని మృతురాలి అక్కలు శివకుమారి, విజయలక్ష్మిలు భోరున విలపిస్తున్నారు. మా తండ్రి మేము నలుగురం అమ్మాయిలమని, మా అందరిలో తెలివిగా ఉండే మా చెల్లిని చంపేశాడని, మిగిలిన మమ్మల్ని కూడా చంపేస్తాడనే భయం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు గ్రామానికి రాకుండా ఉన్నా మా చెల్లి బతికి ఉండేదని వారు విలపిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. దర్యాప్తు చేస్తున్నాం.. హత్య జరిగిన వెంటనే చీరాల సీఐ భక్తవత్సలరెడ్డి, ఈపురుపాలెం ఎస్ఐ కే హానోక్తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి విషయాన్ని హైదరాబాద్లో ఉన్న భర్తకు తెలియజేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. -
భరతమాత ముద్దుబిడ్డ.. పోలీసులకు సవతిబిడ్డ!
దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయని ఆ జవాను తన సొంత స్థలాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. శత్రువు ఎదురుపడితే నిప్పులు కురిపించే ఆ కళ్లు కన్నీరు కారుస్తున్న దయనీయ స్థితి. జవానుకు అండగా నిలవాల్సిన పోలీసులు.. ఏకపక్షంగా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఓ అనామకుడు గుంపునేసుకొచ్చి చేతిలో రాయి తీసుకొనిబండ బూతులు తిడుతూ కొట్టే ప్రయత్నం చేస్తుండగా, తన వద్దనున్న పిస్టోల్ను చేతపట్టుకోవడం నేరమైంది. చంపి పాతేస్తాం అని బెదిరించినా సంయమనం పాటించిన పాపానికి పోలీసుస్టేషన్లో బట్టలు లేకుండా కూర్చోవాల్సి వచ్చింది. గతంలో జవాన్ చేసిన ఫిర్యాదుపై ఏనాడూ స్పందించని నాల్గో పట్టణ పోలీసులు.. సోమవారం మరో వర్గం ఫోన్ చేయగానే అక్కడ వాలిపోవడం గమనార్హం. ఇదీ..మన పోలీసుల నీతి, నిజాయితీ. అనంతపురం సెంట్రల్: దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. తల్లిదండ్రులకు, భార్యాబిడ్డలకు సుదూరంగా అనుక్షణం దేశ రక్షణలో నిద్రాహారాలు మాని బహిర్గత, అంతర్గత శత్రుమూకలతో యుద్ధం చేస్తున్న సైనికుడికి ఘోర అవమానమే ఎదురైంది. తనకు చెందిన స్థలాన్ని ఇతరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తే ఫలితం లేకపోగా.. దోషిగా చూపుతూ అదే పోలీసులు కేసు నమోదు చేసి తమ వైఖరి ఇంతేనంటూ లోకానికి చాటిచెప్పారు. అసలేం జరిగింది తనకల్లు మండలం కె.వి.పల్లికి చెందిన సి.నాగరాజు.. బిహార్లోని కిషన్గంజ్ 139వ బీఎస్ఎఫ్ బెటాయలియన్లో జవాన్గా పనిచేస్తున్నారు. తనకు వస్తున్న జీతంలో కొంత మేర దాచుకుంటూ వచ్చిన డబ్బుతో అనంతపురం శివారులోని రుద్రంపేట జాతీయ రహదారి వద్ద ఉన్న రాజహంస అపార్ట్మెంట్ వెనుక ఐదు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ స్థలంపై కన్నేసిన నగరానికి చెందిన సంజన్న కుమారులు.. దాని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయంపై నాల్గో పట్టణ పోలీసులకు నాగరాజు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి సమస్య వివరిస్తూ తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా సాగుతున్న ఈ తంతులో పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇటీవల సెలవుపై ఇంటికి వచ్చిన నాగరాజు.. ఆ స్థలంపై పూర్తి హక్కు తనకే ఉందనే భావనతో తాత్కాలిక ఫెన్సింగ్ వేయడానికి సోమవారం ప్రయత్నించారు. ఒక్కడే గోడ నిర్మిస్తుండగా మరో వర్గం వారు అక్కడకు చేరుకుని ఘర్షణకు దిగారు. బండ రాళ్లు తీసుకుని జవాన్పై దాడికి తెగబడ్డారు. వారి నుంచి ఆత్మరక్షణ పొందేందుకు తన వద్ద ఉన్న పిస్టల్ని జవాన్ బయటకు తీశారు. దీంతో తగ్గిన ప్రత్యర్థులు బూతులు తిడుతూ.. జవాన్ను పలుమార్లు తోస్తూ ఘర్షణను మరింత పెద్దది చేశారు. అయినప్పటికీ జవాన్ సంయమనం కోల్పోకుండా ఏదైనా వివాదం ఉంటే కోర్టులో తేల్చుకుందామంటూ చెబుతున్నా వినలేదు. కొడితే కొట్టించుకో.. ప్రత్యర్థులు కొడితే కొట్టించుకోవాల్సిందే అన్న రీతిగా మారింది పోలీసుల తీరు. ప్రత్యర్థులు తనపై బండరాళ్లు తీసుకుని దాడికి తెగబడుతుంటే ఆత్మరక్షణ కోసం పిస్టల్ తీసి చూపించి, ప్రాణాలు కాపాడుకోవడం జవాన్ పాలిట శాపమైంది. గతంలో జవాన్ చేసిన ఫిర్యాదుపై ఏనాడూ స్పందించని నాల్గో పట్టణ పోలీసులు ఏకంగా సోమవారం తమకు సమాచారం అందగానే ఉన్నఫళంగా ఘటన స్థలానికి చేరుకుని దాడికి కారకులైన వారిని కాకుండా జవాన్ నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. దుస్తులు ఊడదీయించి లాకప్లో వేశారు. అనంతరం ఆర్మీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు చూపితే తప్పు కాదా? ప్రాణాలు కాపాడుకునేందుకు పిస్టల్ బయటకు తీసి భయపెట్టిన జవాన్పై కేసు నమోదు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. బండరాళ్లతో దాడి చేసేందుకు యత్నించిన వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే అన్ని విషయాల్లో పోలీసులు ఇలాగే వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్థల వివాదం కోర్టులో ఉందనే కారణం చూపుతూ ఇంత కాలం చర్యలకు వెనకగడుగు వేసిన పోలీసులు.. కోర్టులో ఉన్న ఎన్నో వివాదాల్లో తలదూర్చడాన్ని మరిచిపోయి జవాన్కు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నో ఘటనల్లో పోలీసు అధికారులు తమ వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ చూపి ప్రజలను బెదిరించిన విషయాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. పోలీసులకో న్యాయం.. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన జవాన్లకు మరో న్యాయమా అంటూ పోలీసుల తీరును ఎండగడుతున్నారు. ఆత్మరక్షణ కోసమే గన్ తీసా రూపాయి రూపాయి కూడబెట్టి ఐదు సెంట్లు స్థలం కొనుగోలు చేశాను. ఈ స్థలం కోసం ఎంతో కష్టపడ్డా. కొన్న తర్వాత ఈ స్థలం తమదంటూ కొందరు వస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు పోలీసులను కలిశాను. సీఐ, డీఎస్పీలందరినీ వేడుకున్నాను. ఎవరూ పట్టించుకోలేదు. స్థలం కబ్జా చేయకూడదనే ఉద్దేశంతో సెలవుపై వచ్చి, నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. నాపై దాడి చేయడానికి బండరాళ్లు తీసుకున్నారు. నేను ఒంటరిగా ఉన్నా.. ఏం చేయాలో తోచలేదు. రాళ్ల దాడి నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు పిస్టల్ తీసి చూపించాను. నా దగ్గరకు రావద్దంటూ చెప్పాను. నేను చేసింది తప్పే కావచ్చు. దేశం కోసం పనిచేస్తున్నాననే చిన్న కనికరం కూడా పోలీసులు చూపలేదు.– నాగరాజు, బీఎస్ఎఫ్ జవాన్ భూ వివాదం కోర్టులో నడుస్తోంది సదరు స్థల వివాదం కోర్టులో నడుస్తోంది. 2012లో ఆ స్థలాన్ని జవాను నాగరాజు కొనుగోలు చేశారు. 2005 నుంచే ఆ స్థల విక్రేత అన్నదమ్ముల మధ్య స్థల వివాదం నడుస్తోంది. సదరు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులున్నాయి. అయినా జవాన్ వెళ్లారు. నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళితే తుపాకీ చూపించి, బెదిరించారు. ఇది చట్టరీత్యా నేరం. అందుకే కేసు నమోదు చేశాం. – వెంకట్రావ్, డీఎస్పీ,అనంతపురం -
భూములు అప్పగించాలని ఆందోళన
చండ్రుగొండ : మండలకేంద్రం చండ్రుగొండలోని ప్రభుత్వ కార్యాలయాలు మంగళవారం ఆదివాసీ నాయకపోడు ఆందోళనతో ప్రభుత్వ కార్యాలయాలను ఆదివాసీలు దిగ్బంధించారు. అసైన్డ్ భూములను సర్వే చేసి తమకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ 190 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న ఆది వాసీ నాయకపోడులు ఉగ్రరూపం దాల్చారు. ఎండనక .. వాననక న్యాయమైన సమస్య పరిష్కరించాలని కోరుతూ దీక్షలు చేస్తున్న ఆదివాసీలు ఒక్కసారిగా జూలు విదిల్చారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ ఏకమయ్యారు. వేకువజామునే ప్రభుత్వ కార్యాలయ ఎదుట బైఠాయించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఐకేపీ కార్యాలయాల్లోకి అధికారులు, సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గంటల తరబడి ఆందోళన సాగింది. ఈ క్రమంలో తహసీల్దార్ గన్యానాయక్ అక్కడి చేరుకున్నారు. ఆందోళనకారులు తహసీల్దార్ను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో కలిసి ఆయన లోపలికి వెళ్లి తన గదిలో ఆసీనులయ్యారు. వెనుక నుంచి ఆదివాసీలు నినాదాలు చేసుకుంటూ కార్యాలయంలోకి ప్రవేశించించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎస్ఐ కడారి ప్రసాద్ ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మూడు గంటల ఆందోళన అనంతరం అధికారుల హామీల నేపథ్యంలో ఆదివాసీలు శాంతించారు. దామరచర్లలోని భూములను తహసీల్దార్ గన్యానాయక్ సందర్శించారు. గిరిజనేతరులతో ఆయ న మాట్లాడారు. సమస్య పరిష్కరించేంత వరకు సంయమనం పాటించాలని వారికి సూచించారు. అసలు విషయం ఏమిటంటే.. మండలంలోని దామరచర్లలో ఉన్న 130 ఎకరాల సీలింగ్ భూములను 1990లో సీతాయిగూడెం, అయన్నపాలెం గ్రామాలకు చెందిన 40 ఆదివాసీ నాయక పోడులకు ఎసైన్మెంట్ పట్టాలను రెవెన్యూ అధికారులు ఇచ్చారు. అయితే అప్పటికే ఆ భూములు గిరిజనేతర పేదల ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఆ భూములు నాయకపోడులకు చెందలేదు. అనంతరం పలుమార్లు నాయకపోడు ప్రతి అధికారికి, ప్రజాప్రతినిధికి తమ భూములు ఇప్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలంగా గడిచిన 190 రోజులుగా ఆందోళన ముమ్మరం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి రాజిన్ని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇక్కడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట, జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని కలెక్టరేట్ ఎదురుగా ధర్నాచౌక్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. -
హత్యలకు దారితీస్తున్న వివాదాలు
జనగామ అర్బన్: జనగామ జిల్లాలో వివాదాలు హత్యలకు దారితీస్తున్నాయి. దశాబ్దాలుగా రగులుతున్న భూ వివాదాలతో పాటు ఆర్థిక పరమైన లావాదేవీలు, అక్రమ సంబంధాలు పలువురి ప్రాణాల మీదకు వస్తున్నాయి. చిన్న తగాదాలే చిలికి చిలికి గాలివానలా తయారై హత్యలకు దారితీస్తున్నాయి. జనగామలో 38 ఏళ్ల క్రితం ఓ టీచర్ హత్యతో మొదలైన సంఘటనలు ప్రెస్టన్ పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ దైదా క్రిష్టోఫర్ను అతి కిరాతకంగా హత్యచేసిన సంఘటన వరకు కొనసాగుతూనే ఉన్నాయి. భూ వివాదాలతో పాటు ఇతర కారణాలే హత్యల వరకు దారితీస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. హత్యచేసిన వారిలో కొందరు నేరుగా వచ్చి పోలీసులకు లొంగిపోతుండటంతో జిల్లాలో ఫ్యాక్షన్ కల్చర్ను మైమరిపిస్తోంది. పగలు, ప్రతీకారాలతో రగిలిపోతూ అవకాశం కోసం ఎదురు చూస్తూ తిరిగి ప్రత్యర్థులను మట్టుపెట్టే విధంగా ప్రణాళికలను రూపొందించుకొని హత్యలు చేయడంతో కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో పాటు పోలీసు వ్యవస్థనే ప్రశ్నించే స్థితికి దారి తీస్తుందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. జిల్లాలో పగలు, ప్రతీకారంతో దాడి చేసి హత్యకు గురైన సంఘటనలో కొన్ని... జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామశివారు వడ్డెర కాలనీలో 2013 ఆగçస్టు 13న రియల్టర్ శివరాత్రి విజయ్ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. నెల్లుట్ల గ్రామశివారులోనే పందిగోటి మురళి 2016 డిసెంబర్ 26న హత్యకావించబడ్డాడు. లింగాలఘనపురం మండలం జీడికల్ గ్రామంలో భూ వివాదంలో 2017 సెప్టెంబర్లో కొండబోయిన రాములు అనే వ్యక్తి హైదరాబాద్లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండ్ కానిస్టేబుల్పై ప్రత్యుర్థులు 2018 జూన్ 16న దాడిచేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బచ్చన్నపేట మండలంలో రెండు సంవత్సరాల క్రితం పల్లెపు సిద్ధయ్య అనే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ను కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని హత్య చేశారు. 2017 మేలో మండలంలోని దబ్బగుంటపల్లి గ్రామంలో పంతుల బాలమణి భర్త శ్రీనివాస్ను హత్య చేసింది. ఎనిమిది నెలల క్రితం పోచన్నపేటలో నర్సింగ త్రివేణి అనే వివాహితను భర్త హత్య చేశాడు. స్టేషన్ఘన్పూర్ పరిధి చిల్పూరు మండలం పరిధి పల్లగుట్టకు చెందిన కొంతం భాగ్యలక్ష్మీని 2017 అక్టోబర్ 18న భూ వివాదంలో గిట్టని వారు సుఫారీ హత్యను చేయించారు. స్టేషన్ఘన్పూర్ శివునిపల్లికి చెందిన రాయపురం ధర్మయ్యను భార్య శాంతమ్మ 2018 ఏప్రిల్ 23న హత్యచేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సంచలనం రెకెత్తిస్తున్న హత్యలు.... జనగామ జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే రెం డు హత్యలు చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనాన్ని రేకెత్తిస్తోంది. వారం రోజుల క్రితం మండలంలోని చీటకోడూరులో మామ చేతిలో హత్యకు గురైన ఉదయ్ సంఘటన మరువక ముందే శుక్రవారం దైదా క్రిష్టోఫర్ హత్యకు గురికావడం గమనార్హం. భూ వివాదాలు, కుటుంబ కలహాలే హత్యలకు దారితీసి ఉంటాయని ప్రజలు చర్చిం చుకుంటున్నారు. జనగామ జిల్లాలోని ప్రెస్టన్ భూములకు సంబంధించి 1990 నుంచి 2007 వరకు ఐదుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఇందులో మాజీ నక్సలెట్స్తో పాటు రౌడీ షీటర్లు ఉండటం గమనార్హం. హత్య కేసు నమోదు దారుణహత్యకు గురైన ప్రెస్టన్ పాఠశాల కరస్పాండెంట్ దైదా క్రిష్టోఫర్ హత్యకేసుకు సంబంధించి పోలీసులు శనివారం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. క్రిష్టోఫర్ కుమారై ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదులో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఉపేష్, తరిగొప్పుల గ్రామానికి చెందిన ఉప్పలయ్యతో పాటు జనగామకు చెందిన కె.యం. జాన్ పేర్లు ఉన్నాయన్నారు. బాధితుల ఫిర్యా దు మేరకు దర్యాప్తును ప్రారంభించామన్నారు. ఇదిలా ఉండగా క్రిష్టోపర్ హత్యకు గురైన సంగతి తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా క్రిష్టోఫర్ను హత్య చేసిన వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారన్న విషయాన్ని మాత్రం అధికారులు ధ్రువీకరించలేదు. -
యువకుడి దారుణహత్య
సాక్షి, అనంతపురం సెంట్రల్ : నగరంలోని నారాయణరెడ్డి కాలనీకి చెందిన శ్రీరాములు(35) సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తాగుడు అలవాటున్న శ్రీరాములు రోజూ పొద్దుపోయేంత వరకు ఇంటికి వెళ్లేవాడు కాదు. సోమవారం కూడా పూటుగా మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుత్తిరోడ్డులోని ఓ ప్రైవేటు స్కూల్ సమీపాన గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. తలపై బండరాయి వేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో జన సంచారం తక్కువగా ఉండటంతో ఆలస్యంగా గుర్తించారు. భూ వివాదమే కారణమా..? గుంతకల్లు పట్టణానికి చెందిన సుధాకర్రెడ్డి, హేమకోటరెడ్డి దాయాదుల మధ్య 30 ఎకరాల భూ వివాదం నడుస్తోంది. సదరు భూమిని సుధాకర్రెడ్డి.. శ్రీరాములు పేరుతో జీపీఏ చేయించాడు. అనంతరం తాడిపత్రికి చెందిన మరో వ్యక్తికి అమ్మాడు. హేమకోటిరెడ్డి కూడా అదే భూమిని మరో వ్యక్తికి విక్రయించాడు. ప్రస్తుతం భూ సమస్య గుంతకల్లు కోర్టులో నడుస్తోంది. శ్రీరాములు సోమవారం కూడా అక్కడి కోర్టుకు హాజరై వచ్చాడు. దాదాపు రూ.కోట్లలో ఈ భూమి విలువ జేస్తుండడంతో శ్రీరాములును తప్పించేందుకే హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మహిళను తన్నిన ఎంపీపీ.. వైరల్!
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్ వాయిలో దారుణం జరిగింది. ఎంపీపీ మహిళను కాలితో తన్నడం ఉద్రిక్త పరిస్థతులకు దారితీసింది. భూతగాదాల వల్లే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ వివరాలిలా.. ఇందల్ వాయి మండలం గౌరారంకు చెందిన ఒడ్డె రాజవ్వ దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి వద్ద వ్యవసాయ భూమి, అందులోని మరో ఇంటిని కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదనంగా నగదు ఇవ్వాలని ఇమ్మడి గోపి డిమాండ్ చేస్తున్నారని రాజవ్వ ఆరోపించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇందల్ వాయిలో నివాసం ఉంటున్న ఎంపీపీ గోపి ఇంటి వద్దకు వచ్చి గొడవకు దిగారు. అమ్మిన ఇంటిని అప్పగించకుండా, తాళాలు వేసి తమకు ఇవ్వకపోవడం బాధిత రాజవ్వకు ఆగ్రహం తెప్పించింది. మాటామాటా పెరిగి ఆగ్రహంతో బాధిత మహిళ రాజవ్వ, ఎంపీపీ గోపిపై చెప్పుతో దాడి చేశారు. వరండాపైన ఉన్న గోపి కింద ఉన్న రాజవ్వను గట్టిగా కాలితో తన్నాడు. దీంతో మహిళ కింద పడిపోయారు. పక్కనే ఉన్న రాజవ్వ బంధువు గోపిని అడ్డుకున్నారు. బాధిత మహిళ రాజవ్వ వివరాల ప్రకారం.. ‘ఇందల్ వాయి వద్ద జాతీయ రహదారి పక్కనే గోపికి చెందిన 1125 గజాల స్థలం, అందులోని ఇల్లు కూడా 50 లక్షలకు ఇస్తాను అని చెప్తే 33 లక్షల 72 వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బు మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యాక 11 నెలలుగా ఇల్లు వ్యవసాయ భూమి ఖాళీ చేయలేదు. ఎంపీపీ గోపి అదనంగా డబ్బులు చెల్లించాలని గోపి డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఇంటికి వచ్చి ఇంట్లోని సామానును గోపి బయట పడేశారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించడం విమర్శలకు దారి తీస్తోంది. మాజీ నక్సలైట్ ను అని తమతో పెట్టుకోవద్దని గోపి బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మా కొడుకులకు ఏం జరిగినా ఎంపీపీదే బాధ్యత. ఎస్సై, సీఐ, సీపీ, కలెక్టర్, ఎమ్మెల్యేలను కలిసి సమస్య చెప్పుకుంటే డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు కనుక, అదే ఇంట్లో ఉండాలని చెప్పారు. కానీ మాకు అన్యాయమే జరిగిందంటూ’ ఆవేదన వ్యక్తం చేశారు. -
భూ తగదాలు.. కొడవళ్లతో పరస్పర దాడులు..
సాక్షి, చిత్తూరు : భూ తగదాలతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటన జిల్లాలోని మొలకలచెరువు మండలం మలిగివారిపల్లెలో శనివారం చోటుచేసుకుంది. ఇరువురు కొడవళ్లతో పరస్పర దాడులు జరిపారు. మనీ అనే వ్యక్తిపై జయరాం అనే యువకుడు కొడవలితో దాడి చేసి నరికాడు. తీవ్రంగా గాయపడిన మణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వేటకత్తితో తమ్ముడిపై అన్న దాడి
సాక్షి, భీమిని(నెన్నెల) : నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిపై అన్న బాపురెడ్డి బుధవారం నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలోనే వేట కత్తితో హత్యాయత్నం చేశాడు. భూతగాదనే అన్నదమ్ముల మధ్య గొడవకు దారితీసింది. బొప్పారం గ్రామశివారులో సర్వేనంబర్707/1లో 3.14ఎకరాలు, 708 సర్వే నంబర్లో 4.36ఎకరాలు ఉన్న ఈ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బాపురెడ్డి తన వాటలోని కొంత భూమిని ఇతరులకు అమ్ముకున్నాడు. ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించేందుకు తమ్ముడు సంతకం చేయాల్సి ఉంది. కాగా బుధవారం రిజిస్ట్రేషన్ కోసం నెన్నెల తహసీల్దార్ కార్యాలయానికి అన్నదమ్ములిద్దరు వేర్వేరుగా వచ్చారు. తమ్ముడు అభ్యంతరం చెప్పాడని ముందుగానే ఊహించిన బాపురెడ్డి పథకం ప్రకారం తన వెంట ఓ కవర్లో కారంపొడి, వేటకత్తి తెచ్చుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ విషయమై మాటమాట పెరిగి గొడవకు దిగారు. అంతలోనే అందరు చూస్తుండగానే లక్ష్మారెడ్డి కళ్లలో కారంకొట్టిన బాపురెడ్డి కత్తితో దాడిచేశాడు. ఇంతలోనే కొందరు యువకులు తేరుకొని బాపురెడ్డిని అడ్డుకున్నారు. అప్పటికే లక్ష్మారెడ్డి తలపై రెండుచోట్ల గాయాలయ్యాయి. యువకులు ధైర్యం చేసి అడ్డుకోకపోతే లక్ష్మారెడ్డి ప్రాణాలు దక్కేవి కావని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే తహసీల్దార్ రాజలింగు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాపురెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మారెడ్డికి నెన్నెల పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెన్నెల ఎస్సై చందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తండ్రి,కొడుకుల దారుణహత్య
సాక్షి, ఇల్లంతకుంట (మానకొండూర్) : భూ వివాదం తండ్రీకొడుకుల దారుణహత్యకు దారితీసింది. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టారావుపల్లి గ్రామ శివారులోని సర్వేనంబర్ 540లో ఉన్న 39గుంటల వ్యవసాయభూమి కిష్టారావుపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల దేవయ్య అతడి సోదరుడు మామిండ్ల స్వామి పేర్లతో భూ రికార్డుల్లో ఉండగా, కాస్తులో కందికట్కూర్కు చెందిన సావనపెల్లి ఎల్లయ్య ఉన్నాడు. భూమి మాదంటే.. మాదంటూ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఇదే భూమిలో సోమవారం మామిండ్ల స్వామి, దేవయ్య విత్తనాలు వేశారు. మంగళవారం వేకువజామున సావనపెల్లి ఎల్లయ్య, అతడి కుమారుడు శేఖర్ వెళ్లి అదే వ్యవసాయ భూమిలో ట్రాక్టర్తో దుక్కిదున్నడం మొదలుపెట్టారు. సమీపంలోనే ఉన్న మామిండ్ల దేవయ్య, స్వామి, దేవయ్య భార్య పద్మ, కుమారుడు వెంకటేశ్ వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. కారం చల్లి.. గొడ్డళ్లతో నరికి.. సావనపెల్లి ఎల్లయ్య(50), అతడి కుమారుడు శేఖర్(21)లపై మామిండ్ల దేవయ్య భార్య పద్మ కారంపొడి చల్లింది. దేవయ్య, అతడి సోదరుడు స్వామి గొడ్డళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. అక్కడే ఉన్న ఎల్లయ్య భార్య ఎల్లవ్వ కేకలు వస్తూ మృతదేహాల వద్దకు వచ్చేలోపే నిందితులు పారిపోయారని ఎల్లవ్వ తెలిపింది. పరిశీలించిన ఎస్పీ.. విషయం తెలుసుకున్న ఎస్పీ రాహుల్హెగ్డే, డీఎస్పీ వెంటరమణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పథకం ప్రకారమే హత్యలు జరిగాయని, కొన్నేళ్లుగా భూవివాదం కేసు కోర్టులో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తండ్రీకొడుల హత్యకేసులో నలుగురి పాత్ర ఉందని, నింధితు లు పరారీలో ఉన్నట్లు వివరించారు. మృతుడి భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మృతదేహాలు తరలించొద్దంటూ బంధువుల ఆందోళన.. హత్య ఘటనలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించే వరకు మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి తరలించొద్దంటూ బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను తరలించేందుకు తీసుకొచ్చిన ట్రాక్టర్ ఎదుట బైటాయించారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐలు అనిల్కుమార్, రవీందర్లు వచ్చి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ 39 గుంటల భూమి మృతుల కుటుంబానికే చెందేలా చూస్తామని హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. భూవివాదం కోర్టులో ఉందని, కోర్టు చూసుకుంటుందని చెప్పడంతో శాంతించారు. పోలీసుల అదుపులో నిందితులు హత్యకేసులో నిందితులైన మామిండ్ల దేవయ్య, మామిండ్ల స్వామి, పద్మ, వెంకటేశ్ ఇల్లంతకుంట పోలీసుస్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి సిరిసిల్ల సీఐ కార్యాలయంలో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు మాత్రం నిందితులు పరారీలోనే ఉన్నారని చెబుతున్నారు. -
సిరిసిల్ల జిల్లాలో జంటహత్యలు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం తండ్రి కొడుకులు దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తండ్రి కొడుకులను కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ జంట హత్యల ఘటన స్థానికంగా కలకం రేపింది. గ్రామానికి చెందిన ఎల్లయ్య, అతని కొడుకును అదే గ్రామానికి చెందిన వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హతమార్చారు. పొలం విషయంలో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున పొలంలో ఉన్న తండ్రికొడుకులను హత్యచేసిన నిందితులు ఆ తర్వాత పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు.