
సాక్షి, కరీంనగర్ : కరెంటు స్తంభంపై మంటలు చెలరేగి స్తంభం వద్ద నిలిచిన వర్షం నీళ్లలో సైతం కరెంటు ప్రవహించింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సైదాపూర్ మండలం ఘనపూర్లో రైతు వెంకట్ రెడ్డికి చెందిన పత్తి చేనులో కరెంటు స్తంభం పై మంటలు చెలరేగాయి. 11 కె.వి లైన్ కావడంతో పవర్ షాక్ కొట్టి స్తంభం పై నుంచి భూమిపై వరకు మంటలు వచ్చాయి.దీంతో స్తంభం వద్ద నిలిచిన వర్షం నీళ్లలో సైతం కరెంటు ప్రవహించింది. ఆ వేడి దాటికి వర్షపు నీళ్లు సలసల మసిలాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇవ్వడంతో పవర్ సప్లై నిలిపివేశారు. ఇన్సోలేటర్ ఫెయిల్ కావడంతో స్తంభంపై మంటలు వచ్చి కింద వాటర్ మరిగినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు కరెంట్ పోల్స్ తో జాగ్రత్తగా ఉండాలని కోరారు.