ఓపీ చూసి.. మందులు రాసి!  | Follow Guidelines For Home Isolation Check For Omicron | Sakshi
Sakshi News home page

ఓపీ చూసి.. మందులు రాసి! 

Published Thu, Jan 20 2022 6:38 AM | Last Updated on Thu, Jan 20 2022 2:43 PM

Follow Guidelines For Home Isolation Check For Omicron - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నా, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాల్సినంత తీవ్రత ఏమీలేదని వైద్యనిపుణు లు అంటున్నారు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు బాధితులకు మాదిరిగా ఓపీ(ఔట్‌ పేషెంట్‌) చూసి మందులు రాసి ఇంటికి పంపిస్తున్నారు. ఇళ్లల్లోనే ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే సరిపోతుం దని వైద్యులు చెబుతున్నారు. కానీ, కొందరు ప్రముఖులు, సినీనటులు మాత్రం ఆసుపత్రి ఐసోలేషన్‌ లో ఉండటానికి ఇష్టపడుతున్నారని అంటున్నారు. 

ఇదేస్థాయిలో సెకండ్‌వేవ్‌ ఉన్నప్పుడు?: ప్రస్తు తం తెలంగాణలో నమోదైన కేసులతో దాదాపు సమానంగా సెకండ్‌ వేవ్‌లో గతేడాది ఏప్రిల్‌లో 13న 3,052 కేసులున్నాయి. అప్పుడు యాక్టివ్‌ కేసు లు 24,131కాగా, 16,118 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. అంటే 67% మంది ఐసోలేషన్‌ లో ఉంటే, 33% మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన ప్రతి నలుగురిలో ముగ్గురు ఆక్సిజన్, ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు క్రియా శీలక కేసులు 22 వేలకుపైగా ఉన్నా, అందులో 10% మంది మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారు. మిగిలిన 90% మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అప్పట్లో రోజూ కోవిడ్‌ రోగుల కోసం 300 టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉండగా, ఇప్పుడు కేవలం 30 టన్నులు మాత్రమే అవసరమవుతుంది. సెకండ్‌ వేవ్‌లో దేశంలో 18 లక్షల క్రియాశీలక కేసులు రావడానికి 36 రోజులు పడితే, ప్రస్తుత థర్డ్‌వేవ్‌లో అన్ని కేసులు రావడానికి 18 రోజులు మాత్రమే పట్టింది. అంటే వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. 

♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం డెల్టా తో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌లో తీవ్రమైన కోవిడ్‌ వచ్చే అవకాశం 83 శాతం తక్కువ.  
♦ డెల్టా కంటే ఒమిక్రాన్‌లో కరోనా వైరస్‌ లోడ్‌ గొంతులో 70 రెట్లు అధికం. గొంతులో ఒమిక్రాన్‌ పునరుత్పత్తి జరుగుతుండగా, డెల్టా వేరియంట్‌ తన సంతతిని ఊపిరితిత్తుల్లో పెంచుకునేది. అందువల్ల అప్పుడు కేసులు చాలా తీవ్రమయ్యేవి.  
♦ ఊపిరితిత్తుల్లోకి వైరస్‌ చేరిక డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌లో పదిశాతం మాత్రమే 
♦ యూకేలో ఒమిక్రాన్‌కు ముందు నమోదైన కరోనా కేసుల్లో రెండు శాతమే రీఇన్ఫెక్షన్‌ ఉండగా, ఇప్పుడు ఐదు రెట్లు పెరిగింది.  
♦వ్యాక్సిన్‌ వేసుకున్నా వైరస్‌ వ్యాప్తి జరుగుతుంది. వ్యాక్సిన్‌ అనంతర ఇన్ఫెక్షన్లు యూకేలో 84 శాతం ఉన్నాయి. వారంతా రెండుడోసులు తీసుకున్నవారే. ఢిల్లీలో 68 శాతం ఒమిక్రాన్‌ కేసులకు చెందినవారంతా రెండుడోసులు తీసుకున్నవారే. అందులో వారిలో 61 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు. 
♦ ఢిల్లీ ప్రభుత్వ విశ్లేషణ ప్రకారం... ఒమిక్రాన్‌తో చనిపోయినవారిలో 92 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోనివారే. వైరస్‌ వ్యాప్తిని టీకా ఆపలేకపోయినా... మరణాలను ఆపుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement