హైదరాబాద్, సాక్షి: జంట నగరాల్లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరం నాలుగు మూలల నుంచి గణనాథులు ట్యాంక్ బండ్కి తరలి వస్తున్నారు. దీంతో సోమవారం ఉదయం హుస్సేన్సాగర్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్జామ్ అయ్యింది.
రేపు ‘మహా’ నిమజ్జనం ఉండడం, నిన్న ఆదివారం కావడంతో నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్బంక్కు చేరుకున్నాయి. అయితే విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నియంత్రించేందుకు ఎవరూ లేకపోవడం, వాటిల్లో చాలావరకు భారీ వాహనాలు ఉండడంతో.. దారిపొడవునా గంటల తరబడి టైం పడుతోంది.
భద్రతాపరంగా కొద్దిమంది పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ.. సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులెవరూ కనిపించకపోవడం గమనార్హం. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాళ్లకు సైతం నరకం కనిపిస్తోంది.
రేపు ఖైరతాబాద్ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. శోభాయాత్ర భద్రత కోసం పాతికవేల మంది సిబ్బందిని పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది.
ఇక.. ఖైరతాబాద్ గణేషుడికి ఇవాళ పూజలు నిర్వహించి.. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలుపెడతారు. మధ్యాహ్నాం లోపు నిమజ్జనం చేస్తారు. ఎల్లుండి సాయంత్రంకల్లా నగరంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేయండి: భారీ గణపయ్య దగ్గర కోలాహలం చూశారా?
Comments
Please login to add a commentAdd a comment