![HMDA income is Rs 6945 crores - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/09/28/NEOPOLIS.jpg.webp?itok=mKsAFg4w)
సాక్షి, హైదరాబాద్: కోకాపేట, బుద్వేల్లోని భూముల విక్రయాల ద్వారా హెచ్ఎండీఏకు రూ.6,945.33 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండు చోట్ల హెచ్ఎండీఏకు ఉన్న భూములను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించగా, కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించారు.
► కోకాపేటలో మొత్తం 7 ప్లాట్లలో ఉన్న 45.33 ఎకరాల భూమిని విక్రయించారు. ఇందులో ఒక్కో ప్లాట్లో 3.60 ఎక రాల నుంచి 9.71 ఎకరాల వరకు ఉంది. ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లకు అమ్ముడుపోగా, సగటున ఎకరానికి రూ.73.23 కోట్ల చొప్పున ధర పలికింది. మొత్తం 7 ప్లాట్లపై రూ.3319.60 కోట్ల ఆదాయం లభించింది.
► బుద్వేల్లోని 14 ప్లాట్లలో ఉన్న 100.01 ఎకరాలు కూడా పూర్తిగా అమ్ముడుపోయింది. ఎకరానికి గరిష్టంగా రూ.41.75 కోట్లు ధర లభించింది. సగటున ఎకరం రూ.36.25 కోట్ల చొప్పున విక్రయించారు. బుద్వేల్లోని మొత్తం భూములపై రూ.3625.73 కోట్ల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు.
► మోకిలాలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడానికి పలు కారణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సకాలంలో బ్యాంకు రుణాలు లభించకపోవడం వల్ల కొందరు చెల్లించలేదన్నారు. బిడ్డర్ల విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment