
హైదరాబాద్: హెచ్సీయూ భూముల వ్యవహారం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. వర్శిటీ భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ భూముల విక్రయాన్ని ఆపాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దాంతో సెంట్రల్ యూనివర్శిటీలో పోలీసుల్ని భారీగా మోహరించారు.
అసలు వివాదం ఎందుకంటే..!
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.
తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.
హెచ్సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.