
సాక్షి, హైదరాబాద్: దళితబంధు మరో సామాజిక ఉద్యమమని, ఈ కార్యక్రమం అమలు కోసం సీఎం కేసీఆర్ సంకల్పాన్ని బలపరిచి మనమంతా ముందుకు సాగాలని టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు (కేకే) పిలుపునిచ్చారు. తెలంగాణలో దళితబంధు అనే కొత్త ఉద్యమం తీసుకొచ్చారని, దీని అమలు కోసం ఎన్నో అవరోధాలు, కష్టాలు వస్తాయని చెప్పారు. కేసీఆర్ ఉక్కు సంకల్పంతో దళితబంధు అమలవుతుందని, ఆయన నాయకత్వంలో చేసినంత అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు.
ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేశవరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం 200 ఏళ్లు బ్రిటిష్ వారిపై పోరాడామని అనేక మంది ప్రాణత్యాగం ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.