
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో భూముల ధర ఎకరాకు రూ.100 కోట్లకుపైగా పలకడం తెలంగాణ పరపతికి నిదర్శమని, రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి, ఇంత ధర చెల్లించి మరీ తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలని ప్రకటించారు. ‘‘ఇంతింతై వటుడింతై అన్నట్టుగా హైదరాబాద్ నగర అభివృద్ధి అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది.
తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించపర్చిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరెంత నష్టం చేయాలని చూసినా దృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, కృషికి దక్కిన ఫలితమిది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ, మున్సిపల్ ఉన్నతాధికారులను అభినందించారు.
(చదవండి: కోకాపేట ‘కనకమే’.. ఎకరం రూ.100 కోట్లు)