
కొందుర్గు: సాధారణంగా వ్యవసాయ భూములకు పట్టాదార్లుగా రైతులు ఉంటారు. వారి పేర్లపై ఎంత భూమి ఉంది, ఖాతా నంబరు, తండ్రి పేరు వంటి వివరాలను రికార్డుల్లో పొందుపరుస్తారు. కానీ రంగారెడ్డి జిల్లా జిల్లేడ్చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల గ్రామంలో రెవెన్యూ రికార్డులు విచిత్రంగా ఉన్నాయి. ధరణి పోర్టల్లో పెద్దఎల్కిచర్ల లోని సర్వేనంబర్ 32/ఉ2లో 1–14 ఎకరాల భూమి తహసీల్దార్ ఆఫీసు పేరుపైన ఉంది. పట్టాదారు పేరు నమోదు చేయాల్సిన స్థానంలో తహసీల్దార్ ఆఫీసు అని ఉంది. తండ్రిపేరు స్థానంలో కొందుర్గు అని నమోదు చేశారు. ఇక ఈ భూమికి ఫ్యాన్సీ ఖాతా నంబర్ 2222 ఇచ్చారు. దీంతో అధికారుల పనితీరుపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.