
ఆషాఢ అమావాస్య సందర్భంగా ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కోయిల్ కొండ మండలంలోని శ్రీరామకొండకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే కొండపైన ఉన్న రాముడి పాదాల దర్శనంకోసం బారులు తీరారు. దాదాపు 40 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
– కోయిల్కొండ (మహబూబ్నగర్ జిల్లా)
ఎరువుల కోసం ఎదురుచూపులు
నిర్మల్ జిల్లా లోకేశ్వరం పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఆదివారం యూరియా కోసం క్యూలో రైతన్నల చెప్పులు.
పచ్చని ‘గిరి’పల్లెలు
ఇటీవల కురిసిన వర్షాలకు భూమాత పచ్చరంగు పులుముకుంది. చెట్లు చిగురించి కొండలు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ఒడిలో సేదతీరినట్లు.. కొండల నడుమ గిరి పల్లెలు ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ధరి, మామిడిగూడ, లోహర గ్రామాలు ప్రకృతి ఒడిలో ఇలా దర్శనమిస్తున్నాయి.
– ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
నరికినా నీడనిస్తా..
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పోచాలు అనే రైతు పొలంలో వేపచెట్టు.. పెద్దపెద్ద కొమ్మలతో భారీగా విస్తరించింది. పంటపై నీడ పడుతుండడంతో పోచాలు ఆ చెట్టుకొమ్మలను తొలగించాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు చెట్టు మళ్లీ చిగురించింది. ఒకప్పుడు ఆ చెట్టు నీడ పంటపై పడుతుందని నరికేసిన రైతు.. ఇప్పుడు వ్యవసాయ పనులు ముగించుకొన్నాక అదే చెట్టునీడన విశ్రమిస్తున్నాడు.
– సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్
గూడు కోసం ఆరాటం
ఏదో పుస్తకంలో చదివి నేర్చుకున్నట్టు.. ఎవరో గురువు దగ్గర శిక్షణ పొందినంత నేర్పుతోనూ పక్షులు అందమైన గూళ్లను అల్లుకుంటాయి. సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావం, ఇతరత్రా కారణాలతో పక్షి గూళ్లు ఇప్పుడు కనిపించడమే అరుదైపోయింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ చెరువు వద్ద తుమ్మ చెట్టుపై పక్షులు అల్లుకున్న గూడులివి.
– సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment