![Telangana: Bomb Threat Call To Praja Bhavan Updates](/styles/webp/s3/article_images/2024/05/28/Prajabhavan_Bomb_Threat.jpg.webp?itok=LoT3lOVT)
హైదరాబాద్, సాక్షి: ప్రజా భవన్లో తనిఖీలు ముగిశాయి. మూడు గంటల పాటు అన్ని సముదాయాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మంత్రి సీతక్క ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సముదాయాలతో పాటు గార్డెనింగ్ జిమ్ స్విమ్మింగ్ పూల్ సెక్యూరిటీ ప్లేసెస్ అన్ని ప్రాంతాలను పరిశీలించారు. తనిఖీలు ముగియడంతో ప్రజాభవన్ నుంచిబాంబ్ స్క్వాడ్ ,డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. బయటకు వచ్చారు.
అసలేం జరిగిందంటే..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్ లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసిపి మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క గారి కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షున్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు సాగాయి
ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. సెల్ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయి లేక కావాలని ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాభవన్ లో బాంబు ఉందని ఫోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం ప్రచారం మాధ్యమాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది.
![ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు](/sites/default/files/inline-images/bm_0.jpg)
Comments
Please login to add a commentAdd a comment