వ్యవసాయ మార్కెట్లలో రైతుల పడిగాపులు | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్లలో రైతుల పడిగాపులు

Published Sun, Apr 14 2024 4:37 AM

Traders stopped shopping in Janagama market - Sakshi

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పోటెత్తిన ధాన్యం

కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలకు ఇబ్బందులు

కేసుల నేపథ్యంలో జనగామ మార్కెట్లో కొనుగోళ్లు నిలిపేసిన వ్యాపారులు

మద్దతు ధరకు కొనుగోలు చేయలేమని స్పష్టీకరణ

వరి, మక్కలు, ఇతర పంటలు తెచ్చిన రైతుల్లో ఆందోళన 

తిరుమలగిరి (తుంగతుర్తి)/జనగామ: వానల్లేక, సాగునీరు అందక చాలా చోట్ల వరి పంట దెబ్బతి న్నది. మిగిలిన చోట రైతులు వరికోతలు పూర్తి చేసి.. వ్యవసాయ మార్కెట్లకు తెస్తున్నారు. కానీ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తుండటం, అదీ సరిగా సాగకపోవడంతో.. పడిగాపులు పడుతున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తిరు మలగిరి, జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. 

భారీగా పోటెత్తిన ధాన్యం: శనివారం తిరుమ లగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు 47,660 బస్తాల ధాన్యం వచ్చింది. యాసంగి సీజన్‌ మొదలై నప్పటి నుంచి ఇంత భారీగా ధాన్యం రావడం ఇదే మొదటిసారి. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా.. వాతావరణంలో మార్పులతో రైతులు యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారని మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి.

శుక్రవారం అర్ధరాత్రి నుంచే మార్కెట్‌లోకి ధాన్యం ట్రాక్టర్లను అనుమతించాల్సి ఉండగా.. శనివారం తెల్లవారు జాము వరకు పంపలేదు. దీనితో రోడ్డు పైనే వందలకొద్దీ ట్రాక్టర్లు నిలిచిపోయి ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. కాగా ట్రేడర్లు ధాన్యానికి క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,980 ధర చెల్లించారు.

జనగామలో కొనుగోళ్లు నిలిపేసిన ట్రేడర్లు
తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళ న, ముగ్గురు ట్రేడర్లపై కేసుల నమోదు నేపథ్యంలో.. జనగామ వ్యవసాయ మార్కెట్లో ట్రేడర్లు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనితో మార్కెట్‌కు వరి ధాన్యం, మక్కలు, చింతపండు, ఇతర వ్యవసాయ ఉత్పత్తు లను తీసుకువచ్చిన రైతులు వాటిని అమ్ముకో వడా నికి పడిగాపులు పడుతున్నారు.

ఇక మార్కెటింగ్‌ శాఖ వరంగల్‌ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రాజునా యక్‌ శనివారం జనగామ మార్కెట్‌ కార్యాలయంలో.. ట్రేడర్లు, అడ్తిదారులతో రెండు గంటల పాటు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రైవేట్‌ మార్కె ట్‌లోనూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని రాజునాయక్‌ కోరగా.. అది సాధ్యం కాదని ట్రేడర్లు స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా లేని నిబంధనలను జనగామ మార్కెట్‌పై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ఈ మార్కెట్లో కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని రైతులు ఎదురు చూస్తున్నారు.

 

Advertisement
Advertisement