దుర్గమ్మ.. ఈ స్నేహితులపై దయ లేదా..! | Two Friends Ends Life In Road Accident | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ.. ఈ స్నేహితులపై దయ లేదా..!

Published Mon, Mar 10 2025 11:20 AM | Last Updated on Mon, Mar 10 2025 11:22 AM

Two Friends Ends Life In Road Accident

రోడ్డు ప్రమాదంలో ఇద్దరుస్నేహితులు మృతి 

నార్కట్‌పల్లి(నల్లగొండ): దైవ దర్శనానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా ఓల్డ్‌ అల్వాలకు చెందిన ఐదుగురు స్నేహితులు ప్రవీణ్, సాయికుమార్‌ గౌడ్, చిల్లాసాగర్‌ సాయి సందీప్‌ గౌడ్, హరీష్, మధుకర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి దైవ దర్శనం కోసం ప్రవీణ్‌ కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత1:30గంటల సమయంలో బయలు దేరారు. 

ఆదివారం తెల్లవారు జామున 5:30గంటల సమయంలో మార్గమధ్యంలోని నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారులో గల హైదరాబాద్‌– విజయవాడ జాతీయ ప్రధార రహదారి వద్ద రోడ్డు పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న కుంచ సాయికుమార్‌ గౌడ్‌(32), సాయిసందీప్‌ గౌడ్‌ (23)  అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్, మధుకర్‌లకు గాయాలయ్యాయి. డ్రైవింగ్‌ చేస్తున్న ప్రవీణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. 

సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు. తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకోవడంతోపాటు, నిలిచి ఉన్న లారీకి వెనుక భాగంలో రెడ్‌ స్టిక్కర్‌ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement