
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నియంత్రణలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ వెబినార్ కాన్ఫ్రెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి అదనపు కమిషనర్ బి.సంతోష్ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కంటైన్మెంట్ గైడ్లైన్స్ని అమలుచేస్తున్నామని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో కరోనా నియంత్రణకు అమలుచేస్తోన్న పనులను సమన్వయం చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాలను సమన్వయం చేసేందుకు మూడు షిఫ్ట్లలో 24 గంటల పాటు కంట్రోల్ రూం సేవలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారితో కంట్రోల్ రూం ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పడు వాకబు చేస్తున్నామని అవసరమైన మేర వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
(వెల్స్పన్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్)