
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాబోయే కొత్త రెవెన్యూ చట్టంలో తమ పాత్ర ఏమిటో ప్రభుత్వం సృష్టం చేయాలని తెలంగాణ వీఆర్వోల సంఘం ప్రెసిడెంట్ గోల్కొండ సతీష్ కోరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా మీడియాలో వీఆర్వోల విషయంలో అనేక కథనాలు వస్తున్నాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కూడా మాట్లాడారు. అందులో వీఆర్వో ల పాత్ర ఎలా ఉంటుందో తెలియదు. కొత్త చట్టాన్ని తాము స్వాగతిస్తామని, కానీ అందులో తమ పాత్ర ఏమిటో చెప్పాలన్నారు.
‘‘వీఆర్వోలుగా అనేక మంచి పనులు చేసాం.. కానీ మా ఉద్యోగాలు ఉంటాయో లేదో లేదో తెలియదు. రెవెన్యూ విషయంలో మా పరిధిలోకి వచ్చిన సమస్యపై ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తున్నాం. ఇంత చేస్తున్నా చాలి చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. కొత్తగా వచ్చే చట్టం పై ఆందోళన చెందుతున్నాం. మా కష్టాన్ని గుర్తించకుండా మమ్మల్ని ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని’’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వీఆర్వో అధికారాలు తీయొద్దని, తమపై అవినీతి ఆరోపణలు వేసి ఇతర శాఖలకు పంపటం సమంజసం కాదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో చేశాం కాబట్టే రైతులు సమర్థంగా రైతుబంధు పొందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. కొత్త చట్టం రావడాన్ని స్వాగతిస్తాం కానీ మమ్మల్ని రెవెన్యూ శాఖలోనే ఉంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అందరిపై అవినీతి ఆరోపణలు వేసి ఇతర శాఖలకు పంపవద్దన్నారు. గ్రామ స్థాయి నుండి అధ్యయనం చేసి ఈ చట్టం తేవాలని, అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టేముందు తమ సలహాలు తీసుకోవాలని గోల్కొండ సతీష్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment