
వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో కళాకారుల నృత్యప్రదర్శన
సాక్షిప్రతినిధి, వరంగల్: కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. పలు వేదికల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఖిలావరంగల్ ఖుషిమహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను వరంగల్ కలెక్టర్ గోపి ప్రారంభించారు. హనుమకొండ అంబేడ్కర్ భవన్లో కాకతీయుల పాలనపై కవి సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్ హాజరై పలువురు కవులను సన్మానించారు.
చారిత్రక వెయ్యిస్తంభాల గుడి ఆవరణలో కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు అలరించాయి. పబ్లిక్గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో తృష్ణ నాటకం, చిందుయక్షగానం ప్రదర్శించారు. జనగామలో కాకతీయ ఉత్సవాలను కలెక్టర్ శివలింగయ్య ప్రారంభించారు. పేరిణి నృత్యం, బోనాలు, కోలాటాలు, బతుకమ్మలను ప్రదర్శించారు. ఉత్సవాల్లో తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.