
ఎత్తుమడులతో అధిక దిగుబడులు
వ్యవసాయ నూతన సాగు విధానాలు రైతు ఇంట సిరులు కురిపిస్తోంది. ఎత్తుమడుల (బెడ్) పద్ధతిలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు.
మోమిన్పేట: మారిన కాలానికనుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో పసుపు సాగు చేపడుతుంది. బోజ, బెడ్డు పద్ధతిలో సాగుకు సమాయత్తం అవుతున్నారు. బెడ్డులో విత్తనం తక్కువ పట్టడం, డ్రిప్ పద్ధతిలో నీరును పెట్టడంతో కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చని రైతులు పేర్కొంటున్నారు. బెడ్, డ్రిప్ పద్ధతిలో భూమి గుల్లగా ఉండి కొమ్ము సాగుకు అనుకూలంగా ఉంటుందని దీంతో దిగుబడులు పెరుగుతాయని రైతులు వెల్లడిస్తున్నారు. ఎరువులు, నీటి యాజమాన్యం సరైన పద్ధతిలో పాటిస్తే దిగుబడులు అధికంగా వస్తాయని ఉద్యాన అధికారి అక్షితారెడ్డి పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం సాగు నీటి వసతి కల్గిన ప్రతీ రైతు పసుపు పంటను సాగు చేసేవారు. అర ఎకరా నుంచి మూడు ఎకరాల వరకు సాగును చేపట్టేవారు. మార్కెటులో ధర లేకపోవడం, పెట్టుబడులకు గిట్టుబాటు కాక పసుపు సాగును రైతులు పూర్తిగా విస్మరించారు. సాగు నీటి వసతి కలిగిన ప్రతీ రైతు పసుపు సాగు చేపట్టేవారు. ప్రస్తుతం పసుపు సాగు చేసే రైతులను వేళ్ల మీద లెక్కించవచ్చు. పసుపు సాగుకు పెట్టుబడులు ఎక్కువ... దిగుబడులు రాకుంటే నష్టాలు తప్పవు. పంట కోతకు వచ్చినప్పుడు కూలీల ఖర్చు ఎక్కువే. అందుకు మార్కెట్లో సుమారు 15 ఏళ్లుగా ధర లేక సాగుకు దూరంగా ఉన్నారు. గతేడాది నుంచి క్వింటాల్కు రూ.10వేలు దాటుతుండటంతో సాగు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. పసుపు సాగు పెరగాలంటే ప్రభుత్వం విత్తన రాయితీ ఇవ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు.
బెడ్ పద్ధతి సాగుతో అధిక లాభాలు
ఎరువులు, నీటి యాజమాన్యం పాటించాలి
ఉద్యాన అధికారి అక్షితారెడ్డి
ఆశించిన స్థాయిలో దిగుబడులు
ఎకరంన్నరలో బెడ్డు పద్ధతిలో పసుపు సాగు చేశా. ఎరువులు, మందులను డ్రిప్ ద్వారా అందించడంతో పంట ఏపుగా పెరిగింది. మార్కెట్లో ధర రూ.10వేలకు పైగా ఉండడంతో ఈ సాగు చేపట్టాను. ట్రాక్టరు ద్వారా నే పసుపును తీశాం. దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చాయి. ఆవిరి యంత్రం ద్వారా ఉడికించాం. 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. – మోహన్రెడ్డి, రైతు, మోమిన్పేట