క్యాన్సర్ను జయిద్దాం
ఏయూక్యాంపస్ : క్యాన్సర్పై అవగాహన పెంచుకోండి... ఆరోగ్యంగా జీవించండి అంటూ సినీనటి, లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి తాడిమల్ల నగరవాసుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆదివారం బీచ్రోడ్డులో రోహిత్ మోమోరియల్ ట్రస్ట్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ సంయుక్తంగా నిర్వహించిన పింక్ సఖి శారీ వాక్లో ఆమె ప్రసంగించారు. క్యాన్సర్ వస్తే జీవితం అక్కడితో ఆగిపోతుందనే అపోహ నుంచి ముందుగా బయటపడాలన్నారు. సరైన చికిత్స తీసుకుంటే ఎంతకాలమైనా జీవించవచ్చు అనడానికి ప్రతక్ష ఉదాహరణగా తానేనని పేర్కొన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత అవసరమో గుర్తించాలని ప్రజలకు సూచించారు. మీపై ఒక కుటుంబం ఆధారపడి ఉందనే విషయం మరువకూడదన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి మహిళలకు ఉందన్నారు. క్యాన్సర్ ఎటువైపు నుంచైనా, ఎవరికై నా వచ్చే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవడం, సరైన చికిత్స తీసుకోవడం, నిండైన జీవితాన్ని అనుభవించడం ఎంతో అవసరమన్నారు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ ప్రతి ఏడాది వేలాది మంది క్యాన్సర్తో మరణిస్తున్నారన్నారు. మహిళలు అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్రజల్లో మరింత చైతన్యం, అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రాథమిక దశల్లో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స అందించడం, ప్రాణాలను రక్షించడం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.
రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జి.అనంత రామ్ మాట్లాడుతూ మరింత విస్తృత అవగాహన ప్రజల్లో కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. తాము చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి సంపూర్ణ సహాయం అందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో పీసీవోడీపై వైజాగ్ వలంటీర్లతో కలిసి అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమానికి ముందుగా సినీనటి శిల్పా చక్రవర్తి వ్యాఖ్యానంతో సాగిన జుంబా డాన్స్, ఫ్యాషన్ షో ఆకట్టుకున్నాయి. పెద్దసంఖ్యలో మహిళలు, యువత, చిన్నారులు పింక్ సఖి సారీ వాక్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు పాఠశాల చిన్నారులు ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు, క్యాన్సర్ను జయించిన వారిని వేదికపై సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వరరావు, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఉపాద్యక్షురాలు డాక్టర్ మీనాక్షి అనంతరామ్, డైరెక్టర్ ప్రాజెక్ట్ (ఆర్ఎంటి) గుర్మీత్ కోహ్లి, శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎం.డి డాక్టర్ జి.సాంబశివ రావు, గురుద్వార సాఽథ్ సంగత్ అధ్యక్షుడు డాక్టర్ డి.ఎస్ ఆనంద్, ఏజ్ కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్.ఎస్ రాజు, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, అభిజ్ఞ, హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్ వైద్యులు డాక్టర్ ఆదిత్య, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఎండీ వి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పింక్ శారీ వాక్లో భాగంగా జుంబా డ్యాన్స్ చేస్తున్న మహిళలు
క్యాన్సర్ను జయిద్దాం
Comments
Please login to add a commentAdd a comment