
పింఛన్ల కోసం.. పేదల నిరసన
చీపురుపల్లి: ఒకటి కాదు రెండు కాదు.. పది నెలలుగా ఎదురు చూశారు... పింఛన్ మంజూరైతే ఆర్థిక కష్టాలు తొలగుతాయని, జీవనానికి భరోసా దొరుకుతుందని ఆశపడ్డారు.. వారి ఆశలు అడియాసలే కావడం, పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయకపోవడంతో రోడ్డెక్కారు. ఎన్నాళ్లు ఆకలితో అలమటించాలంటూ మండిపడ్డారు. కూటమి నేతల తీరును దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్ల వయస్సు నిండితే పింఛన్ మంజూరు చేస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోయినా పింఛన్ మంజూరు కావడంలేదంటూ వితంతువులు గోడు వినిపించారు. సర్వేల పేరుతో అర్హుల పింఛన్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, తక్షణమే అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చీపురుపల్లిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. చీపురుపల్లి మండలంలోని 19 పంచాయతీల్లో అర్హత ఉండి ఆన్లైన్ చేసుకుని పింఛన్లు మంజూరు కాని లబ్ధిదారుల ఆందోళనకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి, మెయిన్రోడ్, ఆంజనేయపురం మీదుగా మండల పరిషత్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఏఓ ప్రవీణ్కు, పంచాయతీ కార్యాలయంలోని శానిటరీ ఇన్స్పెక్టర్కు జి.వేణుగోపాల్కు వినతిపత్రం అందజేశారు.
పేదల కోసం న్యాయ పోరాటం చేస్తాం
పింఛన్ లబ్ధిదారుల నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 వేల మంది లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లామని, శాసనమండలిలో ప్రస్తావిస్తానని చెప్పారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్పీ నోటిఫికేషన్ అంటూ రెండో వారం వచ్చినా ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఊసేలేదని, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ మంజూరు, మత్స్యకార భరోసా వంటి ఎన్నో పథకాలను అటకెక్కించారన్నారు. సచివాలయం, వలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడంతో ఏ పనికావాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. తాజాగా వంట గ్యాస్ ధరలు పెంచి పేదలకు కష్టాలు తెచ్చిపెట్టిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, నియోజకవర్గ వలంటీర్ విభాగం అధ్యక్షుడు బెల్లాన త్రినాథరావు, పార్టీ నాయకులు పతివాడ రాజారావు, ఇప్పిలి గోవింద, రఘుమండ త్రినాథరావు, మీసాల రమణ, చందక గురునాయుడు, అధికార్ల శ్రీనుబాబు, బాణాన రమణ, రేవళ్ల సత్తిబాబు, మీసాల ఈశ్వరరావు, గవిడి సురేష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
అర్హత ఉన్నా పది నెలలుగా
మంజూరుకాని పింఛన్లు
భర్తలు చనిపోయినా, వృద్ధాప్యం
ఆవరించినా అందని పింఛన్
చీపురుపల్లిలో భారీ ర్యాలీ
ప్రభుత్వ తీరుపై నిరసన
పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేత
పేదలకు మద్దతుగా నిలిచిన
వైఎస్సార్సీపీ శ్రేణులు
జీవనానికి ఇబ్బంది
ఏడాది కిందటే భర్త మృతి చెందాడు. ఎలాంటి ఆధారం లేక వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇంతవరకు మంజూరు కాలేదు. అధికారులు, సచివాలయ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తే... కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేయాలని చెబుతున్నారు. – సఖినేటి పద్మ,
రిక్షాకాలనీ, చీపురుపల్లి మేజర్ పంచాయతీ
పింఛన్ ఎప్పుడిస్తారు?
ఏడాదిన్నర కిందట భర్త చనిపోయాడు. పింఛన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఎన్నికల కోడ్ అంటూ అప్పట్లో మంజూరు చేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక పంచాయతీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయానికి తిరిగినా ఫలితం లేకుండా పోయింది. పింఛన్ ఎప్పుడిస్తారో తెలియడంలేదు. – రేగిడి సూరమ్మ,
విజయరాంపురం, చీపురుపల్లి మేజర్ పంచాయతీ
కనికరించడం లేదు..
భర్తకు పింఛన్ వచ్చేది. ఆయన చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. పింఛన్ కోసం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. వితంతువులపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు. బతకడం కష్టమవుతోంది.
– కొంగరాపు లక్ష్మి, పర్ల,
చీపురుపల్లి మండలం

పింఛన్ల కోసం.. పేదల నిరసన

పింఛన్ల కోసం.. పేదల నిరసన

పింఛన్ల కోసం.. పేదల నిరసన

పింఛన్ల కోసం.. పేదల నిరసన

పింఛన్ల కోసం.. పేదల నిరసన