నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌

Published Thu, Feb 27 2025 12:47 AM | Last Updated on Thu, Feb 27 2025 12:47 AM

నేడే

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. దాదాపు మూడు నెలల హోరాహోరీ ప్రచారానికి తెరపడగా.. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉభయగోదావరిలోని ఐదు జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. అదే విధంగా గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నూజివీడు, కై కలూరులో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో 456 పోలింగ్‌ బూత్‌ల్లో 3,14,984 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం డివిజన్ల వారీగా ఎన్నికల మెటీరియల్‌ పంపిణీ పూర్తి చేశారు. ప్రధానంగా కూటమి పార్టీ నుంచి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్‌ అభ్యర్థిగా రిటైర్డ్‌ టీచర్‌ దిడ్ల వీరరాఘవులతో పాటు 33 మంది స్వతంత్రులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా రు. ఏలూరు జిల్లా కలెక్టర్‌ కే వెట్రిసెల్వి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్‌ కేంద్రంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి ప్రతి రెండు గంటలకు సమాచారం ఇవ్వడానికి, వెబ్‌ కాస్టింగ్‌ పరిశీలనకు వీలుగా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో 456 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసి ఏలూరు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ పర్యవేక్షించనున్నారు. అలాగే గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి నూజివీడు, కై కలూరు నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 21 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16,099 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 80 బ్యాలెట్‌ బాక్సులు, 150 మంది సిబ్బందికి విధులు కేటాయించి నూజివీడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ద్వారా ఎన్నికల సామగ్రిని బుధవారం పంపిణీ చేశారు.

456 కేంద్రాల్లో 2,283 మంది సిబ్బంది

ఉభయగోదావరి జిల్లాల్లో 456 పోలింగ్‌ కేంద్రాల్లో 2,283 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 66 పోలింగ్‌ కేంద్రాల్లో, పశ్చిమలో 93 పోలింగ్‌ కేంద్రాల్లో, అల్లూరి జిల్లాలో 12, కోనసీమ జిల్లాలో 95, తూర్పుగోదావరి జిల్లాలో 92, కాకినాడ జిల్లాలో 98 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ ముగించిన తరువాత బ్యాలెట్‌ బాక్సులు సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలిస్తారు. ఉభయగోదావరిలో 1,368 బ్యాలెట్‌ బాక్సులను వినియోగించనున్నారు. ఏలూరు జిల్లాలో 8 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 37 మంది ఎస్సైలు, 69 మంది ఏఎస్సైలు, 691 మంది కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందిని బందోబస్తుకు ఏర్పాటు చేశారు.

స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి

పట్టభద్రులందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రాధాన్యతా క్రమంలో జరిగే ఎన్నికలు కావడంతో నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 నెంబరు వేయాలి. ఆ తర్వాత నచ్చిన అభ్యర్థుల ఎదురుగా 2, 3, 4.. ఇలా వరుస క్రమంలో వేయాలి. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి. 12 రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిందని దానిలో ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, దివ్యాంగుల సర్టిఫికెట్‌, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, డిపార్ట్‌మెంట్‌ ఫొటో గుర్తింపు కార్డు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు, బ్యాంకు, తపాలా శాఖ జారీ చేసిన పాస్‌బుక్‌, పెన్షన్‌ డాక్యుమెంట్లు ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాలి.

– కె.వెట్రిసెల్వి, ఏలూరు జిల్లా కలెక్టర్‌

పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఏలూరు 66, పశ్చిమలో 93 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

ఏలూరులో 42,282, పశ్చిమలో 69,884 మంది ఓటర్లు

ఉదయం 8 గంటల నుంచి

సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌

ఏలూరు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం

ఓటర్ల వివరాలు

ఏలూరు జిల్లాలో 66 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 24,704 పురుషులు, 17,571 మంది మహిళలు, థర్డ్‌ జెండర్‌ ఏడుగురు కలిపి 42,282 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో 93 పోలింగ్‌ కేంద్రాల్లో 39,863 మంది పురుషులు, 30,187 మంది మహిళలు, థర్డ్‌ జెండర్‌ ఇద్దరు కలిపి 70,052 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్లు 1950, 18002331077, హెల్ప్‌లైన్‌ 9491041419 నెంబర్లను ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ 1
1/1

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement