
రేపే ఎమ్మెల్సీ కౌంటింగ్
ఓట్ల లెక్కింపునకు సహకరించాలి
ఫ నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సవ్యంగా జరిగేందుకు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం ఆమె కలెక్టరేట్లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కౌంటింగ్ టేబుళ్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లని ఓట్ల గుర్తింపు తదితర అంశాలను వివరించారు. సాధారణ పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.
25 టేబుల్స్పై ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు
ఫ మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం
ఫ గెలుపునకు సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ విధానం
ఫ ఆ తరువాత రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్..
ఫ సోమవారం అర్ధరాత్రి తర్వాత తేలనున్న ఫలితం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను నల్లగొండకు తరలించి ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. 3వ తేదీ ఉదయం వాటికి బయటకు తీసి అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల్లో 25,797 ఓట్లకు 24,139 ఓట్లు (93.57 శాతం) పోల్ అయ్యాయి.
కౌంటింగ్ టేబుల్స్, సిబ్బంది ఇలా..
25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రోఅబ్జర్వర్ ఉంటారు. మొత్తంగా 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించారు. మరో 250 మంది సిబ్బందిని స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకురావడానికి, కౌంటింగ్లో ఇతర పనులకు వినియోగించేందుకు నియమించారు. 250 మంది పోలీసులు భద్రతలో పాలుపంచుకోనున్నారు.
ఉదయం 7గంటలకు స్ట్రాంగ్రూంలు ఓపెన్
లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు ఆయా అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేస్తారు. మొదటి రౌండ్లో 25 పోలింగ్ బూత్లకు చెందిన బాక్సులు ఓపెన్ చేస్తారు. వాటిలో ప్రతి 25 ఓట్లను బండిల్ కట్టి డ్రమ్ములో వేస్తారు. ఆ తర్వాత మళ్లీ స్ట్రాంగ్ రూమ్ల నుంచి మరో 25 పోలింగ్ బూత్లకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి ఇస్తారు. అలా ఎనిమిదిసార్లు 200 పోలింగ్ బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెచ్చి బండిల్స్గా కడతారు. ప్రక్రియ అంతా గంటలో పూర్తవుతుంది.
పోలైన ఓట్లలో సగానికి పైగా వస్తేనే..
మొత్తం పోలైన ఓట్లలో ఎన్ని ఓట్లు చెల్లుబాటు అవుతాయో, ఆ చెల్లిన ఓట్లలో సగం ఓట్లకు మించి ఒక ఓటును కలిపి గెలుపు కోటాగా నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో పోలైన ఓట్లలో ఎవరికై తే సగానికి మించి ఒక ఓటు అధికంగా వస్తుందో వారిని మొద టి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఒక వేళ మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలుపు కోటా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 24,139 పోల్ అయ్యాయి. అందులో సగానికి మించి 12,070 ఓట్లు సాధించిన అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడ కోటా ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.
అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎలిమినేట్..
మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవ్వరు గెలవకపోయినా ఎలిమినేషన్ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. 19 మంది అభ్యర్థుల్లో ఏ అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు వస్తాయో, అతన్ని ఎలిమినేట్చేస్తారు. ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఏయే అభ్యర్థులకు వేశారో, వాటిని వారికి కలుపుతారు. అప్పటికి కూడా గెలుపుకు కోటా రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి వేశారో ఆయా అభ్యర్థులకు ఓ ఓట్లను కలుపుతారు. అప్పుడు మళ్లీ కోటా వచ్చిందా రాలేదా చూస్తారు. ఎవరికైనా గెలుపు కోటా వస్తే దాంతో గెలిచినట్లుగా భావిస్తా రు. ఒక వేళ కోటా రాకపోతే అదే తరహాలో చివరి అభ్యర్థి వరకు తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ వస్తారు. అలా గెలుపు కోటా వచ్చేంత వరకు లెక్కిస్తుంటారు. ఒక వేళ చివరికి 19 మందిలో 17 మంది ఎలిమిట్ అయినప్పటికీ గెలుపు కోటా రాకపోతే చివరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి తక్కువ ఓట్లు వస్తాయో వారిని ఎలిమినేట్ చేసి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను 19వ అభ్యర్థికి కలుపుతారు. అప్పటికి కోటా వస్తే సరి. కోటా రాకపోయినా ఎవరైతే ఎలిమినేట్ కాకుండా చివరి వరకు ఉంటారో ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఆర్థరాత్రివరకు సమ యం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment