
భూ భారతికి శ్రీకారం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఽభూమిపై హక్కుల విషయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఇక క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. ఈ పోర్టల్ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి భూభారతి విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.
పరిష్కారం కానున్న సమస్యలివే.. రెవెన్యూ రికార్డుల్లో గతంలో పట్టాదారు కాలమ్తో పాటు కబ్జాదారు కాలమ్ కూడా ఉండేది. అయితే ధరణి తీసుకువచ్చినప్పుడు కబ్జా కాలమ్ను తొలగించి పట్టాదారు కాలమ్ను మాత్రమే రికార్డుల్లో ఉంచింది. దీంతో గతంలో భూములు కొని పట్టాలు చేసుకోని వారు, సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన వారు కబ్జాలో ఉన్నప్పటికీ వారికి ఆ భూమిపై హక్కులు లేకుండా పోయాయి. గతంలో అమ్ముకున్న వారికే ధరణిలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. ఇలాంటి సమస్యలు అనే కం ఉత్పన్నం అయ్యాయి. అదేవిధంగా ధరణి అమలులో భాగంగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూములన్నింటినీ ఆన్లైన్ చేసే సందర్భంలో ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి పేరుతో పట్టాలు ఎక్కడం, కొందరికి భూమి ఉన్నంతగా కాకుండా తక్కువగా, ఎక్కువగా పాస్బుక్కుల్లో ఎక్కడం, మరికొందరు తమ భూములను అమ్ముకున్నప్పటికీ వారే దొడ్డిదారిన ఆ భూమిని పాస్బుకుల్లో తమ పేరున ఎక్కించుకోవడం, మరికొందరు కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు ఉన్నా ఒక్కరే పట్టా చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇలాంటివి ధరణిలో పరిష్కారం కాలేదు. దాంతో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూ భారతి ద్వారా ఇలాంటి సమస్యలకు కోర్టుకు వెళ్లాల్సిన పని లేకుండానే క్షేత్ర స్థాయిలో పరిష్కరించుకోవచ్చు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవడం, అక్కడా పరిష్కారం కాకపోతే కలెక్టర్కు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ధరణిలో పాస్బుక్ పొందిన పట్టాదారుడే తిరిగి వారేవారికి పట్టా చేస్తేనే పేరు మారేది. కలెక్టర్కు కూడా దాన్ని మార్చే అధికారం లేకపోవడంతో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అలాంటి వాటికి భూ భారతిలో మోక్షం లభించనుంది. ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ ఆగిపోతే ఆ డబ్బులు రైతులకు వచ్చేవి కావు. అలాంటివి ఇప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పట్టా భూమి పొరపాటున ప్రభుత్వ భూమి అని పడితే దాన్ని మార్పు చేయాలంటే సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇలా 2023 నుంచి అలాంటి సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు వాటితోపాటు పెద్ద మొత్తంలో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది.
మొదటగా నాలుగు మండలాల్లో..
మొదట రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతిని అమలు చేయనున్నారు. జూన్ నుంచి అన్ని మండలాల్లో అమలు చేస్తారు.ఈ చట్టంలో క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకు, ఆర్డీఓలకు అధికారాలు లభించనున్నాయి.
భూ సమస్యలు ఇక వేగంగా పరిష్కారం
భూ భారతి పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
జూన్ నుంచి అన్ని ప్రాంతాల్లో
పూర్తిస్థాయిలో అమలు