
కల్యాణోత్సవంలో ప్రతి భక్తుడికి తలంబ్రాలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో ఏప్రిల్ 11న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందజేసే ఏర్పాట్లు చేస్తున్నా మని టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం తెలిపారు. ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీలలో ఉండే భక్తులతోపాటు కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పా ట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాల పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిలకించేలా 15 ఎల్ఈడీ స్క్రీన్లు, ఆలయం, కల్యాణ వేదిక తదితర ప్రాంతాలలో విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు మూడు లక్షల తాగునీరు బాటిళ్లు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీమ్ లు, ఎనిమిది అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్డీపీపీ 18, దాస సాహిత్య ప్రాజెక్టు 4, అన్నమాచార్య ప్రాజెక్టు 8 ఆధ్వర్యంలో మొత్తం 30 కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటిసారి కళాకృతులతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేదిక, ఆలయ పరిసర ప్రాంతాలలో 12 టన్నుల సంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ప్లవర్స్తో పుష్పాలంకరణలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఏర్పాట్లను జేఈఓ పరిశీలించారు. ఆర్డీఓ జాన్ ఎర్విన్ పాల్గొన్నారు.