జిఓఎంను బహిష్కరిస్తున్నాం : వైఎస్ఆర్ సిపి | YSRCP boycott GOM | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 3 2013 12:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)ను బహిష్కరిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ రాజకీయవ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణతాల రామకృష్ణ, మైసూరా రెడ్డి ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీలు కూడా జిఓఎంను వ్యతిరేకించి సమైక్య ఉద్యమం కోసం కలసిరావాలని పిలుపు ఇచ్చారు. జిఓఎం తరపున కేంద్ర హొం శాఖ అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని తమ పార్టీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఆ లేఖ అందిన తరువాత తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి జిఓఎంను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విభజనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ జిఓఎంకు తమ పార్టీ తరపున లేఖ రాసినట్లు చెప్పారు. ఆ లేఖను మీడియాకు చూపించారు. జీఓఎం తమకు సమ్మతి కాదని చెప్పారు. జీఓఎం విభజనకు ముందడుగు మాత్రమేనని వారు అన్నారు. విభజన కోసం వేసే ఏ అడుగుకు తాము సహకరించం అని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నది మాత్రమే తమ డిమాండ్ అన్నారు. విభజనకు వ్యతిరేకంగా 8067 ఈ మెయిల్స్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 8067 పంచాయతీలు ఇమెయిల్స్ పంపినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రభుత్వం ఈ ఇమెయిల్స్కు స్పందిస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు. అలా స్పందించకపోతే ఆ ప్రభుత్వం కళ్లు మూసుకొని నిర్ణయాలు తీసుకుంటుందని భావించాలన్నారు. విభజనకు వ్యతిరేకంగా 75 శాతం జనాభా రోడ్డుపై పోరాటం చేస్తుంటే పట్టనట్లుగా కేంద్ర వ్యవహరిస్తోందన్నారు. తాము ఎక్కడకు వెళ్లినా సమైక్యవాదాన్నే కోరుకుంటామని చెప్పారు. రాష్ట్ర సమైక్యతకు ప్రజలు కృషిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు రాష్ట్రాన్ని విభజించేలా ఉన్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆఖరి రాష్ట్ర అవతరణ దినోత్సవం అని నిరాశ నిస్పృహలు వ్యక్తం చేయడం చూస్తుంటే, ఆయన రాష్ట్ర విభజనకు స్పష్టమవుతోందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల చర్యలు రాష్ట్రాన్ని విభజించే విధంగా ఉన్నాయని విమర్శించారు. పార్టీ తరపున రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు. తుపాను వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాన్ని వారికి తెలియజేస్తామని చెప్పారు. బాధితులకు తగిన సహాయం చేయమని విజ్ఞప్తి చేస్తామన్నారు. నల్లొండ జిల్లాలో వైఎస్ విజయమ్మను ప్రజలు అడ్డుకోలేదని, అది ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిందన్నారు. రక్షణ కల్పించవలసిన ప్రభుత్వం విజయమ్మను వెనక్కి పంపిచండం ఏమిటని వారు ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement