aakar patel
-
మెస్సయ్య దాటిపోయాక...
ఆస్పత్రి ప్రారంభోత్సవానికి పెద్దాయన వచ్చాడు. ఆయన రాకముందే రంగస్థలాన్ని చాలా శ్రద్ధగా సిద్ధం చేశారు. ఎంతగానంటే రెండు గంటల ముందు నుంచే ఫొటోగ్రా ఫర్లు మండుటెండలో ఎదురు చూసేట్లు. తీరా ఆయనొచ్చాక ఎడమ వైపు ఫొటోగ్రాఫర్ల బృందాన్ని చూసి చీదరించుకున్నాడు. ఎందుకంటే అక్కడనుంచి ఫొటోలు తీస్తే ఆయన ముఖం కనపడదు. నీడలు మాత్రమే వస్తాయి. ఆగమేఘాల మీద అది కూడా సరి చేశారు. అపుడు తీరిగ్గా ‘ప్రాచీన భాష లిపిలో, లోహపు కడ్డీకి చుట్టుకున్న పాములాగా కనిపించే మతచిహ్నం’ ఉన్న శిలాఫలకానికి మొక్కి, లేచి నిలబడి హటాత్తుగా చెట్టు కూలినట్లు నేల మీద పడిపోయాడు. ఆ పడిపోవడం ఉద్దేశపూర్వకంగా చేశాడేమో అన్నట్లు చేతులు రెండూ రెండు వైపులా కచ్చితంగా పెట్టినట్లు పడి పోయాయి. ఆయన ఆస్పత్రికి ప్రణామం చేస్తున్నాడేమో, కొత్త తంతు రిహార్సల్ ఏమో అనుకున్నారు. కానీ పెద్దా యన చచ్చిపోయాడు. మెస్సయ్య దాటిపోయాడు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన పెద్దాయన అంతమై పోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది?2023లో ఆకార్ పటేల్ ఇంగ్లిష్లో ‘ఆఫ్టర్ మెస్సయ్య’ (after messiah) నవల రాశారు. దాన్ని తెలుగులోకి ‘నియంత అంతం’ పేరుతో ఎన్. వేణుగోపాల్ అనువాదం చేస్తే ‘మలుపు’సంస్థ ప్రచురించింది. ఈ నవల అంతా కల్పనే. కానీ వాస్తవ భ్రాంతిని కలిగించే కల్పన. ‘జరుగుతున్నది ఇదే కదా!’ అని విస్తుపరిచే సంభావ్యత ఉన్న కల్పన. నియంత పాలించే కాలంలో ఆయన వైభవ కాంతి ముందు మిగతా లోకమంతా మసకలు కమ్ముతుంది. దేశభక్తి, మత రాజకీయాలు వినా ప్రజలకి గత్యంతరం ఉండదు. అభివృద్ధికి నిర్వచనాలు మారిపోతాయి. ప్రభుత్వాలను, వ్యవస్థలను, ప్రజలను తోలుబొమ్మలు చేసి ఆడించిన సూత్రగాడి తాళ్ళు పుటుక్కున తెగి దేశమంతా సంక్షోభపు చీకట్లలో మునిగి నపుడు, ‘ఆయన తర్వాత ఎవరు?’ అన్న ప్రశ్న పుట్టిన చోట కొత్త రాజకీయాలు మొదలవుతాయి.రాజకీయ పార్టీలలో నియంతృత్వ ధోరణుల వల్ల నాయకుల మరణం తర్వాత ప్రత్యామ్నాయం అంత తొందరగా తేలదు. దానికోసం కుమ్ములాటలు దేశానికి కొత్త కాదు. నియంతకి కుడిభుజంగా ఉండే జయేష్ భాయి, మత రాజకీయాల ద్వారా నూతనశక్తిగా ఎదిగే స్వామీజీల మధ్య పదవి కోసం జరిగే పోరు భారత రాజకీయ చరిత్ర పొడుగూతా జరిగిన అక్రమాలను స్ఫురింపజేస్తుంది. రిసార్టు డ్రామాలూ, కార్పొరేట్లతో లావాదేవీలూ, తమ ప్రయోజనాలకి అనుగుణమైన వాస్తవాలను నిర్మించే మీడియాల ‘పెనవేత రాజకీయాలూ’ అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేసి చట్టాన్నీ, న్యాయాన్నీ తమకి అను గుణంగా ఎలా మలుచుకుంటాయో చదివినపుడు దేశపౌరులుగా అభద్ర తకి లోనవుతాము. రాజ్యం ఎపుడూ తన మీద ఎవరో దాడి చేయ బోతున్నారనీ, తను బలహీనమైనదనీ ఊహించుకుంటుంది. అందుకోసం తన సమస్త శక్తులతో ఆ దాడిని ముందుగానే నిర్మూలించాలని అనుకుంటుంది. స్వతహాగా క్రూరమైన బలం ఉండడం వల్ల రాజ్యస్వభావం హింసతో కూడినదనీ, ప్రభుత్వాల హృదయమూ, ఆత్మా హింసేననీ నవల మొత్తం చెబుతుంది. అంతేకాదు ‘రాజ్యం అనేది ఒక హింసాత్మక రాజకీయ జంతువు’. ఈ జంతువుని చెడ్డవారు అధిరోహించినా అది హింసే. మంచివారు అధిరోహించినా హింసేనని తెలిసినపుడు కొంత వెలుగు మన ఆలోచనల మీద ప్రసరించి ఎరుక, దిగులూ కలుగుతాయి.ఆదివాసుల హక్కుల కోసం పనిచేసే మీరా – పార్టీలో ఒక సీనియర్ నాయకుని కూతురు. అనివార్య పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రధాని అవుతుంది. పీడిత ప్రజలకోసం పనిచేసే మంచి వ్యక్తి ప్రధాని అయినా రాజ్యస్వభావం మారదు. ఆదివాసీ హక్కులను పరిరక్షించే ఒక చిన్న చట్టం అమలు లోకి తేవడానికి మీరా, అనేక అడ్డంకులను ఎదుర్కుని, తన విలువలను పణంగా పెట్టాల్సి వచ్చినపుడు అంబేడ్కర్ గుర్తుకు వస్తారు. రాజ్యాంగం... హింస నుంచి పీడితులకు రక్షణ కల్పిస్తుందని నమ్మి, ఆ సాధనలోనూ, హిందూ కోడ్ బిల్లుని ఆమోదింపజేసే సందర్భంలోనూ అంబేడ్కర్ రాజ్యం పెట్టిన ఒత్తిడికీ, హింసకూ లోనయ్యి కూడా ఎంత గట్టిగా నిలబడ్డారో, దానికోసం ఎంత త్యాగం చేశారో, ఎంత రాజీపడ్డారో చరిత్ర చెబుతుంది.ఆ ఒక్క చట్టం కోసం ప్రత్యర్థి ముఠాలకి మీరా ప్రయోజనాలు సమకూర్చాల్సి వస్తుంది. ఆదివాసీల మేలు కోసం చట్టం చేయడానికి మీరా రాజ్య హింసకు లోబడి పని చేసిందని తెలుసు కున్న ఆదివాసీ ప్రతినిధి బృందంవారు ఆమె ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఒక మాట అంటారు. ‘పీడనకు గురయ్యాము కనుక పీడనను తిరస్కరించడం కాదు, అసలు పీడన అనేదే చెడ్డది కనుక దాన్ని మొత్తంగా తిరస్కరించాలని, ఒక పీడనను తొలగించడం కోసం మరో చోట మరో సమూహాన్ని పీడనకు గురి చేయడం భావ్యం కాదని’ చెబుతారు. చివరికి పదవి నుంచి దిగిపోయి ఆదివాసీ పోరాటాలలో భాగం కావాలని కోరుకుంటుంది మీరా.చదవండి: ప్రధాని మోదీ పేరిట గణాంక విన్యాసం.. అసలు కథ ఇదే!ఉనికిలో ఉన్న రాజ్య వ్యవస్థే హింసాత్మకం అయినపుడు, ఎంత మంచి వ్యక్తీ దాన్ని మార్చలేనపుడు, మరి ఎటువంటి పరిపాలనా ప్రత్యామ్నాయాన్ని ఈ నవల సూచించింది! బహుశా ఈ చర్చ పాఠకులలో జరగాలని రచయిత కోరుకుని ఉండొచ్చు. లేదా మీరా ఎంచుకున్న మార్గాన్ని మనకు సూచనప్రాయంగా అందించి ఉండొచ్చు. ‘ఏ రాయి అయి తేనేమి’ అన్న నిర్లిప్తత పెరిగిపోయిన వర్తమానంలో భిన్న రాజకీయ శ్రేణుల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయాల మీద చర్చ జరగాలి. ‘గమ్యమే మార్గాన్ని సమర్థిస్తుంది’ అన్న సూత్రాన్ని డీ కోడ్ చేయాలి.- కె.ఎన్. మల్లీశ్వరి‘ప్రరవే’ ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
నైతిక సందిగ్ధతల అంతస్సంఘర్షణ
సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మనం నమ్మిన సిద్ధాంతాలు, మనం పాటించే విలువలు, మనం అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం కూడా గౌరవనీయమే’’ అనే వాదన రాజకీయాలలో ఉంది. ఒక శక్తిమంతమైన నిర్ణయం తీసుకోడానికి ప్రధాని తన కార్యాలయానికి ఉన్న అపారమైన అధికారాలను ఎలాంటి నైతికపరమైన సంకోచాలూ లేకుండా ఉపయోగించడం ఆత్మ సమ్మతం అవుతుందా? కాలమిస్ట్ ఆకార్ పటేల్ తొలి నవల ‘ఆఫ్టర్ మెస్సయ’... గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా... రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రాప్తించడంలోని వైరుద్ధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. నిజం చెప్పొద్దూ... తనొక నవల రాశానని ఆకార్ పటేల్ నాతో అన్నప్పుడు నేను ఆశ్చర్యచకితుణ్ణే అయ్యాను. పటేల్ను ఒక దృష్టికోణం గల పత్రికా రచయితగా, మోదీ ప్రభుత్వాన్ని తూర్పార పట్టే ఒక గట్టి రాజకీయ వ్యాసకర్తగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు ధీశాలి అయిన ఛైర్మన్గానే నేను ఎరుగుదును. అంతే తప్ప, కాల్పనికత అయన అజ్ఞాత బలం అయి ఉంటుందని నేను ఏ కోశానా అనుకోలేదు. ఇంతేనా నాకు పటేల్ గురించి తెలిసింది! కథనానికి లోతైన నైతిక కోణాన్ని అందించే అంతస్సంఘర్షణతో పాత్రలను సృష్టించగల సామర్థ్యంతో పాటుగా ఆయన ఊహాశక్తిలోని ప్రతిభను, కదలనివ్వని కథన పటిమను ఆయన తాజా రచన ‘ఆఫ్టర్ మెస్సయ’ బహిర్గతం చేస్తోంది. గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా ఈ పుస్తకం రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రా ప్తించడంలోని వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ నవలొక వాస్తవ ఘటనల అల్లికగా ప్రారంభం అవుతుంది. నిజమైన వ్యక్తులు ఉంటారు. అయితే వారికి పెట్టుడు పేర్లు ఉంటాయి. ప్రధాన మంత్రిని ‘ది బిగ్ మ్యాన్’ అంటారు పటేల్. పుస్తకంలో ఎక్కడా ప్రధాని పేరు కనిపించదు. కానీ ఆ బిగ్ మ్యాన్ మాట్లాడే టప్పుడు ‘‘ప్రజాస్వామ్యం యొక్క భాష, చిహ్నాలు... పాలకుడు తన గురించి తను మూడో వ్యక్తిగా వ్యక్తం చేసుకుంటున్న ప్రస్తావనలతో కలిసి ఉంటాయి.’’ అది మొదటి గుర్తు. ఆ బిగ్ మ్యాన్ ప్రారంభోత్సవాలను కూడా ఇష్టపడతారు కనుక, ‘‘బిగ్ మ్యాన్ అధ్యక్షత వహించేందుకు వీలైనంతగా అత్యుత్తమమైన ఒక కార్యక్రమాన్ని లేదా వేడుకను అందించడంపై మంత్రిత్వశాఖలు దృష్టి పెడతాయి.’’ అది రెండవ గుర్తు. ఇక మూడోది... ‘‘రాజకీయ వ్యతిరేకత. అదేదో అంతర్గత శత్రువైనట్లుగా దానిపై హింసాత్మక దాడులు జరుగుతుంటాయి. ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఆ శత్రువును చావనివ్వని, బతకనివ్వని వాస్తవ రాజకీయా లకు అతీతమైన ఒక నిరంతర స్థితిలో ఉంచడంలో పూర్తిగా నిమగ్నం అయి ఉంటాయి’’. ఇప్పుడీ పుస్తకంలోని అబ్బుర పరుస్తూ చదివించే సంతోష దాయకమైన సృజనాత్మక ముగింపు గురించి తప్ప మరింకేదీ బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. బదులుగా ఇందులో పటేల్ కథనానికి పునాదిగా జరిగిన శక్తిమంతమైన రాజకీయ... నిజానికి నైతికపరమైన చర్చ గురించి మీకు చెబుతాను. పటేల్ పుస్తకంలో బిగ్ మ్యాన్ చాలా త్వరగా చనిపోతాడు. ఆయన తర్వాత మీరా అనే మహిళ అధికారంలోకి వస్తారు. ‘లాయర్స్ కలెక్టివ్’ అనే ఎన్జీవోకు పని చేస్తుంటారు మీరా. ఆమె అవివాహిత.ఒంటరి తల్లి. ఆమె కుమార్తె జైల్లో ఉంటుంది. బిగ్ మ్యాన్, ఆయన పార్టీ అనుసరించిన రాజకీయ విధానాలపై మీరాకు తృణీకారభావం ఉంటుంది. అనిష్టంగానే ప్రధాని అవుతారు. అయ్యాక మాత్రం గతంలోని క్రూరమైన చట్టాలను రద్దు చేయడం కోసం అపారమైన తన కార్యాలయ అధికారాలను ఉపయోగించు కోవాలనుకుంటారు. పేదల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా, జవాబుదారీగా మార్చేయబోతారు. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే ఆమె తన కార్యాలయ అపరిమిత అధికారాలను అభ్యంతరం, అనైతికం అయిన మార్గాలలో ఉపయోగించవలసి రావడం. ఇక్కడ జనించే ప్రశ్న: సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? అన్నది. ఆమె ముఖ్య సలహాదారు... ఆ సలహాదారుకు పేరేం ఉండదు... ‘హౌస్ మేనేజర్’ అంతే. ఆ మేనేజర్కు ఇది ఆమోదయోగ్యమే అనిపి స్తుంది. ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మీరు నమ్మిన సిద్ధాంతాలు, మీరు పాటించే విలువలు, మీరు అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం గౌరవనీయం,ప్రశంసనీయం అయిన సంగతే’’ అంటారు హౌస్ మేనేజర్. కానీ అందువల్ల ప్రయోజనం పొందగలిగిన సగటు ప్రజలు దానిని అంగీకరించరు. మీరా వారిని సంప్రదించినప్పుడు ఒక వృద్ధురాలు... తరచు నిరాకరణకు గురవుతుండే, అదే సమయంలో సర్వకాలాలకు అమోదయోగ్యమైనదిగా ఉండే యుగాల వివేకాన్ని వ్యక్తపరుస్తుంది. ‘‘చేయవలసిన సరైనది ఒకే ఒకటి ఉంటుంది. అదే సరైనది’’ అని అంటుంది. ఈ విధంగా పటేల్ పుస్తకం ముగింపునకు చేరుకుంటున్న కొద్దీ భారత రాజకీయాల స్వభావం గురించి; ఒకవైపు ఎత్తుగడలూ వ్యూహాలకూ, మరోవైపు సిద్ధాంతాలూ నైతికతలకూ మధ్య జరుగు తుండే ఘర్షణలతో ఒక శక్తిమంతమైన కథగా అభివృద్ధి చెందుతుంది. ప్రధాని కార్యాలయానికి ఉండే అపారమైన అధికారాలను నైతిక పరమైన సంకోచాలు లేకుండా, అనుకున్న దానిని సాధించేందుకు మీరా ఏకచిత్తంతో దృష్టి సారించినందున పుస్తకంలోని ఈ భాగం కేవలం చదివించేలా మాత్రమే కాదు, ఒక వెల్లడింపుగానూ ఉంటుంది. మీరా తనలోని సందేహాలను అణిచివేస్తారు. అయితే ఆశించిన ఫలితాన్ని సాధించడానికి ఇదే ఏకైకమార్గం అని హౌస్ మేనేజర్ తనకు నచ్చజెప్పేందుకు ఆమె అనుమతిస్తారు. అందువల్లనే ముగింపులో ఫలితం అనేది ఫలితం కోసం అనుసరించిన మార్గాలపై విజయం సాధించడం కనిపిస్తుంది. అయితే చర్చ మాత్రం ముగింపు దశకు చేరకనే ఉండిపోతుంది. అది ఆమె మనస్సాక్షిని కృంగదీస్తూ ఉంటుంది. నిజంగా రాజకీయాల్లో తరచు ఇలా జరుగుతుంటుందన్నది వాస్తవం. పటేల్ ‘బిగ్ మ్యాన్’పై ఇదేమీ ప్రభావం చూపకపోవచ్చు కానీ ఇతర రాజకీయ నాయకులు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లయితే దానివల్ల నలిగిపోతుంటారు కూడా. భారతదేశంలోనే కాదు, చాలా ప్రజాస్వామ్య దేశాలలో ఇలాగే జరుగుతుంటుంది. అందుకే రాజకీయాల సారాంశం అన్నది రాజకీయపరమైన దాని కన్నా చాలా ఎక్కువైనది. ఎందుకంటే అది నిర్ణయాలకు, ఎంపికలకు, అంతిమంగా సైద్ధాంతికతల్ని మించిన అంశాలకు సైతం సంబంధించినది. అలాగే నైతికపరమైన వాటికి కూడా. పటేల్ ఆ సంగతిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆకార్ పటేల్ అడ్డగింత
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయుడు, చరిత్రకారుడు, ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్కు బుధవారం బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికా పయనమైన ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. విదేశాలకు వెళుతున్న తనను అడ్డుకోవడంపై ట్విటర్లో ఆకార్ పటేల్ స్పందించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై మోదీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు కారణంగా తాను లుక్ అవుట్ సర్క్యులర్లో ఉన్నట్టు సీబీఐ అధికారి ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. అమెరికా పర్యటన కోసం గుజరాత్ కోర్టు నుంచి అనుమతి పొందానని, కోర్టు ఆర్డర్తో తన పాస్పోర్ట్ను కూడా తిరిగి తీసుకున్నానని తెలిపారు. అయితే ఆకార్ పటేల్పై లుక్అవుట్ నోటీసు ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. రూ. 36 కోట్ల విదేశీ నిధులకు సంబంధించి.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించారన్న నేపథ్యంలో ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, ఇతరులపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే లుక్అవుట్ నోటీసు జారీ అయింది. అయితే గతేడాది గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆకార్ పటేల్.. అమెరికా వెళ్లేందుకు సూరత్ కోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని సీబీఐ కోర్టును ఆకార్ పటేల్ ఆశ్రయించారు. దీనిపై స్పందన తెలియజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆకార్ పటేల్ పిటిషన్పై గురువారం ఉదయం విచారణ జరిగే అవకాశముంది. -
అలాంటి నిరసనలు మన దేశంలోనూ జరగాలి
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు, మానవ హక్కుల కార్యకర్త ఆకార్ పటేల్పై బెంగుళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు దేశంలోని పలు నగరాలకు పాకాయి. ఈ నేపథ్యంలో పటేల్ అగ్రరాజ్యంలో చేపట్టిన అల్లర్ల వీడియోలను మే 31న ట్విటర్లో పోస్ట్ చేశారు. మన దేశంలోనూ మైనారిటీ ప్రజలు ఇలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి మైనారిటీలు, వెనుకబడినవారు, పేదలు, మహిళలు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. (ఉద్యమ నినాదం.. 8.46) దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 505 (1) (బి) - ప్రజలను భయాందోళనకు గురి చేయడం లేదా ఏదేని విభాగానికి, వ్యక్తులకు లేదా ప్రజల ప్రశాంతతకు భంగం కలిగేందుకు ప్రయత్నించడం, 153- అల్లర్లు జరిపేందుకు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, 117 - పదిమందిని లేదా ప్రజలను నేరానికి ఉసిగొల్పడం కింద అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. ఆకార్ పటేల్పై పోలీసుల వేధింపులు ఆపాలన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ కింత అతనికి మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ భావాలు వెల్లడించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టడం నేరమేమీ కాదన్నారు. కాగా ఆకార్ పటేల్ గతంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేశారు. (ఊపిరాడకుండా చేసి ఫ్లాయిడ్ హత్య) -
సమస్యలున్నప్పుడు సమైక్యత సాధ్యమేనా?
హిందువులందరినీ రాజకీయంగా, సాంస్కృతికంగా ఏకం చేయడం బీజేపీ ప్రధానోద్దేశం. కానీ అది ఆచరణ సాధ్యమేనా? అందుకు అడ్డుపడుతున్న అంశాలేమిటి? బీజేపీకి సహజ మిత్రులైన ఆధిపత్య కులాలే ఇందుకు ప్రధాన అడ్డంకి. దళితులకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించడం ఆ వర్గాల రక్షణకు చట్టం ఉండటం ఆధిపత్య కులాలకు సమ్మతం కాదు. దళితులతో సాన్నిహిత్యం పెంచుకోవాలని తన పార్టీ ఎంపీలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారు. అంబేడ్కర్ జయంతి రోజైన ఈ నెల 14 సమయానికి దళితులు అధికంగా ఉండే గ్రామాల్లో ప్రతి ఎంపీ రెండు రాత్రుళ్లు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అంబేడ్కర్ను గౌరవించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నది బీజేపీయేననే విషయం పార్టీ ఎంపీలందరూ వారికి చెప్పాలని కూడా మోదీ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులు వీధుల్లోకి రావడాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ విధమైన సూచన చేస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. హిందుత్వ గత మూడేళ్లుగా వ్యాప్తి చెందుతున్న తీరు పర్యవ సానంగానే తమ రక్షణకు ఉద్దేశించిన ప్రత్యేక చట్టాన్ని సుప్రీంకోర్టు నీరుగార్చిందని దళితులు విశ్వసిస్తున్నారు. పార్టీ హృదయంలో వారి ప్రయోజనాలపట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్నదని ప్రతీకాత్మకంగా తేటతెల్లం చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుం దన్నది మోదీ ఆలోచన. ఇది సరిపోతుందా? సమస్యల పరిష్కర్తలుగా, శ్రేయోభి లాషులుగా భావించుకుంటున్న బీజేపీ దృక్కోణం నుంచే దీన్ని పరిశీలిద్దాం. హిందువులందరినీ రాజకీయంగా, సాంస్కృతికంగా ఏకం చేయడం బీజేపీ ప్రధా నోద్దేశం. ఇది ఆ పార్టీ సిద్ధాంతం. దీన్ని అది సంపూర్ణంగా విశ్వసిస్తోంది. మరి దీన్నెలా ముందుకు తీసుకుపోవాలి? హిందువుల ‘సంఖ్య’ ఎంతన్నది స్పష్టంగా చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే, సిక్కులు, జైనులు(బహుశా ఇప్పుడు లింగాయత్లు కూడా) తమను తాము హిందువులుగా భావించుకోరు. అయినా వారందరినీ హిందువులనుకుందాం. అలా అనుకుంటే దేశంలో 85 శాతం జనా భాను అది ఏకం చేయాల్సి ఉంటుంది. పదిహేను శాతంగా ఉన్నవారికి వ్యతిరేకంగా 85 శాతంమందిని ఏకం చేయ డం చాలా సులభం. ఉపఖండంలో సాధారణంగా జరుగుతున్నది అదే. దక్షిణా సియా దేశాల్లోని మైనారిటీలందరూ ఐక్యతతో వ్యవహరించే 85 శాతంమంది చేతుల్లో వేధింపులకు గురవుతున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ లేదా శ్రీలంక దేశాల్లో మైనారిటీలకు చట్టసభల్లో, ప్రభుత్వాల్లో, సాయుధ దళాల్లో, ఆఖరికి ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం చాలా తక్కువుంటుంది. అందరూ వారిని శత్రువులుగా పరిగణిస్తారు గనుక ఇళ్లు దొరకడం కూడా కష్టమే. ఇక అంతర్గతంగా ఎన్నో అంతరాలుండే 85 శాతం మందిని ఏకం చేయడంలోని సమస్యలేమిటో చూద్దాం. దళిత ఉద్యమం దీన్నే ముందుంచింది. భాష, ఆహారం, సంగీతంలాంటి కనీస అంశాల్లో కూడా ఏకత సాధించడం అంత సులభమేమీ కాదన్నది వాస్తవం. మనం లతా మంగేష్కర్ను సులభంగా ఈ దేశానికి ప్రతీకగా చూడగలం తప్ప ఎమ్మెస్ సుబ్బలక్ష్మిని కాదు. బాలీవుడ్, క్రికెట్ ఈశాన్య భారతీయులకు అంత ఆసక్తికరమైనవి కాదు. జాతీయ వాదం మనల్ని ఏకం చేస్తుంది. కానీ బయటివారికి వ్యతిరేకంగా మాత్రమే అది ఏకం చేయగలదు. మరి మనమధ్య సమస్యలున్న ప్పుడు ఏం జరుగుతుంది? హిందుత్వ హిందువులందరినీ తన షరతుల ప్రాతి పదికన మాత్రమే ఏకం చేయాలనుకుంటున్నది. ఉదాహరణకు దాని దృష్టిలో ‘హిందు’ అంటే గొడ్డు మాంసం తిననివారు... ఇంకా చెప్పాలంటే శాకాహారులు. మాంసాన్ని భుజించే గుజరాతీ కులం నుంచి నరేంద్ర మోదీ వచ్చారు. ఆయన ఆ సంస్కృతిని విడనాడి ఆరెస్సెస్ ఛత్రఛాయలోకి రావడం వల్ల మోదీకి ఆమోదనీ యత లభించింది. ఆయన గొడ్డు మాంసం తినే ఆదివాసీ అయివుంటే మోదీని గుజరాత్ సీఎంగా చేయడం ఆరెస్సెస్కు సులభం కాదు. కెబి హెడ్గేవార్, లక్ష్మణ్ పరంజపే, గురూజీ గోల్వాల్కర్, బాలాసాహెబ్ దేవరస్, రాజేంద్ర సింగ్, కెఎస్ సుదర్శన్ ఆరెస్సెస్ చీఫ్లుగా పనిచేశారు. ఆ సంస్థకు ప్రస్తుత చీఫ్ మోహన్ భాగ వత్. వీరిలో ఠాకూర్ అయిన రాజేంద్రసింగ్ మినహా మిగిలినవారంతా బ్రాహ్మ ణులు. ఒక దళితుణ్ణో, ఒక ఆదివాసీ మహిళనో సర్సంఘ్చాలక్గా నియమించ మని బీజేపీ ఆరెస్సెస్కు సూచించగలిగితే మంచిది. హిందువులను ఏకం చేయడంలో బీజేపీ ఎదుర్కొనే మరో సమస్య దానికి సహజమిత్రులైన ఆధిపత్య కులాలే. ఇవి మౌలికంగా దళితుల హక్కులకు వ్యతి రేకం. ఈ కులాలు దళితుల, ఆదివాసీల రిజర్వేషన్లకు మద్దతిస్తాయా? ‘కాదు’ అన్నదే జవాబు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు వీరి ప్రయోజనాలను దెబ్బతీస్తు న్నాయి. ఈ ప్రాథమిక అంతరాన్ని హిందూ ఐక్యత మాటున దాచి ఉంచడం సాధ్యం కాదు. రిజర్వేషన్లను తీసేస్తామంటే బీజేపీలోని దళిత లేక ఆదివాసీ ఎంపీల్లో ఒక్కరు కూడా మద్దతు ఇవ్వరు. షెడ్యూల్ కులాల, తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం మూలాల్లోనూ ఇదే సమస్య ఉంది. సుప్రీంకోర్టు ధైర్యంగా ఈ అంశంలోకెళ్లి తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా దళితులు, ఆదివాసీలు తిరగ బడ్డారు. ఆధిపత్య హిందూ కులాల వేధింపుల నుంచి ఈ చట్టం తమకు రక్షణగా నిలుస్తుందని వారు భావిస్తున్నారు. ఈ చట్టం సరిగా అమలు కావడం లేదన్నది, పోలీసులతో కేసు నమోదు చేయించడం కూడా ఓ పట్టాన సాధ్యం కావడం లేద న్నది వాస్తవం. అయినా కూడా ఇది కాగితంపై ఉండటం అవసరం. కానీ న్యాయ స్ధానమిచ్చిన తీర్పు దాన్ని బలహీనపరిచింది. ఈ విషయంలో కూడా పైనుంచి కిందివరకూ చీలిక ఉంది. ఆధిపత్య కులాల్లో ఎంతమంది ఈ తీర్పును వ్యతిరేకి స్తారు? చట్టం అమలు వల్ల బాధిత వర్గాలు ఆధిపత్య కులాలే గనుక చాలా తక్కు వమంది మాత్రమే వ్యతిరేకిస్తారు. ఈ చట్టం దళితులకు, ఆదివాసీలకు బలాన్ని చ్చింది. మనలో చాలామందికి అది అభ్యంతరకరం. ఇలాంటి పరిస్థితుల్లో ‘సబ్ కా వికాస్’ (అందరి వికాసం) సాధ్యం కాదు. బలమైనవారు రాయితీలకు అంగీకరి స్తేనే బలహీనులు ప్రగతి సాధించగలుగుతారు. కానీ ఇలా జరగటం లేదు. ఆరె స్సెస్ చీఫ్ లేదా మరొకరు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యానాలు ఎన్ని సార్లు బీజేపీని ఇరకాటంలో పడేశాయో చూడండి. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని కేంద్రం చెప్పింది. కానీ ఇందులో దృఢ సంకల్పం లేదు. పరిస్థి తుల్ని చూసి కలవరపడుతున్నది గనుక ఇలా చేసిందన్నది సుస్పష్టం. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఈ వారం వివిధ సంస్థలు నిర్వహించిన సదస్సులో నేను పాల్గొన్నాను. ప్రసంగించినవారిలో ఒకరైన సీపీఐ ఎంపీ డి. రాజా... అంబేడ్కర్ను గౌరవించిన పార్టీ బీజేపీయేనని మోదీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించారు. ‘అంబేడ్కర్కు కొత్తగా మీరెలాంటి గౌరవమూ ఇవ్వనవసరం లేదు. దళితులకు చేస్తున్నదేమిటో చెప్పాల’ని నిలదీశారు. ఇది నేరుగా తాకే ప్రశ్న. ప్రభుత్వం నిజంగా దళితుల పక్షాన ఉండదల్చుకుంటే చేయాల్సిందేమిటో దానికి తెలుసు. ఎంపీలు రెండు రాత్రుళ్లు ఒక పల్లెలో గడపవలసిన అవసరం లేదు. ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
కూటమి సర్కార్లు చేటు కలిగిస్తాయనడం భ్రమ
అవలోకనం ఎందుకనో మన మార్కెట్ విశ్లేషకులకు కూటమి ప్రభుత్వాలపై దురభిప్రాయాలున్నాయి. ఆ ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలకు మంచివికాదని, అవి నిర్ణయాత్మకంగా వ్యవహరించలేవని వారి భావన. కానీ వెనక్కెళ్లి చూస్తే సుస్థిరమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలకంటే కూటమి ప్రభుత్వాల హయాంలోనే దేశం ప్రయోజనం పొందింది. దినదినగండంగా బతుకీడ్చిన ప్రభుత్వాలే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోగలిగాయి. ప్రపంచబ్యాంకు పాలనా సూచికలు కూడా ఈ విషయాలనే చాటుతున్నాయి. ‘హంగ్ పార్లమెంటు’ అనే పదబంధం వింటేనే స్టాక్ మార్కెట్ వణుకుతుంది. మన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వం అవసరమని, ఒకే పార్టీకి మెజారిటీ లభించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఇది అసాధ్యమనుకో వడమే ఇందుకు కారణం. ఏక పార్టీ పాలన లేకపోతే సరైన ఆర్థిక నిర్దేశం ఉండదని, అందువల్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వృద్ధి కొరవడుతుందని, కేబినెట్లో స్వప్రయోజనపరులు పెరుగుతారని, నాయకత్వం చేసే పనులకు అడ్డుతగులుతా రని అటువంటివారు అంటారు. మెజారిటీ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా, కూటములకు వ్యతిరేకంగా సాగే వాదనలకు స్థూలంగా ఇదీ ప్రాతిపదిక. అయితే ఇటీవలి సంవత్సరాల్లోని ఆధారాలు ఈ ఆలోచనను బలపరిచేలా లేవు. యూపీఏ తొలి దశ పాలనాకాలం(2004–09)లో మొదటి అయిదేళ్లూ జీడీపీ వృద్ధి 8.5 శాతం. ఇది దేశ చరిత్రలో ఏ అయిదేళ్ల పాలనను తీసుకున్నా అత్యధికమని చెప్పాలి. కేవలం 145 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దీన్ని సాధించింది. సమాచార హక్కు చట్టంవంటి అత్యుత్తమ చట్టాలు ఈ కాలంలోనే రూపొందాయి. అదే కూటమి తదుపరి ఎన్నికల్లో సైతం 200 స్థానాలు గెల్చుకుని అధికారంలోకొచ్చింది. లెక్కప్రకారం యూపీఏ–2 ప్రభు త్వానికి మరింత స్వేచ్ఛ లభించింది గనుక అది లోగడకంటే ఎక్కువ నిర్ణయాత్మ కంగా ఉండాలి. కానీ జీడీపీ గణాంకాలు దీన్ని ప్రతిఫలించవు. ఈసారి సగటున 7 శాతం వార్షిక జీడీపీ మాత్రమే నమోదైంది. అయితే ఈ కాలం ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటున్న దశ అని, అందువల్ల అధిక వృద్ధి సాధించడానికి అనువైన మద్దతు వెలుపలి నుంచి లభించలేదని మనం గుర్తించాలి. నిజానికి ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉన్న ఈ తరుణంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్న ఈ సమయంలో గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంత బలహీనమైన ఆర్థిక వృద్ధి నమోదైంది. ప్రభుత్వ పనితీరును వ్యాఖ్యా నించడం నా ఉద్దేశం కాదు. స్టాక్ మార్కెట్, ఆర్థిక విశ్లేషకులు భయపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వానికుండే మెజారిటీకీ, నమోదయ్యే జీడీపీ వృద్ధికీ సంబంధం లేదని చెప్పడమే నా వివరణలోని అంతరార్థం. కూటమి ప్రభుత్వాలు ప్రధానమైన సంస్కరణలను తీసుకురాలేవన్నది మరో భయం. కానీ దినదినగండంగా బతు కీడ్చిన మైనారిటీ ప్రభుత్వాలున్న కాలంలోనే దేశంలో అత్యంత పెద్ద ఆర్థిక సంస్క రణలు ప్రారంభమయ్యాయి. అందరూ ‘డ్రీమ్ బడ్జెట్’గా చెప్పుకునే 1998నాటి బడ్జెట్ను అతి తక్కువ కాలం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే ప్రవేశ పెట్టింది. ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపలినుంచి మద్దతిచ్చింది. కనుక ఈ చరి త్రంతా గమనిస్తే కూటమి ప్రభుత్వాలు మంచివి కావని మార్కెట్లు ఎందుక నుకుంటాయో ఎవరికీ బోధపడదు. ప్రపంచబ్యాంకు వివిధ సంవత్సరాల్లో విడుదల చేసిన ప్రపంచవ్యాప్త పాలనా సూచికల ఆధారంగా యూపీఏ–1, యూపీఏ–2, ఎన్డీఏ ప్రభుత్వాలను పాత్రికేయుడు టీఎన్ నైనన్ పోల్చిచూపారు. అవినీతి నియంత్రణ అంశంలో మన పర్సంటైల్ ర్యాంకు 2013లో 37.0 నుంచి 2016లో 47.1కు మెరుగైంది. కానీ దీనికీ, మన్మోహన్ హయాంలో సాధించిన పర్సంటైల్ 46.8కీ పెద్దగా తేడాలేదు. ప్రభుత్వ పనితీరులో మన దేశం ర్యాంకు 2014లో 45.2 ఉండగా 2016లో అది 57.2, అంతకు చాలాముందు అంటే యూపీఏ–1 హయాం(20017)లో అది 57.3. నియంత్రణలకు సంబంధించి 2012నాటి స్కోరు 35.1 అయితే, 2016లో అది 41.3. కానీ 2006లో అది అత్యధికంగా నమోదైంది. ఆనాటి స్కోరు 45.1. రాజకీయ సుస్థిరత, హింస లేకపోవడం విషయంలో మన ర్యాంకు ఎప్పుడూ అల్పమే. 2005లో అది 17.5... 2014లో 13.8...2015లో 17.1...ఆ మరుసటి ఏడాది 14.3(అంటే 2005నాటి కంటే ఘోరం). శాంతిభద్రతల విషయంలో 2016 (52.4)... 2013 (53.1) కన్నా స్వల్పంగా తక్కువ. కానీ 2006 (58.4)తో పోలిస్తే బాగా తక్కువ. ఈ ర్యాంకుల్లో ఆఖరి సూచిక అభిప్రాయ వ్యక్తీకరణ, జవాబు దారీతనంలో చూస్తే 2013నాటి 61.5 ర్యాంకు 2016 కల్లా 58.6కు దిగింది. ఈ డేటా స్పష్టంగానే ఉంది. మార్కెట్లు, విశ్లేషకులు భయపడుతున్నట్టుగా ‘పటి ష్టమైన, నిర్ణయాత్మకమైన’ ప్రభుత్వం సాధించగలిగేదీ, ‘బలహీనమైన’ ప్రభుత్వం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇది నాయ కత్వపటిమకూ, దాని గురికి సంబంధించింది. అంతేతప్ప కీలకమైనదిగా కనబడే లోక్సభ అమరికతో దీనికి సంబంధం లేదు. ప్రభుత్వానికి మెజారిటీ లేకున్నా కీలకమైన జాతీయ ప్రయోజనానికి సంబంధించిన అంశం చర్చకొచ్చినప్పుడు అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమేమీ కాదు. నిజానికి స్పష్టమైన ఆధిక్యత మనకు అంత మంచిది కాదని నేను వాదిస్తాను. మన దేశంలాంటి వైవి ధ్యభరిత దేశంలో సాహసవంతమైన నిర్ణయం తీసుకుని అది కాస్తా వికటిం చడంకంటే... ఎంతో అప్రమత్తతతో, మధ్యే మార్గం ఎంచుకోవడమే శ్రేయస్కరం. ముందే ఏర్పర్చుకున్న కొన్ని అభిప్రాయాల కారణంగానే ఏదో ఒక పార్టీకి మెజారిటీ ఉండటం మంచిదన్న ఆలోచన ఏర్పడుతుందని మనం ఒప్పుకోవాలి. ఉదా హరణకు ప్రాంతీయ పార్టీలన్నీ అవినీతికరమైనవి, స్వప్రయోజనాలతో కూడిన వని, కుల ప్రాతిపదికన ఏర్పడే పార్టీలు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన అధునాతన భావాలతో ఉండవని కొందరంటారు. కానీ ఇందులో విశ్లేషణకంటే ప్రతికూల భావమే ఉంది. మన ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ మరో పార్టీ కంటే ఏ విషయంలోనూ ఉన్నతమైనదని చెప్పుకోలేదు. ఉత్తర భార తంలోని ఇటీవలి పరిణామాలు 2019లో హంగ్ పార్లమెంటు ఏర్పడవచ్చునని లేదా పాలకపక్షానికి తగినంత మెజారిటీ రాకపోవచ్చునని సూచిస్తున్న నేపథ్యంలో దీన్ని నేను రాయాల్సివచ్చింది. ‘హంగ్’ రావడం లేదా పాలకపక్షానికి మెజారిటీ తగ్గడం తథ్యమని మున్ముందు సర్వేలు వెల్లడిస్తే మన మార్కెట్ విశ్లేషకులు, బిజి నెస్ పత్రికలు దేశ ఆర్థిక వ్యవస్థకూ, సుస్థిరతకూ అది మంచిదికాదని ఊదర గొడతారు. కానీ చరిత్ర మాత్రం అదొక సమస్యే కాదని చెబుతోంది. నిజానికి అలా ‘హంగ్’ ఏర్పడటం స్వాగతించదగ్గదని మాబోటివాళ్లం అనుకుంటున్నాం. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
హక్కుల పరిరక్షణ చట్టాలను నీరుగార్చొద్దు!
అవలోకనం శిక్షల రేటు తక్కువగా ఉన్నదన్న కారణంతో ఒక చట్టం దుర్వినియోగమవుతున్నదని నిర్ధారించడం సబబు కాదు. అపహరణలు, ఫోర్జరీ, మోసం, బలవంతపు వసూళ్ల కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంటున్నది. కనుక ఆ చట్టాలు దుర్వినియోగమవుతున్నట్లేనా? దుర్బల వర్గాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలు మాత్రమే దురుపయోగమవుతున్నాయని నిర్ణయించడం సబబేనా? చట్టాల ‘దుర్వినియోగానికి’ వ్యతిరేకంగా మన సుప్రీంకోర్టు తీసుకుంటున్న చర్యలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈమధ్యే జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యు యు లలిత్ల నేతృత్వంలోని ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం ‘అడ్డూ ఆపూ లేకుండా దుర్వినియోగం’ అవుతున్నదని చెప్పి దాన్ని నిరోధించడం కోసం మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ఫలితంగా...దళితులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న చట్టం కాస్తా బలహీనపడుతుంది. తీర్పులో చాలాభాగం నిష్పాక్షిక విచారణ జరగాలని కోరడానికి నిందితులకుగల హక్కును కాపాడటానికి ఉద్దేశించిందే. కానీ ఈ తీర్పు విచిత్రమైన తర్కం చేసింది. కొన్ని హైకోర్టుల తీర్పుల్ని, జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం ‘దోపిడీ, అణచివేత’ శాసనంగా మారిందన్న నిర్ణయానికొచ్చింది. ఇది ‘బ్లాక్మెయిల్ చేయడానికి, వ్యక్తిగత ప్రతీకారాన్ని తీర్చు కోవడానికి’ ఉపయోగపడటంతో పాటు కులతత్వాన్ని శాశ్వతీకరిస్తున్నదని భావిం చింది. వాటికి విరుగుడుగా అనేక మార్గదర్శకాలిచ్చింది. అందులో అన్నిటికన్నా విధ్వంసకరమైనది కుల వివక్షకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు విషయంలో ఎఫ్ఐ ఆర్ దాఖలు చేసే ముందు ‘ప్రాథమిక విచారణ’ను తప్పనిసరి చేయడం. ఈ న్యాయమూర్తులిద్దరూ పరిరక్షణ చట్టాల దుర్వినియోగంపై ఆదేశాలివ్వడం ఇది తొలిసారి కాదు. గత జూలైలో భారత శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్ (వరకట్న వేధింపుల నిరోధక చట్టం) ‘దుర్వినియోగం’ కాకుండా ఆదేశాలిచ్చారు. వరకట్న వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులొచ్చినప్పుడు వాటిని పరిశీలించడానికి ‘కుటుంబ సంక్షేమ సంఘాలు’ ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎలాంటి చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని ఫిర్యాదులొస్తాయో ఆలో చించండి. వాటిలో–లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పని స్థలాల్లో మహిళల పరి రక్షణకు ఉద్దేశించిన చట్టం), వరకట్న నిరోధక చట్టం (వివాహితల పరిరక్షణకోసం వచ్చిన చట్టం), కుల వివక్షనూ, అఘాయిత్యాలనూ నిరోధించే చట్టం ( దళితులు, ఆదివాసీలకు ఉద్దేశించింది) ఉన్నాయి. చిత్రమేమంటే దుర్బల వర్గాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాల విషయంలోనే దుర్వినియోగం ఆరోపణలు వస్తాయి. ఇంత క్రితం ప్రస్తావించిన రెండు తీర్పుల విషయంలో నాకు రెండు ప్రశ్నలున్నాయి. ఒకటి–ఇతర చట్టాలకంటే ఇవే దుర్వినియోగానికి అనువుగా ఉన్నాయా? రెండు– ధర్మాసనం సూచించిన చర్యలు నిష్పాక్షిక విచారణకు దోహదపడేవేనా? మొదటి ప్రశ్నలోకి వద్దాం. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధించిన తీర్పులో ధర్మాసనం ఉటంకించిన గణాంకాలు చూద్దాం. 2015 జాతీయ క్రైం రికా ర్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) ప్రకారం ఎస్సీ కేసుల్లో 5,347, ఎస్టీ కేసుల్లో 912 తప్పుడు కేసులని నిర్ధారణ అయింది. దళిత సంఘాలు చెబుతున్న ప్రకారం ఆధి పత్య కులాలకు చెందిన పోలీసు సిబ్బంది దళితుల ఫిర్యాదులను స్వీకరించడానికి విముఖంగా ఉంటారు. అది తప్పుడు ఫిర్యాదని అప్పటికప్పుడే తేల్చేస్తారు. 2016 నాటి ఎన్సీఆర్బీ నివేదికలోని గణాంకాలను పరిశీలిద్దాం. ఆ ఏడాది మొత్తంగా ఎస్సీలకు సంబంధించి 56,299, ఎస్టీలకు సంబంధించి 9,096 ఫిర్యాదులు రావ డమో, దర్యాప్తు పెండింగ్లో ఉండటమో జరిగిందని ఆ నివేదిక తెలిపింది. అంటే మొత్తం కేసుల్లో 10 శాతం లేదా ప్రతి పది కేసుల్లో ఒకటి తప్పుడు కేసు అని అను కోవచ్చు. దానర్థం పదిలో తొమ్మిది నిజమైన కేసులేనన్నమాట! దీన్ని ‘అడ్డూ ఆపూ లేకుండా దుర్వినియోగం’ అవుతున్నట్టు భావించడం సబబేనా? ఈ గణాంకాలను ఇతర నేరాలతో పోల్చి చూద్దాం. కిడ్నాపింగ్ కేసుల్లో 9 శాతం, ఫోర్జరీ కేసుల్లో 12 శాతం తప్పుడువని పోలీసులు చెబుతున్నారు. అంత మాత్రాన కిడ్నాపింగ్, ఫోర్జరీల నిరోధానికి ఉద్దేశించిన చట్టాలను రద్దు చేయాలని ఎవరైనా అంటారా? 2015లో న్యాయస్థానాలు మొత్తం 15,638 కేసుల్లో తీర్పునిస్తే అందులో 11,024 కేసుల్లో నిందితులు నిర్దోషులని తీర్పులొచ్చాయని, 495 కేసుల్ని ఉపసంహరించుకున్నారని, 4,119 కేసుల్లో శిక్షలు పడ్డాయని సుప్రీంకోర్టు ధర్మా సనం ఉటంకించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కేసుల్లో ‘కేవలం’ 26 శాతం కేసుల్లో మాత్రమే శిక్షపడిన సంగతిని గుర్తు చేసింది. వాటి ఆధారంగా ఆ చట్టం దుర్వినియోగమవుతున్నదని అభిప్రాయపడింది. దర్యాప్తు, విచారణల్లో చోటు చేసుకుంటున్న జాప్యం.. బాధితులు, సాక్షుల వేధింపు.. దళితులకు, ఆదివాసీలకు న్యాయం లభించడానికి ఎదురవుతున్న వ్యవ స్థాపరమైన అడ్డంకులు... ఫలితంగా తగ్గుతున్న శిక్షల రేటు గురించి కాసేపు మరిచి పోదాం. వీటిని ‘దుర్వినియోగానికి’ ప్రమాణంగా తీసుకోదల్చుకుంటే ఎన్సీఆర్బీ తాజా గణాంకాల ప్రకారం మోసం కేసుల్లో 20 శాతం, బలవంతపు వసూళ్లలో 19 శాతం, దహనకాండల్లో 16 శాతం మేరకు మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఈ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని ఎవరూ చెప్పినట్టు లేదు. కానీ కేవలం కొన్ని చట్టాల పనితీరుపైనే దృష్టిపెట్టి అవి మాత్రమే దుర్వినియోగమవుతున్నాయ నడం సబబేనా. ఇక న్యాయబద్ధమైన విచారణ కోసం ధర్మాసనం జారీచేసిన మార్గ దర్శకాలను పరిశీలిద్దాం. మన దేశంలో బాధితులు లేదా సాక్షుల పరిరక్షణకు సంబంధించిన విధానమేదీ లేదు. కనుక ఇలాంటివారు నిందితుల నుంచి వేధిం పులు, బెదిరింపులు ఎదుర్కొంటారు. దీనికితోడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధపడరు. ఇలాంటి స్థితిలో కుటుంబ సంక్షేమ సంఘాల ఏర్పాటు, ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ‘ప్రాథమిక విచారణ’ ఇప్పుడున్న పలురకాల అడ్డంకులకు అదనంగా వచ్చి చేరతాయి. నిరుడు ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ ఆదివాసీలు వంద మంది ఎదుర్కొన్న సమస్యను ఉదహరిస్తాను. కొన్ని ప్రైవేటు సంస్థలు ఏజెంట్ల ద్వారా బెదిరించి తమ భూములు కబ్జా చేయడంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వారు ఫిర్యాదు చేశారు. రాయ్గఢ్ పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకుని ‘ప్రాథమిక దర్యాప్తు’ పేరిట జాప్యం చేసి కొన్ని వారాల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించారు. తప్పుడు కేసుల నుంచి రక్షణకు మన చట్టాల్లో ఇప్పటికే పలు ఏర్పాట్లున్నాయి. ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తికి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. తప్పుడు సాక్ష్యాలు, వాటిని తారుమారు చేయడం నేర పూరిత చర్యలు. వీటిని పోలీసులు, న్యాయవ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటే తప్పుడు ఫిర్యాదులు ఆగిపోతాయి. దుర్బల వర్గాల కోసం పార్లమెంటు చేసిన చట్టా లను మొద్దు బార్చే మరిన్ని తీర్పులు మనకు అవసరం లేదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
వచ్చే ఎన్నికల్లో ‘అయోధ్యే’ ప్రధానాంశం?!
అవలోకనం జనాన్ని ఆకట్టుకునే రీతిలో ఎన్నికల ప్రచారాన్ని రూపొందించడానికి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలనూ, మార్కెటింగ్ సంస్థలనూ నియమించుకోవడమనే సంప్రదాయానికి మన దేశంలో శ్రీకారం చుట్టినవారు రాజీవ్గాంధీ. సార్వత్రిక ఎన్నికల సమయంలో రూపొందించుకునే నినాదాలు జనాన్ని ఆకర్షించగలిగితే పార్టీలు విజయం సాధించగలుగుతాయి. లేనిపక్షంలో పేలవమైన ఫలితాలు వస్తాయి. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు త్వరలో ఇవ్వబోయే తీర్పు ఎలాంటిదైనా వచ్చే ఎన్నికల్లో అదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ అంశంపై హోరాహోరీ పోరు ఉంటుంది? ఇప్పటినుంచి రానున్న నెలల్లో పార్టీలు, కూటములు ఏం చేయాలో, ఎటుండాలో ఖరారు చేసుకుంటాయి. అందరినీ ఆకట్టుకునేలా సందేశాలను రూపొందించి ప్రజలకు అందించేందుకు అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలనూ, మార్కె టింగ్ నిపుణులను ఆశ్రయిస్తాయి. ఈ పని కోసం 2014లో బీజేపీ ఓగిల్వీ అండ్ మాథెర్ (ఓ అండ్ ఎం) సంస్థను నియమించుకోగా కాంగ్రెస్ డెంట్సూ సంస్థకు అప్పగించింది. నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీకి అప్పగించడం 1985లోనే మొదలైంది. ఆ ఏడాది రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రచార బాధ్యతల కోసం రెడీఫ్యూజన్ సంస్థను నియమించుకు న్నారు. ఈసారి కూడా రాజకీయ నాయకులు సూటూ బూటుల్లో వచ్చే నిపుణు లతో సమావేశమవుతారు. ఆ నిపుణులు ఆకట్టుకునే సందేశాలతో పవర్పాయింట్ ప్రజంటేషన్లు ఇస్తారు. ‘యే దిల్ మాంగే మోర్’, ‘యే అందర్ కి బాత్ హై’, ‘అచ్ఛేదిన్ ఆనేవాలే హై’ లాంటి ఆకర్షణీయ నినాదాలను రూపొంది స్తారు. 2014 అనుభవాలతో ఈసారీ సామాజిక మాధ్యమాల్లోనూ, టెక్నాలజీ లోనూ భారీ పెట్టుబడులు పెడతారు. ఈ ఎన్నికల్లో చాలా మంది దండిగా డబ్బు గడిస్తారు. 2014 ఎన్నికల ప్రచారంలో రూ. 714 కోట్లు ఖర్చు చేశామని బీజేపీ ఎన్నికల సంఘానికి తెలిపింది. తాము రూ. 516 కోట్లు వ్యయం చేశామని కాంగ్రెస్ లెక్క లిచ్చింది. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ రూ. 51 కోట్లు ఖర్చు చేసినట్టు నివేదిక సమర్పించింది. 2019 ఎన్నికల నాటికల్లా ఈ ఖర్చు రెట్టింపు నుంచి మూడురెట్లు పెరుగుతుందని భావించవచ్చు. అభ్యర్థులు చేసే ఖర్చు, పార్టీల తర ఫున వేర్వేరు కంపెనీలు చేసే ఖర్చు దీనికి అదనం. ఇదంతా మన దేశంలో సాధార ణమే. ప్రధాన అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 15 కోట్ల వరకూ సులభంగా ఖర్చుచే స్తారు. పార్టీ టిక్కెట్ రావడానికి వీరు చేసే ఖర్చు అదనం. మొత్తంగా 2019 ఎన్నికల్లోగా రూ. 25,000 కోట్ల వరకూ చేతులు మారుతుంది. ఇది మరీ అతి శయోక్తని మీరనుకుంటే నిరుడు జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రూ. 5,500 కోట్లు ఖర్చయిందని ‘ఎకనామిక్ టైమ్స్’ ప్రచురించిన అంచనాను గమనిం చండి. వార్తాపత్రికలు, టీవీ చానెళ్లు రాజకీయ ప్రకటనల రూపంలో అదనపు ఆదా యాన్ని సంపాదించుకుంటాయి. ఇందులో చాలా భాగం వార్తా కథనాల రూపంలో ఉంటాయి. చాలా లావాదేవీలుంటాయి. నీరవ్ మోదీ కుంభకోణం చూపినట్టు అవినీతి రహిత నేతతో అవినీతి ప్రారంభం కాదు. అక్కడే ముగియదు కూడా. ఏ కూటమివైపు మొగ్గితే గరిష్ట ప్రయోజనం ఉంటుందో ఎలాంటి భావోద్వేగాలకూ తావు లేకుండా రాజకీయ పార్టీలు మదింపు వేసుకుంటాయి. అవసరాన్నిబట్టి కొత్త కూటములకు సిద్ధపడతాయి. కొందరు నేతలు తొందరపడకుండా వేచిచూసే ధోరణి అవలంబించి, చివరిలో మరింత రాబట్టుకోవచ్చునన్న అంచనాలతో ఉంటారు. 2019కి ముందు మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాహుల్కి ఎంత దూరంగా ఉండాలో, లేదా ఎంత దగ్గరగా ఉండాలో ఈ నాలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలూ నిర్ధారించు కోవడానికి ఇవి దోహదపడతాయి. బీజేపీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించగలు గుతున్నదో, అందుకు దోహదపడుతున్న కారణాలేమిటో దాని ప్రత్యర్థులు తెలుసు కున్నారు. అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలకు పదును పెట్టుకుం టారు. ఉత్తర ప్రదేశ్లో ఈమధ్య జరిగిన రెండు ఉప ఎన్నికల కోసం మాయావతి, అఖిలేష్ యాదవ్లమధ్య కుదిరిన ఒప్పందాల వంటివి మనం చాలా చూస్తాం. వచ్చే ఎన్ని కలు ఏ అంశం ప్రాతిపదికన జరగనున్నాయన్న మొదటి ప్రశ్న దగ్గరకు మళ్లీ వెళ్దాం. మొత్తం ఆ ఎన్నికల తీరుతెన్నుల్ని ఎవరు నిర్దేశించగలుగుతారన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది. 2014లో ప్రతిపక్షానికి చెందిన నాయకుడు ఆ ఎన్నికలను నిర్దేశించారు తప్ప అధికార పక్షం కాదు. బీజేపీ తన సారథికి ఉందంటున్న శక్తి సామర్థ్యాలను ముందుంచి బరిలోకి దిగితే కాంగ్రెస్ పార్టీ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంజాయిషీ ఇచ్చుకోక తప్పని స్థితిలో పడింది. 2009లో బీజేపీ తన ప్రచార సారథి ఎల్కే అద్వానీని పటిష్టమైన నాయకుడిగా చూపేందుకు ఫ్రాంక్ సిమోస్, టాగ్ అండ్ ఉటోపియా అనే రెండు ఏజెన్సీలను ఉపయోగించుకుంది. ‘దృఢమైన నేత–నిర్ణయాత్మక ప్రభుత్వం’ అనేది అప్పటి నినాదం. మన్మోహన్ సింగ్ నిర్ణయరాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్న నేతగా చూపడం ఆ ప్రచారం వెన కున్న ఉద్దేశం. ఆ ఏడాది కాంగ్రెస్ జే వాల్టర్ థాంప్సన్(జే డబ్ల్యూ టీ) అనే ఏజెన్సీ సాయం తీసుకుంది. ఆ సంస్థ ‘ఆమ్ ఆద్మీ’ నినాదానికి రూపకల్పన చేసింది. అయితే దాన్ని అనంతరకాలంలో అరవింద్ కేజ్రీ వాల్ సొంతం చేసుకున్నారను కోండి. 2004లో వాజపేయి గ్రే వరల్డ్వైడ్ సంస్థ రూపొందించిన ‘ఇండియా షైనింగ్’ నినాదాన్ని స్వీకరించి బరిలోకి దూకారు. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ ఓడిపోయింది. అలా ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటో ఇప్పటికీ ఎవరికీ పూర్తి అవగాహనకు రాలేదు. 2019లో జరిగే ఎన్నికలు అనుకూలాంశ (పాజిటివ్) ప్రచారంతో ఉండవు. నా ఉద్దేశం ప్రకారం అటు పాలకపక్షం నుంచి గానీ, ప్రతిపక్షం నుంచిగానీ ‘అచ్ఛేదిన్’ మాదిరి నినాదంతో ప్రచారం ఉండదు. మన ఆర్థిక వ్యవస్థ అంత ప్రత్యేకత చూపే స్థాయిలో ఏమీ పనిచేయలేదు. పౌరు లుగా మన బతుకులు 2014కూ, ఇప్పటికీ గమనించే స్థాయిలో ఏం మారలేదు. కొద్దిరోజుల క్రితం నేను ఒక బీజేపీ నేతతో మాట్లాడాను. 2019నాటికి అయోధ్య అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతామని ఆయన చెప్పారు. ఇప్పటికైతే బీజేపీ దాని జోలికి పోలేదు. కానీ ఇదంతా మారొచ్చు. సుప్రీంకోర్టు అయోధ్య కేసును విచారిస్తోంది. త్వరలో ఆ కేసులో తీర్పు వెలువడొచ్చు. దీన్లో తమను కూడా కక్షిదారులుగా చేర్చాలంటూ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు కొద్ది రోజులక్రితం కోరితే సుప్రీంకోర్టు తిరస్కరించింది. సంప్రదింపుల ద్వారా దీనికి పరిష్కారం వెదకాలన్న ప్రతిపాదనను కూడా అది ఒప్పుకోలేదు. ‘భూ వివాదంలో మధ్యేవాద పంధా ఎలా సాధ్యమ’ని ప్రశ్నించింది. అదెలాంటి తీర్పయినా ఆ అంశం వచ్చే ఎన్నికల్లో ప్రధానమవుతుంది. అయితే ఆ ప్రచారం ద్వారా జనంలోకెళ్లే సందేశం ఏమిటన్నది ఊహించడానికే నాకు వణుకొస్తోంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఈ సప్త అంశాలూ అత్యంత కీలకం
అవలోకనం మన దేశంలో సొంత ప్రచారం కోసం ప్రభుత్వాలు వాణిజ్య ప్రకటనల రూపంలో చేసే ఖర్చు అంతా ఇంతా కాదు. అన్నిటికన్నా భారీయెత్తున ప్రచారానికి వ్యయం చేసేది కేంద్ర ప్రభుత్వమే. గత ఏడాది కేంద్రం ఇందుకోసం చేసిన వ్యయం రూ. 1,280 కోట్లు. డియోడరెంట్లు మొదలుకొని లక్స్ సబ్బు, తాజ్మహల్ టీ వరకూ అన్నిటినీ ఉత్పత్తి చేసే హిందూస్తాన్ యూనీలీవర్ సంస్థ వార్షిక ప్రకటనల వ్యయం రూ. 900 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్వీయ ప్రచారానికి బాగానే నిధులు కేటాయిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలపై ఈ వారంలో కనబడినంత ఆసక్తి దేశంలో మును పెన్నడూ లేదు. అలవాటు ప్రకారం నేను శనివారం వేకువజామునే లేచి 7 గంట లకు న్యూస్చానెళ్లను గమనించేసరికి ఆశ్చర్యం కలిగింది. అందరూ వారి వారి నిపు ణులతో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం సిద్ధంగా ఉన్నారు! ఇదొక మంచి పరిణామం. కొన్నేళ్లక్రితం ‘ఇండియా టుడే’ మాగజిన్ రాసిన సంపాదకీయ వ్యాఖ్య నాకు గుర్తుంది. మన దేశం ఈశాన్య భారతాన్ని ఏవిధంగా నిర్లక్ష్యం చేస్తున్నదో చెప్పడం ఆ వ్యాఖ్య సారాంశం. చిత్రమే మంటే ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల గురించిన కథనాలున్న ఆ సంచిక ముఖపత్రంపై కేవలం అయిదు పెద్ద ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలకు సంబం ధించిన వివరాలున్నాయితప్ప అదే సమయంలో జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావనే లేదు. ఇప్పుడు ఈ వైఖరి మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే దీన్ని మంచి పరిణామమని అన్నాను. ఈ ఫలితాలు... ముఖ్యంగా త్రిపుర ఫలితాలు ఆసక్తిదాయకమైనవి. ప్రపం చంలోని ప్రధాన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో క్రియాశీల కమ్యూనిస్టు పార్టీలు పనిచే స్తున్న దేశాల్లో మనది ఆఖరుదని చెప్పుకోవాలి. ఇంతక్రితంతో పోలిస్తే ఒక శక్తిగా కమ్యూనిస్టుల ప్రాధాన్యం తగ్గి ఉండొచ్చుగానీ వారి వల్ల రాజకీయాలకు విలువ పెరుగుతోంది. అయితే నేనివాళ కాంగ్రెస్పై కేంద్రీకరిస్తాను. గత నెలలో రాజస్థా న్లో వెలువడిన కొన్ని ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘రాష్ట్రాలు గెలుచుకోవాలంటే మీరు మున్సిపల్ ఎన్నికల్లో, వార్డు ఎన్నికల్లో నెగ్గాలి. ఆ ఎన్నికలు ఒక సంస్థకు పునాదిలాంటివి. మనం రాష్ట్రాలు నెగ్గాలి. రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో సీట్లు గెల్చుకోకుండా ఏ పార్టీ కూడా జాతీయ స్థాయిలో న్యూఢిల్లీని గెల్చుకోవాలన్న ఆలోచన చేయలేదు’ అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్రాల్లో గెలుపు ఎందుకంత ముఖ్యం? ప్రాంతీయంగా ఉండే అధికారానికి ఉండే ప్రాముఖ్యతేమిటి? చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు అధికారం లేకుండా పోయింది గనుక వీటి గురించి పరిశీలించక తప్పదు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల తర్వాత ఇందులో కొంత మార్పు ఉండొచ్చు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీకి ఎందుకు కీలకమైనవి? మొదటి ప్రయోజనం స్పష్టమైనదే. అధికారంలో ఉండటమే రాజకీయాల పర మార్ధం. అధికారంలో ఉండే పార్టీ తన సిద్ధాంతంలోని నిర్దిష్టతలను అమల్లోకి తెచ్చి ఎజెండాను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బీజేపీ హర్యానా, మహారాష్ట్రల్లో పశు మాంసాన్ని, పశువధను నిషేధించడం ద్వారా దాన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చింది. కార్పొరేషన్లు, రాష్ట్ర అసెంబ్లీల్లో అధికారం ఉంటే రాజకీయ నాయ కులకు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం రెండో ప్రయోజనం. పొద్దస్తమానం ప్రజలు విద్యుత్ కనెక్షన్లు మొదలుకొని తమ పిల్లల అడ్మిషన్ల వరకూ ఎన్నో అంశాల కోసం రాజకీయ నాయకులపై ఒత్తిళ్తు తెస్తుంటారు. అధికారంలో ఉన్న పార్టీ ఇవన్నీ చేయగలదు తప్ప ప్రతిపక్షం చేయ లేదు. మూడోది–నిధుల సేకరణ. ఇది రెండు మార్గాల్లో పనిచేస్తుంది. వాస్తవం ఏమంటే రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా అవినీతిపరులు కాకపోయినా తమ పార్టీ కోసం విరాళాలు తీసుకుంటారు. ప్రముఖ జర్నలిస్టు స్వర్గీయ ధీరేన్ భగత్ మాజీ ప్రధాని వీపీ సింగ్పై తాను రాసిన ‘కాంటెంపరరీ కన్సర్వేటివ్’ పుస్తకంలో దీన్ని గురించి చక్కగా చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీకి కార్పొరేట్ల నుంచి అధి కారికంగానే నిధులు ప్రవహిస్తాయి. అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియ నిది కాదు. నాలుగో అంశం– ఆ వచ్చిన నిధుల్ని అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి సంబంధించిన విషయం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీచేసే వారు ఇతోధికంగా నిధులు ఖర్చు పెట్టలేరు. ఇది వారిని రంగంలో తగిన పోటీ దారుగా నిలపలేదు. అయిదో అంశం– అధికారంలో ఉన్నవారికి సమాచారాన్ని చేరేసే ప్రక్రియను నియంత్రించే శక్తి ఉండటం. ఉదాహరణకు ప్రభుత్వాలు వాణిజ్య ప్రకటనలకు చేసే వ్యయం. దేశంలో భారీగా ఖర్చు చేసే ప్రకటనకర్త కేంద్ర ప్రభుత్వం. గత ఏడాది అది ప్రధాని, ఆయన పథకాల ప్రచారం కోసం రూ. 1,280 కోట్లు వ్యయం చేసింది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే... డియోడరెంట్లు మొదలుకొని లక్స్ సబ్బు, తాజ్మహల్ టీ వగైరాల వరకూ అన్నిటినీ ఉత్పత్తి చేసే హిందూస్తాన్ యూనిలీవర్ సంస్థ వార్షిక వాణిజ్య ప్రకటనల వ్యయం రూ. 900 కోట్లు. దేశంలోని టెలికాం సంస్థలు అన్నీ కలిసి వాణిజ్యప్రకటన కోసం చేసే ఖర్చు కేంద్ర వ్యయం కన్నా చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సొంత ప్రచారం కోసం తగిన నిధుల్ని కేటాయిస్తుంటాయి. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 2015లో ప్రచారం కోసం రూ. 526 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఆరోది–ఇలా ప్రచారం కోసం భారీ యెత్తున చేసే వ్యయమంతా మీడియాను పాలకపక్షం వైపు నిలుపుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పత్రికల విషయంలో ఇది వాస్తవం. ఉదాహరణకు దేశంలో కోటిన్నరమంది పాఠకులుండి ఏడో స్థానంలో నిలిచిన ‘రాజస్థాన్ పత్రిక’ వసుం ధర రాజే ప్రభుత్వం తమకు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బహుశా ఆ ప్రభుత్వానికి ‘రాజస్థాన్ పత్రిక’ అనుకూలంగా లేకపోవడమే ప్రకటనలు ఆపడానికి కారణం కావొచ్చు. ఏడోది, ఆఖరుది–ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం. ఎన్నికల సంఘం దీనిపై కొంతవరకూ కన్నేసి ఉంచుతోంది. కానీ ఎన్నికల తేదీలు ప్రకటించాకే అది మొదలవుతుంది. మిగిలిన అయిదేళ్లూ అధికారంలో ఉన్న పార్టీ పోలీసుల్ని ఉపయోగించుకోవచ్చు. అస్మదీయులకు పదవులు పంచిపెట్టొచ్చు. ప్రభుత్వ విభాగాల న్నిటినీ వినియోగించుకోవచ్చు. దుర్వినియోగం కూడా చేయొచ్చు. అడిగేవారుం డరు. రాజకీయ పార్టీలను పోషించే, నిలబెట్టే అంశాలు మన దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. స్థానిక అధికారం ద్వారా కాంగ్రెస్ పార్టీ నిలకడగా, క్రమబద్ధంగా శక్తి పుంజుకుని కొనసాగనట్టయితే 2019లో రాహుల్గాంధీ జాతీయ స్థాయిలో స్వత స్సిద్ధమైన పోటీదారుగా మారడం కష్టం. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
అధునాతన యుద్ధతంత్రమూ... కర్రసామూ!
అవలోకనం ఆర్ఎస్ఎస్ శాఖలు తమ క్యాడర్తో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయించటమే కాకుండా దేశభక్తికి సంబంధించిన పాటలు పాడిస్తుంటాయి. అయితే నేటి యుద్ధాలను మర్చిపోండి. వందేళ్ల క్రితం జరిగిన యుద్ధానికి కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమం ఎందుకూ కొరగాదనే చెప్పాలి. పదాతి దళానికి ఇచ్చే ఆధునిక సైనిక శిక్షణా కార్యక్రమం 400 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. శతాబ్దాల క్రమంలో అది ఒక రూపు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ 2018లో గైడెడ్ మిస్సైల్స్ శకంలో అది సైతం ఎందుకూ పనికిరాదనే చెప్పాలి. రెండు దేశాల మధ్య కీలకమైన యుద్ధం జరిగి 15 ఏళ్లయింది. ఏకపక్షంగా జరిగిన ఆ దురాక్రమణ యుద్ధంలో సద్దాం హుస్సేన్ను అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఓడించాడు. ఇరాకీ సైన్యం వద్ద ఉన్న కాలం చెల్లిన ట్యాంకులు, యుద్ధ విమానాలు అమెరికన్ సైనిక శక్తి ముందు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఇరు దేశాల సైన్యాలు దాదాపు సమాన సంఖ్యలో –3,50,000 మంది సైనికులు– యుద్ధంలో పాల్గొన్నప్పటికీ అమెరికా సైన్యంలో మరణాల శాతం ఇరాకీ సైన్యంతో పోలిస్తే 110వ వంతు మాత్రమే. అమెరికన్ల యుద్ధ సామగ్రి చాలా అధునాతనమైంది. ఆయాదేశాలు సైనిక సామగ్రిపై పెట్టే వ్యయాన్ని ప్రధానంగా ట్యాంకులు, యుద్ధ ఓడలు, యుద్ధవిమానాలకే వెచ్చిస్తుంటారు. ఈ సంవత్సరం భారత ప్రభుత్వం కేటాయించిన రక్షణ బడ్జెట్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలను ఈ హర్డ్వేర్ పైనే వెచ్చిస్తున్నారు. అయితే ఇంత డబ్బు వెచ్చించి కొంటున్న ఆయుధ సామగ్రిని రిపబ్లిక్ డే పెరేడ్ వంటి సందర్భాల్లో తప్ప ఎన్నడూ ఉపయోగించడం జరగదని చాలామంది సైనిక వ్యూహ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండు ప్రధాన దేశాల మధ్య భవిష్యత్తులో జరగబోయే యుద్ధం 2003లో జరిగిన ఇరాక్ యుద్ధం కంటే భిన్నంగా ఉంటుంది. ఇరాక్ యుద్ధాన్ని 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంతో పోల్చి చెప్పవచ్చు. ఒక పక్షం మరొక పక్షాన్ని బలప్రయోగంతో ఒప్పించి తను కోరిందల్లా సాధించుకోవచ్చని అభిప్రాయపడినప్పుడే యుద్ధం జరుగుతుంది. అయితే ఒక్కోసారి హింసతో పనిలేకుండానే ఎదుటి పక్షం మెడలు వంచడం సాధ్యపడవచ్చు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికన్ నిఘా సంస్థలు పేర్కొన్నాయి. హిల్లరీ క్లింటన్ ఆ ఎన్నికల్లో ఓడిపోయి, డొనాల్డ్ ట్రంప్ గెలుపొందాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావించారట. ఈ వ్యవహారంలో రష్యన్లతో ట్రంప్ చేతులు కలిపారని ఆరోపణలు వచ్చాయి కూడా. పుతిన్ అతడి గూఢచారులు అమెరికన్ ఎన్నికల్లో జోక్యం చేసుకుని ప్రభావితం చేశారని నిశ్చయంగా చెప్పవచ్చు. ఫిబ్రవరి 16న ట్రంప్ న్యాయ శాఖ 13 మంది రష్యన్లపై నేరారోపణ చేసింది. వీరిలో చాలావరకు రష్యాలోని సెయింట్స్ పీటర్స్బర్గ్ నగరంలోని ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ అనే బృందానికి చెందినవారు. వీరు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్పై సోషల్ మీడియా ఖాతాలను తెరిచారు. వాస్తవానికి వాటిని రష్యా నుంచి నిర్వహిస్తున్నప్పటికీ అమెరికా నుంచి నిర్వహిస్తున్నట్లు కనిపించేవి. ఈ ఖాతాలు ట్రంప్కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో సహాయపడ్డాయని అమెరికన్లు నమ్ముతున్నారు. ట్రంప్ గెలవాలని రష్యా ఎందుకు భావించిందంటే, ప్రపంచంలో రష్యా ప్రభావాన్ని పరిమితం చేసేలా హిల్లరీ క్లింటన్ ఆంక్షలను, విధించవచ్చని అనుమానించడమే. అమెరికాతో ఎలాంటి యుద్ధానికి వెళ్లకుండానే పుతిన్ తాననుకున్నది నెరవేర్చుకున్నారు. సరిహద్దుల్లో యుద్ధమే వస్తే ఆర్ఎస్ఎస్ కేవలం మూడురోజుల్లోపలే సైనిక బలగాలను మోహరింప జేయగలుగుతుందని, అదే భారత సైన్యానికి ఆరునెలల సమయం పడుతుందని ఆ సంస్థ అధిపతి మోహన్ భాగవత్ అన్నారు. భాగవత్ తన మిలీషియాను సరిహద్దులకు పంపిన తర్వాత అక్కడ అది ఏం చేస్తుందన్నదే నా ఆలోచన. చైనా సైనికులు పర్వతాల మీది నుంచి రైఫిళ్లను చేతుల్లో పట్టుకుని వస్తున్నట్లుగా 1962 నాటి యుద్ధ డాక్యుమెంటరీలను చూసిన తర్వాత భాగవత్ అలా ప్రకటించి ఉంటారా? మదర్ ఇండియాను రక్షించడానికి సంఘ్ అనుయాయులు ఏం చేస్తారనే అంశంపై భాగవత్ ఊహ ఏమిటి? ఆర్ఎస్ఎస్ శాఖలు తమ క్యాడర్తో క్రమం తప్పకుండా శారీరక వ్యాయా మం చేయించటమే కాకుండా దేశభక్తికి సంబంధించిన పాటలు పాడిస్తుంటాయి. అయితే నేటి యుద్ధాలను మర్చిపోండి. వందేళ్ల క్రితం జరిగిన యుద్ధానికి కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమం ఎందుకూ కొరగాదనే చెప్పాలి. పదాతి దళానికి ఇచ్చే ఆధునిక సైనిక శిక్షణా కార్యక్రమం 400 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. శతాబ్దాల క్రమంలో అది ఒక రూపు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ 2018లో గైడెడ్ మిస్సైల్స్ శకంలో అది సైతం ఎందుకూ పనికిరాదనే చెప్పాలి. ఆధునిక రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో మనకు కలిగే ముప్పు ఏదైనా ఉందంటే అది పోరాడే స్వచ్ఛంద సైనికులు లేకపోవడం వల్ల కాదు. ఎందుకంటే ప్రపంచంలోని అతి పెద్ద సైన్యాలలో భారత్ సైన్యం ఒకటి. ఇక యుద్ధ సామగ్రి కొరత అసలే కాదు. ఎందుకంటే మనకు చాలినన్ని ట్యాంకులు, యుద్ధ విమానాలు లేవనడానికీ వీల్లేదు. తగిన టెక్నాలజీ లేకపోవడమే మన అసలు సమస్య. నిజానికి ఇదే ప్రాణాంతకమైన సమస్య. నేటి ఆధునిక రాజ్యం శత్రువు కమ్యూనికేషన్లను నిర్వీర్యం చేయడంమీదే ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఇంటర్నెట్ను విచ్ఛిన్నపర్చి, బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పగూలిస్తే గంటల్లోపే ఒక దేశాన్ని ముంగాళ్లమీదికి తీసుకురావచ్చు. సైనిక పరంగా చూస్తే కూడా, సరిహద్దుల అవతలినుంచి మన కమ్యూనికేషన్లపై దాడి జరిగితే చాలు దేశం రెక్కలు విరిగిపడినంత స్థితి నెలకొంటుంది. ఉదాహరణకు అమెరికన్ల ఆజమాయిషీలో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్పై ఆధారపడుతున్నాం. దీన్ని అందుబాటులో లేకుండా చేస్తే మన యుద్ధ విమానాలు, క్షిపణులు కీలక సమయంలో పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో లక్షలాదిమంది తమ ప్రాణాలు ధారపోయడానికి సంసిద్ధత తెలిపినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అధునాతన సంపత్తి లేని దేశాన్ని శత్రువు ఎలాంటి హింసా లేకుండానే సులువుగా లొంగదీసుకోవచ్చు. నేడు యుద్ధతంత్రం మొత్తం దీనిపైనే నడుస్తోంది. దీన్ని అర్థం చేసుకోకపోవడం అనేది సమాచార లేమికి కాకుండా మన పరమ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్, మన ప్రధానమంత్రితో సహా ఆ సంస్థ నుంచి తయారవుతున్న వ్యక్తుల ఆలోచనల నాణ్యతపై మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వల్లే నేను ఇలా రాయాల్సి వస్తోంది. ఈ ఆలోచన చాలా పురాతనమైనది. మరీ తేలికగా తీసుకుంటున్నారనిపిస్తుంది. దేశభక్తిని ఇలాంటి ఆలోచనలు, ప్రకటనలు రగుల్కొల్ప వచ్చు. దాని లక్ష్యంపట్ల సందేహించనవసరం లేదు. కానీ అలాంటి ఆలోచనల నాణ్యత ప్రమాద హెచ్చరికలు పంపుతోంది. అదే నన్ను భయపెడుతోంది కూడా. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
మనమంతా బాధపడవలసిన మరో సంగతి..
కల్లోల కశ్మీర్లో ఎవరి హక్కులు గల్లంతవుతున్నాయి? మనమంతా బాధపడవలసిన సంగతి మరొకటుంది– మన సైన్యం ఇతర భారతీయుల నుంచి తనకు రక్షణ కల్పించమని పిల్లలను ఉపయోగించుకుని డిమాండ్ చేస్తోంది. ఈ దేశ పౌరులు ఈ దేశ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే, ఇక్కడి పోలీసులే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తే, ఈ దేశ న్యాయస్థానాల్లో ఇక్కడి న్యాయమూర్తులే విచారణ జరుపుతుంటే మన సైన్యం భయసందేహాలు వ్యక్తం చేస్తోంది. నిజానికిది బాధపడాల్సిన విషయం కాదు... కలవరపడాల్సిన విషయం. ఈసారి నేను కశ్మీర్ హింసపై రాస్తున్నాను. ఆ హింస గురించి కేవలం ఒక కోణంలో మాత్రమే తెలిసిన పిల్లలనుద్దేశించి దీన్ని రాస్తున్నాను. కశ్మీర్లో ముగ్గురు పౌరులను కాల్చి చంపిన సైనికులపై ఎఫ్ఐఆర్లు దాఖలు కావడంపై ఆగ్రహావే శాలు పెల్లుబుకుతున్నాయి. ఆ సైనికుల పిల్లలు కూడా కొన్ని చర్యలు తీసుకు న్నారు. ఇందుకు సంబంధించి వెలువడిన కథనం వివరాలివి: సైనికులపై ఎఫ్ఐ ఆర్ దాఖలైన సమయంలో రాళ్లు విసిరిన ఆందోళనకారులపై కేసులు ఉపసంహ రించుకోవడంపై జమ్మూ–కశ్మీర్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సైనికుల పిల్లలు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఆందోళన కారులవల్ల సైనికులు కోల్పోతున్న మానవ హక్కుల్ని కాపాడాలని కోరారు. ఇద్దరు లెఫ్టినెంట్ కల్నల్ హోదా అధికారుల పిల్లలు ప్రీతి, కాజల్, ప్రభవ్, రిటైర్డ్ నాయబ్ సుబేదార్ హక్కుల సంఘం చైర్మన్ హెచ్ఎల్ దత్తుకు ఈ ఫిర్యాదు ఇచ్చారు. కల్లోలిత ప్రాంతాల్లో స్థానికుల హక్కుల కోసం ‘అలుపెరుగక శ్రమిస్తున్నందుకు’ సంఘాన్ని, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ను అందులో ప్రశంసించారు. కానీ రాళ్లు విసిరే గుంపు వల్ల హక్కులు కోల్పోతున్న సైన్యం దీన స్థితి గురించి కళ్లు మూసుకుం టున్నాయని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి అక్కడ చిన్నపాటి యుద్ధం జరుగుతున్నదని, ప్రభుత్వ యంత్రాంగానికి సాయపడేందుకు సైన్యాన్ని రప్పించి వారి కోసం సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని ఆ ఫిర్యాదులో వారు వివరించారు. వీటిని ఇంతకుమించి వివరించనవసరం లేదు. ఈ సందర్భంగా మరికొన్ని సంగతులు తెలుసుకోవాలని కోరుతున్నాను. గత నెలలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్న వివరాలు చూద్దాం. ఏ) ఏఎఫ్ఎస్పీఏ కింద సాయుధ దళాలను ప్రాసి క్యూట్ చేయాలంటూ కేంద్రానికి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? బి) ఎన్నిటికి అను మతి మంజూరు చేశారు, ఎన్నిటిని తిరస్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? సి) ప్రతి ఒక్క ఫిర్యాదు విషయంలోనూ విడివిడిగా– ఫిర్యాదు వచ్చిన సంవ త్సరం, ఆరోపించిన నేరాలు, వాటిపై జరిగిన దర్యాప్తు ఫలితాలు, అనుమతి మంజూరుపై ప్రస్తుత స్థితి. డి) ప్రాసిక్యూషన్కు నిరాకరించిన లేదా పెండింగ్లో ఉంచిన పక్షంలో అందుకు గల కారణాలు. ఈ ప్రశ్నకు రక్షణ శాఖ సహాయమంత్రి ఇచ్చిన జవాబు ఇలా ఉంది: ఏ) సైనికులపై మొత్తం 50 కేసుల విషయంలో ఏఎఫ్ ఎస్పీఏకింద ప్రాసిక్యూషన్కు అనుమతి మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయి. బి,సి) సంవత్సరాలవారీగా కేసుల సంఖ్య, వాటిలో పేర్కొన్న ఆరోపణలు, ఆ కేసుల ప్రస్తుత స్థితిగతులు–అవి పెండింగ్లో ఉన్నాయా, అనుమతి మంజూరైందా, తిరస్కరించారా అన్న వివరాలు ఈ జవాబుతో జత చేశాం. డి) ప్రాసిక్యూషన్కు అనుమతి నిరాకరించడం లేదా పెండింగ్లో ఉంచడానికి వాటిల్లో తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోవడమే కారణం. జవాన్లపై వచ్చిన కేసుల వివరాలివి: 2001–కాల్చి చంపిన కేసులో ఒక ఎఫ్ఐఆర్(ప్రాసిక్యూషన్కు అనుమతి నిరాకరణ). 2005– కాల్చిచంపిన ఘటనల్లో 2 ఎఫ్ఐఆర్లు(అనుమతి నిరాకరణ). 2006–మొత్తం 17 ఎఫ్ఐఆర్లు. ఒక అత్యాచారం, మహిళలతో అసభ్య ప్రవర్తన కేసు, ఆరుగురి అపహరణ, హత్య ఘటన, మిగిలినవన్నీ కాల్చిచంపిన కేసులు(ఒక అపహరణ కేసు మినహా మిగిలిన వాటికి అనుమతి నిరాకరణ. ఆ ఒక్క కేసు పెండింగ్లో ఉంది). 2007–మొత్తం 13 ఎఫ్ఐఆర్లు. ఒక అత్యాచారం, చిత్రహింసలతో ఒకరి హత్య, మిగిలినవన్నీ కాల్చి చంపిన ఘటనలు(అన్నిటికీ అనుమతి నిరాకరణ). 2008– 3 ఎఫ్ఐఆర్లు. ఒక అత్యాచారం, దొంగతనం, హత్య కేసులు(అన్నిటికీ అనుమతి నిరాకరణ). 2009– 2 ఎఫ్ఐఆర్లు. ఒక హత్య కేసు, ఒక అపహరణ కేసు(రెండింటికీ అనుమతి నిరాకరణ). 2010– 4 ఎఫ్ఐఆర్లు. అన్నీ హత్య కేసులు(అన్నిటికీ అనుమతి నిరా కరణ). 2011– 2 ఎఫ్ఐఆర్లు. ఒకటి హత్య కేసు(అనుమతి నిరాకరణ), రెండోది అపహరణ కేసు(పెండింగ్). 2013– 3 ఎఫ్ఐఆర్లు. అన్నీ హత్య కేసులు(అన్నిటికీ అనుమతి నిరాకరణ). 2014– 2 ఎఫ్ఐఆర్లు. ఈ రెండూ కాల్చిచంపిన కేసులు (ఒక కేసులో అనుమతి నిరాకరణ, మరొకటి పెండింగ్). 2016– కాల్చి చంపిన కేసులో ఒక ఎఫ్ఐఆర్ (అనుమతి నిరాకరణ). ఏతావాతా కశ్మీర్లో జరిగిన నేరాలకు విచారణను ఎదుర్కొన్న సైనికుల సంఖ్య–సున్నా. జవాన్లపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం వల్ల వారి పిల్లల మనో భావాలు దెబ్బతిని ఉండొచ్చు. కేవలం వాటివల్ల అయ్యేదేమీ లేదని, కశ్మీర్ పౌరు లకు న్యాయం లభించడంలేదని పై వివరాలు గమనిస్తే అర్థమవుతుంది. ఇందుకు మనమంతా బాధపడాలి. తన సైనిక న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం చేస్తు న్నట్టు సైన్యం వాదించవచ్చు. కానీ వాటిల్లో బాధితులకు, వారి కుటుంబాలకు ప్రవేశం ఉండదు. ఈ మార్గంలో జవాన్లు ఎలా నిర్దోషులవుతున్నారో తెలుసుకోవా లన్న ఆసక్తి ఉంటే పత్రిబల్, మాఛిల్ కేసుల్లో ఏమైందో తెలుసుకోండి. మనమంతా బాధపడవలసిన విషయం మరొకటుంది. మన సైన్యం ఇతర భారతీయుల నుంచి తనకు రక్షణ కల్పించమని పిల్లలను ఉపయోగించుకుని డిమాండ్ చేస్తోంది. ఈ దేశ పౌరులు ఈ దేశ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే, ఇక్కడి పోలీసులే కేసులు నమోదు చేసి దర్యాప్తుచేస్తే, ఈ దేశ న్యాయస్థానాల్లో, ఇక్కడి న్యాయమూర్తులే విచారణ జరుపుతుంటే మన సైన్యం భయసందేహాలు వ్యక్తం చేస్తోంది. నిజానికిది బాధపడాల్సిన విషయం కాదు... కలవరపడాల్సిన విషయం. ఎలాంటి నేరారోపణలొచ్చినా, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మన సైన్యం విచారణ నుంచి తప్పించుకుంటోంది. జవాన్లు అత్యాచారం చేసినా, హత్యలు చేసినా, కిడ్నాప్లకు పాల్పడినా, పౌరుల్ని చిత్రహింసలకు గురిచేసినా, వాటిపై ఫిర్యాదులొచ్చినా ప్రభుత్వాలు ‘నిరాకరణ’ లేదా ‘పెండింగ్’లో ఉంచుతాయి తప్ప ‘అనుమతి’ మంజూరు చేయవు. ఆ పిల్లలు, వారితోపాటు మనమంతా అసలు వేలాదిమంది కశ్మీర్ పౌరులు రాళ్లెందుకు విసురుతున్నారో అప్పుడప్పుడైనా ఆలోచించకతప్పదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘aakar.patel@icloud.com -
అభాగ్యులకు అద్భుతమైన వరం ‘మోదీ కేర్’
అవలోకనం కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం(ఎన్హెచ్పీఎస్) ప్రశంసనీయమైనది. అద్భుతమైనది. దీని అమలుకు ఎన్నో అవాంతరాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల లేమిని బీమా ఆధారిత పథకం పరిష్కరించలేదని అంటున్నారు. ఇది నిజమే అయినా ఈ పథకం అమలు మొదలైతే అత్యంత బలహీనుల, అభాగ్యుల ఆరోగ్య సమస్యలను ఇది వెలుగులోకి తెస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అంశాన్ని జాతీయ స్థాయి చర్చగా మారుస్తుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఆశ్చర్యకరమైన, ఊహకం దని కోణాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది రక్షణ వ్యయం అనుకున్నం తగా లేకపోవడం. ఇది రక్షణ నిపుణులను అసంతృప్తికి గురిచేసింది. మన దేశం ఏటా సైన్యంపై రూ. 4 లక్షల కోట్లు వ్యయం చేస్తుంది. జనాభాలో 50 కోట్ల మందికి ప్రయోజనం కలిగించదల్చుకున్న ఆరోగ్య బీమాకు ఖర్చయ్యేది రూ. 10,000 కోట్లు మాత్రమే. పింఛన్ కింద సైన్యానికిచ్చేది దీనికన్నా పది రెట్లు ఎక్కువ. ఆ వ్యయం ఇంచుమించు లక్ష కోట్లు. ఒకే ర్యాంక్–ఒకే పింఛన్ అనేది పోస్టుమాన్, స్వీపర్ లేదా టీచర్ వంటి మరే ఇతర ప్రభుత్వోద్యోగి పొందని సౌకర్యం. రిటైరైన సైనికులు మాత్రమే ఈ పేద దేశంలో అలాంటి ప్రయోజనాలు సాధించుకోగలిగారు. రక్షణకు చేసే ఈ రూ. 4 లక్షల కోట్ల వ్యయంలో సీఆర్పీఎఫ్, ఇతర దళాలకు మన దేశం ఖర్చుచేసే రూ. 30,000 కోట్లు చేరదు. ఈ దళాలు కశ్మీర్లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ శాశ్వత ప్రాతిపదికన రక్షణ బాధ్యతలు నిర్వ ర్తిస్తుంటాయి. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) కింద ఇవి కూడా ‘సాయుధ బలగాల’ నిర్వచనం కిందికొస్తాయి. ఆ చట్టం కింద రక్షణ పొందుతాయి. నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని తగ్గించలేదు. ఆ వ్యయాన్ని 2014 నుంచీ ఏటా దాదాపు 6 శాతం మాత్రమే పెంచుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం రేటుతో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ. అంటే కాస్త హెచ్చు తగ్గులతో వాస్తవ వ్యయం ఎప్పుడూ ఒకేలా ఉంటోందన్న మాట. ఒకపక్క చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న ఈ దశలో మన దేశం ఆ సవాలును ఎదుర్కొనడానికి సిద్ధపడటం లేదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మాటలు తీవ్రంగా ఉన్నా చేతల్లో సాదాసీదాగా ఉండే మోదీ ఈ వైఖరిని నావరకైతే తెలివైనదిగానే భావిస్తాను. మనం నిరాయుధ దేశంగానో, ఒక చెంప కొడితే మరో చెంప చూపే విధంగా ఉండాలనో నేను అనడం లేదు. దేశాలు సైన్యాన్ని నిర్వహించుకోవడంపై నాకేం అభ్యంతరం లేదు. కానీ మన భద్రతకు సంబంధించి సరైన దృష్టికోణం ఉండాలి. అందుకు తగినట్టుగా ప్రాముఖ్యతనీయాలి. సగటు భారతీయ పౌరుడు చైనా దురాక్రమణ బెడద కంటే వ్యాధుల వల్ల లేదా పేదరికం వల్ల ఎక్కువ ప్రభావితమవుతాడు. అలా చూస్తే మనం రక్షణకు చెల్లించే మూల్యం రూ. 4 లక్షల కోట్లు, రక్షణ దళాల పింఛన్ కోసం చేసే లక్ష కోట్ల వ్యయం మరీ ఎక్కువనిపిస్తుంది. ఇతర నిపుణులు ఏమైనా అనుకోవచ్చుగానీ ఇలా పరిమితి పెట్టుకోవడం లేదా చడీ చప్పుడూ లేకుండా తగ్గించడం ద్వారా మోదీ చాలా మంచి పని చేశారనిపిస్తుంది. ఇక మోదీ కేర్గా అభివర్ణిస్తున్న ఆరోగ్యబీమా గురించి మాట్లాడుకుందాం. ఇది పది కోట్లమందికి బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఒక్కో కుటుంబంలో అయిదు గురు ఉంటారనుకుంటే దీనివల్ల 10 కోట్లమంది ప్రజానీకం లాభపడతారని భావించవచ్చు. ఈ కుటుంబాలన్నీ ఏడాదికి గరిష్టంగా రూ. 5 లక్షల చొప్పున లబ్ధి పొందుతాయి. ఈ పథకం గురించి నిపుణులకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అందులో మొదటిది– ఆ పథకానికి జైట్లీ తగినంత కేటాయింపు చేయలేదన్నదే. అందుకు కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే ఆయన కేటాయించారు. వాస్తవానికి అంతకన్నా చాలా ఎక్కువ అవుతుంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఆరోగ్యబీమా కల్పించడమంటే కుటుంబంలో ఒక్కొక్కరికి రూ. 1,100– రూ. 1,400 మధ్య చికిత్స కోసం ఖర్చు చేయదల్చుకున్నట్టు. అంటే ఆ పథకానికి ఏటా దాదాపు రూ. 11,000– రూ. 14,000 కోట్ల మధ్య ఖర్చవుతుంది. రెండోది– ఇప్పుడు జైట్లీ చేసింది కేవలం ప్రకటన మాత్రమే. ఆ పథకం గురించి, దాని అమలు గురించి విధివిధానాలు రూపొందించడానికి మరో ఆర్నెల్లు పడుతుంది. ఆ తర్వాతే పథకాన్ని అమలు చేస్తారు. ఇవన్నీ ముందు ఖరారు చేసుకుని ప్రకటించి ఉంటే బాగుండేది. మూడోది–పథకానికయ్యే వ్యయంలో సగం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇంకా రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంది. నాలుగు–ఈ తరహా పథకాలు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్నాయి. అవి ప్రభావవంతంగా లేవు. అయిదు–ప్రామాణికమైన ఆస్పత్రి సదుపాయం లేకపోవడమన్నది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దేశంలో చాలాచోట్ల మంచి వైద్య సౌకర్యాలు లేవు. మౌలిక సదుపాయాల లేమిని బీమా ఆధారిత పథకం పరిష్కరించలేదు. ఆరు– వైద్య సదుపాయాల విషయంలో మన ప్రభుత్వాసుపత్రులు ప్రపంచంలోనే అత్యంత నాసిరకమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో పని ఎగ్గొట్టే తత్వం, జవాబుదారీతనం లేమి అధికం. సారాంశంలో ఇది పాలనకు సంబంధించిన సమస్య కూడా. దీన్ని ఉపే క్షించి బీమా పథకాలను రూపొందించడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుంది. ఈ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోదగ్గవే. పరిష్కరించవలసినవే. అయినా ఈ ఆరోగ్య పథకం అద్భుతమైనదే. ఇప్పటికిది ప్రకటన మాత్రమే అయినా ఏదో దశలో ప్రభుత్వం వ్యయం చేయకతప్పనిది. ఈ పథకం దేశంలో అత్యంత బలహీనుల, అభాగ్యుల ఆరోగ్య సమస్యలను వెలుగులోకి తెస్తుంది. ఆరోగ్య పరిరక్షణను జాతీయ స్థాయి చర్చలోకి తెస్తుంది. రక్షణ, ఒకే ర్యాంక్–ఒకే పింఛన్ వంటి అంశాల్లా ఇన్నాళ్లూ ఇది చర్చకు రాలేదు. ప్రజల నుంచి ఒత్తిడి ఉన్నంతకాలం ఈ పథకానికి అవసరమైన నిధులు లభిస్తాయి. ఆ నిధులు వచ్చాక పేద రోగులు సౌకర్యాల కోసం డిమాండు చేయడం ప్రారంభిస్తారు. రూ. 5 లక్షల పరిమితి సరిపోతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈ కారణాలన్ని టివల్లా ఈ నిర్ణయం అద్భుతమైనదని నేననుకుంటున్నాను. మోదీ తన రాజకీయ జీవితంలో అవలంబిస్తూ వచ్చిన మెజారిటీ మతతత్వ విధానాలపై నాకు ప్రేమ గానీ, సానుభూతిగానీ లేవు. ఆయన ఏలుబడిలో జరిగినవి అత్యంత భయానకమై నవి, భీతిగొలిపేవి. అయితే మంచి చేసినప్పుడు ప్రశంసించడానికి అవి అడ్డు రాకూడదు. ఈ ఆరోగ్యపథకం జాతీయ స్థాయి సంభాషణను మార్చేసింది. అందుకే దీనికి మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
నకిలీ వార్తల్ని మించిన పెను సమస్య!
అవలోకనం మన దేశంలో డేటా వినియోగం గత కొన్ని సంవత్సరాలుగా అయిదు రెట్లు మించి పెరిగింది. అనేకులు స్మార్ట్ఫోన్లవైపు మొగ్గడం, వాట్సాప్లో వచ్చే అంశాలను అందరికీ పంపే ధోరణి పెరగడం ఇందుకు రుజువు. ఈ కారణంగా మాధ్యమం విస్తృతి ఎంతగానో పెరిగింది. ఇలాంటపుడు సహజంగానే నకిలీవార్తల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు దీన్ని మించిన మరో సమస్య ఉంది. నిజమైన వార్తలపై ఆసక్తి కొరవడటమన్నదే ఆ పెను సమస్య. కోల్కతాలో జరిగే సాహితీ సంరంభానికి వచ్చి ఈ వ్యాసం రాస్తున్నాను. గత పదేళ్లుగా ఇలాంటి పండుగలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇతర దేశాలకంటే మన దేశంలోనే ఇవి ఎక్కువ. నాకిది అసాధారణమే అనిపిస్తుంది. ఏదైనా రాయడం, సాహిత్యాన్ని చదవడం అనే సంస్కృతి మనకుంది. అలాగని మన సమాజంపై రచయిత ప్రభావం పెద్దగా ఉండదు. చెక్ రిపబ్లిక్ తొలి అధ్యక్షుడిగా ఎన్నికైన వాక్లవ్ హావెల్ లాంటివారు ఇక్కడ ఉద్భవించే అవకాశం లేదు. ఉపా ధ్యాయుల్లాగే రచయితలపై కూడా అందరికీ గౌరవం ఉంటుంది. కానీ వారిని అనుసరించే తత్వం ఎక్కడా ఉండదు. మరి ఇన్ని సాహితీ సంరంభాలెందుకు? ఒక్కో సంరంభానికి ఇన్ని వేలమంది, వారిలో అత్యధికంగా యువతే ఎందు కుంటున్నారు? నా పరిశీలనలో తేలిందేమంటే, ఇతరచోట్ల... ప్రత్యేకించి విశాల ప్రజానీకంలో చర్చించడానికి సాధ్యపడని అంశాలకు ఇలాంటి సమూహాల్లో చోటుండటమే అందుకు కారణం. కనుకనే చాలా సాహితీ ఉత్సవాల్లో పుస్తకాల గురించి, రచయితల గురించి కాక సమకాలీన ఘటనలపైనా, మారుతున్న సమాజ స్వభావంపైనా చర్చించడమే ఎక్కువ కనబడుతుంది. ఈ వారం నేను నకిలీ వార్తల (ఫేక్ న్యూస్)పై జరిగిన బృంద చర్చలో పాల్గొన్నాను. ఈ నకిలీవార్తలను మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి– అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాన్ని అర్ధం చేసుకున్న తీరులో. ఆయనకు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్లు ఆ కోవలో కనిపిస్తాయి. మిగిలిన ప్రపంచం, ప్రత్యేకించి పాత్రికేయ లోకం ఈ పత్రికలనూ, చానెళ్లనూ ప్రశంసించ దగ్గవిగా, సాధికారమైనవిగా భావిస్తాయి. తనను విమర్శిస్తాయి గనుక ట్రంప్ దృష్టిలో ఇవి నకిలీవార్తలను తయారుచేసేవే. ఈ ఫేక్న్యూస్ను మనం మరో రకంగా చెప్పొచ్చు. తప్పుడు వార్తగా, వండివార్చిన వార్తగా తెలిసినా దాన్ని దురు ద్దేశంతో ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో పెట్టే వార్తల్ని నకిలీ వార్తలని అనొచ్చు. ప్రపంచంలో ఒక మూల జరిగిన హింసాత్మక ఘటన తాలూకు ఫొటోను మరొకచోట జరిగినట్టుగా చూపే ప్రయత్నం చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే ఒక పరి స్థితిని లేదా ఒకరి వ్యక్తి త్వాన్ని వివరించే పేరిట అవాస్తవాలను ‘నిజాలు’గా ప్రచారం చేయడం కూడా ఈ కోవకిందికే వస్తుంది. వాట్సాప్ ద్వారా ఇలాంటి సరుకు అందరికీ వస్తూనే ఉంటుంది కనుక ఇంతకుమించి దీని లోతుల్లోకి వెళ్లను. ఫేక్న్యూస్ చర్చలో పాల్గొన్న బృందంలో నాతోపాటు అహ్మదాబాద్కు చెందిన ప్రతీక్ సిన్హా కూడా ఉన్నారు. ఆయన ఆల్ట్న్యూస్ డాట్ ఇన్(altnews.in) అనే వెబ్సైట్ను నడుపుతున్నారు. జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నవాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవి తప్పుడు వార్తలో, నిజమైనవో తేల్చడం ఆయన పని. దేశ పౌరులను తప్పుడు వార్తలతో, నిర్ధారణ కాని వార్తలతో చీల్చడానికి ప్రయత్నించేవారిని బట్టబయలు చేయడంలో ఆ వెబ్సైట్ ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోంది. గత మే నెలలో పిల్లల కిడ్నాపర్ల గురించి ప్రచారంలోకొచ్చిన ఒక తప్పుడు వార్త పర్యవసానంగా జార్ఖండ్లో ఏడుగురిని ప్రజలు కొట్టిచంపారు. ప్రతీక్సిన్హా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మన దేశంలో డేటా విని యోగం గత కొన్ని సంవత్సరాల్లో అయిదు రెట్లు మించి పెరిగింది. ప్రజల్లో అనేకులు స్మార్ట్ఫోన్ల వైపు మొగ్గడం, వాట్సాప్లో వచ్చే అంశాలను అందరికీ పంపే ధోరణి పెరగడం ఇందుకు రుజువు. మాధ్యమం విస్తృతి పెరిగి అది ఎన్నో రకాలుగా రూపాంతరం చెందడం వల్ల చిన్న స్థాయి సంస్థలు, వ్యక్తులు కూడా ప్రచురణకర్తలుగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో దేన్నయినా ధ్రువీకరించగలిగే వర్గాల సంఖ్య కూడా పెరగాలి. అయితే మనకున్న పెద్ద సమస్య తప్పుడు వార్తలు కాదు... నిజమైన వార్తలపై ఆసక్తి కొరవడటమేనని నాకనిపిస్తుంది. ఉదాహరణకు మన దేశం ఆరోగ్య రంగానికి కేటాయించే మొత్తానికి పదిరెట్లు ఎక్కువగా రక్షణపై వ్యయం చేస్తుంది (ఆరోగ్యానికి చేసే ఖర్చు రూ. 40,000 కోట్లయితే... రక్షణ వ్యయం రూ. 4లక్షల కోట్లు). ఇది ఇటీవలి సంగతి కాదు. మనమెప్పుడూ ఆసు పత్రులు, వైద్యులు, మందుల కంటే శతఘ్నులు, విమానాలు, నౌకలు కొనడానికి ఎక్కువ ఖర్చుపెడుతుంటాం. అన్ని ప్రభుత్వాలూ ఇలాగే చేస్తాయి. ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించదు. ఈశాన్య భారతంలో ఆంతరంగిక భద్రత కోసం సైన్యాన్ని ఉపయోగించడం ప్రారంభించి ఈ ఏడాదితో అరవైయ్యేళ్లవుతుంది. ఇంత సుదీర్ఘకాలం దేశ పౌరులు సైనిక పాలనలో ఎందుకుండాలని మనం ప్రశ్నించలేమా? పదాల గారడీని పక్కన బెట్టి మాట్లాడుకోవాలంటే సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం కింద బల వంతంగా ఒక జనాభా మొత్తాన్ని ఉంచడం సైనిక పాలన అనే అనాలి. కానీ దీనిపై మన రాజకీయ పార్టీలకు లేదా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన పౌరులకు ఆసక్తే ఉండదు. నేను చెప్పబోయే మూడో ఉదాహరణ ఇటీవలికాలానిదే. మన పాలక పార్టీ జాతీయవాదానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పుకుంటుంది. కానీ ఆచరణలో రాజకీయ వివక్షను పాటిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్యను ఒకసారి చూద్దాం: గుజరాత్–సున్నా, ఉత్తరప్రదేశ్–సున్నా, మహారాష్ట్ర–సున్నా, మధ్యప్రదేశ్–సున్నా, చత్తీస్గఢ్–సున్నా, జార్ఖండ్–సున్నా. ఇతరచోట్ల నామమాత్రం. మత ప్రాతిపదికన భారతీయుల్ని విడగొట్టడం మన కళ్లముందే జరుగుతోంది. మరి ఎందుకని అందరూ దాన్ని ఉపేక్షిస్తారు? ఎందుకని చర్చించరు? ఎందుకంటే అసమ్మతి స్వరాలు వినబడవు గనుక. అవి కేవలం సాహితీ ఉత్సవాల వంటి చోటే లేవనెత్తుతారు గనుక. ట్రంప్కూ, పాశ్చాత్య ప్రపం చానికీ నకిలీ వార్తల బెడద అంత ముఖ్యమూ కాదు. వాటికి పర్యవసానాలూ ఉండవు. కానీ భారత్లో అలాంటి వార్తలు ప్రాణాలు తీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే నకిలీ వార్తల బెడద ఇక్కడ ఉన్నా లేకున్నా మన సమస్యలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని మాత్రం మనం అంగీకరించితీరాలి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
సంస్కరణల చుట్టూ మోదీ చక్కర్లు
♦ అవలోకనం చెత్త పారేయడం అనేది వికారమైనది, చికాకు పరిచేది. అయితే ప్రజారోగ్య సమస్య వలే ఇది జాతీయ సమస్యేమీ కాదు. ప్రజారోగ్య లోపంతో మన పిల్లల్లో 38 శాతంమందికి రెండేళ్ల వయసులోనే ఎదుగుదల ఆగిపోతోంది. కానీ మోదీ దృష్టి, ఆయనిచ్చిన సందేశం పూర్తిగా చెత్త వేయడం వల్ల కలిగే అనర్ధాలపైనే కేంద్రీకరించి ఉంది. దేశ పౌరుల వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకు ప్రవర్తనాపరమైన మార్పు...అంతర్గతమైన పరివర్తన అవసరమన్నది ఆయన భావన. ‘మీరు విప్లవ నాయకుడు. భారతదేశంలో విప్లవాత్మక మార్పు తెస్తున్నారు. ఈ మహత్తరమైన దేశాన్ని భవిష్యత్కాలానికి తీసుకెళ్తున్నారు’. ఈ వారం మన దేశా నికొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మన ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడిన మాటలివి. ఆయన మాటల్లోని అంతరార్ధం ఏమై ఉంటుంది? నా దగ్గరున్న నిఘంటువు ‘ఒక సంపూర్ణమైన, ఆకస్మికమైన పరివర్తన ఇమిడి ఉండేదానినే’ విప్లవంగా చెబుతోంది. సుస్థాపితమైన వ్యవస్థకు, ప్రత్యేకించి ఒక రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటువంటి చర్యను ఈ విప్లవ నాయకులు కోరుకుంటారు. భారత రాజ్యాన్ని నెతన్యాహు ‘మహత్తరమైనద’ంటున్నారు గనుక (ఆయన ఎందుకలా అనుకుంటున్నారన్నది నాకు ఆసక్తికరం) మోదీ ఆ వ్యవస్థను «కూలదోస్తున్నారని నెతన్యాహు అనుకోవడం లేదని మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఆయన చెప్పదల్చుకున్నదేమిటి? ఆ సంగతి నిజంగా తెలియదు, ఊహించే ప్రయత్నం కూడా చేయను. ప్రశంసలకు సులభంగా పడిపోయే ఒక కొనుగోలు దారుకు ఆయుధాలు అమ్మేందుకు నెతన్యాహు వచ్చారనే వాస్తవాన్ని కాసేపు పక్కన పెడదాం. ఒక రకంగా వ్యవస్థలో విప్లవాత్మక మార్పును మోదీ తీసుకు రాదల్చుకున్నారన్నది వాస్తవం. ఏమిటా మార్పు? నేను దీన్ని సంస్కరణ అంటాను... అలాగని దాన్ని వాడుకలో ఉన్న అర్ధంతో నేను ఉపయోగించడం లేదు. ఉదాహరణకు మోదీ పథకాల్లో ఒకటైన స్వచ్ఛభారత్ అభియాన్ తీసు కుందాం. అది ఎంత ఆర్భాటంగా ప్రారంభమైందో అందరికీ గుర్తుండే ఉంటుంది. మోదీ స్వయంగా చీపురు పట్టుకుని రోడ్డును పరిశుభ్రపరిచారు. ఇతరుల్ని కూడా అలా చేయమని ప్రోత్సహించారు. వాటిపై ట్వీట్లు చేశారు. స్వచ్ఛ భారత్ పర మార్ధమేమిటో, అది ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నదో ఆయన వెబ్సైట్ వివరిం చింది. ‘2019లో జరగబోయే మహాత్మా గాంధీ 150వ జయంతికి మనం అర్పించ గల అత్యుత్తమ నివాళి స్వచ్ఛ భారత్... మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సాకారం చేయడానికి ముందుకు రావాలని ప్రజ లకు ప్రధాని ఉద్బోధించారు. మందిర్ మార్గ్ పోలీస్స్టేషన్ వద్ద నరేంద్ర మోదీయే స్వయంగా ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. చెత్తను ఊడ్చడానికి చీపురు పట్టుకుని ఈ దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. చెత్తాచెదారాన్ని వేయొద్దు, ఎవరినీ వేయనీయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు. ‘చెత్తవేయను, ఎవరినీ వేయనీయను’ అనే మంత్రోపదేశం చేశారు’ అని ఆ వెబ్సైట్ చెబుతోంది. పీఠికలో ఆయన పరిశుభ్రత, స్వచ్ఛత, చెత్త, చెత్త పారేయడం అనే పదాలను 21 సార్లు ఉపయోగించారు. మరుగుదొడ్డి, ప్రజారోగ్య పరిరక్షణ పదాలు మాత్రం ‘భారతీయ కుటుంబాల్లో దాదాపు సగభాగం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య లకు కారణం వారి ఇళ్లలో మరుగుదొడ్లు లేకపోవడమే...’ అని చెప్పిన సందర్భంలో ఒక్కసారి వచ్చాయి. తొలుత నిర్ణయించుకున్న కార్యక్రమాలకు కొన సాగింపుగా దీన్ని చేర్చాలని తర్వాత అనుకోవడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చు. చెత్త పారేయడం అనేది వికారమైనది, చికాకు పరిచేది. ప్రజారోగ్య పరిరక్షణ వలే ఇది జాతీయ సమస్యేమీ కాదు. ప్రజారోగ్య లోపంవల్ల మన పిల్లల్లో 38 శాతం మందికి రెండేళ్ల వయసులోనే ఎదుగుదల ఆగిపోతోంది. కానీ మోదీ దృష్టి, ఆయని చ్చిన సందేశం పూర్తిగా చెత్తపైనే కేంద్రీకరించి ఉంది. దేశ పౌరుల వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకు ప్రవర్తనాపరమైన మార్పు.. అంతర్గతమైన పరివర్తన అవసరమన్నది ఆయన భావన. ఇది ఆధ్యాత్మికవేత్తలు, మత నాయకులు చెప్పే సంస్కారం లాంటిది. ఇది అందరికీ తెలిసిన రాజకీయా లకు సంబంధించింది కాదు. పెద్ద నోట్ల రద్దు వంటి విపరీత నిర్ణయాలకు స్ఫూర్తి ఇలాంటి సంఘ సంస్కరణ కోణం నుంచే ఎవరైనా చూడాల్సి ఉంటుంది. భారతీ యులను నల్లడబ్బుకు దూరం చేసితీరాలి. ఇది చేయాలంటే బలవంతంగానైనా వారి ప్రవర్తనను మార్చడం, వారి దగ్గరున్న డబ్బు గుంజుకోవడమే మార్గం. ఇది అంతిమంగా ప్రభావశీలమైనదైనా, కాకపోయినా... ఇది లక్షలాదిమందిపై వ్యతి రేక ప్రభావం చూపినా, చూపకపోయినా... ఈ కఠినమైన విధానంవల్ల జనం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడినా–వాటన్నిటినీ ఆ తర్వాత నిపుణులు చర్చించుకుంటారు. ఆయన చేసి తీరాలనుకున్నారు. తాను సరైనదని అనుకున్నదా నిని ప్రజలతో బలవంతంగా చేయించారు. జనాదరణ ఉన్న మోదీ లాంటి నేత అమలుచేసిన సంస్కరణ ఇది. బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్ ఈమధ్య ‘ఒక ప్రధాని సంఘ సంస్కర్తగా మారినప్పుడు’ అనే శీర్షికతో ఒక పత్రికలో వ్యాసం రాస్తూ ఇలాంటి కోణాలనే స్పృశించారు. ‘మన సమాజం ఎంత గొప్ప పరివర్తనకు లోనవుతున్నదో చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. యోగాను ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వీఐపీ సంస్కృతిని అంతం చేయడం కోసం కార్లపై ఎర్రరంగు లైట్లను నిషేధిం చడం, దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు తీసుకురావడం, వారి అవసరాల గురించి ప్రజల్లో అవగాహన ఏర్పర్చడం, గెజిటెడ్ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందడానికి వారి సంతకాల కోసం తిరిగే స్థితి లేకుండా చేయడం, కంపోస్టింగ్ ద్వారా సొంతంగా ఎరువు తయారుచేసుకోమని ప్రజలకు ఉద్బోధించడం– ఇలాంటి పథకాలన్నీ చిన్నవిగానే కనబడొచ్చు. కానీ అవి కలగజేసే ప్రభావం తీవ్రమైనది’ అని భండార్కర్ రాశారు. ఇవి దేశ ప్రధాని స్థాయిలోనివారు పట్టించు కోవాల్సినవా అన్న కోణంలో నేను దీన్ని చూడటం లేదు. మోదీ ఇలాంటి సామా జిక మార్పుపై ఆరాటపడుతున్నారన్నదే నా వాదన. ఏదైనా అంశం విషయంలో పొరబడి ఉండొచ్చు లేదా తొందరపాటుతో చేసి ఉండొచ్చని కొన్నిసార్లు ఆయనకు అనిపించవచ్చు. ఇవ్వాళ్టి స్వచ్ఛభారత్ వెబ్సైట్లలో మరుగుదొడ్లు, ప్రజారోగ్య పరి రక్షణ ప్రాధాన్యతా స్థానంలో ఉన్నాయి. చెత్త పారేయడం గురించి చెప్పడం చాలా స్వల్పంగా ఉంటుంది. నెతన్యాహు ప్రశంసకు మోదీ జవాబిస్తూ ‘ఫలితాల సాధన విషయంలో చాలా అసహనంతో ఉంటానని నాకు పేరొచ్చింది. మీరు కూడా అంతే’ అన్నారు. మనల్ని సంస్కరించాలన్న ఆయన ప్రయత్నాలు ఇకపై కూడా కొనసాగుతాయని మనం భావించాలి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
భీకర రికార్డులు – ఘోర పరాజయాలు
స్వదేశంలో ప్రపంచ రికార్డులనే బద్దలు చేసి పడేసే మన బ్యాట్స్మెన్ విదేశాల్లో బౌన్సీ వికెట్ల ముందు సాగిలపడిపోతుంటారు. కారణం మనం బ్యాటింగ్ పిచ్లను రూపొందించుకోవడమే. మేటి బ్యాట్స్మెన్లకు నెలవుగా ఉండే భారత జట్టు మేటి బౌలర్ల విషయంలో వెనుక చూపు చూస్తుండటం తెలిసిందే. రెండో తరగతి పౌరులుగా దిగజార్చివేసినప్పటికీ, మన బౌలర్లు చక్కటి ప్రదర్శన చేసినప్పుడే మనకు విదేశీ విజయాలు లభిస్తుంటాయి. బలహీన బౌలింగ్ పరిస్థితిని మార్చాలంటే మన మౌలిక వ్యవస్థలో మార్పుతోటే ప్రారంభించాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ను నేను అంత ఎక్కువగా చూడలేకపోయాను. అది ఒకందుకు మంచిదే అయింది. నేను క్రికెట్ ప్రేమికుడిలా నటిస్తుం టాను కానీ నా జాతీయవాదమే నన్ను ఆటను చూసేలా చేస్తుంటుంది. భారత్ ఓడిపోతున్నప్పుడు నేను ఆటను చూడలేను. మన జట్టు ఇప్పుడు అంత బలహీనమైన జట్టేమీ కాదు. జట్టు పని తీరుకు ఏమాత్రం తగని విధంగా జాతీయ జట్టుకు మనం పూర్తి మద్దతు ఇచ్చిన రోజులు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు అలాంటి స్థితి లేదు. తొలి టెస్టు మ్యాచ్లో నాలుగో రోజు ఆటలో కొన్ని సందర్భాల్లో మనమే గెలి చినట్లు కనిపించిది. కానీ బౌన్సీ వికెట్ ముందు మన బ్యాట్స్మెన్ తలవంచారు. దక్షిణా్రíఫికాలో బౌన్సీ వికెట్ ఉండటం కొత్తేమీ కాదు. రెండో టెస్టు కూడా ప్రారంభమైనందున కొన్ని అంశాలను పరిశీలిద్దాం. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత్ ఎల్లప్పుడూ బ్యాటింగ్ ప్రాతిపదిక గల జట్టుగానే ఉంటూ వచ్చింది. మన మేటి క్రికెటర్ల పేర్లు చెప్పాల్సి వస్తే, గవాస్కర్, టెండూల్కర్, కోహ్లీ లను ప్రస్తావించాలి. పాకిస్తానీయులు కూడా ఇమ్రాన్, వసీమ్, వకార్ గురించి చెప్పుకుంటారు. కానీ గొప్ప బ్యాట్స్మెన్తో పోలిస్తే గొప్ప బౌలర్లు అరుదుగానే ఉంటారు. ఆయా దేశాల జట్లకు చెందిన 11మంది ఆల్టైమ్ ఆటగాళ్ల జాబితాను రూపొందించడానికి ప్రయత్నించినప్పుడు ఇది స్పష్టమవుతుంది. ఉపఖండానికి పరిమితమైతే.. నేను పాక్ జట్టును ఇలా చూస్తాను: హనీఫ్ ముహమ్మద్, సయీద్ అన్వర్, జహీర్ అబ్బాస్, జావిద్ మియాందాద్, ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, రషీద్ లతిఫ్, ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్. ఇక భారత్ జట్టు కూర్పును నేను ఇలా చూస్తాను: గవాస్కర్, సెహ్వాగ్, కోహ్లీ, టెండూల్కర్, ద్రావిడ్, గంగూలీ, ధోనీ, కపిల్ దేవ్, కుంబ్లే, శ్రీనాథ్, జహీర్. ఈ రెండు జట్లలో మరింత సమతుల్యతతో, ఆడేందుకు కష్టమైన జట్టు ఏది? (కనీసం కాగితంమీద అయినా) మనది మాత్రం కాదు. రెండు జట్ల మధ్య తేడా ఏమిటంటే, మన బౌలింగ్ బలహీనమైనది. భారత్లో బ్యాట్స్మెన్ కంటే శ్రమించే బౌలర్లు తక్కువగా ఉంటారు. ఇక్కడ ఆట ఆడే విషయంలో రెండో అంశం కూడా ఉంది. ఎందుకంటే మనది బ్యాటింగ్ ప్రధాన జట్టు. మనం బ్యాట్స్మెన్కి అనుకూలమైన వికెట్లను, పిచ్ని తయారు చేస్తాము. 2009లో క్రిక్ఇన్ఫో వెబ్సైట్ కోసం రాసిన వ్యాసంలో ఎస్. రాజేష్ మన వికెట్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించవంటూ గణాంకాలతో సహా వివరించారు. భారత్లో 40 శాతం టెస్టులు డ్రాగా ముగుస్తాయి. కాగా, దక్షిణాప్రికాలో మాత్రం 7 శాతం టెస్టులు మాత్రమే డ్రాగా ముగుస్తాయి. ఆస్ట్రేలియాలో చూసినా డ్రాలు 11 శాతం మాత్రమే. భారత్లో భారీ స్కోర్లు అసాధారణం కాదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో రెండు పక్షాలూ తమ తొలి ఇన్నింగ్స్లో తలొక 200 పరుగులు చేశాయి. మన గడ్డపై తొలి ఇన్నింగ్స్లో ఇలాంటిది ఎన్నడూ సంభవించదు. మన మైదానాల్లో బౌలర్లు ఇలాంటి ఫలితాన్ని సాధించే అవకాశమే ఉండదు. అందుకే తొలి టెస్టులో మనం ఓడిపోయిన తరహా పిచ్లను స్పోర్టింగ్ వికెట్లు అంటుంటారు. బౌలర్లకు కూడా ఫలితాలు చూపే అవకాశం ఇస్తాయి కాబట్టే వాటిని స్పోర్టింగ్ వికెట్లు అంటుంటారు. ఉదాహరణకు 2000–2010 మధ్య దశాబ్ద కాలంలో టెస్టులలో బౌలర్లకు చక్కగా ఉపయోగపడిన 10 మైదానాలను లెక్కించినట్లయితే, వీటిలో ఒక్కటంటే ఒక్క భారతీయ మైదానం కూడా లేదు. మరోవైపున, తొలి ఇనింగ్స్లో సగటున భారీ స్కోరు సాధించిన 10 మైదానాల్లో భారత్కి చెందినవి మూడు ఉన్నాయి: కోల్కతా, బెంగళూరు, మొహాలి. ఈ పరిస్థితులే భారత జాతీయ జట్టును బౌలింగ్లో బలహీనంగానూ, బ్యాటింగులో బలమైన జట్టుగానూ రూపొందించాయి. కానీ ఆ బ్యాటింగ్ బలం కూడా సొంత మైదానాల్లోనే ఉంటుంది. భారతీయులలో అనేకమంది స్పిన్నర్లను, మందకొడి వికెట్లను చూసేందుకు ఇష్టపడరని చెప్పగలను. కానీ నాతోపాటు చాలామందిని తొలి సెషన్ పూర్తిగా, ఆ తర్వాత కూడా బౌన్సీ వికెట్పై దూసుకొచ్చే బంతులను చూస్తుండటమే బాగా ఉద్వేగపరుస్తుంటుంది. మరొక అంశమేదంటే, నిజమైన ఫాస్ట్ బౌలర్ మంచి బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెడుతుండటం. శ్రీలంక లేదా భారత్లో మ్యాచ్ను చూడటం కంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో ప్రమాదకరంగా ఉండే బౌన్సీ వికెట్ను చూడటం పూర్తి భిన్నంగా ఉంటుంది. బ్యాట్స్మెన్ గాయపడటాన్ని నేను చూడాలనుకోను ఆటలో ఉద్వేగం తీసుకొచ్చేది ఇదే. కానీ భారత్లో ఇలాంటిది అస్సలు కనబడదు. ఒక అంశంలో మనం నిజాయితీగా ఉందాం. భారత్లో టెస్టు క్రికెట్ చూడటం విసుగ్గానూ, చాలావరకు చూడటానికి అననుకూలంగానూ ఉంటుంది. ఈ పరిస్థితిని మార్చాలంటే మన మౌలిక వ్యవస్థలో మార్పుతోటే ప్రారంభించాలి. బీసీసీఐ ప్రపంచంలోనే అతి సంపన్నమైన సంస్థ అయినప్పటికీ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో పోలిస్తే మన స్టేడియంలు పరమ చికాకును కలి గిస్తాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ అయితే ప్రపంచంలో అత్యంత భయంకరమైన స్టేడియం. ఇది పూర్తిగా సిమెంట్ దూలాలతో ఉండటమే కాకుండా ప్రతి చోటా ప్రకటనలే కనిపిస్తుంటాయి. మనకు ఎలాంటి క్రికెట్ కావాలో వికెట్లే నిర్ణయిస్తుంటాయి. మనం మీడియం పేస్ బౌలర్లు లేక స్పిన్నర్లను కోరుకుంటున్నామా లేక ఊపిరిని బిగబట్టేలా చేసే ఫాస్ట్ బౌలర్లను కోరుకుంటున్నామా లేక వాంఖడే, ఈడెన్ గార్డెన్స్లో రికార్డులను భీకరంగా బద్దలు చేస్తూనే, దక్షిణాఫ్రికా బౌలింగ్లో కొన్ని ఓవర్లను కూడా తట్టుకోలేని బ్యాట్స్మెన్ను కోరుకుంటున్నామా? మొదటే చెప్పినట్లుగా, నేను భారత క్రికెట్ జట్టు ప్రేమికుడినే కాని క్రికెట్ ఆట ప్రేమికుడిని కాదు కాబట్టే నేను క్రికెట్ ఆటను చూస్తుంటానని నా అనుమానం. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న రెండో టెస్టును, అలాగే సిరీస్ను కూడా మనం గెలుచుకుంటామని ఆశిస్తాను. కానీ అలా గెలిచినప్పటికీ, అదెలా సాధ్యపడుతుం దంటే, రెండో తరగతి పౌరులుగా దిగజార్చివేసినప్పటికీ, మన బౌలర్లు చక్కగా ఆడినందుకే అయి ఉంటుంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
ఒబామా మాటలు – ముత్యాల మూటలు
అవలోకనం ఆన్లైన్లో కనబడే స్థాయి కశ్మలం, రోత మన నిత్య జీవితాల్లో ఎక్కడా కనబడవన్నది నిజం. రాజకీయాలు, మతం వగైరాలపై ముఖాముఖీ కలుసుకున్నప్పుడు వాదించుకుంటే ఇంత చేటు దూషణలు, అవమానకరంగా మాట్లాడటం ఉండనే ఉండదు. ఇంటర్నెట్ మనల్ని గోప్యంగా ఉంచుతుందన్న భావనే ఇష్టానుసారం ఏమైనా మాట్లాడవచ్చునన్న ఆత్మ విశ్వాసాన్ని మనలో ఏర్పరుస్తుంది. వ్యక్తిగతంగా మనమంతా సమ్యక్ దృష్టితో మెలగుతాం. ఎవరో మనల్ని గమనిస్తున్నారన్న భావన వల్లే ఇలా ఉండగలుగుతాం. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాదిరే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ప్రపంచం గుర్తించి గౌరవించే మేధావి. వీరిద్దరూ విఫల నేతలేనని కొందరనుకుంటారు. అందుకు ఒక కారణం ఉంది. మన్మోహన్ వలే జనాకర్షణ శక్తిగానీ, సొంతబలంగానీ లేకపోవడం... ఒబామాలా జాతిపరంగా మైనారిటీ నేతలన్న భావం వీరిపట్ల ఉండటం ఆ కారణమని నేననుకుంటాను. అయితే ఈ నాయకులిద్దరూ ఇతర నేతల్లా తరచు మాట్లాడకపోవచ్చుగానీ చాలా తెలివైన వారు. వారు మాట్లాడినప్పుడు వినడం అనివార్యంగా మనకు ప్రయోజనకరమవు తుంది. కొన్ని రోజులక్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీకి ఒబామా అద్భుత మైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన సామాజిక మాధ్యమాల గురించి, ఆధునిక ప్రపంచంపై దాని ప్రభావం గురించి ఎంతో చక్కగా మాట్లాడారు. ఉమ్మడి ప్రయోజనాలుండే వారందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికీ, సంబంధబాంధవ్యాలు నెలకొల్పుకోవడానికీ ఈ మాధ్యమాలు నిజంగా శక్తివం తమైన ఉపకరణాలన్న సంగతిని ఆయన అంగీకరించారు. ‘అయితే ఇలాంటి వారంతా ఏ పబ్లోనో, ప్రార్థనాలయం వద్దనో, మరెక్కడైనా కలుసుకోవాలి. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు గల కారణం కూడా చెప్పారు. ‘ఇంటర్నెట్లో ఏర్పడ్డ సంబంధాల్లో అంతా సూక్ష్మంగా, సాధారణంగా కనిపిస్తుంది. కానీ ముఖాముఖీ కలిసినప్పుడు మాత్రమే అవ తలివారెంత సంక్లిష్టమైనవారో అర్ధమవుతుంది’ అని ఆయన వివరించారు. ‘ఇంటర్నెట్తో ఉన్న మరో ప్రమాదమేమంటే తమకు దానిద్వారా పరిచయమయ్యే వారిలో వేరే రకమైన వాస్తవాలు దాగి ఉండొచ్చు. పర్యవసానంగా వారు తమ కుండే దురభిప్రాయాలను బలపర్చుకునే సమాచారంలోనే కూరుకుపోతారు’ అని కూడా ఒబామా అభిప్రాయపడ్డారు. మనం ఇంటర్నెట్ ఉపయోగించే తీరుకు సంబంధించి ఆయనొక ముఖ్యమైన, అవసరమైన విషయాన్ని పట్టుకున్నారని నాకనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఏ సామాజిక మాధ్యమాల్లో లేను. ఎందుకంటే అవి మన ఏకాగ్రతను భంగపరుస్తాయి. నా ఆన్లైన్ వ్యాసాలపై వచ్చే వ్యాఖ్యలను గమనించినప్పుడు నా మనసెంతో వ్యాకులపడుతుంది. ఆ వ్యాఖ్యల్లో కనబడే ఆగ్ర హమూ, దుర్మార్గమూ, మితిమీరిన భాష గమనిస్తే ఎవరినైనా దూరం పెట్టక తప్ప దనిపిస్తుంది. ఆన్లైన్లో కనబడే స్థాయి కశ్మలం, రోత మన నిత్య జీవితాల్లో ఎక్కడా కన బడవన్నది నిజం. రాజకీయాలు, మతం వగైరాలపై ముఖాముఖీ కలుసు కున్నప్పుడు వాదించుకుంటే ఇంత చేటు దూషణలు, అవమానకరంగా మాట్లా డటం ఉండనే ఉండదు. ఇంటర్నెట్ మనల్ని గోప్యంగా ఉంచుతుందన్న భావనే ఇష్టానుసారం ఏమైనా మాట్లాడవచ్చునన్న ఆత్మ విశ్వాసాన్ని మనలో ఏర్పరు స్తుంది. వ్యక్తిగతంగా మనమంతా సమ్యక్ దృష్టితో మెలగుతాం. ఎవరో మనల్ని గమనిస్తున్నారన్న భావన వల్లే ఇలా ఉండగలుగుతాం. ఒబామా చెప్పిన మరో ముఖ్యాంశమేమంటే మనం ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటే తప్ప లేదా కోరుకుంటే తప్ప అతడు/ఆమె వైఖరేమిటో మనకు తెలిసే అవకాశం లేదు. నిజజీవితంలో ఎవరితోనైనా మనం వ్యవహరిస్తున్నప్పుడు వారు చెప్పేది కూడా మనం విని తీర వలసి వస్తుంది. అది మన నిశ్చయాన్ని, మన ప్రతికూల అభిప్రాయాలను పల్చ బారుస్తుంది. ఒబామా మనకిచ్చిన లోచూపు నుంచి మనం కొన్నిటిని గ్రహిం చవచ్చు. అందులో మొదటిది–తమ పని ద్వారా మార్పునాశించే క్రియాశీలవా దులు, రాజకీయ నాయకులు ఇంటర్నెట్ ద్వారా కాక నేరుగా ప్రజలను కలుసు కోవాలి. వారితో సంబంధాలు నెలకొల్పుకోవాలి. నేను పనిచేసే చోటుకు కొన్ని వారాల క్రితం దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ వచ్చారు. ఆయన తన దృక్కో ణాన్ని, ఆశలను వివరించారు. ఎన్నికల రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు అది తన స్వల్ప కాల లక్ష్యమేమీ కాదని, పదిపదిహేనేళ్లుగా అందులో విజయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. రెండు ప్రధాన పార్టీలు మాత్రమే బలంగా ఉండే గుజరాత్లాంటి రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా సులభంగా నెగ్గుతానని ఆయన ఎప్పుడూ అనుకుని ఉండరు. పైగా ఆయనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎన్నికల గుర్తు లేదు. కేవలం తన సొంత విశ్వసనీయతే ఆధారం. మరి ఇదెలా సాధ్యమైంది? తెలివిగా మాట్లాడటం, ఒప్పించే గుణం ఉండే ప్రసంగాలు చేయ డం... వేలాదిమందిని వ్యక్తిగతంగా కలవడం వల్లే మేవానీ గెలుపు సాధించగలి గారని నేననుకుంటున్నాను. నావంటి మానవ హక్కుల కార్యకర్త కూడా ఇదేవిధంగా జనాన్ని కలుసు కోవాలి. ఇది నేనెందుకు చెబుతున్నానంటే క్రియాశీల ప్రపంచం సామాజిక మాధ్యమాలపైనే దృష్టి పెడుతుంది. దానిద్వారా భారీ సంఖ్యలో ప్రజలకు చేరువ కావొచ్చునన్నది అందులో పనిచేసేవారి అభిప్రాయం. కానీ ఒబామా చెప్పినట్టు ఆ మాధ్యమాలు కృత్రిమంగా విభజితమై ఉంటాయి. నిరాదరణకు లోనయ్యే ముస్లింలు, దళితులు, ఆదివాసీలు లేదా కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పనిచేసే వారికి మీరు సైనికుల హక్కుల గురించి మాట్లాడరేమన్న ప్రశ్న తరచుగా ఎదుర వుతుంది. ఇంటర్నెట్లో అయితే ఇలాంటి తప్పుడు ద్వంద్వాలను సులభంగా కొనసాగేలా చూడొచ్చు. ముఖాముఖీలో అవతలి వ్యక్తి ఆందోళనల్ని కొట్టిపారే యడం అంత సులభం కాదు. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి నిరాశ పడనవసరం లేదని (తరచు నాకు అలా అనిపిస్తుంటుంది) ఒబామా అంతర్దృష్టి చెబుతుంది. అంతమాత్రాన సామాజిక మాధ్యమాలు ఉత్త చెత్త అని ఒబామా అన్నారని మనం అర్ధం చేసుకోకూడదు. ‘బహుళ విధ స్వరాలను అనుమతించేలా, అదే సమయంలో సమాజంలో చీలికలు తీసుకు రాకుండా, ఒక ఉమ్మడి భూమికను కనుగొనేలా రూపొందడం కోసం మనం ఈ సాంకేతికతను ఎలా నియంత్రణలోకి తెచ్చుకుంటామన్నదే ప్రశ్న’ అని ఆయన చెప్పిన సంగతిని గుర్తుచేసుకోవాలి. అత్య ద్భుతమైన ఈ మాటలు మన దేశానికి ఎంతో కీలకమైన ఈ కొత్త సంవత్సరంలో గుర్తుంచుకోదగ్గవి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఆర్థికరంగంలో మోదీ విఫలుడు
అవలోకనం మనమిప్పుడు 2018లోకి ప్రవేశించబోతున్నాం. ఎన్నికల ముందు సంవత్సరమిది. ఆర్థికరంగంలో మోదీ పనితీరుకు సంబంధించిన డేటా ఆయన విఫలుడని చెబుతోంది. తన పదేళ్ల పాలనాకాలంలో సాధించిన సగటు వార్షిక వృద్ధి రేటుకు సరితూగగల వృద్ధి రేటును మోదీ సాధించలేకపోయారని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఎత్తిచూపారు. మోదీని అభిమానించే కార్పొరేట్ రంగంలో త్రైమాసిక ఫలితాల ఆధారంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనితీరును నిర్ణయిస్తారు. ఆ ప్రమాణాల ప్రకారమైతే కార్పొరేట్ రంగం మోదీని విఫలుడిగా నిర్ధారిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ మన కాలపు ప్రతిభావంతుడైన రాజకీయవేత్త. జనా మోదం పొందే నేతల్లో సుప్రసిద్ధులైనవారి పేర్లు చెప్పడం అంత సులభం కాదు. రష్యాలో పుతిన్, టర్కీలో ఎర్డోగాన్ ఈ కోవలోకి వస్తారనిపిస్తుంది. అయితే ఆ దేశాల్లోని రాజకీయాలపై నాకు లోతైన అవగాహన లేదు. కానీ వారికి లభిస్తున్న మద్దతు మోదీకుండే మద్దతుకు దగ్గరగా అనిపిస్తుంది. ఈ ముగ్గురూ వారి వారి పార్టీలకు మించి ప్రజాదరణ ఉన్నవారు. ఆ పార్టీలకున్న సంప్రదాయ పునాదిని మించి ఆ ప్రజాదరణ విస్తరించడమే ఇందుకు కారణం. ఎప్పుడు సర్వే చేసినా మోదీ రేటింగ్ 70 శాతానికి మించి ఉంటుంది. ఆ సర్వేలు అంత ఖచ్చితమైనవి కాదని, అందులో అశాస్త్రీయత పాలు ఎక్కువని నేను గుర్తించాను. అయినప్పటికీ ఆయన నిలకడగా దీన్ని సాధించగలగడం విశేషమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీ జాతీయ స్థాయిలో ఇంతవరకూ గరిష్టంగా సాధించిన ఓట్ల శాతం 31 శాతం మాత్రమే. అది కూడా 2014లో. నేను మాట్లాడినవారిలో చాలామంది ఈ విషయంలో నాతో ఏకీభవించారు. మోదీ గురించే తీసుకుంటే ఆయన పట్ల, ఆయన రాజకీయాలపట్ల ఆకర్షితు లవుతున్న వర్గాలవారెవరో గ్రహించగలం. అగ్రకులాలు, మధ్యతరగతి, పట్టణ ప్రాంత ఓటర్లలో ఆయనకున్న పునాది అతి ముఖ్యమైనది. మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో నగర ప్రాంతాల్లో కనబడ్డ బీజేపీ ప్రభంజనం ఈ విశ్లేషణను ధ్రువీ కరిస్తుంది. గ్రామసీమల్లో, ఓ మాదిరి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విధానాలు విఫలమైనా నగరాల్లోని ఈ పునాదే బీజేపీ వెనకా, వ్యక్తిగతంగా మోదీ వెనకా దృఢంగా నిలబడింది. ఈ మద్దతుకు గల కారణాలు అనేకం. ఈ దేశం దుర్బలంగా ఉన్నదని, సమూలమైన చర్యల ద్వారా మాత్రమే ఇది సరి అవుతుందని మధ్య తరగతి నమ్ముతోంది. గట్టి నాయకుడు అవసరమనే భావన ఈ వర్గాలను ఎప్పుడూ ఆకర్షిస్తుంది. యాభైయ్యేళ్లవాడిగా మూడు దశాబ్దాలుగా ఇదే జరుగు తోందని నేను చెప్పగలను. ఈ దృక్పథం ఉన్న పరిస్థితిని సూక్ష్మీకరించడం, తగ్గించి చెప్పడం కావొచ్చు. ఆరెస్సెస్ రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరి, సంస్కృతికి సంబంధించి దానికున్న బ్రాహ్మణీయ వైఖరి, ఈ వర్గాలు తమ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూసే తీరుకు సరిపోతాయి. ఈ వర్గాల్లో నిలువెల్లా ఉండే శక్తివంతమైన జాతీయవాదానికి బీజేపీ సరిగ్గా అతుకుతుంది(విదేశాల్లో మోదీ పాల్గొనే సభల్లో కనబడే ప్రవాస భారతీయులంతా ఈ వర్గాలవారే). పాకిస్తాన్, చైనాలకు సంబంధించిన అంశాల్లో వారి మానసిక ధోరణి వేరేగా ఉంటుంది. ఆర్థికంగా ఈ వర్గాలవారు మంచి జీడీపీ వృద్ధిపైనా, దానివల్ల సమకూరే ఉన్నతోద్యోగాలు, ఆధునిక మౌలిక వసతుల్లో వచ్చే పెట్టుబడులుపైనా (ఉదా:గ్రామీణ ప్రాంత రోడ్ల మెరుగుదలకు బదులు బుల్లెట్ రైళ్లు, ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టానికి బదులు విమానాశ్రయాల విస్త రణపై దృష్టిపెట్టే విధానాలు) ఆధారపడతారు. మైనారిటీల హక్కుల విషయాన్ని సాధారణీకరించి చెప్పడం సులభం కాదు. దక్షిణాసియా ప్రజల్లో మైనారిటీలపై అయిష్టత ఉండటమన్నది నిజమే కావొచ్చుగానీ ఇక్కడి బీజేపీ అనుకూల దృక్పథం ఉన్నవారికి ఆ మైనారిటీ వర్గాలకు భారత్ పట్ల ఉండే వైఖరితో సమస్య ఉంది. లౌకికవాదానికి సంబంధించిన స్వచ్ఛ భావన వీరికి ఎంతమాత్రమూ నచ్చదు. భారతీయుల్లో చాలామంది సెక్యులరిజానికి ఓటేయలేదు. మధ్యతరగతి కనుక వీరిలో చాలామంది నెలవారీ జీతాలపై ఆధారపడతారు. ‘ప్రతిభ’ సమృద్ధిగా ఉండే వీరికి వంశ పారంపర్యతపై ఆధారపడిన రాహుల్కన్నా స్వశక్తితో ఎదిగిన మోదీ నచ్చుతారు. మోదీ మద్దతుదార్లలో ఉండే రెండో కేటగిరి వ్యక్తులు బీజేపీకి కూడా మద్దతుదార్లు. ఎందుకంటే వారు కర్ణాటకలో లింగాయత్లు, గుజరాత్లో పాటీదార్లు, రాజస్థాన్లో రాజ్పుట్ల వలే ఆధిపత్య కులానికి చెందినవారు. మూడో కేటగిరి వ్యక్తులు హిందుత్వకు ఆకర్షితులయ్యే పౌరులు. శత్రువు అంతర్గ తంగానే ఉన్నాడని, దేశం ప్రగతి సాధించాలంటే ఈ శత్రువును ఏరిపారేయాలని వీరనుకుంటారు. ఈ చివరి రెండు కేటగిరీలూ అంత ముఖ్యమైనవి కాదు. ఎందు కంటే మోదీ ఉన్నా, మరెవరున్నా... ఇప్పుడైనా, ఎప్పుడైనా వీరు బీజేపీతోనే ఉంటారు. మొదటి కేటగిరి అలా కాదు... వ్యక్తిగతంగా మోదీకి ఉండే సమ్మోహనా శక్తి, ఆయనపై ఉండే నమ్మకం మిగిలిన రెండు కేటగిరిలనుంచి వీరిని వేరు చేస్తుంది. మనమిప్పుడు 2018లోకి ప్రవేశించబోతున్నాం. ఎన్నికల ముందు సంవ త్సరమిది. ఆర్థికరంగంలో మోదీ పనితీరుకు సంబంధించిన డేటా ఆయన విఫలుడని చెబుతోంది. తన పదేళ్ల పాలనాకాలంలో సాధించిన సగటు వార్షిక వృద్ధి రేటుకు సరితూగగల వృద్ధి రేటును మోదీ ఇంతవరకూ సాధించలేక పోయారని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఎత్తిచూపారు. మోదీని అభిమానించే కార్పొరేట్ రంగంలో త్రైమాసిక ఫలితాల ఆధారంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనితీరును నిర్ణయిస్తారు. ఆ ప్రమాణాల ప్రకారమైతే కార్పొరేట్ రంగం మోదీని విఫలుడిగా నిర్ధారిస్తుంది. నా వరకూ ముఖ్యమైన అంశమేమంటే... 2009లో విత్త సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయింది. అదిప్పుడు అనూ హ్యంగా 3 శాతం వృద్ధితో పెరుగుతోంది. ఈ వాతావరణంలో కూడా మన వృద్ధి సంతృప్తికరంగా లేదు. పెద్దనోట్ల రద్దు వంటి దుందుడుకు చర్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటాను. 2019 ఎన్నికల బరిలోకి దిగినప్పుడు మోదీని, బీజేపీని కూడా ఈ వైఫల్యం ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆర్థికంగా సాధించిందని చెప్పుకోవ డానికేమీ లేదు(‘త్వరితగతిన ఎదుగుతున్న దేశం’ అనే మాట మీరు విని ఎన్నాళ్ల యింది?). 2014 ఎన్నికలప్పుడున్న ‘అచ్ఛేదిన్’లాంటి అనుకూల ప్రచారం ఆ ఎన్నికల్లో ఉంటుందని నేననుకోను. అది గర్హనీయమైన, వేర్పాటువాద ధోరణుల తోనే ఉంటుంది. ఒక భారతీయుడిగా ఇది నన్ను కలవరపెడుతుంది. కానీ వ్యక్తిగ తంగా మోదీకి మద్దతు పలికే మొదటి కేటగిరిలోనివారు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తారనేది ఒక రచయితగా, సామాజిక పరిశీలకుడిగా నాకు ఆసక్తిదాయ కమైనది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఈమెయిల్: aakar.patel@icloud.com -
మత జాతీయవాద ఉన్మాదంపై వ్యతిరేకత
అవలోకనం ఇప్పుడు మనం తరచుగా చూడాల్సి వస్తున్న వీధుల్లోని హింస, మీడియాలోని హింస మత జాతీయవాద భౌతిక వ్యక్తీకరణలే. మనలో చాలా మంది విస్మరించలేని ఈ సమస్యకు సంబంధించి అత్యవసర స్థితిని కల్పించినది ఇదే. జాతీయవాదం పేరిట భారతీయులెవరికీ హాని జరుగని విధంగా, నిజమైన జాతీయ ప్రాధాన్యాలైన పేదరికం, ఆరోగ్యం, విద్యపై దృష్టిని కేంద్రీకరించగలిగే విధంగా ఇది ముగిసిపోవాలని మనం కోరుకుంటాం. మరే ఇతర అంశం కంటే ఇదే చాలా మంది బీజేపీ మరోసారి గుజరాత్లో గెలవకూడదని అనుకోవడానికి కారణం. గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన విజయాన్నే సాధించింది. అందుకు కారణాలేమిటా అని మనం ఊహాగానాలు సాగించవచ్చు. కానీ, ఫలితా లలో అస్పష్టతేమీ లేదు. గత 20 ఏళ్లుగా గుజరాతీ ప్రజలు మాట్లాడుతున్నదానికి అనుగుణంగానే వారు తీర్పు చెప్పారు. కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగింది. కానీ, అది దేశవ్యాప్త ధోరణి అనగలిగేంత పెద్దదో కాదో చెప్పాలంటే మరింత సమాచారం కావాలి. ఇతర రాష్ట్రాల నుంచి మరిన్ని ఫలితాలు రావాలి. ఏదిఏమైనా గుజరా త్లో బీజేపీ విజయం సాధించింది. దీన్ని స్పష్టపరచుకున్నాం కాబట్టి, ఇక కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలని చాలా మంది ఎందుకు ఆశించారనే అంశాన్ని, లేకపోతే మరింత కచ్చితంగా చెప్పాలంటే మళ్లీ బీజేపీ గెలవకూడదని ఎందుకు కోరుకున్నారనే దాన్ని పరిశీలిద్దాం. వంశపారంపర్య రాజకీయాలను పూర్తిగా సమర్థించే వారు ఎంతో మంది నాకు కనబడలేదు. కాబట్టి బీజేపీ గెలుపు గురించి ఆందోళన చెందిన ప్రజల్లో చాలా మంది కాంగ్రెస్ సమర్థకులు కారని అను కోవచ్చు. అంటే వారు మరి దేని కోసమో మాత్రమే ఆందోళన చెందారు. అదేమిటి? బీజేపీ ఉద్దేశపూర్వకంగా ముందుకు నెట్టిన మత జాతీయవాదమే. జాతీ యవాదం ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అది, దేశంలోని అన్ని మతాల, అన్ని ప్రజా విభాగాల, అన్ని ప్రాంతాల భారతీయులందరినీ కలుపుకున్న సమగ్ర జాతీయ వాదంగా ఉండొచ్చు. బీజేపీ పెంపొదింపజేయాలని అనుకుంటున్నది ఇది కాదు. ఒక నాగా లేదా మిజో తన భారతీయ గుర్తింపును సగర్వంగా అనుభూతి చెందగ లరా? బీజేపీ నిర్వచించిన విధంగా తమ భారతీయతను నొక్కి చెప్పుకోగలగా లంటే వారు భారత్ మాతాకీ జై వంటి హిందీ నినాదాల ద్వారా, గొడ్డు మాంసం తినడాన్ని మానేయడం ద్వారా మాత్రమే చేయగలుగుతారు. గొడ్డు మాంసం వేల ఏళ్లుగా వారి సాంప్రదాయక ఆహారం అయినా మానేయాలి. కేరళ లోని ఓ ముస్లిం తన భారతీయ అస్తిత్వాన్ని చాటుకోగలడా? ఓ హిందూ స్త్రీతో ప్రేమలో పడనని వాగ్దానం చేస్తేనే సాధ్యం. బీజేపీ చెప్పే జాతీయవాదం భారతీయులందరి జాతీ యవాదం కాదు. అది ఒక ప్రత్యేక రకమైన భారతీయులకే సంబంధించినది. కొన్ని రకాల భారతీయులకు అది నచ్చకపోయినా సరే అది వారి దృష్టిలో జాతీయ వాదమే. నేను ఉత్తర భారతదేశానికి చెందిన హిందువును అయినా నాకు ఇతర భారతీయులను దూరంగా ఉంచే ఆ జాతీయవాదం నాకు అక్కర్లేదు. సాధారణంగా చెప్పాలంటే నాకు అన్ని జాతీయవాదాలతోనూ పేచీ ఉంది. ఎందుకంటే వాటిని ఒక ప్రజాసమూహానికి వ్యతిరేకంగా మరో ప్రజాసమూహాన్ని సమీకరించడానికి ప్రయోగిస్తుంటారు. నాకు చీదర పుట్టించే విధంగా ఎదుటి సమూహాన్ని ఎగతాళి చేసి, దుష్టులుగా క్రూరులుగా చిత్రీకరిస్తుంటారు. సాధార ణంగా జాతీయవాదం హింసకు దారితీస్తుంటుంది. కాబట్టి దానితో చాలా జాగ్ర త్తగా వ్యవహరించాలి. అన్ని రకాల జాతీయవాదాల్లోకి మతపరమైన, జాతిపర మైన జాతీయవాదాలు ప్రత్యేకించి కంపరమెత్తించేవి. పాకిస్తాన్ ముస్లిం జాతీయ వాదం అన్నా, చైనా హాన్ జాతీయవాదమన్నా కూడా నాకు ఇష్టం లేదు. చాలా మంది భారతీయులు నాలాగే భావిస్తుంటారు. కాబట్టే వారు బీజేపీని ఆందోళనతో చూస్తుంటారు. నాలాగా మీరు మతం ప్రాతిపదికగా గల జాతీయవాదాన్ని వ్యతి రేకిస్తూ, బీఎస్పీకి ఓటు చేసేవారు కావచ్చు. లేదంటే తృణమూల్ కాంగ్రెస్ ఓటర్ లేక ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారు లేదా ఎన్సీపీ, టీడీపీ, పీడీపీ, జేడీయూ, సీపీఎం లేదా ఎక్కడ ఏ పార్టీకి మద్దతుదారైనా కావచ్చు. కానీ మీరే గనుక మత జాతీయవాదానికి మద్దతుదారైనట్టయితే దేశంలో ఎక్కడున్నా గానీ బీజేపీని సమ ర్థిస్తారు. దీన్ని ప్రధాన ఎజెండాగా ముందుకు నెడుతున్న పార్టీ దేశంలో ఒకే ఒక్కటి ఉంది. కాబట్టే దాని చర్యలపట్ల, మాటల పట్ల, అది మన దేశానికి కలిగిస్తున్న నష్టం పట్ల ఆందోళన చెందుతారు. కాబట్టే తమ పార్టీ అనుబంధాలు ఏవైనాగానీ గుజరాత్లో ఆ పార్టీ ప్రాబల్యం క్షీణించాలని వారు కోరుకుని ఉంటారు. మత జాతీయవాదాన్ని తొలగించినట్టయితే బీజేపీ విధానాలు ఇతర పార్టీల విధానలకంటే భిన్నమైనవేమీ కావనే అనిపిస్తుంది. ఈ పార్టీలన్నిటి ఉమ్మడి విధా నాలు మంచివని నేను చెప్పడం లేదు. వాస్తవానికి అవి మంచివి కావు కూడా. నేను పనిచేసే మానన హక్కుల సంస్థ చూస్తున్న సమస్యలు దాదాపుగా అన్నీ కాంగ్రెస్ పాలనలో సృష్టించినవే. ఉదాహరణకు, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ప్రయోగించడం, ఆదివాíసీ భూములను నేరపూరితంగా ఉపయోగించడం. వీటిలో ఏవీ బీజేపీ లేదా మోదీ సృష్టించినవి కావు. బీజేపీ వీటిని తగ్గించకపోగా మరిన్నిటిని జోడిస్తోంది. దూకుడుగా అది మత జాతీయవాదాన్ని ముందుకు నెడుతుండటం వల్ల కలిగే పర్యవసానాలను మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం గోమాంసం పేరిట కొట్టి చంపేయడం వంటి హింసాత్మక ఘటనలు తరచుగా సంభవిస్తున్నాయి. అవి బీజేపీ ఉద్దేశ పూర్వకంగా సృష్టించినవని మనం చదువుతున్నాం. వారు గనుక ఇలా భారతీ యులను ప్రధానంగా మత ప్రాతిపదికపైనే చీల్చడానికి బదులుగా కులం, లింగం, ప్రాంతం ప్రాతిపదికపై చీల్చాలని చూసి ఉంటే వీటిలో చాలా ఘటనలు జరిగి ఉండేవే కావు. ఇప్పుడు మనం తరచుగా చూడాల్సి వస్తున్న వీధుల్లోని హింస, మీడియా లోని హింస (వ్యక్తులను పాకిస్తాన్ ‘దళారుల’ని పిలవడం) మత జాతీయవాదపు భౌతిక వ్యక్తీకరణలే. మనలో చాలా మంది విస్మరించలేని ఈ సమస్య గురించిన అత్యవసర స్థితిని కల్పించినది ఇదే. జాతీయవాదం పేరిట భారతీయులెవరికీ హాని జరుగని విధంగా, నిజమైన జాతీయ ప్రాధాన్యాలైన పేదరికం, ఆరోగ్యం, విద్యపై దృష్టిని కేంద్రీకరించగలిగే విధంగా ఇది ముగిసిపోవాలని మనం కోరుకుంటాం. మరే ఇతర అంశం కంటే ఇదే చాలా మంది బీజేపీ మరోసారి గుజరాత్లో గెలవ కూడదని అనుకోవడానికి కారణం. మనం ఆ విషయాన్ని అంగీకరించి, ఆ పార్టీ మద్దతుదార్లతో సంవాదాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించాలి. తద్వారా వారు మన దృక్పథాన్ని అర్థం చేసుకునేలా చేయాలి. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
సెంచరీకి చేరువలో కాంగ్రెస్ వారసత్వ పరంపర!
అవలోకనం వాస్తవానికి వంశపారంపర్యత అవసరం లేని పార్టీగా రూపుదిద్దుకోవడానికి, ఆ పార్టీ సీనియర్లలో ఎవరో ఒకరు సారథ్యం స్వీకరించడానికి కాంగ్రెస్కు అంతకన్నా మంచి అవకాశం దొరకదు. కానీ బాబ్రీ మసీదు వివాదం... దానితోపాటు సమాజంలోకి, రాజకీయాల్లోకి వచ్చి చేరిన హింస కాంగ్రెస్లో అభద్రతాభావాన్ని ఏర్పరచి, దాన్ని నెహ్రూ–గాంధీ కుటుంబం చెంతకు చేర్చాయి. పార్టీ నాయకత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు అప్పటికి అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరిని ఆమె సులభంగా పక్కకు నెట్టగలిగారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ పీఠం ఎక్కిన కుటుంబసభ్యుల్లో ఆయన ఆరో వ్యక్తి. మొదట మోతీలాల్ నెహ్రూ, ఆ తర్వాత ఆయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షు లుగా పనిచేస్తే అనంతరం వరుసగా ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియా గాంధీ ఆ పదవిని చేపట్టారు. 1919లో తొలిసారి మోతీలాల్ నెహ్రూ ఆ బాధ్యతలు స్వీకరించారు. కనుక ఆ కుటుంబం కనుసన్నల్లో కాంగ్రెస్ పనిచేయడం ప్రారం భించి 2019నాటికి శతాబ్దం అవుతుంది. వీరంతా ఒకరి తర్వాత ఒకరు అవిచ్ఛి న్నంగా పార్టీని ఏలినవారు కాదు. మధ్యలో నలుగురైదుగురు వేరే నాయకులు ఆ పదవిలో ఉన్నారు. కానీ మోతీలాల్ తర్వాత ఆయన కుమారుడు అధ్యక్షుడైనప్పుడే దేశంలో కుటుంబ రాజకీయ వారసత్వం అనే భావన మొగ్గ తొడిగింది. నెహ్రూకు ముందు పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరైనా ఒక్క ఏడాదే ఉండేవారు. ఆయన ప్రధాని అయ్యాక ఇది మారింది. ఇందిరాగాంధీ ప్రాధాన్యత బాగా పెరగడం మొదలయ్యాకే ఒక వ్యక్తి దాదాపు శాశ్వతంగా పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండటం అనే సంప్రదాయం అంకురించింది. చెప్పాలంటే పార్టీ చరిత్రలో సోనియాగాంధీ పదవీకాల అవధే దీర్ఘమైనది. ఆమె 20 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఈ రెండు దశాబ్దాలనూ పార్టీ రూపాంతరం చెందిన కాలంగా దేశ ప్రజలు గుర్తుంచుకుంటారు. కాంగ్రెస్ సుదీర్ఘకాలం హిందూ పార్టీ గానే మనుగడ సాగించిందని చెబితే యువ పాఠకులు బహుశా ఆశ్చర్యపోతారు. ఆ పార్టీ నాయకత్వ స్థానాల్లో పనిచేసిన చాలామంది కరుడుగట్టిన ఛాందసవా దులే. అలాంటివారంతా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం సంస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ కాంగ్రెస్వాదే. కాంగ్రెస్ హయాం మొదలైతే మైనారిటీలకు న్యాయం లభించదని మహమ్మదాలీ జిన్నా నేతృత్వంలోని ముస్లింలీగ్ భావించడం, అది చివరకు దేశ విభజనకు దారి తీయడం చరిత్ర. పార్టీని ఆ ముద్ర నుంచి బయటపడేసి, అది హిందూ వ్యతిరేకి అన్న అభిప్రాయం అందరిలో ఏర్పడటానికి సోనియాగాంధీ కారణమని అనుకుం టారుగానీ అది నిజం కాదు. ఆమె పదవీకాలంలో దేశంలో ఆసక్తికరమైన పరిణా మాలు సంభవించాయి. రాజీవ్ హత్యానంతరం సోనియా ఛత్ర ఛాయలో పనిచే యక తప్పని పార్టీ అధ్యక్షుడిగా పీవీ నరసింహారావు చివరకు ఎవరికీ అంతుబట్టని వ్యక్తిగా, మేధావిగా మిగిలిపోయారు. ఇప్పటితో పోలిస్తే ఆరోజుల్లో సోనియా ప్రైవేటు వ్యక్తి. చాలా అరుదుగా మాత్రమే కనబడేవారు, మాట్లాడేవారు. అందు వల్లే ఆమె ప్రతి కదలికనూ ఆ రోజుల్లో పత్రికలు విశ్లేషించేవి. అందువల్లే తప్పో ఒప్పో... తనకంటూ ఎలాంటి పదవి లేకుండానే ఆమె అధికార కేంద్రంగా మారా రన్న అభిప్రాయం జనంలో ఏర్పడింది. వాస్తవానికి వంశపారంపర్యత అవసరం లేని పార్టీగా రూపుదిద్దుకోవడానికి, ఆ పార్టీ సీనియర్లలో ఎవరో ఒకరు సారథ్యం స్వీకరించడానికి కాంగ్రెస్కు అంత కన్నా మంచి అవకాశం దొరకదు. కానీ బాబ్రీ మసీదు వివాదం... దానితోపాటు సమాజం లోకి, రాజకీయాల్లోకి వచ్చి చేరిన హింస కాంగ్రెస్లో అభద్రతాభావాన్ని ఏర్పరచి, దాన్ని నెహ్రూ–గాంధీ కుటుంబం చెంతకు చేర్చాయి. పార్టీ నాయకత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు అప్పటికి అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరిని ఆమె సులభంగా పక్కకు నెట్టగలిగారు. సోనియా వస్త్రధారణ ఎప్పుడూ చీరెలే. కానీ ఆమె ఇప్పుడు దాన్నొక యూనిఫాంగా మార్చేసుకున్నారు. ఆమె కట్టూ బొట్టూలో ఉండే ప్రత్యేకతను తెలివైన జనం సులభంగానే గుర్తుపడతారు. మన రాజకీయాల్లో అలాంటి ప్రత్యేకత అరుదు. ఆమె హిందీలో మాత్రమే మాట్లాడటం మొదలు పెట్టారు. ఇంగ్లిష్ అక్షరాల్లో రాసుకున్న హిందీ ప్రసంగపాఠాలను ఆమె చదువుతుం డగా తీసిన ఫొటోలు పత్రికల్లో వచ్చినప్పుడు చాలామంది గేలిచేశారు. అనంతర కాలంలో దేవనాగర లిపిలో రాసుకున్న ప్రసంగాన్ని చదివే ఫొటోలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు రాసుకోవాల్సిన అవసరమే లేకపోయింది. ఏ విషయంపైన అయినా సమర్థవంతంగా, ఆకర్షణీయంగా ఆమె మాట్లాడగలుగుతున్నారు. ప్రజా జీవనరంగంలో ఆమెకంటూ రెండు విశిష్టమైన సందర్భాలున్నాయి. అందులో మొదటిది–రాజ్యాంగం ప్రకారం ఆమెకు అర్హత ఉన్నా 2004లో ప్రధాని పదవి స్వీకరించడానికి విముఖత చూపడం. సోనియా విదేశీ వనిత గనుక ఆ పదవికి ఆమె అనర్హురాలని, ఆమె ప్రధాని అయితే శిరోముండనం చేయించుకుంటానని సుష్మా స్వరాజ్ హెచ్చరించారు. తన యూరోపియన్ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవ డానికి సోనియా కొంత వ్యవధి తీసుకున్నారన్నది అలాంటివారి ఆరోపణ. ఇది నాకు వింతగా అనిపిస్తుంది. గ్రీన్ కార్డు కోసం వెంపర్లాడే ఈ దేశంలో దేశభక్తితో కాగి పోయి మనలో ఎందరు అమెరికా, యూరోపియన్ పౌరసత్వాలను వదులుకుంటున్నారు? నాకైతే అలాంటివారెవరూ తారసపడలేదు. కానీ ఆమె మాత్రం అందుకు భిన్నంగా ఉండి కూడా ఆ మాటలు పడాల్సివచ్చింది. కెనడా పౌరసత్వం కోసం ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నా అక్షయ్కుమార్ దేశభక్తిని ప్రేరేపిస్తూ చానెళ్లలో కనబడుతుంటారు. ఇక రెండో సందర్భం–పీవీ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసి ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మన్మోహన్ను ప్రధానిగా తీసుకురావడం. ఆయన రెండు దఫాల ప్రభుత్వాలూ ప్రజల దృష్టిలో అవినీతి చిహ్నాలుగా మిగిలి పోయాయిగానీ ఆ కాలం పరివర్తనా దశ అని గుర్తుంచుకోవాలి. సమాచార హక్కు చట్టం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి కల్పన పథకం, ఇతర మానవీయ చట్టాలు ప్రభుత్వానికి ‘వామపక్ష’ లేదా ‘సామ్యవాద’ ముద్రను ఏర్పరచాయి. కానీ మన్మోహన్ చెప్పినట్టు ఆయన పదేళ్ల పదవీకాలమూ కూటమిలోనే గడిచిపోవడం వల్ల పరిమిత స్థాయిలోనే ఆయన వ్యవహరించాల్సివచ్చింది. ఫలితంగా సగటు వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. ప్రస్తుత ఎన్డీఏ సర్కారు ఎంతగా ఆర్భాటం చేస్తున్నా దానితో సమం కాలేకపోతోంది. ఆమె హయాంలో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్కు ఘోరమైన ఫలితాలు తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ చరిత్ర మాత్రం సోనియాను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన, విజయాలు సాధించిన నేతగా సానుకూలంగానే పరిగణిస్తుంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
ప్రతికూల ప్రచారం తప్ప గత్యంతరం లేదా?
వార్తా ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అన్ని, లేదా దాదాపు అన్ని వార్తా కథనాలూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మీడియా మద్దతుతో బీజేపీ ప్రచారంలో ప్రవేశపెట్టినవేనని కనబడుతూనే ఉంది. బీజేపీ సాగిస్తున్నది దూషణలు, భయాలతో కూడిన ప్రతికూల ప్రచారం. 2014లో వలే సుపరిపాలన, అచ్చేదిన్ నినాదాలతో సానుకూల ప్రచారాన్ని చే యాలన్న కోరికే దానికి లేకపోవడం నేడు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న విషయం. ఇది దురదృష్టకరం. ఉపఖండంలో రాజకీయాలు సాగే పద్ధతి కూడా ఇదే. మణిశంకర్ అయ్యర్ ఏదో అన్నంత మాత్రాన అదో సమస్యగా, గుజరాత్ ఎన్ని కల సమస్యగా మారుతుందని ఎవరు అనుకుంటారు? నేనైతే కచ్చితంగా అనుకో లేదు. గజరాతీలు తమకేమీ సంబంధంలేనిదిగా భావించే ఈ అంశం గుజరాత్ ఎన్నికల్లో చెప్పుకోదగినంత పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోవడం లేదు కూడా. అయ్యర్ వాడిన అప్రతిష్టాకరమైన పదం గురించి నేను గుజరాతీ నిఘం టువును శోధించాను. ‘నీచ్’కు గుజరాతీ అనువాదం ‘దుష్ట్’. ఇంగ్లిష్ అనువాదాలు ‘వంచనాత్మక’, ‘దుష్ట’, ‘తుచ్ఛ’ అనేవి. అయ్యర్ ఆ పదాన్ని వాడి ఉండాల్సిందా? లేదు. రాజకీయ చర్చ, అసలు ఏ చర్చయినాగానీ నాగరికమైనదిగా ఉండి తీరాలి. అయితే ఇంతకూ ఆ మాటకూ, కులానికి ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు. ఇక రెండవది మోదీ కులానికి సంబంధించిన సమస్య. ప్రధాని, ఘాంచి అనే బాగానే అభివృద్ధిచెందిన కులానికి చెందినవారు. వాళ్లు కిరాణా దుకాణాలు నడ పడం, నూనె తియ్యడం చేస్తారు. దుకాణాల్లో ధాన్యం (టీ కూడా) అమ్ముతారు. మోదీ అంటేనే, గాంధీలాగా పరిసర ప్రాంతంలోని కిరాణా దుకాణదారు అని అర్థం. గుజరాతీలు ఘాంచీలను వెనుకబడిన కులంగా చూడరు. 1999లో వాజ్ పేయి హయాంలోనే అది వెనుకబడిన కులంగా లేదా ఓబీసీగా మారింది. కాబట్టి గుజరాతీలలో చాలా మందికి సంబంధించి ‘నీచ్’ అంటే వెంటనే ప్రధాని కులాన్ని కించపరిచే మాటని అనిపించదు. ఈ కారణాల వల్లనే నేను దీన్ని ఉద్దేశపూర్వకంగానే పెద్దదిగా చేశారని, ప్రత్యే కించి ఎన్నికల ప్రచారంలో ప్రభావశీలమైన ఆయుధం కాగలదని భావించి అలా చేశారని అనుకుంటున్నాను. బీజేపీ విజయానికి (బీజేపీ గెలుస్తుందని నా అంచనా. గత వారం కాలమ్లో కూడా అదే రాశాను) నిర్దిష్టంగా దారితీసిన అంశం ఏదో, మీడియా సృష్టించిన గాలి కబుర్లు ఏవో కాలమే తేల్చాలి. సోమనాథ ఆలయం రిజిస్టర్లో రాహుల్ గాంధీ సంతకం చేయడం వ్యవ హారం కాంగ్రెస్కు నష్టం కలిగించే అంశం అవుతుందేమోనని అనుకున్నా. కానీ ఆ తర్వాతి వార్తలను బట్టి చూస్తే అలాంటిదేమీ జరగలేదని తేలింది. రాహుల్ తనను హిందూయేతరునిగా నమోదు చేయించుకోవాలనుకుంటే గుజరాతీలు తప్పక ఆస క్తిని చూపేవారే. కానీ ఆయన ఆ పని చేయలేదు. అయితే ఆ కథనం ఇప్పుడు గతించిన చరిత్రగా మారిపోయింది. మీడియా ఆసక్తి మరో వైపునకు మరలింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడాన్ని మణిశంకర్ అయ్యర్ షాజహాన్, ఔరంగజేబులు అధికారంలోకి రావడంతో పోల్చారనే అంశం ముందుకు వచ్చింది. ఆ విషయంపై వ్యాఖ్యానించిన వారిలో చాలా మంది ఆయన చెప్పినదాన్ని పూర్తిగా ఉల్లేఖించలేదనేది స్పష్టమే. అలా వ్యాఖ్యానించిన వారిలో నేనూ ఉన్నాను. రాహుల్ గాంధీ, ఔరంగజేబులను ఒకచోట చేర్చి ఏమి మాట్లాడినా దాన్ని మోదీ ఉపయోగించుకుంటారని అయ్యర్కు తెలిసి ఉండా ల్సింది. అలాగే మోదీ వాడుకున్నారు కూడా. ఇది ఓటర్లును ఎంతగా ప్రభావితం చేసే అంశం? ఇలాంటి ఏ ఒక్క విషయంపైనో ఆధారపడి ప్రజలు ఓటు చేస్తారని అనుకోను. కానీ, రెండు దశాబ్దాలు తాము పాలించిన రాష్ట్రంలో బీజేపీ తమ ప్రభుత్వం పనితీరును గురించి గాక, కాంగ్రెస్ గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. అంతకు ముందు బీజేపీ, అహ్మద్పటేల్ ఒక ఆసుపత్రికి ట్రస్టీగా ఉన్నారని వెల్లడించింది. అలాగే ఉగ్రవాద ఆరోపణలున్న ఒక వ్యక్తి అహ్మద్ పటేల్ వద్ద ఉద్యోగిగానో లేక మాజీ ఉద్యోగిగానో ఉన్నారని ఆరోపించారు. పటేల్కు, ఆ ఆరోపణలకు గురైన వ్యక్తికి ఎలాంటి సంబంధమూ లేదు. కాబట్టి అదో బూటకపు కథనం. ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్ది మెతక వైఖరి అని చూపడం ద్వారా సాధారణంగా బీజేపీకి లబ్ధి కలుగుతుంది. కాబట్టే ఆ కథనాన్ని ముందుకు తెచ్చారు. కానీ చరిత్ర, గణాంకాలు అందుకు విరుద్ధమైన ఫలితాలనే చూపు తున్నాయి. ఇక ఆ తర్వాత, కొద్ది రోజుల క్రితమే కపిల్ సిబల్ కథనం ముందుకు వచ్చింది. కాంగ్రెస్ నేత, న్యాయవాది అయిన ఆయన 2019 ఎన్నికల వరకు బాబ్రీ మసీదు కేసు తీర్పును వెలువరించరాదని సుప్రీం కోర్టును కోరారు. ఇలా పూర్తిగా సిద్ధం చేసి ఇచ్చిన సమాచారంతో మరో దఫా వార్తల్లో చక్కెర్లు కొట్టి వచ్చే అవ కాశాన్ని ఇది మోదీకి కల్పించింది. అయోధ్య వివాదం బీజేపీని జాతీయపార్టీని చేసింది. అయితే అదిప్పుడు రాజకీయంగా కాలం చెల్లిన అంశం. అయినా దాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే ప్రముఖమైన దాన్ని చేశారు. మణిశంకర్ అయ్యర్ ఇప్పటికే తనకు నోరు మూసుకుని ఉండటం చేతకాదని నిరూపించుకున్నారు. తనను చంపడానికి ‘సుపారీ’ తీసుకోవాలని అయ్యర్ పాకిస్తానీలను కోరారని మోదీ మరో ఆరోపణ చేశారు. అయితే అది నిజం కాదను కోండి. ప్రధాని దాన్ని నిజమని విశ్వసిస్తూ ఉండాలి. అలా జరిగితే అది ఆందో ళనకరమైన విషయమే. లేకపోతే అది ఎన్నికల్లో ఉపయోగపడే అంశమని అను కోవడమైనా జరిగి ఉండాలి. ఇలా జరిగినా గానీ అది ఆందోళన చెందవలసిన విషయమే. వార్తా ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అన్ని, లేదా దాదాపు అన్ని వార్తా కథనాలూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ మీడియా మద్దతుతో ప్రవేశ పెట్టినవేనని కనబడుతూనే ఉంది. బీజేపీ సాగిస్తున్నది దూషణలు, భయాలతో కూడిన ప్రతికూల ప్రచారం. 2014లో సుపరిపాలన, అచ్చేదిన్ నినాదాలతో చేప ట్టిన సానుకూల ప్రచారాన్ని చేయాలనే కోరికే బీజేపీకి నేడు లేకపోవడం కొట్టవచ్చి నట్టు కనిపిస్తున్న విషయం. ఇది దురదృష్టకరం. ఉపఖండంలో రాజకీయాలు సాగే పద్ధతి కూడా ఇదే. ఈ ఎత్తుగడలను ఉపయోగించాలనుకున్న ప్రతిచోటా బీజేపీ వాటిని ప్రయోగించ వచ్చు. మీడియా ముందుకు నెట్టాలని భావించే విధంగా దాన్ని ఆకట్టుకునే అంశా లను కాంగ్రెస్ పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో చేస్తున్నట్టుగా ఉద్దేశ పూర్వక మైన తప్పులు చేయకుండా చూసుకోవాల్సినది కాంగ్రెస్ పార్టీయే. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
ప్రచారంలో ముందున్నా హోరాహోరీ పోరేనా?
గుజరాత్ ఎన్నికలలో నిజమైన సమస్యలు ఉద్యోగాలు, అర్థవంతమైన ఆర్థికాభివృద్ధి. అధికార పార్టీ ఆ అంశాలపైనే పోరాడుతున్నట్టు నటిస్తున్నా, అవి దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. బీజేపీకి పెద్ద ఓటర్ల పునాది ఉన్నా, అది సాగిస్తున్నది రక్షణాత్మక ప్రచారం. కాంగ్రెస్ ఓటర్ల పునాది చిన్నదే, అయినా వారు ఆగ్రహంతో ఉన్నారు. ఊపందుకుంటున్న గుజరాత్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముందుకు వస్తున్న సమస్యలు ఏమిటి? ఇరవై రెండేళ్లుగా అధికార పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. అభివృద్ధి అంటే బీజేపీ, అది కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే అందించగలిగినది అన్న ట్టుగా, అది ఆ పార్టీకి కాపీ రైటున్న పదంలా అనిపిస్తోంది. బీజేపీ చేసేది ఏదైతే అది అభివృద్ధి, ఇతరుల పార్టీలు చేసేది అవినీతి, వంశపారంపర్య పాలన వగైరా. ఈ సూత్రీకరణ అతి సాదాసీదాది. కాకపోతే ఇలాంటి సూత్రీకరణ చేసిన బీజేపీని దాని ప్రత్యర్థులు తప్పించుకు పోనివ్వడమే విశేషం. ఒకవేళ బీజేపీ అభివృద్ధి గురించి మాట్లాడాలనే అనుకున్నా, అంటే గణాం కాలు, విధానాలు, ఆర్థిక, సామాజిక వృద్ధి వంటి అంశాలను చర్చించాలనే అను కున్నా... ఆ పార్టీ దృష్టి మరలింది. అది రాహుల్ గాంధీ మతం ఏదో తెలుసు కోవాలని అనుకుంటోంది. హఫీజ్ సయీద్కు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ సంబరాలు చేసుకుందని ప్రధానమంత్రి అబద్ధమాడారు. అయినా దానికీ అభివృ ద్ధికి ఉన్న సంబంధం ఏమిటి? ఏమీ లేదనుకోండి. బీజేపీ తాను అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పుకుంటుంటే, ఈ ఎన్నికల్లో అసలు సమస్య ఏమిటనే దానిపైన సైతం కాంగ్రెస్కు స్పష్టత లేదు. లేదా బీజేపీకి అభివృద్ధిలా చెప్పుకోడా నికి దానికి ఒక్క అంశమైనా లేదు. కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ ఒక రోజు రాఫేల్ ఒప్పందానికి సంబంధించిన అవినీతి గురించి చర్చించాలనుకుంటే (దానికి మీడియా మద్దతు లభించలేదు), మరుసటి రోజు చర్చనీయాంశం జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు కావచ్చు. ఇలా దృష్టి కేంద్రీకరణ లోపించడానికి అర్థం బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చెల్లా చెదురు సందేశాలను పంపుతున్నదనే. రెండవది, సమస్యల తర్వాతది పార్టీ నిర్మాణం. ఈ విషయంలో బీజేపీ బలీయమైన శక్తి. ప్రజాస్వామిక ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పార్టీలలో ఒకటి. అట్టడుగు స్థాయిలో సైతం ఆ పార్టీ ఉనికిలో ఉంది. లక్షలాదిమంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ నిర్మాణాన్ని నడుపుతోంది. దానికి అంకితభావంగల, సుశిక్షితులైన వ్యక్తులున్నారు. ఇటీవలి కాలంలో వారు నరేంద్ర మోదీ ఆకర్షణీయమైన నాయ కత్వంతో బాగా ఉత్తేజితులై ఉన్నారు. గుజరాత్లో జరగబోయేవి పోటాపోటీగా సాగే ఎన్నికలో కాదో తెలియదు. కానీ హోరాహోరీగా సాగే ఎన్నికలు వేటిలోనైనా బీజేపీకున్న నిర్మాణపరమైన శక్తులు విజయాన్ని సంపాదించి పెడతాయి. మరోవంక, ఇది రెండు పార్టీల రాష్ట్రం కాబట్టి మనం కాంగ్రెస్ వైపు మాత్రమే చూడగలం. ఆ స్థాయి పోటీ అయితే కనబడటం లేదని అంగీకరించక తప్పదు. సేవాదళ్ లేదా యువజన కాంగ్రెస్ల నుంచి వచ్చిన పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు లేరు. ఆ నిర్మాణం విచ్ఛిన్నమైపోయింది. వ్యక్తిగత కాంగ్రెస్ అభ్యర్థులే పనిచేసే కార్యకర్తలను సమకూర్చాల్సి ఉంటుంది. దీనికి చాలా డబ్బే ఖర్చవు తుంది. కానీ పార్టీ వరుసగా ఓడిపోతూ ఉండటంతో ఎన్నికల కోసం పెద్దగా డబ్బును పెట్టుబడిగా పెట్టగల నేతలు ఆ పార్టీలో ఎందరో లేరు. ఇక సమస్యలు, నిర్మాణాల విషయానికి వస్తే, బీజేపీయే ముందుందని నా అభిప్రాయం. దాని బలం లేదా కాంగ్రెస్ బలహీనత లేదా ఆ రెండూ కూడా అందుకు కారణం కావచ్చు. మూడవది, ప్రచార వ్యూహం. డజన్ల కొద్దీ బహిరంగ సభలలో బీజేపీ తన అత్యంత శక్తివంతమైన పావు ప్రధాన మంత్రిని ప్రయో గించింది. చాలా ఏళ్లుగా, గుజరాత్లో సైతం హిందీలోనే ప్రసంగిస్తూ వస్తున్న ఆయన ఇటీవల గుజరాతీలో ప్రసంగించడం ప్రారంభించారు. నాకైతే అది, ఆయన తన సందేశాన్ని మరింత శక్తివంతంగా ఇవ్వాలనుకుంటున్నారనడానికి, అభిప్రాయ సేకరణలు చెబుతున్నదానికంటే హోరాహోరీ పోటీ జరుగుతుందని భావిస్తున్నారనడానికి సంకేతమేమోనని అనిపిస్తున్నది. మోదీ అసాధారణమైన ఉపన్యాసకులు, రాహుల్వల్ల కాని విధంగా ఆయన తన అజెండాను ప్రజల ముందు ఉంచగలరు. సుదీర్ఘంగా ఉపన్యసించేటప్పుడు ఆయన... సాధారణంగా పాత సమస్యనే కొత్త పద్ధతిలో ఎంత చక్కగా లేవనెత్తుతారంటే... మరుసటి రోజు పత్రికల్లో అది పతాక శీర్షికలకు ఎక్కక తప్పదు. ఉదాహరణకు, ‘నేను టీ అమ్ము కున్నానే కానీ దేశాన్ని అమ్మేయలేదు’ అనే మాటనే తీసుకోండి. అలాంటి స్పష్టత, సరళత గల పద పొందిక గల నాయకుడు ఉండటం ఆ పార్టీకి వరం. మరోవంక, కాంగ్రెస్ తన అజెండాను ప్రజల ముందుంచలేదు. అంతే కాదు, ఓ హాస్పిటల్లో అహ్మద్ పటేల్ ట్రస్టీగా ఉండటం తప్పా కాదా, రాహుల్ కాథలిక్కా కాదా అనే అనవసర సమస్యల్లో కూడా అది రక్షణ స్థితిలో ఉండక తప్పడం లేదు. అయితే కాంగ్రెస్ ఒక్క పనిని మాత్రం సమర్థవంతంగా చేసింది. మూడు అసమ్మతి బృందాలను సంఘటితం చేయగలిగింది. పాటీదార్లు, దళితులు, ఓబీసీ క్షత్రియులను అది ఐక్యం చేయగలిగింది. వారివి పరస్పర విరుద్ధమైన డిమాండ్లు. కాబట్టి ఇదేమీ సులువుగా చేయగల పని కాదు. అయినా కాంగ్రెస్ అ పని చేయ గలిగింది. ఇది ప్రధానంగా అహ్మద్ పటేల్ వల్లే జరిగిందని అని నా అంచనా. ఈ పరిణామం వల్ల బీజేపీ కలవరపడుతోంది. ఆ పార్టీ నేతలు చేసే పలు ప్రకటనల్లో, ప్రత్యేకించి ఆ కూటమిని విచ్ఛిన్నం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చేసే ప్రకటనల్లో అది కనబడుతుంది. బీజేపీని ఓడించడానికి ఇది సరిపోతుందా? అనేదే ప్రశ్న. అన్నిటికన్నా ఎక్కు వగా ఈ ఎన్నికలను నిర్ణయించేది పోలింగ్ శాతం ఎంత అనేదే. గుజరాత్, ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే రాష్ట్రం. అభిప్రాయ సేకరణల్లో బీజేపీ ముందున్నా, అది తన పునాది ఓటర్లు వచ్చి ఓటు వేసేట్టు చేయగలగాలి. అది సాగిస్తున్నది రక్షణా త్మకమైన ప్రచారం కాబట్టి అది ఏమంత తేలిక కాకపోవచ్చు. కాంగ్రెస్ ఓటర్ల పునాది చిన్నదే, అయినా వారు ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఓటు వేయడానికి వస్తారని కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతుంది. ఆ అర్థంలో గుజరాత్లో నిజమైన సమస్యలు ఉద్యోగాలు, అర్థవంతమైన ఆర్థికాభివృద్ధి. అధికార పార్టీ ఆ అంశాలపైనే పోరాడుతున్నట్టు నటిస్తున్నా, అవి దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
చెరసాలలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
టర్కీ ప్రభుత్వం ఆమ్నెస్టీ కార్యకర్తలపై మోపిన ఉగ్రవాద కేసు ఉత్త డొల్ల. విచారణను చూస్తే తీర్పు సత్యానికి అనుకూలంగా వస్తుందనిపించింది. కానీ తనెర్కు బెయిల్ను నిరాకరించారని విని నిర్ఘాంతపోయాం. చాలా ఏళ్లుగా నేను కోర్టు విలేకరిగా పని చేస్తున్నా మానవహక్కులు, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకోసం పోరాడుతున్నవారిని ఇంత నిస్సిగ్గుగా అణచివేయడాన్ని ఎన్నడూ చూడలేదు. నేనీ వ్యాసాన్ని టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి రాస్తున్నాను. ఇక్కడి కోర్టులోని ఉగ్రవాద సంబం«ధమైన ఒక కేసు విచారణకు పరిశీలకునిగా నేను వచ్చాను. అంత ర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ టర్కీ శాఖ చైర్పర్సన్కు, డైరెక్టర్కు వ్యతిరేకంగా జరుగుతున్న విచారణ అది. నేను కూడా ఈ అంతర్జాతీయ ఉద్యమంలో భాగంగా ఉన్నానని, ఆమ్నెస్టీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్నని పాఠ కుల్లో కొందరికి తెలిసి ఉండొచ్చు. ఇదిల్ ఆసెర్, తనెర్ కిలిక్ అనే నా సహచరులు ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులనే ఆరోపణతో ఆ విచారణ జరుగుతోంది. కొన్ని వారాల క్రితం బెయిల్ లభించిన ఇదిల్ను కోర్టు బయట కలుసుకున్నాను. తనెర్, జూన్ నుంచి ఇస్తాంబుల్కు 500 కిలోమీటర్ల దూరంలోని ఇజ్మిర్ జైల్లో బందీగానే ఉన్నాడు. అక్కడి నుంచే అతడు వీడియో లింకు ద్వారా విచారణలో పాల్గొన్నాడు. డిజిటల్ భద్రతపై ఒక హోటల్లో జరిగిన వర్క్షాప్కు ఈ కార్యకర్తలిద్దరూ హాజరైన తర్వాత వారిపై ఈ ఆరోపణలను మోపారు. ఆ హోటల్ జరిగినది, గూఢ చార కార్యకలాపాలు, కుట్రలో పాల్గొనడం కోసం జరిపిన రహస్య సమావేశమని ప్రభుత్వం మూర్ఖంగా వాదిస్తోంది. జర్మనీ, స్వీడన్లకు చెందిన ఇద్దరు విదేశస్తులు కూడా ఈ వ్యవహారంలో విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే వారు బెయి ల్పై బయటే ఉన్నారు. ఈ కేసు మొత్తంగా ఉత్త డొల్ల. తన ఫోన్లోకి బైలాక్ అనే ఒక ఆప్ను డౌన్లోడ్ చేసుకున్నాడనేది తనెర్పై మోపిన ప్రధాన ఆరోపణ. ఎన్క్రిప్టెడ్ (నిక్షిప్త) సమాచార మార్పిడికి వాడే ఆప్ (వాట్సాప్ లాంటిది) అది. గత ఏడాది తిరుగుబాటుకు జరిగిన కుట్రకు ముందు, దాని మద్దతుదార్లు రహస్య సమాచా రాన్ని చేరవేయడానికి బైలాక్ను ఉపయోగించారని ప్రభుత్వ అరోపణ. తనెర్ ఆ ఆప్ను వాడాడనే ఆరోపణకు ఎలాంటి ఆధారమూ లేదు. ఆమ్మెస్టీ తనెర్ ఫోన్ను రెండు సార్లు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది. రెండూ ఆ ఫోన్లో బైలాక్ ఉనికికి సంబంధించిన ఆనవాళ్లు సున్నా అన్ని తేల్చాయి. ఈ పరీక్షల్లో ఒకటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థ సెక్యూర్ వర్క్స్ నిర్వహించినది. కోర్టు విచారణలో ఒక నిపుణుడు ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఆ రోజు ఉదయాన్నే మేం జస్టిస్ ప్యాలెస్ అని పిలిచే ఆధునిక వర్తులాకార భవనం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించాం. ఆ భవనంలో చాలా కోర్టు గదు లున్నాయి. విపరీతంగా చలి, గాలులు ఉన్నా, మా నిరసనకు పలు పౌర సమాజ బృందాలు, వ్యక్తులు హాజరయ్యారు. విదేశీ పరిశీలకులలో ఆమ్నెస్టీ బ్రెజిల్, బ్రిటన్ శాఖల చైర్పర్సన్లు, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి దౌత్యవే త్తలు కూడా ఉన్నారు. ఆ మానవహక్కుల పరిరక్షకులకు మద్దతుగా చేసిన ప్రకట నను చదివి వినిపించారు. మాతోపాటూ తనెర్ 19 ఏళ్ల కుమార్తె గుల్నిహల్ కూడా ఉంది. మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం. కోర్టులో లాయర్లు తదితర అధికా రులుగాక, 120 మంది పడతారు. గదంతా నిండిపోగా, చాలా మంది బయట నిల బడాల్సి వచ్చింది. కోర్టులో ముగ్గురు న్యాయమూర్తులున్నారు. వారికి ఒక పక్కన ప్రాసిక్యూటర్ కూడా కూర్చొని ఉండటం అసక్తికరంగా ఆనిపించింది. ఆరు గంట లకుపైగా సాగిన ఆ విచారణలో అతను ఒకే ఒక్క సారి, అదీ కొద్ది సేపే మాట్లాడాడు. ఎక్కువ సమయం తీసుకున్నది తనెర్ తర ఫు న్యాయవాదే. డిఫెన్స్ తరఫున నిపుణుడైన సాక్షి బైలాక్ ఆప్ సమస్య గురించి వివరంగా మాట్లాడాడు. తనెర్ ఫోన్ లోని సాఫ్ట్వేర్ను కాపీ చేసుకున్నాక పోలీసులు తిరిగి ఇచ్చేశారు. తనెర్ ఎన్నడూ బైలాక్ను డౌన్లోడ్ చేసుకుని ఉండే అవకాశమే లేదని అతను నిర్ధారించాడు. కుట్ర యత్నం తర్వాతి వరకు తాను బైలాక్ గురించి వినలేదని తనెర్ సాక్షిగా చేసిన ప్రక టనలో తెలిపాడు. అయినా. మొదటి విచారణలో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయలేదు. ఆ విచారణ పూర్తయ్యాక నా సహచరుడు జాన్ డల్ హూసెన్ ‘‘ఏ ఆధా రాలూ లేకుండా రావడానికి ప్రాసిక్యూటర్కు మూడు నెలలకు పైగా పట్టింది. ఈ కేసును కొట్టి పారేయడానికి న్యాయమూర్తికి అరగంట కూడా పట్టదు’’ అన్నాడు. కానీ కేసును కొట్టేయలేదు. నేను ఇప్పుడు వర్ణిస్తున్నది రెండో దఫా విచా రణనే. మధ్యలో కూచున్న సీనియర్ న్యాయమూర్తి, నిపుణుణ్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. విచారణ జరుగుతున్నంత సేపూ సత్యానికి అనుకూలంగానే తీర్పు వస్తుందనే మాకు అనిపించింది. విచారణంతా టర్కిష్ భాషలోనే జరిగింది. నిపుణుడు చెప్పిన సాక్ష్యం కలిగించిన ప్రభావం ఎలాంటిదో అంచనా వేయడం కష్టం కాలేదు. తనెర్ సూటిగా, ఉద్వేగరహితంగా తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేనందున బెయిల్పై తనను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాడు. రోజంతటిలో ప్రాసిక్యూటర్ మాట్లాడిన ఏకైక వాక్యాన్ని విన్నాం. ప్రభుత్వం బెయిల్ను వ్యతిరేకిస్తున్నది అని చెప్పాడు. ఆరు గంటలకు పైగా సాగిన విచారణ తర్వాత న్యాయవాదులు, నిందితులు తప్ప మిగతా అంతా ఖాళీ అయిపోయింది. మమ్మల్ని బయట వేచి ఉండమ న్నారు. ఆ తర్వాత బెయిల్ నిరాకరించారని మాకు చెప్పారు. ఆ వార్త మాకు అందరికీ దిగ్భ్రాంతిని కలుగచేసింది, చిన్న పిల్ల గుల్నిహల్ ఆ మాటకు గుండె చెదిరిపోయింది. చాలా ఏళ్లుగానే నేను కోర్టు విలేకరిగా పనిచేస్తున్నా మానవ హక్కుల కోసం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదంతో ముడి పెట్టి ఇంత నిస్సిగ్గుగా అణచివేయడాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదు. మన ప్రభుత్వం కూడా ఒక ప్రతినిధిని పంపి ఉంటే బావుండేదని నా అభిప్రాయం. తదుపరి విచారణకైనా అ పనిచేస్తారని ఆశిస్తాను. ఇది, టర్కీతో మనం తప్పక ప్రస్తావించాల్సిన సమస్య. ఒక భారతీయునిగా, చరిత్ర విద్యార్థిగా నాకు టర్కీలో జరిగింది నిరుత్సాహం కలిగించింది. వెయ్యేళ్ల క్రితం తురుష్కులు మన దేశానికి రావడానికి ముందు నుంచీ టర్కీ ప్రజలతో మనకు సాంస్కృతిక సంబంధాలున్నాయి. మన దేశ ముస్లిం పాల కులలో పలువురు టర్కీకి చెందినవారు. మొహమ్మద్ గజినీ తురుష్క మూలాలు న్నవాడు. బాబర్, చంగ్తార్ తురుష్కుడు. మైసూర్ పాలకుడు టిప్పు కూడా తన పూర్వీకులు తురుష్కులేనని తనను ‘సుల్తాన్’గా పిలిపించుకునేవాడు. అటువంటి గొప్ప, సుప్రసిద్ధులైన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే టర్కీ ప్రభుత్వం నా సహచ రులపై విచారణను మరింత మెరుగైన పద్ధతిలో నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను. నా సహచరులు టర్కీ ప్రజల హక్కుల కోసం, వారి బాగు కోసం పనిచేస్తున్నవారు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com -
మతిమాలిన వారి గతి తప్పిన తర్కం
పాపిష్టి, చెడ్డ వస్తువులనే 28% శ్లాబు కింద ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది అంటూ, వాటి జాబితాను ఇంచుమించు 50కి తగ్గించారు. ప్రైవేటు విమానాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై 28% పన్ను విధించారు. ద్విచక్ర వాహనం ఉండటం ఏ విధంగా పాపిష్టిది లేదా చెడ్డది? విలాసవంతమైన పెద్ద కారు టైరుపైన, సైకిల్ వాలా టైరుపైన కూడా 28% పన్నే. ఎయిర్ కండిషనర్లు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, వాటర్ హీటర్లు అన్నీ విలాస వస్తువులే అనవచ్చేమో. ‘చెడ్డ’ వస్తువుల ఎంపికలో బుర్రను ఉపయోగించకపోవడమే పెద్ద సమస్యని అనిపిస్తుంది. ఈ వారం, మళ్లీ ఒకసారి కొన్ని వస్తువులపై పరోక్ష పన్నులను తగ్గించారు. ఇది సాధారణంగా మూడు కారణాల వల్ల జరుగుతుంటుంది. ఒకటి, కొన్ని వస్తువులు రాజకీయంగా సున్నితమైనవి కావడం వల్ల. ఉదాహరణకు, గుజరాత్లో ఖాక్రా (కరకరలాడే రొట్టెలాంటి ఉపాహారం) వంటి వస్తువులను మరింత ఖరీదైనవిగా చేస్తే, ప్రతికూలమైన పతాక శీర్షికలను చూడాల్సి వస్తుంది. రెండు, కొన్ని వస్తువులు మరింత ఖరీదైనవిగా మారడం వల్ల వాటి అమ్మకాలు తగ్గి, ఆర్థిక వ్యవస్థను ప్రభా వితం అవుతుందని ప్రభుత్వం భావించడం వల్ల. మూడు, ఫలానా వస్తువులను ఎక్కువ పన్ను విధించాల్సినవిగా పొరపాటున వర్గీకరించామని భావించడం వల్ల. పరోక్ష పన్నులన్నీ సంపన్నులపైన, పేదలపైన ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి అవి చెడ్డవి. నేను, మా డ్రైవర్ ఇద్దరమూ కోకా కోలాకు ఒకే ధర చెల్లిస్తాం. కాబట్టి, ఆదాయం పన్ను వంటి ప్రత్యక్ష పన్నులే మంచి ప్రభావాన్ని చూపుతాయి. వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో 0%, 0.25%, 3%, 5%, 12%, 18%, 28% అనే ఏడు శ్లాబులున్నాయి. వీటిలో ఏ వస్తువుపై ఏ రేటున పన్ను విధించాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాతినిధ్యం ఉన్న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ఏ వస్తువులను 0% శ్లాబు కింద, ఏ వస్తువులను 28% శ్లాబు కింద ఎందుకు ఉంచారో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తి. గత శుక్రవారం వరకు 28% శ్లాబులో 227 వస్తువులు ఉండేవి. చూయింగ్ గమ్ నుంచి వాక్యూం ఫ్లాస్కులు, బట్టల దుకా ణాల్లో వస్త్ర ప్రదర్శనకు వాడే బొమ్మల వరకు అందులో చేర్చారు. జీఎస్టీ కౌన్సిల్ తాజా సమావేశం తదుపరి ఆ విభాగంలో కేవలం 50 వస్తువులే ఉన్నట్టున్నాయి. ఏ వస్తువుపై మనం ఎక్కువ పన్నును చెల్లించాలో జీఎస్టీ కౌన్సిల్ ఎలా నిర్ణయిస్తుంది? ప్రభుత్వం దీన్ని తన సొంత తర్కం ప్రాతిపదికపైనే నిర్ణయిస్తుంది. అది వస్తువు లను ‘పాపిష్టి’ వస్తువులు లేదా చెడ్డ వస్తువులుగా గుర్తిస్తుంది. ఈ చెడ్డ వస్తువుల జాబితాను తగ్గిస్తున్నట్టు ప్రకటిస్తూ బిహార్ ఉప ముఖ్య మంత్రి సుశీల్ మోదీ... 28% శ్లాబు కింద ఉన్న చూయింగ్ గమ్, చాక్లెట్లు, షేవింగ్ వస్తువులు, బట్టలు ఉతికే పౌడర్లను 18% శ్లాబులోకి మారుస్తున్నట్టు తెలిపారు. ‘‘పాపిష్టి, చెడ్డ వస్తువులు మాత్రమే 28% వర్గం కింద ఉండాలని (కౌన్సిల్) ఏకా భిప్రాయం’’ అని కూడా చెప్పారు. భారత ప్రభుత్వం, రాజకీయ వేత్తలు ఏది పాపిష్టి లేదా చెడ్డ వస్తువు అని ఎలా నిర్ణయిస్తారనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఒకటి, క్రైస్తవ సాంప్రదాయానికి చెందిన ‘పాపం’ అనే భావన హిందూ మతంలో లేదు. బైబిల్లోని పాపం దేవునికి వ్యతిరేకంగా చేసిన నేరం. క్రెస్తవంలోని పాపం కిందకు సోమరితనం, భోగలాలసత కూడా వస్తాయి. హిందువులలో ఈ భావన లేదు. అయితే, సామాన్యార్థంలో పాపం అంటే అనైతికమైనది లేదా అనైతికతను పెంపొందింపజేసేది లేదా అలా అనిపించేది... మద్యం వంటివి. కానీ మద్యం జీఎస్టీ జాబితాలో లేనే లేదు. రాష్ట్రాలు తమకు ఇష్టమొచ్చిన రేటుతో మద్యంపై పన్ను విధించవచ్చు. ఈ వాస్తవం మూలంగా మద్యం చౌకగా దొరికే వీలుండటమే విచిత్రమైన సంగతి. ముంబైలోని ఏ రెస్టారెంట్కు వెళ్లినా,ఆహారంపై 18%, మద్యంపై 10% విలువ ఆధారిత పన్ను చెల్లించాలి. ఇది మన çపన్నుల వ్యవస్థ లోప రహితమైనది కాదని తెలుపుతుంది. ఇక చెడ్డ వస్తువు విషయం మరింత జటిలమైనది. ఏ వసువులను లేదా సేవ లను వినియోగించడం సామాజికంగా అవాంఛనీయం అని భావిస్తే అవన్నీ చెడ్డవే. మద్యం వీటిలో భాగమే. పొగాకును, ప్రత్యేకించి ఇటీవలి కాలంలో జంక్ ఫుడ్ను కూడా అలాగే భావిస్తున్నారు. అందువల్లనే మనం పాపిష్టి, చెడ్డ వస్తువుల జాబితా వైపు ఓసారి దృష్టి సారించడం అవసరం. మీ ఇళ్లకు, కార్యాలయాలకు వేసే రంగు లను, కళాకారులు వాడే రంగులను, షూ పాలిష్ను కూడా అందులో చేర్చారు. అతి నిరుపేద వీధి కార్మికులు కూడా షూ పాలిష్ను కొని, ఉపయోగిస్తారు. అలాంటి వారిని శిక్షించడం దేనికి? ఇవి పాపిష్టివి అని లేదా చెడ్డవి అని అనడానికి ప్రాతి పదిక ఏమిటో ఊహకు అందేది కాదు. ఇకపోతే ఆ జాబితాలో టపాసులు ఉన్నాయి. అవెలాగూ పేదలకు అందుబాటులోనివి కావు. కానీ అగ్నిమాపక సాధ నాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇది చూసి నేను నిర్ఘాంతపోయాను. భద్రతా ప్రమాణాలు ప్రపంచంలోనే అతి తక్కువ స్థాయిలో ఉన్న దేశంలో... ఆ ప్రమాణాలకు కట్టుబడటాన్ని ఖరీదైనదిగా ఎందుకు మార్చినట్టు? ప్రైవేటు విమా నాలు, కార్లు, ద్విచక్రవాహనాలపై 28% పన్ను విధించారు. ద్విచక్ర వాహనం ఉండటం ఎలా పాపిష్టిది లేదా చెడ్డది. టైర్లపైనా అదే పన్ను. అంటే విలాసవంత మైన పెద్ద కారున్న వ్యక్తిలాగే సైకిల్ వాలా కూడా టైరుపై అంతే పన్ను చెల్లించాలి. ఎయిర్ కండిషనర్లు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, వాటర్ హీటర్లు అన్నీ ఈ వర్గం కిందనే చేర్చారు. మనలాంటి దేశంలో అవన్నీ విలాస వస్తువులేనని మరో సారి వాదించవచ్చు. కానీ, ఈ వస్తువులను ఎంపిక చేసేటప్పుడు బుర్రను ఉప యోగించకపోవడమే పెద్ద సమస్యని నాకు అనిపిస్తుంది. పాన్ మసాలాపై 28% పన్ను. కానీ తమలపాకుల మీద పన్ను 0%. రెండూ ఒకే అలవాటను ప్రోత్సహిం చేవే. వీటిలో ఒకటి ఎలా చెడ్డ వస్తువు అయ్యిందో స్పష్టత లేదు. జీఎస్టీ శ్లాబు లన్నిటినీ ఓసారి చూడాల్సిందిగా పాఠకులను ప్రోత్సహిస్తున్నాను (ఆన్లైన్లో ఛిb్ఛఛి.జౌఠి.జీn వంటి వెబ్సైట్లలో లభిస్తుంది). తద్వారా జీఎస్టీ వర్గీకరణ తర్క బద్ధంగా ఉందో లేదో వారు తమంతట తామే నిర్ణయించుకోగలుగుతారు. అసలు విషయం ప్రభుత్వాన్ని తప్పుపట్టాలనేది కాదు. ప్రతిపక్షాల పాలన లోనివి సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ జీఎస్టీ కౌన్సిల్లో భాగంగా ఉన్నాయి. ప్రజలు నిర్వచించిన పాపం లేదా చెడు అనే విషయాలపై ఎలాంటి చర్చా లేకుండా పౌరులను వారు నామమాత్రమైన వారుగా భావించారా లేదా అనేదే సమస్య. దీన్ని ముగిస్తూ ఓ విషయాన్ని చెప్పాలి. కాలమిస్టులు, స్వతంత్ర పాత్రికేయులు ఆర్జించే డబ్బుపై జీఎస్టీ లేదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com -
ఆర్థిక భావజాలం పూర్తిగా కొరవడిందా?
♦ అవలోకనం బీజేపీకి ఆర్థిక తాత్విక భావజాలం లేదని చిదంబరం అన్నారు. బీజేపీ వెబ్సైట్ మోదీ భావజాలంగా పేర్కొన్న ‘హిందుత్వ’ అంటే గోవధ, ఆలయం సమస్య, లవ్ జిహాద్, అడపాదడపా ఆర్థిక, విదేశాంగ విధానాలకు సంబంధించి యథాలాపంగా ఏవో చర్యలు చేపట్టడం మాత్రమే అయితే... మనం అనుకుంటున్న దానికంటే ఎక్కువ లోతైన సమస్యలో ఇరుక్కుపోయాం. మన ప్రధానికి ఏదైనా భావజాలం అంటూ ఉన్నదా? ఆయన పార్టీ వెబ్సైట్ ఆయనది హిందుత్వ భావజాలంగా పేర్కొని, ప్రచారం చేస్తోంది. అయినా ఈ ప్రశ్న అడగడం విడ్డూరంగా అనిపించవచ్చు. మనకున్న అత్యంత వివేచనాపరు లైన రాజకీయవేత్తల్లో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఒకరు. ఆయన, ప్రధాని పార్టీౖయెన బీజేపీకి భావజాలమని చెప్పుకోదగ్గది ఏమీ లేదని అన్నారు. కాబట్టే ఈ ప్రశ్న అడగాల్సి వస్తోంది. ‘‘ప్రభుత్వం, ప్రజా సంక్షేమం, ఆరోగ్యం, విద్యా సదుపాయాలను పెంపొందింపజేసి సమానత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషిచేసేదిగా ఉండటమా? లేక పూర్తి స్వేచ్ఛా విపణి వైఖరిని చేపట్టడమా? అనే అంశంపై తీసుకునే తాత్విక వైఖరికి సంబం ధించి బీజేపీ స్థానం ఎక్కడని మీరు అనుకుంటున్నారు?’’ అని ఒక వ్యాపార దిన పత్రిక చిదంబరాన్ని అడిగింది. జవాబు చెప్పడానికి ఇది సరళమైన ప్రశ్నేమీ కాదు. స్వేచ్ఛా విపణి వైఖరి అంటే ప్రభుత్వం ఆర్థికవ్యవస్థలో జోక్యం చేసుకోదు. ప్రతిదీ పైవేటు పాత్రధారులకే వదిలేస్తుంది. ఇంచుమించుగా దీన్ని ఆన్ రాండ్ లాంటి వారు రాసిన సమాజం వంటిదని అభివర్ణించవచ్చు. వారు చెప్పిన సమాజంలో ధీరోదాత్తులైన పెట్టుబడిదారులు తమ మధ్య పోటీ ద్వారా ప్రపం చాన్ని మరింత మెరుగైనదిగా మారుస్తారు, అసమర్థ ప్రభుత్వం అందులోకి తల దూర్చదు. విద్య, వైద్యం సహా సకల రంగాలను అది ప్రైవేటు రంగానికే వది లేస్తుంది. పౌరులు తమంతట తాముగానే ఆ అవసరాలను తీర్చుకోవాలని చేతులు దులుపుకుంటుంది. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ అలాంటి స్వేచ్ఛా విపణి వ్యవస్థ సమర్ధ్థకు లని అనుకునేవారు. కాంగ్రెస్కు ‘సోషలిజం’ వైపు మొగ్గు చూపేదిగా గుర్తింపు ఉంది. స్వేచ్ఛావిపణి వ్యవస్థ దానికి భిన్నమైనది. అయితే గత మూడేళ్లుగా మహా త్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎమ్జీఎన్ఆర్ఈజీఏ) తదితర ‘సోష లిస్టు’ పథకాలు కొనసాగుతూనే ఉన్న మాట నిజమే. ఎమ్జీఎన్ఆర్ఈజీఏను రద్దు చేస్తామని మోదీ అన్నారు. కానీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పాత్రకు సంబంధించి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ)కి, మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యునై టెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ)కి మధ్య తేడా ఏమీ లేనట్టే కనిపిస్తోంది. చిదంబరం తన సమాధానంలో విసిరిన సవాలు ఇదే.‘‘బీజేపీకి తనదైన కీలక ఆర్థిక భావజాలం లేదా తాత్వికచింతన ఏదీ లేదు. హిందుత్వ, ఆధికసంఖ్యాకవాద ప్రభుత్వం మాత్రమే బీజేపీ కీలక భావజాలంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వానికైనా తనకంటూ ఓ కీలక ఆర్థిక తాత్వికత ఉండాలి. అప్పుడే అటు వామపక్షం నుంచి ఇటు మితవాదపక్షం వరకు ఉండే విభిన్న భావజాలాల వర్ణమాలికలో దాని స్థానం ఏదో తెలుస్తుంది. అది లేదు కాబట్టే అది అంతటా తారట్లాడుతోంది’’ అన్నారు ఆయన. కటువైన ఈ మాటలను ప్రత్యర్థి ఆరోపణలుగా తేలికగా తీసేయవచ్చు. కానీ నేను కాంగ్రెస్ ఓటర్ని కాను. అయినా నాకు, చిదంబరం ఈ వాదనను ఎక్క డికి తీసుకుపోతున్నారో తెలుసుకోవడం ముఖ్యమనే అనిపిస్తోంది. బీజేపీ వైఖరిని ‘‘కాంగ్రెస్ వైఖరితో పోల్చి చూడండి. ఈ (పైన చెప్పిన) పథకాల అమలులో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని నేనే మొదట అంగీకరిస్తాను. అయితే, కాంగ్రెస్ మూడు లేదా నాలుగు అంశాలను తన కీలక తాత్వికసారంగా నిర్వచించుకుంది. వాటిలో మొదటిది, ఎవరూ ఆకలితో లేదా పస్తులతో చావరాదు. అందుకే మేం ఎమ్జీఎన్ ఆర్ఈజీఏ, జాతీయ ఆహార భద్రతా చట్టం తెచ్చాం.’’ తమ పార్టీ కీలక భావజాలాన్ని నిర్వచించేవిగా ఆయన ఇతర అంశాలను సైతం పేర్కొన్నారు. గర్భిణులు, బాలింత తల్లులు, ఐదేళ్లలోపు పిల్లల సంక్షే మమూ, రోగనిరోధక కార్యక్రమం సహా ప్రజారోగ్యం కోసం కృషిచేయడమూ, జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం తదితరాలను ఆయన ఉదహరించారు. ఆర్థికవ్యవస్థలో ‘‘ఈ ప్రభుత్వ జోక్యాలు.. కాంగ్రెస్ భావజాల సారానికి సంబంధిం చిన విశ్వాసాలు, తాత్వికత’’ అని చిదంబరం అన్నారు. మోదీ దృక్పథంలో అలాంటి నిర్దిష్ట దిశ అనేది ఏదీ కనబడదని చెప్పారు. గోరఖ్పూర్లో 282 మంది పిల్లల మృతిని ప్రస్తావిస్తూ ‘‘అది, కేంద్ర ప్రభు త్వంపైన ప్రభావాన్ని చూపడం లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైనా ప్రభావం చూపడం లేదు. అది ఎవరి హృదయాన్నీ కదలించడం లేదు... దీపావళి రోజున వారణాసిని దీపాలతో దేదీప్యమానం చేయడం, హిందుత్వ తాత్వికతకు సంకే తంగా నిలిచే ఆలయ నిర్మాణం... వారికి శిశు/మాతా మరణాల రేటు కంటే, పోషకాహారలోపం లేదా ఆకలి కంటే ఎక్కువ ముఖ్యమైనవి.’’ బీజేపీకి, ప్రత్యే కించి మోదీకి తమ చర్యలన్నిటికీ హేతువుగా నిలిచే భావజాలం లేదా దృక్పథం అంటూ ఏదైనా నిర్దిష్టంగా ఉన్నదా? అదే అసలు ప్రశ్న. లేకపోతే చిదంబరం చెప్పినట్టు వారు చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, పెద్ద నోట్ల రద్దు, మెరుపు దాడులు, బుల్లెట్ ట్రైన్, స్టార్టప్ ఇండియా, జీఎస్టీ వంటి బృహత్ చర్యలన్నీ చర్యలన్నిటినీ ఒకదానితో మరో దాన్ని అనుసంధానించే పొంతన గల సమగ్ర భావజాల కథనం ఏదీ లేకపోవడం నిజమేనా? లేక ఇవన్నీ ఒక గొప్ప, పరిపూర్ణతలో భాగమా? లేక అవి ఒకదానితో మరోదానికి సంబంధం లేని, అర్థం లేని విడి విడి భాగాలేనా? బీజేపీ ఓటర్లు సహా మనల్ని అందరినీ వేధిస్తున్న ప్రశ్న, అందరం అడగాల్సిన ప్రశ్న ఇదే. కాంగ్రెస్, తాను కొన్ని నిర్దిష్ట సమస్యలపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయ త్నించానని చెబుతోంది. వాటి ఉద్దేశాలు మంచివే. అయినా, వాటిని అమలు చేయగల సామర్థ్యం తనకు ఉందని అది మనల్ని ఒప్పించ లేదు నిజమే. అయినా అది గత ప్రభుత్వం. ఇప్పుడు ఇక బీజేపీనే తాను ఏమి చేయాలని కోరుకుంటోంది, దాని బృహత్ కథనం (సమగ్ర ప్రణాళిక) ఏమిటో వివరించాల్సి ఉంది. వ్యక్తిగ తంగా నేనైతే, చిదంబరం చెప్పింది తప్పు కావాలనే కోరుకుంటాను. ఐదేళ్లలో లేదా పదేళ్లలో తాము సాధించాల్సినవి ఏమిటి? అనే విషయంపై దృష్టిని కేంద్రీ కరించి ఎన్డీఏ ఆలోచిస్తూ ఉండి ఉండాలని ఆశిస్తాను. మోదీ భావజాలంగా బీజేపీ వెబ్సైట్ పేర్కొన్న ‘హిందుత్వ’ అంటే గోవధ, ఆలయం సమస్య, లవ్ జిహాద్, వీటికి తోడుగా అడపాదడపా ఆర్థిక, విదేశాంగ విధానాలకు సంబంధించి యథాలాపంగా ఏవో చర్యలు చేపట్టడం మాత్రమే అయితే... మనం అనుకుం టున్న దానికంటే ఎక్కువ లోతైన సమస్యలో ఇరుక్కుపోయాం. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
పౌరుల దృష్టి మళ్లించే ఈ–దర్బార్లు ఆపండి!
అవలోకనం మన విదేశాంగ విధానపరమైన కృషిలో చాలా వరకు ప్రధాని కార్యాలయం నుంచే సాగుతోంది. దీంతో సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా ‘చురుగ్గా పనిచేసే’ మంత్రిగా కనిపిస్తున్నారు. ఒకటి రెండు కేసులను పరిష్కరించడం ద్వారా ఆమె నిజానికి వ్యవస్థాపరమైన మెరుగులపై నుంచి, దాని పనితీరుపై నుంచి దృష్టిని మరలిస్తున్నారు. మొగలాయిలు భారతదేశాన్ని జయించాక, అంతకు మునుపటి రాజుల రివాజైన రాజదర్శనాన్ని కొనసాగించారు. మొగల్ చక్రవర్తి పర్యటనలో ఉన్నప్పుడు తప్ప, ప్రతి రోజూ ప్రజలు తనను ‘చూడటానికి’ బాల్కనీలో నిల్చునేవాడు. ఈ దర్శనం, విగ్రహాన్ని చూడటం లాంటిదే. ఆ దర్శనం సామ్రాజ్యం పదిలంగా ఉన్నదని పౌరు లకు భరోసా కలిగించడం కోసమే. చక్రవర్తి గైర్హాజరీలో రాజ్యమంతటా వెంటనే పుకార్లు వ్యాపించి, అరాచకం నెలకొనేది. అందువల్లనే ఈ దర్శనం ముఖ్యమైనదిగా మారింది. 1627లో, జహంగీర్ చనిపోయినప్పుడు నేరస్తులు నగరాలను ఆక్రమిం చారని, వర్తకులు తమ వస్తువులను నేలలో పాతిపెట్టాల్సి వచ్చిందని జైన వర్తకుడు బనారసీదాస్ తన స్వీయ జీవిత చరిత్ర అర్థకథానక్లో రాశారు. మొగల్ రాకుమా రుడు కుర్రం వారసత్వ యుద్ధంలో నెగ్గి, షాజహాన్ పేరుతో చక్రవర్తి అయ్యాడనే వార్త దేశవ్యాప్తంగా వ్యాపించే వరకు ఈ గందరగోళం అలాగే ఉండి పోయింది. నిజానికి జహంగీర్ చక్రవర్తుల్లోకెల్లా ఎక్కువ సోమరి. అతిగా మద్యం లేదా నల్లమందు సేవించడం వల్ల సాయంత్రం దర్బారు అర్ధంతరంగా ముగుస్తుండేదని యూరోపియన్ పర్యాటకులు నమోదు చేశారు. జహంగీర్ చక్రవర్తి దర్శన కార్యక్ర మానికి న్యాయమనే కొత్త అంశాన్ని చేర్చారు. రాజప్రాసాదంలో ఒక గొలుసును వేలాడదీసి ఉంచేవారని, సమస్యలున్న సామాన్య పౌరులెవరైనా దాన్ని లాగవచ్చని చెప్పేవారు. ఆ గొలుసుకు ఓ గంట కట్టి ఉండేదని, అది మోగినప్పుడల్లా చక్రవర్తి, వ్యవస్థ నుంచి పొందలేకపోయిన న్యాయాన్ని చేయడానికి బయటకు వచ్చేవారని అంటారు. దీన్ని అదిల్ ఎ జహంగీర్ లేదా జహంగీర్ న్యాయం అనేవారు. అది పౌరులందరికీ తక్షణ న్యాయాన్ని అందించేది. అయితే ఇదంతా ఉత్త బూటకమే. చక్రవర్తులెవరికీ, ప్రత్యేకించి జహంగీర్కు అంతటి తీరిక ఉండేది కాదు. నేనింతకు ముందే చెప్పినట్టు అతడు సోమరి, స్వార్థపరుడు. న్యాయం చేయడంలో ఆసక్తికి అతడు ఆమడ దూరంలో ఉండటమే కాదు, మహా క్రూరుడు. ఇద్దరు వ్యక్తుల కాలి వెనుక పిక్కలను కోసేయించి, వారికి శాశ్వత వైకల్యాన్ని కల్పించిన వాడు. అడవిలో వాళ్లు చేసిన అలజడికి, జహంగీర్ తుపాకీ గురిపెట్టి చంపాలని చూస్తున్న పులి భయ పడి పారిపోయింది. అదే వాళ్లు చేసిన నేరం. తుజుక్ ఎ జహంగీరి అనే తన స్వీయ జీవిత చరిత్రలో ఈ విషయాన్ని రాసుకున్నాడు కాబట్టే ఇది మనకు తెలిసింది. కాబట్టి అదిల్ ఎ జహంగీర్ తెరచాటున భారతదేశంలో నెలకొని ఉండిన సర్వ సాధారణ పరిస్థితి అదే. అది నేటికీ కొనసాగుతోంది. పాలకులు, ప్రత్యక్ష జోక్యం ప్రదర్శనను రక్తి కట్టించడంలో ఆసక్తిని చూపవచ్చు. అంతేగానీ, ప్రపంచం లోని అత్యధిక భాగంలో జరుగుతున్నట్టుగా వ్యవస్థాగతంగా అందుతున్న సహా యానికి, సేవలకు హామీని కల్పించడంపై మాత్రం ఆసక్తిని చూపరు. సుష్మా స్వరాజ్ ట్విటర్ ఖాతా అదిల్ ఎ జహంగీర్కు ఆధునిక అవతారం కావడం వల్లే ఇది రాస్తున్నాను. ఆమె ట్విటర్ ఖాతా నుంచి ఇటీవల పతాక శీర్షికలకు ఎక్కిన కొన్ని ఇవి. ‘బిడ్డ అస్వస్థత గురించి సుష్వా స్వరాజ్కు ట్వీట్ చేసి మెడికల్ వీసాను పొందిన పాకిస్తానీ’ (జూన్ 2). ‘లాహోర్ పసి బిడ్డ గుండె ఆపరేషన్కు సుష్మా స్వరాజ్ ఆపన్న హస్తం’ (జూన్ 11). ‘సౌదీ అరేబియా నుంచి కర్కలా నర్సు తిరిగి వచ్చే ఆశ లను పెంచిన సుష్మా స్వరాజ్ ట్వీట్’ (జూన్ 25). రియాద్లోని భారత రాయబార కార్యాలయపు ట్విటర్ ఖాతాకు స్వరాజ్ పంపిన ఈ ప్రత్యేక ట్వీట్లో ఆమె, ‘‘జావెద్: ఈ మహిళను కాపాడటానికి దయచేసి సహాయం చేయండి’’ అని రాశారు. ఒక వార్తా కథనం నుంచి ఆమె ఆ మహిళను గుర్తించారు. అక్టోబర్ 27, శుక్రవారం రోజున స్వరాజ్ దుబాయ్లోని భారత కాన్సల్కు ‘‘విపుల్ – దయచేసి అతను తన తల్లి అంత్య క్రియలకు చేరుకునేలా సహాయపడండి’’ అనీ, మరెవరి ప్రయాణ పత్రాలనో భోపా ల్లోని భారత పాస్పోర్ట్ ఆఫీసుకు పంపమని రాశారు. ఆమె చేస్తున్న ఈ ట్వీటింగ్ను మీడియా క్రియాశీలమైన, సానుభూతిగల రాజ కీయవేత్త చర్యలుగా చూపుతోంది. ట్విటర్ ద్వారా ఒకటి రెండు కేసులను పరి ష్కరించడం ద్వారా ఆమె నిజానికి వ్యవస్థాపరమైన మెరుగులపై నుంచి, దాని పనితీరుపై నుంచి దృష్టిని మరలుస్తున్నారు. పౌరులు తమ సమస్యలకు పరి ష్కారం భారత విదేశాంగ మంత్రి చూపే వ్యక్తిగత శ్రద్ధ మాత్రమేనని నమ్మేలా తప్పు దోవ పట్టిస్తున్నారు. మేడమ్ ట్వీట్లపై శ్రద్ధ చూపడం కోసం దౌత్యవేత్తలు, ఉన్నతాధికారవర్గం వ్యవస్థాగతమైన తమ పనులను వదిలిపెట్టాల్సివస్తోంది. పాకిస్తాన్పై పొందికైన విదేశాంగ విధానమే మనకు లేదు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లేదా మయన్మార్ విషయంలోనూ అంతే. అయితే, ఈ–దర్బార్ లేదా ఈ–దర్శన్.. వ్యవస్థకు మరమ్మతులు చేసే గొప్ప నిపుణులు ఒకరు తలమునకలై పనిచేస్తున్న భ్రమను కలిగిస్తుంది. వ్యాధిగ్రస్తురాలైన పాకిస్తానీ బిడ్డకు శస్త్ర చికిత్స! ఊబకాయమున్న ఈజిప్ట్ మహిళకు బేరియాటిక్ శస్త్రచికిత్స! ఇలాంటి వీసాలకు ఒక కేంద్ర మంత్రి జోక్యం ఎందుకవసరమౌతోంది? ఏ నాగరిక దేశమైనా ఇలా ట్విటర్ ద్వారా వీసాలకు హామీని కల్పిస్తుందా? అమెరికా లేదా బ్రిటన్లు ఇలాగే చేస్తాయా? లేదు. వాటికి అందుకు తగ్గ యంత్రాంగాలున్నాయి. మనకు దర్బార్లున్నాయి. మన మంత్రులకు చేయడానికి మరే పనీ లేదా? నాకో క్రమబద్ధమైన ఉద్యోగం ఉంది. దానితో పాటే నా రాత పనీ చూసుకుంటా. అయినా నాకు ట్విటర్ కోసం సమయం చిక్కడం లేదు. ఆమెకు ఎలా దొరుకుతోంది? మన విదేశాంగ విధానంలో చాలావరకు ప్రధాని కార్యాలయం నుంచే సాగుతోందనే మాట నిజమే. చైనా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ వ్యవహారాలన్నీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పరిధిలోకి వస్తాయి. భారత విదేశాంగ విధానం మన నాగరికతా విలువల ప్రాతి పదికపై సాగాలనేది నెహ్రూవాద దృష్టి. అందుకు భిన్నంగా మోదీ ప్రధానంగా రక్షణ, ఉగ్రవాద దృక్కోణం నుంచి విదేశాంగ విధానాన్ని చూస్తుండటమే అందుకు కారణం. ఈ విధంగా తన వృత్తిపరమైన బాధ్యతలలో అత్యధిక భాగాన్ని ఇతరులు హస్తగతం చేసుకోవడంతో స్వరాజ్ తాను చేయదగిన ఇతర పనులను వెతుక్కో వాల్సి వస్తోంది. ట్విటర్ వాటిలో ఒకటనేది స్పష్టమే. అది, ‘చురుగ్గా పనిచేసే’ మంత్రిగా ఆమె ప్రముఖంగా కనిపించేలా చేస్తుంది. కనీసం మీడియాలోనైనా అలా కనిపిస్తారు. కానీ అలాంటి దర్శనం అవసరమేమీ లేదని ఆమెకు చెప్పాల్సి ఉంది. అది చేసేదేమైనా ఉందంటే దర్బారీ సంస్కృతిని పెంపొందింపజేయడమే. కొందరు వ్యక్తులకు అది ఉపయోగం చేకూర్చవచ్చు, కానీ వ్యవస్థకు ప్రతిబంధకమౌతుంది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ ఈమెయిల్ : aakar.patel@icloud.com -
అనాలోచిత పరిష్కారం.. అర్థరహిత నిషేధం
పంతొమ్మిది వందల ఎనభైల చివర్లో. తొంభైల మొదట్లో పలు సంవత్సరాల పాటూ నేను మా కుటుంబ జౌళి వ్యాపారం చేస్తుండేవాడిని. ఆ ఫ్యాక్టరీ, సూరత్ నుంచి దాదాపు గంట రైలు ప్రయాణం దూరంలోని అంకాలేశ్వర్లో ఉండేది. నేను సాధారణంగా మధ్యాహ్నం పూట ఫ్యాక్టరీకి వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చేవాణ్ణి. ఆ ఫ్యాక్టరీ టెక్స్చరైజింగ్ అనే ప్రక్రియ ద్వారా పాలియెస్టర్ దారంతో ధరించడానికి మరింత అనువుగా ఉండే ప్లాస్టికీ దారాన్ని తయారుచేసేది. ఈ ప్రక్రియ అత్యధిక వేగాలతో సాగేది కాబట్టి కూలింగ్ టవర్ ఉన్న భారీ ఎయిర్కండిషనింగ్ ప్లాంట్ అవసరమయ్యేది. ఆ టవర్కు నీటిని పంపే భారీ పైపు పగిలిపోయింది. దాని లోహపు గొట్టం అప్పడం ముక్కల్లా పెచ్చులుగా పగిలిపోయింది. అదలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. ఆ రోజున సాయంత్రం 6.30 ప్రాంతంలో స్టేషన్కు పోతుండగా పూర్తి యాసిడ్ పొగలతో నా గొంతు నిండిపోయి, ఊపిరి సలపలేదు. మా ఫ్యాక్టరీకి దగ్గర్లోని మరొక ఫ్యాక్టరీ ఆ సమయంలో క్రమం తప్పకుండా దేన్నోగానీ బయటకు వదులుతుంటుండేది. ఆ యాసిడ్ పొగ లోహాలను నాశనం చేయడానికి సరిపడేటంత ప్రమాదకరమైన ది. ఇక మనిషి ఊపిరితిత్తుల గురించి చెప్పనవసరమే లేదు. దేశంలోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లోనూ ఇది తరచుగా కనిపించేదే. సూరత్ శివారు ప్రాంతంలోని ఉద్నా, పందేసరాలో అద్దకం, ప్రింటింగ్ యూనిట్లు భూగర్భ జలాలను విషపూరితం చేసేలా ధగధగలాడే రంగు లను క్రమం తప్పకుండా నేరుగా బయటకు వదిలేసేవి. దీపావళి పండుగ సమయంలో ఢిల్లీలో టపాసుల అమ్మకాలను సుప్రీం కోర్టు నిషేధించిందన్న వార్త చదివి ఇది రాస్తున్నాను. ఢిల్లీ ఎప్పుడూ వెళ్లి వస్తుండే నేను అక్కడి గాలి నాణ్యతలో పెద్ద తేడా ఏమీ ఉన్నట్టు గమనించలేదు. అది కలుషితం అయి ఉందంటే, దేశంలోని ఇతర నగరాలలో అంత ఎక్కువగా లేదా అంతే తక్కు వగా కలుషితమైనదే. అసలు సమస్యంతా ఉన్నది అంకాలేశ్వర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లోనే. వాటితో పోలిస్తే అది కచ్చితంగా తక్కువగా కలుషితమైనది. అందు వల్లనే, ఢిల్లీలో ఒక రోజు ట్రాఫిక్ నిబంధనల చట్టాలు, ఇప్పుడిక టపాసుల నిషేధం వంటి చర్యలతో నిరంతరం ప్రయోగాలు చేస్తుండటం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రోజు కాల్చే టపాసులు కాలుష్యం స్థాయిలను ఎలా మార్చేస్తాయి? వాయు కాలుష్యం, కాలుష్యం మొత్తంగా దేశమంతా ఎదుర్కొం టున్న సమస్యలలో ఒకటని స్పష్టంగా తెలుస్తున్నదే. అలాంటప్పుడు ఇలాంటి అద్భుత మేధో పరిష్కారాలు కేవలం రాజధానికే పరిమితం కావడం దేనికి? ప్రస్తుత హిందూ జాతీయవాద వాతావరణంలో (అది కూడా విషపూరితమై నదే).. సుప్రీం కోర్టు తీర్పు ముస్లింలపై దాడికి ఉపయోగపడే మరో అస్త్రంగా మారింది. ఇక దీని తర్వాత హిందువులు శవదహనాన్ని తిరస్కరించాలని కోర తారా? అని ఓ బీజేపీ గవర్నర్ ప్రశ్నించారు. ఏ భారత న్యాయస్థానమైనా మేక లను వధించడాన్ని నిషేధించ సాహసిస్తుందా? అని చేతన్ భగత్ అడిగాడు. టపాసులను నిషేధించమని ముస్లింలు కోరారా? వారిని ఇందులోకి ఈడ్చడం ఎందుకు? తమ ఆదేశాలను మతపరమైనవిగా మెలితిప్పడం దురదృష్టకరమని సుప్రీం కోర్టే పేర్కొంది. అయితే అది తాను పనిచేస్తున్న వాతావరణాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఢిల్లీలో అమ్మకానికి సిద్ధంచేసిన 50 లక్షల కిలోల టపాసులు ఉన్నాయని వార్త. ఈ పండుగ సీజన్లో తమ కొద్దిపాటి ఆదాయాలకు అదనంగా మరికాస్త సంపాదించుకుందామని ఆశించే వేలాది మంది ప్రజల జీవనోపాధిని ఈ నిషేధం ప్రభావితం చేస్తుంది. నాలాగే, దీపావళి పండుగ సంబరాలతో సంతోషించే లక్ష లాది బాలలను, పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలోని అత్యంత పేద భాగాలలో ఒకటైన మనలాంటి దేశంలో, ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని అణచివేయడం ఉత్పాదకమైనదేనా? అని మనల్ని మనం ప్రశించుకోవాలి. వసంత కాలపు పండుగ బసంత్ సందర్భంగా లాహోర్లో గాలిపటాలు ఎగ రేయడంపై నిషేధం విధించి పాకిస్తాన్ ఇదే తప్పు చేసింది. అక్కడి న్యాయ మూర్తులు తరచుగా గాలిపటాలు ఎగరేయడాన్ని ‘ఇస్లాంకు ఇతరమైన’ అలవా టుగా విశ్వసిస్తుంటారు. అందువల్ల ప్రజలకు దాన్ని నిరాకరించారు. పక్షులు, మనుషుల భద్రతను ఆ నిషేధానికి సాకుగా ఉపయోగించుకున్నారు. కానీ నిజ మైన ఉద్దేశం మాత్రం మతపరమైన అత్యుత్సాహమే. గాలిపటాలు ఎగరేయడం గాయపడటానికి, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారి తీస్తుంటుంది. అలాంటివి ఇతరత్రా చాలా పనుల వల్ల కూడా జరుగు తుంటాయి. మనను సురక్షితంగా ఉంచలేదన్న ఏకైక కారణంతోనే దేనిపైనైనా నిషేధం విధించాలని ఆలోచించ కూడదు, ఆలోచించడానికి వీల్లేదు. టపాసుల నిషేధం బహుశా అలాంటి భక్తిప్రపత్తులతో విధించినది కాదు. కానీ ఒక్క దెబ్బకు మార్పును తెచ్చేయాలనే కోరికతో విధించినది కావచ్చు. ఇదో అసమంజసమైన విశ్వాసం. సర్వసాధారణంగా అది ఫలితాలను ఇవ్వదు. లవ్ జిహాద్, జాతీయ గీతం వంటి విషయాల్లో సుప్రీం కోర్టు ప్రదర్శిస్తున్న ఆసక్తి దృష్ట్యా... అది దేశ రాజధానిలోని వాయు నాణ్యతను మెరుగు పరచడంలో వేలు పెట్టే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగించదు (అమెరికా వంటి ఇతర పెద్ద ప్రజాస్వామ్య దేశా ల్లోని సుప్రీం కోర్టులు ఏ అంశాలను విచారణకు తీసుకుంటాయి, వేటిని తిరస్క రిస్తాయి అనే దాన్ని మన సుప్రీం కోర్టు గమనించడం ఉపయోగకరం). వాయు కాలుష్యం, అంతకంటే పెద్దది, మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేసేదైన వాతావరణ మార్పు వంటివి అతి తీవ్ర సమస్యలు. అనాలోచితంగా, ఏదో తంతుగా వాటికి అర్థర హితమైన పరిష్కారం చూపడం... ఆ సమస్యల వల్ల తలెత్తే ప్రమాద తీవ్రతను తగ్గించి చూపుతుంది. ఇలాంటి విషయాలలో తాము ఎంత సమంజసంగా, అర్థవంతంగా ఉంటున్నామని విశ్వసిస్తున్నా, మన కోర్టులు ఇలాంటి ఆదేశాలను జారీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఉగ్రవాదం, అల్లర్లపై నిర్వచనంలో మరీ ఇంత వివక్షా?
అవలోకనం అమెరికాలో ఇటీవల సంగీత కచ్చేరిపై జరిగిన ఘాతుక దాడి.. వ్యక్తి చేసిన కాల్పులే కానీ ఉగ్రవాద చర్య కాదని అక్కడి పోలీసులు చెప్పారు. అతడు క్రైస్తవుడు. అదే ముస్లిం అయితే పోలీసులు ఇలాగే చెప్పేవారా? ప్రముఖ భాషా శాస్త్రవేత్త, రచయిత నామ్ చోమ్స్కీ ఇలాంటి సందర్భంలోనే మాట్లాడుతూ ‘మనం చేస్తే అది ఉగ్రవాద వ్యతిరేక చర్య. వాళ్లు చేస్తే అది ఉగ్రవాదం’ అన్నారు. అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో కొన్ని రోజుల క్రితం సంగీత కచ్చేరీకి హాజ రైన వారిపై ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో 58 మంది మరణించారు. అతగాడు జన సమూహంపై తన మెషిన్గన్తో గంటసేపు జరిపిన కాల్పుల్లో 500పైగా జనం గాయపడ్డారు. ఇది వ్యక్తి చేసిన కాల్పులు కాబట్టి ఉగ్రవాద చర్య కాదని అమెరికన్ పోలీసులు చెప్పారు. హంతకుడు క్రైస్తవుడు. అతడు ముస్లిం అయితే పోలీసులు ఇలాగే చెప్పేవారా? నేనయితే అలా అనుకోవడం లేదు. ఆ వ్యక్తి గురించి, అతడి ఉద్దేశాల గురించి పెద్దగా తెలియడం లేదు కాబట్టే అతడి చర్య ఉగ్రవాదం కాదని నిర్ధారించడాన్ని, అలాగే మనం ఉగ్రవాదాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామనే అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ‘రాజకీయ లక్ష్యసాధన కోసం ప్రత్యేకించి పౌరులపై చట్టవిరుద్ధంగా హింసను ప్రయోగించడం, బెదిరించడమే ఉగ్రవాదం‘ అని నా పదకోశం నిర్వచిస్తోంది. దీని ప్రకారం హింసకు సంబంధించిన పలు చర్యలను ఉగ్రవాదంగా చెప్పవచ్చు. మతపరమైన హింస కూడా ఈ నిర్వచనం కిందికే వస్తుంది. మరి హింస కూడా రాజకీయ లక్ష్యసాధన కోసం పౌరులను బెదిరించే ఉద్దేశంతో జరిగే అక్రమ చర్యే కదా. కానీ మనలో చాలామంది మతపర హింసను ఉగ్రవాదంగా పరిగణించరు. 1984లో సిక్కులపై జరిగిన మారణకాండను అల్లర్లు అని పిలిచారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన ముజఫర్నగర్ హింసను అల్లర్లు అన్నారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత వందలాది ముస్లింలను హతమార్చిన ముంబై హింస కూడా అల్లర్లేనట. కానీ దానికి ప్రతీకారంగా జరిగిన బాంబు దాడులు మాత్రం ఉగ్రవాదమట. 2002లో అహ్మదాబాద్ లోని నరోడా పటియాలో 97 మంది ముస్లింలను ఊచకోత కోసిన ఘటన అల్లర్లు మాత్రమేనట. ఆ ఏడాదే అహ్మదాబాద్లోని అక్షరధామ్లో 30మంది హిందువులను చంపిన ఘటన మాత్రం ఉగ్రవాద దాడేనట. ‘పౌరులను లక్ష్యంగా చేసుకుని‘ అని ఉన్న పంక్తి మరీ చిత్రమైంది. జమ్మూకశ్మీర్లో జరుగుతున్న దాడుల్లో అనేకం సాయుధ బలగాలపైనే కానీ పౌరులను లక్ష్యంగా చేసుకున్నవి కావు. కానీ వీటిని మాత్రం మనం ఉగ్రవాద దాడులుగానే గుర్తిస్తున్నాం. రాజకీయ, సామాజిక లక్ష్య సాధన కోసం ప్రభుత్వాన్ని లేక పౌర జనాభాను, మరే ఇతర ప్రజా విభాగాన్ని కానీ బెదిరించడానికి లేదా బలవంతపెట్టడానికి చట్టవిరుద్ధంగా బలప్రయోగాన్ని, హింసను ఉపయోగించడమే ఉగ్రవాదమని అమెరికన్ చట్టం నిర్వచిస్తోంది. నేను ముందే చెప్పినట్లుగా లాస్ వెగాస్లో కాల్పులు జరిపిన షూటర్ గురించి, అతడి ఉద్దేశాల గురించి పెద్దగా తెలియదు. అతడి రాజకీయ లేక సామాజిక లక్ష్యాలు ఏంటో తెలియకున్నప్పటికీ అతడి చర్య ఉగ్రవాద దాడి కాదని ఎలా నిర్ధారించారన్నది స్పష్టం కావడం లేదు. ఉగ్ర బీభత్సానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొచ్చిన చట్టాన్ని ఉగ్రవాద నిరోధక చట్టం (పొటా) అంటున్నారు. దీనికి 2002లో వాజ్పేయి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దేశంలోని అనేక చట్టాల్లాగే పొటాను కూడా పేలవమైన భాషలో రూపొందించారు. భారత సమైక్యత, సమగ్రత లేక సార్వభౌమత్వాన్ని ప్రమాదంలోకి నెట్టే ఉద్దేశంతో లేదా బాంబులను, డైనమైట్లను, ఇతర పేలుడు పదార్థాలను, మండే వస్తువులను, తుపాకులను, ఇతర మారణాయుధాలను, లేదా విషాన్ని, విషపూరిత వాయువులను, విష రసాయనాలను మరే ఇతర (జీవరసాయనిక లేక మరే ఇతర పదార్థాలనైనా) ఉపయోగించడం ద్వారా ప్రజలను, ఏ ఇతర ప్రజావిభాగాన్నయినా భయపెట్టడానికి చేసే దాడులను ఉగ్రవాదమని పొటా నిర్వచించింది. ఇలాంటి దాడుల ద్వారా ఏ వ్యక్తినైనా, వ్యక్తులనైనా చంపడానికి లేదా గాయపర్చడానికి; ఆస్తి నష్టం, విధ్వంసం కలిగించడానికి, వివిధ సామాజిక బృందాల జీవితానికి అవసరమైన అత్యవసర వస్తువుల సరఫరాను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలన్నీ ఉగ్రవాదం కిందికే వస్తాయని పొటా పేర్కొంది. భారత దేశ రక్షణకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అవసరాల కోసం ఉపయోగించే సామగ్రి, లేదా ఆస్తిని నష్టపరిచే, ధ్వంసం చేసే చర్యలు కూడా ఉగ్రవాదం కిందికే వస్తాయని తెలిపింది. ప్రభుత్వాన్ని లేక మరే ఇతర వ్యక్తినైనా లోబర్చుకోవడానికి, ఎవరినైనా గాయపర్చడానికి, చంపడానికి లేదా నిర్బంధించడానికి పూనుకునే చర్యలన్నీ ఉగ్రవాదం కిందికే వస్తాయని పొటా నిర్వచించింది. ఈ మొత్తం పేరాలో ‘సమైక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమాధికారం‘ అనేవి కీలక పదాలు. భారతదేశ విచ్ఛిన్నత అనే భయం (ఇది ఎక్కడా కనిపించని భయం) ప్రాతిపదికన మనం పెంచుకున్న ఆందోళనే ఉగ్రవాదం పట్ల మన నిర్వచనాన్ని ప్రాథమికంగా నిర్దేశిస్తోంది. ఉగ్రవాదులు ఎన్నడూ ఉపయోగించని డైనమైట్లు వంటి విచిత్రమైన పదాలను ఈ నిర్వచనంలోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ఆర్డీఎక్స్, సి14 లేదా ఇతర అధునాతన పేలుడు పదార్థాల ఊసే దీంట్లో లేకపోవడం గమనార్హం. ఉగ్రవాద చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వ బ్యూరోక్రాట్ బహుశా బాలీవుడ్ సినిమాలు చూస్తూ పేలుడు పదార్థాలు అంటే ఇవే అనే ఎరుకను కలిగి ఉండవచ్చు. మొత్తంమీద చూస్తే, పెద్దగా ఆలోచించకుండానే ఈ చట్టాన్ని రూపొందించినట్లుంది. దేశంలో అనేక చట్టాలను ఇలాగే పేలవంగా తయారు చేసి సమర్పించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటివి ఉన్నాయి. చట్టవ్యతిరేక పదార్థాల రూపకర్తలు, మాదక ద్రవ్యాల తయారీదారులు, గూండాలు, మానవ అక్రమ రవాణాదారులు, ఇసుక మాఫియా, లైంగిక నేరస్తులు, వీడియో చౌర్యం చేసేవారు తదితరులను నిరోధించే చట్టం కింద తమిళనాడులో మిమ్మల్ని ఏడాది పాటు విచారణ లేకుం డానే నిర్బంధించవచ్చు. మీరు ఏ నేరమూ చేయనవసరం లేదు. భవిష్యత్తులో మీరు నేరం చేస్తారని, చేయవచ్చని అనుమానిస్తే చాలు.. ప్రభుత్వం మిమ్మల్ని ఏడాది పాటు జైలులో పెట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అత్యాచారాల గురించి ప్రముఖ భాషా శాస్త్రవేత్త, రచయిత నామ్ చోమ్స్కీ మాట్లాడుతూ ‘మనం చేస్తే అది ఉగ్రవాద వ్యతిరేక చర్య. వాళ్లు చేస్తే అది ఉగ్రవాదం‘ అన్నారు. అదే మన విషయంలోకి వస్తే, అవి అల్లర్లు లేక వ్యక్తులు చేసిన పని. అదే ముస్లింలు కనుక చేస్తే కచ్చితంగా ఉగ్రవాదమే. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
కాలం చెల్లిన పోలీసు వ్యవస్థలో న్యాయం బహు దూరం
అవలోకనం బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన కాలం చెల్లిన వ్యవస్థలో పనిచేస్తున్న మన పోలీసులు శాస్త్రీయమైన దర్యాప్తు పద్ధతుల్లో నేరాన్ని పరిష్కరించడం లేదు. కాబట్టి తీవ్ర నేరాలకు పాల్పడే వారిలో సైతం అధికులు తప్పించుకుపోగలుగుతున్నారు. కాబట్టి, గౌరీ లంకేశ్ను హత్యచేసినవారు, వారిని అందుకు పురమాయించినవారు ఎప్పటికీ శిక్ష అనుభవించాల్సి రాకపోతే ఆశ్చర్యపోను. గత ముప్పయ్యేళ్లలో మన దేశంలోని నగరాలు బాగా మారిపోయాయి. ఇది పోలీ సుల పనితీరును బాగా ప్రభావితం చేసింది. నగరాలు ఎలా పెరిగిపోయాయి లేదా నివాసయోగ్యం కానివిగా ఉన్నా చాలా మంది ప్రజలు అక్కడే ఎలా నివసించాల్సి వస్తున్నది అనే వాటి గురించి నేను మాట్లాడటం లేదు. మన నగరాలను అసలు ఎలా రూపకల్పన చేశారు, అవి ఎలా మారిపోయాయి అనేదాన్ని ప్రస్తావిస్తున్నాను. మన దేశం ప్రాచీనమైనదే అయినా, మన నగరాలలో చాలా వరకు కొత్తవే. ముంబై, కోల్కతా, చెన్నై వంటి అతి పెద్ద నగరాలు 300 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు నిర్మించినవి. హైదరాబాద్, సూరత్ లాంటి నగరాలు దాదాపు మరో 200 ఏళ్లు ముందు నిర్మించినవి. మన ‘పాత’ ఢిల్లీ సైతం 400 ఏళ్ల క్రితం నిర్మించినదే. కాశీని మాత్రమే ప్రాచీన నగరంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ నగరం దాదాపుగా అంతా వాస్తవానికి కొత్తగా నిర్మించినదే. అక్కడి ఘాట్లు సైతం సాపేక్షికంగా ఇటీవలివే. 500 ఏళ్ల కంటే ముందు నుంచీ ఉన్నదని సమంజసమైన ఆధారాలతో చెప్పగల కట్టడం ఒక్కటీ అక్కడ నేడు లేదు. రోమ్తో దీన్ని పోల్చి చూడండి. అక్కడి పేంథియన్ (రోమన్ దేవాలయం) దాదాపు 2,000 ఏళ్ల క్రితం నాటిది. ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఉంది. రోమ్లోని పురాతన కట్టడాల చుట్టూతా ఆ నగర జనాభా ప్రాచీనకాలం నుంచి నేటి వరకు తమ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆధునికమైన సైకిళ్లు, మోటార్ కార్లు, రెస్టారెంట్లు వచ్చి చేరినా అది కొనసాగుతూనే ఉంది. జీవిత విధానంలో వచ్చిన ఈ మార్పులు తప్ప, అక్కడి ఏ నివాస ప్రాంతాన్ని చూసినా శతాబ్దాల తరబడి మారనట్టే కనిపిస్తుంది. మన దేశంలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నమైనది. ఏవో కొన్ని కొత్త భవంతులు పుట్టుకొస్తుండని ప్రాంతాలు మన నగరాలలో అరుదు. కొన్నేళ్ల తర్వాత తిరిగివస్తే మన నగరాల్లోని చాలా ప్రాంతాలు గుర్తు పట్టరానివిగా మారిపోతాయి. ఈ మార్పు, పోలీసులు తమ విధులను నిర్వహించే తీరును ప్రభావితం చేసిందని నేను ఎందుకు అంటున్నట్టు? సాంప్రదాయక పద్ధతిలో ఒక నివాస ప్రాంతంలోని ఠాణా నేరాలతో వ్యవహరిస్తుండేది. ‘హిస్టరీ షీటర్ల’ (నేర చరిత్రుల) జాబితా, వారి ఫొటోలు పోలీసు స్టేషన్ నోటీసు బోర్డులో అతికించి ఉండేవి. కొత్తగా వచ్చిన పోలీసులు ఆ ప్రాంతం గురించి, నేరాలకు ‘అలవాటుపడ్డవారి’ గురించి తెలుసుకోడానికి ఇది తోడ్పడేది. కానీ నేటి మన నగరాలలో ప్రజలు ఉద్యోగాలు మారుతుంటారు, నగరాలు మారుతుంటారు, అద్దె ఇళ్లను ఎప్పటికప్పుడు మార్చుతుంటారు. కాబట్టి బోలెడంత గందరగోళం ఉంటుంది. పట్టణ ప్రాంతాలు నిరంతరం మారిపోతున్నా పాత పోలీసు వ్యవస్థే మిగిలి ఉంది. సీసీటీవీ కెమెరాల వంటి వాటి ద్వారా కొంత సాంకేతిక సహాయం లభిస్తోంది. అది కూడా ఇతర దేశాలకు భిన్నంగా దైవాధీనం అన్న తీరులోనే సాగుతోంది. మధ్యతరగతి ఇళ్లలో జరిగే దొంగతనాల కేసులను ఇప్పటికి కూడా పనివాళ్లనందర్నీ పట్టుకొచ్చి, ఎవరో ఒకరు నేరాన్ని ఒప్పుకునే వరకు చితగ్గొట్టే పద్ధతిలోనే పోలీసు దర్యాప్తు సాగుతోంది. హత్య సహా ఏ నేరం విషయంలోనూ సక్రమమైన దర్యాప్తు అనేదే లేదు. గౌరీ లంకేశ్ హత్యా ప్రదేశానికి తొలుత చేరుకున్న వారు.. అది ఎవరైనా ఇష్టానుసారం వచ్చి వెళ్లడానికి వీలుగా ఉండటం చూసి ఉంటారు. అలాంటి చోట చెప్పుకోదగిన ఫోరెన్సిక్ ఆధారాలేవీ మిగలవు. సమాంతరంగా సంభవించిన మరో పరిణామం కూడా పోలీసు పనిని ప్రభావితం చేసింది. పోలీసులకు ఎప్పటికప్పడు సమాచారాన్ని చేరవేసే ‘కబ్రీ’లు మాయమయ్యారు. నేడు ఆ పనిని చేస్తున్నది, నేరగ్రస్తత అంచుల్లో ఉండే పోలీసు ఇన్ఫార్మర్లు మాత్రమే. ఇన్ఫార్మర్లు కొంత చట్టవిరుద్ధమైన పనులను కూడా చేస్తుం టారు. పోలీసులు వారిని భయపెట్టి లేదా లంచమిచ్చి సమాచారాన్ని తెలుసుకుంటారు. బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబై, సూరత్ అల్లర్లు, ఆ తర్వాత వాటికి ప్రతిగా బాంబు దాడుల రూపంలో జరిగిన దాడుల తదుపరి పోలీసులకు కబ్రీలు లేకుండా పోయారు. కబ్రీలలో ఎక్కువ మంది ముస్లింలు కావడమే అందుకు కారణం. మతపరమైన విభజన పాత నమూనా పోలీసు పనిని ప్రభావితం చేసింది. ఆధునిక ఫోరెన్సిక్స్పై ఆధారపడ్డ దర్యాప్తు పూర్తిగా లోపిస్తుంది. పాత నమూనా దర్యాప్తు ఇక ఎంత మాత్రమూ ఫలితాలను ఇవ్వగలిగేది కాదు. 1996లో నేను ఒక విలేకరిగా ముంబై సెషన్స్ కోర్టులో ఉండగా, ఇక్బాల్ మిర్చి అని మాదకద్రవ్యాల సరఫరాదారు తరఫు న్యాయవాదిౖయెన శ్యామ్ కేశ్వానీ నన్ను కలిశారు. అప్పట్లో ఇక్బాల్ మిర్చిని అప్పగించాలని భారత్ ఇంగ్లండ్ని కోరుతోంది. ఆ కేసు కోసం సీబీఐ నలుగురి బృందాన్ని పంపింది. కేశ్వానీ నాకు దాదాపు 200 పేజీల చార్జీ షీటు ప్రతిని ఇచ్చారు. అందులో ఒకే ఒక్క చోట ఆయన క్లయింట్ పేరు ఉంది. అది కూడా చిట్టచివరి పేజీలో ‘ఈ కేసులో ఇక్బాల్ మెమన్ లేదా మిర్చి కూడా అవసరమైన వ్యక్తి’ అన్న ఒక్క వాక్యంలోనే ఉంది. భారత ప్రభుత్వం నాడు సమర్పిస్తుండిన మొత్తం ‘ఆధారం’ అదే. ఇంగ్లండ్ మిర్చిని అప్పగించలేదు. ఇది భారత పోలీసుల తప్పు అనడం లేదు. వారు చాలా కష్టించి పనిచేస్తున్నారు. కాకపోతే, ఒక నివాస ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం బ్రిటిష్ వాళ్లు ఏర్పాటు చేసిన వ్యవస్థలోనే మన పోలీసు ఇంకా పనిచేస్తున్నాడు. దర్యాప్తు ద్వారా నేరాన్ని పరిష్కరించడం లేదు. జపాన్లో నేరాభియోగాలకు గురైన వారిలో శిక్షపడినవారి నిష్పత్తి 95 శాతం. అంటే ఏదైనా నేరానికిగానూ పోలీసులు ఎవరినైనా పట్టుకున్నారంటే, కోర్టు అతన్ని దోషి అని నిర్ధారించడానికి హామీ దాదాపుగా ఉంటుంది. భారత్లోలాగే తరచుగా చిత్రహింసలకు గురిచేయడం ద్వారా రాబట్టిన నేరాంగీకార ప్రకటనలపై ఆధారపడే ఈ వ్యవస్థను విమర్శించేవారూ ఉన్నారు. అదే లోపాలున్నా, భారత్లో శిక్షలు పడేవారి నిష్పత్తి 50 శాతం కంటే తక్కువే ఉంటోంది. తీవ్ర నేరాలుసహా నేరాలకు పాల్పడే భారతీయులలో అధికులు తప్పించుకుపోగలుగుతున్నారు. ఈ కారణంగా, గౌరీ లంకేశ్ను హత్యచేసినవారు, వారిని ఆ పని చేయడానికి నియమించినవారు ఎప్పటికీ శిక్ష అనుభవించాల్సి రాకపోతే నేను ఆశ్చర్యపోను. ఈ వైఫల్యం వ్యవస్థాగతమైనది, కొన్ని ప్రత్యేక సందర్భాలలో అది పనిచేస్తుందని ఆశించడం మన ఆశావాదాన్ని సూచిస్తుందే తప్ప, వాస్తవాలు తెలిపే నిజపరిస్థితిపై అంచనాను మాత్రం సూచించదు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
ప్రభుత్వ చట్టవిరుద్ధ నిఘా పీడ ఆగేనా?
అవలోకనం మిగతా ప్రజాస్వామ్యాల్లో వలే అధికారిక నిఘాలకు సంబంధించి మనకు రక్షణలు, అవరోధాలు లేవు. నేరపూరితమైన ప్రభుత్వ నిఘాకు స్వచ్ఛందంగా మనం మన వివరాలు ఎందుకు ఇవ్వాలి? తప్పనిసరి ఆధార్ నమోదు, మన జీవితంలోని అన్ని రంగాలనూ మన బయోమెట్రిక్ గుర్తింపులతో తప్పక అనుసంధానించాల్సి రావడం ఆగిపోవాలి. సుప్రీంకోర్టు తీర్పు మనకు ఆ ఆశను కలిగించింది. పదిహేనేళ్ల క్రితం నేను సంపాదకీయం వహిస్తున్న ఒక వార్తాపత్రిక సల్మాన్ఖాన్, ఐశ్వర్యారాయ్ల మధ్య జరిగిన సంభాషణ రాత ప్రతిని ప్రచురించింది. ఆ కథనాన్ని జే డే అనే విలేకరి ముంబై పోలీసుల నుంచి సంపాదించారు. ఆ సంభాషణలో ప్రీతీ జింటాపై సల్మాన్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్య ఉంది. ఆగ్రహించిన ప్రీతీ నాపై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు కొన్నేళ్లపాటు, చివరకు ఆమె దాన్ని వెనక్కు తీసుకునే వరకు నడిచింది. పోలీసులు, ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినది తాము కాదనడం ఆసక్తికరం. ఆ గొంతులు ఆ ఇద్దరు నటులవేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి అది నిజమైనదే. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినది ఎవరు? అది మనకు ఇప్పటికీ తెలియదు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. టాటాలు, అస్సాం వేర్పాటువాదులకు బలవంతపు వసూళ్లను చెల్లించినట్టు చెప్పిన 20 ఏళ్ల క్రితం నాటి టాటా టేపులు అలాంటివే. నస్లీ వాడియా, కేశబ్ మహేంద్ర, జనరల్ శామ్ మానెక్షా, రతన్ టాటాల మధ్య సాగిన ఆ ప్రైవేటు సంభాషణలను రికార్టు చేసి లీకు చేశారు. ఆ పని చేసింది ఎవరు? మనకు తెలి యదు. భారత పౌరులపై ప్రభుత్వ నిఘా అధికారిక అదేశాలు లేదా పర్యవేక్షణ లేకుండానే చట్టవిరుద్ధంగా సాగుతోందని ఈ ఘటనలన్నీ తెలుపుతున్నాయి. ఈ నేరాలన్నీ రచ్చకెక్కినా చట్టవిరుద్ధ నిఘాకు గానూ ఏ అధికారినీ బోనెక్కించలేదు. మన దేశంలో చట్టబద్ధంగా సాగే ప్రభుత్వ నిఘా విస్తృతి చాలా ఎక్కువ. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నెలకు 10,000 ఫోన్ ట్యాప్లను అనుమతించినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఇటీవల సమాచార హక్కు చట్టం కింద దఖలు చేసిన ఓ దరఖాస్తు వల్ల తెలిసింది. ఇలా సేకరించిన సమాచారాన్నంతటినీ ఏం చేస్తున్నారు? అది మనకు చెప్పలేదు. మిగతా ప్రజాస్వామ్యాల్లో వలే అధికారిక నిఘాలకు సంబంధించి మనకు రక్షణలు గానీ, దానికి అవరోధాలు గానీ లేవు. అమెరికాలోనైతే, ఫోన్ ట్యాపింగ్కు అధికారిక ఆమోదం లభించాలంటే పోలీసులు న్యాయమూర్తికి ఆధారాలు చూపాలి. ఆమోదం లభించినా దాన్ని కఠినమైన షరతులకు లోబడే చేయాల్సి ఉంటుంది. అది మన దేశంలో లోపించింది. లాబీయింగ్లను జరిపే నీరా రాడియా ఫోన్లను నెలల తరబడి ట్యాప్ చేశారు. ఆ తర్వాత వాటిని మీడియాకు విడుదల చేసి నేరానికి పాల్పడ్డారు. అవి నేరం జరిగినట్టు సూచించకపోయినా, కొందరు వ్యక్తులకు మచ్చతెచ్చాయి. మన ప్రభుత్వం పౌరుల ఫోన్లను ట్యాప్ చేసి, ఆ పని చేయలేదని నిరాకరించగలుగుతోంది. సంస్థాగతమైన ఒక క్రమం అంటూ లేకపోవడం వల్ల నిఘా ద్వారా సేకరించిన సమాచారంపై, అది చట్టబద్ధంగా సేకరించినదే అయినా, ప్రభుత్వ నియంత్రణ ఉండటం లేదు (రాడియా టేపులలాగా). జవాబుదారీతనమూ లేదు. వ్యక్తిగత గోప్యతపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యం ఇది. మన ప్రభుత్వ నిఘా చరిత్ర తెలుసు కాబట్టి నేను ఆధార్ కార్డ్ తీసుకోలేదు. నా బయోమెట్రిక్ వివరాలను అప్పగించమని ప్రభుత్వం నన్ను ఎందుకు బలవంత పెట్టాలి? అది అర్థరహితం. గుర్తింపునకు ఆధారంగా, నాకు ఇప్పటికే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, నా ల్యాండ్లైన్ ఫోన్ బిల్లు, నా ఎలక్ట్రిసిటీ బిల్లు, నా ఇంటి డాక్యుమెంట్లు, నా ఓటర్ గుర్తింపు కార్డ్ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే వివిధ రూపాల గుర్తింపులే. అది నా నుంచి ఇంకా ఎన్ని ఇతర విషయాలు కావాలంటుంది, ఎందుకు? నా మొబైల్ ఫోన్ను, బ్యాంకు ఖాతాను ఆధార్తో తప్పక అనుసంధానించాలని ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి తాఖీదులు వచ్చాయి. పాఠశాల పిల్లలను పరీక్షలకు అనుమతించాలంటే ముందుగా ఆధార్ తీసుకోవాలన్న భయానక గాథలనూ వినాల్సివచ్చింది. ట్యాక్స్ రిటర్నుల దఖ లుకు ఇప్పటికే ఆధార్ను తప్పనిసరి చేశారు (ఈ అర్థరహితమైన ఈ నిబంధన నుంచి తప్పించుకోడానికి నేను ముందే దఖలు చేసేశాను). దాచుకోడానికి ఏమీలేని వారు ఆధార్ నమోదుకు ఎందుకు ప్రతిఘటిస్తారు? అని ప్రభుత్వ మద్దతుదార్లు వాదిస్తారు. ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యలు చాలా బలహీనమైనవి కాబట్టి నేను వద్దనుకుంటున్నా. ఆధార్ను బ్యాంకు ఖాతాలతో, పాన్ నంబర్లతో అనుసంధానించడం లక్ష్యం, ట్యాక్స్ దొంగలను మరింత మెరుగ్గా పట్టుకోగలుగుతామనేదే అయినా, నేను అభ్యంతరం తెలుపుతాను. నాగరిక ప్రజాస్వామ్యం ఏదైనాగానీ ప్రజలు అమాయకులనే భావిస్తుంది. ప్రతి ఒక్కరు తమ ఆర్థిక లావాదేవీలకు బయోమెట్రిక్ గుర్తింపును జోడించేలా నిర్బంధించడమంటే ప్రతి ఒక్కరూ నేరస్తులేనని భావించడమే. ఇది నాకు ఆమోదనీయం కాదు. 2014, ఏప్రిల్ 8న నరేంద్రమోదీ బెంగళూర్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సాగించారు. గెలిచిన తర్వాత తాను ఆధార్ను రద్దు చేస్తానని చెప్పారు. నందన్ నీలేకనీపై దాడి చేస్తూ ఆయన ‘‘మీరు ఏ నేరానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు మీ ఆధార్ ప్రాజెక్టుకు మొట్టికాయలు వేసింది?’’అని ప్రశ్నించారు. ‘‘మొట్టమొదటిసారిగా బహిరంగంగా చెబుతున్నాను. ఆధార్ ప్రాజెక్టుపై నేను పలు ప్రశ్నలను అడిగాను. చట్టవిరుద్ధంగా వలస వచ్చిన విదేశీయుల గురించి, జాతీయ భద్రతకు సంబంధించి వారిని పలు ప్రశ్నలు వేశాను. వారి (యూపీఏ ప్రభుత్వం) వద్ద సమాధానం లేదు’’ అని కూడా మోదీ అన్నారు. నేడు మోదీ దీనికి పూర్తిగా విరుద్ధమైన వైఖరి చేపట్టి, అవసరం లేదనుకున్న వారి పైన కూడా బలవంతంగా ఆధార్ను రుద్దుతున్నారు. ఇలా విరుద్ధ వైఖరిని ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో ఆయన వివరించాల్సి లేదా? ఆయన ఆ పని చేయరనుకోండి. ఒక గూఢచార సంస్థకు చెందిన ఒక వ్యక్తిని కొద్ది రోజుల క్రితం కలుసుకున్నాను. నాపైన ఒక ఫైల్ ఉండేదని, అందులో నాకు సంబంధించిన చాలా వివరాలే ఉన్నాయని, వాటిలో చాలా వరకు చట్టవిరుద్ధంగా సేకరించినవేనని చెప్పారు. ఇలా చట్టవిరుద్ధ ప్రభుత్వ నిఘా కింద ఉన్న వారు లక్షల్లో కాకున్నా, వేలల్లోనైనా ఉన్నారు. ఈ నేరపూరితమైన నిఘా కార్యకలాపం సాగడానికి స్వచ్ఛం దంగా మనం మన వివరాలు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వనక్కర్లేదు. తప్పనిసరి ఆధార్ నమోదును, మన జీవితంలోని అన్ని రంగాలనూ మన బయోమెట్రిక్ గుర్తింపులతో తప్పక అనుసంధానించాల్సి రావడాన్ని ఆపివేయలి. సుప్రీంకోర్టు తీర్పు మనకు ఆ ఆశను కలిగించింది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
సైనికులకు ఇవ్వాల్సింది బూటకపు గౌరవమేనా?
అవలోకనం మన జాతీయ విమాన ప్రయాణ సంస్థ ఎయిర్ ఇండియా, సైనికులను గౌరవించడానికి ఒక చర్య చేపట్టాలని నిర్ణయించింది. ఇకపై ఆ సంస్థ తమ విమానాల్లోకి ఇతర ప్రయాణికుల కంటే ముందు సాయుధ బలగాల సిబ్బందిని ఎక్కమని కోరుతుంది. ఈ చర్య సైనికుల్లో తాము ప్రత్యేకమైన వారిమనే భావనను కలిగిస్తుంది కాబట్టి, వారిని గౌరవించినట్టు అవుతుంది. దీని ద్వారా వారి సేవలను, ఇతర భారతీయులు అందించే సేవల కంటే ఎక్కువ అర్థవంతమైనవని చెప్పినట్టు అవుతుంది. ఇక్కడ మనం ఎయిర్ ఇండియా వారి ఈ ముందస్తు ఊహాత్మక అంచనాను గురించి ఆలోచించడానికి కాస్త ఆగుదాం. మన దేశంలోని ఉపాధ్యాయుడు, పోస్ట్మ్యాన్, గ్యాస్ సిలిండర్లు అందించే వ్యక్తి అంతకంటే తక్కువ ముఖ్యమైన వారు ఎలా అయ్యారు? వారు ముఖ్యమైన వారు కారనే అనుకుంటే, ఎందువల్ల? సైనికులు ప్రమాదకర మైన ఉద్యోగం చేస్తున్నారని మనం వాదించవచ్చు. అలా అంటే, విద్యుత్ లైన్మన్ల పని కూడా ప్రమాదకరమైనదే. ఏటా యుద్ధంలో చనిపోతున్న సైనికులకంటే ఎక్కువ మంది మన మురుగు కాల్వలను, పైపులను శుభ్రం చేస్తూ మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఆ కార్మికులకు ఏ పతకాలూ ఇవ్వరు, ఎలాంటి గౌరవం లేదా బహుమతులూ ఇవ్వరు. నిజానికి, వారికి రావాల్సిన బకాయిలు సైతం అందవు. నేనీ రోజు దాని జోలికి పోను. సైనికులు మన రిపబ్లిక్కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన పని చేస్తున్నారని, ఇతరులకన్నా వారు ఎక్కువ గౌరవాన్ని పొందడానికి అర్హులని అనుకుందాం. ప్రభుత్వ వైమానికి సంస్థ విమానాల్లోకి ఎక్కడానికి సంబంధించి గౌరవప్ర దమైన స్థానాన్ని కల్పించడమే సైనికులను గౌరవించడానికి సరైన మార్గమా? కాదని నేనంటాను. అంతేకాదు, ఈ చర్య, సైనికులను గౌరవిం చడం అనే సైనిక వ్యతిరేక బూటకపు కథనాన్ని కొనసాగించడానికి ఉద్దేశపూర్వకంగా చేపట్టినది అని కూడా అంటాను. దీన్ని వివరిస్తాను. సైన్యానికి మనం రుణపడి ఉన్నందున ఆ రుణాన్ని సమంజసంగా తీర్చు కోడానికి హామీనిచ్చే చాలా మార్గాలున్నాయి. ఒకటి, జీతభత్యాలు, జీవన పరిస్థితులకు సంబంధించినది. ఇటీవల దుర్భరమైన సైనికుల ఆహారం, జీవన పరిస్థితుల గురిం చిన వాస్తవాలను వెల్లడించిన జవాన్ల పట్ల మనం చాలా కఠినంగా ప్రవర్తించాం. అదే మనకు ఈ విషయంలో శ్రద్ధ లేదనడానికి నిదర్శనం. మన సైనికుల ఆహారాన్ని మెరుగుపరిచేలా ఎయిర్ ఇండియా తమ కేటరింగ్ సేవలను ఉప యోగిస్తే అది వారిపట్ల మెరుగైన గౌరవం అయ్యేది. రెండు, మన సైనికులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి హామీని కల్పించాలి. తీవ్రమైన పని ఒత్తిడికి గురైన జవాన్లు తరచుగా తమ అధికారులనో, తోటి జవాన్లనోకాల్చి చంపే ఘటనలు తరచుగా జరుగుతుండటం అలాంటి హామీ లేకపోవచ్చనే సూచిస్తోంది. మన సైనికులలో చాలా మంది మానసికంగా ఆరోగ్యవంతంగా లేరని, వారికి అందే çసహాయం లేదా చికిత్స శూన్యమని పూర్వ సైనికుల సంఘాలు, సంస్థలు చెబుతున్నాయి. మూడు, సైనికులు ఉద్యోగంలో ఉండగా, పదవీ విరమణ చేసిన తర్వాత వారికి పెన్షన్, ఉద్యోగ అవకాశాలు, విద్యావకాశాలు కల్పించడం. అమెరికా ఈ పనిని చాలా బాగా చేస్తోంది. ప్రత్యేకించి విద్యకు సంబంధించి అది పూర్వ సైనికులకు కళాశాల ఉపకార వేతనాలను అందిస్తోంది. మనం ఆ పని చేయడం లేదు. ఇక పెన్షన్, ఉద్యోగాలకు వస్తే, మనది స్వల్పంగా వనరులున్న పేద దేశమే ఆయినా, ప్రభుత్వ ఉద్యోగులలో మరే విభాగం కంటే కూడా వారికే ప్రభుత్వం నుంచి ఎక్కువ అందుతోందని చెప్పగలను. నాలుగు, సైనికులకు, వారు బాగా విధులను నిర్వహించినపుడు పతకాలు తదితరాలను ఇచ్చి గౌరవించాలి. వారికి అందాల్సిన గౌరవ పురస్కారాలు వారికి అందడంలేదని ఒక తాజా నివే దిక తెలి పింది. ఎవరైనా సైనికుడికి పతకం లభించిందని చెప్పినా, దాన్ని భౌతికంగా ఆ పతకాన్ని అతనికి ఇవ్వరని చెప్పి ఉండొచ్చు. ఆ జవాను దాని నకలును ఆర్మీ క్యాంటీన్లో కొనుక్కుని ధరిస్తాడు. ఇది అవమానకరం అని నాకు అనిపి స్తుంది. ఇక ఐదవది, చివరిది మన సైనిక యోధులను అర్థవంతమైన రీతిలో గౌరవించడానికి ఉన్న అతి ముఖ్యమైన మార్గం. అత్యంత ధైర్యవంతులైన మన సైనికులను మోహరించిన సంఘర్షణాత్మక ప్రాంతాలను తగ్గించాలి. గడ్డిపరక కూడా మొలవని సియాచిన్ ఆక్రమించుకోవడం, ఏడాదికి ఓ డజను మంది సైనికులు మరణించడం ఎందుకు? వారు చనిపోయేది పోరాడే శత్రు సైనికుల చేతుల్లో కాదు, అక్కడి వాతావరణానికి. మనం పాకిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడి సియాచిన్, సల్తోరో ప్రాంతాల్లో ఇరు పక్షాల సైన్యాన్ని తగ్గించుకోడానికి ప్రయత్నించలేమా? మనం చేయగలం, కాకపోతే పాకిస్తాన్తో మాట్లాడితేనే అది సాధ్యం. ఇప్పటికైతే మనం వారితో కయ్యం కోరుకుంటున్నాం. అంటే మన సైనికులు చనిపోవడం కొనసాగినా ఫర్వాలేదు. అంతర్గతంగా మన సైన్యం, పారామిలిటరీ బలగాలు ఈశాన్యంలో, ఆదివాసీ ప్రాంతాల్లో, జమ్మూకశ్మీర్లో నిరంతరాయంగా మోహరించి ఉంటున్నాయి. ఇవి, రాజకీయంగానే తప్ప సైనికంగా పరిష్కారమయ్యే సమస్యలు కావు. సాయుధ బలగాలు 70 ఏళ్లుగా ఈ ప్రాంతాల్లో అలసిపోతున్నాయే తప్ప ఎలాంటి అనుకూల ఫలి తాలు కలగలేదు. సాయుధ బలప్రయోగమే ఏకైక మార్గమని పట్టుబడితే, అందుకు జవాన్లు, వారితో పోరాటంలో ఉన్న పౌరులు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. భారత సైనికుడు ఎక్కడ పోరాడమని అడిగితే అక్కడ పోరాడతాడు. అతడి సేవలను, త్యాగాలను అత్యంత ఉపయోగకరమైన లక్ష్యాల కోసం మాత్రమే ఉపయోగపడేలా చేయాల్సిన బాధ్యత మన ప్రజాస్వామిక సమాజం విధి. అనవస రంగా అతన్ని మన కోసం చనిపొమ్మని కోరరాదు. భారత జవాన్ను మనం గౌరవించగల ఏకైక అత్యుత్తమ మార్గం అదే. మోదీ ప్రభుత్వం పెంపొందింపజేస్తున్న ఈ సైనికీకరణ వాతావరణంలో ఎయిర్ ఇండియా, జాతీయవాదు లకు చంచాగిరీ చేస్తోందని నా అంచనా. ఇప్పటికే అది స్థానిక విమానాల్లో శాఖాహారాన్నిమాత్రమే అందిస్తామని చెప్పింది. ఆర్ఎస్ఎస్కు అది చాలా సంతోషాన్ని కలిగించి ఉంటుంది. చంచాగిరీతో నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు, అది అందరూ చేసేదే. కాకపోతే యథాలాపంగా చేపట్టిన ఈ చర్య, సైనికపరమైన త్యాగాలకున్న నిజమైన అర్థాన్ని తగ్గించివేస్తుంది. అది ప్రభుత్వాన్ని సంతోషపెట్టినాగానీ, నిజ మైన సమస్యను దాటవేస్తుంది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
భవితపట్ల బెంగలేని మన యువత
అవలోకనం అతి పెద్ద సంఖ్యలో నేను కలుసుకున్న యువత నుంచి అందిన సమాచారం ఆధారంగా మన దేశంలోని పిల్లలు తిరుగుబాటుతత్వం గలవారు కారని, సంప్రదాయకమైనవారని స్పష్టమైంది. స్థూలంగా చెప్పాలంటే.. మన యువకులలోకంటే యువతులలోనే కొన్ని సంప్రదాయేతర భావనలను పరిగణనలోకి తీసుకునే విశాల దృష్టి ఎక్కువగా ఉంటోంది. నేను మాట్లాడిన వారిలో దళితులు, ఆదివాసుల దుస్థితి పట్ల సానుభూతి దాదాపుగా ఎన్నడూ వ్యక్తం కాలేదు. ఉద్యోగితపై చర్చగానీ, నిరుద్యోగం అతి పెద్ద సమస్యలలో ఒకటనిగానీ వారికి తెలిసివున్నట్టు అనిపించదు. నా పనిలో భాగంగా ఏళ్ల తరబడి నేను వందలాది మంది శ్రోతలతో మాట్లాడుతుంటాను. అలా నేను అనేక వేల మందితో, బహుశా లక్షల మందితో మాట్లాడి ఉంటాను. తరచుగా వారు కళాశాల విద్యార్థులైన యువతీయువకులు. మొదట నేను ఏదో ఒక అంశంపై ఓ అరగంటో లేక నలభై నిముషాల పాటో మాట్లాడటం, ఆ తర్వాత శ్రోతలు తమ ఆభిప్రాయాలను వెలిబుచ్చడం లేదా ప్రశ్నలు వేయడం అనే తీరున సాధారణంగా ఈ సంభాషణ సాగుతుంటుంది. గత కొన్ని నెలలుగా కొన్ని రాష్ట్రాల్లో పెద్ద పెద్ద బృందాలతో మాట్లాడాక, శ్రోతలలో నాకు కనిపించిన కొన్ని సాధారణాంశాల గురించి తీవ్రంగా యోచిస్తున్నాను. మొట్టమొదటిది వారి దృక్పథానికి సంబంధించినది. అతి పెద్ద సంఖ్యలో నేను కలుసుకున్నవారి నుంచి అందిన సమాచారం ఆధారంగా మన దేశంలోని పిల్లలు తిరుగుబాటుతత్వం గలవారు కారని, సంప్రదాయకంగా ఉండేవారని నాకు స్పష్టమైంది. ఆధిపత్యం చెలాయించే బాపతువారికి కూడా ఇది వర్తిస్తుంది. అలాంటి వారు తరగతి గదిలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, పాత్రికేయులుగా ఉన్నా లేక సెలబ్రిటీలే అయినా ఇదే బాపతు. ఇక రెండవది, స్థూలంగా చెప్పాలంటే మన యువకులలోకంటే యువ మహిళలలోనే సంప్రదాయేతరమైన కొన్ని భావనలను పరిగణనలోకి తీసుకునే విశాల దృష్టి ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు, నేను జాతీయవాద భావనను ప్రశ్నించేట్టయితే, మహిళలు తలలు ఊపే అవకాశం ఎక్కువ, నా ప్రసంగం ముగిశాక ఆగ్రహంతో ప్రశ్నలు సంధించే అవకాశం తక్కువ. ఇక మూడవ విషయం, యువతీయువకులు ఇరువురికీ ఒకే తీరున సామాజిక న్యాయమనే భావన తెలిసి ఉండటం లేదు. ఉదాహరణకు, రిజర్వేషన్లనే తీసుకుందాం. నేను మాట్లాడిన శ్రోతలు దాదాపుగా ఎన్నడూ దళితులు, ఆదివాసుల దుస్థితి పట్ల సానుభూతితో లేరు. శ్రోతలలో దళితులు, ఆదివాసులు దాదాపుగా ఎవరూ లేరని నిర్ధారణ అయినాక, ఆ వర్గాల వారు అక్కడ లేకపోవడానికి కారణం వ్యవస్థ వారిని అవకాశాలకు దూరం చేయడమేనని తెలిసినా వారి దృష్టి మారదు. రిజర్వేషన్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి ముందు దళితులు, ఆదివాసులు వివక్షను ఎదుర్కొంటున్నారని ఆమోదించాలని ఆశిస్తున్నానని నేను తరచుగా నా శ్రోతలకు చెప్పేవాణ్ణి. అయినా అది ఎన్నడూ జరగలేదు. రిజర్వేషన్లపై ‘ప్రతిభ’ విజయం సాధించాలనే ఒకే ఒక్క అంశంపైన మాత్రమే యువత ఆగ్రహంతో ఉంది. నాలుగు, వారికి ఆందోళన కలిగిస్తున్న ఏకైక అతిపెద్ద సమస్య కశ్మీర్ మాత్రమే. ప్రభుత్వం ఉగ్రవాదంగా పిలిచే సమస్య దేశంలోని మూడు ప్రాంతాల్లో ఉన్నదని వారికి చెప్పి చూశాను. గత పదేళ్లుగా ఈ హింస అతి ఎక్కువగా జరుగుతున్నది, 6,080 మంది మరణించిన నక్సలైట్ ప్రాంతంలో. ఈ హింసకు సంబంధించి రెండవ స్థానం ఈశాన్య భారతానిది. ఇదే కాలంలో అక్కడ 5,050 మంది మరణించారు. జమ్మూకశ్మీర్ ప్రాంతం మూడో స్థానంలో ఉంది. అక్కడ గత పదేళ్లలో 3,378 మంది చనిపోయారు. అయినా, ఈశాన్యం లేదా నక్సలైట్ హింస గురించి ఎన్నడూ ఏ ప్రశ్నా ఎదురు కాలేదు. కానీ కశ్మీర్ గురించి, రాళ్లు విసిరేవారి గురించి యువత బాగా ఆందోళన చెందుతోంది. ఈ ఆందోళనతో పాటూ వారికి ఆర్టికల్ 370 చరిత్ర గురించి, భారత ప్రభుత్వ ప్రవర్తన గురించి ఏ మాత్రం తెలిసి ఉండకపోవడమూ ఉంది. వారు విద్యార్థులు కావడం వల్ల ఇది ఆశ్చర్యకరం. మన చానళ్లు చూపుతున్న జాతీయత, జాతి వ్యతిరేకత అనే తెలుపు నలుపు వైఖరికే వారు అంటిపెట్టుకున్నారు. ఐదు, పైన పేర్కొన్న నా పరిశీలనలకు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. అవి సాధారణంగా సామాజిక శాస్త్రాలు, కళలు, సాహిత్యం వంటి రంగాలకు చెందినవారి నుంచి వచ్చేవే. కానీ ఇంజనీరింగ్, కామర్స్, సైన్స్ విద్యార్థులు చాలా వరకు పైన పేర్కొన్న ప్రామాణిక వైఖరితో ఉండే అవకాశమే ఎక్కువ. ఆరు, ప్రధాని నరేంద్ర మోదీకి విద్యార్థులలో బాగా ఆదరణ ఉంది. ఆయన మాట్లాడేది బాగా అర్థవంతంగా ఉంటుందని అనుకుంటున్నారు, ఆయనలో కనిపించే గుణాలను వారు మెచ్చుతున్నారు. ఆయన గతం గురించిన లేదా పనితీరు గురించిన అభ్యంతరాలను విద్యార్థులు తేలికగా తోసిపుచ్చేస్తారు. ఏడు, గోవధ, గొడ్డు మాంసాల సమస్యపై కొట్టి చంపేయడాలు వారికి ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. కానీ ఆ హింసకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు భావించడం లేదు. ఎనిమిది, వారి భవిత గురించి లేదా భారత ఉపాధి మార్కెట్ గురించి అడిగితే తప్ప వారు ఎన్నడూ మాట్లాడటం లేదు. ఉద్యోగిత గురించి జరుగుతున్న చర్చగానీ, నిరుద్యోగం అతి పెద్ద సమస్యలలో ఒకటనిగానీ వారికి తెలిసివున్నట్టు అనిపించదు. లేదంటే, వారు తమ భవితకు సంబంధించిన సమస్యలను ఎలాగోలా పరిష్కరించుకోగలమనే విశ్వాసంతో ఉండి ఉంటారు. తొమ్మిది, వారు వేసే ప్రశ్నల నాణ్యత ప్రాథమికం, బలహీనం. మీడియా లేదా తమకు విద్య నేర్పేవారు నూరిపోసే దానికి స్వతంత్రంగా సమస్యను పరిశీలించే మంచి విద్యార్థులను మనం తయారు చేయడం లేదు. ఇక చివరిది, ఇంగ్లిషు వాడే వారి భాషాపరిజ్ఞానం అధ్వానం. ఉన్నత విద్యా వ్యవస్థ సరైన నిపుణ, కార్యాలయ ఉద్యోగాలకు తగిన పట్టభద్రులను తయారు చేయడం లేదు. చాలా మంది కాకున్నా పలువురికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయడానికి అవసరమైన ప్రాథమిక సంభాషణా నైపుణ్యాలు సైతం లేవు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఈ–మెయిల్ : aakar.patel@icloud.com -
విశ్వసనీయత కొరతే ప్రతిపక్షాల ప్రధాన సమస్య
అవలోకనం విశ్వసనీయత కొరవడటమనే సమస్య ప్రతిపక్షాలకు తీవ్రమైన చెరుపు చేసింది. మతతత్వవాదం 2019 ఎన్నికల్లో ప్రధాన సమస్య అయ్యే అవకాశం చాలా వరకు లేనట్టే. గోవధ వంటి సమస్యలపై హింసను బీజేపీ చాలా వరకు సాధారణమైనదిగా చేసేయడమే అందుకు కారణం. ప్రతి కొన్ని రోజులకోసారి ముస్లింలను చావబాది హత్యగావించడాన్ని దేశం సౌకర్యంగానే దిగమింగగలుగుతోంది. దాన్నేమీ పెద్ద సమస్యగా చూడటం లేదు. అలా చూస్తుండి ఉంటే దాని ప్రతిఫలనం మనకు కనిపిస్తుంది. అలాంటిదేమీ కనబడటం లేదు. వీటిని చిన్న సమస్యలుగా చూస్తున్నారు. బిహార్ రాజకీయ సంక్షోభం, భారత ప్రతిపక్షాలు ఎదుర్కొంటున్న అంతకంటే మరింత పెద్ద సమస్యను వెల్లడిస్తుంది. అవి ఈ సమస్యను ఎదుర్కొనడం కొనసాగుతూనే ఉంటుంది, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అది వారిని దెబ్బ తీస్తుంది. విశ్వసనీయత అనేదే ఆ పెద్ద సమస్య. బిహార్లోని సమస్య చాలా సరళమైనదే. ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ ప్రాథమిక సమాచార నివేదికను (ఎఫ్ఐఆర్)ను దాఖలు చేసింది. యాదవ్కు, ఆయన కుటుంబీకులకు ఉన్న కొన్ని ఆస్తుల వివరాలను ప్రభుత్వం వెల్లడి చేసింది లేదా లీకు చేసింది. ఆ ఆరోపణలు ప్రత్యేకించి ఆస్తుల పరిమాణాన్ని బట్టి చూస్తే అతి తీవ్రమైనవి. ఉప ముఖ్యమంత్రికి మద్దతుగా మీడియాలో దాదాపుగా ఎవరూ నిలవలేదు. ఆ కుటుంబ పెద్ద లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ వ్యతిరేక ఉమ్మడి కూటమిని మహా ఉత్సాహంగా సమర్ధించేవారిలో ఒకరు. యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), నితీశ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్–జేడీయూ)ల కూటమి నేతృత్వంలో నడుస్తోంది. ఈ రెండు పార్టీలూ ఒకప్పుడు లోహియా సోషలిజం అనే ఉమ్మడి భావజాలంతో అనుసంధానమై ఉండేవి. భారత రాజకీయాలలోని అతి గొప్ప వ్యక్తులలో ఒకరైన రామ్ మనోహర్ లోహియా పేరుతో ఆ భావజాలాన్ని పిలిచేవారు. ఇప్పుడు దాదాపుగా అందరూ ఆయనను మరచిపోయారు). అసలు సోషలిస్టులంతా కాంగ్రెస్ను వ్యతిరేకించేవారే. అయితే భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం పెరగడంతో, ప్రత్యేకించి దాని బాబ్రీ మసీదు వ్యతిరేక ఉద్యమం విజయవంతం కావడంతో... లోహియావాద రాజకీయవేత్తలు హిందుత్వ వ్యతిరేకులుగా మారారు, కాంగ్రెస్తో కూటములు కట్టడానికి సిద్ధపడ్డారు. అయితే, జార్జ్ ఫెర్నాండెజ్లాంటి కొందరు సోషలిస్టులు తమ కాంగ్రెస్ వ్యతిరేకతావాదానికే కట్టుబడి ఉండిపోయారు. నితీశ్ కుమార్ కూడా కొంత వరకు ఆ బాపతే. అయితే దాదాపు అందరూ తమ అసలు వైఖరైన బీజేపీ వ్యతిరేకతకు తిరిగి వచ్చారు. ఇప్పుడు వారు కపటత్వం, భావజాలాన్ని విస్మరించడం అనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అత్యధిక ప్రజలు పేదలుగా ఉన్న రాష్ట్రాలలో రాజకీయవేత్తలు, వారి కుటుంబాలు కోట్లు కూడబెట్టుకుంటుంటే అది ఎలాంటి సోషలిజం? యాదవ్లపై సీబీఐ తయారు చేసిన నివేదికలు వెయ్యి కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బినామీ లావాదేవీలకు సంబంధించినవి. ఇవి ఆరోపణలు మాత్రమేనని, న్యాయస్థానంలో అవి రుజువు కావాల్సి ఉందని నేనూ అంగీకరిస్తాను. కానీ ఆరోపణలను ఎదుర్కొనడానికి చేస్తున్న వాదనలు వాస్తవాలతో కూడినవి కావు. బీజేపీకి భయపడేది లేదు, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతాం తదితర అంశాల వంటి వాటిని యాదవ్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, వంశపారంపర్య పాలనను పెంపొందింపజేస్తోందనేది సోషలిస్టుల మరో అరోపణ. ఇందిరా గాంధీని నెహ్రూ ప్రోత్సహించారని, రాజీవ్ వారసురాలిగా సోనియా కాంగ్రెస్ అధినేత్రి అయ్యారని ఎవరు నిరాకరించగలరు? కానీ, సోషలిస్టులే స్వయంగా వంశపారంపర్య పాలనను ఏర్పరుస్తారని ఊహించలేం. ఉత్తరప్రదేశ్లోని యాదవ్లు ‘సమాజ్వాదీ’పార్టీని చేజిక్కించుకున్నారు. సమాజవాదమనేది పూర్తిగా పేరులోనే మిగిలించిది. మూడోతరం రక్త బంధువుకు లేదా అంకుల్ కుమారుడికి ఇలా లోక్సభ లేదా శాసనసభ సీటు ఇచ్చారు, ఎన్నికయ్యారూ అంటే వారిని ప్రభుత్వంలోకి తీసుకోకపోవడం దాదాపుగా జరగదు. దేశంలోని విచ్ఛిన్నకర, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకునే సోషలిస్టుల చరిత్ర ఇదీ. మైనారిటీల పట్ల వారి నిబద్ధత బలమైనది, దేశం పట్ల వారిది సమ్మిళిత దృక్పథం నిజమే. రాజకీయాలలో మతానికి సంబంధించినవి గాక మరే సమస్య విషయంలోనూ వారికి విశ్వసనీయత లేదు. అవినీతి సమస్యపై బిహార్, యూపీలలోని యాదవ్లు బీజేపీ, దాని మద్దతుదార్లు సంధించే ఆరోపణలకు బదులు చెప్పడం చాలా కష్టం. విశ్వసనీయత కొరవడటమనే ఈ సమస్య వారికి తీవ్రమైన చెరుపు చేసింది. మతతత్వవాదం 2019 ఎన్నికల్లో ప్రధాన సమస్య అయ్యే అవకాశం చాలా వరకు లేనట్టే. గోవధ వంటి సమస్యలపై హింసను బీజేపీ చాలా వరకు సాధారణమైనదిగా చేసేయడమే అందుకు కారణం. ప్రతి కొన్ని రోజులకోసారి ముస్లింలను చావబాది హత్యగావించడాన్ని దేశం సౌకర్యంగానే ఇముడ్చుకోగలుగుతోంది, దాన్నేమీ పెద్ద సమస్యగా చూడటం లేదు. అలా చూస్తుండి ఉంటే దాని ప్రతిఫలనం మనకు కనిపిస్తుంది. అలాంటిదేమీ కనబడటం లేదు. వీటిని చిన్న సమస్యలుగా చూస్తున్నారు. 2014 ఎన్నికలు పునరావృతం కావడమే ప్రధాన కథనం అవుతుంది. ఉగ్రవాదం పట్ల మెతకగా వ్యవహరించే అవినీతిగ్రస్త రాజకీయవేత్తలు దేశప్రగతికి అడ్డుపడ్డారని, తమ గురించి, తమ కుటుంబాలు సుసంపన్నం కావడం గురించి మాత్రమే ఆసక్తిని చూపి, దేశం నష్టపోవడాన్ని అనుమతించారని మోదీ అంటారు. ఇది అతిగా సాధారణీకరించిన వాదనే కాదు, కచ్చితమైనది కూడా కాదని నా అభిప్రాయం. అయితే ఈ దాడి నుంచి రక్షించుకుంటూ, ఎదురు దాడి చేయడం రాజకీయ ప్రతిపక్షాల పని. వారి ప్రతిస్పందన మతతత్వ ఆరోపణలకే పరిమితమైనంత కాలం అది నెగ్గుకు రాలేదు. అవినీతికి తావు లేకుండా వారు ప్రభుత్వాలను నడపగలుగుతారని అత్యధిక భారతీయులను ఒప్పించగలిగిన కేంద్ర కథనం వారికి అవసరం. మన్మోహన్ సింగ్ ఉన్నట్టుగా, నరేంద్ర మోదీ ఉంటున్నట్టుగా వారు వ్యక్తిగతంగా సందేహాలకు అతీతులుగా ఉండాలి. బిహార్, యూపీ, ఇంకా పలు ఇతర రాష్ట్రాలను చూడండి... ఎన్నో ఏళ్లుగా కళంకితమై ఉన్న అవే ముఖాలను ఇంకా చూడటం ఎలా సాధ్యం? ఈ భారాన్ని మోసుకుంటూ ప్రతిపక్షం 2019లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ సమస్యను గుర్తించి, దాన్ని మార్చడానికి శక్తివంతంగా కృషిచేస్తే తప్ప, ఆ కారణంగా వారు 2014లో లాగే ఓటమి పాలు కాక తప్పదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
క్రికెట్లో రిజర్వేషన్.. జట్టుకూ, దేశానికీ మంచిదే
అవలోకనం క్రికెట్లో రిజర్వేషన్ ప్రవేశపెట్టి కోటా ప్రకారం ఆటగాళ్లను తీసుకున్నప్పటికీ ఒక జట్టుగా దక్షిణాఫ్రికా ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నింటికీ కొరకరాని కొయ్యలాగే ఉంటూ వచ్చింది. దళితులకు భారత క్రికెట్లో రిజర్వేషన్ కల్పిస్తే దీర్ఘకాలంలో అది జట్టుకు, దేశానికి కూడా ప్రయోజనం కలిగించవచ్చు. కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే 25 శాతం రిజర్వేషన్లనే కావాల న్నారు. ఈ అంశంపై దృష్టి సారించి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశ జనాభాలో 25 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు క్రికెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం విషాదకరం. మన దేశంలో మధ్యతరగతి రిజర్వేషన్లను ఇష్టపడలేదు అనే విషయాన్ని ఇటీవల జరిగిన రెండు ఘటనలు ముందుపీఠికి తెచ్చాయి. క్రికెట్లో రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే డిమాండ్ చేశారు. భారత క్రికెట్ టీమ్ ప్రత్యర్థులతో పేలవమైన రికార్డును కలిగి ఉందని ఆయన ఆరోపిం చారు. భారత జాతీయ క్రికెట్ జట్టు సాధించిన విజయాల కంటే పరాజయాలే ఎక్కువని రామ్దాస్ చెప్పడం నిజమేనా? అవునన్నదే సమాధానం. టెస్టు క్రికెట్లో ఇతర దేశాల జట్లతో భారత్కు పరాజయ రికార్డే ఉంది. ఆస్ట్రేలియాతో భారత్ (41 ఓటములు, 21 విజయాలు), ఇంగ్లండుతో (43 ఓట ములు, 25 విజయాలు), పాకిస్తాన్తో (12 ఓటములు, 9 విజయాలు), వెస్టిం డీస్తో (30 ఓటములు, 19 విజయాలు), దక్షిణా ఫ్రికాతో (13 ఓటములు, 10 విజయాలు) రికార్డు కలిగి ఉంది. వీటితో పోలిస్తే బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జింబాబ్వే, శ్రీలంక జట్లతోనే మనకు విజయాల రికార్డు అధికంగా ఉంది. ఇక వన్డే ఇంటర్నేషనల్స్ విషయంలోనూ ఈ రికార్డు పెద్ద తేడాతో లేదు. వన్డే మ్యాచ్లలో ఆస్ట్రేలియాతో భారత్ (72 ఓటములు, 41 విజయాలు) కలిగి ఉండగా పాకిస్తాన్తో (73 ఓటములు, 52 విజయాలు), వెస్టిండీస్తో (61 ఓట ములు, 56 విజయాలు), దక్షిణాఫ్రికాతో (45 ఓటములు, 29 విజయాలు) రికార్డును కలిగి ఉంది. క్రికెట్ ప్రపంచంలోని ప్రధాన జట్లలో ఒక్క ఇంగ్లండుతో మాత్రమే (39 ఓటములు, 52 విజయాలు) అపజయాల కంటే విజయాలను అధికంగా కలిగి ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే, క్రికెట్లోనూ రిజర్వేషన్లు ఉండాలన్న కేంద్ర మంత్రి రామ్దాస్ సూచనను పరిశీలించడానికి మనం సిద్ధపడాల్సి ఉంది. గత సంవత్సరం దక్షిణాఫ్రికా తన క్రికెట్ జట్టులో వివక్షా వ్యతిరేక కోటాను తీసుకువచ్చింది. జట్టులో ఆడే 11 మంది ఆటగాళ్లలో తప్పకుండా 6గురు నల్ల వాళ్లు ఉండాలి. వీరిలో కనీనం ఇద్దరు ఆఫ్రికన్ నల్లవాళ్లు అయి ఉండాలి. ఇండి యన్ లేదా భారత ఉపఖండానికి చెందిన హాషిమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్ వంటి ఆటగాళ్లను పై ఇద్దరి జాబితాలో కాకుండా ఆరుగురి జాబితాలో పొందుపర్చు తారు. దక్షిణాఫ్రికా ఎందుకలా చేసిందంటే దేశ జనాభాలో 80 శాతం మంది ఆఫ్రికన్ నల్లజాతి ప్రజలే కానీ వారికి జట్టులో న్యాయమైన ప్రాతినిధ్యం లేదు. అదే తెల్లజాతి ప్రజల విషయానికి వస్తే జనాభాలో వీరు 10 శాతం మాత్రమే ఉన్నప్పటికీ టీమ్లో ఎల్లప్పుడూ వారి ఆధిక్యమే ఎక్కువగా ఉంటోంది. ఎందు కంటే దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష అమలులో ఉన్నప్పుడు దశాబ్దాలుగా శ్వేతజాతీ యులే అత్యున్నత స్థాయిల్లో క్రీడా సౌకర్యాలను, శిక్షణ, కోచింగ్ వనరులను పొందగలుగుతూ వచ్చారు. దక్షిణాఫ్రికా జనాభాలో భారతీయులు 2 శాతం మాత్రమే ఉన్నప్పటికీ ఆ దేశ క్రికెట్ జట్టులో వీరికి మంచి ప్రాతినిధ్యం ఉండేది. కాబట్టే ప్రత్యేకించి దక్షిణా్రíఫికా నల్లవారికే కోటా తప్పనిసరి అవసరమైంది. మరి ఈ కోటా అనేది జట్టు పనితీరును దెబ్బతీసిందా? అంటే లేదు. కోటా ప్రకారం ఆటగాళ్లను తీసుకున్నప్పటికీ ఒక జట్టుగా దక్షిణాఫ్రికా ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నింటికీ కొరకరాని కొయ్యలాగే ఉంటూ వచ్చింది. కాని ఈ కోటా పద్ధతి వల్ల జరిగే ప్రయోజనం రానున్న దశాబ్దాల్లోనే ఒనగూరుతుంది. గతంలో కులీన వర్గాలు మాత్రమే ఆడుతూ వచ్చిన ఆటలో లక్షలాదిమంది నల్ల ఆఫ్రికన్లు భాగం కావడం ద్వారా జాతీయ జట్టు నిజంగానే మేలు పొందుతుంది. ఇక భారత్లో దళిత, ఆదివాసీ జనాభా మొత్తం జనాభాలో 25 శాతంగా ఉంది. కానీ క్రికెట్లో వారి ప్రాతినిథ్యం ఇప్పటికీ శూన్యమే. భారత్ క్రికెట్ జట్టులో భాగమైన బ్రాహ్మణ క్రీడాకారులను (గవాస్కర్, టెండూల్కర్, ద్రావిడ్, గంగూలీ, శ్రీనాథ్, కుంబ్లే) గురించి తెలుసుకోవడం చాలా సులభం. కానీ వెనుకబడిన సామాజిక బృందాలు, దళితులు, ఆదివాసీల నుంచి వచ్చి జట్టులో చేరిన వారి పేర్లను కనుగొనడం చాలా కష్టం. రామ్దాస్ అథవాలే 25 శాతం రిజర్వేషన్లనే కావాలన్నారు. ఈ అంశంపై దృష్టి సారించి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక రెండో కథనం ఏమిటంటే రాజకీయాల్లో రిజర్వేషన్లు. బీజేపీ భారత రాష్ట్రపతి పదవికి ఒక దళితుడిని నామినేట్ చేసింది. నిజంగానే ఇది చాలా తెలి వైన, సమర్థనీయమైన నిర్ణయం. కోవింద్ ఆరెస్సెస్ నుంచి రాలేదు. సాపేక్షికంగా చూస్తే.. 40 ఏళ్ల పైబడిన వయస్సులోనే ఆయన పార్టీలో చేరారు. దళితులతో ఆరె స్సెస్, బీజేపీకి ఉన్న సంక్లిష్ట సంబంధానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే స్వభావరీత్యానే హిందుత్వ పార్టీ రిజర్వేషన్లకు, దళితులను అంత ర్భాగం చేసుకోడానికి వ్యతిరేకమైనట్టిది. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ల జాబి తాను మనం చూడవచ్చు (హెగ్డేవార్, పరాంజపే, గోల్వాల్కర్, దేవరస్, సుద ర్శన్, ప్రస్తుత చీఫ్ భగవత్). వీళ్లంతా బ్రాహ్మణులే. రాజేంద్రసింగ్ అనే ఒకే ఒక ఆరెస్సెస్ చీఫ్ మాత్రమే బ్రాహ్మణేతరుడు. తనుకూడా అగ్రకులం నుంచి వచ్చారు. ఆరెస్సెస్కు అధిపతిగా దళితుడిని నియమించడం కంటే దళితుడిని భారత రాష్ట్రపతిగా చేయడం హిందుత్వకు సులభమని చెబుతున్నారు మరి. ఈ ఆరోపణకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ సింపుల్గా ఇలా సమర్థించుకుం టుంది. ‘మేము కులం గురించి అడగం, కులాన్ని గుర్తించం కూడా’. కింది వర్గా లను మీ సిబ్బందిలో ఎలా అంతర్భాగం చేసుకుంటున్నారని ప్రశ్నించినప్పుడు కార్పొరేట్ ఇండియా కూడా ఇలాగే చెబుతూ వస్తుంది. భారత క్రికెట్ జట్టు కూడా తనకు కులం పట్టింపు లేదని చెప్పవచ్చు. కానీ వివక్ష పాటింపు, కింది వర్గాలను మినహాయించడం అనే వాస్తవాన్ని అది మరుగుపరుస్తోంది. కింది వర్గాలను అంతర్భాగం చేయడం, వైవిధ్యతను పాటించడం అనేది దీర్ఘకాలంలో క్రికెట్ జట్టుకే కాకుండా దేశానికి కూడా ప్రయోజనం కల్పించవచ్చు. ఇలాంటి చర్య వల్ల ఆటలో మన రికార్డు మసకబారుతుందని వాదించేవారికి నేను డేటాను చూపిం చడమే కాకుండా బలమైన జట్టుతో తలపడినప్పుడు మనం ప్రత్యేకించి మంచి టీమ్గా లేమని చెప్పగలను. అందుకనే క్రికెట్లో మన రికార్డును సమర్థించుకోవ డానికి ఆ డేటాను వాడుకోవడం కాకుండా, రామ్దాస్ అథవాలే చెప్పిన అంశంపై తీవ్రంగా దృష్టి పెట్టాలి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
గోరక్షక హింసను ఎలా ఆపుతారో చెప్పాలి
అవలోకనం మోదీ జూన్ 29 ప్రసంగం చివర్లో ఆయన హింస గురించి మాట్లాడినా, చంపడం ఆమోదనీయం కాదనడానికే పరిమితమయ్యారు. కానీ గోరక్షణ పేరిట చంపడం ఎందుకు జరుగుతోంది? దాన్ని ఆపడానికి మోదీ ఏమి చేస్తారు? అనేవి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మోదీ, బీజేపీలు గోరక్షను ముందుకు తెస్తున్నంతవరకూ గోరక్షకులు పుట్టుకొస్తూనే ఉంటారు. మోదీ, బీజేపీలు గోరక్షకుల చర్యలకు మత కోణం ఉందని అంగీకరించడంలేదు. కానీ మాంసం, తోళ్లు.. ముస్లింలు, దళితుల జీవనాధార వృత్తులు. ఈ గోరక్ష వల్ల ఆ రెండు సామాజిక వర్గాలకు నష్టం జరుగుతోంది. గోరక్షక హింస అంటే గొడ్డు మాంసం గురించి భారతీయులను హతమారుస్తుండటమనే సమస్య అని అర్థమా? అలాగయితే, ఆ సమస్య పరిష్కారానికి చేయాల్సింది ఏమిటి? మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే 97 శాతం గోరక్షక హింస జరిగిందని లాభాపేక్ష రహితమైన గణాంక పాత్రికేయ వెబ్సైట్ అయిన ‘ఇండియాస్పెండ్’పేర్కొంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, మహారాష్ట్ర, హరియాణా తదితర రాష్ట్రాలు గోమాంస నిషేధాన్ని ముందుకు తేవడం ప్రారంభించడంతోనే ఈ హత్యలు మొదలయ్యాయి. వాస్తవాలిక్కడ సుస్పష్టంగానే కనిపిస్తున్నాయి. వాటిని చూడాలంటే.. ఒక్కసారి గత కొన్ని వారాలను మననం చేసుకుని, దేశవ్యాప్తంగా ఏం జరిగిందో చూడండి. జార్ఖండ్, రాంచీ సమీపంలోని రామ్ఘర్లో జూన్ 29న అలీముద్దీన్ అన్సారీ అనే వ్యాపారిని ఒక గుంపు కొట్టి చంపేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తాను హింసకు వ్యతిరేకినని చెప్పిన కొన్ని గంటలకే ఈ దాడి జరిగింది. జార్ఖండ్లో జూన్ 27న ఉస్మాన్ అన్సారీ అనే పాడి రైతుపై వందిమందికి పైబడిన గుంపు దాడి చేసి చావబాదింది. ఆయన ఇంటికి నిప్పుపెట్టగా కొంత భాగం కాలిపోయింది. దాడి చేసినవారు తమపై కూడా రాళ్లు రువ్వడంతో 50 మంది పోలీసులు గాయపడ్డారని పోలీసు అధికారులు పాత్రికేయులకు చెప్పారు. జూన్ 24న పశ్చిమ బెంగాల్లోని నార్త్ దినాజ్పూర్లో ఆవులను దొంగిలిస్తున్నారన్న ఆరోపణతో నజీరుల్ హక్, మొహమ్మద్ సమీరుద్దీన్, మొహమ్మద్ నజీర్ అనే ముగ్గురు నిర్మాణ కార్మికులను కొట్టి చంపేశారు. ఇంతవరకు ముగ్గురిని అరెస్టు చేసి వారిపై హత్యానేరాన్ని నమోదు చేశారు. హరియాణాలో జూన్ 22న పదిహేనేళ్ల జునైద్ ఖాన్ను రైలులో కత్తులతో పొడిచి చంపేశారు. జునైద్ను పొడిచి చంపడానికి ముందు అతను ‘‘గొడ్డుమాంసం తినేవాడు’’అని ఆరోపిస్తూ అతని తలమీది టోపీని తీసి బయటకు విసిరేశారు. జునైద్ సోదరుడు ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బతికి బయటపడ్డ అతడు, కనీసం 20 మంది ఈ దాడిలో పాల్గొన్నారని చెప్పినట్టు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. రాష్ట్ర పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, మాలెగావ్లో మే 26న మాంసం వ్యాపారులైన ఇద్దరు ముస్లింలపై వారు గోమాంసాన్ని అమ్ముతున్నారనే ఆరోపణతో ఒక గోరక్షక దళం దాడి చేసింది. వారిని చెంపదెబ్బలు కొట్టి, తిట్టి, ‘‘జై శ్రీరామ్’’అనమని నిర్బంధించడం ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఫూటేజీలో కనిపించింది. ఆ కేసులో తొమ్మిది మందిని ఆరెస్టు చేశారు. కానీ, ఆ ఇద్దరు మాంసం వ్యాపారులపైన కూడా ‘‘మత భావనలను గాయపరచడం’’అనే క్రిమినల్ నేరారోపణలను మోపారు. అస్సాం, నవగావ్లో అబూ హనీఫ్, రియాజుద్దీన్ ఆలీలను ఆవును దొంగిలించారన్న అనుమానంతో ఒక గుంపు కొట్టి చంపేసింది. పోలీసులు హత్య కేసు నమోదు చేశారుగానీ ఇంతవరకు అరెస్టులు మాత్రం చేయలేదు. రాజస్తాన్, ఆల్వార్లో ఒక రహదారికి సమీపాన ఏప్రిల్ 1న, 55 ఏళ్ల రైతు, పాడి రైతుఅయిన పెహ్లూ ఖాన్, మరో నలుగురు ముస్లింలపై ఒక గుంపు దాడి చేసింది. రెండు రోజుల తర్వాత ఖాన్ ఆ గాయాలకు మృతి చెందాడు. వారు ఆవుల స్మగ్లర్లంటూ ఆ గుంపు తప్పుడు ఆరోపణ చేసింది. ఆ హత్యలను సమర్థిస్తున్నట్టుగా.. ఖాన్ ఆవుల స్మగ్లర్ల కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఆ ఘటన తదుపరి రాజస్తాన్ హోంమంత్రి ప్రకటించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. జూన్ 27న జార్ఖండ్లో కొట్టి చంపేసిన ఘటన జరిగిన తర్వాత, ఈ హత్యలు ప్రభుత్వ రక్షణతో జరగుతున్నవేనంటూ, వాటిని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ‘‘భారతదేశంలో హింసకు తావు లేదు. గాంధీజీ గర్వపడేలాంటి భారతదేశాన్ని సృష్టిద్దాం’’అని రెండు రోజుల తర్వాత మోదీ ట్వీట్ చేశారు. దానికి ఓ రెండున్నర నిమిషాల వీడియోను జత చేశారు. అది జూన్ 29న ఆయన గోవధపై చేసిన ప్రసంగం. అందులో మోదీ ఒక నిమిషం 45 సెకన్లపాటూ గోరక్షణను కీర్తించారు. చివరి 30 సెకన్లలో హింస గురించి మాట్లాడారు. అది కూడా చంపడం ఆమోదనీయం కాదని చెప్పడానికే పరిమితమయ్యారు. అసలు చంపడం ఎందుకు జరుగుతోంది, దాన్ని ఆపడానికి ఆయన ఏమి చేస్తారు అనే వాటిపై ఆయన మాట్లాడాలని మనం కోరుకుంటున్నాం. మోదీ, బీజేపీలు గోరక్షను ముందుకు తెస్తున్నంతవరకూ దేశంలో గోరక్షకులు పుట్టుకొస్తూనే ఉంటారు. దీన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఇక రెండో సమస్యకు వస్తే, మోదీగానీ, బీజేపీగానీ గోరక్షకుల చర్యలకు మత కోణం ఉందని అంగీకరించడంలేదు. మాంసం, తోళ్లు... ముస్లింలు, దళితుల జీవనాధార వృత్తులు. ఈ గోరక్ష వల్ల ఆ రెండు సామాజిక వర్గాలకు నష్టం జరుగుతోందనేదాన్ని నిరాకరించడం నయవంచన. జార్ఖండ్లోని తాజా హత్య తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దాన్ని మతంతో ముడిపెట్టరాదని అన్నారు. కానీ గణాంక సమాచారం ఆయన చెప్పేది తప్పని చూపుతుండటమే సమస్య. ఇది మతంతో ముడిపడినదే. ఈ గోరక్షా కార్యక్రమంతో ముస్లింలు మాత్రమే లేదా ముస్లింలే ప్రధానంగా దాడులకు, హత్యలకు గురవుతున్నారు, ఈ సమస్యపై కాంగ్రెస్కు తనకంటూ ఒక వైఖరే లేదు. గుజరాత్లో అది బహిరంగంగానే గోరక్షకు అనుకూలంగా మాట్లాడింది. ఆ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై దాడి చేశారు. మోదీ ఉపన్యాసం తర్వాత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ‘‘ప్రధాని గోరక్షకులను హెచ్చరించిన రోజునే, జార్ఖండ్లో మొహమ్మద్ అలీముద్దీన్ను ఒక గుంపు కొట్టి చంపేసింది. ఈ కొట్టి చంపేసే మూకలకు ప్రధాని అంటే భయం లేదనేది స్పష్టమే’’అని అన్నారు. ‘‘ప్రధాని గోరక్షకులను, కొట్టి చంపే మూకలను హెచ్చరించారు. మంచిది. అయితే ఆయన తన ఆదేశం అమలయ్యేలా ఎలా చేస్తారో దేశానికి చెప్పాలి’’అని కోరారు. 2016లో ఇలాంటి దాడులు 26 జరిగాయని ఇండియా స్పెండ్ తెలిపింది. 2017లో కేవలం ఆరునెలల్లో, ఇప్పటికే 21 దాడులు జరిగాయి. సమస్య మరింతగా పెరుగుతోందనేది కనబడుతూనే ఉంది. మోదీ దీన్ని ఎలా అంతం చేస్తారో చూడాలని ప్రపంచమంతా వేచి చూస్తోంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ ఈ–మెయిల్ : aakar.patel@icloud.com -
‘జాతీయవాద’ చట్రంలో చిక్కిన క్రికెట్
భారత ఉపఖండానికి చెందిన జట్లు ఆడే క్రికెట్ క్రీడను జాతీయవాద దృక్పథంతో చూడటమే సమస్య. ప్రత్యర్థి జట్లు బౌండరీలు కొట్టినా లేదా వికెట్లు తీసుకున్నా స్టేడియంలు నిశ్శబ్దంగా మారుతాయి. అన్ని జట్ల విషయంలోనూ ఇది జరిగేదే. కాకపోతే భారత్–పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్ల విషయంలో ‘శత్రు’ జట్టుపై ప్రేక్షకుల కోపం మరింత ఎక్కువ. చెప్పుకోదగిన ప్రయోజనమేదీ పెద్దగా లేకపోయినా ఎదురెదురుగా నిలిచి అపకుండా కాల్పులు సాగిస్తుండే సేనల స్థానంలో గొంతులు చించుకుని దూషించే పౌరులు నిలుస్తారు. భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు పరస్పరం తలపడుతుంటే చూసి ఇరు దేశాల ప్రజలు ఆనందిస్తారా? మనం ఇక ఎంత మాత్రమూ ఆ అనుభూతిని ఇష్టపడటం లేదనే నమ్మకానికి వచ్చేశాను. అలా ఆనందించడం ఒకప్పటి సంగతి కావచ్చు గానీ, ఇంచుమించు గత 25 ఏళ్లుగా పరిస్థితి అలా లేదు. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర విద్వేషం, అయిష్టం క్రికెట్ మ్యాచ్లు జరిగే సందర్భాల్లో అధికంగా ఉంటాయి. మీడియా కారణంగా అవి కట్టలు తెంచుకునే స్థాయిలో నిలుస్తాయి. ఫుట్బాల్ మ్యాచ్లకు భిన్నంగా క్రికెట్ ఆట రోజంతా లేదా ఐదు రోజుల పాటూ సాగుతుంది, బాధ లేదా విజయోత్సాహం భావన దీర్ఘంగా విస్తరిస్తాయి. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్లు ఆడటం ఒకప్పుడైతే కోరుకోదగిన మంచి విషయమే. కానీ, ఇప్పుడు రెండు జట్లూ ఒకదానితో మరొకటి తలపడటం ఇంచుమించుగా మానేశాయి. కాబట్టి ఈ చేదు అనుభవం టీ20లకు, వన్డే ఇంటర్నేషనల్స్కు మాత్రమే, అది కూడా తటస్థ మైదానాలలో జరిగే వాటికే పరిమితమైంది. భారత ఉపఖండంలోని జట్లు ఆడే క్రికెట్ క్రీడను జాతీయవాద దృక్పథంతో చూడటం, మెచ్చుకోవడం అనేదే దీనికి సంబంధించిన మొదటి సమస్య. ప్రత్యర్థి జట్లు బౌండరీలు కొట్టినప్పుడు లేదా వికెట్లు తీసుకున్నప్పుడు స్టేడియంలు నిశ్శ బ్దంగా మారుతాయి. అన్ని జట్ల విషయంలోనూ ఇది జరిగేదే. కాకపోతే భారత్– పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్ల విషయంలో ‘శత్రు’ జట్టుపై ప్రేక్షకుల కోపం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్థి జట్ల మధ్య ఉండే స్నేహపూర్వక వాతా వరణం, సరదాగా ఆటపట్టించడం వంటి ఇతర అంశాలు స్టేడియంలో క్రీడలను చూడటాన్ని ఆనందదాయకంగా చేస్తాయి. ఉపఖండంలో జరిగే పోటీల్లో అది పూర్తిగా కొరవడుతుంది. క్షేత్రస్థాయిలో చెప్పుకోదగిన ప్రయోజనమేదీ పెద్దగా లేక పోయినా ఎదురెదురుగా నిలిచి ఆగకుండా కాల్పులు సాగిస్తుండే సేనల స్థానంలో గొంతులు చించుకుని దూషించే పౌరులు ఉంటారు (వారు కూడా తమ తమ జట్ల రంగుల యూనిఫారాల్లో ఉంటారు). గుజరాతీలు క్రీడలకు సంబంధించి అదనంగా మరో అంశాన్ని చేర్పు చేశారు. జాతీయత ఆవహించి ఉన్న సందర్భంలోనూ అది పని చేస్తుంటుంది. ఒకప్పుడు నేను మహా జోరుగా పందేలు (బెట్టింగ్లు) కాసేవాడ్ని (ఇప్పుడిక ఎంత మాత్రం చేయడం లేదు). ఒక సాయంత్రం మా బావమరిది సందీప్ ఘోష్ మా ఇంటికి వస్తున్నారు, అప్పుడు భారత్, శ్రీలంకతో ఆడుతోంది. ఆయన లంకపై పందెం కాయాలనుకున్నారు. ఆ పందెం కాయమని చెప్పడానికి నేను బుకీకి ఫోన్ చేశాను. ఆ పని ముగించాక, భారత్కు వ్యతిరేకంగా ఎందరు పందేలు కాసి ఉంటారా? అని మాకు ఆశ్చర్యం కలిగింది. గుజరాతీలు తమ ఉద్వేగాలను వ్యాపారానికి దూరంగా ఉంచుతారు. కాబట్టి చాలా మందే కట్టి ఉంటారని అనుకున్నాం. నేను మళ్లీ బుకీకి ఫోన్ చేసి అడిగితే దాదాపు ఓ యాభై మంది ఉంటారని, ఘోషే మొదటివాడని చెప్పాడు. బాగా పందేలు కాసే గుజరాతీలు సైతం జాతీ యవాదం వెంటపడి పోయి, తమ డబ్బుతో కూడా భారత్కు మద్దతు తెలుపు తున్నారని దీని అర్థం. ఆ మ్యాచ్లో లంక గెలిచింది. ఇకపోతే, పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ల విషయంలో అ పందేలు కట్టే అంశం కూడా దాదాపుగా అంతరించి, పరిస్థితి ఇంచుమించు యుద్ధంలా మారింది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం భారత్–పాక్ మ్యాచ్లను చూడటం ఆనందదాయకంగా ఉండగా జరిగిన ఒక మ్యాచ్ గుర్తుకు వస్తోంది. అప్పుడు మియాందాద్, ఇమ్రాన్ఖాన్ల క్రీడా నైపుణ్యం తారస్థాయిలో ఉండేది, కపిల్దేవ్ అప్పుడే గవాస్కర్ నేతృత్వంలోని భారత జట్టులో చేరాడు. క్రికెట్ క్రీడ ఇబ్బం దికరంగా మారడం మొదలైన తొలి మ్యాచ్లలో ఒకటి భారత్–వెస్టిండీస్ల మధ్య 1983 అక్టోబర్లో శ్రీనగర్లో జరిగింది. ప్రేక్షకులు భారత్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు, ప్రేక్షకుల నుంచి తమకు లభించిన మద్దతుకు వెస్టిండీస్ జట్టు నిర్ఘాంత పోయింది. గవాస్కర్ తన ‘‘రన్స్ ఎన్ రన్స్’’లో ఆ ఆనుభవాన్ని వర్ణించారు. ప్రేక్ష కులు ఇమ్రాన్ఖాన్ పోస్టర్లను పట్టుకుని ఉండటం గురించి రాశారు. నాతో సహా చాలా మంది భారతీయులకు కశ్మీర్లో పరిస్థితి సాధారణంగా లేదనే విషయం తెలిసింది అప్పుడే. గవాస్కర్ అనుభవానికి కారణం మరి దేనికన్నా ఎక్కువగా భారత వ్యతిరేకతేనని నా భావన. అది అవహేళనే. అయితే ఆయన దాన్ని సరైన రీతిలో స్వీకరించారు. గవాస్కర్ ప్రేక్షకులకు ముందు తనను, తర్వాత మైదానాన్ని చూపి, అటుపిమ్మట ఇమ్రాన్ పోస్టర్ను, ఆకాశాన్ని చూపినట్టు ఆయన రాశారు. తన సైగలకు ప్రేక్షకులు పెద్దగా హర్షధ్వానాలు చేశారని పేర్కొన్నారు. మార్చి 2004లో ముల్తాన్లో జరిగిన మ్యాచ్లో షోయబ్ అక్తర్, మోహ్మద్ సమీల బౌలింగ్ను ఎదుర్కొని వీరేంద్ర సెహ్వాగ్ త్రిశతకం చేశాడు. ఆ సమ యంలో నేను, ఒక పాకిస్తానీ స్నేహితునితో కలసి స్టేడియంలోనే ఉన్నాను. ఆ మ్యాచ్ జరుగుతుండగా మమ్మల్ని భారతీయులుగా గుర్తించిన ప్రేక్షకులు ఆటోగ్రా ఫ్లను కోరుతూ మా వద్దకు వచ్చారు. అటల్ బిహారీ వాజపేయి, పర్వేజ్ ముష ర్రఫ్ల చొరవతో జరిగిన ప్రెండ్షిప్ సిరీస్ సందర్భంగా అది జరిగింది. కార్గిల్లో, ఒక్కో పక్షాన దాదాపు 500 మంది మరణించిన పెద్ద యుద్ధాన్ని సాగించిన నేతలు వారు. వాజపేయి ప్రధాని, ముషర్రఫ్ ఆర్మీ చీఫ్. ఇరువురూ తమ ఆయుధాలను, అణు కార్యక్రమాలను ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన వారే. అంతేకాదు, అది కశ్మీర్లో అత్యధికంగా హింస చెలరేగిన కాలం కూడానని గుర్తుంచుకోవాలి. జమ్మూకశ్మీర్లో 2016లో సంభవించిన మరణాలతో (267) పోలిస్తే, 2001లో అంతకు 20 రెట్లు (4,507) మరణించారు. కశ్మీర్లో పరిస్థితులు మరింతగా విషమించాయని మనం విశ్వసించేట్టయితే అందుకు కారణాలు క్షేత్రస్థాయిలోని వాస్తవాలు మాత్రం కాదు. రాజకీయాలు, మీడియా అందుకు కారణం. జమ్మూకశ్మీర్లో నాటితో పోలిస్తే హింస తక్కువగా ఉన్న ఈ రోజుల్లో అలాంటి సిరీస్ జరగడమనే ఆలోచనే అద్భుతంగా ఉంటుంది. కానీ నేడు ఇరు దేశాల జనాభాల మనసుల్లో నెలకొని ఉన్న హింస, ఆనాడు నిజంగా చెలరేగిన హింస కంటే ఎక్కువగా ఉంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
అన్ని ప్రభుత్వాల సారాంశం ఒక్కటే
తమ హక్కులకోసం, మనుగడ కోసం ఆందోళన చేస్తున్న పౌరులను భారత రాజ్యవ్యవస్థ అణచివేయటం నరేంద్ర మోదీతోనే మొదలు కాలేదు. తొలి ప్రధాని నెహ్రూ హయాంలో, బ్రిటిష్ హయాంలో, బహుశా అంతకుముందు నుంచి కూడా ఇది కొనసాగుతోంది. మోదీ తర్వాత కూడా ఇదే జరగనుంది. తన కంటే ముందున్నవారు పాటించిన దాన్ని మోదీ కేవలం కొనసాగిస్తున్నారని మనం అంగీకరించక తప్పదు. భాషలో మాత్రమే తేడా ఉంటోంది తప్ప, వైఖరి మాత్రం అప్పుడూ ఇప్పుడూ కూడా కఠినంగా ఉంది. భారత్ను ఉదారవాద వ్యతిరేక దేశంగా మారుస్తున్నారన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తప్పుగా మోపే ఆరోపణల్లో ఒకటి. ఉదారవాద వ్యతిరేకత (ఇల్లిబ రల్) అనే పదానికి అసహనం అనీ, వాక్ స్వేచ్ఛపై ఆంక్షలకు మద్దతు ఇవ్వడం అని అర్థం. ఈ విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుగా నిందిస్తున్నారని నేనంటాను. ఎందుకంటే భారత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో కూడా ప్రత్యేకించి ఉదారవాద స్వభావంతో లేదని వాస్తవాలు చూపుతున్నాయి. దశాబ్దాలుగా కొన్ని సమస్యల పరిష్కారంపై పనిచేస్తున్న పౌర సమాజ బృందాలు, ప్రభుత్వేతర సంస్థలు నేను చెప్పిన అంశాన్ని ససాక్ష్యంగా నిర్ధారిస్తాయి. ఆదివాసీలు, కశ్మీరీలు, ఈశాన్య భారత ప్రజల హక్కుల వంటి సమస్యలు ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్నవి కావు. దశాబ్దాలుగా ఈ సమస్యలు మనని పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం లేదా ఈ ప్రధానమంత్రే సమస్యలన్నిటికీ కారణం అని భావించడం తప్పు. ఖనిజ సంపదకు సంబంధించి అత్యంత సుసంపన్నంగా ఉండే ఆదివాసీ భూములను కొల్లగొట్టడం అనేది నెహ్రూ హయాంలో, ఇంకా చెప్పాలంటే ఆయన కంటే ముందే మొదలైంది. ఆదివాసీలకు వ్యతిరేకంగా అత్యంత అసహ్యకరమైన, అత్యంత తలబిరుసుతనంతో కూడిన చర్యలను మన్మోహన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టారు. కొద్దిమంది చేస్తున్నారని చెబుతున్న నేరాలకు గానూ ఆదివాసులందరినీ శిక్షిస్తున్నారు. మధ్యభారత్ ప్రాంతంలో వేలాది పారామిలటరీ బలగాలు తిష్టవేయడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. 2015 అక్టోబర్ నెలలో ‘మావోయిస్టు వ్యతిరేక చర్యలు : ఛత్తీస్గఢ్, గగనతలం నుంచి ప్రతీకార దాడులు కొనసాగించనున్న భారత వాయుసేన’ శీర్షికతో పత్రికలు వార్త ప్రచురించాయి. భారత వాయుసేన తన సొంత ప్రజలపై ఆకాశం నుంచి దాడి చేయడానికి రష్యన్ తయారీ ఎమ్ఐ–17 హెలికాప్టర్లను ఉపయోగిం చిందన్నది ఆ వార్తా కథనం సారాంశం. వాయుసేన ‘విజయవంతంగా దాడుల’ను కొనసాగించిందని ‘మూడు ఐఎఎఫ్ హెలికాప్టర్లు బీజాపూర్ ప్రాంతంపై విహరించి, దాడులు చేశాయ’ని వార్తలు తెలిపాయి. దాడులు అంటే ‘తక్కువ ఎత్తులో విహరిస్తున్న యుద్ధ విమానం నుంచి పదేపదే బాంబులతో దాడి చేయడం అనీ లేదా మెíషీన్ గన్లతో కాల్పులు జరపటం’ అనీ అర్థం. భారత దేశం గురించి పరిచయం ఉన్నవారికి దేశంలో జనం ఏమాత్రం లేని ప్రాంతాలు అంటూ ఏవీ లేవని తెలిసే ఉంటుంది. మరి మన వాయుసేన పైనుంచి బాంబులతో, మెషీన్ గన్ కాల్పులతో సైనిక చర్యల ప్రాక్టీస్ చేసిన ప్రాంతంలో ఏం జరిగి ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ స్థాయి హింస ఆ ప్రాంతానికి కొత్త కాదనీ, బ్రిటిష్ కాలం నుంచి, ఇంకా చెప్పాలంటే అంతకు ముందునుంచి కూడా ఆందోళన చేస్తున్న పౌరులను భారత రాజ్యవ్యవస్థ అణచివేస్తోందన్నదే ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఇదంతా మోదీతోనే ప్రారంభమైందని భావించడం తప్పు మాత్రమే కాకుండా వాస్తవ సమస్యను నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి అలాంటి ఊహే మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. మోదీకి ముందు, భారత రాజ్య వ్యవస్థ తన పౌరులతో ఇలాగే వ్యవహరించింది, దురదృష్టవశాత్తూ మోదీ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తుంది కూడా. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంతో నేను కొన్ని నెలల క్రితం సంభాషిం చాను. కశ్మీర్ నుంచి సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఎఎఫ్ఎస్పీఎ)ని భారత ప్రభుత్వం ఎత్తివేయాలని ఆయన చెప్పారు. అయితే తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు కూడా చిదంబరం ఈ అభిప్రాయాన్నే వ్యక్తీకరించి ఉంటే అది మరింత విశ్వసనీయంగా ఉండి ఉండేదని నేను భావిస్తున్నాను. కశ్మీరీల ఆందోళనపై ప్రస్తుత ప్రభుత్వ కఠిన వైఖరిపట్ల చింతిస్తున్నవారు.. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి కఠిన వైఖరినే ప్రదర్శించాయని తెలుసుకోవాలి. ఏమంటే దాని వ్యక్తీకరణే కాస్త భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేకమందిని చంపించింది. కానీ అది ఈ విషయంపై మృదువుగా మాట్లాడుతుంది. బీజేపీ కఠిన పదాలు వాడుతుంది. రెండు పార్టీల మధ్య ఉన్న అసలు వ్యత్యాసం ఇదే. తన ప్రజల అవసరాలు, హక్కులకు భిన్నంగా ఉండే ప్రాథమ్యాలపైనే భారత రాజ్యవ్యవస్థ పనిచేస్తూ వచ్చింది. భారత్ను లూఠీ చేస్తూ తన సొంత ప్రయోజనాల కోసం మన వనరులను తరలిస్తోందని మనం బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వాన్ని విమర్శిస్తూంటాం. 1943 నాటి బెంగాల్ కరువు ఉదాహరణను యుద్ధ విధాన ఫలితంగా చూపుతుంటారు. ప్రజలు ఆకలిదప్పులకు గురవుతూ, అవిద్యావంతులుగా ఉన్న ప్రాంతంలో అది నిజంగా నీతిబాహ్యమైన ప్రవర్తనే. అయితే, ప్రజాస్వామ్య పం«థాలో ఇది ఎంత భిన్నంగా ఉందని నేను ఆశ్చర్యపోతుంటాను. గత సంవత్సరం భారత వాయుసేనకు 36 యుద్ధ విమానాలకోసం మనం రూ. 59,000 కోట్లు ఖర్చుపెట్టాం. ఈ ఏడు భారత నావికాబలగం కోసం 57 యుద్ధవిమానాలపై రూ. 50,000 కోట్లు ఖర్చుపెడుతున్నాం. సంవత్సరానికి రూ. 33,000 కోట్ల ఆరోగ్య బడ్జెట్ (వాస్తవానికి అరుణ్ జైట్లీ హయాంలో దీనిపై కోత విధించారు) ఉంటున్న దేశంలో ఇలా జరుగుతోంది. ప్రతి వారం 10 వేలమంది భారతీయ పిల్లలు పోషకాహార లేమి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ల కోసం మనం మరికొంత డబ్బు వెచ్చించలేం కానీ మన సాయుధబలగాల కోసం మాత్రం మరిన్ని ‘బొమ్మ’లను మాత్రం కొంటుంటాం. ఇది మాత్రం బ్రిటిష్ రాజ్ కాలం నాటి అనైతిక చర్య కాదా? ఈ కొత్త యుద్ధ విమానాలు మనకు తప్పనిసరి అవసరమేనా అని ఎవరైనా కేసు పెట్టగలరా? పెట్టలేరు. మన దేశంలో దీనిపై కనీసం చర్చకూడా జరపరు. దేశంలో అన్ని ప్రభుత్వాలూ ఇదే వైఖరిని అవలంభిస్తున్నాయి. పైగా చాలా విషయాల్లో ప్రస్తుత ప్రధానమంత్రితో ఎవరైనా విభేదించవచ్చు కానీ తనకంటే ముందున్నవారు పాటించిన దాన్ని ఈయన కేవలం కొనసాగిస్తున్నారని మనం అంగీకరించక తప్పదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
భూతాప ప్రకోపం ఎదుర్కోక తప్పని ఉపద్రవం
శిలాజ ఇంధనాల వాడకాన్ని నిలిపివేయడం మనందరికీ ఉపయోగకరం. ఏడాదికి 12 లక్షల మందికి పైగా భారతీయులు ఒక్క కాలుష్యం వల్లనే మరణిస్తున్నారు. అయితే, వాతావరణ మార్పుపై మన మీడియా దృష్టిని కేంద్రీకరించడం లేదు. ఆ కారణంగా ప్రభుత్వంపైనా, పరిశ్రమపైనా వేగంగా మారాలనే ఒత్తిడి తగినంతగా ఉండటం లేదు. మన దేశంలోనే గాక ప్రపంచం పైనే అపార దుష్ప్రభావాలను కలుగజేసే వాతావరణ మార్పు, యూరప్లో ఒక ప్రధాన ఎన్నికల సమస్య. అలా ప్రధాన సమస్యగా దీనిని చేపట్టడం మనం తప్పక నెరవేర్చాల్సిన కర్తవ్యం. మన మీడియా దృష్టిని కేంద్రీకరించడం లేదు గానీ ప్రపంచానికి ఇది విపత్కర సమయం. భూతాపోన్నతని తగ్గించడానికి దోహదపడటం కోసం తన వంతు కృషి చేస్తానని చేసిన వాగ్దానం నుంచి అమెరికా వెనక్కు మళ్లింది. 2015లో సంత కాలు జరిగిన పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలు తమ పారిశ్రామిక కర్మాగా రాలు, ఆటోమొబైల్స్ వెలువరించే కార్బన్ డయాక్సైడ్ (ఇౖ2) ఉద్గారాలను తగ్గించుకుంటామని అంగీకరించాయి. బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వాడకాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకుని, సౌర, పవన విద్యుత్తులకు మరలడం ద్వారా ఇది జరుగుతుంది. సౌర విద్యుత్తుకు భారత్ ఇప్పటికే అతి పెద్ద మార్కె ట్గా ఉంది. ఆ కారణంగానే సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గిపోయాయి. ప్రపంచ దేశాలన్నీ తాము సంతకాలు చేసిన ఆ ఒప్పందంలో వాగ్దానం చేసిన కర్తవ్యాలను పరిపూర్తి చేసినట్టయితే... పారిశ్రామికీకరణకు ముందటితో పోలిస్తే ప్రపంచవ్యాప్త భూతాపం పెరుగుదల 20ఇకు పరిమితం అవుతుంది. ఇౖ2 ఉద్గా రాల వెలువరింతకు చైనా అతి పెద్ద వనరుగా ఉంది. ప్రపంచ కర్బన ఉద్గారాలలో 30% అదే వెలువరిస్తోంది. దాని తర్వాతి స్థానాలలో అమెరికా (15%), యూరో జోన్ (9%) ఉన్నాయి. భారత్ 7% ఉద్గారాలను వెలువరిస్తున్నా ప్రపంచ జనా భాలో 15% దానిదే. కాబట్టి తలసరి ప్రాతిపదికపై చూస్తే చైనా, అమెరికాల వల్ల తలెత్తుతున్నంత సమస్య భారత్ వల్ల కలగడం లేదు. అయితే, భారత్ వేగంగా పారిశ్రామికీకరణం చెందుతోంది, విద్యుత్తు, పెట్రోలు, డీజిల్ను వాడే మధ్యతరగతి పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఇతరుల వల్ల తలెత్తుతున్న సమస్యతో పోల్చి మనం ఈ సమస్యను విస్మరించలేం. ఈ విష యంలో దూరదృష్టిని, ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని మనం ప్రశంసించాల్సిందే. ‘‘పారిస్ ఒప్పందం ఉన్నా లేకున్నా, వాతావరణ పరిరక్షణ కోసం మేం చేసిన వాగ్దానం భవిష్యత్ తరాల కోసం చేసినది’’ అని ఈ వారంలో ఆయన అన్నారు. 2030 నాటికి భారత్లో అమ్మే కార్లన్నీ విద్యుత్ కార్లే అయి ఉంటాయని భారత ప్రభుత్వం సైతం చెప్పింది. అది ఎలా జరుగుతుందనే దానికి సంబంధించిన వివరాలు తెలియవు కానీ... మోదీ ఆ లక్ష్యాన్ని సాధిస్తే, అది ఆయనను నిజమైన ప్రపంచ నేతను చేస్తుంది. ఈలోగా ట్రంప్, వాతావరణ మార్పు కంటే అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. పారిస్ వాగ్దానాలకు కట్టుబ డినట్టయితే వచ్చే ఏడేళ్లలో అమెరికా 27 లక్షల ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుం దని అన్నారాయన. అది వివాదాస్పదమైనది, గత దశాబ్దిగా అమెరికాలో అతి పెద్ద ఉపాధి కల్పనాదారుగా ఉన్నది విద్యుత్, సౌర విద్యుత్ కార్ల పరిశ్రమే. అమెరికా తప్పుడు నిర్ణయం తీసుకున్నదని ఆ దేశంలోని అతి పెద్ద కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు అంటున్నారంటేనే ట్రంప్ ఎంతగా ఏకాకి అయ్యారో స్పష్టమౌతోంది. వాతావరణ మార్పు కారణంగా కాకపోయినా ఆర్థిక లాభదాయకత, సమర్థత దృష్ట్యానైనా శిలాజ ఇంధనాల నుంచి ఇతర ఇంధనాలకు మరలడం కొనసాగు తుందని ఆశించాలి. వాతావరణ మార్పుకు సంబంధించిన దత్తాంశాలు పూర్తి స్పష్టంగా ఉండటం వల్లనే మనకు ఇది విపత్కర సమయమని అన్నాను. 1880 నుంచి భూ ఉపరితల ఉష్ణోగ్రత సగటున ప్రతి దశాబ్దికి 0.0070ఇ వేగంతో పెరుగుతోంది. అది ఇప్పటి వరకు నికరంగా 0.950ఇ మేరకు తాపం పెరిగింది. సముద్రాల ఉష్ణోగ్రతలకంటే భూమి ఉష్ణోగ్రతలు ఇంతవరకు వేగంగా పెరిగాయి. అయితే, ప్రపంచ దేశాలు తమ ఉద్గారాల వెలువరింతను తగ్గించుకోకపోతే 2030 నాటికి ఈ పరిస్థితి మారు తుంది. ఒకసారి సముద్రాలు వేడెక్కడం ప్రారంభమైతే పలు దేశాలు వెంటనే లోతైన సమస్యల్లో పడతాయి. మూడు విధాలుగా ఇది భారతీయులకు ఉపద్రవకరంగా పరిణమిస్తుంది. వాతావరణ మార్పు అంటే సముద్రాల మట్టం పెరగడం. కాబట్టి అది ముంబై, చెన్నై, కోల్కతా వంటి సముద్ర తీర సమీప నగరాలకు పెను సమస్యలను సృష్టి స్తుంది. రుతు పవనాలు మరింత చంచలంగా, అనూహ్యమైనవిగా మారడానికి దారితీస్తుంది. ఇది భారత రైతును దయనీయ స్థితిలోకి నెడుతుంది. ఇక మూడవ సమస్య మనం బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని కొన సాగించేట్టయితే తలెత్తుతుంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాలలో విస్తరించిన ఆది వాíసీ ప్రాంతం బొగ్గు వనరులకు నెలవు. అతి క్రూర దోపిడీకి గురవుతున్న అక్కడి ఆదివాసులు మనకు బొగ్గును సమకూర్చడం కోసం తమ అడవులను, భూము లను వదులుకోక తప్పదు. భారతరత్న లతామంగేష్కర్ ఇంటి ఎదురుగా ఒక ఫ్లైఓవర్ను నిర్మించతలపెట్టినా, ఆమె దేశాన్ని వీడిపోతానని బెదిరించడంతోనే దాన్ని రద్దు చేశారు. ఆదివాసులకు ఆ శక్తి లేదు, వారు తమ భూములను వదులు కోక తప్పదు. మనమే గనుక సౌర, పవన విద్యుత్తులకు మరలితే వారిని ఇలా దోచుకోడాన్ని నివారించవచ్చు. శిలాజ ఇంధనాల వాడకాన్ని నిలిపివేయడం మనందరికీ ఉపయోగకరం. ఏడాదికి 12 లక్షల మందికి పైగా భారతీయులు కాలుష్యం వల్ల మరణిస్తున్నారు. అయితే, వాతావరణ మార్పుపై మన మీడియా దృష్టిని కేంద్రీకరించడం లేదు. ఆ కారణంగా ప్రభుత్వంపైనా, పరిశ్రమపైనా వేగంగా మారాలనే ఒత్తిడి తగినంతగా ఉండటం లేదు. భారతదేశంపైనే గాక మొత్తం ప్రపంచంపైనే అపార పర్యవ సానాలకు దారితీసే ఈ సమస్యపైకి దృష్టిని కేంద్రీకరించేలా చేయడానికి మనం ట్రంప్ నిర్ణయాన్ని వాడుకోవాలి. వాతావరణ మార్పు, యూరప్లో ఒక ప్రధాన ఎన్నికల సమస్య. అభ్యర్థులు ఆ సమస్యపై తాము తప్పక చేయాల్సిందేమిటో వాదోపవాదాలను సాగించాల్సి ఉంటుంది. భారత ఓటరు, ప్రత్యేకించి ఈ సమ స్యను గురించి ఎరిగిన విద్యాంతుడైన మధ్యతరగతి ఓటరు మన దేశంలో కూడా అలా జరగడానికి హామీని కల్పించి తీరాలి. ఇది మన కోసం, మన తరువాతి తరాల కోసం నెరవేర్చాల్సి ఉన్న కర్తవ్యం. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత లేదు ఎందుకు?
అవలోకనం దూకుడుగా విస్తరించే స్వభావంగల సామ్రాజ్య రాజ్యం నెహ్రూకు వారసత్వంగా సంక్రమించింది. పైగా దాని సరిహద్దులు తాత్కాలికమైనవి. బ్రిటిష్ రాజ్ కాలం నాటి భారత్ అంటే ఇరుగు పొరుగు దేశాలన్నీ భయపడేవి, అపనమ్మకంతో ఉండేవి. ఆ భయాన్ని, అపనమ్మకాన్ని అవి అధిగమించేలా చేయడంలోనూ, పరస్పర గౌరవం, ప్రయోజనాల ప్రాతిపదికపై నిలిచిన అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకోవడంలోనూ మనం విఫలమయ్యాం. ఆ వైఫల్యమే బెల్ట్ అండ్ రోడ్ అంతర్జాతీయ సదస్సు విషయంలో మనల్ని ఏకాకులను చేసింది. దాదాపు ముప్పయి ఏళ్ల క్రితం విశ్వనాథ్ ప్రతాప్సింగ్ ప్రధానమంత్రి అయినాక శ్రీలంక అధ్యక్షుడు రణసింగె ప్రేమదాసను కలుసుకున్నారు. సౌమ్యుడైన ప్రేమ దాస ‘‘మీరు మీ సైన్యాన్ని ఎప్పుడు వెనక్కు తీసుకుంటారు?’’ అని కలిసిన వెంటనే ప్రశ్నించారు. దీంతో సింగ్ ఆశ్చర్యపోయారు. ప్రేమదాస ప్రస్తావించినది తమిళ టైగర్లతో పోరాడటం కోసం భారత సైన్యం శ్రీలంకకు పంపిన భారత శాంతి పరిరక్షక దళం (ఐపీకేఎఫ్) గురించి. భారత్ అప్పట్లో వేల కొలది జవాన్లను శ్రీలంకలో మోహరించింది. ఆ పోరాటాన్ని మనం లంక ప్రజల కోసం చేస్తున్న త్యాగంగా పరిగణించాం (ఆ పోరాటంలో మన వాళ్లు వెయ్యి మందికి పైగా మరణించారు). అయితే, ఒక దశ తర్వాత లంక ప్రజలు, దాన్ని తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంగా భావించారని, భారతీయులు తమ దేశాన్ని వదిలి వెళ్లాలని కోరుకున్నారని సింగ్ అభిప్రాయం. ఆ అంతర్యుద్ధం సింహళ జాతీయవాదుల విజయంతో ముగిసింది. అయినా శ్రీలంకపై భారత్ ప్రభావం 30 ఏళ్ల క్రితం ఉన్నంతగా నేడు లేదు. శ్రీలంక ప్రజలలో ఎక్కువ మంది జోక్యందారుగా చూసే దేశం మరేదైనా ఉందంటే అది చైనా. కొలంబో, హంబన్తోటలలో చైనీయులు నిర్మిస్తున్న బ్రహ్మాండమైన ఓడ రేవులు భారత్ పోటీపడలేన ంతటి భారీ ప్రాజెక్టులు. అయితే, వాటితోపాటూ చైనా అభివృద్ధి నమూనా కూడా అక్కడికి దిగుమతి అవుతుంది. ఇంచుమించుగా అది మీ భూభాగంపై చైనా వలసలను అనుమతించడమని అర్థం. మీ తాహతుకు తగ్గ లేదా మించిన భారీ రుణాన్ని చైనా నుంచి తీసుకోవడం అని కూడా అర్థం. చైనీయులు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలుచేస్తున్నారు. దాని పేరు ‘ఒన్ బెల్ట్ ఒన్ రోడ్’ (ఒకటే ఆర్థిక ప్రాంతం ఒకటే దారి). ‘బెల్ట్’ పలు ప్రధాన రహదారుల శ్రేణితో కూడినది కాగా, ‘రోడ్డు’ పలు ఓడ రేవులు, సముద్ర మార్గాలతో కూడినది. చైనా దీనిపై తన దృక్పథాన్ని వివరించడానికి మే నెలలో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశాన్ని భారత్ బహిష్కరించింది. అయితే, భూటాన్ తప్ప మన పొరుగు దేశాలన్నీ... శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్ అన్నీ హాజర య్యాయి. ఇది, మనల్ని చుట్టుముట్టడం కావచ్చునేమోనని భారత వ్యూహాత్మక వ్యవహారాల గురించి యోచించే బృందంలో భయాలు సైతం తలెత్తాయి. చైనాతో భాగస్వామ్యానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆ సమావేశానికి హాజ రయ్యేవారందరినీ భారత్ హెచ్చరించింది. అయినా ఎవరూ మన మాట పట్టిం చుకోలేదు. ఎందుకు? అనేదే ప్రశ్న. దానికి జవాబు, ఈ వ్యాసంలోని అసలు విష యానికి, అంటే దాదాపు ఇరుగుపొరుగు దేశాలన్నీ భారత్ పట్ల విముఖంగా లేదా అనుమానాన్పద దృష్టితోఉన్నాయి అనే సమస్య వద్దకు తిరిగి వచ్చేట్టు చేస్తుంది. హిందూ నేపాల్లో సైతం భారతీయుల పట్ల ప్రత్యేకమైన ఆదరణ ఏమీ లేదు. కెనడాతో అమెరికాకు ఉన్న అనుబంధం లాంటి సంబంధం ఉన్న పొరుగు దేశం మనకు ఒకటి కూడా లేదు. మన సరిహద్దులన్నీ అమెరికా, మెక్సికో సరి హద్దులలాగా లేదా అంతకంటే అధ్వానంగా ఉన్నట్టు అనిపిస్తాయి. బహుశా తప్పంతా పూర్తిగా పొరుగు దేశాలదే కావచ్చుననీ, మనం ఇతర దేశాల దుర్మా ర్గానికి గురవుతున్న బాధితులమనీ సగటు భారతీయుల అభిప్రాయం. పైగా పొరుగు దేశాల పట్ల మనకున్న పక్షపాత పూరితమైన దృక్పథం దీనికి తోడవు తుంది. బంగ్లాదేశీయులంటే అక్రమంగా వలస వచ్చినవారని, నేపాలీలంటే కావలిదార్లనీ, పాకిస్తానీలంటే ఉగ్రవాదులనీ మనం విశ్వసిస్తాం. కొన్నేళ్ల క్రితం నేపాల్లో భారత వ్యతిరేక అల్లర్లు చెలరేగి, పలువురు మర ణించారు, ఆస్తి నష్టమూ సంభవించింది. నటుడు హృతిక్ రోషన్ నేపాలీలను ద్వేషిస్తానని అన్నాడనే వార్త అందుకు కారణం. రోషన్ అలాంటి మాటేమీ అన లేదు, ఆ వార్తే ఒక బూటకం. అసలు నేపాలీలు అలా వెంటనే దాన్ని నమ్మేయడం ఏమిటి? అనేదే మనం ప్రశ్నించుకోవాల్సింది. భారత్ నేడు తమ దేశాన్ని కొండ ప్రాంతాల ప్రజలు, మైదాన ప్రజలుగా విభజించడానికి ఎత్తులు వేస్తోందని, కొండ ప్రాంతాలవారికి వ్యతిరేకంగా సుదీర్ఘమైన, బాధాకరమైన దిగ్బంధనాన్ని ప్రేరేపిస్తోందని నేపాల్ ఉత్తర ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. తమ రాజ్యాంగ ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుంటోందని సైతం అనుకుంటున్నారు. నేపాల్ విషయంలో భారత్కు సమంజసమైన బెంగలు, ప్రయోజనాలు ఉండటమూ సాధ్యమే. అయితే, ఒక హిందూ దేశాన్ని చైనాకు వ్యతిరేకంగా మనతో నిలుపుకోలేనంతగా నేపాల్తో మన సంబంధాలు ముక్క చెక్కలు ఎందుకు అయ్యాయి? చైనాకు వ్యతిరేకంగా మనతో ఉన్న మిత్రుడు ‘భూటాన్’ మాత్రమే. అయితే మన మధ్య సంబంధాలు ఇద్దరు సమానుల మధ్య ఉండేవి కావు. నెహ్రూ హయాంలోని భారత్, భూటాన్పై ‘మైత్రీ ఒప్పందాన్ని’ రుద్దింది. అది నిజానికి, భూటాన్ విదేశాంగ విధానాన్ని వీటో చేసే అధికారాన్ని భారత్కు కట్టబెట్టేది. సరిగ్గా చెప్పాలంటే ‘‘విదేశీ వ్యవహారాలకు సంబంధించి భారతదేశపు సలహాల మార్గదర్శకత్వాన్ని భూటాన్ అంగీకరిస్తుంది’’ అని అది పేర్కొంది. కొన్నేళ్ల క్రితం, బహుశా వాజ్పేయి హయాంలో గామోసు దాన్ని తొలగించారు. దూకుడుగా విస్తరించే స్వభావంగల సామ్రాజ్య రాజ్యం నెహ్రూకు వార సత్వంగా సంక్రమించింది. పైగా దాని సరిహద్దులు తాత్కాలికమైనవి. బ్రిటిష్ రాజ్ కాలం నాటి భారత్ అంటే ఇరుగు పొరుగు దేశాలన్నీ భయపడేవి, అపనమ్మకంతో ఉండేవి. ఆ భయాన్ని, అపనమ్మకాన్ని అవి అధిగమించేలా చేయ డంలో, పరస్పర గౌరవం, ప్రయోజనాల ప్రాతిపదికపై నిలిచిన అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకోవడంలో మనం విఫలమయ్యాం. ఆ వైఫల్యమే బెల్ట్ అండ్ రోడ్ అంతర్జాతీయ సదస్సు విషయంలో మనల్ని ఏకాకులను చేసింది. మన పొరుగు దేశాలపై ఆర్థిక ప్రభావాన్ని నెరపగలగడంలో మన దేశం ఇంకా చాలా కాలంపాటూ చైనాకు సమ ఉజ్జీగా నిలవలేదు. అయితే అది, మనం ఆ దేశాలకు మంచి మిత్రులుగా కావడాన్ని నిలవరించలేదు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఇద్దరూ ఇద్దరే అయినా ఎవరి దారి వారిదే
అవలోకనం ట్రంప్, మోదీలు ఇద్దరూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చినవారే. ఒకరు మూడేళ్లుగా పదవిలో ఉండగా, మరొకరు మూడు నెలలుగానే పదవిలో ఉన్నారు. ట్రంప్ పేరు అప్పుడే వైఫల్యంతో ముడిపడిపోయింది. మోదీ కూడా తప్పులు, అతిగా వాగ్దానాలు చేశారు. కానీ ఆయనది జాగరూకతతో వ్యవరించే వైఖరి. అదే ఆయనను విమర్శల నుంచి కాపాడుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయం కోసం గత ఏడాది సాగించిన ఎన్నికల ప్రచారంలో అతి గొప్ప వాగ్దానాలు కొన్ని చేశారు. ‘బురద నేలలోని బురదనంతా తోడిపారేస్తాను’ అనేది వాటిలోకెల్లా అత్యంత ఆసక్తికరమై నది. వాషింగ్టన్ను ప్రక్షాళన చేస్తానని దాని అర్థం (ఆ నగరాన్ని నిర్మించినది చిత్తడి నేలలోనే అని నమ్మిక). పరిపాలనలోగానీ లేదా రాజకీయాల్లోగానీ ట్రంప్కు ఎలాంటి సమర్థతా ఉన్నట్టు కనిపించని నేడు ఆయన ఆ పని చేస్తారనడం హాస్యా స్పదం అనిపిస్తుంది. ఆయనను ఓ విధమైన మేధావిగా చూపుతూ ప్రచారం సాగించారు. అధ్యక్షునిగా ఆయన తన తొలి కొన్నినెలల కాలంలో విదూషక వ్యక్తిత్వంగలవానిగా, గర్విౖయెన కోపిష్టిగా, తన పాలనా యంత్రాంగంపై కనీస నియంత్రణనైనా నెరపలేని వారుగా బహిర్గతమయ్యారు. మామూలుగానైతే అది కనబడేది కాదుగానీ ట్రంప్ నిత్యం తప్పక ట్వీట్ చేయడం, ఆయన లోపభూయి ష్టమైన నడవడికను పెద్దదిగా చేసింది. నిరంతరాయంగా, మహోత్సాహంగా ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చేస్తూ (ఆశ్చర్యార్థకాలను వాడటం అంటే ఆయనకు మహా ఇష్టం)... తన పేరు ప్రతిష్టలను పరిరక్షించే విధులలో ఉన్నవారికి క్లిష్ట పరిస్థితులను కలిగిస్తుంటారు. ఇక్కడ ట్రంప్కు, మన ప్రధాని నరేంద్రమోదీతో పోలిక ఉంది. మోదీకి కూడా ట్వీటర్ను వాడటం అంటే ఇష్టం. అయితే ఆయన ఆ పనిని ట్రంప్ కంటే భిన్నంగా చేస్తుంటారు. ఇద్దరికీ మూడు కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇద్దరిలో ఎవరూ పాత్రికేయులను నమ్మరు కాబట్టి సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఓటర్లతో మాట్లాడతారు. ప్రత్యర్థులు, మీడియా తన పట్ల అన్యాయంగా ప్రవర్తించారనీ, తన మేధోశక్తిని గుర్తించలేదు లేదా ప్రశంసించలేదనీ ట్రంప్ నమ్ముతారు. ఇక మోదీ, తాను ఏ తప్పూచేయకపోయినా, మతపరమైన హింసకు సంబంధించిన తన చరిత్రను తనకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారని భావిస్తారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక సాగిన సామాజిక మాధ్యమాల వృద్ధి... తనకు ప్రజలకు మధ్య ఉన్న మీడియా అనే పొరను తొలగించుకునే అవ కాశాన్ని కల్పించింది. ఆ పనిని ఆయన అత్యంత సమర్థవంతంగా చేశారు. ట్వీటర్ ఆవిర్భవించే వరకు ఆయన నిరంతరాయంగా పాత్రికేయులతో ఘర్షణ పడుతూనే ఉండేవారు (కరణ్ థాపర్తో లైవ్గా సాగుతున్న ఒక ఇంటర్వూ్య నుంచి ఆయన లేచి వెళ్లిపోయారు). ట్రంప్లాగే ఆయన కూడా అంత కోపానికి, చికాకుకు గుర య్యేవారని ఇది తెలుపుతుంది. అయితే మోదీ అలాంటి సందర్భాల్లో ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తారు. ఇద్దరూ ట్వీటర్ను ఉపయోగించే పద్ధతిలో తేడాలకు సంబంధించి మొదటిది వాటిలోని విషయం. ట్రంప్ తరచుగా తన అభిప్రాయాలను వెలిబుచ్చుతుం టారు, ఆగ్రహాన్ని, చిరాకును వ్యక్తం చేయడానికి భయపడరు. ట్రంప్, తన ఎన్ని కల ప్రచార కార్యక్రమంలో రష్యాతో సంబంధాలను నెరపారనే ఆరోపణపై ఆయన సొంత ప్రభుత్వ న్యాయశాఖే మే 18న ఆయనపై విచారణను ప్రారంభిం చింది. దీనిపై ‘‘ఇది అమెరికా చరిత్రలోనే ఒక రాజకీయవేత్తపై సాగిన అతి పెద్ద ఉద్దేశపూర్వక దాడి!’’ అని ట్వీట్ చేశారు. ‘‘క్లింటన్ ప్రచారంలోనూ, ఒబామా ప్రభుత్వంలోనూ అన్ని చట్టవిరుద్ధ చర్యలు జరిగినా స్పెషల్ కౌన్సిల్ను నియమిం చలేదు!’’ ట్రంప్ దురుసు మనిషి కూడా. తన ట్వీటర్ ఖాతాను వాడి పాత్రి కేయులు లేదా ఇతర వ్యక్తులపై దాడి చేయడానికి సైతం సంశయించరు. ‘‘ఈరోజు కుహనా మీడియా ఓవర్ టైం పనిచేస్తోంది!’’ అని మే 12న ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ప్రవర్తనను ఆయన నిజాయితీగా చూపొచ్చు. కానీ ఇలాంటి చిన్న పిల్లాడి ప్రవర్తన ట్రంప్కు ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకోవడం కష్టం. సరిగ్గా ఈ విషయంలోనే మోదీ ఆయనకంటే చాలా భిన్నమైనవారు. ఇద్దరూ మీడియాను ఒకే విధంగా చూస్తారని అన్నాను. కానీ రివాజుగా సాగే సంభాషణలో ఆయన చాలా ఎక్కువ నిగ్రహాన్ని చూపుతారు. ట్వీటర్ ద్వారా ఆయన వెలిబుచ్చేవన్నీ సాధారణంగా ఆ రోజు తాను ఏం చేశారనే దానికి సంబంధించినవే. ఉదాహర ణకు, ‘‘ఈరోజు నాగాలాండ్ ట్రైబ్స్ కౌన్సిల్ ప్రతినిధి బృందాన్ని కలుసుకు న్నాను’’ అని మే 19న ట్వీట్ చేశారు. లేదా వ్యక్తులకు, ప్రత్యేకించి ఇతర రాజ కీయవేత్తలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు. ‘‘మాజీ ప్రధాని, రైతు నేత శ్రీ హెచ్డీ దేవెగౌడ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, సుదీర్ఘ ఆయుర్దాయాన్ని ఇచ్చుగాక’’ అని మే 17న ట్వీట్ చేశారు. ఇక మే 19న ‘‘ప్రియమైన అధ్యక్షులు@ashrafghani, మీకు అద్భుతమైన జన్మ దినాన్ని ఆకాంక్షిస్తున్నాను, భగవంతుడు మీకు దీర్ఘ ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక’’ అని ట్వీట్ చేశారు. మోదీ ట్వీటర్ ద్వారా విధానపరమైన ప్రకట నలను కూడా చేస్తారు. అయితే అవి సాధారణంగా వార్తాపత్రికల్లోగాక తన సొంత వెబ్సైట్లో ప్రచురితమైన నివేదికల గురించిన ట్వీట్లే. భారత ప్రధాని ఏమి ఆలో చిస్తున్నారో ఆయన ట్విటర్ సమాచారాన్ని బట్టి అంచనా వేయడం అసాధ్యం. అమెరికా అధ్యక్షుని విషయం అలా కాదు. ట్రంప్ చూస్తున్న చానల్స్ ఏవో తెలుసు కోవడం పాత్రికేయులకు సులువే. చూసిన వెంటనే ఆయన ఎలాగూ దానికి ప్రతి స్పందనగా ఏదో ఒకటి ట్వీట్ చేసేస్తారు. అయితే ట్రంప్, మోదీలు ఇద్దరూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటూ, బయటి వారుగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒకరు మూడేళ్ల కంటే కొద్దిగా ఎక్కువ కాలంగా పదవిలో ఉండగా, మరొకరు మూడు నెలలుగానే అధికారం నెరపు తున్నారు. అయితే, అప్పుడే ట్రంప్ పేరు వైఫల్యంతో ముడి పడిపోయింది. ఆయన మద్దతుదార్లు కొందరితో సహా చాలా మంది ఆయనను అసమర్థునిగా చూస్తున్నారు. మరోవంక మోదీ కూడా తప్పులు చేశారు, అతిగా వాగ్దానాలు చేశారు. అయితే ఆయనది జాగ్రత్తగా, సావధానంగా వ్యవహరించే వైఖరి. అదే ఆయనను విమర్శల నుంచి కాపాడుతోంది. ట్రంప్ రోజువారీ పిల్లతనపు వెర్రి చేష్టలు, తనను ఎలా అనుచితంగా చూస్తు న్నారో చెబుతూ గుండెలు బాదుకోవడం ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతౖమైన పదవిలోని ఉన్న వ్యక్తిని ఇలా చూస్తుం డటం విభ్రాంతికరంగా మారుతోంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత : ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
యుద్ధం గుజరాతీల నైజం కాదు నిజమే
అవలోకనం గుజరాతీలలో అమరవీరులు ఎవరైనా ఉన్నారా? దేశం కోసం పోరాడి, అమరులైన గుజరాతీలు ఉన్నారా? అని అడిగి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొందరిని నొప్పించారు. కశ్మీరీ సైనికాధికారి లెఫ్టినెంట్ ఉమ్మర్ ఫయాజ్ హత్య తర్వాత ఆయన ఆ వ్యాఖ్యను చేశారు. ఎంతో మంది కాదుగానీ, కొందరున్నారు అనేదే ఆయన ప్రశ్నకు జవాబు. కొన్నేళ్ల క్రితం నేను ఈ విష యంపై పరిశోధన చేశాను. పది లక్షలకు పైబడిన మన సైన్యంలోకి 2009లో 719 మంది గుజరాతీలే చేరారు. అదే రికార్డు సంఖ్య. అంతకు ముందటి రెండేళ్లయిన 2008, 2007లలో సైన్యంలో చేరిన గుజరాతీలు 230 మంది మాత్రమే. గుజరాత్లో ఆరు కోట్లకు పైగా ప్రజలున్నారు. కానీ భారత సైన్యంలో గుజరాతీల కంటే ఎక్కువగా విదేశీయులున్నారు. ఇది వాస్తవం. గుజరాత్లో సగం ఉండే నేపాల్ దేశం గుజరాతీలకంటే అనేక రెట్లు ఎక్కువ మందిని సైనికులుగా భారత్ కోసం పోరాడటానికి పంపింది. నిజానికి గూర్ఖా రెజిమెంట్లు ప్రపంచం లోనే అత్యుత్తుమ పోరాట దళాలలోకి వస్తాయి. అందుకు భిన్నంగా గుజరాత్లో సైనికతత్వ సంప్రదాయం లేదు. ఇదేమీ పూర్తిగా గుజరాత్కున్న ప్రత్యేక లక్షణ మేమీ కాదు. భారత్లోనే కాదు పాకిస్తాన్లో కూడా సైన్యం రిక్రూట్మెంట్ అస మానంగా విస్తరించి ఉంటుంది. ‘‘సౌ పుష్ట్ సే, హై పేషా ఎ ఆబా సిపాహ్గిరీ’’ (సైనికులుగా పనిచేయడం వంద తరాలుగా మా కుటుంబ వృత్తిగా ఉంటోంది) అన్నాడు గాలిబ్. గుజరాత్లోని ఏ సామాజిక వర్గమూ ఆ మాట అనజాలదు. అయితే మరాఠాలు, పంజాబీలు, గూర్ఖాలు అ మాట అనగలుగుతారు. ధైర్యవంతులై ఉండటానికి, దీనికీ ఏ సంబంధమూ లేదు. ఇది చాలా వరకు అవకాశానికి, ఆ తదుపరి సాంప్రదాయానికి సంబంధించినది. బ్రిటిష్వారు తమ కిరాయి సైన్యాన్ని ప్రధానంగా తాము వాస్తవంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచే తయారు చేసుకునారు. ఇందుకు కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. బెంగాల్ సైన్యం పాల్గొన్న 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్వారు పంజాబీ హిందువులు, ముస్లింలు, సిక్కుల నుంచి సైనికులను రిక్రూట్ చేసుకోవడం వైపు మళ్లారు. ఈ పంజాబీలు చాలా వరకు జాట్లు (జనరల్ జియా ఉల్ హఖ్ సైనికేత రమైన అరియన్ సామాజికవర్గం నుంచి పాకిస్తాన్ సైన్యంలో చేరినవారని చాలా మందే గమనించారు). ఏదిఏమైనా చాలావరకు సైన్యం రిక్రూట్మెంట్ 1857 తిరుగుబాటుకు చాలా ముందే ప్రారంభమైంది. బెంగళూరులోని నా ఇల్లు మిలిటరీ ఏరియాలో ఉంది. మా ఇంటికి సమీపంలోనే మద్రాస్ శాపర్స్ (సైనిక ఇంజనీర్ల దళం) బలగం వృద్ధి చెందింది, 1780 నుంచి భారత సైన్యానికి అది సేవలను అందిస్తోంది. అంత సుదీర్ఘ సాంప్రదాయం నెలకొన్నప్పుడు ఆ పనిని తండ్రి, తర్వాత కొడుకు కొన సాగిస్తాడు. చారిత్రకంగా సైనిక రిక్రూట్మెంట్ లేని ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు. గుజరాత్లో ‘యుద్ధ విద్యల’ సామాజిక వర్గాలు కొన్ని ఉన్నాయి, సైన్యంలో చేరేవారు ఆ వర్గాలకు చెందినవారే. వారిలో దర్బార్ (రాజ్పుట్) సామా జికవర్గం వంటి వారున్నారు. జడేజా, సోలాంకి వంటి పేర్లు వారికి ఉంటాయి. కాబట్టి గుజరాతీ అమరవీరుల సంఖ్య తక్కువేగానీ, గుండు సున్నా కాదు. గుజరాత్లో పెద్దగా యుద్ధాలు జరగకపోవడం కూడా ఆ రాష్ట్రం నుంచి తక్కువ మంది సైని కులు తయారు కావడానికి మరో కారణం. అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ను 1297లో జయించాడు. ఆ తర్వాత, గుజ రాత్లో యుద్ధం కొంత జరగకపోలేదు. అయితే, అందులో గుజరాతీల ప్రమే యం చాలా తక్కువ. అహ్మదాబాద్ను అక్బర్ ఆక్రమించి గుజరాత్ను మొగల్లు తమ చేతుల్లోనే ఉంచుకునే వరకు జరిగిన కొన్ని యుద్ధాలు కూడా ఉత్తరాది ముస్లింలలో వారిలో వారికి మధ్య జరిగినవే. ఆ తర్వాత మరాఠాలు దానిలో పెద్ద భాగాలను స్వాధీనం చేసుకున్నారు. బరోడాపై నేటికీ వారి పట్టు ఉంది. ఆ తర్వాత గుజరాత్ను ఇంగ్లిష్ వారు స్వాధీనం చేసుకోవడం సూరత్తో ప్రారంభమైంది. ఈ పోరాటంలో గుజరాతీల ప్రమేయం.. హిందువులు, ముస్లింలు లేదా పార్శీలు అన్న ప్రసక్తే లేకుండా చాలా తక్కువ. గుజరాత్లో శక్తివంతమైన వర్తక సంస్కృతి ఉండటం కూడా సైన్యంలో గుజరాతీలు లేకపోవడానికి మరొక కారణం. వర్తక సంస్కృతి వ్యవహారవాదాన్ని నొక్కి చెబుతుంది. ‘యుద్ధవిద్యల’ సామాజిక వర్గాలలో ఎక్కువ భాగం దీనిని హేళన చేస్తారు. అయితే గుజరాత్ గొప్ప వ్యాపారవేత్తలను చాలా మందిని అందించింది. గౌరవానికి అంటిపెట్టుకుని గట్టిగా నిలబడటానికి బదులు రాజీపడ గల సామర్థ్యం ఉండటం... గుజరాత్ ఎందరో గొప్ప రాజనీతిజ్ఞులను అందించ డానికి కారణం. స్వాతంత్య్రానికి ముందటి నలుగురు అతి గొప్ప రాజకీయ నేతలలో ముగ్గురు... గాంధీ, జిన్నా, పటేల్... గుజరాతీలే. ఈ సంస్కృతి నేడు ప్రతిఫలించే ఆసక్తికరమైన రూపాలలో ఒకటి నా కుల మైన పాటీదార్లలో కనిపిస్తుంది. హరియాణాలోని జాట్లతో పాటూ మేం కూడా దేశంలో కెల్లా అతి తక్కువ లైంగిక నిష్పత్తులున్న వర్గం. తరచుగా ఆడ పిండాలను కడతేర్చడం లేదా ఆడ పసికూనలను పుట్టినప్పుడే గొంతు నులిమేయడం జరు గుతుంటుంది. ఇది పాటీదార్లకు మహా సిగ్గుచేటైన విషయం, దీన్ని సరిదిద్దు కోవాల్సి ఉంది. అయితే, జాట్లలాగా పాటీదార్లు పరువు హత్యలకు పాల్పడరు. అంటే ప్రాయం వచ్చిన ఆడవారు తాము ప్రేమించినవారిని పెళ్లి చేసుకుంటే హత మార్చరు. వర్తక సంస్కృతి గౌరవానికి విలువను ఇవ్వదు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యకు కొందరు బాధపడటం బాగానే ఉంది గానీ, అది కొంత యదార్థం, నిజం మీద ఆధారపడి ఉన్నది. యుద్ధవిద్యా సాంప్రదాయం లేనందుకు గుజరాతీలు సిగ్గుపడాల్సిందేమీ లేదు. వాళ్లు దేశానికి ఇతర విధాలుగా తోడ్పడుతున్నారు. ఎంతో మంది అమరవీరులను తయారుచేయకపోయినా అత్యంత గొప్ప యోధుడు ఒక్కడిని స్పష్టించామని గుజరాతీలు చెప్పుకోవచ్చు... ఆయన గాంధీ. ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఆ రెండు దేశాల తీరే వేరు
అవలోకనం కాఠ్మండులో రెండు వేపులా రెండేసి రోడ్లున్న ఇరుకు రహదారుల్లో సైతం ట్రాఫిక్ పూర్తిగా క్రమబద్ధమైన వరుసల్లోనే సాగుతుంది. నేరుగా పోయేవారు పక్క వరుస పూర్తిగా ఖాళీగానే ఉన్నా దానిలోకి పోక కుడి పక్క వరుసలోనే ఉంటారు. ఇది భారత్లోనే కాదు, శ్రీలంక తప్ప మరే దక్షిణ ఆసియా దేశంలోనూ జరిగేది కాదు. శ్రీలంకకు వెళ్లిన భారత సందర్శకులెవరికైనా అక్కడ మన దేశంలోలా మురికి, గందరగోళం, అస్తవ్యస్తత లేకపోవడమూ, అక్కడి రోడ్లు, నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా, నాగరికంగా ఉండటమూ కొట్టవచ్చినట్టుగా కనిపిస్తాయి. కొన్ని రోజుల క్రితం నేను నేపాల్ వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన అంశాన్ని గమనించాను. ఉపఖండంలోని ఇతర అన్ని నగరాల్లాగేS కాఠ్మండు కూడా ఒక నగరం. ప్రజలలో అత్యధికులు సంపన్నులేమీ కారు. ఇళ్లు చాలా వరకు ఓ మోస్తరువే. కానీ రోడ్ల మీద వాహనాల రద్దీ మాత్రం మౌలిక సదుపాయాలు తట్టుకోలేనంత ఎక్కువగా ఉంది. ఎందువల్లనో గానీ చాలా రోడ్ల కూడళ్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం లేదు. దీంతో ట్రాఫిక్ను నిర్దేశించడానికి పోలీసులు అవసరమవుతున్నారు. మన ఉపఖండంలో ఎక్కడైనా ఇలాంటి దృశ్యాలు కనిపిం చేవే. ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువగా ఉన్నా దాదాపుగా ఎక్కడా కర్ణకఠోరమైన హార న్ల మోతలు వినబడలేదు. 20 ఏళ్ల తర్వాత నేను కాఠ్మండుకు వెళ్లాను. కాబట్టి అది ఎప్పుడూ ఇలాగే ఉందో ఏమో నాకు లె లీదు. ఒక స్థానికుడ్ని అదే అడిగితే, వారం క్రితమే హారన్లు మోగించరాదనే చట్టం లేదా ఆదేశం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఆ మాత్రానికే ప్రజలు దాన్ని పాటిస్తూ నడుచుకుంటారంటే నాకు నమ్మశక్యం కాలేదు. కానీ నాకు, అవును అనే సమాధానమే వచ్చింది. పోలీసులు లంచాలు తీసుకోరనేది కనబడుతూనే ఉంది. ఇదెంత అసాధారణమైన సంగతి! రెండు వేపులా రెండేసి రోడ్లున్న (అవి ఇరుకైనవైనా) రహదారుల్లో సైతం ట్రాఫిక్ పూర్తిగా క్రమబద్ధమైన వరుసల్లోనే సాగుతుండటం అక్కడ నేను గమ నించిన మరో అసాధారణ విషయం. ట్రాఫిక్ బాగా రద్దీగా ఉన్నా గానీ నేరుగా పోయేవారు... పక్క వరుస పూర్తిగా ఖాళీగానే ఉన్నా దానిలోకి పోకుండా కుడి పక్క వరుసలోనే ఉంటున్నారు. ఇది భారత్లోగానీ లేదా ఒక్క దేశం మినహా మరే దక్షిణ ఆసియా దేశంలోగానీ ఎన్నటికీ జరగదు. ఆ మరో దేశం గురించి తర్వాత ముచ్చటిద్దాం గానీ, ఇప్పటికైతే నేపాల్ గురించి చెప్పనివ్వండి. నేపాల్లో కొన్ని మనోహరమైన, చాలా పెద్ద దేవాలయాలున్నాయి. వాటిలో కెల్లా కాఠ్మండులోని శివుని పశుపతినాథ దేవాలయం అత్యంత గొప్పది. ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న లోహపు నంది అద్భుతమైనది, చాలా భారీది. అదెంత మహ త్తరంగా కనిపిస్తుందో చూడటానికి ఇంటర్నెట్ను శోధించండి. ఆ ఆలయంలో అర్చకులుగా ఉండేది కేరళ నంబూద్రి బ్రాహ్మణులే. అది సుదీర్ఘకాలంగా అక్కడ అమల్లో ఉన్న సంప్రదాయం. వారి స్థానంలో స్థానిక బ్రాహ్మణులను నియమిం చాలని మావోయిస్టులు అనుకున్నారు. కానీ అదింకా జరగలేదు. ప్రతి నెలా ఆలయ ప్రాంగణంలోనే దున్నపోతులు సహా జంతువులను బలి ఇవ్వడం ఈ దేవాలయపు మరో ప్రత్యేకత. భారత్లోని ఏ ప్రధాన దేవాలయం లోనూ అలాంటి దృశ్యం కనబడటం అసాధ్యం కాకున్నా కష్టం. రచయిత నీరజ్ సీ చౌధురి స్వీయ జీవిత చరిత్రలో తన చిన్నతనంలో బెంగాల్లో ఒక దున్నపోతును బలి ఇవ్వడాన్ని ప్రస్తావించారు. ఏదో ఒకటి రెండు చోట్ల తప్ప భారత్లో దాదా పుగా ఆ సంప్రదాయం మటుమాయమైంది. నేడు అలాంటి పని చెయ్యాలని ఎవరైనా ప్రయత్నిస్తే జనాలు చావ చిదగ్గొట్టేస్తారు. నేపాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. నేపాలీ బౌద్ధం సజీవ మతంగా నిలిచి ఉండటం మతపరమైన మరో భిన్నాంశం. నేపాలీలకు వజ్రయానమనే తన సొంత బౌద్ధ శాఖ ఉన్నది. భారత దేశంలోని మరే మతంలోనూ కనిపించని అత్యంత సున్నితత్వం అందులో ఉంది. మన దేశంలో బౌద్ధం చాలావరకు పురావస్తు ప్రాంతాలకే పరిమితం. పలువురు దళితులు స్వీకరించిన నవయాన బౌద్ధం అనే కొత్త శాఖ కూడా ఉంది. కానీ బౌద్ధం ఇక్కడ అంత ప్రముఖంగా లేదు. మరి నేపాల్ సంస్కృతిలో బౌద్ధం అంత ప్రాబల్యాన్ని ఎలా కలిగి ఉన్నది? సమాధానం నాకు తెలిసి ఉంటే బాగుండేది. బుద్ధుడు జన్మించిన లుంబిని నేపాల్ లోనే ఉంది. నేపాల్ సరిహద్దుల్లోని ఉత్తరప్రదేశ్లోనే బుద్ధుడు జన్మించాడని ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కొంత కాలం క్రితం ప్రకటించింది. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. టిబెట్ బౌద్ధ సంప్రదాయం సైతం కాఠ్మండులో ఉంది. ఆ సంప్రదాయానికి చెందిన పలు అద్భుత ఆలయాల్లో స్వయంభూతనాథ ఆలయం ఒకటి. ఆ ఆలయ సందర్శకులలో హిందువులు, బౌద్ధులు అనే విభజన ఉండదు. ఇరు మతాల అనుయాయులూ అక్కడికి వస్తుంటారు. భారత్లో హిందువులు, ముస్లింలు కలగలసి సందర్శించే అజ్మీర్, నిజాముద్దీన్ వంటి స్థలా లను అది నాకు గుర్తుకుతెచ్చింది. దక్షిణాసియా దేశాల్లో మిగతా వాటికి భిన్నమైన మరో దేశం గురించి ఇంతకు ముందు ప్రస్తావించాను. అది శ్రీలంక. అది బౌద్ధ దేశం. అయితే అక్కడి బౌద్ధ మతం తీరవాద లేదా హీనయాన శాఖ నుంచి వచ్చినది. మాక్స్ ముల్లర్ తీరవాద గ్రంథాలను పాలీ భాష నుంచి ఇంగ్లిష్లోకి అనువదించారు కాబట్టి ఆ విషయం నాకు తెలిసింది. శ్రీలంకకు వెళ్లిన భారత సందర్శకులెవరికైనా అక్కడ వెంటనే కొట్టవచ్చినట్టుగా కనిపించేది... మన దేశంలోలా మురికి, గందరగోళం, అస్త వ్యస్తత లేకపోవడం. అక్కడి రోడ్లు, నివాస ప్రాంతాలు మరింత పరిశుభ్రంగా, ఎక్కువ నాగరికంగా ఉంటాయి. అదెందుకో నాకు తెలియదుగానీ అక్కడి ప్రజలు కూడా ఒక విధంగా భిన్నంగానే కనిపిస్తారు. ఈ తేడా ఆవశ్యకంగా మతం వల్ల వచ్చేదేనా? ఒక శతాబ్దం క్రితం జనాభాలో దాదాపు ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులు గానే ఉండిన ఆ ప్రాంతంలో మతం ప్రజలకు తమ సంస్కృతిని గురించి తెలియ జేసే అత్యంత శక్తివంతమైన మార్గమైంది. అంతకు మించి ఈరోజు ఈ విషయంపై మరింతగా ఊహాగానం సాగిం చాలనుకోవడం లేదు. కాకపోతే మనకూ, నేపాలీలు, లంకేయులకు మధ్య గమ నించదగిన తేడా ఉన్నదనే విషయాన్ని గుర్తించడానికి నేను పరిమితమవుతాను. ఇది ఆ తేడా ఎక్కడి నుంచి వస్తున్నదో అర్థం చేసుకోడానికి తోడ్పడుతుంది. ఆ తేడా ఏదో ఒక విధంగా మెరుగైనదయితే దాన్ని మనం అందుకోవడం ఎలా అనే దాన్ని అవగతం చేసుకోడానికి దోహదపడుతుంది. ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
ప్రజల నియంత్రణకు బలప్రయోగమే ఏకైక మార్గమా?
అవలోకనం ప్రభుత్వ న్యాయ సలహాదారు ప్రకారం మన సైన్యం చేసిన ఈ ఉల్లంఘన సరైందే. పైగా ఏసీల్లో్ల బతుకుతున్న భారతీయులు దేనిమీదైనా అభిప్రాయం చెప్పడానికి అనుమతి లేదన్నమాట. అంటే రోహత్గీ ఏసీని వాడలేదని, కాబట్టే ఆయన ఏది మాట్లాడటానికైనా అధికారం ఉందని మనం భావించాలి. ఈ బఫూన్ని ఎలా అటార్నీ జనరల్గా చేశారని నేను ఆశ్చర్యపోతుంటాను. విశ్రాంతి గదుల్లో స్వపక్షపాతంతో చేసే, అర్ధజ్ఞానపు వాదనలను పౌరులతో సంబంధాలను తెంచుకోవడానికి హేతువుగా చూపిస్తుండటమే ప్రమాదకరం. సైనిక వాహనంపై రాళ్లు విసురుతున్న ఆందోళనకారులకు వ్యతిరేకంగా ఒక కశ్మీరీ యువకుడిని మిలిటరీ జీప్ ముందు భాగంలో కట్టివేసి భారత సైనికులు అతడిని మానవ కవచంగా వాడుకున్న ఘటనపై ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అంటూ భారత అటార్నీ జనరల్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహా దారు ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. తమపైకి రాళ్లు విసురుతున్న వ్యక్తిని భారత సైనికులు సైనిక వాహనానికి కట్టివేసినట్లు ఇటీవల వార్త. ఈ అంశంపై రోహత్గీ ఎన్డీటీవీ న్యూస్ చానల్లో మాట్లాడుతూ ‘ప్రతిరోజూ జనం చస్తున్నారు కదా ఈ ఘటనపై అంత లొల్లి చేయడం ఎందుకు?’ అనేశారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆందోళనకారులతో కాకుండా ఉగ్రవాదులతో సైన్యం తలపడుతోంది. కాబట్టి వారిపట్ల కఠినంగానే వ్యవహరించాలి. మన సైన్యాన్ని చూసి గర్వించాలి. వారు తమ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఏసీ రూముల్లో కూర్చుని మీరు సైన్యాన్ని విమర్శిం చలేరు. దయచేసి మీరు ఆర్మీ పక్షం వహించండి. ఇదీ రోహత్గీ చేసిన వ్యాఖ్య. రోహత్గీ చెప్పిన విషయాన్ని చట్టపరమైన కోణం నుంచి పరిశీలిద్దాం. పౌరులుగా మనం ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చాం. హింసపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఇచ్చేశాం. గుత్తాధిపత్యం అంటే, ఎవరికైనా భౌతికంగా హాని కలి గించడానికి, రాజ్యం మాత్రమే చట్టపరమైన కర్తగా ఉంటుందని అర్థం. అందువల్లనే హత్య, అత్యాచారం వంటి నేరాలను ప్రభుత్వానికి వ్యతిరేక నేరాలుగా భావి స్తారు. ఇలాంటి నేరాలపై ప్రభుత్వమే విచారణ జరుపుతుంది. వీటిని కోర్టు వెలుపల పరిష్కరించుకోడానికి చర్చించలేము. నేరం చేసిన పౌరులను ఉరి తీయడం ద్వారా చట్టపరమైన హింసకు పాల్పడటానికి ప్రభుత్వం పూనుకుంటోంది. కానీ చట్టానికి అనుగుణంగానే దీన్ని చేపడతానని అది వాగ్దానం చేస్తుంది. తాము రాజ్యాంగాన్ని ఉల్లంఘించబోమంటూ ఎన్నికైన అధికారులందరూ ప్రమాణ స్వీకార సందర్భంగా నిష్టగా ప్రమాణం చేస్తారు. ప్రభుత్వం లేదా రాజ్యం తన ఏజెంట్ల ద్వారా ఈ వాగ్దానాన్ని చేస్తుంది. తర్వాతే అవసరమని భావించిన చోట హింసను ఉపయోగించడానికి ముందుకెళుతుంది. జనాలను అదుపులో ఉంచడం ద్వారా ప్రభుత్వ బలప్రయోగం తరచుగా మన అనుభవంలోకి వస్తుంటుంది. భారతీయులు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీ యులు అందరికీ లాఠీ చార్జి అనే పదం సుపరిచితమైనదే. పౌరులు చాలా సంద ర్భాల్లో మంచిగా ఉండరనీ వారిని బలప్రయోగం ద్వారానే అదుపు చేయాల్సి ఉంటుందనీ మన ప్రభుత్వాలు గట్టి అభిప్రాయానికి వచ్చేశాయి. అందుకే సొంత పౌరులపై కాల్పులు జరపడం మన ప్రభుత్వానికి అసాధారణ విషయం కాదు. ఓహియో యూనివర్సిటీలో పోలీసులు కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను కాల్చి చంపిన ఘటన 1970లో వియత్నాం యుద్ధాన్ని మలుపు తిప్పిన అంశాల్లో ఒకటి. తమ ప్రభుత్వం సొంత పౌరులనే కాల్చి చంపుతుందన్న విషయం అనుభవంలోకి రావడంతో అమెరికన్లు నివ్వెరపోయారు. దీంతో ఆ ఘటన మర్చిపోలేని ఉదంతంగా మారింది. ఇక మన దేశంలో అయితే ప్రభుత్వం పౌరులను కాల్చి చంపడం సర్వసాధారణ విషయమైపోయింది. ఒక ఉదాహరణ.. ఇది 2016 అక్టోబర్ నాటి వార్త. జార్ఖండ్లోని హజారీబాగ్ సమీపంలోని చిరుదిహ్ గ్రామంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా 40 మంది గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తన బొగ్గుగనుల కోసం భూసేకరణ జరపడంపై స్థానికులు అక్కడ నిరసన తెలుపుతున్నారు. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని కరన్పుర లోయలో ఒక బొగ్గు గని ప్రారంభించాలని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ప్రతిపాదించింది. హజారీబాగ్ కాల్పులకు సంబంధించిన ఈ వార్తను ఆనాడు ఎంతమంది చదివారో నాకయితే తెలీదు. ఎందుకంటే భారత్లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అదే కనుక సంపన్న నగర భారతీయులపై ఉగ్రవాద దాడి జరిగి ఉంటే, దీనికి సంబంధించిన వార్తను పాఠకులు వార్తాపత్రికలో లేదా టెలి విజన్లో చూసి ఉంటారు. కానీ తమ భూమిని లాక్కుంటున్నందుకు నిరసన తెలుపుతున్న పౌరులను ప్రభుత్వం చంపడం మీడియాకు పెద్ద సమస్య కాదు మరి. భారతీయ సైన్యం, పాకిస్తానీ సైన్యం చంపుతున్న ప్రజల్లో ఎక్కువమంది సొంత పౌరులే కావడం గమనార్హం. ఈశాన్య భారత్లో, జమ్మూకశ్మీరులో, ఆదివాసీలు నివసిస్తున్న బొగ్గు సమృద్ధిగా లభించే ప్రాంతాల్లో మన మిలటరీ, పారా మిలటరీ బలగాలు చాలామందిని కాల్చి చంపుతున్నాయి. మళ్లీ రోహత్గీ వ్యాఖ్యను చూద్దాం. ఆయన చెప్పిన దాంట్లో రెండు కీలకమైన అంశాలున్నాయి. రాళ్లు విసిరేవారితో సహా ఆందోళన చేస్తున్నవారందరూ ఉగ్రవాదులే. ఇక రెండోది. వీరు ఉగ్రవాదులు కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు సైన్యం చట్టాన్ని ఉల్లంఘించడం మంచిదే. ప్రభుత్వ న్యాయ సలహాదారు ప్రకారం మన సైన్యం చేసిన ఈ ఉల్లంఘన సరైందే. పైగా ఏసీల్లో్ల బతుకుతున్న భారతీయులు దేనిమీదైనా అభిప్రాయం చెప్పడానికి అనుమతి లేదన్నమాట. అంటే రోహత్గీ ఏసీని వాడలేదని, కాబట్టే ఆయన ఏది మాట్లాడటానికైనా అధికారం ఉందని మనం భావించాలి. ఈ బఫూన్ని ఎలా అటార్నీ జనరల్గా చేశారని నేను ఆశ్చర్యపోతుంటాను. పౌరులను సైనికవాహనానికి కట్టి తిప్పే ఇలాంటి చర్యలు మనకే ఎదురు తిరగవచ్చని మాజీ జనరల్స్ చెప్పారు. వారి అభిప్రాయం సరైందని భావిస్తున్నాను. భారత ప్రభుత్వం నిత్యం తన పౌరులతో సంబంధాలను తెంచుకుంటోంది. ఇదేం కొత్త విషయం కాదు. ఇక్కడ కొత్త విషయం ఏమిటంటే, విశ్రాంతి గదుల్లో స్వపక్షపాతంతో చేసే, అర్ధజ్ఞానపు వాదనలను పౌరులతో సంబంధాలను తెంచుకోవడానికి హేతువుగా చూపిస్తుండటమే. మనం నిజంగానే ఒక అంధకారభరితమైన, ప్రమాదకరమైన కాలంలో ఉంటున్నాం. భారత రాజ్యాంగ పరిరక్షణ గురించి ఆలోచించే మనలాంటి వారికి భయం కలుగుతోంది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఐపీఎల్ సంపద.. ఎవరికి ఎంత?
అవలోకనం ఐపీఎల్ క్రీడాకారులలో చాలా మంది సామాన్య ఉద్యోగస్తులు, ఆర్థిక స్తోమతలేని ఆటో రిక్షా డ్రైవర్లు తదితరుల పిల్లలు. అలాంటి నేపథ్యాల నుంచి వచ్చిన యువకులకు సంపద, కీర్తి అనుభవంలోకి రావడమూ, వారు దేశ, విదేశాలకు చెందిన గొప్ప క్రికెట్ దిగ్గజాలతో కలసి ఆడటం చాలా మంచి విషయం. అలాగే, పలు అనుకూలతలున్న ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులకు, ప్రతికూల పరిస్థితుల నేపథ్యాల నుంచి వచ్చిన తోటి జట్టు సభ్యులతో ఇప్పుడు ఏర్పడే తప్పనిసరి పరిచయం కూడా అంతే మంచి విషయం. పలు ఇతర దేశాల క్రీడాకారులకు ఐపీఎల్ మ్యాచ్లు నిజంగానే డబ్బు చేసు కోగల పోటీలుగా మారాయి. అతి గొప్ప క్రీడాకారుడు సనత్ జయసూర్య గురిం చిన ఈ కథ నాకు గుర్తుంది. రెండు దశాబ్దాల క్రితం ఆయన తన ఓపెనింగ్ పార్ట్ నర్ కలువితరణతో కలసి ఒన్ డే క్రికెట్ ఆట తీరునే మార్చిపారేశారు. ఫీల్డ్ రిస్ట్రి క్షన్స్ సానుకూలతను ఉపయోగించుకుని ఆ శ్రీలంక క్రీడాకారులిద్దరూ తమ దేశం 1996 ప్రపంచ కప్ను సాధించడానికి తోడ్పడ్డారు. ఆ పోటీలు ముందుకు సాగు తున్నకొద్దీ లంక ప్రభుత్వం తమ క్రీడాకారులకు మరింత డబ్బును వాగ్దానం చేస్తూ వచ్చింది. ఒక దశలో జయసూర్య... తన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇంకా రూ. 1.75 లక్షలు అవసరమని చెప్పారు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో తను సెంచరీ కొట్టి నప్పుడల్లా తన తండ్రి పది రూపాయలు ఇస్తుండేవారనీ, దీని వల్ల ఒక నెలలో తమ కుటుంబ బడ్జెట్కు చిల్లుపడిందని సునీల్ గవాస్కర్ తన ఆత్మ కథలో రాశారు. కొన్ని వారాల పనికి క్రికెటర్లు కోట్లు సంపాదిస్తున్న నేటి రోజులతో పోలిస్తే ఆ చిన్న మొత్తాల గురించి నేడు ఆలోచించడం విశేషమే. పలువురు భార తీయ క్రీడాకారులు ఏడాదికి రూ. 100 కోట్లకు పైగా కూడా సంపాదిస్తున్నారు. వారింత భారీగా డబ్బును సంపాదిస్తున్నందుకు నాకు వారిపై అక్కసు లేదు. పైగా దీనికి సంబంధించిన ఒక అంశం నాకు సంతోషం కలిగిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ పోటీలు మళ్లీ మొదలయ్యాయి. ఈ పదవ సీజన్ పోటీల వీక్షకుల సంఖ్య మునుపటి కంటే మరింత పెరిగేటట్లు అనిపి స్తోంది. ఈ పోటీల పట్ల ఎప్పుడూ నాలో కలిగేవి మిశ్రమ స్పందనలే. అవి సాఫీగా జరిగిపోయే పోటీలే. కాకపోతే బీసీసీఐ తనlవిశ్వసనీయతను పోగొట్టు కునేంత లోతుగా నైతిక ప్రమాణాలకు తిలోదకాలిచ్చేసింది. బీసీసీఐ ప్రధానంగా అత్యంత అవినీతి, బంధుప్రీతితో కూడిన వ్యవస్థ. భారత్లో కోర్టులు అతిగా జోక్యం చేసుకుంటాయని వాదించవచ్చు. అది నిజమే. కానీ ఈ జోక్యం ఐపీఎల్ విశ్వసనీయతను పునరుద్ధరించి ఉండవచ్చు. ఐపీఎల్ చాలా మంది యువ క్రీడా కారులకు డబ్బు చేసుకోవడానికి, తమ క్రీడా కౌశలాన్ని ప్రదర్శించడానికి అవకా శాన్ని కల్పిస్తోంది. దశాబ్ది క్రితం ఐపీఎల్ లేనప్పటి పరిస్థితి ఇది కాదు. ఎనిమిది జట్లున్నా, ఒక్కొక్కదానిలో నలుగురికి మించి విదేశీ క్రీడాకారులు ఉండరాదనే ఆంక్ష ఉండటంతో 56 మంది భారత క్రీడాకారులకు ప్రతి మ్యాచ్ లోనూ తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. యువ భారత క్రికెటర్లకు మునుపెన్నడూ ఇలాంటి అవకాశం లభించలేదు. రంజీ ట్రోఫీవంటి పోటీల్లో తలపడే స్థానిక జట్లు ఒకప్పుడూ ఉండేవి, ఇప్పుడూ ఉన్నాయి. కానీ, ఆ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తే తప్ప, ఈ పోటీల్లో ఆడినంత మాత్రాన కీర్తిప్రతిష్టలు లభించేవి కావు. భారత్ ప్రపంచ క్రికెట్ క్రీడా కేంద్రంగా, ఆర్థిక శక్తిగా మారే క్రమంలో స్థానిక పోటీల్లో ఆడే క్రీడాకారులకు ఇచ్చే పారితోషికం కూడా పెరిగింది. చాలా కాలంపాటూ ఈ పారితోషికం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ పోటీల్లో ఆడే 18జట్ల క్రీడాకారులకు ఇచ్చేదాని కంటే తక్కువే ఉండేది. ఆ కాలంలో ఇంగ్లండ్లో ఇచ్చే డబ్బు ఇక్కడ లభించేదానికంటే మెరుగ్గా ఉండేది. మన గత తరం క్రికెట్ క్రీడాకారులంతా (కెంట్ జట్టు తరఫున రాహుల్ ద్రావిడ్, గ్లామర్గాన్ తరఫున సౌరవ్ గంగూలీ, యార్క్షైర్ తరఫున సచిన్ టెండూ ల్కర్) కొంత కాలం కౌంటీ క్రికెట్ ఆడిన వారే. భారత్ మరింతగా పురోగ మించింది కాబట్టి ప్రపం చంలో మరే జట్టుకంటే మెరుగైన పారితోషికాలను తమ క్రీడాకారులకు అంది స్తోంది. ఉదాహరణకు విరాట్ కోహ్లీనే తీసుకుంటే, అతను కౌంటీ జట్లకు ఎన్నడూ ఆడలేదు. ఆడమని కోరినా, ఇక్కడే అంతకంటే ఎక్కువ డబ్బు చేసుకోవచ్చు కాబట్టి అతను అందుకు ఆమోదించకపోవచ్చు. ఐపీఎల్ క్రీడాకారులలో చాలా మంది సామాన్య ఉద్యోగస్తులు, ఆర్థిక స్తోమత లేని ఆటో రిక్షా డ్రైవర్లు తదితరుల పిల్లలు. ఈ క్రీడాకారులు, వారి కుటుంబం నుంచి ఇతర సామాజిక వర్గంలోకి ఎదిగిన మొట్టమొదటివారు. అలాంటి నేపథ్యాల నుంచి వచ్చిన యువకులకు సంపద, కీర్తి అనుభవంలోకి రావడమూ, వారు దేశ, విదేశాలకు చెందిన గొప్ప క్రీడా దిగ్గజాలతో కలసి ఆడటం చాలా మంచి విషయమని నాకు అనిపిస్తుంది. ఇది, వారిని ఎరిగిన వారికి లేదా వారి కీర్తిప్రతిష్టల ద్వారా వారి గురించి తెలుసుకున్న చాలా మంది ఇతరులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. పేదరికంలో పుట్టడంలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అలాగే, చాలా అనుకూలతలు ఉన్న ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకా రులకు, ప్రతికూల పరిస్థితుల నేప«థ్యాల నుంచి వచ్చిన తోటి జట్టు సభ్యులతో ఇప్పుడు తప్పనిసరి పరిచయం కూడా అంత మంచి విషయమేనని భావిస్తాను. ప్రపంచం గురించి వారి ఆలోచనా తీరును అది మారుస్తుంది. భారతదేశంలోని మధ్యతరగతికి చెందిన మనం బయటి లోకం పట్టని జీవి తాలు గడుపుతుంటాం. బడికి వెళ్లేటప్పటి నుంచి మనం మన సామాజిక వర్గానికి చెందినవారితోనే సంబంధాలను కలిగి ఉంటాం. ట్రాఫిక్ లైట్ వద్ద మన కారు వద్దకు బిచ్చగాడొస్తే, విండో అద్దాన్ని సగం పైకెత్తి నోరు మూసుకోమని అరుస్తాం, బాల కార్మికులు కనబడితే ఏ దిగులూ లేకుండా మనం చూపు మరో వైపు తిప్పు కుంటాం. విదేశీయులకు అలాంటి విషయాలు నిరంతరం అనుభవం లోకి వచ్చేవి కావు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు వారు అవి చూసి దిగ్భ్రాంతికి గురవుతుం టారు. మనకు మాత్రం అవి పెద్దగా ఇబ్బంది కలిగించవు. విద్యా హక్కు చట్టం ప్రైవేటు స్కూళ్లు 25 శాతం సీట్లను పేద వర్గాల కుటుం బాల పిల్లలకు కేటాయించేలా నిర్బంధిస్తుంది. ఈ చట్టం మంచిదని నేను భావిం చడానికి అది కూడా ఒక కారణం. దురదృష్టవశాత్తూ చక్కటి ఈ సంస్కరణను కూడా నీరుగారుస్తున్నట్టుండటం దురదృష్టకరం. ఇది పేదల పిల్లలకు మరే విధం గానూ కలుగని అనుభవాన్ని నిరాకరిస్తుంది. ఇది, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారి పిల్లలలో దేశ వాస్తవికత పట్ల స్పందించే గుణాన్ని కలిగించే అవకాశాన్ని కూడా నిరాకరిస్తుండవచ్చు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
జోస్యాల జోలికి పోవద్దు.. రెండేళ్లు బహు దూరం
అవలోకనం ఉత్తరాదిలో మోదీ 2014 ఫలితాలను పునరావృతం చేయడం సవాలే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీలలో బీజేపీ ఇçప్పటి తన మద్దతును నిలుపుకోలేకపోవచ్చు. కానీ మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, బెంగాల్లలో మరింత మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. కాబట్టి, ఐదు దక్షిణాది రాష్ట్రాలు మోదీకి తక్కువ కీలకమైనవి అవుతాయి. అయినా ఆ రాష్ట్రాల్లోనూ ఆయన మంచి స్థానంలోనే ఉన్నారు. మరో రెండేళ్లకు ఏమి జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వాలు, హీరోలు అంతకంటే చాలా తక్కువ కాలంలోనే జనాదరణను కోల్పోయారు. ‘‘జరగబోయేదాన్ని చెప్పడం, ప్రత్యేకించి భవిష్యత్తును చెప్పడం కష్టం.’’ ఈ చతురోక్తిని విసిరినది అమెరికన్ బేస్ బాల్ క్రీడాకారుడు యోగి బెర్రా అంటారు. అయితే ఆయన నిజం పేరు మాత్రం లోరెంజో బెర్రా. ‘‘యోగి’’ అతని ముద్దు పేరు. భారతీయులలా అతను మటం వేసుకుని కూచోగలడు కాబట్టి ఆ పేరొ చ్చింది. మనం యోగులం, ఆథ్యాత్మికవాదులం కావద్దుగానీ, 2019 ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే జోస్యాలు చెప్పడం జోలికి పోకుండా ఉందాం. అయినా మనం ఒకసారి 2014 ఎన్నికల గణాంకాలవైపు దృష్టిసారించి, వాటిని వేటికవిగా విడదీసి 2019లో సంభవం కాగల పరిణామాలను విశ్లేషిద్దాం. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సాధించిన తాజా విజయం 2019లో నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి రావడాన్ని అనివార్యం చేసింది. అది నిజంగానే అలా జరగాలంటే ఏమి జరగాల్సిన అవసరం ఉంది? 2014లో సరిగ్గా ఓట్ల లెక్కింపునకు ముందు మోదీ రానున్న ఫలితాలను ఊహించి చెప్పారు. 1984 తర్వాత భారత రాజకీయాలలో కనీ వినీ ఎరుగని రీతిలో తనకు పూర్తి ఆధిక్యత లభిస్తుందన్నారు. తన సభలకు హాజరైన ప్రజలే ఆ విషయం చెప్పారని తెలిపారు. ఆయన అంచనా కచ్చితమైన ది. 543 లోక్సభ స్థానాలలో 282 ఆయనకు లభిం చాయి. ఈ సంఖ్యా బలం మోదీకి ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాల నుంచే సమ కూరింది. ఆయన పూర్తి ఆధిక్యతను సాధించిన ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి లేదా ఆ పార్టీ బలంగా ఉనికిలో ఉంది. అవి, మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ (26కు 26), రాజస్థాన్ (25కు 25), మధ్యప్రదేశ్ (29కి 27), జార్ఖండ్ (14కు 12), హిమాచల్ప్రదేశ్ (4కు 4), హరియాణా (7కు 7), ఢిల్లీ (7కు 7), ఛత్తీస్గఢ్ (11కు 10), ఉత్తరాఖండ్ (5కు 5), ఉత్తరప్రదేశ్ (80కి 71). ఉత్తరాది రాష్ట్రాలను ఇలా తుడిచిపెట్టేయడానికి తోడు బీజేపీకి ఈశాన్యంలో చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలు దక్కాయి. ఇలా ఆ పార్టీకి దాదాపు 200 సీట్లకు పైగా అక్కడే లభిం చాయి. గత 30 ఏళ్లలో ఏ పార్టీకి ఆ ప్రాంతంలో అంత పెద్ద సంఖ్యా బలం సమకూరలేదు. దీంతో ఇతర ప్రాంతాలలో ఓ మోస్తరు ఫలితాలను సాధించడం మాత్రమే మోదీ గెలుపునకు అవసరమైంది. అవే çఫలితాలను తిరిగి సాధించడం ఆయన చేయగల అతి తేలిక పని. కాకపోతే ఉత్తరాదిలో తిరిగి ఈ స్థాయి ఫలితాలను పునరావృతం చేయడం ఒక సవాలే అవుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బహుశా ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలలో పార్టీ ఇప్పుడు తనకున్న మద్దతును నిలుపుకోలేక పోవచ్చు. పరిపూర్ణమైనదాన్ని ఎవరూ ఇంకా మెరుగుపరచలేరు. గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీలలో మోదీ ఇప్పటికే పరిపూర్ణతను సాధించారు. ఇక గుజారాత్లో బీజేపీ తమకు అత్యంత విధేయ ఓటర్లయిన పాటిదార్ల తిరుగుబాటును ఎదు ర్కొంటోంది. రాజస్థాన్లో సచిన్ పైలట్ వంటి సమర్థవంతులైన ప్రత్యర్థి నేతలు న్నారు. సమర్థులైన స్థానిక నేతలున్న పంజా»Œ లో జరిగినట్టే అక్కడా సీటు సీటుకూ పోరాటం సాగవచ్చు. అయితే అదృష్టవశాత్తూ ఇతర పెద్ద రాష్ట్రాలలో మరింత మెరుగైన ఫలితా లను సాధించే అవకాశం ఉండటమనే వెసులుబాటు మోదీకి ఉంది. మహారాష్ట్ర (48కి 23), బిహార్ (40కి 22), ఒడిశా (21కి 1), పశ్చిమ బెంగాల్ (42కు 2) రాష్ట్రాల్లో ఆయన తన సంఖ్యా బలాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ను, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ను, ఉద్ధవ్ ఠాక్రే శివసేనను వెనక్కు నెట్టేసి, ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీగా మారింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఎన్నడూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడింది లేదు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఫలితాలు ఒడిశాలో బీజేపీ, కాంగ్రెస్ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందని, బెంగాల్లో కొంత పునాదిని ఏర్పరచుకోగలిగిందని స్పష్టం చేశాయి. మొత్తంగా మోదీకి ఉన్న జనాదరణ ఇందుకు కొంతవరకు కారణం కావచ్చు. అది 2019లో ఆయన అభ్యర్థులకు సహా యపడుతుంది. ఈ నాలుగు రాష్ట్రాలలో మోదీకి ఊపిరి పీల్చుకునే ఈ వెసులుబాటు ఉంది కాబట్టి, ఐదు దక్షిణాది రాష్ట్రాలు అయనకు మరింత తక్కువ కీలకమైనవి అవు తాయి. అయినా ఆయన ఆ రాష్ట్రాల్లో కూడా మంచి స్థానంలోనే ఉన్నారు. కర్ణాటక (28కి 17), ఆంధ్రప్రదేశ్ (25కి 2), కేరళ (20కి 0), తమిళనాడు (39కి 1), తెలంగాణ (17కి 1) రాష్ట్రాలలో ఆయన తన ఇప్పటి బలాన్ని నిలుపుకోగలుగు తారు లేదా మెరుగుపరచుకోగలుగుతారు. ఓడిపోయినా ఈ రాష్ట్రాలు కొన్నిటిలో బీజేపీకి మంచి ఓట్ల శాతం లభించింది (ఉదాహరణకు, కేరళలో దానికి 10 శాతం ఓట్లు లభించాయి). ఈ రాష్ట్రాలలో ఆ పార్టీ తన ఉనికిని సుస్థిరమైనదిగా మార్చు కునే వరిస్థితిలో ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు ఇందుకు కొంత వరకు కారణం (స్థానిక ఎన్నికల విజయాలను మదింపు వేసిన ప్రతిసారీ మోదీ వారిని అభినం దిస్తుంటారు). దశాబ్దాల తరబడి వారు నిస్వార్థంగా చేసిన స్వచ్ఛంద కృషి ఫలి తాలను ఇచ్చింది. ఈ రాష్ట్రాలన్నిటిలోనూ కాంగ్రెస్ పరిస్థితి క్షీణించిపోవడం కూడా కొంతవరకు దీనికి కారణం. మనలో చాలా మందిమి 2004లో అటల్ బిహారి వాజ్పేయి మెజారిటీ స్థానా లను సాధిస్తారని భావించాం. ఆయన సైతం ఆ విషయంలో ధీమాగా ఉండి, ఆరు నెలల ముందే ఎన్నికలకు దిగి, ఓడిపోయారు. కాబట్టి మరో రెండేళ్లు గడిచాక ఏమి జరుగుతుందో ఇప్పుడే ఊహాగానాలు చేయడం అవివేకం అవుతుంది. ప్రభు త్వాలు, హీరోల్లాంటి ఎదురులేని నేతలు సైతం అంతకంటే చాలా చాలా తక్కువ సమయంలోనే జనాదరణను కోల్పోయారు మరి. అయితే గణాంకాలు మాత్రం మోదీకి చాలా అనుకూలంగా ఉన్నాయి. అయినా అనుకోనిదే జరిగేట్టయితే... 2019 ఎన్నికలను మోదీ ఓడిపోయే ఎన్నికలు అనగలమే తప్ప, ప్రతిపక్షం గెలిచే ఎన్నికలు అనలేం. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
మళ్లీ అసమ్మతి వ్యతిరేక విద్వేష పర్వం
అవలోకనం కన్హయ్య, ఉమర్ ఖలీద్, గుర్మెహర్, షెహ్లా రషీద్ వంటి ధైర్యవంతులైన యువతీయువకులు హిందుత్వకు ఎదురు నిలుస్తున్నారు. వారేమీ తప్పు మాట్లాడటం లేదు. కశ్మీరీలతో చర్చను ప్రారంభించడంలో తప్పు ఏముంది? మనం మన ఆదివాసులు, దళితులతో చెడుగా ప్రవర్తిస్తున్నామనడంలో తప్పేముంది? అది నిజం. ‘దేశ వ్యతిరేకుల’పై మరో దఫా హింస, విద్వేషకాండ ప్రారంభమయ్యాయి. వారి అభిప్రాయాలతో ఏకీభవించినా, ఏకీభవించకున్నా మనం వారికి మద్దతు తెలపాలి, వారి తరఫున నిలవాలి. మోదీ ప్రభుత్వ నియంత్రణలోని ఢిల్లీ పోలీసులు కన్హయ్య కుమార్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డాడని నిరూపించే ఆధారాలను చూపలేదని ఇటీవలి వార్తా నివే దికలను బట్టి తెలుస్తోంది. కన్హయ్య, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి. ఏడాదిక్రితం జాతీయస్థాయి విద్వేషానికి గురైన వ్యక్తి. అతనెవరో తెలి యనివారికోసమే ఈ వివరాలు. ఆయనపై భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నా డనే అభియోగం మోపారు. ఇంతకూ అసలు భారత వ్యతిరేక నినాదం అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. అజాదీ అనే పదానికి ఎన్నో రూపాలూ, అర్థాలూ ఉన్నా, ‘‘కశ్మీర్ కోరేది అజాదీ’’ అనే నినాదం భారత వ్యతిరేకమైనదని భావిస్తుంటారు. అది ‘దేశ వ్యతిరేకమైనదే’ అనుకున్నా దేశద్రోహం కాదు. నిర్ధి ష్టంగా హింసకు పిలుపును ఇస్తేనే ఆ వ్యక్తిపై దేశద్రోహ నేరాన్ని మోపవచ్చునని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. టేపులలో కన్హయ్య గొంతు వినరాలేదని ఇప్పుడు చెబుతున్నారు. ఈ కారణంగా అతనిపై దేశద్రోహ నేరాన్ని ఆరోపించ కూడదు, అతనిని అరెస్టు చేసి, జైలుపాలు చేసి ఉండకూడదు. ఇక కోర్టులో అత నిపై దాడి చేసిన లాయర్లది క్రిమినల్ నేరం. జేఎన్యూ వ్యవహారంపై కఠోరమైన వ్యాఖ్యలను ట్వీట్ చేసిన ప్రధాని, స్మృతి ఇరానీలు అతనికి క్షమాపణ చెప్పాలి. జైలు నుంచి విడుదౖలñ నప్పుడు కన్హయ్య చేసిన ఉపన్యాసం అద్భుతమైనదని చాలా మంది అభిప్రాయం. అలా అనుకున్న వారిలో నేనూ ఒకడిని. బీజేపీకి అతను చాలా ప్రమాదకరమైనవాడు, అది అతనివైపు వేలెత్తి చూపకపోవడమే మంచిది అని నేను అప్పుడు రాశాను. అతనికి ఎదుటివారిని ఒప్పింపచేయగల భావ వ్యక్తీకరణా సామర్థ్యం ఉంది. రాహుల్ గాంధీ లాంటి నేతలు చేయలేని విధంగా అతను ప్రధాని నరేంద్ర మోదీ గంభీర పద గుంభనను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. కన్హయ్య జైలు నుంచి వచ్చాక నేను అతన్ని కలుసుకున్నాను. మా సమావేశం అతని ఉపన్యాసంలో కనిపించిన దాన్ని ధృవీకరించింది. అతను ఆకర్ష ణీయమైన వ్యక్తి. భావ గాంభీర్యంగల, ఆలోచనాయుతుడైన, నమ్రతగల యువ కుడు. అతనికి తన గురించి మాట్లాడటం నచ్చదు. సమస్యలపై లోతుగా చర్చిం చాలని కోరుకుంటాడు. అతను విడుదలైన తర్వాత బీజేపీ విద్యార్థి విభాగం అతన్నిSవిస్మరించింది, పార్టీ సైతం అతనితో వాదోపవాదాల్లోకి దిగడం కంటే దూరంగా ఉండటాన్నే ఎంచుకుని తెలివైన పని చేసింది. మీడియా తన దృష్టిని అతనిపై నిలపకుండా నిలువరించింది. ఈ విషయానికి ఇక ముగింపు పలకాలనే అతనికి వ్యతిరేకంగా ఆధారాలేవీ లేవనే వార్తను లీక్ చేసి ఉండొచ్చు. కానీ దేశ వ్యతిరేకత సమస్య విశ్వవిద్యాలయాలలో తిరిగి తలెత్తింది. ఈసారి అమర జవాను కుమార్తె గుర్మెహర్ కౌర్ వంటి ఇతర యువతీయువకులు జాతీయ ప్రముఖులుగా మారారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఆమె చేసిన ప్రకటన లపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోకులు వేసి హేళన చేశారు. ఈ దేశ వ్యతిరేక చర్చలోని ఇరు పక్షాలలో ఒక పక్షం మాత్రమే హింసాత్మకమైనది, హింసను అను మతించేది. అది ప్రభుత్వమూ, ఏబీవీపీలాంటి దాని మిత్ర బృందాలే. తమ చర్య లను మీడియా, సాధారణ ప్రజానీకమూ తీవ్రంగా వ్యతిరేకిస్తారని స్పష్టంగా తెలిసి కూడా విద్యార్థులు సమస్యను ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు, తమ పైకి హింసను ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఇదే అసలు ప్రశ్న. అధిక సంఖ్యాకవాదపు, పచ్చిగూండాయిజపు భావజాలాన్ని ప్రతిఘటించడానికి నేడు భారతదేశంలో మరో వేదిక లేకపోవడమే అందుకు కారణం. బీజేపీ, హిందుత్వ గ్రూపులు జాతీయవాద ఎజెండాను గట్టిగా ముందుకు నెడుతున్నాయి. జాతీయగీతం, జాతీయ జెండా, కశ్మీర్, మావోయిజం లేదా మైనా రిటీల హక్కులు వంటి అంశాలపై వారు మరో అభిప్రాయాన్ని సహించరు. మిగతా పార్టీలు ఈ జాతీయవాదం చర్చ నుంచి పారిపోతాయి. వ్యక్తిహక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛలకోసం నిలబడటం వల్ల కలిగే ఎన్నికలపర మైన ప్రయోజనాలేవీ లేవని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రజల మానసిక స్థితి మరింత ఎక్కువ జాతీయవాదానికి అనుకూలంగా ఉన్నదని కోర్టులు సైతం నిర్ధారణకు వచ్చినట్టుంది. సినిమా ప్రదర్శనకు ముందు జాతీయగీతాన్ని లేచి నిలబడి, వినడాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పులు దాన్నే సూచిస్తున్నాయి. మీడియా ఒక వ్యాపారం కాబట్టి అది జనాభిప్రాయానికి తలవంచక తప్పదు. వార్తా పత్రికలు వాటి సంపాదకీయ పేజీలలో అసమ్మతి అభిప్రాయాలను అనుమ తిస్తాయి. కానీ టీవీకి ఇది నిజంగానే సాధ్యం కాదు. వార్తా చానళ్లు తమ రేటింగ్స్ను పెంచుకోవాలంటేæ మెజారిటీతో పాటే నిలవాలి. ప్రతిఘటనకు, అసమ్మతికి ఇక ఉన్న ఏకైక వేదిక విశ్వవిద్యాలయమే. కన్హయ్య, ఉమర్ ఖలీద్, గుర్మెహర్, షెహ్లా రషీద్ వంటి ధైర్యవంతులైన యువతీ యువకులు హిందుత్వకు ఎదురు నిలుస్తున్నారు. వారేమీ తప్పు మాట్లాడటం లేదు. కశ్మీరీలతో చర్చను ప్రారంభించడంలో తప్పు ఏముంది? మనం మన ఆది వాసులు, దళితులతో మనం చెడుగా ప్రవర్తిస్తున్నామనడంలో తప్పేముంది? అది నిజం. దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ప్రవేశపెట్టిన మాజీ ఎన్నికల కమిషనర్ ఎంఎస్ గిల్తో మాట్లాడుతూ నేనొకసారి నేనీ విషయాన్ని ప్రస్తావించాను. ఒక విశ్వవిద్యాలయాన్ని గొప్పదిగా చేసేది ఏది? అని అడిగాను. కేంబ్రిడ్జిలో చదివిన ఆయన, ఆలోచనా స్వేచ్ఛను అనుమతించేదని చెప్పారు. ధైర్యవంతులైన మన విద్యార్థులు అడుగుతున్నది అలా ఆలోచించే హక్కునే. వారు గత ఏడాది దీన్నే కోరారు. అందుకుగానూ అప్పట్లో తిట్లూ, తన్నులూ తిన్నారు. నాడు దెయ్యంగా చిత్రించిన మనిషి చట్టవిరుద్ధమైనదేదీ చేయలేదనే వార్తను మోదీ ప్రభుత్వ పోలీ సులు చల్లగా లీకు చేశారు. ‘దేశవ్యతిరేకుల’కు వ్యతిరేకంగా మరో దఫా హింస, విద్వేషకాండ ప్రారం భమయ్యాయి. వారి అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకున్నా మనం వారికి మద్దతు తెలపాలి, వారి తరఫున నిలవాలి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
అవసాన దశకు చేరువలో అతి పాత పార్టీ
అవలోకనం రాష్ట్రాల్లోని బలమంతా తుడిచిపెట్టుకుపోవడంతో కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. 2004–2014 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సైతం ఉత్తర భార తంలోని పెద్ద భాగాలలో అది శాశ్వత ప్రతిపక్షంగా ఉంది. పెద్ద రాష్ట్రాల్లో అది నాలుగవ లేదా ఐదవ స్థానానికి దిగజారింది. మరో నేత నేతృత్వంలో కాంగ్రెస్ పునరుజ్జీవితమయ్యే అవకాశం ఉన్నమాట నిజమే. కానీ రాహుల్ గాంధీ వృద్ధుడేమీ కాడు. జాతీయ స్థాయిలో కనుమరుగవుతూ సమంజసత్వాన్ని కోల్పోతున్న ఆ పార్టీకి ఇది ప్రతికూలంగా పని చేస్తుంది. రాజకీయ పార్టీలు ఎలా చనిపోతాయి? మెల్లగా మరణిస్తున్న కాంగ్రెస్ను చూస్తున్న మనకు ఈ అంశాన్ని తరచి చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశంలోని అతి పాత పార్టీౖయెన అది 132 ఏళ్ల క్రితం పుట్టింది. అది అధికారానికి దూరంగా ఉన్నది గత మూడేళ్లుగానే. అయినా అది ఒక జాతీయ శక్తిగా ఇప్పటికే చనిపోకపోయి ఉంటే, కోమాలాంటి స్థితిలోనైనా ఉన్నదనేది స్పష్టమే. దాని పేరు ప్రతిష్టలు బాగా దెబ్బతినిపోయాయి. దాని గురించి సాను కూలంగా చెప్పుకోడానికి ఏమీ లేదు. తన చిన్న ఓటర్ల పునాదికి ఇవ్వగల రాజ కీయ సందేశం సైతం దానివద్ద ఏదీ లేదు. జాతీయశక్తిగా అది అదృశ్యమై పోయినా (అంటే, హస్తం గుర్తును నిలబెట్టుకోడానికి తగినన్ని ఓట్లను సైతం సాధించలేకపోయినా) చనిపోతున్న మొదటి రాజకీయ పార్టీ అదే కాజాలదు. అస్తిత్వంలో ఉండటానికి తగ్గ కారణాలేవీ మిగలక అఖిల భారత ముస్లిం లీగ్ మరణించింది. 20వ శతాబ్దిలో ముస్లింల రాజకీయ హక్కుల సాధన కోసం, వలసవాద ప్రభుత్వంతో చర్చలు జరపడం కోసం ఆ పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్తో అధికారాన్ని పంచుకోడానికి చర్చలు జరపాలని ప్రయత్నించి విఫలమైంది (నేడు బీజేపీని చూస్తున్నట్టే ముస్లింలలో ఎక్కువ మంది అప్పట్లో కాంగ్రెస్ను హిందూ పార్టీగా చూసేవారు). అవి ఒక ఒప్పందానికి రాకపోవడం వల్లనే దేశ విభజన జరిగింది. దీంతో ముస్లిం లీగ్ ఇంచుమించుగా అదృశ్యమైంది. భారత యూనియన్ ముస్లిం లీగ్ పేరిట చాలా ఏళ్లపాటూ ఒకే ఒక్క ఎంపీ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. కేరళ నుంచి పదే పదే ఎంపీగా ఎన్నికైన జీఎం బంటావాలా గుజరాతీ. దేశ విభజన తర్వాత ఒక దశాబ్దిపాటూ పలువురు ప్రధానుల నేతృత్వంలో ముస్లింలీగ్ పాకిస్తాన్లో అధికారంలో ఉండేది. రెండు దేశాల సిద్ధాంతమే ఆ పార్టీకి ప్రాథమిక ప్రాతిపదిక. దీంతో ముస్లింలే అధికంగా ఉన్న దేశంలో అది సమంజసత్వాన్ని కోల్పోయింది. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కొద్దికాలానికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు పెద్ద నేతలు చనిపోయారు. 1948 సెప్టెంబర్ 11న గవర్నర్ జనరల్ జిన్నా క్షయ వ్యాధితో మరణించారు. ప్రధాన మంత్రి లియాఖత్ 1951 అక్టోబర్ 16న హత్యకు గురయ్యారు. కొన్నేళ్ల తర్వాత జనరల్ అయూబ్ఖాన్ అధికారాన్ని హస్తగతం చేసుకునే నాటికి జిన్నా నాయకత్వం వహించిన పార్టీ చీలికకు గురై కన్వెన్షన్ ముస్లిం లీగ్ ఏర్పడింది. పాకిస్తాన్లో ఆ పార్టీ ధరించిన ఎన్నో రూపాల్లో ఇది మొదటిది. పార్టీని విచ్ఛిన్నం చేసి, సైనిక పాలకులకు మద్దతుగా దాన్ని సంస్కరణకు గురిచేసే ఆ సంప్రదాయం దశాబ్దాల తరబడి కొనసాగింది. జనరల్ జియా ఉల్ హఖ్ హయాంలోని ప్రధాన మంత్రి జునెజో ముస్లిం లీగ్(జే)ను ఏర్పరచగా, ముస్లిం లీగ్ (క్యూ) జనరల్ ముషర్రాఫ్కు మద్దతుగా నిలిచింది. నేడు అధికారంలో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) సైతం జియా హయాంలో ఏర్పడినదే. భారత్లో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇంచుమించుగా ఐక్యంగానే నిలి చింది. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం వచ్చిన పెద్ద చీలికతో ఇందిరా గాంధీ అధికారం చేపట్టారు. నెహ్రూతో కలసి పనిచేసిన పాత తరం నాయకులు తమ సొంత కాంగ్రెస్ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ బలవంతురాలైన ఇందిర తన జన సమ్మోహనశక్తితో, జనాదరణతో పార్టీ నిర్మాణాన్ని చేజిక్కించుకున్నారు. ఇందిరా గాంధీని ఓడించిన జనతా పార్టీ, ప్రాంతీయ పార్టీల అతుకుల బొంత కూటమి. అది భావజాల రీత్యా సోషలిస్టు, కాంగ్రెస్ వ్యతిరేక స్వభావంతో ఉండేది. అత్యవసర పరిస్థితిలో ఏర్పడ్డ ఆ పార్టీ ఆ తర్వాత త్వరలోనే సమంజస త్వాన్ని కోల్పోయింది. దాని భాగస్వాములు జనతాదళ్ పేరిట దాని కాంగ్రెస్ వ్యతిరేకవాదాన్ని కాపాడాలని ప్రయత్నించినా అది వాటిని కలిపి ఉంచలేకపో యింది. ఉత్తరాది, దక్షిణాది పార్టీలుగా అది ముక్కలైంది. రామజన్మభూమి ఉద్యమంతో లాల్ కృష్ణ అద్వానీ భారత రాజకీయాలలో మార్పును తెచ్చారు. దీంతో జనతా పార్టీ ముక్కల కాంగ్రెస్ వ్యతిరేక స్వభావం కాస్తా హిందుత్వ వ్యతిరేకతగా మారింది. బీజేపీ అన్నా, అది ప్రాతినిధ్యం వహించే భావజాలమన్నా వాటికున్న భయమే అందుకు కారణం. ఈలోగా రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఏ భావజాలానికీ ప్రాతినిధ్యం వహించడం మానేసింది. దానికి అసలు నిజమైన భావజాలమే లేకుండా పోయింది. రాష్ట్రాల్లోని బలమంతా తుడిచిపెట్టుకుపోవడంతో కాంగ్రెస్ కేంద్రంలో అధికా రాన్ని కోల్పోయింది. 2004–2014 మధ్య అది అధికారంలో ఉన్న దశాబ్దంలో కొన్ని వాస్తవాలు మరుగున పడిపోయాయి. ఉత్తర భార తంలోని పెద్ద భాగాలలో అది శాశ్వత ప్రతిపక్షంగా ఉంది. మూడు దశాబ్దాలుగా అది గుజరాత్ ఎన్నికల్లో గెలవలేదు. బీజేపీ అధికారంలో లేదా ప్రతిపక్షంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో అది నాలు గవ లేదా ఐదవ స్థానానికి దిగజారింది. అంటే అసంబద్ధమైనదిగా మారింది. దక్షిణాదిలో అది అనుకుంటున్నదానికంటే వేగంగా తన స్థానాన్ని బీజేపీకి కోల్పోతోంది. తమిళనాడు, కేరళలో బీజేపీ ఓపికతో కూడిన నిరంతరాయ కృషిని కొనసాగిస్తోంది. వివిధ ప్రాంతాలలోని సమర్థవంతులైన నేతలు పార్టీకి మరణం ఆసన్నమవుతోందని ముందే గ్రహించారు. మమతా బెనర్జీలాంటి కొందరు విజ యవంతంగా అక్కడి పార్టీ యంత్రాంగాన్ని చేజిక్కించుకున్నారు. మహారాష్ట్రలో శరద్ పవార్లాగా కొందరు ఆ విషయంలో సఫలం కాలేదు. మహారాష్ట్రలో తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పార్టీ నుంచి నిధులు అందకపోవడం వల్లనే అది అంత ఘోరంగా దెబ్బతింది. ఇది ప్రమాద సంకేతం. అయినా పట్టించుకునేవారు లేరు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కావడం వల్ల జవాబు దారీతనం లేదు. కాబట్టి అది ఇలాగే తన అగమ్యగోచర పయనాన్ని సాగిస్తుంది. మరో నేత నేతృత్వంలో కాంగ్రెస్ పునరుజ్జీవితమయ్యే అవకాశం ఉన్నమాట నిజమే. కానీ రాహుల్ గాంధీ వృద్ధుడేమీ కాడు. కొన్ని దశాబ్దాల పాటూ ఆయన పార్టీ కార్యకలాపాలను కొనసాగించాల్సి ఉంది. జాతీయ స్థాయిలో çకనుమరుగవుతూ సమంజసత్వాన్ని కోల్పోతున్న ఆ పార్టీకి ఇది ప్రతికూలంగా పని చేస్తుంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఈ అవగాహనా రాహిత్యం ఆందోళనకరం
అవలోకనం ప్రజలకు ఎంతగా జాతీయవాదాన్ని నూరిపోస్తామో అంత ఎక్కువగా కశ్మీరీలను దూరం చేసుకుంటాం. మన కొత్త ఆర్మీ చీఫ్ ఆ అశాంతికి కారణాలను అర్థం చేసుకున్నట్టు లేదు. కశ్మీరీలపై ప్రయోగించని కఠిన చర్యలు ఇంకా ఏవైనా ఉన్నాయా? పెల్లెట్ గన్స్ను ప్రయోగించి వందలాది మందిని అంధులను చేశాం. మొత్తంగా జనాభానే నేరస్తులుగా చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏం సాధించినా, మిలిటñ న్సీని అదుపు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. మనం దాన్ని అంగీకరించి, నూతన పరిష్కార మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన కొన్ని వారాలకే వాటి నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. దొంగ 2,000 నోట్లు మొదట గుజరాత్లో దొరికాయి. ఇప్పుడు దేశం నలుమూలల నుంచి ఆ దొంగ నోట్ల వార్తలు వినవస్తున్నాయి. దొంగ నోట్ల సమస్యకు పెద్ద నోట్ల రద్దు అడ్డుకట్ట వేస్తుందంటూ దాన్ని కూడా అందుకు ఒక కారణంగా చెప్పారు. అది నిజం కాదని తేలిపోయింది. దొంగ నోట్ల సమస్యను ప్రధాని ఉగ్రవాద హింసాకాండతో ముడిపెట్టారు. మిలిటెన్సీని, తీవ్రవాదాన్ని అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దును చేపట్టామన్నారు. ప్రధాని ఈ వాగ్దానాన్ని చేసి ఉండాల్సింది కాదు. మన దేశంలోని మిలిటెన్సీకి గల కారణాల పట్ల అవగాహనా రాహిత్యాన్ని ఇది బయటపెట్టింది. పెద్ద నోట్ల రద్దు జరిగినది చలికాలంలో. ఆ నెలల్లో కశ్మీర్లో సైన్యంపై జరిగే హింసాకాండ తక్కు వగా ఉంటుంది. మంచు కరిగే కొద్దీ ప్రతి ఏడాదిలాగే హింసాకాండ తిరిగి మొదలైంది. కాబట్టి పెద్ద నోట్ల రద్దు మిలిటెన్సీని అరికట్టడానికి తోడ్పడుతుందని చెప్పినది నిజం కాదు. ఒక మేజర్ సహా నలుగురు సైనికులు ఇటీవల కశ్మీర్లో మరణించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల మిలిటెన్సీ స్థాయిలో ఎలాంటి తగ్గుదలా లేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల సైన్యంపై హింసాత్మక దాడులు తగ్గుతాయని చెప్పారు. కాబట్టి ఇది వారిని విస్మయపరచింది. ఇటీవల ‘‘స్థానిక ప్రజల’’ను తప్పు పడుతూ మన ఆర్మీ చీఫ్ ఆగ్రహపూరితమైన ప్రకటన చేశారు. వారు ‘‘కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులు తప్పించుకుపోవడానికి సైతం తోడ్పడుతున్నారు’’ అని, సైన్యం తన పనిని చేయ నివ్వకుండా నిరోధిస్తున్నారని ఆరోపించారు. మరింత ఆందోళనకరంగా ఆయన.. పాకిస్తానీ, ఇస్లామిక్ స్టేట్ జెండాలను ప్రదర్శిస్తున్న భారతీయులను ‘‘జాతి వ్యతి రేకులు’’గా పరిగణిస్తామని, తమ సైనికులు ‘‘వారిని పట్టుకుని’’ ‘‘కఠిన చర్యలు’’ చేపడతారని అన్నారు. ఆర్మీ చీఫ్గానీ, ఆయన సైనికులుగానీ ఏదైనా చర్యను నేరంగా భావిస్తే, వారు ఆ విషయాన్ని జమ్మూకశ్మీర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేగానీ జెండాలు ఊపేవారికి, నినాదాలు చేసేవారికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం వారికి లేదు. సైన్యం, కశ్మీర్ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ తెలిపారు. చాలామంది భారతీయులకు బహుశా తెలిసి ఉండని ఆ వాస్త వాన్ని ఆయన వెల్లడించారు. ‘‘మేం వారికి (ఉగ్రవాదులకు) వ్యతిరేకంగా సైనిక చర్యలను నిర్వహిస్తున్నప్పుడు, స్థానిక ప్రజలు భద్రతా బలగాల చర్యలకు ఏదో ఒక విధమైన మద్దతును తెలుపకపోవడం కనబడుతోంది’’ అని కూడా ఆయన అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వంలో అది కూడా భాగస్వామిగా ఉన్నది మరి. వాస్తవాధీన రేఖకు అవతలి నుంచి పంపుతున్న కొన్ని శక్తులు కశ్మీర్లో దురాగతాలకు పాల్పడుతున్నాయని విశ్వసించడం వేరు. మొత్తంగా స్థానిక జనాభా అంతా మీపట్ల వ్యతిరేకతతో ఉన్నారని అంగీకరించడం వేరు. అది సరైనదైనా, కాకున్నా ఆ విషయాన్ని జనరల్ రావత్ అంగీకరించారు. ‘‘ప్రజలపట్ల మైత్రీపూర్వకంగా ఉండే సైనిక చర్యలను నిర్వహించాలనేదే మా లక్ష్యం. కాగా, ఆ చర్యలను నిర్వహించకుండా స్థానిక ప్రజలు మమ్మల్ని నిరోధిస్తున్న తీరు, కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులు తప్పించు కోవడానికి సైతం వారు మద్దతుగా నిలవడం... భద్రతా బలగాల నష్టాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమౌతున్న అంశాలు’’ అని ఆయన అన్నారు. ఈ ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్లు రెండూ ఇప్పుడు సిగపట్లు పడుతున్నాయి. కానీ ఈ సమస్యకు సంబంధించి ఆ రెండిటి మధ్యా ఎలాంటి తేడా లేదు. అది గత 30 ఏళ్లుగా మనం అది చూస్తూనే ఉన్నాం. ఇటీవల కశ్మీర్లో జరుగుతున్న ఘటన లపట్ల కేంద్రం వైఖరిలోగానీ, మిగతా దేశం వైఖరిలో గానీ ఎలాంటి మార్పు లేని అదే ధోరణి కనిపిస్తోంది. ఈ వారం ఒక కశ్మీరీ విద్యార్థి ఉగ్రవాద ఆరోపణల నుంచి బయటపడ్డాడు. ఢిల్లీలో సదరు బాంబు పేలిన రోజున అతడు శ్రీనగర్లోని ఒక కళాశాలలో ఉన్నట్టు తేలింది. ఆ కళాశాల రిజిస్టర్లో ఆరోజున అతను కళాశాలకు హాజరైనట్టు నమోదై ఉంది. తనను ఇలా బలిపశువును చేయడానికి కారణం తాను ఒక కశ్మీరీ కావడమేనని ఆ విద్యార్థి విశ్వసిస్తున్నాడు. ఇది జరిగినది నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో కాదు, మన్మోహన్సింగ్ యూపీఏ ప్రభుత్వ హయాం లోని 2005లో. భారత్, ప్రజలకు ఎంత బలంగా జాతీయవాదాన్ని నూరిపోస్తుంటుందో అంత ఎక్కువగా మనం కశ్మీరీలను దూరం చేసుకుంటాం. ఆ రాష్ట్రంలో నెలకొన్న అశాంతిని పెద్ద నోట్ల రద్దు పరిష్కరించలేదని మనం అర్థం చేసుకోవాలి. దానికి మరింత లోతైన కారణాలున్నాయి. దురదృష్టవశాత్తూ మన కొత్త ఆర్మీ చీఫ్ వాటిని అర్థం చేసుకున్నట్టు అనిపించడం లేదు. తన సొంత పౌరులనే ఉద్దేశించి చేసిన ఆ ప్రకటనలో ఆయన ఇంకా ఈ విషయాన్ని కూడా జోడించారు: ‘‘యువకులైన ఈ పిల్లలను చంపకూడదనేదే మా భావన. వారిని ప్రధాన స్రవంతిలోకి తిరిగి తేవా లనేదే మా యోచన. కానీ వారి తీరు ఇలాగే ఉంటే వారిని లక్ష్యాలుగా చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ కఠిన చర్యలను చేపడతాం’’. కశ్మీరీలపై ఇంతకు ముందే ప్రయోగించని సాధ్యమైన కఠిన చర్యలు భారత్ వద్ద ఇంకా ఏవైనా ఉన్నాయా? గుంపులను చెదరగొట్టడానికి ఇప్పటికే మనం వారిపై పెల్లెట్ గన్స్ను (ఇనుప రవ్వలను చల్లే తుపాకులు) ప్రయోగించి వంద లాది మందిని అంధులను చేశాం. ఎలాంటి ఆలోచనా లేకుండా వారిపై క్రిమినల్ నేరాలను మోపాం. మొత్తంగా జనాభానే నేరస్తులుగా చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏ విజయాలను సాధించామనైనా చెప్పుకోవచ్చునేమోగానీ... మిలిటñ న్సీని అదుపు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. మనం దాన్ని అంగీకరించి, నూతన పరిష్కార మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ పరిష్కారాలను ఈ సమస్యను ఏదో కరెన్సీకి సంబంధించినదిగా వ్యవహరించేవి కాకూడదు. ఈ సమస్యకు బహిర్గత పార్శా్వలున్నంతగా, అంతర్గత పార్శా్వలు కూడా ఉన్నాయని భావించేవిగా ఆ పరిష్కారాలుండాలి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
చట్టబద్ధత, రాజ్యాంగ విధేయతలకు చోటెక్కడ?
అవలోకనం మన దేశంలో మంత్రులు, ప్రధాన మంత్రులంతా పదవీ స్వీకారం చేసేటప్పడు ఇలా ప్రమాణం చేస్తారు : ‘‘దేవుని సాక్షిగా నేను భారత రాజ్యాంగానికి, చట్టానికి నిజంగా విధేయుడనై, నిబద్ధుడనై ఉంటాననీ, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్ర తను కాపాడుతాననీ, నా విధులను పూర్తి విధేయతతో, మనఃపూర్వకంగా నిర్వహి స్తానని,.. రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా, ఎలాంటి భయం లేదా పక్షపా తమూ, అభిమానం లేదా దురుద్దేశమూ లేకుండా అందరితోనూ సరైన విధంగా నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.’’ ఇది మన రాజ్యాంగంలోని మూడో షెడ్యూలులో ఉన్నది. ప్రభుత్వ రహస్యాలను దాచి ఉంచుతానంటూ మంత్రి చేసే ప్రమాణమూ ఉంది. అది ‘‘నా పరిశీలనకు వచ్చే లేదా నాకు తెలిసే ఏ విషయాన్నీ మంత్రిగా నా విధులను నిర్వహించే క్రమంలో తప్ప, ఏ వ్యక్తికిగానీ లేదా వ్యక్తుల కుగానీ ప్రత్యక్షంగాగానీ లేదా పరోక్షంగాగానీ చేరవేయను లేదా వెల్లడించను.’’ రాజ్యాంగంపట్ల విధేయతతో ప్రవర్తిస్తామనే ఈ ప్రమాణం పట్ల మన మంత్రులు చిత్తశుద్ధిని చూపుతున్నారా? ‘‘అత్యాచార నేర అనుమానితులను, వారు తమ ప్రాణాలను కాపాడమని ప్రాధేయపడేలా చేశాననీ, వారిని చిత్రహింస లకు గురిచేయమని పోలీసులను ఆదేశించాననీ ఒక భారత మంత్రి చెప్పారు.’’ ఇది ఈ వారం బీబీసీ వెలువరించిన వార్త. అనుమానితులను తలకిందులుగా వేలాడదీసి, వారిపై నేరారోపణ చేసిన వారు దాన్ని కళ్లారా చూసేలా చేశానని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి చెప్పారు. ‘‘అత్యాచారానికి పాల్పడిన వారిని వారు క్షమాపణ కోరేవరకు బాధితుల సమక్షంలోనే చిత్రహింసలకు గురి చెయ్యాలి... అత్యాచారానికి పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీసి, చర్మం ఊడేలా చావ బాదాలి’’ అని ఆమె చెప్పినట్టుగా బీబీసీ తెలిపింది. ‘‘కారం రుద్ది కేకలు పెట్టేలా చేయాలి. వారి తల్లులు, అక్కచెల్లెళ్లు దాన్ని చూసేలా చేయాలి’’. మంత్రి చేశానని చెప్పుకుంటున్నది నేరపూరితమైన చర్య. చట్టమూ, రాజ్యాం గమూ ఆమె చేసినదాన్ని అంగీకరించవు. నేరాలతో వ్యవహరించాల్సిన క్రమం స్పష్టంగానే ఉంది. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేస్తారు, ప్రభుత్వం వారిని విచారణకు నిలుపుతుంది, న్యాయవ్యవస్థ తీర్పు చెబుతుంది. ఉమా భారతి గొప్పగా చెప్పుకుంటున్న పని... తాను కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. ఉపఖండంలో మూకుమ్మడిగా ఏ విచా రణా లేకుండానే శిక్షలను వేçస్తుండటం మనం ఊహించగలిగినదే. కానీ మంత్రులే ఆ పని చేసి, అందుకు గర్వించడమనేది మన దేశంలో చట్టంతో ఎలా వ్యవహరి స్తున్నారనేదాన్ని, మన మంత్రులు తమ ప్రమాణ స్వీకారం పట్ల ఎంత చిత్తశుద్ధిని కన బరుస్తున్నారనేదాన్ని కొంత వరకు తెలియజేస్తుంది. అత్యాచారాలకు పాల్పడే వారిని శిక్షించడం గురించిన ఈ డాబుసరి మాటలను, నిజంగా అలాంటి నేరాల విషయంలో దేశం వాస్తవంగా చేపడుతున్న చర్యలతో పోల్చిచూడాలి. 2013 ముజ ఫర్నగర్ అల్లర్లలో సామూహిక అత్యాచారాలకు గురై ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన ఏడుగురిలో ఎవరికీ ఇంతవరకు న్యాయం జరగలేదు. వారిలో ఒక మహిళ చని పోగా, మిగతావారు తమ గోడు వినిపించుకునేలా చేయడానికి వ్యవస్థకు వ్యతి రేకంగా పోరాడుతూనే ఉన్నారు. నిందితులు వారిని బెదిరింపులకు గురిచేశారు. లైంగిక వేధింపులపై ఘనమైన చర్యలు చేపట్టామని గొప్పలు చెప్పుకుంటున్న వారి నుంచి ఆ బాధితులకు ఇంతవరకు ఎలాంటి మద్దతు లభించలేదు. నిర్భయ కేసుగా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ ఘటనలో ఒక యువతిపై సామూహి కంగా లైంగిక దాడి, హత్య జరిగాయి. ఆ తదుపరి భారీ ప్రజా ఉద్యమమూ సాగింది. అలాంటి హింస బాధితులకు, బయటపడ్డ వారికి వేగంగా న్యాయం అందేలా చేయడం కోసం చట్టంలోనూ, నియమ నిబంధనలలోనూ మార్పులు చేశారు. కానీ క్షేత్ర స్థాయి పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదనేది వాస్తవం. అందువలన, ఒకవంక లైంగిక హింసపై, అత్యాచారాలకు పాల్పడేవారిపై చర్య లను చేపట్టడంలోనూ, వారికి న్యాయం అందించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలం కాగా... మరోవంక ఈ నేరాలను అరికట్టడానికి మంత్రులు చేస్తున్న అద్భుత ఘనకార్యాల ప్రకటనలు మన ముందుకు వస్తున్నాయి. ఉమా భారతి తాను చేస్తున్నది సరైనదేనని నమ్ముతున్నారు కాబట్టి ఆమెకు తాను రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నానని సైతం తెలియకపోవచ్చు. ఆమెలాంటి వ్యక్తుల దృష్టికి సరైనదిగా అనిపించేది... తప్పనిసరిగా చట్టబద్ధమైనది కానవసరం లేదు. ‘అందరితోనూ సరైనవిధంగా నడుచుకుంటాన’ని ఆమె ప్రమాణం చేశారు. కానీ ‘మంచి కుటుంబాల’ నుంచి వచ్చిన వారుంటారని విశ్వసించేవారు ఉన్న సమాజంలో నేరారోపణలు ఎదుర్కొంటున్నవారికి, శిక్షపడ్డ వారికి మధ్య తేడా ఉండదు. మంచి కుటుంబాల నుంచి రాని వారిది తప్పక చెడు పుట్టుకే కావచ్చు. అందుకుగానూ వారిని శిక్షించాల్సిందే అనే భావన ప్రబలంగా ఉంటుంది. కానీ చట్టం పట్ల నాగరిక భావన ఆరోపితులకు రక్షణను కల్పిస్తుంది. ‘‘దోషిగా తేలే వరకు అమాయకునిగానే భావించాలి’’ అనే పదబంధం ఉన్నది కూడా అందుకే. అయితే అది, మన మంత్రి ప్రదర్శించిన ఆదిమ ఆలోచనకు విరుద్ధమైనది. ఆ ప్రమాణంలోని ‘‘భారత దేశ ఐక్యత, సమగ్రత’’ అన్న దానిపై దృష్టి కేంద్రీ కణ అంతా ఉంటుంది. అది పవిత్రమైనది. ఆ భావనను, మాటల్లోనే అయినా ఉల్లంఘించినట్టుగా ఆరోపణకు గురైన వారిని ఎవరినైనా చావబాదేస్తారు. అది కూడా ఎలాంటి విచారణ లేకుండానే. భారత రాజ్యాంగానికి, చట్టానికి కట్టుబడి ఉండటం అనే ఆ మిగతాదంతా నసుగుడు మాత్రమే. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
అమెరికా ఔన్నత్యాన్ని చాటుతున్న అసమ్మతి
అవలోకనం గత పాలకుల చారిత్రక తప్పులకు సంబంధించిన జ్ఞాపకాల ప్రభావం వల్లే కావచ్చు... తమ ప్రభుత్వాలు ఏమంత పరిపూర్ణమైనవి కావన్న ఎరుకతోటే, వ్యక్తుల హక్కులను ఉల్లంఘించి నప్పుడు అన్ని సందర్భాల్లో సవాలు చేయాలన్న చైతన్యం అమెరికాలో కలుగుతోంది. ఇదే అమెరికాను ఉన్నతంగా నిలుపుతోంది. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చుతానని ప్రకటించిన ట్రంప్.. బహుశా అమెరికా గొప్పతనం మూలాలను నిజంగానే అర్థం చేసుకోలేదనిపిస్తుంది. ఏడు దేశాల నుంచి అమెరికాకు ప్రయాణికుల రాకను నిషేధిస్తూ తమ దేశాధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన అసాధారణ ఆదేశంతో చాలా మంది అమెరికన్ల హృదయాలు గాయపడ్డాయి. అమెరికాకు ముస్లింల రాకను అడ్డుకోవడం ద్వారా ఉగ్రవాదాన్ని అంతమొందిస్తానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే ట్రంప్ ఏడు ముస్లిందేశాలపై ఈ నిషే ధాన్ని విధించారు. వీటిలో ఇరాన్, ఇరాక్ కూడా ఉన్నాయి. అమెరికాలో లక్షలాది మంది ఇరాన్ ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇక ఇరాక్ విషయానికి వస్తే తమ సొంత దేశస్థులపైనే జరుగుతున్న యుద్ధంలో చాలామంది ఇరాకీ ప్రజలు అమె రికా పక్షం వహించారు. ఈ జాబితాలో సిరియా కూడా ఉంది. ఇక్కడ జరుగుతున్న హింసాత్మక ఘర్షణల ప్రభావంతో లక్షలాదిమంది దేశం విడిచి పారిపోతున్నారు. ప్రారంభంలో ఈ ఏడు దేశాలకు చెందిన పౌరులనే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిం చింది కానీ, అమెరికాలో శాశ్వత నివాస హక్కులున్న వారిని (గ్రీన్ కార్డు ఉన్న వారు) కూడా నిషేధ జాబితాలో చేర్చేశారు. పైగా అమెరికాకు పర్యాటకం, వాణిజ్య వీసాలతో వచ్చిన పై ఏడు దేశాల ముస్లిం పౌరులకు కూడా నిషేధాన్ని వర్తింపజేయడంతో అమెరికా విమానాశ్ర యాల్లో కల్లోలం మొదలైంది. అయితే ట్రంప్ వాణిజ్య ప్రయోజనాలు కలిగివున్న సౌదీ అరేబియా వంటి దేశాలకు ఈ నిషేధం వర్తించకపోవడం విశేషం. అయితే నిషేధం విషయంలో కపటత్వం, ఒక పద్ధతీ, పాడూ లేకపోవడానికి మించి, పౌర స్వేచ్ఛ, మానవ హక్కులను ఉల్లంఘించారన్న ఆగ్రహంతోటే చాలామంది అమె రికన్లు నిషేధంపై ఆగ్రహించారు. అమెరికా అంటే స్వేచ్ఛా సమానత్వాలకు పట్టం కట్టే దేశం అనే భావనను అమెరికన్లు ప్రగాఢంగా నిలుపుకుని ఉన్నారు. ఇలాంటి వారు నిషేధానికి వ్యతిరేకంగా పనిచేయాలని భావించారు. పైగా అమరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్యు) మద్దతుతో వీరు పోరుకు దిగారు కూడా. పైగా ఇది అమెరికాలోని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడేందుకు అంకితమైన లాభాపేక్ష లేని, పక్షపాతం ఎరుగని న్యాయ, సలహా సంస్థ అని తన్ను తాను అభివర్ణించుకుంది. ట్రంప్ ఆదేశానికి వ్యతిరేకంగా తానెందుకు చర్యలు చేపడుతున్నదీ వివరిస్తూ ఎసిఎల్యు తన వెబ్సైట్లో సింపుల్గా ఇలా సమర్థిం చుకుంది. ‘అతడు వివక్ష ప్రదర్శించాడు. మేం దావా వేశాం.‘ ట్రంప్ నిషేధాజ్ఞపై అమెరికా న్యాయమూర్తి ఒకరు స్టే విధించారు. దీనికి తోడుగా చాలామంది న్యాయస్థానాల్లో దాఖలు చేసిన లావాదేవీల ఫలితంగా ట్రంప్ తన నిషేధాజ్ఞను అమలు చేయడం కష్టమవుతుంది. ప్రతిపక్షం దూకుడు కారణంగా ఇప్పటికే గ్రీన్ కార్డుదారులపై విధించిన నిషేధాన్ని వెనక్కు తీసు కున్నారు కూడా. ట్రంప్ నిషేధాజ్ఞకు వ్యతిరేకంగా దావా వేసిన కొద్ది రోజుల్లోనే అమెరికా పౌరహక్కుల సంస్థ రూ.150 కోట్లకు పైగా నిధులు వసూలు చేసింది. దీంట్లో చాలాభాగం చిన్న చిన్న విరాళాల నుంచే వచ్చింది. తన సభ్యుల నెలవారీ విరాళాల నుంచి అది చాలా వరకు నిధులను సమీకరిస్తోంది. ముస్లిం దేశాలపై నిషేధంతో అమెరికన్లలో కలిగిన తీవ్ర ఆగ్రహం కారణం గానే, ఇతర వ్యక్తులు ఏసిఎల్యుకి ఇచ్చే విరాళాలకు సరిసమానమైన విరాళాలను అమెరికన్ సెలబ్రిటీలు ఇస్తామని ప్రతిపాదించారు. అంటే 200 మంది అమెరికన్ ప్రజలు రూ.10 లక్షల విరాళాన్ని ఇచ్చినట్లయితే సెలబ్రిటీ దానికి మరొక రూ. పది లక్షలను తన వంతుగా విరాళం ఇస్తాడు. అంటే ఏసీఎల్యుకి రూ.20 లక్షల విరాళం వస్తుందన్నమాట. ఏసీఎల్యుని ట్విట్టర్లో ఫాలో చేసే ప్రజల సంఖ్యను పెంచడంలో సాయపడాలని మరికొందరు నిర్ణయించుకున్నారు. ఒక వారంలో రెండు లక్షల మంది ఫాలోయర్లు అలా అదనంగా చేరారు. ఈ వ్యాసం మీరు చదు వబోయే సమయానికి వీరి సంఖ్య పది లక్షలను దాటుతుంది. ట్రంప్ నిషేధాజ్ఞ 1940లలో జరిగిన ఒక ఘటనను పోలి ఉందని పలువురు అమెరికన్లు భావిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో హవాయిలోని అమె రికన్ సైనిక స్థావరంపై జపాన్ సైన్యం దాడి చేసింది. దీంతో అమెరికాలోని జపాన్ సంతతి అమెరికన్లలో చాలామందిని ద్రోహులుగా భావించి నిర్బంధ శిబిరాలలో బంధించారు. ఇది తర్వాత జాతీయ అవమానంగా పరిణమించింది. అలాంటి చారిత్రక తప్పులకు సంబంధించిన జ్ఞాపకాల ప్రభావం వల్లే కావచ్చు.. తమ ప్రభుత్వాలు ఏమంత పరిపూర్ణమైనవి కావన్న ఎరుకతోటే వ్యక్తుల హక్కులను ఉల్లంఘించినప్పుడు అన్ని సందర్భాల్లో సవాలు చేయాలన్న చైతన్యం అమెరికాలో కలుగుతోంది. ఇదే అమెరికాను ఉన్నతంగా నిలుపుతోంది. అమెరి కాను మళ్లీ గొప్ప దేశంగా మార్చుతానని ప్రకటించిన ట్రంప్.. బహుశా అమెరికా గొప్పతనం మూలాలను నిజంగానే అర్థం చేసుకోలేదనిపిస్తుంది. అమెరికాలోని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడతామని చెప్పే ఏసీఎల్యూ తదితర పౌరహక్కుల బృందాలు ఉన్నటువంటి గొప్ప భాగ్యవంతమైన దేశం అమెరికా. భారత్కి కూడా ఇలాంటి పౌర బృందాలు ఎంతో అవసరం. రాజకీయ, న్యాయ రంగాలతో సహా అన్ని సెక్షన్ల నుంచి ఇలాంటి బృందాలకు మద్దతు నివ్వా ల్సిన అవసరం కూడా ఉంది. 1962 నాటి చైనా యుద్ధ సమయంలో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చైనీయ మూలాలున్న వేలాది భారత పౌరులను జైలుపాలు చేశారు. ఆ యుద్ధం కొన్ని వారాల్లోనే ముగిసింది కానీ కలకత్తాలోని తమ స్వగృహాల నుంచి వీరిని నిర్బంధపూరితంగా తీసుకెళ్లి రాజస్తాన్లో రెండేళ్ల పాటు ఖైదులో పెట్టారు. దీని గురించి మనలో చాలామందికి తెలీకపోవడం సిగ్గుచేటు. పైగా మనం భారత్లోని అత్యంత బలహీన వర్గాలైన దళితులు, ముస్లింలు, ఆదివాసీల పట్ల నేటికీ అనాగరిక వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నాం. మనం కూడా అమెరికన్ విలువల కోసం లక్షలాది అమెరికా పౌరులు మద్దతు తెలుపుతున్న ఏసీఎల్యూ వంటి జనాకర్షకమైన, ప్రభావశీలమైన పౌర సంస్థలను ఏదో ఒక రోజు మనం కూడా పొందవచ్చు. మనం ఇతరులకు వ్యక్తిగతంగా అన్యాయం చేసి నప్పుడు భారత్ లోని ఇతరులు అలాంటి చర్యలపట్ల ఆగ్రహం ప్రదర్శించే స్థితి వచ్చినప్పుడు భారత్ను ఒక గొప్ప దేశంగా ప్రపంచం ముందు నిలువవచ్చు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
మూడు దశాబ్దాల అన్యాయానికి ముగింపు లేదా?
అవలోకనం భారత్లో అల్లర్లకు సంబంధించిన సాధారణ అంశం ఏదంటే అధికారంలో ఉన్న పార్టీ అధికారాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి దర్యాప్తు ప్రక్రియే వెన్నుపోటుకు గురవుతుంది. కాంగ్రెస్ పాలనలో చాలాసార్లు ఇలాగే జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక సాధనం అందుబాటులో ఉంది. సిట్కి అది మరొకసారి పొడిగింపు ఇవ్వకూడదు, తాజా విచారణపై ప్రజలకు నివేదిక ఇవ్వాలి. సకాలంలో న్యాయం చేకూర్చకపోవడం అంటే న్యాయాన్ని తిరస్కరిస్తున్నట్లే లెక్క. ఈ సందర్భంలో కూడా మరోసారి అదే జరిగితే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. సిక్కులపై 1984లో జరిగిన హత్యాకాండలో బాధితులకు న్యాయం చేయడంపై భారత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది? భారతీయులందరూ ఆసక్తి చూపవ లసిన ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది మూక హింసాకాండ ఘటనలు జరిగిన సంద ర్భాల్లో ఈ దేశం న్యాయం చేకూర్చగలదా అనే అంశాన్ని నిర్ధారించే ప్రశ్న. ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మారణ కాండలో దేశవ్యాప్తంగా 3,325 మంది హత్యకు గురైతే, ఒక్క ఢిల్లీలోనే 2,733మందిని వధించారు. ఈ హత్యాకాండలో పాల్గొన్న వారిలో శక్తిమంతులైన కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు ఆరోపించారు. వీరిలో హెచ్కెఎల్ భగత్ వంటి వారు విచారణను ఎదుర్కొనకుండానే మరణించారు. ఇక సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్, కమల్నాథ్ వంటివారు ఇప్పటికీ బతికే ఉన్నారు. ఈ మారణకాండపై మొదట విచారించిన రంగనాథ్ మిశ్రా కమిషన్ వీరి ప్రకటన లను బాధితుల పరోక్షంలో రికార్డు చేసింది. పైగా హత్యాకాండ ఆరోపణల నుంచి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని విముక్తి చేసింది. గత 32 ఏళ్లుగా కేంద్రంలో డజనుకు పైగా కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రభు త్వాలు వచ్చాయి, వెళ్లాయి కానీ ఈ కేసుల్లో ఎలాంటి పురోగతీ లేదు. వాజ్పేయి ప్రభుత్వం నానావతి కమిషన్ని నియమించింది. ఈ కమిషన్ తన నివేదికను మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అందచేసింది. ఈ నివేదికను బహిరంగ పర్చారు. అది వెల్లడించిన సమాచారం దేశాన్ని దిగ్భ్రాంతి పర్చింది. మన్మోహన్ కాంగ్రెస్ పార్టీ తరపున దేశానికి క్షమాపణలు చెప్పారు. బాధితులకు న్యాయం జరగలేదు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ మారణకాండపై చర్య తీసుకుం టానని వాగ్దానం చేసి, 2014 డిసెంబర్ 23న జీపీ మాథుర్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కేసుల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పర్చాల్సిం దిగా మాథుర్ సిఫార్స్ చేశారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లడం, గత కమిటీలు సేకరించిన సాక్ష్యాధారాలతో కూడిన ఫైళ్లను సిట్ చూడగలుగుతుంది. పైగా సాక్ష్యాధారాలు లభిస్తే తాజాగా నేరారోపణ చేసే అధికారం కూడా దీనికి ఉంటుంది. సిట్ను 2015 ఫిబ్రవరి 12న ఏర్పర్చారు. అది ఆనాటి నుంచి పని ప్రారం భించింది కాని తాజా ఛార్జిషీటును నమోదు చేయలేకపోయింది. దీంతో 2015 ఆగస్టులో సిట్ బాధ్యతలను సంవత్సరం పాటు పొడిగించారు. అయితే 2016 ఆగస్టు నాటికి కూడా సిట్ తాజా ఛార్జిషీటును నమోదు చేయలేకపోయింది. దీని విచారణను బహిరంగంగా వెల్లడించలేదు. తర్వాత సిట్ను రెండోసారి పొడిగిం చారు. ఈ ఫిబ్రవరి 11కు దాని బాధ్యతలు ముగియనున్నాయి. ఈ గడువు తేదీ కూడా న్యాయాన్ని ప్రసాదించకపోతే నాటి మారణకాండలో మృతులు, బాధితుల పట్ల అది అన్యాయమే అవుతుంది. 1984 నాటి అల్లర్లకు సంబంధించి 650 కేసులను నమోదు చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 18 కేసులను రద్దు చేయగా, 268 కేసులు అతీ గతీ లేవు. ఈ అన్ని కేసులనూ సిట్ మళ్లీ విచారించింది. ఈ నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ ఇంతవరకు 218 కేసులను వివిధ దశల్లో పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇంతవరకు 22 కేసులను తదుపరి విచారణ కోసం గుర్తించారు. వీటిపై తదుపరి పరిశీలనకు పోలీసులకు సిట్ నోటీసులిచ్చింది. ప్రాథమిక సమాచార నివేదికలు గురుముఖి లేదా ఉర్దూ భాషలో ఉన్నందున ఈ కేసుల తనిఖీలో జాప్యం చోటుచేసుకుందని హోం శాఖ తెలిపింది. అయితే ఈ భాషల నుంచి అనువదించగల నిపుణులకు భారత్లో కొరత లేదు కాబట్టి హోం శాఖ ప్రకటనను నమ్మడం కష్టమే. హోంశాఖ ఇంకా ఇలా చెప్పింది. "ఈ కేసులు చాలా పాతవి, రికార్డులను వెతికి తనిఖీ చేయడం కష్టంగా ఉంటోంది... ఈ కష్టా లను పక్కనపెట్టి సిట్ వీటిని సవాలుగా తీసుకుంది, సూక్ష్మ స్థాయిలో ఈ కేసుల పరిశీలనకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ప్రభావిత కుటుంబాలకు న్యాయం చేకూర్చడానికి ఈ కేసుల పరిశీలన విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవడమైనది" దురదృష్టవశాత్తూ, ఈ విచారణల్లో ఏదైనా పురోగతి ఉందా అనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. నేను పనిచేస్తున్న ఆమ్నెస్టీ ఇండియా సంస్థ ఈ అంశంపై గత ఏడాది ఢిల్లీలో ఒక సదస్సు నిర్వహించింది. నాటి మారణకాండలో హతులు, బాధితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ బృందాలతో కలిసి పని చేశాము కానీ వీరిలో ఎవరూ అంత సీరియస్గా ఉన్నట్లు కనిపించలేదు. ఉదా హరణకు, నాడు జరిగిన నేరాలకు సాక్షీభూతులై నిలిచి నేటికీ బతికి ఉన్నవారిలో ఎవరూ తమ ప్రకటనలను తిరిగి నమోదు చేయించడానికి లేదా మరేదైనా తనిఖీకి సిట్ను సంప్రదించినట్లు లేదు. ఇది సమస్యాత్మకమే. ఎందుకంటే బాధితుల్లో ఆ కేసులపై ఆసక్తి లేదని పైగా తగిన చర్య తీసుకోవడానికి వారు ఉద్దేశపూర్వకంగానే అయిష్టత ప్రదర్శిస్తున్నారని ఇది సూచిస్తోంది. తగిన విచారణ లేకుండా తాజా నేరారోపణలకు ఎవరు పూనుకుంటారు, వారికి న్యాయం ఎలా లభిస్తుంది? భార తీయ అల్లర్లకు సంబంధించిన సాధారణ విషయం ఏమిటంటే అధికారంలో ఉన్న పార్టీ అధికారాన్ని కొనసాగిస్తుంది. (దురదృష్టవశాత్తూ అలాంటి హింస వివిధ కమ్యూనిటీలను మరింతగా కూడగట్టడానికే తోడ్పడుతుంది) కాబట్టి దర్యాప్తు ప్రక్రియే వెన్నుపోటుకు గురవుతుంది. కాంగ్రెస్ పాలనలో భారతదేశంలో చాలా సార్లు ఇలాగే జరిగింది. మూక హింస వల్ల ఒక సమాజంగా దెబ్బతింటున్న వారికి జరిగిన నష్టం పూరించేందుకు ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం వచ్చింది. ప్రస్తుతం పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీలన్నీకూడా 1984లో జరిగిన మారణకాండ బాధితులకు న్యాయం చేకూరుస్తామని తమ తమ ఎన్నికల ప్రణా ళికల్లో వాగ్దానం చేయడానికి అంగీకరించినవే. ఇది మంచి విషయం కూడా. ఏదేమైనప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక సాధనం అందుబాటులో ఉంది. సిట్కి అది మరొకసారి పొడిగింపు ఇవ్వకూడదు, తాజా విచారణకు సంబంధించి ప్రజలకు నివేదిక ఇవ్వాలి. సకాలంలో న్యాయం చేకూర్చకపోవడం అంటే న్యాయాన్ని తిరస్కరిస్తున్నట్లే అవుతుంది. ఈ సందర్భంలోకూడా మరోసారి అదే జరిగితే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
ఎక్కడైనా నేతల మాటలు నీటి మూటలే
అవలోకనం జనాకర్షక వాగ్దానాలు చేసే నేత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక ప్రత్యేక పద్ధతిలో పరిణామం చెందుతుంటుంది. ఒక వ్యక్తి మేధస్సు దాన్ని మార్చలేదు. కాబట్టి అమెరికన్లకు ఉపాధిని కల్పిస్తామన్న ట్రంప్ వాగ్దానం శుష్క నినాదమే. అలా అని రాబోయే అధ్యక్షులు ఉద్యోగాలు కల్పిస్తాం అని వాగ్దానం చేయకుండా మానరు. అమెరికా అధ్యక్ష అభ్యర్థులు సాధారణంగా మూడు విషయాలు మాట్లాడుతుంటారు. వాషింగ్టన్ నగరాన్ని మార్చేయడం, అమెరికా ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం, అమెరికన్లకు ఉపాధిని కల్పించడం. మొదటిది ఎన్నటికీ జరిగేది కాదు. రెండు వందల ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన వాషింగ్టన్ ఒక గొప్ప రిపబ్లిక్కుకు రాజధాని. అది, ప్రపంచంలో మరే దేశానికీ లేనంతటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను, అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని నియంత్రించే నగరం. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని అదేమీ ఎదురు చూడటం లేదు. ఏదైనా పెను మార్పును తేవడం సాధ్యమే అయినా, అది దాన్ని మరింత అధ్వానంగా మార్చేదే కావచ్చు. ‘అమెరికా ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యాన్ని ఇవ్వడం’ అంటే ఇంతకు ముందటి అధ్యక్షులు అమెరికాను రెండవ, మూడవ స్థానంలో నిలిపారనే అర్థం వస్తుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. కాబట్టి అసలు ఆ నినాదమే అర్థరహిత మైనది. విదేశాంగ విధానమంటే నిజమైన అర్థం జాతీయ విధానమేనని రిచర్డ్ నిక్సన్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన హెన్రీ కిసింజర్ అన్నారు. అంటే, అమెరికా తమ జాతీయ ప్రయోజనాల కోసమే విదేశాల్లో యుద్ధాలు చేసిం దని అర్థం. అందువలన ఆ అర్థంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. మహా అయితే గెలవలేని యుద్ధాలు సాగిస్తున్న తమ సేనలను స్వదేశా నికి తిరిగి రప్పిస్తారు. కానీ ఆయన ఆ పని చేస్తున్న మొదటి అధ్యక్షులు కాలేరు. ఇక మూడవ వాగ్దానం చాలా ఆసక్తికరమైనది. ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే అమెరికా ఎన్నికలకు సంబంధించిన నిజమైన సమస్యలని అంటారు. బ్లూ కాలర్ ఉద్యోగాలు చేసే శ్వేత జాతీయులు ట్రంప్ ఓటు బ్యాంకు. బ్లూ కాలర్ ఉద్యోగులు అంటే వ్యవసాయేతరమైన శారీరక శ్రమ చేసే కార్మికులు. హెన్రీ ఫోర్డ్ తన కంపెనీలో విడి భాగాలను కార్లుగా అసెంబుల్ (కూర్పు) చేసే కార్మికులు సైతం కొనుక్కోగలిగిన చౌక కార్లను తయారుచేశాడు. తద్వారా ఆయన బ్లూ కాలర్ ఉద్యోగులను మధ్యతరగతిలో భాగంగా మారే క్రమాన్ని ప్రారంభించాడు. ముప్పయ్యేళ్ల క్రితం నేను విద్యార్థిగా జేన్స్విల్లేలో జాన్సన్ అనే ఆయన ఇంట్లో ఉండేవాడిని. ఆయన దశాబ్దాల తరబడి కార్ల అసెంబ్లీ కర్మాగారంలో కార్లకు చక్రాలను అమర్చే పని చేశారు. శ్రమ చేయడం ద్వారా సంపాదించిన డబ్బుతో ఆయన చక్కటి ఇల్లు కట్టుకున్నారు, పిల్లలకు మంచి చదువులు చెప్పిం చారు. 1919లో ప్రారంభమైన ఆ కర్మాగారంలో 5,000 మందికిపైగా ఉద్యోగులు ఉండేవారు. చైనా, దక్షిణ అమెరికాలలో శ్రమ చౌక, శ్రామిక వ్యయాలు తక్కువ. కాబట్టి ఆ కర్మాగారాన్ని 2009లో మూసేశారు. యాంత్రీకరణ, ఆటోమేషన్ల (స్వయంచాలక యాంత్రీకరణ) మూలంగా చైనా, దక్షిణ అమెరికా, భారత్లు కూడా నేడు అలాంటి ఉద్యోగాలను కోల్పోవడం మొదలైంది. తక్కువ ధరకు దొరికే శ్రమ స్థానంలో సైతం ప్రవేశపెట్టగలిగేటంత సమర్థవంతమైనవిగా యాంత్రీకరణ, ఆటోమేషన్లు మారుతున్నాయి. వస్తు తయారీ సంస్థలు తిరిగి అమెరికాకు వస్తున్నాయి. కానీ అది, శ్రమ అవసరం లేని వస్తు తయారీ. అమెరికాలో బ్లూకాలర్ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబాలు ఇంకా చాలా కాలంపాటే ఆ అధిక వేతనాల వల్ల మేలును పొందగలుగుతాయి. కొంత వరకు ఇది చైనాకు కూడా వర్తిస్తుంది. మన దేశంతో పోలిస్తే ఆ దేశ తలసరి ఆదాయం ఐదు రెట్లు ఎక్కువ. ఉద్యోగాలు లేకపోవడం, ప్రజాస్వామిక రాజకీ యాలు అనే సమస్య నిజంగా తలెత్తుతున్నది ఇక్కడ భారతదేశంలోనే. అది ఇప్పుడే, మన కళ్ల ముందే జరుగుతోంది. ఆటోమేషన్ కారణంగా ఇన్ఫోసిస్ 8 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందని కొద్ది రోజుల క్రితం తెలిసింది. ఈ సమాచారం కొంత అసాధారణమైనదే. రెండు దశాబ్దాలుగా మన సాఫ్ట్వేర్ కంపె నీలు ముమ్మరంగా ఉద్యోగులను పనిలోకి తీసుకుంటున్నాయి. ఆ ధోరణి ముగిసి పోయింది. ఇప్పుడు అవి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుని, చిన్న, మరింత నైపు ణ్యవంతమైన శ్రామిక శక్తిని సమకూర్చుకోవడం ప్రారంభించాయి. వారు ఇక ఎంత మాత్రమూ భారీ సంఖ్యలో నియామకాలు చేయరు. ఇది, మన నగరాల లోని వైట్ కాలర్ ఉద్యోగులు (ఆఫీసులో డెస్క్ లేదా కంప్యూటర్ వద్ద పనిచేసే వారు), విద్యావంతులు సైతం ఎదుర్కొంటున్న సమస్య. ఇక పట్టణాలు, గ్రామా లలో కోట్ల కొలదిగా ఉన్నవారి గతి ఏం కావాలి? వారు చిక్కుల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై సాగుతున్న ఆందోళనల స్వభావాన్ని మనం ఈ అశాంతిని ప్రతిపాదికగా చేసుకునే అర్థం చేసుకోవాల్సి ఉంది. గుజ రాత్లోని పాటిదార్లు, హరియాణాలోని జాట్లు, మహారాష్ట్రలోని మరాఠాలు చేస్తున్న ఆందోళనల ప్రధాన డిమాండు గౌరవప్రదమైన వేతనాన్ని అందించగల బ్లూ కాలర్ ఉద్యోగాలు కావాలనేదే. అది నేడు అసాధ్యం. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని మరే దేశంలోనైనా ఇకపై భారీ ఎత్తున అలాంటి ఉద్యోగాలు లభించవు. కార్మికుల సంఖ్య పెరగడం వల్ల లేదా సామర్థ్యం మెరుగుపడటం వల్ల ఉత్పత్తి పెరిగి, ఆర్థిక వృద్ధి పెంపొందుతుంది. మన దేశంలో నైపుణ్యంలేని, చదు వులేని, ఏదైనా వస్తువును ఉత్పత్తి చేయగల సామర్థ్యం లేని శ్రామికులు మరీ ఎక్కు వగా ఉన్నారు. శ్రమ వ్యయం తక్కువగా ఉండటమే లాభదాయకం కాదు. ఏ అద్భుత విధానము, నినాదము, లోగో దాన్ని మార్చలేవు. భారత్లోనైనా, అమెరికాలోనైనా జనాకర్షక వాగ్దానాలు చేసే నేత విష యంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచం సంక్లిష్టమైనది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక ప్రత్యేక పద్ధతిలో పరిణామం చెందుతుంటుంది. ఒక వ్యక్తి మేధస్సు దాన్ని మార్చ లేదు. కాబట్టి అమెరికన్లకు ఉపాధిని కల్పిస్తామన్న ట్రంప్ వాగ్దానం శుష్క నినాదం మాత్రమే. అలా అని తదుపరి రాబోయే అధ్యక్షులు కూడా వాషింగ్టన్ను మార్చేస్తాం, అమెరికా ప్రయోజనాలను ప్రథమ స్థానంలో ఉంచుతాం, అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం అని వాగ్దానం చేయకుండా మానరు. ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
ఈ ట్విట్టర్ ఫత్వాలు చట్టబద్ధమేనా?
అవలోకనం నియమ నిబంధనలతో మన జాతి పనిచేయదని, యథేచ్చగా నిర్ణయాలు తీసుకుం టుంటారనే అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. అమెజాన్ అధికారులు చట్ట బద్ధంగా వీసాలను పొంది ఉంటే, వాటిని రద్దుచేస్తానని సుష్మ ఎలా అనగలరు? ప్రపంచంలో అతి పెద్ద ఆన్లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ను లొంగ దీసిన తర్వాత భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మన జాతీయ గౌరవాన్ని స్పష్టంగానే పునఃస్థాపించినట్లుంది. భారత జాతీయ పతాక రంగులను పోలి ఉన్న కాళ్లు తుడుచుకునే డోర్మ్యాట్లను అమ్ముతున్న అమెజాన్ కెనడా ఆన్లైన్ స్టోర్ స్క్రీన్ షాట్ను జనవరి 11న ఒక భారతీయుడు సుష్మకు పంపుతూ ట్వీట్ చేశారు. ‘మేడమ్, అమెజాన్కు చీవాట్లు పెట్టండి. భారత జాతీయ పతాకతో కూడిన డోర్ మ్యాట్లను అమ్మవద్దని హెచ్చరించండి. దయచేసి చర్య తీసుకోండి’ అని ఆ వ్యక్తి సుష్మకు సూచించారు. ఆ ప్రకారమే సుష్మ మూడు ట్వీట్లను సంధించారు. జనవరి 11 ఉదయం 5.43 గంటలకు తొలి ట్వీట్ను పంపారు. ‘కెనడాలోని ఇండియన్ హైకమిషన్ : ఇది ఏమాత్రం ఆమోదనీయం కాదు. అత్యున్నత స్థాయిలో అమెజాన్ దృష్టికి దీన్ని తీసుకెళ్లండి’. ఈ ఘటన తదుపరి పరిణామాల తీవ్రత నేపథ్యంలో సుష్మ ఆరోజు ఉదయం 6.41 గంటలకు రెండో ట్వీట్ చేశారు. ‘అమెజాన్ బేష రతుగా క్షమాపణ చెప్పాలి. మన జాతీయ పతాకను అవ మానిస్తున్న అన్ని ఉత్పత్తులను వెంటనే ఉపసంహరిం చుకోవాలి’. రెండు నిమిషాల తర్వాత మంత్రి మరో ట్వీట్ ద్వారా అమెజాన్కు హెచ్చరిక పంపారు. ‘తక్షణమే అలా చేయనట్లయితే, ఏ అమెజాన్ అధికారికీ మేము భారతీయ వీసాను మంజూరు చేయబోము. ఇంతకుముందే జారీ చేసిన వీసాలను కూడా రద్దు చేస్తాము’. ఆ డోర్ మ్యాట్ల తయారీదారుకు భారతీయ సంస్కృ తితో పెద్దగా పరిచయం లేదు. పాశ్చాత్య డోర్మ్యాట్లపై సుస్వాగతం వంటి అక్షరాలను ముద్రిస్తుంటారు. ఇలాంటి వాటిపై ఎలాంటి సాంస్కృతిక పరమైన దూషణలూ ఉండవు కనుక వాటిపై అడుగుపెట్టడం చక్కగా ఉంటుంది. అయితే ఈ డోర్మ్యాట్లపై ఏదో ఒక జాతీయ పతాక రంగులను ముద్రిస్తుంటారు. చాలామంది ప్రజలు తమ జాతీయ జెండా రంగులను ముద్రించిన డోర్ మ్యాట్లను కొనుగోలు చేస్తూ తమ అభిమానాన్ని చూపి స్తుంటారు. కానీ భారత్లో లేక దక్షిణాసియాలో పాదా లను మురికితో కూడినవిగా భావిస్తుంటారు కాబట్టి డోర్ మ్యాట్లను ఇక్కడ మరొక దృష్టితో చూస్తుంటారు. అమెజాన్ కెనడా విభాగం వెంటనే చర్యతీసుకుని ఆ డోర్ మ్యాట్లను అమ్ముతున్న విక్రేతకు చెందిన లింకును వెబ్సైట్ నుంచి వెనక్కు తీసుకుంది. సుష్మ తీసుకున్న చర్యలను ట్వీటర్ వ్యాఖ్యల్లో మెజారిటీ బలపర్చాయి. ఎందుకంటే జాతీయ గౌరవం భారత్లో బలంగా పని చేస్తుంటుంది. అయితే కొంతమంది మాత్రం సుష్మ మరీ అతిగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. వీరి ఉద్దే శ్యంలో భారతీయ ఆత్మగౌరవం, జాతీయ గౌరవం అనేవి డోర్మ్యాట్ల అమ్మకాలతోనే దెబ్బ తినేంత బలహీనంగా ఉండవు. రెండోది. అమెజాన్ సంస్థ భారత్లో బిలియన్ల కొద్దీ డాలర్లను మదుపు చేసింది కాబట్టి దానిపట్ల మరింత గౌరవంతో వ్యవహరించాల్సి ఉంది. అయితే నావరకూ వ్యక్తి అయినా, సంస్థ అయినా పెద్ద తేడా ఉండదు. భారత ప్రభుత్వం అన్నిటినీ సమాన దృష్టితోటే చూడాలి. భారత్లో నియమ నిబంధనలను బట్టి కాకుండా యథేచ్చగా నిర్ణయాలు తీసుకుంటుంటా రనే అనుమానాలున్నాయి. అమెజాన్ అధికారులు సరైన దరఖాస్తుఫారంతో తమ వీసాలను పొంది ఉంటే, వాటిని రద్దుచేస్తానని సుష్మ ఏ చట్టం కింద హెచ్చరిస్తారు? నేరం జరిగిందని భావిస్తున్నట్లయితే, చట్టానికి విధేయురాలైన వ్యక్తిగా ఆమె మొదట ఎఫ్ఐఆర్ లేదా ఫిర్యాదును నమోదు చేయాలి. దానికి బదులుగా ఆమె ఒక నియం తలా ట్వీటర్ ఫత్వాను జారీ చేసేశారు. అమెజాన్ ఒక గ్లోబల్ మార్కెట్ స్థలం లాంటిది. ఒకవేళ ఎవరో ఒకరి దేవుడిని, గురువును, ప్రవక్తను అవమానించిన ఘటనే జరిగి ఉందనుకోండి. డోర్ మ్యాట్ ఉత్పత్తిని తొలగించడం ద్వారా అది మార్పు చెందుతుం దని నేనయితే హామీ ఇవ్వలేను. నిజానికి, భారతీయ పతాకను కలిగిన షూలను కూడా అమ్ముతున్నారని మరు సటి దినం వార్తలు వచ్చాయి. మూక జాతీయ వాదం నుంచి పుట్టుకొచ్చే ఈరక మైన ఆగ్రహం మన నాయకులకు సహజ లక్షణం. గత సంవత్సరం కూడా ఇదే సమయంలో మనం జాతీయ వాదం గురించి చర్చించుకున్నాం. 2016 ఫిబ్రవరిలో ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన నినాదాలతో సమస్య తలెత్తింది. లోక్సభలో దీనిపై మూడు రోజులపాటు చర్చ జరిగింది. కేంద్ర విద్యా మంత్రి భావోద్వేగంతో తన తలను తానే కోసుకుంటానని బెదిరించే స్థాయికి వెళ్లిపోయారు. ఆ నినాదాల ఘటన వెనుక లష్కరే తోయిబా ఉన్నట్లు హోంమంత్రి పేర్కొ న్నారు. ప్రధాని స్వయంగా ఈ చర్చలో పాల్గొని సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. సత్యమే జయిస్తుంది అని దానర్థం. నేరారోపణకు గురైన యువకులు అరెస్టయ్యారు. వీరిలో ఒకరిని కస్టడీలో ఉండగానే చితకబాదారు. ఈ మొత్తం డ్రామా పూర్తయ్యాక, అంతిమ ఫలితం ఏమిటి? బీజేపీ ప్రభుత్వం ఈ ఘటనపై చార్జిషీట్ కూడా సమర్పించలేకపోయింది. వంచనాత్మకమైన జాతీయ వాదం, భావోద్వేగంతో ఉన్నప్పటికీ ఈ అసంబద్దమైన, అవాస్తవమైన జాతీయవాద చ్ఛాయలను సుష్మాస్వరాజ్ మళ్లీ ఇప్పుడు ప్రదర్శించారు. నిజంగానే ఇది జాతి సమ యాన్ని, శక్తిని వృథా పర్చే విషయం. మంత్రులు ప్రత్యే కించి అతి పెద్ద బాధ్యతలను మోస్తున్నవారు ఇలాంటి సర్కస్లో పాలు పంచుకోకుంటేనే బాగుంటుంది. ఆకార్ పటేల్ ఈమెయిల్: aakar.patel@icloud.com -
ప్రజారోగ్యానికి పట్టం కడుతున్న బ్రిటన్
అవలోకనం బ్రిటన్ ప్రజారోగ్యం కోసం ఏడాదికి రూ. 9.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే ఒక్కొక్క పౌరునికి రూ. 1.5 లక్షలు. మన కేంద్ర వార్షిక ఆరోగ్య బడ్జెట్ రూ. 33,000 కోట్లు... ఒక్కొక్కరికి రూ. 260. మనది పేద దేశం నిజమే. కానీ ఈ ఏడాది బుల్లెట్ ట్రైన్ కోసం రూ. 99,000 కోట్లు వెచ్చిస్తున్నాం. అగ్రరాజ్యం కావడం అంటే యుద్ధ విమానాలు, జపాన్ సాంకేతికత ప్రదర్శన అని మనం భావిస్తాం. అదే బ్రిటన్లో అయితే నాగరిక దేశం అంటే ప్రతి మనిషికి స్వస్థతను చేకూర్చి, పోషించగలిగిన సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని రూపొందించుకోవడం. నేనీ వ్యాసాన్ని విరిగిన కాలుతో ఇంగ్లండ్లోని హెర్ట్ఫోర్డ్షైర్ నుంచి రాస్తున్నా. బౌలింగ్ చేస్తుండగా నా ఎడమ కాలి పాదం లోపలికి మెలిదిరిగి పడ్డంతో నా చీలమండ పగిలింది. ఏదో తీవ్రమైన హానే జరిగిందని పడ్డప్పుడే అనుకున్నా. అయినా అదేదో బెణుకేనని, దానికదే నయమైపోతుందని పట్టించుకోలేదు. రెండు రోజులు గడిచేసరికి నా పాదం బెలూన్లాగా ఉబ్బిపోయింది. ఏం జరి గిందో తెలుసుకోడానికి డాక్టర్ను సంప్రదించాలనుకున్నా. లండన్ హార్లీ స్ట్రీట్లో ఉన్న డాక్టర్కు ఫోన్ చేశా. ఆ రోజు మధ్యాహ్నమే ఆయన నన్ను చూస్తానన్నాడు గానీ, ఎక్స్–రే రిపోర్టు మరుసటి రోజుకుగానీ రాదని చెప్పాడు. అంతసేపు ఆగలేక దగ్గర్లో ఉన్న ప్రజాసుపత్రి యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ వార్డ్కు వెళ్లాను. నేను బెంగళూరు నుంచి వచ్చానని, కొద్ది రోజుల్లో తిరుగు ప్రయాణం చేయాల్సి ఉందని అక్కడి వారికి చెప్పాను. అక్కడి సహాయకుడు నా కేసును రిజిస్టర్ చేసుకుని మరో డజను మందితో పాటూ నన్ను కూడా వేచి ఉండమని చెప్పాడు. వారిలో కొందరి పరిస్థితి నాకంటే అధ్వానంగా ఉంది. దాదాపు ఓ అరగంట తర్వాత నన్ను ఒక నర్సును కలవమని పంపారు. ఆమె నన్ను చూసి ఎక్స్–రే తీయించడానికి పంపింది. అక్కడి రేడియాలజిస్టు రెండు ఎక్స్–రే ఫొటోలు తీసి ఎముక విరిగిందని చెప్పింది. మీరిలాగే నడుస్తున్నారా? అని అడిగితే, అవునన్నాను. వెంటనే ఓ వీల్ చైర్ తెప్పించి, డాక్టర్కు చూపించ డానికి నన్ను మరో భవనంలోకి తీసుకుపోయింది. మరో అరగంట వేచి చూశాక ఆ డాక్టర్ (అక్కడి డాక్టర్లలో చాలా మంది లేదా అత్యధికులు భారతీయులే) ఎక్స్–రే స్కాన్ చేసిన చిత్రాన్ని నాకు చూపాడు. చీలమండ ఎముక చుట్టూతా శంఖాకృతిలో పగిలి ఉంది. పాదానికి తొడుక్కునే ఓ మూసను ఇస్తామని డాక్టర్ చెప్పాడు. దాని కోసం మరో అరగంట వేచి ఉండాల్సి వచ్చింది. కొన్ని నిముషాలకు ఓ మహిళ గట్టిగా నా పేరు పిలిచి, నా బూటు సైజు ఎంతో అడిగింది. నేను పదకొండు అని చెప్పా. ఆమె పాదం మూసను తేవడానికి వెళ్లింది. తీరా చూస్తే అదో పెద్ద ప్లాస్టిక్ బూటు. బయటి కవచం గట్టిగా ఉండి, పాదానికి హాయిగా అమరేలా ఉబ్బేట్టు గాలిని నింపగలిగిన లోపలి భాగం ఉంది. ఆ సాధనంతో పాటూ రెండు పొడవాటి మేజోళ్లు కూడా ఉన్నాయి. సహా యకురాలు లేదా నర్సు ఓపికగా, పట్టింపుతో ఎలా దాన్ని వేసుకోవాలో తొడిగించి చూపింది. ఆ తర్వాత ఆమె మీకు ఏదైనా సీడీ ఇచ్చారా? అని అడిగింది. ఇవ్వ లేదనేసరికి, నాతో పాటూ మొదటి భవనానికి వచ్చి ఓ సీడీని బర్న్ చేసి ఇచ్చింది. వనం నుంచి బయటకు ఎలా వెళ్లాలో కూడా చెప్పింది. బయటకు వెళ్లడానికి మరో ఐదు నిముషాలు పట్టింది. ఈ మొత్తం వ్యవహారమంతటికీ నేను ఏమీ చెల్లించాల్సి రాలేదు. రిజిస్ట్రేషన్, కన్సల్టెన్సీ, ఎక్స్–రే, పోతపోసిన పాదం తొడుగు అన్నీ ఉచితమే. కుంటుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లాక, తిరిగి బయటకు రావడానికి రెండు గంటలు పట్టింది. బ్రిటిష్ పత్రికలు ఎప్పుడూ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) లేదా జాతీయ ఆరోగ్య సేవ ఎంత ఘోరంగా ఉందో వివరిస్తూ కథనాలను వెలు వరిస్తుంటాయి. అందుకే ఇదంతా రాయాల్సి వచ్చింది. శస్త్ర చికిత్సలాంటి వాటికి అపాయింట్మెంట్లు కావాలంటే రోజుల తరబడి ఎలా వేచి చూడాల్సివస్తుందో ఆ కథనాలు వివరిస్తుంటాయి. ఎన్హెచ్ఎస్ అందించే వైద్య సేవలు పౌరులందరికీ ఉచితమే. ఎమర్జెన్సీ, యాక్సిడెంట్ వైద్య సేవలు సైతం పర్యాటకులతో సహా అందరికీ ఉచితమేననేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నా దృష్టిలో ఇది ఎంతో నాగ రికమైన ప్రవర్తన. బ్రిటిష్ పౌరుల అనుభవమూ, నాకు కలిగిన అనుభవమూ ఒకే విధమైనవి కాకపోవచ్చు. పైగా ప్రభుత్వ వైద్య సేవలపై తీర్పు చెప్పడానికి ఎమర్జెన్సీ విభాగం బహుశా ఉత్తమమైనది కాకపోవచ్చు. అయితే నా పట్ల చూపిన ఆ శ్రద్ధ, సమ ర్థతలు మాత్రం సక్రమంగా పనిచేసే వ్యవస్థ నుంచి ఉత్పన్నమైనవి కాకుండా ఉండటానికి వీల్లేదు. నా చికిత్సకు ఏమీ చెల్లించాల్సి రాకపోవడం వల్ల నాలో అపరాధ భావన కలిగింది. కానీ నేను మన దేశంలో కట్టిన పన్నులు బ్రిటన్కు వలస పోయిన వేలాది మంది భారత డాక్టర్లకు సబ్సిడీకి విద్యను అందించాయి. బ్రిటన్ ఎన్హెచ్ఎస్ కోసం ఏడాదికి రూ. 9.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే పౌరులు ఒక్కొక్కరికి దాదాపు రూ. 1.5 లక్షలు. భారత కేంద్ర ప్రభుత్వపు వార్షిక ఆరోగ్య బడ్జెట్ రూ. 33,000 కోట్లు. అంటే సగటున ఒక్కొక్కరికి రూ. 260. మనది పేద దేశం నిజమే. కానీ మనం గత ఏడాది 36 యుద్ధ విమానాలను కొనడానికి రూ. 59,000 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఏడాది బుల్లెట్ ట్రైన్ కోసం రూ. 99,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రజారోగ్య సేవలకు బదులుగా ఇలాంటి ఆట వస్తువుల కోసం ప్రభుత్వాలు మూర్ఖంగా ఖర్చు చేయడాన్ని బ్రిటన్ పౌరులు అనుమతిస్తారని అనుకోను. మన మీడియాలోనూ, దాని చర్చలలోనూ పెత్తనం చలాయించేది మధ్య తరగతే. అదే ఇలాంటి వాటిని ఎంపిక చేసి కోట్లాదిమంది పేదలపై వాటిని రుద్దుతుంది. అగ్ర రాజ్యం కావడం అంటే యుద్ధాలు చేయగలగడం, జపాన్వారి సాంకేతిక పరి జ్ఞానాన్ని ప్రదర్శించి చూపడం, భారీ విగ్రహాలను నిర్మించడమేనని మనం భావి స్తాం. అదే బ్రిటన్లో అయితే నాగరిక దేశం అంటే తమ పౌరుడు అయినా కాకున్నా మనిషన్న ప్రతివాడికి స్వస్థతను చేకూర్చగలిగిన, పోషించగలిగిన సమ ర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని రూపొందించుకోగలగడం అని అర్థం. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్: aakar.patel@icloud.com -
‘రద్దు’ కాదు మోదీ విజయ పరంపరకు అడ్డుకట్ట
అవలోకనం ఆర్థికరంగంలో నిజంగా ఎలాంటి మెరుగైన పనితీరును ప్రదర్శించకుండానే భారత్లో నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర , పాకిస్తాన్లో జుల్ఫికర్ ఆలీ భుట్టో, ఆయన కుమార్తె బెనజీర్ భుట్టో తమ ఓటర్లకు తాము అంటిపెట్టుకుని ఉండగలిగారు. సరిగ్గా అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటర్లపై తన పట్టును నిలుపుకోగలరని అనుకోవచ్చు. అందువలన బీజేపీ తన విజయ పరంపరను 2017లో కూడా కొనసాగిస్తే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఒక నాయకుని జనాదరణను అంచనా వేసేటప్పుడు ఆ నేత పనితీరుకు ఉండే ప్రాముఖ్యత ఏమిటి? తార్కికంగా చూస్తే ప్రజలకు సుఖసంపదలను కలుగ చేయగలిగిన నేతకు ప్రజాదరణ లభిస్తుందని భావించాలి. ప్రజాస్వామ్య విధా నాలలోకెల్లా అత్యంత ముఖ్యమైన, విలువైన అంశం అదే అనిపిస్తుంది. కాబట్టి దేశం లేదా రాష్ట్రం అధిక ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తున్న కాలంలో అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి అధికారంలోకి రాగలుగుతాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చాలా మంది భారత నేతలు ప్రభుత్వ వ్యతిరేకతను తలకిందులు చేసి అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్, బిహార్లో నితీష్ కుమార్, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వంటి ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా మనకు గుర్తుకు వస్తారు. తమ రాష్ట్రాలు సాపేక్షికంగా త్వరితగతిన వృద్ధి చెందుతున్న కాలంలో వారు నాయ కులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఒక శక్తివంతమైన రాజకీయ అంశంగా భావిస్తారు. ఆ గుదిబండను తలకిందులు చేయడానికి ఆర్థిక వృద్ధి వారికి తోడ్పడింది. దీనికి విరుద్ధ తర్కాన్ని బట్టి చూస్తే... మంచి పనితీరును, ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థ విషయంలో మంచి పనితీరును ప్రదర్శించలేని నాయకులను ఓటర్లు శిక్షిస్తారు. తమకు నాయకులుగా ఉన్నవారు ఆర్థిక సంపద రీత్యా తమ జీవితాల్లో పరి వర్తనను తేవాలని ఓటర్లు ఆశిస్తారు. దీనికి మద్దతుగా నిలిచే గణాంక సమాచారమేమీ లేకపోవడమే ఈ సిద్ధాంతంతో ఉన్న సమస్య. చారిత్రకంగా మన దేశం అత్యున్నత ఆర్థిక వృద్ధిని సాధిస్తుండిన 2004–2014 దశాబ్దిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా అది 2014 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది, లోక్సభలో ఎన్నడూ ఎరుగనంతటి అతి తక్కువ స్థానాలకు దిగజారిపోయింది. ఆ ఎన్నికలను ఇతర అంశాలు ప్రభావితం చేశాయని ఎవరైనా అనొచ్చు. మన్మోహన్ ప్రభుత్వంపై పడ్డ అవినీతి ముద్ర, మోదీ రంగంపైకి రావడం, దూకుడుగా ప్రచారం సాగించడం అనేవి సుస్పష్టంగా కనిపించే ఇతర అంశాలు. కాబట్టి 2014 సార్వత్రిక ఎన్నికలను మనం ఒక మినహాయింపుగా లేదా ఈ సిద్ధాంతం పరిధిలోకి రానిదిగా చూడవచ్చు. దురదృష్టవశాత్తూ అంతకు ముందటి గణాంక సమాచారం మరింత అర కొరగా ఉంది. 2004 వరకు సాగిన ఐదేళ్ల అటల్ బిహారీ వాజ్పేయి పాలన ఇటీవలి కాలంలో అత్యధిక వృద్ధిని సాధించిన కాలంగా రెండవ స్థానంలో నిలుస్తుంది. ఆ ఎన్నికలలో విజయం పట్ల ఆయన ఎంతో ధీమా చూపారు. ‘భారత్ వెలిగిపోతోంది’ అనే ప్రకటనల యుద్ధంతో ఆయన తమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన ఓట మికి కారణాలు సైతం నిజంగా ఎవరికీ అర్థంకానివే. దేశాన్ని తాము సౌభాగ్య వంతం చేశామనే భారతీయ జనతా పార్టీ విశ్వాసం వాస్తవ దూరమైననది, నిరాధారమైనది ఆనే ఊహాగానం ప్రచారంలోకి వచ్చింది. అంటే పనితీరు బాగుండి ఉంటే ఆయన ఆ ఎన్నికల్లో గెలిచి ఉండేవారే కదా? నేనైతే కాదు అంటాను. ఉపఖండంలో జరిగే ఎన్నికలలో విజయాన్ని సాధించడానికి ఆర్థికరంగంలోని పనితీరు బాగుండటం ఆవశ్యకమైన çపరిస్థితేమీ కాదు. అందుకు అంతకు ముందటి దశాబ్దాలలోని ఆర్థిక రంగం పని తీరే రుజువు. స్థూల జాతీయోత్పత్తి రీత్యా 1950లు,1960లలో ఆర్థిక రంగంలో కాంగ్రెస్ పని తీరు మరీ నాసిరకమైనది. ‘హిందూ వృద్ధి రేటు’ అంటే ఆ కాలం నాటి 3 శాతం లేదా అంతకంటే తక్కువ వృద్ధి రేటు అని అర్థం. అయినా కాంగ్రెస్ ఆ కాలంలో గొప్ప ఎన్నికల విజయాలను సాధించింది. నేడు సుపరిపాలనగా మనం పిలిచేది ఏదీ ఆ కాలంలో కనబడలేదు లేదా చర్చకు రాలేదు. 1960ల నాటికంటే నేడు మనం పూర్తిగా భిన్నమైన ప్రజలమా? కాదంటాను నేను. దేశాలు, ప్రత్యేకించి భారత్ వంటి ప్రాచీన దేశాలు అంత నాటకీయంగా మారిపోజాలవు. కాబట్టి అన్నిటికంటే మిన్నగా ఆర్థిక రంగంలోని పనితీరే ఎన్నికలలో లబ్ధిని చేకూర్చే అంశం అనడానికి ఎలాంటి ఆధారం లేదనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా నేడు నెలకొన్న సంక్షోభం 2017 ఎన్నికలలో మోదీ పార్టీ విజయావకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది? దానిని పరిశీలిం చడం కోసమే మనం ఈ అంశాన్ని చర్చిస్తున్నాం.పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, గోవా వంటి చిన్న రాష్ట్రాలలోనూ, ఆ తదుపరి గుజరాత్లోనూ బీజేపీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. మోదీ హయాంలో ఆర్థిక రంగం పని తీరు నిరుత్సాహకరంగా ఉండటం, ఉపద్రవంగా మారిన పెద్ద నోట్ల రద్దు వ్యవ హారం మోదీని పరాజితుడ్ని చేసే అవకాశం ఎక్కువగా ఉన్నదని ఆ పార్టీ వ్యతి రేకులు భావించవచ్చు. అది మరీ అంత సామాన్యమైన విషయమేమీ కాదనుకుంటాను. ప్రజలను సమ్మోహితులను చేసే శక్తి, విశ్వసనీయత, కథనాత్మకత ఇంకా మోదీ పక్షానే ఉన్నాయి. కొందరు ఓటర్లలో ఉన్న అసంతృప్తిని ఆగ్రహంగా పరివర్తన చెందించ డానికి ప్రతిపక్షం చాలా కృషి చేయాల్సి ఉంటుంది. నోట్ల రద్దు దుష్ప్రభావం ఫిబ్రవరిలో కూడా కొనసాగినంత మాత్రాన, అది విజయాన్ని వారి ఒడిలోకి వచ్చి వాలేలా చేస్తుందని ఆశించడానికి వీల్లేదు. నిర్లక్ష్యపూరితంగా జరిపిన నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, కొన్ని త్రైమాసికల పాటు జీడీపీ వృద్ధి కొన్ని పాయింట్లు తగ్గినా... వాటికవే మోదీ జనాదరణను మటుమాయం చేయలేవు. ఆర్థికరంగంలో నిజంగా ఎలాంటి మెరుగైన పనితీరును ప్రదర్శించకుండానే భారత్లో నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర , పాకిస్తాన్లో జుల్ఫికర్ ఆలీ భుట్టో, ఆయన కుమార్తె తమ ఓటర్లకు తాము అంటిపెట్టుకుని ఉండగలిగారు. సరిగ్గా అలాగే మోదీ కూడా ఓటర్లపై తన పట్టును నిలుపుకోగలరని అనుకోవచ్చు. అందు వలన బీజేపీ తన విజయ పరంపరను 2017లో కూడా కొనసాగిస్తే ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు. (వ్యాసకర్త ఆకార్ పటేల్, కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ) -
నోట్ల రద్దు తుపానును తట్టుకున్న ప్రతిభా పాటవం!
అవలోకనం జనాభాలోని అతి పెద్ద విభాగాలను మోదీ తన పక్షానికి తిప్పుకోగలిగారు. బహుశా ఆయనకు ఓటేయని లక్షలాది ప్రజలు కూడా ఒక కీలకమైన మార్పులో తాము పాల్గొంటున్నామన్న ఉద్దేశంతో పెద్ద నోట్ల రద్దుతో తమకు కలుగుతున్న అసౌకర్యాన్ని పెద్దగా లెక్కించలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ చర్యకు సిద్ధపడి ఉంటే మీడియా కానీ, మధ్యతరగతి పట్టణ జనాభా కానీ ఇలాంటి ఉల్లాస స్థితిని పొంది ఉండేదని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే జనావళి ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండేది. భారతదేశంలో ఏ నాయకుడు కానీ, ఆధునిక ప్రజాస్వామ్యంలో ఏ ఇతర రాజ కీయ నేత కానీ.. గత ఏడు వారాలుగా కొనసాగుతున్న పెద్దనోట్ల రద్దు అనంతర సంక్షోభంలో నరేంద్రమోదీలాగా బతికిబట్టకట్టి ఉండేవారు కాదు. జనరంజక నేతగా మోదీ ప్రతిభాపాటవాలకు ఎవరైనా రుజువుకోసం చూస్తున్నట్లయితే, ఈ ఏడువారాల కాలంలోనే అది ప్రదర్శితం కావడాన్ని చూడవచ్చు. ఆ మహాద్భుత ప్రదర్శనను చూసి అభినందిద్దాం. ఎందుకంటే మనం ఒక నిజమైన పరిపూర్ణ నాయకుడి సమక్షంలో ఉన్నాం. పెద్ద నోట్ల రద్దు సంక్షోభం గురించి కేంద్ర ప్రభుత్వం ముందుగా గ్రహించలేదనడానికి మనకు ప్రస్తుతం కొన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది ఏదంటే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని మోదీ ప్రారంభ ప్రకటనలో కొన్ని అంచనాలు వెల్లడించారు కానీ అది తప్పని తేలిపోయింది. రెండోది. ఆర్థిక వ్యవస్థపై నోట్ల కొరత ప్రభావం అర్థమవుతున్న తరుణంలో మోదీ ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం జపాన్ సందర్శనను కొనసాగించారు. జపాన్ నుంచి ఆయన స్వదేశానికి తిరిగివచ్చే సమయానికి జనం క్యూలు అంత త్వరగా అదృశ్యం కావన్న విషయం స్పష్టమైంది. పెద్ద నోట్ల రద్దుపై మోదీ ప్రారంభ ప్రకటన ఎంత శక్తివంతంగానూ, సమర్థవంతంగానూ ఉండిందంటే అది వెంటనే ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా మలి చింది. మీడియా మొత్తంగా మోదీ పక్షాన నిలిచింది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ సైతం మోదీ చర్యకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. క్షేత్రస్థాయి నుంచి ఎదిగివచ్చిన నేతలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇరువురూ మోదీ చర్యలోని ప్రమాదాన్ని పసిగట్టి వ్యతిరేకత ప్రకటించారు. వాస్తవానికి జనాభాలోని అతి పెద్ద విభాగాలను మోదీ తన పక్షానికి తిప్పుకోగలిగారు. బహుశా ఆయనకు ఓటేయని లక్షలాది ప్రజలు కూడా ఒక కీలకమైన మార్పులో తాము పాల్గొంటున్నామన్న ఉద్దేశంతో తమకు కలుగనున్న అసౌకర్యాన్ని పెద్దగా లెక్కించలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇలాంటి పెద్ద నోట్ల రద్దు చర్యకు సిద్ధపడి ఉంటే మీడియా కానీ, మధ్యతరగతి పట్టణ జనాభా కానీ ఇలాంటి ఉల్లాస స్థితిని పొంది ఉండేదని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అలా చేసి ఉంటే జనం ప్రతిస్పందన పూర్తి భిన్నంగా ఉండేది. పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే జనం ఆగ్రహించేది. ఏడువారాలు కొనసాగివుంటే అది తీవ్రక్రోధంగా పరిణమించేది. నోట్ల రద్దు ద్వారా కలుగుతున్న ఇబ్బంది మరికొన్ని నెలలు కొనసాగనుందని స్పష్టమవుతుండటంతో ఇప్పుడు జనంలో ఆగ్రహం పొడ సూపుతోంది. అయితే ఇన్ని వారాలపాటు సంక్షోభం కొనసాగడం గణనీయమైనదే అయినప్పటికీ మోదీ దాన్ని ఇంకా కొనసాగించనున్నారు. మోదీ ప్రతిభాపాటవాలకు సంబంధించిన రెండో ఉదాహరణ ఏదంటే తన చర్యపై ప్రతికూల ఫలితం ఊహించిన దానికంటే పెద్దదిగానే ఉందని ఆయన చాలా త్వరగా గ్రహించడమే. జపాన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే మోదీ వరుస ప్రసంగాలు చేశారు. వాటిలో రెండు విషయాలను పేర్కొన్నారు. తన జీవన కర్తవ్యం కోసం తన కుటుంబ జీవితాన్నే త్యాగం చేశానని దేశప్రజలకు స్పష్టం చేశారు. ఈ సమస్య చేతులు దాటిపోయిందని గ్రహించారు కనుకే ప్రసంగిస్తూ మధ్యలోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రెండోది. నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లోపు సాధారణ స్థితి నెలకొనదని మోదీ చెప్పారు. ఈ రెండో చర్య ద్వారా, తన వ్యూహాన్ని మళ్లీ అంచనా వేసుకోవడానికి తగినంత సమయాన్ని మోదీ సాధించుకున్నారు. ఆవిధంగా మీడియాను మళ్లీ తన పక్షానికి తిప్పుకున్నారు. ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలనుంచి మీడియా దృష్టిని మళ్లించగలిగారు. మోదీ 50 రోజుల అసౌకర్యంపై చేసిన ఈ వ్యాఖ్య నోట్ల రద్దుతో ఎలా వ్యవహరించాలో ఆలోచించే స్వేచ్ఛను ఆయనకు అందించింది. కొన్ని మీడియా ప్రచురణలు సూచించినట్లుగా మోదీ ప్రారంభ ప్రసంగంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గురించిన ప్రస్తావన లేదు. నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదానికి మాత్రమే మోదీ తొలి ప్రసంగం పరిమితమైంది. అయితే జపాన్ నుంచి తిరిగొచ్చాక చేసిన ప్రసంగాలు నోట్ల రద్దు ప్రక్రియలో ఉన్నట్లుండి మార్పులను తీసుకొచ్చాయి. ఈ ఆకస్మిక మార్పులకు కూడా మోదీ ప్రతిభ, విశ్వసనీయతే కారణం. ఈ మార్పు గోల్ పోస్టును మార్చడమేనని ప్రతిపక్షం అనొచ్చు కానీ, నోట్ల రద్దు విధానం మంచి దని, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యం అంతిమంగా లబ్ధి కలిగిస్తుందని విస్తృత ప్రజానీకానికి నచ్చచెప్పినంతవరకు మోదీ తాననుకున్న ప్రకారమే వెళతారు. ఈ విధానంలోని నిర్దిష్ట ప్రయోజనాలు రాజకీయాలకు అనవసరం. పెద్ద నోట్ల రద్దు జరిగిన 40 రోజుల తర్వాత కూడా దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తుండటమే దీనికి ఉదాహరణ. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పంజాబ్లో కూడా బీజేపీ విజయం సాధించడం గమనార్హం. వాస్తవానికి ఈ క్షణంలో మాత్రం మోదీకి ఎదురుగా ప్రతిపక్షం లేదనే చెప్పాలి. ప్రతి భారతీయుడినీ నోట్ల రద్దు చర్య ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నప్పటికీ మోదీ ఇప్పటికీ పరిస్థితులను పూర్తిగా తన అదుపులోనే పెట్టుకుంటున్నారు. జనంలో అసౌకర్యాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందే అవకాశం కాంగ్రెస్కు వచ్చినప్పటికీ దాన్ని ఆ పార్టీ ఇంతవరకు వినియోగించుకోలేదు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ బహిరంగంగా ప్రకటించడానికి చాలా మంది ఊగిసలాడుతున్నారు. అలా చేస్తే తమను ఎక్కడ నిందిస్తారో అనే భయం వారిది. నవంబర్ 8 నాటి నుంచి మోదీ సాధించిన దాన్ని భారత్లో ఏ నాయకుడూ సాధించి ఉండేవారు కాదు. ప్రజాస్వామిక రాజకీయాల్లో అతికొద్ది మందినేతలకు మాత్రమే ఇది సాధ్యమయింది. నవంబర్ 8 తర్వాత రెండో నెల వేతనాలకు జనం వెంపర్లాడే సమయానికి అంటే 2017 ప్రారంభంలో ఈ పరిస్థితిలో మార్పు కలుగవచ్చు. అంతవరకు ప్రధాని మోదీ అనుభవిస్తున్న వైభవం కేవలం అదృష్టం కాదని, ప్రజాభిప్రాయాన్ని తనవైపునకు తిప్పుకోవడమే కాకుండా దాన్ని కొనసాగించడమే అసలు కారణం అని తప్పక గ్రహించాల్సి ఉంటుంది. (వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ) -
అసమర్థ ప్రభుత్వం, అధ్వానపు ప్రతిపక్షం..!
అవలోకనం ప్రస్తుతం మనం దేశంలో ఒక విచిత్రమైన రాజకీయ దశగుండా వెళుతున్నాం. ఒకవైపేమో, గత రెండున్నరేళ్ల పాలనలో మొదటిసారిగా ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. మరోవైపేమో, ప్రజల మనోభావాలను వ్యక్తపర్చగలిగే సామర్థ్యంగానీ లేదా పరిస్థితిని తనకు అనుకూలంగా మల్చుకునే నైపుణ్యం గానీ ప్రతిపక్షానికి వాస్తవంగానే లోపించినట్లు కూడా కనిపిస్తోంది. కేంద్రప్రభుత్వం తలపెట్టిన పెద్ద నోట్ల రద్దు ప్రయోగం ప్రారంభమై నలభై రోజులు కావస్తోంది. కానీ బ్యాంకుల నుంచి ద్రవ్య సరఫరా నేటికీ సాపేక్షంగా తక్కువగానే ఉంటోంది. ఏటీఎంలలో ఇప్పటికీ తగినంత నగదు నిల్వ ఉంచడం లేదు. వ్యవస్థ మొత్తంగా తనను ధ్వంసం చేసినటువంటి కార్యాచరణతో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. వ్యవస్థలో ఏర్పడిన అస్థిరత్వాన్ని పరిష్కరించే విష యంలో కనీసస్థాయి నియంత్రణ కూడా ఉన్నట్లు కనపడటం లేదు. పెద్దనోట్ల రద్దును ప్రకటించిన వారం రోజుల తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవచ్చనే సూచనలు పొడసూపాయి. న్యాయస్థానంలో నోట్ల రద్దుపై తొలి విచారణ ప్రారంభమై, పాత కరెన్సీ చాలావరకు ఇంకా ప్రజల చేతుల్లోనే ఉంటున్నప్పుడు అది సాధ్యమేననిపించింది. కానీ ఆ దశ ముగిసిపోయింది. డబ్బు సైతం దాని భౌతిక రూపంలో అదృశ్యమై ఆర్బీఐ లేదా బ్యాంకుల ఖజానాల్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో వ్యవస్థ ద్వారా కొత్త నోట్లు పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. వ్యవస్థ స్థిరత్వం పొందాలంటే మరొక నెల సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే జనవరి మధ్యవరకు పరిస్థితి ఇలాగే ఉంటుందన్నమాట. డబ్బును ముద్రించినంత మాత్రాన సరిపోదు.. వ్యవస్త మొత్తంలో నగదు పంపిణీ కావాలి. దీనికి ఎంత సమయం పడుతుందన్న వాస్తవ అంచనా ఇంతవరకు లేదు. పెద్దనోట్ల రద్దు వల్ల రానున్న కాలంలో పెద్దగా బాధ ఉండదని మోదీతో సహా ఇతరులు కూడా నమ్ముతున్నారు. రాజకీయపరంగా ఇదెంత ముఖ్యమైన సమస్య అంటే, ప్రజాస్వామిక పరిధిలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే దీన్ని అనుకూలంగా మల్చుకుంటుంది. ఆర్థిక వ్యవస్థను మందగింపజేసి, కోట్లాదిమంది ప్రజలను నెలరోజులకు పైగా ప్రతి దినం భయంకరమైన అసౌకర్యానికి గురిచేస్తున్న ఈ దూకుడు చర్య ప్రతిపక్షంలోని రాజకీయనేతలకు కలలో కనిపించే లడ్డూలాంటి బహుమతి వంటిది. వాస్తవానికి ప్రభుత్వం తొలి కొద్ది వారాల్లో పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనాలు పొందింది. మీడియా అత్యంత దృఢంగా పెద్ద నోట్ల రద్దును సమర్థిం చింది. తర్వాత జాతికి మద్దతుగా, నల్లధనానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా క్యూలలో నిలబడుతున్నందుకు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నట్లుగానే కని పించింది. కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దనోట్ల రద్దును సమర్థిస్తూనే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ వైఖరి ఆ పార్టీ ఆత్మవిశ్వాస లేమిని ప్రదర్శించింది. పైగా పెద్దనోట్ల రద్దు సారాంశం పట్ల అవగాహనా లేమిని అది సూచించింది. పెద్దనోట్ల రద్దు పరిణామాలు చాలాకాలం కొనసాగడంపై నిపుణులతోసహా చాలామంది ప్రజలకు అంతగా అవగాహన లేదనడం కరెక్టే కావచ్చు. కానీ కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో ఈ దేశాన్ని పాలించడంలో దశాబ్దాల అనుభవం కాంగ్రెస్ పార్టీ సొంతం. పెద్ద నోట్ల రద్దు విపరిణామాలపై తగినంత డేటా, సమాచారం దానికి తప్పకుండా తెలిసే ఉండాలి. ఆ పార్టీకి కూడా అది తెలియదన్నట్లయితే అది కాంగ్రెస్ అసమర్థతగానే చెప్పాలి. క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న జననేతలు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ మాత్రమే మొదటినుంచే పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ వచ్చారు. నోట్ల రద్దు నిర్లక్ష్యపూరితమైన చర్య అనీ, జనం మద్దతును అది కోల్పోతుందని వీరు గుర్తించి ఉండవచ్చు. అసౌకర్యం తీవ్రస్థాయిలో కొనసాగడం, ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ చర్య లక్ష్యం నల్లధనంపై దాడి చేయడం నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సుస్థిరత వైపునకు మారడంతో.. నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం ఆస్వాదించిన తొలినాళ్ల ఉల్లాస స్థితికి క్యూలలో ఉంటున్న జనం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద నోట్ల రద్దు విషాదాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోలేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి రాహుల్ గాంధీ పేలవమైన పరిస్థితినే సూచిస్తోంది. ప్రజాకర్షక రాజకీయాల్లో నినాదాలతో జనం మద్దతు పునాదిని కూడగట్టడం చాలా అవసరం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీ దీన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. మనకాలపు అత్యంత సమర్థ రాజకీయనేత మోదీ కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి సామర్థ్యం లేని కాంగ్రెస్.. అమూల్య మైన రాజకీయ అవకాశం తన ముందున్నప్పటికీ దాన్ని ఎలా సరైన విధంగా ఒడిసిపట్టుకోవాలో తెలియని స్థితిలో అస్పష్టపు ప్రకటనలు చేస్తోంది. ప్రస్తుత సంక్షోభం పట్ల రాహుల్ గాంధీ వైఖరి ఏమాత్రం అర్ధవంతంగా లేదనిపిస్తోంది. మొదట తాను కాస్త ప్రయత్నించారు. తర్వాత ఏకపక్ష చర్య ద్వారా ప్రతిపక్ష ఐక్యతనే అర్ధరహితంగా విచ్ఛిన్న పరిచారు. ప్రధాని వ్యక్తిగత అవినీతిని బయటపెడతానని హెచ్చరించారు. కానీ తర్వాత మాత్రం మోదీని కలుసుకున్నప్పుడు రైతుల దుస్థితి గురించి ప్రస్తావనకు ఎజెండా మార్చుకున్నారు. తన వైఖరిలో ఎలాంటి వ్యూహం కానీ, క్రమశిక్షణ కానీ లేవని ఇది సూచిస్తోంది. ప్రధాని వ్యక్తిగతంగా అవినీతిపరుడని చాలా కొద్దిమంది మాత్రమే నమ్ముతున్నారు. అలాంటప్పుడు మాటవరసకైనా అలాంటి ఆరోపణ చేసి ఉండకూడదు. మొత్తం మీద కేంద్రప్రభుత్వం తనకు తాను రూపొందించుకున్న అతి పెద్ద సంక్షోభం మధ్యలో మనం ఉన్నాం. దేశ పౌరులతో, మన జీవితాలపై కలిగిస్తున్న ప్రభావాలతో తీవ్రంగా ముడిపడి ఉన్న సంక్షోభం ఇది. నూతన సంవత్సరం తొలి వారాల్లో వ్యక్తిగత అసౌకర్యం కలిగిస్తూ, కొత్త సంవత్సరం తొలి కొన్ని నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతూ కొనసాగుతానని వాగ్దానం చేస్తున్న సంక్షోభం ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే... ప్రభుత్వం అతి పేలవంగా నిర్వహిస్తున్న, ప్రతిపక్షం అంతకంటే అధ్వానంగా వ్యవహరిస్తున్న సంక్షోభంగా ఇది అత్యంత స్పష్టంగా రుజువవుతోంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
మహా విషాదంగా ముగుస్తుందా?
లేక మంచి రోజులను తేనుందా? అవలోకనం గత సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ముందు, 2014 ఏప్రిల్లో కాబోయే ప్రధాని నరేంద్ర మోదీని కార్యకర్త, రచయిత్రి మధు కిష్వర్ ఇంటర్వ్యూ చేశారు. అప్పట్లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ టీవీ ఇంటర్వ్యూలో ఆయన తన గురించి, తన పని శైలి గురించి చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తికరమైనవిగా అనిపించాయి. ఆ ఇంటర్వ్యూను చూస్తూ ఆయన చెప్పిన కొన్ని విషయాలను నోట్స్గా రాసుకున్నాను. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం పని సంస్కృతిని మార్చారు. ఆయనకు ముందటి ముఖ్యమంత్రులంతా 12 గంటలకు కార్యాలయానికి వచ్చేవారు. సమయ పాలన విషయంలో ఎçప్పుడూ నిక్కచ్చిగా ఉండే మోదీ సరిగ్గా ఉదయం 9.45కు కార్యాలయానికి వచ్చేవారు. సమయాన్ని పాటించడం పట్ల ఆయన చాలా పట్టింపుతో ఉండేవారని నాకూ తెలుసు. ఆయనను నేను కలుసుకున్న ప్రతిసారీ కచ్చితంగా నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన నిముషంలోనే కలుసుకునేవాడిని. నిజంగా ఆయన ఎలా పనిచేసేవారు అనేది ఆయన వెల్లడించిన మరో విషయం. మోదీ తాను ఫైళ్లను చదవనని చెప్పారు. పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోవాలనే ఆత్రం ఉండి, ఎంతో నిర్ణయాత్మకంగా ఉండే వ్యక్తికి తాను నిర్ణయం తీసుకోబోయే విషయంపై పూర్తి పట్టు ఉండటం అవసరం. అయితే మోదీ మాత్రం ‘అకడమిక్ (విద్యావిషయ సంబంధమైనవిగా ఉండే) అధ్యయనాల’ ద్వారా తాను పాలన సాగించలేనని, అందుకు బదులుగా అన్ని విషయాలను క్లుప్త సారాంశంగా నోటి మాటలతో తనకు చెప్పమని తన అధికారులను కోరుతానని చెప్పారు. వారే ఆ ఫైలును చదివి, ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘‘అందులో మసాలా (సారం) ఏమైనా ఉన్నదేమో’’ ఆయనకు చెప్పాల్సి ఉంటుంది. వాస్తవంగా తాను వాటిని చదవకుండానే ఆయా సమస్యలకు సంబంధించిన సూక్ష్మ అంశాలను సైతం తాను తెలుసుకోగలనని ఆయన చెప్పారు. ఎందుకంటే ‘‘నాకు అంతటి గ్రహణశక్తి ఉంది’’ అన్నారు. తాను ‘‘మంచి శ్రోతను’’ అనీ, తనకు ఏమి చెప్పినా దాన్ని గ్రహించి, గుర్తుంచుకోగలనని మోదీ తెలిపారు. ఈ విషయాన్ని వింటున్నప్పుడు ఆయన తనకు నమ్మకమున్న కొందరు అధికారులపై ఆధారపడుతున్నారని అనిపించింది. కాబట్టి ఆ అధికారులు ఏ విషయమైనా ఆయనకు ఎంత తెలిస్తే చాలని తాము అనుకుంటే అంత ఎక్కువగా లేదా తక్కువగా చెప్పవచ్చు. ఇలా అధికారులపై ఆధారపడటమే ఆయనలోని బలహీనమైన అంశంగా పరిణమించగలదని అనిపించింది. మోదీ వర్ణించిన ఈ పని శైలితో పదుల కొద్దీ లేదా బహుశా వందల కొద్దీ పేజీలుండే సంక్లిష్ట విషయాలను సైతం మాటల్లో చెప్పేంత సంక్షిప్త సారాంశంగా కుదించేయడం జరుగుతుంది. సమయం లేనప్పుడు అలా జరగడం సాధ్యం. కానీ సమస్య అత్యంత సంక్లిష్టమైనది అయినప్పుడు నోటి మాటగా చెప్పే సంక్షిప్త సారాంశం ఆ విషయాన్ని అతిగా సరళీకరించడం, అవుతుంది. ఈ సారాంశంపై ఆధారపడే మోదీ నిర్ణయాలను తీసుకుంటారు, వాటిని పాలనా యంత్రాంగం అమలుచేస్తుంది. 12 ఏళ్ల పాటూ మోదీ మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటూ గుజరాత్ను నడిపారు. కాబట్టి ఈ పని శైలి బాగానే పని చేసినట్టు అనిపించింది. అయితే, నిర్ణయాలను తీసుకునేటప్పుడు తత్సంబంధమైన విషయాలను ఇలా సారాంశం రూపంలో తెలుసుకునే మోదీ పని శైలి గురించి ఇటీవలి కాలంలో పునరాలోచనలో పడ్డాను. పెద్ద నోట్ల రద్దు విధానం అమలవుతున్న తీరుకు సంబంధించి సుప్రీం కోర్టు కొన్ని కీలక ప్రశ్నలను సంధించింది. నవంబర్ 8న మోదీ రూ. 500, 1,000 నోట్లను రద్దు చేసినప్పటికే ఈ విధానానికి సక్రమమైన ప్రణాళికను రూపొం దించారో, లేక ‘‘యథాలాపంగా’’ తీసుకున్న నిర్ణయమో తెలపాలని కోరింది. నిర్దేశించిన నగదును బ్యాంకులు పౌరులకు ఇవ్వలేకపోతున్నాగానీ ప్రభుత్వం నగదు ఉపసంహరణకు పరిమితులను ఎందుకు ప్రకటిస్తోందని అడిగింది. పరిస్థితులను చూస్తుంటే ప్రభుత్వం ఈ విషయంపై లోతుగా ఆలోచించినట్టు లేదని ఎందుకు అనిపిస్తోంది? అని ప్రశ్నించింది. ప్రభుత్వం తన స్వతంత్రతను బలంగా చాటుకోవడం కోసం వీటిని బలంగా తోసి పారేసింది. ద్రవ్య విధానాన్ని కోర్టులు నిర్ణయించజాలవని చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వ వాదన సరైనదే అనుకుంటున్నాను. ఈ వివాదం ప్రభుత్వానికి అనుకూలంగానే పరిష్కారమౌతుందని ఆశిస్తున్నాను. అసలు విషయానికి తిరిగి వస్తే, మోదీ పనిశైలిలో కొన్ని సానుకూలతలు ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు, త్వరత్వరగా నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చినçప్పుడు లేదా సమస్యలు జటిలమైనవి కానప్పుడు ఆ శైలి తగినది కావచ్చు. ఏది ఆకట్టుకునేలా ఉంటుందో గ్రహించగల శక్తి మోదీకి బాగా ఉంది. అద్భుతంగా ఉన్న మేక్ ఇన్ ఇండియా లోగో వంటివి ఎంపిక కావడానికి కారణం మోదీ వాటిని వ్యక్తిగతంగా ఆమోదించడమేనని నా అనుమానం. కానీ నిర్ణయం తీసుకునే విషయం విస్తారమైనది, సంక్లిష్టమైనది, చివరికి జవాబుదారీ వహించాల్సివచ్చే నిర్ణయాన్ని తీసుకునే వ్యక్తే స్వయంగా అధ్యయనం చేయాల్సినది అయినప్పుడు ఏం జరుగుతుంది? అలాంటçప్పుడు ఈ పని శైలివల్ల పరిస్థితి మరింత సమస్యాత్మకంగా మారుతుందని నా అనుమానం. ప్రతిదాన్నీ నోటి మాటగా చెప్పే సంక్షిప్త సారంగా కుదించలేం. విద్యావంతునికి తగ్గట్టుగానే అన్ని వివరాలను తెలుసుకోగోరే మన్మో హన్Sసింగ్ పని శైలికి çసరిగ్గా విరుద్ధమైనది మోదీ శైలి. రానున్న కొన్ని నెలల్లో పెద్ద నోట్ల రద్దు మహా విషాదంగా ముగుస్తుందని మన్మోహన్ చెప్పారు. జనవరిలో మనం మరింత మెరుగైన, విభిన్నమైన ప్రపంచంలోకి అడుగు పెడతామని మోదీ అన్నారు. ఇద్దరు చెప్పిందీ సరైనదే అయ్యే అవకాశం లేదు. ఎవరు చెప్పింది తప్పో చాలా త్వరలోనే తేలుతుంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
గురి చూశాకే తుపాకీ పేలుస్తున్నారా?
అవలోకనం నేడు మనకున్న అత్యంత విశ్వసనీయత గల నేత మోదీయే. మరే ఇతర నేతా ఆత్మవిశ్వాసంతో దేశాన్ని ఇంతటి కల్లోలంలోకి విజయవంతంగా నడపలేరు. వచ్చే రెండున్నరేళ్లలో కూడా ఆయన తన జనాకర్షణను నిలబెట్టుకుంటారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను ఓడించటం చాలా కష్టం. ఆయన చేపట్టిన చర్యలు చాలా వాటి పర్యవసానాలు ఈలోగానే వెల్లడి కావాలని కోరుకుంటున్నాను. గొప్ప ఆలోచనతో పులకరించి పోవడమే గాక, దాని వివరాల పట్ల ఆసక్తి కూడా మన ప్రధానికి ఉన్నదా? లేదా? అనేది తేలడం ఆయనకూ, మనకూ కూడా మంచిది. యూరోపియన్ యూనియన్ ఏర్పాటు అనే భావనకే ఫ్రెంచి నేత జిస్కార్ డెస్టాంగ్ పులకరించి పోయేవాడుగానీ, దాని వివరాలు మాత్రం ఆయనకు విసు గెత్తించేవని అంటారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే చాలా అంశాలలో అదే ధోరణి కనిపిస్తున్నదేమోనని తరచూ నాకు అనుమానం కలుగుతుంటుంది. నరేంద్ర మోదీ నల్ల ధనంపై భారీ దాడిని ప్రారంభించిన తదుపరి గడచిన రెండు వారా లకు సంబంధించి రెండు వాస్తవాలను ఒప్పుకోవడం సమంజసం. ఒకటి ఇంతటి అసౌకర్యం తర్వాత కూడా మోదీ తనకున్న విస్తృతమైన ప్రజా మద్దతును నిల బెట్టుకుంటున్నారు. రెండు నగదు కొరత వల్ల తలెత్తుతున్న ఆర్థిక సమస్యలు పేరు కుపోతూనే ఉన్నాయని వార్తా నివేదికలు తెలుపుతున్నాయి. అది సూరత్ నుంచే అయినా లేదా లూథియానా లేదా మొరాదాబాద్ వంటివే అయినా మన వస్తుతయారీ కేంద్రాలన్నిటి నుంచి వస్తున్న వార్తా నివే దికలన్నీ ఒకేలా ఉంటున్నాయి. వస్తుతయారీ యూనిట్లు తక్కువ ఉత్పత్తి సామ ర్థ్యంతో పని చేస్తున్నాయనో లేదా మూత పడ్డాయనో తెలుపుతున్నాయి. అవి తయారు చేసే వస్తువులకు గిరాకీ లేకపోవడమూ, ముడి పదార్థాల కొనుగోలుకు నగదు అంటుబాటులో లేకపోవడం అందుకు కారణం. అవి శ్రామికులను పనిలో కొనసాగించడానికి విముఖతను చూపడం, వలస కార్మికులను తొలగించడం లేదా వారి స్వస్థలాలకు పంపివేయడం సర్వత్రా కనిపిస్తున్న మరో సామాన్యాంశం. దీనికి సంబంధించిన సరైన గణాంక సమాచారం కోసం మనం ఇంకా వేచి చూడాల్సి ఉంది. అయినాగానీ ఘటనల నివేదికలు పరిస్థితిని సూచించే సంకే తాలు అయినట్లయితే డిసెంబర్లోనూ, కొత్త సంవత్సరంలోనూ ఇంకా పెద్ద సమస్య తలెత్తనున్నదని అనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా కొని తెచ్చుకున్న ఈ అనిశ్చిత పరిస్థితిలో కూడా మోదీ జనాదరణ విస్తృతమైనదిగానూ, భారీగానూ ఉన్నదనేది నిర్వివాదాంశం. ఇందుకు కారణంఏమిటి? ఇది మోదీ పదవీ కాలం నట్ట నడుమకు చేరిన సమయం కూడా కాబట్టి ఆ విషయాన్ని పరిశీలిద్దాం. అద్భుతమైన పథకాలను ప్రారంభించడం, గొప్ప ప్రకటనలను చే యడమే ఇంతవరకు గడచిన మోదీ పాలనలో కనిపించే విశిష్ట లక్షణం. ఇవన్నీ ప్రజల దృష్టిని, ప్రత్యేకించి మీడియా దృష్టిని ఆకట్టుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా, బుల్లెట్ ట్రైన్, స్మార్ట్ నగరాలు, స్వచ్ఛ భారత్, లక్ష్యిత దాడులు, పెద్ద నోట్ల రద్దు వగైరా. ఇవన్నీ, ఇంకా ఇతరత్రా మోదీ చొరవ చూపిన అంశాలన్నిటిలో ఒకే పద్ధతి కనిపిస్తుంది. ఇవన్నీ గతంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. పాతను, కృశించిపోతున్నదాన్ని తుంచి పారేసి, దాని స్థానంలో కొత్తదాన్ని, మరింత మెరుగైనదాన్ని తెస్తామని వాగ్దానం చేసేవి. అవి ఈ లక్ష్యాన్ని ఏ మేరకైనా సాధించాయా? వాటి నిజ పర్యవసానాలు ఏమిటి? కాలక్రమేణానే అవి మనకు తెలుస్తాయి. ఒక ఉదాహరణను చూద్దాం. ఉడీ ఉగ్రదాడి తదుపరి జరిపిన లక్ష్యిత దాడులు... వాస్తవాధీన రేఖకు అవతల నుంచి పంపుతున్న వారు చేస్తున్న హింసా కాండకు ప్రతిస్పందనగా చేసినవి. ఆ తదుపరి మనం 20 మంది సైనికులను కోల్పోయాం. లక్ష్యిత దాడులకు ముందు సాపేక్షికంగా శాంతియుతంగా ఉండిన వాస్తవాధీన రేఖ ఆ తదుపరి భగ్గున మండుతుండటమే అందుకు ప్రధాన కారణం. తిరిగి కాల్పుల విరమణ నెలకొన్నదని మన రక్షణ మంత్రి అంటున్నారు. అయితే ఈలోగా 20 మంది భారత సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి లక్ష్యిత దాడులను జరపాలనేది మంచి నిర్ణయమేనా? ఈ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం చెప్పినా అది జాతి వ్యతిరేకమైనదే అవుతుంది. కాబట్టి దీన్ని ఇంత టితో వదిలేద్దాం. ఏదేమైనా భారత సైనికుణ్ణి ఆరాధించవ లసిందే. అతడు తనం తట తానుగా ఆత్మబలిదానాలు చేయాల్సిందేనని నేనంటాను. సైనికుడు దేశం కోసం చేసిన త్యాగాల పట్ల మనకు పూజ్యభావం ఉన్నదే తప్ప, అతని ప్రాణాల పట్ల గౌరవం మాత్రం లేదు. ప్రధాని మోదీ గొప్ప ప్రకటనల పర్యవసానాల వల్ల ప్రయోజనాలు కలిగే దెవరికో, నష్టపోయేది ఎవరో మనకు కచ్చితంగా తెలియదు. చాలా వరకు ప్రకటనల తీరు ఇంతేనని చెప్పుకోవచ్చు. అయితే నల్ల ధనంపై చేపట్టిన లక్ష్యిత దాడి నిజ ఫలితాలు ఏమిటో తెలియడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందనే మాట నిజమే. కానీ మనం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ మాటేమిటి? అణు సరఫరాదారుల గ్రూపులో (ఎన్ఎస్జీ) స్థానాన్ని సాధించడానికి మనం వెచ్చిస్తున్న దౌత్యశక్తి, ప్రధాని వ్యక్తిగత ప్రతిష్టల సంగ తేమిటి? వాటి పర్యవసానాలను గురించి అవసరమైనంత లోతైన విశ్లేషణ జరిపారా? నేనిక్కడ ఉద్దేశాలను ప్రశ్నించడం లేదు. కాకపోతే ముందుగా తుపాకీ పేల్చి, తర్వాత గురి చూడటం అనే వైఖరిని ప్రభుత్వం అవలంబిస్తున్నదేమోననే నా అనుమానం నిరాధారమైనదేనా? అని తెలుసుకోవాలనే నా కుతూ హలమంతా. నేడు మనకున్న అత్యంత విశ్వసనీయత గల నేత మోదీయే. మరే ఇతర నేతా ఆత్మవిశ్వాసంతో దేశాన్ని ఇంతటి కల్లోలంలోకి విజయవంతంగా నడపలేరు. వచ్చే రెండున్నరేళ్లలో కూడా ఆయన తన జనాకర్షణను నిలబెట్టుకుంటారు. 2019 ఎన్ని కల్లో ఆయన్ను ఓడించటం చాలా కష్టం. ఆయన చేపట్టిన చర్యలు చాలా వాటి పర్యవసానాలు ఈలోగానే వెల్లడి కావాలని నేను కోరుకుంటున్నాను. గొప్ప ఆలో చనతో పులకరించి పోవడమే గాక, దాని వివరాల పట్ల ఆసక్తి కూడా ఆయనకు ఉన్నదా? లేదా? అనేది తేలడం ఆయనకూ, మనకూ కూడా మంచిది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఈ-మెయిల్ : aakar.patel@icloud.com -
‘రద్దు’ బాధితులకు దక్కేనా ఫలితం?
అవలోకనం నల్లధనాన్ని కూడా తెల్లధనం లాగే వ్యాపార విస్తరణకు ఉపయోగిస్తారు. వస్తువులు, ఆస్తుల రూపంలో ఉంచుతారు. నగదుగా దాన్ని ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఏదేమైనా, మోదీ తన నిర్ణయాత్మక శక్తిని ఒక్కసారి మెరిపించి చూపారు. తద్వారా నగదుతోనే బతుకు వెళ్లదీసే అత్యంత దయనీయ స్థితిలోని కోట్లాది పేదలను ఒక ప్రయోగానికి వాడుకుం టున్నారు. ఇంతటి భారీ చర్య వల్ల కలిగే గందరగోళాన్ని ముందే అంచనావేసి... దాన్ని ఉపశమింపజేసి, ప్రశాంతతను నెలకొల్పడానికి అవసరమైన ప్రతిభ, శక్తిసామర్థ్యాలు ఎక్కడ? ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో తీసుకొస్తానన్న మార్పులలో రెండు అంశాలు ముఖ్యమైనవి. అవి: నిర్ణయాత్మకత, పరిపాలన. కేవలం ఈ రెండిటి వల్లనే గాక. ఆయనలోని ఇతర గుణాలను చూసి కూడా ప్రజలు ఆయనకు ఓటు వేసిన మాట నిజమే. మోదీ వంశపారంపర్యవాది కాదు. కేవలం తన ప్రతిభతోనే ఆయన నేటి స్థానానికి చేరుకోగలిగారు. నిజాయితీపరునిగా ఆయనకు పేరుంది. మన్మోహన్ సింగ్ హయాంలోలాగా నేటి కేంద్ర మంత్రివర్గంలో అత్యున్నత స్థాయి అవినీతి ఉన్నట్టు వార్తలేమీ లేవు. అయితే ఆయనలోని నిర్ణయాత్మకత, పరిపాలన అనే ఈ రెండు లక్షణాలే ఇటీవలి రోజుల్లో బహిరంగంగా కనిపిస్తున్నాయి. అవి దేశాన్ని ఎలా ప్రభావితం చేశాయనే అంశాన్ని ఒకసారి చూద్దాం. నిర్ణయాత్మకత అంటే వేగంగానూ, దృఢంగాను నిర్ణయాలను తీసుకోగల సామర్థ్యం. తరచుగా దీన్ని ఒక సుగుణంగా చూస్తుంటారు. నిర్ణయరాహిత్యం అంటే తరచుగా దేన్నయినా జాగ్రత్తగా, క్షుణ్ణంగా ఆలోచించడానికి మరో పేరు. అయినా దాన్ని ఒక బలహీనతగా పరిగణిస్తుంటారు. భరించగల పరిమితికి మించిన అనిశ్చితి లేదా అశాంతి నెలకొన్నప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోరు. మరోవంక, నిర్ణయాత్మకతను కలిగి ఉండటాన్ని పరిపూర్ణ ఆత్మవిశ్వాసంగా చూస్తారు. అంటే లోతైన జ్ఞానంతో కంటే, తన బుద్ధికి సరైనదిగా తోచిన దానినే కచ్చితమైనదని భావించడమని అర్థం. సంజయ్ గాంధీ కూడా నిర్ణయాత్మకంగానే ఉండేవారు. అత్తెసర అక్షరాస్యుడైన (10వ తరగతి మధ్యలో మానేశారు) ఆయనకు గొప్ప అధికారాన్ని కట్టబెట్టారు. ఆయన దానిని అధ్వానంగా ప్రయోగించారు. ఆయన తలబిరుసుతనానికి, ఆత్మవిశ్వాసానికి భారత ప్రజలు ఊహింపశక్యం కానన్ని రకాల బాధలు పడ్డారు. మనందరికీ ఏది మంచో కూడా తనకే తెలుసుననే ఆత్మవిశ్వాసం ఆయనది. ఇక రెండవది పరిపాలనా సామర్థ్యం. దానిని సైనిక చరిత్రకారులు వాడే ‘పట్టు’ అనే మరో పదంతో కూడా వర్ణించవచ్చు. ఒక జనరల్ తను నేతృత్వం వహించే వారందరిపైనా పూర్తి నియంత్రణను కలిగి ఉండే సామర్థ్యం అని దానికి అర్థం. తన పక్షానికి ఏమి సాధించగలిగే శక్తి ఉన్నదో తెలుసుకొని, అందుకు సంసిద్ధం కావడం. సమాచార సంబంధాలు అధ్వానంగానూ, సరఫరాల మార్గాలు అతి సుదీర్ఘమైనవిగానూ ఉండిన కాలంలో జాలియస్ సీజర్కు తన సేనలపై పూర్తి పట్టు ఉండేది, వాటిని నియంత్రించగలిగి ఉండేవాడు. యుద్ధంలో జనరల్ మాంట్గమిరీ సాధించినవి మిశ్రమ ఫలితాలే అయినా... ఆయనకు కూడా పట్టు ఉన్నదని భావించేవారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షాన ఉన్న చాలా మంది జనరల్స్లాగే ఆయనకు కూడా నాటి పరిస్థితి ఏమీ అంతుబట్టేది కాదు. నరేంద్ర మోదీ రూ. 500, రూ.1,000 నోట్లను పనికిరానివిగా చేయడం ద్వారా తన నిర్మయాత్మకతను ప్రదర్శించారు. దీనిని నల్లధనాన్ని తుదముట్టించే లేదా దానిపై తీవ్రమైన దాడిని చేసే చర్యగా ప్రచారం చేశారు. అవినీతిపరులైన సంపన్నుల నోట్ల కట్టల దొంతరలు లేదా గోదాములలోని నగదంతా ఇక ఎందుకూ కొరగాని చెత్త కాగితమేనని మోదీ ప్రకటించారు. అంతకు మించి ఈ చర్య నల్లధనాన్ని ఎలా దెబ్బ తీస్తుందో మనకు చెప్పలేదు. నల్లధనం పని చేసేది అలా కాదని వ్యాపారాలు నడిపేవారికి తెలుసు. నేనో వస్తు తయారీ సంస్థను నడుపుతున్న యజమానిని. మరో సేవల వ్యాపారమూ ఉంది. నల్లధనాన్ని కూడా తెల్లధనం లాగే వ్యాపార విస్తరణకు సాధనంగా ఉపయోగిస్తారు. వస్తువులు, ఆస్తుల రూపంలో దాన్ని ఉంచుతారు. పూర్తి ద్రవ్య రూపంలో, నగదుగా దాన్ని ఉంచడం వల్ల ప్రత్యేకించి ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఉగ్రవాద కార్యకలాపాలను సాగించేది నకిలీ నోట్లతోనే కాబట్టి, ఈ చర్య వాటిని దెబ్బతీస్తుందనేది వారు చెప్పిన రెండో కారణం. ఉగ్రవాదంతో ముడిపెట్లాలేగానీ ఏ ఆలోచననైనా నేడు మన దేశంలో మంచిదిగా చలామణి చేసేయొచ్చు. మీడియా కూడా దాన్ని ప్రశ్నించే అవకాశం తక్కువే. ఏదేమైనా, మోదీ తన నిర్ణయాత్మక శక్తిని ఒక్కసారి మెరిపించి చూపారు. ఫలితంగా మన దేశంలో నగదుతోనే బతుకు వెళ్లదీసే అత్యంత దయనీయ స్థితిలోని కోట్లాది పేదలను ఒక ప్రయోగానికి వాడుకుంటున్నారు. ఓ రెండు పార్టీలు మినహా ప్రతిపక్షాలన్నీ మోదీ అంటేనే ఠారెత్తిపోతున్నాయి. కాబట్టే ఇంతవరకు అవేవీ అసలు పెద్ద నోట్ల రద్దునే వ్యతిరేకించడం లేదు. ఉగ్రవాదాన్ని దానికి తగిలించారు కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరడానికి సైతం కాంగ్రెస్ జంకుతోంది. ప్రజల మానసిక స్థితి ఎలా ఉందనే విషయంలో వారెవరికీ కచ్చితమైన అంచనా లేదు. ఈ చర్యపట్ల ప్రజల్లో ఉత్సాహం ఉన్నదని విశ్వసిస్తున్నారు. అలవోకగా చేసేసిన ఈ క్రూర చర్య కోట్లాది మందిని బాధలకు గురిచేస్తోంది, మానసిక వేదనకు గురిచేస్తోంది. జనవరి 1 నాటికి మన చేతికి ఫలాల లాభాలు అందుతాయనీ, అవే నేడు ప్రజలు అనుభవిస్తున్న బాధలు సమంజసమైనవేనని రుజువు చేస్తాయని మోదీ మనకు చెప్పారు. అదీ చూద్దాం. మోదీ తన నిర్ణయాత్మకతను ప్రదర్శించి చూపినట్టే... ఈలోగా తన పరిపాలనను కూడా చూపాల్సిన అవసరం ఉంది. విజయోత్సాహంతో మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనను వెలువరించినప్పటి నుంచి ప్రభుత్వం అస్పష్టంగా మాట్లాడుతోంది. ప్రతి చర్యల రూపంలో అది పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. నగదు ఉపసంహరణ (విత్డ్రాయల్) పరిమితులను పెంచడం, తగ్గించడమూ, ఇష్టానుసారం కొన్ని రాష్ట్రాలకు నిబంధనలను సడలించడమూ, వేళ్లకు సిరా పూయడం వంటి తాత్కాలిక పరిపాలనా చర్యలను చేపట్టడమూ చేస్తోంది. ఇంతటి గొప్ప ప్రమాణంలోని చర్యను చేపట్టేటప్పుడు కలిగే గందరగోళాన్ని ముందే అంచనావేసి... దాన్ని ఉపశమింపజేసి ప్రశాంతతను నెలకొల్పడానికి అవసరమైన ప్రతిభ, శక్తిసామర్థ్యాలు ఎక్కడ? అది లోపించాయని ఇప్పుడే అనేయడం సరి కాదు. ఇదో అవకాశం. ఏదో కొద్ది మందిని (ఉగ్రవాద బాధితులలాగా) గాక, కోట్లాది మందిని ప్రభావితం చేసే సంక్షోభంలో దేశం ఉన్న ఈ తరుణంలోనే మోదీకి పట్టు ఉన్నదో, లేదో మనకు తేలేది. రచయిత ప్రముఖ కాలమిస్టు, aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
ఎవరికీ పనికిరాని బడాయికోరు ‘బుల్లెట్’!
అవలోకనం అహ్మదాబాద్–ముంబైల మధ్య లక్ష కోట్ల వ్యయంతో చేపట్టనున్న బుల్లెట్ ట్రైన్ ఉత్త బడాయికోరు ప్రాజెక్టు. ఆరోగ్యం. విద్యల కోసం ఉపయోగపడే డబ్బును అది పీల్చిపారేస్తుంది. దేశ ప్రజలలో అత్యధికులకు దాని వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. చూడబోతే ప్రభుత్వం సంపన్నులకు ప్రయాణ సదుపాయాలను కల్పించడం కోసం డబ్బు ఖర్చు చేయాలని తెగ ఆరాటపడిపోతోందని అనిపిస్తోంది. ఇలాంటి ఖర్చు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేట్టు చేస్తుంది, తద్వారా చివరికి దేశానికి మేలు జరుగుతుంది అనే ఊహపై అది ఆధారపడుతున్నట్టుంది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి 200కు పైగా రైళ్లు ఉన్నాయి. వాటిలో మొదటిది అర్ధరాత్రి దాటిన వెంటనే, చివరిది అంతకు కొద్దిగా ముందూ బయల్దేరుతాయి. కాబట్టి, ఆ 524 కిలో మీటర్ల దూరానికి రోజంతా రైళ్లు నడుస్తూనే ఉంటాయి. అహ్మదాబాద్లో ఒక ఎయిర్పోర్టుంది. అక్కడి నుంచి ముంబైకి రోజుకు 10 విమాన సర్వీసులున్నాయి. అహ్మదాబాద్, ముంబైలు స్వర్ణ చతుర్భుజి రహదారి వ్యవస్థలో (గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే నెట్వర్క్) భాగం. ఆరు రోడ్ల ఆ రహదారి వ్యవస్థ గుండా రోడ్డు ప్రయాణం దాదాపు రైలంత వేగంగానే సాగుతుంది. బహుశా దేశంలోనే అత్యుత్తమంగా అనుసంధానమై ఉన్న మార్గం ఇదే కావచ్చు. ప్రస్తుతం జపాన్లో ఉన్న మన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షింజో అబేతో కలసి బుల్లెట్ ట్రైన్ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. అందుకే నేనీ విషయాన్ని రాస్తున్నాను. అహ్మదాబాద్–ముంబైల మధ్య నడిచే ఆ బుల్లెట్ రైలు రూపకల్పన కొద్ది రోజుల్లో మొదలవుతుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అధికారికంగా వ్యయం రూ. 97,636 కోట్లు. కానీ మరో 10,000 కోట్ల అదనవు వ్యయం కూడా చేయాల్సి రావచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. ఈ అంకెలను సరైన దృష్టి కోణం నుంచి చూడాలంటే... ఇది భారత ఆరోగ్య శాఖ బడ్జెట్ అంత మొత్తం. మొత్తం బాలలలో 38 శాతం పోషకాహార లోపంతో బాధపడుతూ, రెండేళ్ల వయసుకే గిడసబారిపోతున్న దేశం మనది. అంటే ఆరోగ్యవంతులైన పిల్లల కంటే వారికి తక్కువ శారీరక, మానసిక శక్తిసామర్థ్యాలే ఉంటాయి. వారెన్నటికీ సంతృప్తికరమైన, సంతోషదాయకమైన జీవితాన్ని గడపలేరు. భారత వార్షిక విద్యా బడ్జెట్ కంటే బుల్లెట్ ట్రైన్కు అయ్యే ఖర్చు ఎక్కువ. ఈ విషయంలో చూసినా మన దేశం ప్రపంచంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది. మన అక్షరాస్యత నాణ్యత సైతం అధ్వానంగా ఉంది. ఆ విషయం గురించి ఇంతకు ముందు రాశాను. రవాణా పరిశ్రమలో మనం పెట్టే పెట్టుబడులు పేదల పట్ల ఎలాంటి శ్రద్ధా చూపుతున్నవి కాదనేది దీనికి సంబంధించిన మరో అంశం. నిజానికి పేదలకే రవాణా సౌకర్యాలు అత్యంత అవసరం. 2005లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలు ప్రభుత్వ రోడ్డు రవాణా బస్సు సేవల వ్యవస్థను మూసేశాయి. బస్సులు లాభాలను ఆర్జించలేక పోవడమే అందుకు కారణం. కానీ మరి పేదలు ఇక ఎలా ప్రయాణిస్తారని అనుకున్నారు? బుల్లెట్ ట్రైన్ తదితర ప్రాజెక్టులకు మాత్రం ఈ లాభదాయకత వర్తించదనుకోండి. అహ్మదాబాద్, ముంబైలలో వెలవ బోతున్న వల్లభ్భాయ్ పటేల్, ఛత్రపతి శివాజీల భారీ విగ్రహాలలాగే ఈ ప్రాజె క్టులు కూడా దేశానికి గర్వ కారణమైనవి. ఈ బుల్లెట్ ట్రైన్ మరో రెండు గుజరాతీ నగరాలకు కూడా సేవలను అంది స్తుండటాన్ని కూడా ఈ ప్రాజెక్టు సమంజసమైనదనడానికి కారణంగా చూపు తున్నారు. వాటిలో వడోదర అహ్మదాబాద్కు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటే, సూరత్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. వడోదర నుంచి ముంబైకి పలు విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. సూరత్లోని నా తల్లిదండ్రులను చూడటానికి నేను వారానికి ఒక్కసారే వెళ్లగలిగేవాడిని. బెంగళూరు నుంచి అక్కడికి వారానికి ఒక్క విమాన సర్వీసే ఉండేది. మరి ఇప్పుడు అదీ లేదనుకోండి. 2014 నవంబర్ 6న సూరత్ విమానాశ్రయంలో ఒక స్పైస్జెట్ విమానానికి ప్రమాదం జరిగింది. ‘‘విమా నాశ్రయం ప్రహారీ గోడకు ఒక చోట కన్నం ఉండటంతో గేదె ఒకటి రన్ వే మీదకు దూసుకు వచ్చింది. ఆ జెట్ విమానం దాన్ని ఢీకొంది. బోయింగ్ 737 విమానం ఇంజను తీవ్రంగా దెబ్బతింది, విమానం ఆగిపోయింది. గేదె చచ్చి పోయింది’’ అని వార్తా కథనం. పౌర విమానయాన శాఖ ఈ ప్రమాదంపై‘‘పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ చేత, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేత రెండు విచారణలకు ఆదేశించింది, దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల పరిధి భద్రతపై సమీక్షకు ఆదేశించింది. మంత్రి అశోక గజపతిరాజు ఈ ఉదయం రెండు గంటలపాటు సమావేశం జరిపి, అన్ని విమానాశ్రయాలకు హద్దులకు ముళ్ల కంచెలు లేదా ఇటుక గోడలకు బదులు కాంక్రీటు గోడలను నిర్మించాలని ఆదేశించారు’’ అని కూడా ఆ కథనం తెలిపింది. చూడబోతే ప్రభుత్వం సంపన్నుల ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు చేయాలని తెగ ఆరాటపడిపోతోందని అనిపిస్తోంది. ఇలాంటి ఖర్చు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేట్టు చేస్తుంది, తద్వారా చివరికి దేశానికి మేలు జరుగుతుంది అనే ఊహపై అది ఆధారపడుతున్నట్టుంది. అలాగే అనుకున్నా సూరత్ నుంచి ముంబైకి మాత్రమే అటూ ఇటూ చేరవేసే బుల్లెట్ ట్రైన్ కంటే సూరత్ విమా నాశ్రయాన్ని పనిచేయగల స్థితిలో, సురక్షితమైనదిగా ఉంచడం మేలవుతుంది. దాని వల్ల సూరత్ దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానమవుతుంది. గేదె ఉదంతం ప్రజోపయోగ స్థలాలను సురక్షితంగా, శుభ్రంగా ఉంచడంలో భారత దేశపు అశక్తతను ఎత్తి చూపుతుంది. ఇంతకు ముందు చెప్పిన రూ. 10,000 కోట్ల వ్యయం పైన ఎత్తున ఉండే రైలు మార్గం కోసం ఉద్దేశించినది. అంటే భార తదేశపు గందరగోళానికి ఎగువ నుంచి బుల్లెట్ ట్రైన్ నడుస్తుందని అర్థం. ఇది బడాయికోరు ప్రాజెక్టు. ఆరోగ్యం. విద్యల కోసం ఉపయోగపడే డబ్బును ఇది పీల్చిపారేసేది. అత్యధిక భారతీయులకు ఏ మాత్రం ఉపయోగపడనిది. పైగా అహ్మదాబాద్, ముంబైలలో నివసించేవారికి, ఆ రెండు నగరాల మధ్య తిరిగే వారికి సైతం దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ రెండు నగరాల మధ్య మంచి రవాణా సదుపాయాలున్నాయి. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: ఆకార్ పటేల్ ఈ–మెయిల్ : aakar.patel@icloud.com -
భయానక ప్రపంచం వైపు మీడియా పయనం..!
అవలోకనం సోషల్ మీడియా వార్తాపత్రికలకు ప్రత్యామ్నాయం కాదు. వార్తాపత్రికలు గతించనున్న భవిష్యత్ కాలంలో సరైన విధంగా సమాచారాన్ని అందించే సామగ్రిని ప్రజలు తీవ్రంగా కోల్పో నున్నారు. ఉద్రేకం, ఆగ్రహం ప్రాతిపదికన పోటీపడుతున్న అర్నాబ్ తదితర యాంకర్లతో పూర్తిగా ప్రాచుర్యం పొందిన జర్నలిజం ప్రపంచాన్ని మనం వదిలిపెడతాము. ప్రాథమిక సమాచారం కూడా లేకుండానే తమ ఫోన్లను బయటకు తీసి వ్యాఖ్యను ట్వీట్ చేసే ప్రజల్లోకి వచ్చి పడతాము. అది నిజంగానే ఒక భయానక ప్రపంచంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా మీడియానే తనకు తానుగా వార్తల్లో నిలిచింది. మొదటగా భారత్లో అత్యంత జనరంజక ఇంగ్లిష్ జర్నలిస్టు, మైలురాయిని నెలకొల్పిన టీవీ షో యాంకర్ తన పదవి నుంచి వైదొలిగారు. భారత్లో జర్నలిజం దిశ దశను నిర్దేశించిన దశాబ్దానికి ముగింపు పలకాలని అర్నాబ్ గోస్వామి నిర్ణయించుకున్నారు. రిపోర్టింగ్ ద్వారా కాకుండా యాంకరింగ్ ద్వారా అతడు దీన్ని సాధిం చారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ కొద్ది రోజుల క్రితం సాక్షాత్తూ ప్రధానమంత్రి ముందే ఒక సంచలన ప్రసంగం చేస్తూ ‘సెల్ఫీ జర్నలిజం’ అనే భావనను ప్రతి పాదించారు. ప్రపంచం వైపుకు కాకుండా జర్నలిస్టు వైపు కెమెరాను ఫోకస్ చేసే జర్నలిజంగా ఆయన వర్ణించారు. కనీసం భారత్లో అయినా గోస్వామి ఈ తరహా శైలికి మార్గదర్శిగా, దాని అత్యుత్తమ ప్రతినిధిగా అయ్యారు. అన్ని ఇంగ్లిష్ చానల్స్కు మాదిరే తన చానల్కు కొద్దిమంది వీక్షకులే ఉంటు న్నారు. ప్రత్యేకించి ఆ చానల్ వాణిజ్యపరంగా కూడా పెద్ద చానల్ ఏమీ కాదు. ఎందుకంటే వార్తా చానళ్ల కంటే వార్తాపత్రికలే ఇప్పటికీ అధికంగా డబ్బు సంపా దిస్తున్నాయి. అయితే నగర ఉన్నత వర్గాలు అతడి షోను చూసేవి కాబట్టి అతడి చానల్ ప్రభావశీలంగా ఉండేది. ఈ కారణం వల్లే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యా లయంలో నినాదాలు, ఒక ప్రముఖ వ్యక్తి కుమార్తె హత్య వంటి కథనాలపై అర్నాబ్ ఎంతో ఉద్రేకంగా మాట్లాడేవారు. నిజానికి ఇవి చాలామంది భారతీయు లకు అసంగతమైన కథనాలు. దారిద్య్రం, నిరక్షరాస్యత, ఆకలి వంటి సమస్యలు అతడి షోలో కనిపించవు. పాకిస్తాన్ ఉగ్రవాదం, సర్జికల్ దాడుల పైనే అతడు పట్టించుకుంటాడు. సమతుల్యత లేని అతడి సుదీర్ఘ, గంభీరోపన్యాసాలు అతడి దేశానికి హాని కలిగించాయనడం నిజమే. కానీ తాను చేస్తున్న పనిలో అతడు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించడం కూడా అంతే నిజం. మరి అతడిప్పుడు ఎందుకు తన స్థానం నుంచి వైదొలిగాడు. బహుశా తానిం తవరకు చేసినదానిపట్ల వేగిపోయివుండవచ్చు. అలాంటి ప్రదర్శనలు తనకిక అవ సరం లేదని అనుకుని ఉండవచ్చు. సొంత చానల్ను కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది నిజమే అయితే, జర్నలిస్టుకు ఒక వేదిక చాలా ముఖ్యమైనదని అతడు గుర్తిస్తాడని ఆశిస్తాను. ఒక చోట ప్రాచుర్యం పొందిన వారిలో అనేకులు మరొక చోట పూర్తిగా విఫలమయ్యారు. గ్లెన్ బెక్ సొంత చానల్ స్థాపించక ముందు ఫాక్స్ న్యూస్ చానల్లోని స్టార్ జర్నలిస్టులలో ఒకడు. కానీ అతడి సొంత చానల్ విఫలమైంది. అర్నాబ్కు శుభాకాంక్షలు చెబుతున్నాను. భారతీయులను నిజంగా ప్రభావితం చేస్తున్న అంశాలపై ఇకపై అతడు నివేదిస్తాడని ఆశిస్తున్నాను. ఇక రెండో కథనం... జాతీయ భద్రతను ప్రమాదంలో పడవేసిన, సున్నిత సమాచారాన్ని నివేదించిందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం మరొక వార్తా చానల్ ఎన్డీటీవీపై ఒక రోజు నిషేధం విధించింది. అనేక వార్తా చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేసిన పఠాన్కోట్ దాడిపై నివేదన అది. అయితే ప్రభుత్వం సూచిస్తున్నంత ప్రమా దాన్ని నిజానికి ఎన్డీటీవీ కవరేజ్ కలిగించలేదని రిపోర్టులు చెబుతున్నాయి. మీడి యాను భారీగా సెన్సార్ చేసిన ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీతో ప్రస్తుత ఒక రోజు నిషేధాన్ని పోలుస్తూ ఎడిటర్స్ గిల్డ్ ప్రకటన కూడా చేసింది. వాస్తవానికి ఆ కవరేజ్ ఎంత హాని కలిగించిందనేది మనకు తెలీదు. పైగా ఎన్డీటీవీ చాలా జాగరూకత, యథాతథమైన చానల్ అనిదాని వీక్షకులకు తెలుసు. అయితే టెలివిజన్ వార్తల కవరేజీ సాధారణంగానే ప్రమాదకరంగా మారు తోందని చెప్పగలను. రిపోర్టింగ్పై కాక, వ్యాఖ్యానం ప్రాతిపదికనే టీవీ ప్రసా రాలకు సంబంధించి పెట్టుబడి సమకూరుతోంది కాబట్టి టీవీ మాధ్యమం చాలా నిర్లక్ష్యంగా ఉంటోంది. పైగా, ఆ వార్తను పూర్తిగా పరిశీలించి, అర్థం చేసుకోవ డానికి ముందే వార్త ప్రసారం అయిన వెంటనే వ్యాఖ్య ప్రారంభమవుతోంది. టీవీ మీడియా స్వభావమే అలాంటిది. దురదృష్టవశాత్తూ విషయాల్లో మార్పు జరగడం లేదు. వార్తల్లోని మూడో అంశం ఏదంటే, భారతీయ పాఠకుల సర్వేని ఎలా నిర్వహిస్తున్నారన్న విషయాన్ని ఒక వార్తా నివేదిక వర్ణిస్తోంది. ఇది చాలా పెద్ద పని. తాము ఏ వార్తా పత్రికలు, మ్యాగజైన్లు చదువుతున్నామనే అంశంపై లక్షలాది పాఠకులు సర్వేలో పాల్గొంటారు. పాఠకుల సంఖ్యలో వివాదం నెలకొనడంతో కొన్నేళ్లుగా సర్వే ఫలితాలను వెల్లడించడం లేదు. పాఠకుల సంఖ్య మొత్తంమీద తగ్గుతోందని అనేక పత్రికలు తెలుపుతున్నాయి. పాశ్చాత్య ప్రపం చంలో కూడా వార్తాపత్రికల పఠనం, దాని ద్వారా వచ్చే ఆదాయాలు వేగంగా పడిపోతున్న ధోరణి కనిపిస్తోంది. సర్వే ఎప్పుడు వెలుగులోకి వచ్చినా భారతీయ ప్రచురణలను కూడా ఈ ధోరణి ప్రభావితం చేస్తున్నట్లు అది చూపుతుందనే నా అంచనా. మ్యాగజైన్లు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వార్తా పత్రి కలు కూడా త్వరలోనే దీన్ని అనుసరించబోతున్నాయి. నా ఉద్దేశంలో ఇది మన దేశానికి అతి పెద్ద విషాదం. సీరియస్ జర్నలిజంలో టీవీ ఆసక్తి చూపని వాతావరణాన్ని మనం ఇప్పటికే చూస్తున్నాం. వార్తాపత్రికల లాగా టీవీ మాధ్యమం వార్తల రిపోర్టుతో ముడిపడటం లేదు. నా దృష్టిలో సోషల్ మీడియా వార్తాపత్రికలకు ప్రత్యామ్నాయం కాదు. పరిచయాలతో, క్షేత్రస్థాయి అనుభవాల ప్రాతిపదికన రాసే పూర్తి కాలం రిపోర్టర్ల స్థానాన్ని 140 కేరక్టర్ల పరిశీ లనలను పంపే లక్షలాది ప్రజలు పూరించలేరు. వార్తాపత్రికలు గతించనున్న భవి ష్యత్ కాలంలో సరైన విధంగా సమాచారాన్ని అందించే సామగ్రిని ప్రజలు తీవ్రంగా కోల్పోనున్నారు. వార్తా పత్రికలు లేని ప్రపంచంలోకి పరివర్తన త్వరలో జరిగినట్లయితే, పత్రికలు వదిలివెల్లిన చోటును అందుకునేందుకు తగిన మీడియా ఉండబోదని నేను ఆందోళన చెందుతున్నాను. ఉద్రేకంతో, ఆగ్రహంతో పోటీపడుతున్న అర్నాబ్ వంటి యాంకర్లతో పూర్తిగా ప్రాచుర్యం పొందిన జర్నలిజం ప్రపంచాన్ని వదిలి పెడతాము. ప్రాథమిక సమా చారం లేకుండానే తమ ఫోన్లను బయటకు తీసి వ్యాఖ్యను ట్వీట్ చేసే ప్రజల్లోకి వచ్చి పడతాము. అది నిజంగానే ఒక భయానక ప్రపంచంగా ఉంటుంది. (వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com) -
కృత్రిమ మేధ మానవాళికి విసరనున్న సవాలు
అవలోకనం మనిషి తన స్వయం ప్రతిపత్తిని కోల్పోవడం, ప్రభుత్వానికి ఉండే స్వయం ప్రతిపత్తి విస్తరించడం అనేదే కృత్రిమ మేధస్సు విసిరే అతి పెద్ద సవాలు. ఒక స్వీయ చోదక కారు మనిషి కంటే సురక్షితమైనది, తప్పులు చేయనిది అయితే అదే మెరుగైనది. దీన్ని ఆమోదిస్తే, కృత్రిమ మేధస్సు మానవ మేధస్సుకంటే ఉన్నత శ్రేణుకి చెందినది. అప్పుడిక మనుషులు తమపై నియంత్రణను ఈ కృత్రిమ మేధస్సుకు వదులుకోవాల్సి ఉంటుంది. దీని పర్యవసానాలు ఏమిటి? తెలియదు. మానవ జాతి తన అస్తిత్వంలోని అత్యంత అసాధారణమైన దశ గుండా నేడు పయనిస్తోంది. ముందు ముందు టెక్నలాజికల్ సింగ్యులారిటీ అనే పరిణామం సంభవించ నున్నదని నిపుణులు జోస్యం చెబుతున్నారు. మామూలు మాటల్లో చెప్పాలంటే సింగ్యులారిటీ అనే ఈ పదం రెండు విషయాలను సూచిస్తుంది. ఒకటి భవిష్యత్తులో మనం సృష్టించనున్న మానవ మేధస్సును మించిన తెలివితేటలు గల కృత్రిమ మేధస్సు. రెండవది ఆ కృత్రిమ మేధస్సు మానవుల వల్లకానంతటి వేగంతో సమస్యలను పరిష్కరించడం. కృత్రిమ మేధస్సును సృష్టించిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందని సైతం మనిషి ఊహించజాలనంతటి అపారమైన మార్పు ఇదని నిపుణులు భావిస్తున్నారు. ఉదాహరణకు, ఈ కృత్రిమ మేధస్సు జన్యు నిర్మాణాన్ని (జెనెటిక్ ఇంజనీరింగ్) తెలుసుకోగలిగి, వ్యాధులకు సంబం ధించిన ప్రతి సమస్యను పరిష్కరించ కలుగుతుంది. ఇప్పుడు ఉన్న వారిలో అంత వరకు బతికుండే వారంతా ఆ మార్పును చూడగలుగుతారు. ఈ సమయంలో మనం ఊహించగలిగినదానికంటే ఎక్కువ వేగంగా ఆ కృత్రిమ మేధస్సు తన తెలివితేటలను పెంపొందింపజేసుకుంటుంది. ఇంతకూ ఈ పరిణామాలు ఎప్పటికి సంభవించవచ్చు? ఇంచుమించు 2040 నాటికి, అంటే 24 ఏళ్లలో జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరు ఇంకా త్వరగానే రావచ్చని కూడా అంటున్నారు. ఈ టెక్నలాజికల్ సింగ్యులారిటీ (సాంకే తిక ఏకైకత)ని సంశయవాద దృష్టితో చూసే నిపుణులు సైతం లేకపోలేదు. కానీ వారు కూడా ఈ పరిణామం సంభవించనున్నదనే దాన్ని నిరాకరించడం లేదు. మనం ఊహిస్తున్నదాని కంటే కొంత మెల్లగా జరుగుతుందని అంటున్నారంతే. (మానవ మేధస్సుకంటే అపారమైన తెలివి తేటలుగల కృత్రిమ మేధస్సుతో పని చేసే సాంకేతిక వ్యవస్థలు లేదా అపార మేధస్సుగల యంత్రాలను తయారు చేసే సాంకేతికతను స్థూలంగా టెక్నలాజికల్ సింగ్యులారిటీ అనవచ్చు). కంప్యూటర్లు ఇప్పటికే దిగ్భ్రాంతికర వేగంతో మరింత తెలివైనవిగా మారుతున్నాయి. ఈ ఏడాది కృత్రిమ మేధస్సు ఒక నోబెల్ బహుమతిని గెలుచు కున్న ప్రయోగాన్ని గంటలో అర్థం చేసుకోవడమేగాక, తిరిగి చేసి చూపింది. ఈ ఏడాదే ఒక గూగుల్ కంప్యూటర్ సంక్లిష్టమైన గో అనే చైనా ఆటలో మానవ చాంపియన్ను ఓడించింది. గో ఆటలో చదరంగంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంభావ్యతలు ఉంటాయి. కాబట్టి కంప్యూటర్ గెలవగలదని ఊహించనే లేదు. ఒక యంత్రం గో మానవ ప్రపంచ చాంపియన్ను ఓడించడం సుదూర భవిష్యత్తు లోనే జరుగుతుందని అనుకున్నారు. ఎప్పుడో సుదూరంలో జరుగుతాయనుకున్న ఎన్నో మార్పులు ఈ ఏడాదే వచ్చేశాయి. ఉదాహరణకు, స్వీయ చోదక కార్లు. టెస్లా అనే అమెరికన్ కంపెనీ అమ్ముతున్న వేలాది మోటారు వాహనాలకు డ్రైవర్ అవ సరం లేని స్వీయచోదక శక్తి ఇప్పటికే ఉంది. ఈ కారు తన చుట్టూ ఏముందో గమ నిస్తూ, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పయనించగలదు. తన వెనుక ఏము న్నదో గ్రహించి మార్గాన్ని మార్చుకోగలుగుతుంది కూడా. ఈ కార్లలో ఒకటి ఈ ఏడాది మొదట్లో ప్రమాదానికి గురై డ్రైవర్ మరణించాడు. అయితే ఇప్పటికే, గత కొన్ని వారాల్లో తమ సాంకేతికతను ఎంతో మెరుగుపరచామని టెస్లా అంటోంది. మనలో చాలా మంది వయోజనులకు భవిష్యత్తు గురించిన ఈ చిత్రమైన కథలు కొత్తేమీ కాదు. 1980లలో జపాన్ కార్ల తయారీదారులు తమ ఫ్యాక్టరీలలో పెద్ద పెద్ద భాగాలను ఆటోమేషన్కు గురిచేసినప్పుడు రోబోలు మనుషుల ఉద్యో గాలను భర్తీ చేయడం గురించి విన్నాం. అయితే మనం భయపడినంత వేగంగా ఆ మార్పు జరగలేదు. కానీ ఈసారి ఇది విభిన్నమైనది. సమాచార సాంకేతికత ఏడాదికేడాది వేగాన్ని పుంజుకుంటూ శరవేగంతో పురోగమిస్తుండటమే అందుకు కారణం. ప్రతి రెండేళ్లకు కంప్యూటింగ్ (గణింపు) వేగం రెట్టింపు అవుతుండటం ఈ వేగానికి ఒక కారణం. మనలో గత పదిహేనేళ్లను గమనిస్తున్నవారంతా వాస్త వంగా సాంకేతికత ఎంత త్వరితగతిన మారిపోతోందో గమనించగలుగుతారు. ఇంత వేగం అంటే, ప్రతి దశాబ్దికి ఈ మార్పులు అంతకు ముందటి దశాబ్ది కంటే ఎంతో ఉన్నత శ్రేణికి చెందినవిగా మారుతున్నాయని అర్థం. మనం కంప్యూ టర్ల యుగంలోకి ప్రవేశించి కొన్ని దశాబ్దాలు మాత్రమే అయింది. అందువలన వచ్చే 24 ఏళ్లలో రానున్న మార్పులను గత 24 ఏళ్లలో వచ్చిన మార్పుల వంటివిగా చూడటానికి వీల్లేదు.ఈ మార్పు పర్యవసానాలు ఏమిటో ఊహించజాలమని నిపు ణులే అంటున్నారంటే ఇది ఎంత భారీదో, గొప్పదో ఊహించుకోవచ్చు. యూరప్ పౌరులతో పోలిస్తే భారత ఉపఖండంలో మనకు రానున్న ఈ మార్పు కొన్ని విధాలుగా విభిన్నమైనది. యూరోపియన్లకు పేదరికం, నిరక్షరా స్యత, పోషకాహార లోపం అనే గతం నుంచి సంక్రమించిన సమస్యలు లేవు. సాంకేతికతను అనుమతిస్తే సులువుగానే ఈ సమస్యలు పరిష్కారమైపోతాయి. మనిషి తన స్వయం ప్రతిపత్తిని కోల్పోవడం, ప్రభుత్వానికి ఉండే స్వయం ప్రతిపత్తి విస్తరించడం అనేదే కృత్రిమ మేధస్సు విసిరే అతి పెద్ద సవాలు అవు తుంది. నేను చెప్పదలుచుకున్న దాని అర్థం ఇది: మానవ కృషి లేకుండానే నడు స్తుంది కాబట్టి ఒక స్వీయ చోదక కారు మనిషి కంటే మెరుగైనది అవుతుంది. అది మరింత సురక్షితమైనది, తప్పులు చేయనిది కావడం వల్ల కూడా అదే మెరుగైన దవుతుంది. ఈ సూత్రాన్ని ఆమోదించేట్టయితే, సృష్టించిన కృత్రిమ మేధస్సు మానవ మేధస్సుకంటే ఉన్నత శ్రేణుకి చెందినది, తనకు తానుగా వేగంగా తన శక్తిసామర్థ్యాలను పెంపొందింపజేసుకోగలిగేది అయితే... అప్పుడిక మనుషులు తమపై నియంత్రణను ఈ కృత్రిమ మేధస్సుకు వదులుకోవాల్సి ఉంటుంది. దీని పర్యవసానాలు ఏమిటి? నిపుణులు తమకు తెలియదని అంటున్నారు. వారిలో చాలామంది కృత్రిమ మేధస్సు మానవాళికి కలిగించగల ప్రమాదాల గురించి చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మానవ జాతిగా మనం, మన అస్తి త్వంలోని అత్యంత అసాధారణమైన దశ గుండా పయనిస్తున్నాం. భారతీయు లలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వయస్కులే. మనలో చాలా మంది రాబోయే ఇరవై నాలుగేళ్లను కళ్లారా చూస్తారు. వ్యాసకర్త : అకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఆందోళనకరంగా దూసుకొస్తున్న ఆటోమేషన్
అవలోకనం మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆందోళన చెందాల్సిన ఒక విషయం ప్రస్తుతం బిజినెస్ వార్తా పత్రికలకే పరిమితమైంది. అది, భారత సమాచార సాంకేతికతకు, సాఫ్ట్వేర్ పరిశ్రమకు, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలకు సంబంధించినది. గత రెండు దశాబ్దాలుగా త్వరితగతిన విస్తరించిన ఈ కంపెనీల వృద్ధి మందగించిపోయింది. ప్రస్తుతం అవి ఒక్క అంకె వార్షిక వృద్ధితో నడుస్తున్నాయి. దాన్ని కొనసాగించడానికీ తంటాలు పడుతున్నాయి. భారత్లో ఐటీ పరిశ్రమ మరణశయ్యపై ఉందనే ఊహాగానాలకూ అది దారి తీస్తోంది. మానవ పెట్టుబడి స్థానంలో ఆటోమేషన్ (మనుషులు చేసే పనిని అత్యాధునిక సాంకేతికతతో తయారయ్యే యంత్రాలే నిర్వహించడం) ప్రవేశించడం అందుకు ఒక కారణం. ఇది, ఆ కంపెనీలు అందించే సేవలను, వాటిలోని వందల వేల ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఇన్ఫోసిస్ మాజీ నేత మోహన్ దాస్ పాయ్ సరైన దృక్కోణం నుంచి ఈ పరిణామాన్ని చక్కగా వివరిస్తూ ఓ వ్యాసం రాశారు. మార్పు రానున్నా అందుకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వ్యవధి పడు తుంది, భారత ఐటీ కంపెనీలు ఆ మార్పును ఎదుర్కోగల మంచి స్థితిలోనే ఉన్నా యని ఆయన అభిప్రాయం. ఆయన ఇలా రాశారు ‘‘నేటి పరిస్థితిని చూద్దాం. భారత సాఫ్ట్వేర్ ఎగుమతుల పరిశ్రమ దాదాపు 11,000 కోట్ల డాలర్ల విలువైనది. అది దాదాపు 42.50 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. ప్రపంచ ఔట్సోర్సింగ్లో దాని మార్కెట్ వాటా 60 శాతం, ప్రపంచంలో దానిది ఆధిపత్య స్థానం. మార్కెట్ విలువను బట్టి పది అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీలలో భారత కంపెనీలు ఐదు. అగ్రశ్రేణి ఐదు సంస్థలలో నైతే మూడు భారత్వి. వాటన్నిటికీ భారత్లో భారీ ఉనికి ఉంది. ఈ 10 కంపెనీ లలోని దాదాపు 20 లక్షల మంది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం భారత్ కేంద్రంగా చేస్తున్నవారు లేదా భారత్ నుంచి బయటకు వె ళ్లినవాళ్లు. విదేశాలలోని భారత సాఫ్ట్వేర్ పరిశ్రమ ప్రపంచ సాఫ్ట్వేర్ సేవల రంగంలో అధిపత్య స్థానంలో ఉంది. దానికి సాటి ఏదీ లేదు.’’ ప్రపంచ స్థాయి నాయకత్వంలో మన పెద్ద కంపెనీలకు అనుభవం ఉంది, అసాధారణ ప్రతిభగల మేనేజ్మెంట్ సైతం వాటికి ఉంది. కాబట్టి అవన్నీ ఈ మార్పును తమకు సాధ్యమైనంత అత్యుత్తమమైన రీతిలో ఎదుర్కోగలుగుతాయనే మనమంతా ఆశించాలి. అయితే ఈ మార్పు వ్యవస్థాగతమైనదని, ఉన్నదాన్ని ఛిద్రం చేసేదని అభిప్రాయపడుతున్నవారు కూడా ఉన్నారు. కొన్ని వారాల క్రితం నేను హైదరాబాద్లో జరిగిన ఒక సెమినార్లో మాట్లా డాను. ఐబీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) కార్యక్రమమైన ‘వాట్సన్’ విభాగాధిపతి మనోజ్ సక్సేనా కూడా ఆ కార్యక్రమంలో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయం బాగా ఆందోళన కలిగించేదిగా ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో సాంకేతికతలో రానున్న మార్పులను ఆయన వివరించారు. ఆ పరివర్తనకు తగిన విధంగా మనం సంసిద్ధమై లేమన్నట్టు మాట్లాడారు. మన కంపెనీలు ఇప్పటికి ఉన్న వందల వేల కోట్ల డాలర్ల వ్యాపారాలపైనే దృష్టి కేంద్రీకరణను కొనసాగిస్తున్నాయని, ఇది వంద మైళ్ల వేగంతో పోతున్న కారు టైర్లను మార్చడం లాంటిదని అన్నారాయన. మనలో చాలా మంది ఊహిస్తున్న దాని కంటే మరింత వేగంగా ఆటోమేషన్ దూసుకొస్తోంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పాయ్ ఇలా అన్నారు: ‘‘నేడు ఏడాదికి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తున్న వారు (మధ్యస్త స్థాయి మేనేజర్లు) చాలా మందే ఉన్నారు. వారిలో సగం మంది రాబోయే పదేళ్లలో ఉద్యోగాలు కోల్పోతారు.’’ ఆయన చెప్పేదాన్ని బట్టి, భారత ఐటీ పరిశ్రమలోని మొత్తం ఉద్యోగులలో 10 శాతం లేదా 4,50,000 మంది మధ్యస్త స్థాయి మేనేజర్లు ఉంటారు. వీరిలో 2,25,000 మంది, వారి పనిని ఆటోమేషన్ చేయడం వల్ల వచ్చే దశాబ్ద కాలంలో ఉద్యోగాలు కోల్పోతారు. ఇది అనేక విధాలుగా విచారకరమైన వార్త. ఒకటి, భారత ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ పనిలో తమ మార్కెట్ వాటాను కాపాడుకున్నా, ఆ పని ఆటోమేట్ అయిపోతుంది. అంటే తక్కువ మంది ఉద్యోగులే ఉంటారు. రెండు, ఆటోమేషన్ వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో ఉద్యోగాలు క్షీణిస్తున్నాయి. వాస్తవానికి రోబోటిక్స్ సాంకేతికత కొన్ని తయారీ రంగ ఉద్యోగాలు తిరిగి పాశ్చాత్య దేశాలకు తిరిగి రావడానికి కారణమైంది కూడా. మూడు, భారత్ మరింత సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి తంటాలు పడుతున్న దశలో ఈ ఐటీ రంగ పరివర్తన రావడం. ఉద్యోగ కల్పనకు సంబంధిం చిన గణాంకాలన్నీ ఆందోళనకరంగానే ఉన్నాయి. నాలుగు, ఉద్యోగాల సమస్యపై జనాభాలోని పెద్ద విభాగాలలో ఇప్పటికే అసంతృప్తి ప్రబలివుంది. మూడు లేదా నాలుగు అత్యంత పారిశ్రామికీకరణ చెందిన రాష్ట్రాలు గుజరాత్, హరియాణ, మహారాష్ట్రలలోని ఆధిపత్య కులాలు ఈ సమస్యపై ఇప్పటికే ఆందోళన సాగిస్తున్నాయి. పటేళ్లు, జాట్లు, మరాఠాలు ఉద్యోగాల విషయంలో తమకు ప్రభుత్వ సహాయం అందడం అవసరమని భావి స్తున్నారు. అయితే ప్రధానంగా వారు చాలా వరకు పట్టణాలకు చెందినవారే. బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, గుర్గావ్ కేంద్రంగా ఉన్న మన ఐటీ పరిశ్రమలో అగ్ర కులాల వారికి చాలా ఎక్కువగా ఉద్యోగాలు లభించాయి. ఈ వర్గం, తమకు ఇంగ్లిష్ విద్య, సేవారంగ ఉద్యోగాలు సులువుగా అందు బాటులో ఉండటంతో రిజర్వేషన్లకు వ్యతిరేకం. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతలో వేగంగా మార్పులు సంభవించడం అంటే అర్థం, ఇకపై ఈ పరిస్థితి ఇలా ఉండదని అర్థం. ఇది, ప్రభుత్వానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని నా అభి ప్రాయం. అయినా రానున్న ఈ మౌలిక మార్పుల గురించి, అవి తమ జీవితాలను ఎలా ప్రభావితం చేయనున్నాయనే దాని గురించి భారతీయులందరికీ తెలిసి ఉండటం అవసరం. ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
హిందుత్వ అమ్ముల పొదిలో ఉమ్మడి పౌర స్మృతి
అవలోకనం నేడు దేశానికి నేతృత్వం వహిస్తున్న పార్టీ హిందుత్వ అని పిలిచే భావజాలాన్ని కలిగిన పార్టీ. ఆ భావజాలం డిమాండ్లు మూడు. ఒకటి భారత రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం. రెండు అయోధ్యలో రామ జన్మ భూమి ఆలయాన్ని నిర్మించడం. మూడు ఉమ్మడి పౌర స్మృతిని అమలుపరచడం. ఈ మూడు డిమాండ్లూ మైనారిటీ మతస్తులు ఎంతో కొంత వదులుకోవాలని కోరు తున్నవే. కశ్మీర్లో మెజారిటీగా ఉన్న ముస్లింలు రాజ్యాంగబద్ధమైన తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని వదులుకోవాల్సి వస్తుంది. ఆలయానికి వస్తే, ముస్లింలు తమ మసీదును వదులుకోవాల్సి ఉంటుంది. ఇక ఉమ్మడి పౌర స్మృతి కోసం వారు తమ సొంత పౌర స్మృతిని విడనాడాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఈ డిమాండ్లు సానుకూలమైనవి కావనీ, ప్రతికూలాత్మక మైన అధిక సంఖ్యాకవాదం నుంచి పుట్టుకొచ్చినవనీ భావించడం సాధ్యం అవు తోంది. అంటే పైకి కనిపిస్తున్న దానికి భిన్నంగా ఆ మార్పులు సదుద్దేశాలతో కూడినవి కావని అనిపిస్తోంది. హిందుత్వ శక్తులు అయోధ్యలోని మసీదును కూల గొట్టడంతోనే ఆలయ నిర్మాణ ఉద్యమానికి ఏ గతి పట్టిందనేదే ఈ వాదనకు విశ్వ సనీయతను కల్పించింది. ఆలయ ఉద్యమం మరింత ఎక్కువ ప్రతికూలాత్మక మైనది కావడంతో కుప్పకూలింది. అంటే ఆ ఉద్యమం ఆలయ నిర్మాణానికి అనుకూలమైనదిగా కంటే ఎక్కువగా మసీదుకు వ్యతిరేకమైనదని అనిపించింది. అధికరణం 370కి సంబంధించి... జమ్మూకశ్మీర్ను పూర్తిగా విలీనం చేసే విష యంలో న్యాయపరమైన సమస్యలెన్నో ఉన్నాయి. అయినా అధికార భావజాలం అసలు ఉద్దేశమేమిటో నేటి కశ్మీర్ పరిస్థితిలో బహుశా చూచాయిగా గ్రహించ వచ్చు. పాకిస్తాన్లో మన సైనిక చర్యపై అతి జాతీయాభిమాన ప్రదర్శనలోని ప్రస్తుత ఘట్టం కశ్మీర్ ఘటనలను కప్పేసింది. కానీ ఆలస్యంగానైనా అక్కడి పరిస్థితిని ఎలా సంబాళించుకు రావాలనే దానిపై మనం దృష్టి సారించక తప్పదు. ఉమ్మడి శిక్షా స్మృతి డిమాండు ఇప్పుడు ఊపందుకుంటోంది. రెండు దశలుగా అది జరుగుతోంది. అందులో మొదటిది పురుషులు ఆధిపత్యం వహించే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కొనసాగాలని కోరుతున్న మూడు తలాక్ల వ్యతిరేక కార్యా చరణ. మూడుసార్లు తలాక్ అనడమనే ఈ పద్ధతి అతి త్వరితంగా విడాకులు తీసుకోడానికి మగాళ్లను అనుమతించే పద్ధతి. పాకిస్తాన్ సహా చాలా ముస్లిం దేశాలు దీన్ని అనుమతించవు. ప్రభుత్వం దాన్ని చట్ట విరుద్ధమైనదిగా చేయాలని అనుకుంటోంది, కోర్టులు దాని పక్షానే ఉన్నాయి. అదే జరిగితే, పెద్ద సంఖ్యలో అరెస్టులు జరగడాన్ని చూడాల్సి ఉంటుంది. ఇక రెండవది బహు భార్యత్వం సమస్య. హిందుత్వ అసలు ప్రయోజనం అందులోనే ఇమిడి ఉంది. హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ వేగంగా పునరుత్పత్తి చేస్తున్నారని, ఆ కారణంగా ఎప్పుడో ఒకప్పుడు వారు మెజారిటీగా మారిపోతారని అది భావిస్తోంది. నిజానికి బహు భార్యత్వం ముస్లింలలో కంటే హిందువులలోనే ఎక్కువని గణాంక సమా చారం తెలుపుతోంది. కానీ, ఉమ్మడి పౌర స్మృతి డిమాండ్ను ముందుకు నెట్టేంత ప్రబలంగా ఈ భావన హిందుత్వలో వేళ్లూనుకుని ఉంది. చరిత్రకారుడు రామచంద్ర గుహ కొంత కాలం క్రితం... ఉదారవాదులు, వామపక్షవాదులు ఉమ్మడి పౌర స్మృతికి ఎందుకు మద్దతు పలకాలో, బహు భార్యత్వాన్ని ఎందుకు వ్యతిరేకించాలో పేర్కొన్నారు. ఈ హిందుత్వ డిమాండు పట్ల వామపక్షవాదుల వ్యతిరేకతకు కారణం ఈ ఏడు అంశాలలో ఒకటన్నారు: 1. 1950లలో హిందూ పౌర స్మృతికి చేసిన సంస్కరణలు చెప్పుకున్నంత ప్రగతిశీలమైనవేమీ కావు. 2. నేటి హిందువులు రివాజుగా పాటిస్తున్న నియ మాలు, ఆచారాలు తరచుగా ప్రతీఘాతుకమైనవి. ఉదాహరణకు ఖాప్ పంచాయ తీలు. 3. సంస్కరణలు జరగని ముస్లిం పౌర స్మృతిలోని చట్టాలు చెబుతున్నంతగా ప్రతీఘాతుకమైనవి కావు. 4. ముస్లింలు పాటించే ఆచారాలు చెబుతున్నంత చెడ్డవేమీ కావు. కాబట్టే హిందూ బహు భార్యత్వంలో వలే ముస్లింల బహు భార్యత్వం రెండవ లేదా మూడవ భార్య పట్ల వివక్ష చూపదు. 5. ఉమ్మడి పౌర స్మృతి డిమాండు బీజేపీ రాజకీయ ఎజెండాతో ప్రేరేపితమైనది. 6. ఉమ్మడి పౌర స్మృతిని కోరే అధికరణం 44... మత ప్రచార స్వేచ్ఛకు హామీనిచ్చే అధికరణం 25తో ఘర్షిస్తుంది. 7. రాజ్యాంగంలోని ఎన్నో అధికరణాలు పరిపూర్తి కాకుండానే ఉండిపోగా, దీనిపైనే ఎందుకు ఇంత రభస చేస్తున్నారు? గుహ ఒక అంశాన్ని, అదీ ఒక ముఖ్య అంశాన్ని విస్మరించారని నా అభి ప్రాయం. అది, కొందరు ఉదారవాదులు (వ్యక్తుల హక్కుల కోసం ఉద్యమించే వారు) ఈ సంస్కరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది. అది, రెండో భార్యగా లేదా రెండో భర్తగా ఉండటానికి (బహు భర్తృత్వం మన దేశంలో కొన్ని జాతులలో అమలులో ఉంది) స్త్రీకి లేదా పురుషునికి ఉండే హక్కు కాబట్టి. 90 శాతం ముస్లిం మహిళలు బహు భార్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న మాట నిజమే. అయితే 90 శాతం ముస్లిం మహిళలు ఏక పత్నీ వివాహ బంధాలలోనే జీవిస్తున్నారు కూడా. కాబట్టి బహు భార్యత్వ వివాహ బంధంలో ఉన్నవారు ఈ ఆచారాన్ని ఎలా చూస్తున్నారనే అంశంపై జరిపే అధ్యయనం ఆసక్తికరంగా ఉంటుంది. గుహ, బహు భార్యత్వం ‘‘హేయమైనది,’’ తప్పక ‘‘నిషేధించాల్సినది’’ అంటున్నారు. ఇది నైతికపరమైన తీర్పని నా అభిప్రాయం. స్వలింగ సంపర్కం గురించి భారత చట్టం, వరుసగా వచ్చిన వివిధ ప్రభుత్వాలు అదే విషయాన్ని చెబుతూ వచ్చాయి. కానీ ఉదారవాదులు ఈ సందర్భంలో కూడా వ్యక్తి స్వతంత్రా నికి మద్దతుగా నిలుస్తారు. ఇదంతా చెప్పిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం... ప్రస్తుతం ఈ సమస్యపైకి హిందుత్వ దృష్టి కేంద్రీకరణ మరలింది. ఇక తదుపరి హిందుత్వ తన పునాదిని పటిష్టం చేసుకోడానికి బరిలోకి దిగేది మూడు తలాక్లు, బహు భార్యత్వాలపైనే అని నా అంచనా. గతంలో ఇలా జరిగిన ఇతర సమస్య ల్లాగే ఈ విషయంలోనూ మనం సమస్య తలెత్తనున్నదనే ముందు చూపుతో ఉండాలి. వ్యాసకర్త: ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
ఉన్మాదానికి విరుగుడు ఉపేక్షించడమే
అవలోకనం భారత జాతీయ ప్రయోజనాల సంరక్షకులం మనమేనన్నట్టుగా మీడియాలో చాలా మందిమి నటిస్తుంటాం. కానీ రేటింగ్లకు మించిన ప్రయోజనాలేవీ మీడియాకు లేవు. మన యాంకర్లు ప్రదర్శించే ఆగ్రహావేశంలో చాలా వరకు ప్రేక్షకులు, దేశం కోరుకుంటున్నది అదేనని నమ్మడం వల్ల కలిగేదే. దేశం యుద్ధానికి దిగడం గురించి చర్చిస్తున్న సమయంలోనే, సమాజంలో పేరున్న ఒకరు తన కుమార్తెను హత్యగావించడానికి కూడా మీడియా అంతే ప్రాధాన్యం ఇస్తుంది. మీడియా వాళ్లు తమను తామే అంతగా పట్టించుకోరు. కాబట్టి ప్రభుత్వమూ పట్టించుకోకూడదు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్తో భారత్ ఉద్దేశపూర్వకంగానే మెతకగా ఉంటోందని నమ్మేవారు చాలా కాలంగా ఉన్నారు. మన దేశంపై ఉగ్రవాద దాడి జరిగినప్పుడు హింసాత్మకంగా ప్రతిస్పందించాలని వారి అభిప్రాయం. ముంబై దాడులలోవలే పాకిస్తానీల ప్రమేయం ఉన్నదని ప్రత్యక్షంగా వెల్లడైన సందర్భా లలో కూడా భారత్ ప్రతి చర్యకు పాల్పడలేదు. నేను ప్రస్తావిస్తున్న ఈ బృందం దృష్టిలో అది తప్పు. ఆ దాడితో సంబంధం ఉన్న తమ పౌరులను పాక్ విచారిం చడం సరిపోదని, భారత్ ఇంకా ఎక్కువ చేయాలని వారి ఆలోచన. మన ప్రభుత్వ క్రియారాహిత్యం ఉద్దేశపూర్వకమైనదని, పిరికితనమని, ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఉన్నదని వారి భావన. భారత్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్నా యుద్ధానికి దిగరాదనే ఈ విధానాన్ని ‘వ్యూహాత్మక సంయమనం’ అంటారు. సంక్షోభాన్ని విషమింపజేయరాదని భావించడం ద్వారా భారత్ ఉద్దేశపూర్వకంగా తన ఆగ్రహాన్ని దిగుకుంటోందని ఈ సిద్ధాంతం చెబు తుంది. లాభనష్టాలను బేరీజు వేసి చూస్తే తేలే నిర్ధారణలు యుద్ధానికి అను కూలంగా లేకపోవడమే అందుకు కారణం. 2001లో జైషే మొహమ్మద్ పార్లమెం టుపై దాడికి పాల్పడినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి, 2008లో లష్కరే తోయిబా ముంబై దాడులకు బరి తెగించినప్పుడు మన్మోహన్సింగ్ ఈ మార్గం వైపే మొగ్గు చూపారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలాకాలంగా ఏదో ఒకటి చేసి తీరాలనే ఈ బృందంలో ఒకరుగా ఉన్నారు. ఉడీ దాడి తదుపరి, తిప్పికొడతామన్న తన మునుపటి వాగ్దానాలకు ఆయన దూరంగా జరిగినట్టు లేదా తాను చేసి చూపుతానన్న క్రియాత్మక ప్రతిస్పందనకు తటపటాయిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇందుకు చాలానే కారణాలు ఉండవచ్చు. ప్రధాని బాధ్యతలను స్వీకరించిన తర్వాత మునుపు తనకు తెలియని ఎన్నో విషయాలను ఆయన నేర్చుకుని ఉండటం అందుకు కారణం కావచ్చు. కారణం ఏదైనా, ఆయన తన మద్దతుదార్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. నిజానికి వారి దృష్టిలో మోదీ అత్యంత గౌరవనీయుడు. అయితే పాక్ సమస్యతో సతమతమయ్యే నేటి రోజులు అందుకు భిన్నమైనవి. విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నవారు మోదీ తన వాగ్దానాలను నెరవేర్చడం లేదని భావిస్తున్నారు. ఆయన ఏం చేయాలి? ప్రధానిగా మోదీకి ఉన్న సమాచారం ఈ విషయంపై వ్యాఖ్యానాలు చేస్తున్న వారి వద్ద లేదు. సాయుధ దళాలు, జాతీయ భద్రతా సలహాదారు, ఆర్థిక మంత్రి త్వశాఖల నివేదికలు ఆయన వద్ద ఉన్నాయి. అలాగే ఈ సంఘర్షణ యుద్ధంగా విస్తరిస్తే విదేశాల్లో కలిగే ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై విదేశాంగ శాఖ నివేదిక, అది దేశంలో అంతర్గతంగా కలుగజేసే ప్రభావం గురించిన హోంశాఖ, గూఢచార వ్యవస్థల నివేదికలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. భారత్కు ఎంచు కోడానికి అందుబాటులో ఉన్న అవకాశాలు ఏమిటనే దానికి సంబంధించిన అత్యు న్నత స్థాయి వివరాలను తెలుసుకునే అవకాశం అతి కొద్ది మందికే ఉంటుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మోదీ చేయాల్సిన పని ఒక్కటే... మీడియాను పట్టించుకోవడం మానే యడమే. నేను ముందే చెప్పినట్టు ఆయనకు ఉన్న సమాచారం దానికి లేదు. అయినా, ఆయనకు సలహాలు ఇవ్వకుండా, దిశా నిర్దేశన చేయకుండా... చెప్పినట్టు చేయకుంటే దుమ్మెత్తి పోయకుండా మనల్ని ఆపగలిగే దేమీ లేదు. భారత జాతీయ ప్రయోజనాల సంరక్షకులం మనమేనన్న ట్టుగా మనలో చాలా మందిమి నటిస్తుంటాం. కానీ రేటింగ్లకు మించిన ఉన్నత ప్రయోజనాలేవీ మీడియాకు లేవు. మనం అందుకు భిన్నంగా చెప్పుకున్నా నిజం మాత్రం అదే. మన యాంకర్లు ప్రదర్శించే ఆగ్రహావేశంలో చాలా వరకు ప్రేక్ష కులు, వారికి కొనసాగింపుగా దేశమూ కోరుకుంటున్నది అదేనని నమ్మడం వల్ల కలిగేదే. అది చాలా అర్థవంతమైనదే అయినా... దేశం యుద్ధానికి దిగడమనే అంశాన్ని గురించి చర్చిస్తున్న సమయంలోనే, సమాజంలోని ఒక ప్రముఖ వ్యక్తి తన కుమార్తెను హతమార్చిన ఘటనకు కూడా మీడియా అంత ప్రాధాన్యం ఇస్తుంది. మీడియా వాళ్లు తమను తామే అంతగా పట్టించుకోరు. కాబట్టి ప్రభుత్వం కచ్చితంగా పట్టించుకోకూడదు. ఇక మోదీ చక్కగా విస్మరించగలిగిన రెండో అంశం, సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతోందనేది. సామాజిక మాధ్యమాలకు సంబంధించి మోదీ ఒక చాంపియన్. ఆయనకు రెండు కోట్ల మంది ట్విటర్ ఫాలోయర్లున్నారు. దాన్ని ఆయన అద్భుతంగా ఉపయోగించుకున్నారు. సంప్రదాయక మీడియాకు తన పట్ల ఉన్న లేదా ఉన్నదనుకున్న పక్షపాత వైఖరిని తలకిందులు చేయడానికి సోషల్ మీడియా తోడ్పడిందని నిజంగానే ఆయన విశ్వసిస్తున్నారు. అయినా, ఆయన తన అనుయాయుల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయనను యుద్ధానికి దిగమని ముల్లుగర్రతో పొడిచినట్టు... ఒకప్పటి కటువైన ప్రకటనల లింకులను వారు పోస్ట్ చేస్తున్నారు. ఉడీ దాడిపై తొలి స్పందన తదుపరి మోదీ రెండు లేదా మూడు రోజుల పాటూ ట్వీటింగ్ చేయకుండా గడిపేశారు. ఇలాంటి సమయాల్లో ఆయన ఇంకా ఎక్కువ సమయం కూడా దానికి దూరంగా ఉండగలగాలి. ఎట్టకేలకు ఈ దుమారం ఎలాగూ సద్దుమణిగి పోయేదే. కాబట్టి సామాజికమాధ్యమాల నుంచి, మీడియా నుంచి అందే అరకొర సమాచారంతో ఒక తీవ్ర చర్యను పరిగణనలోకి తీసుకోవడం తెలివితక్కువ పని అవుతుంది. నేను పని చేసిన ఒక వార్తా సంస్థ కొన్ని వారాల క్రితం నన్ను ‘దేశ వ్యతిరేకి’ అని ఆరోపించింది. ఉడీ ఉగ్రదాడి జరిగేసరికి నేను విదేశాల్లో ఉన్నాను. చానళ్లు అత్యుగ్ర రూపం దాల్చిన తొలి రెండు రోజులను నేను చూడలేకపోయాను. మా నాన్న నా గురించి ఆందోళన చెంది, ఫోన్లో అది వ్యక్తం చేశారు. వాస్తవం, టీవీ సెట్లో జరిగేదానికి భిన్నమైనదని నేనాయనకు చెప్పాను. స్విచ్ ఆఫ్ చేస్తే సరి, అదే పోతుంది. మోదీకైనా నేను చెప్పేది అదే. ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
నాసిరకం సినిమాలతో ప్రేక్షకులకు బాలీవుడ్ దూరం
అవలోకనం ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటిగా ఉన్న బాలీవుడ్ సినిమాలు చూసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఆశ్చర్యకరం. మౌలిక వసతుల సమస్య ప్రధాన కారణం కాగా కొత్తగా పుట్టుకొస్తున్న మల్టీప్లెక్స్లలో టిక్కెట్ల ధర మధ్యతరగతి కుటుంబాలు భరించలేనంత అధికంగా ఉంటోంది. స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా తీయడానికే పరిమితమవడంతో మన ప్రేక్షకులకు చూడటానికి సినిమాలే లేకుండా పోతున్నాయి. ప్రముఖ స్టార్లు పరిమిత సంఖ్యలో ఉండటమే బాలీవుడ్ ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తోంది. తాను నిర్మిస్తున్న సినిమాలకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా బాలీవుడ్ కొన్ని సంవత్సరాల క్రితం కోరింది. ఆ సమయంలో సినీ నిర్మాతలకు రుణ సహాయం చేయడానికి బ్యాంకులను అనుమతించేవారు కాదు. సినీ కథలు, నటుల తేదీలు వంటివి పరస్పర సంబంధంతో కూడినవిగా గుర్తించకపోవడమే దీనికి కారణం కావచ్చు. అంటే సినీ నిర్మాతలు తరచుగా ఇతర వనరుల నుంచి డబ్బును సేకరించేవారు, కొన్ని సందర్భాల్లో మాఫియాతో కూడా వీరు సంబం ధాలు పెట్టుకునేవారు. 20 ఏళ్ల క్రితం సినీ నటులు, నిర్మాతలు నేరస్థులతో సన్ని హితంగా ఉంటున్నారని వచ్చే వార్తలను చదవటం సర్వసాధారణ విషయంగా ఉండేది. ఇటీవలికాలంలో ఇది నిలిచిపోయినట్లుంది. పైగా ఈ రోజుల్లో ధన సేక రణకు సంబంధించి సినీనిర్మాతలకు ఇతర మార్గాలెన్నో ఉన్నాయి. బాలీవుడ్ ఇప్పుడు కీలక పరిశ్రమగా మారిందని, ఇదివరకటికంటే వేగంగా అది ఎదుగు తోందని ఇది సూచిస్తోంది. కానీ వాస్తవం మాత్రం భిన్నంగానే ఉంది. కొన్ని వారాల క్రితం, సినిమా వ్యాపారంపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ని ఇంటర్వ్యూ చేశారు. భారత్లో సినిమాలు చూసే వారి సంఖ్య వాస్తవానికి ప్రతి సంవత్సరం తగ్గుముఖం పడుతోందని చాలాకాలం నుంచి సినీపరిశ్రమలో ఇన్ సైడర్లకు తెలుసని కరణ్ తెలిపారు. ఇందుకు కారణాలలో మౌలిక వసతుల సమస్య ఒకటి. భారత్లో నేటికీ లక్షమంది జనాభాకి ఒక హాల్ మాత్రమే ఉంటోంది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పరిశ్రమ అయిన అమెరికాలో 12 థియే టర్లు, హాంకాంగ్తో కలసి ప్రపంచంలో రెండో అతిపెద్ద పరిశ్రమ అయిన చైనాలో లక్షమందికి 2.5 థియేటర్లు ఉన్నాయి. భారతీయ నగరాలు పాత సినిమాహాళ్లను కూల్చివేసి, మాల్స్ను నిర్మించడం ప్రారంభించడంతో దేశంలో థియేటర్ల సంఖ్య మరింత పడిపోనుంది. మరొక సమస్య ఏమిటంటే, కొత్త మాల్స్లోని మల్టీప్లెక్స్ తెరలు చాలామంది మధ్య తరగతి కుటుంబాలకు భరించలేనివిగా ఉన్నాయి. వీటిలో ఒక్క టిక్కెట్ ధర రూ. 250ల వరకు ఉంటోంది. కుటుంబం మొత్తాన్ని సినిమాకు తీసుకెళ్లాలంటే అది కుటుంబ ఆదాయాన్నే మింగేస్తుంది. దీనికితోడు సేవా పన్ను, వినోద పన్ను రేట్లు అధికంగా ఉంటున్నాయి. ఈ స్థితిలో టిక్కెట్ల ధరలు తగ్గించడానికి పెద్దగా అవ కాశం లేదు. అలా అని సినీ నిర్మాతలు, స్టూడియోలు మరీ దురాశాపరులు కావ టంవల్లే ఇలా జరుగుతోందని చెప్పలేం. వాస్తవానికి, భారీ నష్టాలను ఎదుర్కొం టున్నందువల్ల, బాలీవుడ్ సినీ నిర్మాణ వ్యాపారం నుంచి వైదొలుగుతాయని ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్డిస్నీ ఇటీవల ఒక ప్రకటన చేసింది. సినీ ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి గల కారణాలలో సినీ పరిశ్రమ కూడా ఒక భాగమై ఉంది. బాలీవుడ్ బడా స్టార్ హీరోలు తగినన్ని సినిమాలను నిర్మించ కపోవడం వల్ల ప్రేక్షకులకు చూడటానికి సినిమాలు లేకుండా పోయాయని నా మిత్రుడొకరు చెప్పారు. అమీర్, షారుఖ్, సల్మాన్లు ఇప్పుడు ఏటా ఒక సిని మాలో మాత్రమే నటిస్తున్నారు. ప్రకటనలు, టీవీల ద్వారా వీరు ఆర్జిస్తున్నారు. కాగా, సినిమా కోసం వెచ్చించగలిగినంత డబ్బు ఉండి సినిమాకు వెళ్లాలనుకుని పలువురు భావిస్తున్నప్పటికీ తరచుగా వీరికి చూడటానికి సినిమాలే లేకుండా పోతున్నాయి. హలీవుడ్, హాంకాంగ్తోపాటు ప్రపంచంలోని మూడు అతిపెద్ద సినీ పరిశ్రమల్లో బాలీవుడ్ ఒకటి. వీటిలో ప్రతి దానికీ స్టార్ వ్యవస్థ ఉంది. జనంలో గుర్తింపు పొందిన ప్రముఖ నటులు సినిమాకు గ్యారంటీ విజయాన్ని కల్పించగల రని, వీరు తగిన సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించగలరని దీనర్థం. సమస్య ఎక్కడుందంటే బాలీవుడ్ ప్రతి ఏటా చాలా సినిమాలను నిర్మిస్తున్న ప్పటికీ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో తీస్తున్న సినిమాలను కూడా కలుపుకున్నట్లయితే) పరిమిత సంఖ్యలోనే ప్రముఖ స్టార్లను కలిగి ఉండటమే. అదే హాలీవుడ్లో అయితే ఒక పెద్ద సినిమాలో నటిం చేందుకు అనేకమంది స్టార్లు అందుబాటులో ఉంటున్నారు. మరొక సమస్య ఏమి టంటే.. హాంకాంగ్ సినిమాల్లాగా, బాలీవుడ్ సినిమాలు సార్వత్రికమైనవి కావు. నేనెందుకిలా చెబుతున్నానంటే.. హాంకాంగ్ చిత్రపరిశ్రమ తీస్తున్న మార్షల్ ఆర్ట్స్ సినిమాలు వస్తుగతమైనవి. బ్రూస్లీ, జాకీచాన్ వంటి హాంకాంగ్ స్టార్లు అమె రికాలోనూ, ఇండియాలో కూడా ప్రముఖ హీరోలుగా మారారు. హాంకాంగ్ సిని మాలు యాక్షన్ స్వభావంతో కూడుకున్నవి కావడంతో డబ్బింగ్ చేసేటప్పుడు కూడా వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. భారతీయ సినిమాలు యాక్షన్తో కూడినవి కాదు. పైగా హాంకాంగ్ సినిమా ల్లాగ బాలీవుడ్ సినిమాల యాక్షన్ నాణ్యత అంత ఉన్నతంగా ఉండదు. బాలీవుడ్ సినిమాల్లో సంగీతం, నాట్యం ఉంటున్నందున వీటిని డబ్బింగ్ చేయడం అంత సులభం కాదు, నాణ్యత కోల్పోవడం కాస్త అధికంగానే ఉంటుంది. దీనివల్లే హాలీవుడ్, హాంకాంగ్ సినిమాలతో పోలిస్తే భారతీయ సినిమాల విదేశీ ఆదా యాలు చాలా తక్కువ. విదేశాల్లో మన సినిమాలను చూసేది చాలావరకు దక్షిణా సియా సంతతి ప్రజలే కావడం విశేషం. దీంట్లో కూడా ప్రేక్షకుల సంఖ్య తక్కువే. పాకిస్తాన్లోని మల్టీప్లెక్స్లలో భార తీయ సినిమాలకు అధిక మార్కెట్ ఉంది. అయితే పైరసీ కారణంగా దశాబ్దాలుగా ఇక్కడి ఆదాయాన్ని బాలీవుడ్ కోల్పోయింది. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ హయాంలో అధికారికంగానే బాలీవుడ్ సినిమాల ప్రదర్శనను అనుమతించారు. దీంతో ఇరు దేశాలూ లబ్ధిపొందాయి. ఈ రోజు బాలీవుడ్లో నిర్మిస్తున్న అన్ని సిని మాలను పాకిస్తాన్లో ప్రదర్శిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఇరుదేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు క్షీణిస్తున్నందున ముషారఫ్ గతంలో తీసుకున్న తెలివైన నిర్ణయాన్ని కూడా వెనక్కు మళ్లిస్తే మనం ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఈ అన్ని కారణాల వ ల్లే, బాలీవుడ్కు అధిక సామర్థ్యం ఉన్నప్పటికీ అది ఎదగలేకపోతోంది. వాగ్దానాలను గుప్పించడమే తప్ప, వాటిని అమలు చేయడంలో విఫలమౌతున్న భారతీయ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగానే బాలీవుడ్ ప్రయాణిస్తున్నట్లుంది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ముందున్నది మహా కష్ట కాలం
అవలోకనం జీఎస్టీ తదుపరి ఇంకా ఆశించదగిన మహా విస్ఫోటక ఆర్థిక సంస్కరణలు ఏమీ లేవని ప్రధాని స్పష్టంగా వివరించాలి. రాబోయే పదేళ్లలో ఆరు లేదా ఏడు శాతం వృద్ధి రేటును అధిగమించలేం. కాలం గడిచేకొద్దీ ఈ వృద్ధి రేటును కొనసాగించడం సైతం మరింత కష్టం అవుతుంది. భారీ మార్పులు ఏవీ వచ్చే అవకాశం లేదు కాబట్టి పది శాతం వృద్ధిని ఆశించలేం. బయటి ప్రపంచంలోని ఆర్థిక వృద్ధి పరిస్థితి సైతం మన దేశానికి అనుకూ లంగా లేదు. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయి, చరిత్రలో ఎన్నడూ ఎరుగ నంతగా ఉద్యోగాలు మటుమాయమైపోతున్నాయి. వస్తు తయారీ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని మనం చాలా కాలంగానే అంచనా వేస్తున్నాం. ఇప్పుడది జరుగుతోంది. డ బ్బును రుణంగా తీసుకోడానికి అయ్యే వ్యయం కంటే శ్రమకు అయ్యే వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల శ్రమకు ప్రత్యామ్నాయంగా యాంత్రీకరణను చేపడుతున్నారు. ఆటోమేషన్ (యాంత్రీకరణ) సేవారంగంలోని ఉద్యోగాలను సైతం దెబ్బతీస్తోంది.‘‘ఐటీ రంగంలో పెరగాల్సిన ఉద్యోగాలలో 10 శాతం అదృశ్యమౌతాయి. అంటే ఐటీ రంగం ఏటా 2 నుంచి 2.5 లక్షల ఉద్యో గాలను సృష్టించేట్టయితే వాటిలో 25,000 నుంచి 50,000 వరకు ఉద్యోగాలు మాయమౌతాయి’’ అని ఇన్ఫోసిస్ మాజీ డెరైక్టర్ మోహన్ దాస్ పాయ్ అన్నారు. దేశంలోని 45 లక్షల మంది ఐటీ రంగ ఉద్యోగులలో 4,50,000 మంది మధ్యస్త స్థాయి మేనేజర్లు. వారి పనిని యాంత్రీకరించడం వల్ల వారిలో సగం మంది (2,25,000) వచ్చే దశాబ్ద కాలంలో ఉద్యోగాలను కోల్పోతారు. ‘‘నేడు చాలా మంది (మధ్యస్త స్థాయి మేనేజర్లు) ఏడాదికి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వారిలో సగం మంది వచ్చే పదేళ్లలో ఉద్యోగాలను కోల్పోతారు’’ అని పాయ్ చెప్పారు. బెంగళూరు, ముంబై, గుర్గావ్, పూణె, హైదరాబాద్ వంటి మన నగరాలకు ఇది చాలా పెద్ద దుర్వార్త. ఈ నగరాల వృద్ధికి సేవారంగ ఉద్యోగాలు వెన్నెముకగా ఉన్నాయి. సేవారంగ ఉద్యోగాల యాంత్రీకరణ అంటే ఈ పనిని ఇక భారత్కు పంపరని అర్థం. మన పట్టణ మధ్యతరగతి యువత ఉపాధిని కొనసాగించడానికి మనం కొత్త మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం ఉంది. గత రెండు దశాబ్దాలుగా లేని కొత్త సమస్య ఇది. ఇంగ్లిష్ భాష ద్వారా లభించే సేవారంగ ఉద్యోగాలు పేదలు, మధ్యతరగతిలో చేరడానికి ఉన్న తేలిక మార్గం. ప్రవేశస్థాయిలోని ఈ ఉద్యోగాలే మటుమాయం కావడం అంటే సామాజిక గమనశీలత ముగిసిపోవడమే. ప్రసుత్తం చిన్న చిన్న నగరాలలో సామాజిక అశాంతి పెరుగుతోంది. గుజరాత్ పాటిదార్ల ఆందోళన, హరియాణా జాట్ల ఆందోళన వంటివి ముందు ముందు తీవ్రతరమౌతాయని భావించాలి. ఈ వాస్తవాలను ఎదుర్కోడానికి ప్రభుత్వం ప్రజలను సంసిద్ధం చేస్తున్నదని నేను అనుకోవడం లేదు. అది చూపుతున్న భవిష్యత్ చిత్రం అసాధారణమైనంతటి ఆశావహమైనదిగా ఉంటోంది. వివిధ సామాజిక అసంతృప్తులను పెంపొందుతున్న ఒక జాతీయ సంక్షోభంగా గాక స్థానికమైనవిగా వివరిస్తున్నారు. గత రెండు దశాబ్దాలలోకెల్లా అత్యంత ముఖ్యమైనదిగా పలువురు భావిస్తున్న ఆర్థిక సంస్కరణ క్రమాన్ని భారత్ ఇప్పుడే ప్రారంభించింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) దేశంలోని పరోక్ష పన్నుల విధానాన్ని సులభతరం చేస్తుంది. కేవలం ఈ సంస్కరణే దేశ ఆర్థిక వృద్ధి రేటుకు మరో రెండు పాయింట్లను చేర్చగలదని సైతం కొందరు భావిస్తున్నారు. ఇతరులు దాన్ని అంగీకరించకపోవచ్చునేమో గానీ, అందరూ ఈ సంస్కరణ కీలకమైనదని విశ్వసిస్తున్నారు. ఇంకా ఏ సంస్క రణలను ప్రవేశపెడతారని మనం ఆశించవచ్చు? ఎన్నో ఏం లేవు, జీఎస్టీ స్థాయి సంస్కరణలు అసలుకే లేవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం నాటకీయమైన మార్పును సాధించే దిశగా పలు చట్టాలను చే స్తుందని ఆశించి ఉంటే... ఆయన ఆ ఆశలను నిలబెట్టలేకపోయారు. పెద్ద సంస్కరణగా ముందుకు తెచ్చిన జీఎస్టీ బిల్లు సైతం మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. నిజానికి, ఒక ముఖ్యమంత్రిగా మోదీ దాన్ని వ్యతిరేకించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాక ఆయన తన వైఖ రిని మార్చుకున్నారు. ఇది చాలా మంచి, తెలివైన రాజకీయమని అనుకుంటాను. కొంత కాలం క్రితం ‘వాస్స్ట్రీట్ జర్నల్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ... చట్టాలు చేయాల్సి ఉన్న పెద్ద సంస్కరణలు ఇంకా ఏమున్నాయో తనకు తెలియ దని అన్నారు. ‘‘నేను ప్రభుత్వంలోకి వచ్చాక నిపుణులందరితో కలసి కూచుని, ‘‘మహా విస్ఫోటనం’’ (భారీ ఆర్థిక సంస్కరణల వెల్లువ) అంటే వారి దృష్టిలో ఏమిటో నిర్వచించమని కోరేవాడిని. అవేమిటో ఎవ్వరూ చెప్ప గలిగేవారు కారు’’ అని తెలిపారాయన. ఇంకా తేవాల్సి ఉన్న సంస్కరణలలో అత్యధిక భాగం రాష్ట్రా లకు సంబంధించినవ నీ, కీలకమైన, వివాదాస్పదమైన కార్మిక చట్టాలను రాష్ట్రాలు మరింతగా సరళీకరిస్తాయని ఎదురు చూస్తున్నానని అన్నారు. ‘‘కార్మిక సంస్కరణ లంటే పారిశ్రామికరంగ ప్రయోజనాలేనని అర్థం కాదు. అవి కార్మికుల ప్రయోజ నాల కోసం కూడా ఉద్దేశించినవి’’ అని ఆయన తెలిపారు. మోదీ ఈ విషయంలో చాలా జాగ్రత ్తతో వ్యవహరిస్తున్నారని ఈ మాటలు సూచిస్తున్నాయి. ప్రధాని చెప్పింది పూర్తిగా సరైనదని భావిస్తున్నాను. ఇకనెంత మాత్రమూ సోషలిస్టు దేశంగా లేని దేశంలో ఇంకా తేవాల్సిన మహా సంస్కరణలు ఏము న్నాయి? అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఆర్థిక సరళీకరణకు అనుకూలమైనవే. పరిస్థితి ఇదైనప్పుడు చట్టపరమైన మార్పులు పెద్దగా జరుగుతాయని ఆశించ జాలం. మన ఆర్థిక వృద్ధిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? మధ్యస్త కాలికంగా, అంటే దాదాపుగా వచ్చే దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న ఆరు లేదా ఏడు శాతం ఆర్థిక వృద్ధి రేటును మనం అధిగమించలేమని నా నమ్మకం. కాలం గడిచేకొద్దీ ఈ వృద్ధి రేటును కొనసాగించడం సైతం మరింత కష్టంగా మారుతుంది. భారీ మార్పులు ఏవీ వచ్చే అవకాశం లేదు కాబట్టి 10 శాతం వృద్ధిని ఆశించలేం. పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి. చట్టపరంగా తన ప్రభుత్వం చేయగలగినది ఇంకా ఏమి మిగిలి ఉన్నదనే దాని స్వభావాన్ని మోదీ చక్కగానే వివరిస్తారు. అయితే, ఆశించదగిన మహా విస్ఫోటక ఆర్థిక సంస్కరణలు ఏవీ లేవని, ఏదైనా మార్పంటూ వస్తే అది బహిర్గత పరిస్థితులు భారత్పై కలుగజేసేదే కావాలనే విషయాన్ని ఆయన మరింత స్పష్టంగా వివరించాలి. మన ముందున్నది మహా కష్ట కాలం. అదృష్టవశాత్తూ మనల్ని విశ్వాసంతో ముందుకు తీసుకుపోగల ప్రజామోదం గల ప్రభుత్వమూ ఉంది, ప్రజాదరణ గల నాయకుడూ ఉన్నారు. ( వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ) -
సగటు మనిషి సమస్యలపై టీవీ యాంకర్ల శీతకన్ను
అవలోకనం ప్రకటనదారులు ఖర్చుపెట్టగల సామర్థ్యమున్న వినియోగదారు బృందాలపైనే ఆసక్తి చూపుతుంటారు. ఈ తరహా వినియోగదారులను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి టీవీ చానళ్లు ఈ బృందాల ఆకాంక్షలను పట్టించుకునే కంటెంట్, రిపోర్టులపైనే దృష్టి పెట్టితీరాలి. అందుకనే పోషకాహార లేమి, ప్రాథమిక పాఠశాలలను పోటీతత్వంతో నడపడంలో ప్రభుత్వాల అసమర్థత వంటి అంశాలు టీవీ చానళ్ల ప్రైమ్టైమ్ చర్చల్లోకి రావు. అందుకే ఉన్నత తరగతి బాగా ఆసక్తి చూపే ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలపైనే అతిశయించిన స్థాయిలో చర్చ చేస్తుంటారు. భారత్లో టీవీ యాంకర్లు మరీ శక్తిమంతులుగా అవతరించారా? ప్రత్యేకించి టైమ్స్ నౌ ఆర్నాబ్ గోస్వామి వంటి ఇంగ్లిష్ యాంకర్ల విషయానికి వస్తే నేను అవుననే సమాధానమిస్తాను. శక్తిమంతులు అంటే నా ఉద్దేశం... ప్రతిరోజూ దేనిపై చర్చ సాగాలి, ఏది ముఖ్యమైనది అనే అంశాన్ని వీరు ప్రభావితం చేస్తారనే. ఇది ప్రింట్ మీడియాలోనూ, ఇంటర్నెట్లోనూ ఉన్న జర్నలిస్టులకు లేని, ఎన్నటికీ వారు కలిగివుండని అధికారం. గోస్వామి వంటి యాంకర్లు కలిగిస్తున్న ఈ ప్రభావం చాలావరకు ప్రతికూల మైనదే అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి వారి దృష్టంతా ఉన్నత వర్గ ఆరా టాలకు సంబంధించిన అంశాలపైనే ఉంటుంది. దేశంలో ఆరోగ్యం, ప్రాథమిక విద్య, పోషకాహారం వంటి సమస్యల బారినపడుతున్న కోట్లాది మెజారిటీ ప్రజ లకు చెందిన అంశాలను వీరు చర్చించరు. ఇలా అంటున్నానంటే యాంకర్ ఒక దుష్టుడనీ, హాని కలిగించే వాడనీ అర్థం కాదు. ఇలా జరగడానికి, ఇలాంటి పరిస్థితి అంత సులభంగా మారకపోవడానికి వ్యవస్థాగత కారణాలు చాలానే ఉన్నాయి. మొదటది. భాష పరంగా భారత్ ఒక అసాధారణమైన జాతి. ఉన్నత వర్గాలు విదేశీ భాషనే తమ వ్యవహార భాషగా మార్చుకున్న ఒకే ఒక ప్రధాన దేశం ఇది. దీన్ని తీవ్రమైన సాంస్కృతిక పతనమనే చెప్పాలి. భారతీయుల్లో దాదాపు పది శాతం మంది ఏదో ఒక రకంగా ఇంగ్లిష్ను మాట్లాడగలరని అంచనా. ఈ పదిశాతం మంది భారతీయుల్లో పావుశాతం అంతకంటే తక్కువ జనా భాకు ఇంగ్లిష్ ఫస్ట్ లాంగ్వేజ్గా ఉంటోందని నా భావన. ఇంగ్లిష్ ఒక అనుసంధాన భాషగా ఉంది కాబట్టే ఈ ఉన్నత వర్గమే భారత్లో భాషాపరంగా అనుసంధానమై ఉన్న ఏకైక జనాభాగా ఉంది. ఒక పేద తమిళుడు ఒక నిరుపేద కశ్మీరీతో లేదా గుజరాతీయుడితో మాట్లాడేందుకు మార్గమే లేదు. కానీ ఈ రాష్ట్రాలకు చెందిన ఉన్నత తరగతి ప్రజలు మాత్రం ఇంగ్లిష్లో సులభంగా మాట్లాడుకోగలరు. ఈ వర్గం ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో సులభంగా పనిచేయడానికి, డజను అధికార భాషలను కలిగి ఉన్న ఉపఖండంలో ఎలాంటి కష్టం లేకుండా వీరు ఒకచోటి నుంచి మరొక చోటికి బదిలీ కావడానికి ఇదే కారణం. రెండో కారణం ఏమిటంటే, భారత్లో మీడియా అత్యధికంగా సబ్సిడీకర ణకు గురైంది. దేశంలో వార్తాపత్రికలు చాలావరకు 4 రూపాయలకే లభ్యమవు తాయి. ఈ ధరకు మీరు 40 పేజీల పూర్తిస్థాయి ఇంగ్లిష్ పత్రికను పొందగలరు. అమెరికాలో, యూరప్లో మరెక్కడైనా సరే ఇదే పత్రిక ధర రూ.70 లుగా ఉంటుంది. మన పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లలో చూసినా భారత్లోని పత్రికల కంటే నాలుగు రెట్లు ఎక్కువ ధర ఉంటుంది. న్యూస్ప్రింట్ ధర అంటే వార్తలను ముద్రించే పేపర్ ధర ప్రపంచవ్యాప్తంగా ఒకటే. భారత్లోని ప్రధానమైన దినపత్రికలు కెనడాకు చెందిన న్యూస్ప్రింట్ను డాలర్లలో కొంటుంటాయి. నా అంచనా ప్రకారం ఒక్కొక్క పేపర్ అచ్చయ్యేందుకు కనీసం రూ. 12లు అవుతుంది. మరి పత్రికా యజమానులు పాఠకుడికి అంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు? బహుశా ప్రకటనదారులే కావచ్చు. అదేవిధంగా టాటా స్కై ఇంగ్లిష్ న్యూస్ ప్యాకేజీ 20 ఇంగ్లిష్ వార్తా చానళ్లను నెలకు రూ. 60లకే అందిస్తోంది. అంటే టైమ్స్ నౌ టీవీ చానల్ను మనం రోజుకు 3 రూపాయల ఖర్చుతో చూడవచ్చు. అదే అమెరికాలోని ఫాక్స్ న్యూస్కు మనం చందా కట్టా లంటే 20 రెట్లు ఎక్కువ చెల్లించాలి. మళ్లీ ప్రశ్నిస్తున్నా. మన ఇంగ్లిష్ చానళ్లను అంత సబ్సిడీ ధరలకు ఎవరు అందిస్తున్నారు? యాంకర్ల వేతనాలను ఎవరు చెల్లిస్తున్నారు? అంటే ప్రకటనదారులే అని చెప్పాలి. ప్రకటనదారులు కొన్ని వినియోగదారు బృందాలపట్లే.. అంటే ఖర్చుపెట్టగల సామర్థ్యమున్న బృందాలపైనే ఆసక్తి చూపుతుంటారు. ఈ తరహా వినియోగదారు లను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి టీవీ చానళ్లు ఈ బృందం ఆకాంక్ష లను పట్టించుకునే కంటెంట్, రిపోర్టులపైనే దృష్టి పెట్టితీరాలి. అందుకనే పోషకా హార లేమి, ప్రాథమిక పాఠశాలలను పోటీతత్వంతో నడపడంలో ప్రభుత్వాల అసమర్థత వంటి అంశాలు టీవీ చానళ్ల ప్రైమ్ టైమ్ చర్చల్లోకి రావు. అందుకే ఉన్నత తరగతి బాగా ఆసక్తి చూపే ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలపైనే అతిశయించిన స్థాయిలో చర్చ చేస్తుంటారు. అయితే తరచుగా యాంకర్లు తమ కంటెంట్ జనాదరణకు సంబంధించిన ఈ వ్యవస్థాగత అంశాలను తమ వ్యక్తిగత ప్రతిభతో గందరగోళపరుస్తుంటారను కోండి. అయితే ఈ వ్యవస్థాగత కారణాల వల్లే ఇంగ్లిష్ యాంకర్ అత్యంత శక్తిమం తుడు అవుతున్నాడు. గడిచిన కొన్ని సంవత్సరాల్లో అర్నాబ్ వంటి యాంకర్లు చేస్తున్న డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వమే తన విధానాలను, చర్యలను సవ రించుకోవలసి వచ్చిందన్న మాట వాస్తవం. ప్రభుత్వంలో కాస్త వివేకవంతుడైన వ్యక్తి ఈ విషయంలో తన విశ్లేషణను నాతో పంచుకున్నారు. దాంట్లో కొంత భాగాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆయన ఇలా చెప్పాడు: ‘అర్నాబ్ ఇప్పుడు ఎజెండాను రూపొందిస్తున్నారు... చైనా, పాకిస్తాన్ల నుంచి భారత్కు ఇక్కడి నుంచి ఆ దేశాలకు నేతలు చేసే సందర్శనలను సరిహద్దుల్లోంచి జొరబడుతున్న చొరబాటుదారుల చిత్రాలతో, లేక ఇన్ఫ్రారెడ్ చిత్రాలతో చూపిస్తుంటారు. అలాంటి సందర్శనలను నిలిపివేయిం చడం లేదా దాని ప్రభావాన్ని పలుచబారేలా చేయడమే దీని లక్ష్యం.’ ఇలాంటి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుంది. ఎందుకంటే టీవీ యాంకర్ అనేవాడు పాపులారిటీ, రేటింగుల కంటే మించిన ప్రాధాన్యత కలిగిన వాడు కాదు. తమకున్న జనాకర్షణ జాతి హితంతో ముడిపడి ఉందని అతడు లేదా ఆమె భావిస్తూండవచ్చు. అయితే కొన్ని అంశాలలో ఇది వాస్తవం కాదు అనడంలో వివా దమే లేదు. అలాంటి సందర్భాల్లో మనకు ఎంత నష్టం జరుగుతుంది? దుర దృష్టవశాత్తూ టీవీ చర్చలో ఇది ఒక అంశంగా ముందుకు రావడం లేదు. (వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ) -
మన స్కూళ్లు.. నిరుద్యోగుల ఫ్యాక్టరీలు
ఇంతకూ మన దేశంలో విద్యకు సంబంధించిన అసలు సమస్య ఏమిటి? ప్రాథమిక స్థాయి విద్య నాణ్యత అన్నిటిలోకీ అతి పెద్దది. ప్రాథమిక పాఠశాలల్లో సరైన సదుపాయాలు లే వు, ఉపాధ్యాయులు తరచుగా విధులకు హాజరు కారు... అక్కడ పెట్టే ఉచిత భోజనాన్ని ఎంత నిర్లక్ష్యంగా తయారు చేస్తారంటే కొన్ని సంద ర్భాల్లో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటారు. ఈ కీలక కృషిని సక్రమంగా నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమై... పేదలు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. 2006లో 20 శాతం కంటే తక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఉండగా, పదేళ్ల తర్వాత నేడది 30 శాతానికి పెరిగింది. ఈ ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్య నాణ్యత రకరకాలుగా ఉంటోంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలల కంటే అధ్వానంగా ఉంటోంది. పర్యవసానం మన పాఠశాలల్లో తయారైన విద్యార్థులలో అధికులు విద్యా వంతులు కాకపోవడం. ప్రథమ్ అనే సంస్థ భారతదేశంలో విద్యపై అత్యుత్తమ మైన వార్షిక సర్వేను నిర్వహించింది. గుజరాత్కు సంబంధించిన ఆ అధ్యయన ఫలితాలను చూస్తే పరిస్థితి బాగా అర్థం అవుతుంది. 2014లో గ్రామీణ గుజరాత్లోని 7వ తరగతి విద్యార్థులలో 22 శాతం మాత్రమే ఒక ఇంగ్లిషు వాక్యాన్ని చదవగలిగారు. 2007లో ఇది 37 శాతంగా ఉండేది. అంటే, సుపరి పాలనకు పేరు మోసినదిగా భారతీయులలో చాలా మంది విశ్వసిస్తున్న రాష్ట్రం లోనే విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఈ అధ్యయనం కోసం పరీక్షించిన 5వ తరగతి విద్యార్థులలో ఈ సంఖ్య 6 శాతం. అంటే, పదేళ్ల వ యస్కులైన 94 శాతం గుజరాతీ విద్యార్థులు ఒక ఇంగ్లిషు వాక్యాన్ని చదవలేరు. సర్వే చేసినది 20,000 మంది విద్యార్థులను కాబట్టి ఎంపిక చేసినవారి సంఖ్య చాలా తక్కువనడానికి లేదు. 5వ తరగతి విద్యార్థులలో సగం కంటే తక్కువ మందికి (44%) మాత్రమే గుజరాతీ చదవగలిగే శక్తి ఉంది. ఈ సంఖ్య కూడా గత కొన్నేళ్లుగా పడిపోతూ వస్తోంది. 3వ తరగతి విద్యార్థుల్లో కేవలం మూడింట ఒక వంతుకు మాత్రమే 1వ తరగతి స్థాయి చదివే సామర్థ్యం ఉంది. 2007 నుంచి ఈ ఏడాదికి ఈ సంఖ్య 10 శాతం మేరకు తగ్గిపోయింది. ఈ సమాచారం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధిం చినది. అయితే, ప్రైవేటు పాఠశాలల పరిస్థితీ అలాగే ఉంది. ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి విద్యార్థుల్లో 13% భాగహారాలు చేయగలిగితే, ప్రైవేటు పాఠశాలల్లో అది 16% మాత్రమే. భారతీయులందరిలోకీ గుజరాతీలు మాత్రమే పుట్టుకతో వ్యాపారస్తులని భావిస్తుంటారు. కానీ 80 శాతం ప్రాథమిక మైన అంక గణితం లెక్కలు చేయలేకపోతే భవిత నిరాశాజనకమైనదే అవుతుంది. ఈ పరిస్థితికి కొంత వరకు వనరుల లేమిదే బాధ్యత అని అనుకోవచ్చు. 6 నుంచి 15 ఏళ్ల పిల్లలు ఒక్కొక్కరి విద్య కోసం అమెరికా ప్రభుత్వం మొత్తం రూ. 1,15,000 డాలర్లను ఖర్చు చేస్తుంది. అంటే పిల్లల్లో ఒక్కొక్కరిపై ఏడాదికి సగటున రూ. 7 లక్షల ఖర్చు. మన దేశంలోైనైతే ఇది అనూహ్యమైన విషయం. ఆ స్థాయికి చేరాలంటే మనకు 100 ఏళ్లు కావాలి. అయితే మనం ఎదుర్కొనే ఇలాంటి సమస్యలను ఎదుర్కొనని పేద దేశాలు కూడా ఉన్నాయని అంగీకరించక తప్పదు. మన దేశం కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న జింబాబ్వే మనకంటే మెరుగ్గా ఉంది. సమస్య కేవలం డబ్బుకు సంబంధించినదే కాదు. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పాక్షికంగా మాత్రమే కారణమని నేను చాలా సార్లే రాశాను. పెద్ద సమస్యలు సమాజంలోనే ఉన్నాయి. వాటిని ఒక మంత్రి... ఆమె లేదా అతడు తాము ఎంతటి అద్భుత ప్రతిభా వంతులమని భావించినాగానీ మార్చలేరు. నిరుద్యోగులు కాగలిగిన బొటాబొటీ విద్యావంతులైన పౌరులను మన దేశం ఉత్పత్తి చేస్తోంది. వారు ఉత్పాదక మైనవారు కారు. వారు తమంతట తాముగా చేసిన తప్పంటూ ఏమీ లేకపోయినా గానీ వారు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పనిచేయడానికి తగిన శక్తిసామర్థ్యాలతో సంసిద్ధులై లేరు. ఇది మన మానవ వనరుల మంత్రి తప్పేమీ కాదు. కాబట్టి ఇది ఆమె వినమ్రంగా అంగీకరించాల్సిన విషయం. ఆమె నేతృత్వంలోనే మొట్టమొద టిసారిగా కొత్త విషయాలేవైనా జరిగాయని ఆమె విశ్వసించినాగానీ... ఆమెకు ముందు ఎంతో మంది గొప్పవారు ఆ పదవీ బాధ్యతలను నిర్వహించారు. అంతా విఫలమయ్యారు. అబ్దుల్ కలామ్ ఆజాద్ మన దేశ ప్రథమ విద్యామంత్రి. ఆయన గొప్ప మేధావి. రాజకీయ రంగానికి చెందిన వారిలో అత్యంత అధికంగా అధ్యయనం చేసిన వారిలో ప్రపంచంలోనే ఆయన ఎన్నదగినవారు. మత విషయాలకు సంబంధిం చిన పాండిత్యం కారణంగా ఆయనను మౌలానా అని పిలిచేవారు. ఆయన సులభతరం చేసిన ఖురానునే భారత, పాకిస్తాన్లలోని మౌల్వీలంతా నేటికీ ప్రామాణిక గ్రంథంగా అనుసరిస్తారు. చరిత్ర, సాహిత్యాలలో ఆయన పాండి త్యానికి కాంగ్రెస్లో మరెవరూ సాటిరారు. 1931లో, నెహ్రూ జైల్లో ఉండగా 900 పేజీల ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ అనే చక్కటి గ్రంథాన్ని రాశారు. వాస్తవాలను, తేదీలను సరిపోల్చుకోడానికి అప్పు డాయన వద్ద రిఫరెన్స్ గ్రంథాలేమీ లేవు. కానీ ఆజాద్, విజ్ఞాన సర్వస్వం వంటి ఆయన జ్ఞానమూ అందుబాటులో ఉండేవి. ప్రాచీన ఈజిప్ట్, గ్రీస్, రోమ్ల చరిత్రల నుంచి చైనా టీ వరకు సకల విషయ పరిజ్ఞానం ఆయనకుండేది. సాహిత్య అకాడమీ ఆయన ఏర్పరచినదే. గతంలో ఈ పదవిని నిర్వహించినవారిలో చాలా మంది గొప్పవారున్నారని చెప్పడానికే ఇదంతా చెబుతున్నాను. నేటి విద్యాశాఖను మరో పేరుతో ఇప్పుడు మానవ వనరుల శాఖ అని పిలు స్తున్నారు. అదిప్పుడు నటి స్మృతి ఇరానీ నేతృత్వంలో ఉంది. ఆ పదవీ బాధ్య తలను తాను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని ఆమె విశ్వసిస్తున్నారు. కాకపోతే నరేంద్రమోదీ మద్దతుదార్లలో కొందరు సైతం ఆమె పని తీరు బాగాలేదని భావి స్తున్నారు. ఆ బాధ్యతలను నిర్వహించడానికి అవసరమైన విద్య, అనుభవమూ ఆమెకు కొరవడ్డాయని వారు అనుకోవడమే అందుకు కారణం. కొన్ని రోజుల క్రితం, ఇరానీ తాను సాధించిన విజయాలలో కొన్నిటిని ఏక రువు పెట్టారు. అవి: ఒక్క ఏడాదిలో 4 లక్షలకుపైగా పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించడం. గణిత, విజ్ఞానశాస్త్ర స్థాయిలనూ, చదవడం, రాయటాలనూ మెరుగు పరచటంపై దృష్టిని కేంద్రీకరించడం, తదితరాలు. వీటిలో చాలా వరకు మొట్ట మొదటిసారిగా తన నిర్దేశనలో చేపట్టినవేనని ఆమె అన్నారు. విగ్రహాలను నెల కొల్పడం, హాజరును నమోదు చేయడంలో వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టడం వగైరాలు ఇంకా చాలానే ఆమె పేర్కొన్న ఆ జాబితాలో ఉన్నాయి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
సమాజంలో సంస్కరణే... అభివృద్ధి
సంపన్న సమాజాలు వ్యక్తులను గౌరవిస్తాయి. పరదేశీయులను వేధించకుండా ఉండటంపై వారు పెట్టే శ్రద్ధ, ఆ సమాజాల్లోని సామరస్యత వంటివాటిని భారత్లోని అత్యుత్తమ నగరాల్లో కూడా మనం ఏదో ఒక మేరకు కోల్పోయాం. ఐక్యరాజ్యసమితి తలసరి జీడీపీ విషయంలో ప్రపంచ దేశాల ర్యాంకుకు సంబంధించిన జాబి తాను ఇటీవలే విడుదల చేసింది. దాంట్లో భారత్కు 150వ ర్యాంకు దక్కింది. మన తలసరి జీడీపీ సంవత్సరానికి $1586. అంటే నెలకు భారతదేశం రూ. 8,800 విలువైన వస్తుసేవలను ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఈ ర్యాంకింగులో భారత్ కంటే దిగువన ఉన్న దేశాలేవంటే... ఎమెన్ ($1418), పాకిస్తాన్ ($1358), కెన్యా ($1358), బంగ్లాదేశ్ ($1,088), జింబాబ్వే ($ 965), నేపాల్ ($ 692), అఫ్గానిస్తాన్ ($ 688) కాంగో ($ 480). సోమా లియా ($131) అన్నిటికంటే దిగువన ఉంది. వీటితో పోలిస్తే అతి చిన్న యూరోపియన్ దేశాలైన మొనాకో ($187650), లీసెన్స్టెయిన్ ($157040), లగ్జెం బర్గ్ ($116560)లతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ దేశాలు సుసంపన్న జీవితానికి ప్రతీకలు. సింగపూర్ ($55910), యునెటైడ్ స్టేట్స్ ($ 54306), అత్యధిక ఆదాయం సాధిస్తున్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తు న్నాయి. దక్షిణ కొరియా ($ 28 166) జపాన్ ($ 36298)ను సమీ పిస్తుండగా, జర్మనీ ($ 47966), యునెటైడ్ కింగ్డమ్ ($ 46461) సమీపస్థాయికి చేరుతున్నాయి. ఈ అంకెలు మంచి సూచికే కానీ మనం వీటిని మాత్రమే పరి గణనలోకి తీసుకోకూడదు. మొత్తం సగటు కంటే మధ్యగత ఆదాయం.. అంటే ఈ జాబితా మధ్యలో ఉన్న వారి ఆదాయం విషయంలో భారత్ కంటే పాకిస్తానే ఆధిక్యతలో ఉంది. అంటే పాకిస్తానీయుల ఆదాయం భారతీయులతో పోలిస్తే తక్కువగానే ఉన్నప్పటికీ అది భారత్ కంటే చక్కగా పంపిణీ అవుతోందని, భారత్ కంటే పాకిస్తాన్ ఆర్థికంగా తక్కువ అసమానత్వంతో ఉందని అర్థం. ఈ జాబితా ప్రకారం జాంబియా($1715), వియత్నాం ($ 2015), సూడాన్($2081), భూటాన్ ($25 69) దేశాలు భారత్కంటే ముందున్నాయి. ఇక తలసరి జీడీపీలో భారత్తో పోలిస్తే శ్రీలంక ($3635) రెట్టింపు ఆధిక్యతలో ఉంది. భారతీయుల కంటే శ్రీలంక ప్రజలు ఎంతో ఎక్కువ సౌభాగ్యంతో ఉంటున్న విషయం, శ్రీలం కను సందర్శించిన వారికి ఆశ్చర్యాన్ని కలిగించదు. ఇలాంటి పోలికలు తీసుకొస్తున్నప్పుడు దేశం పరి మాణం, దాని ఆదాయ మూలాలు, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాని ఈ సమాచారం కేసి చూస్తే మనం ఎక్కడ ఉంటున్నామనే అంశంపై మనకు మంచి అవగాహన కలుగుతుంది. బహుశా, భారత్ను అభి వృద్ధి చెందిన దేశంగా మలచడానికి మనం ఇంకా ఏం చేయాల్సి ఉంటుందో పరిశీలించగలం కూడా. అభివృద్ధి చెందుతున్న దేశం అనే పదబంధాన్ని వాడ కూడదని, దానికి బదులుగా దేశాలను తలసరి ఆదా యంతో వర్గీకరించాలని ప్రపంచ బ్యాంకు ఇప్పుడు నిర్ణ యించింది. భారత్ ఒక స్వల్ప మధ్య స్థాయి ఆదాయ దేశం. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం.. 1,000 డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను స్వల్ప ఆదాయ దేశాలుగానూ, వెయ్యి నుంచి 4 వేల డాలర్ల మధ్య గల దేశాలు స్వల్ప మధ్యస్థాయి ఆదాయ దేశాలుగానూ, 4 వేల నుంచి 12 వేల డాలర్ల మధ్య గల దేశాలు అధిక మధ్య స్థాయి ఆదాయ దేశాలుగానూ, అంతకంటే ఎక్కువ ఆదా యం ఉన్న దేశాలు అత్యధిక ఆదాయం కలిగిన దేశాలు గానూ పరిగణించాల్సి ఉంటుంది. పలు యూరోపియన్ దేశాలు అధిక ఆదాయ దేశాలుగా ఉంటున్నాయి. తలసరి ఆదాయం 600 డాలర్లు మాత్రమే ఉన్న సెర్బియా.. ఈ జాబితాలో అత్యంత దిగువ స్థానంలో ఉంది. దారిద్య్రం నుంచి విముక్తి కావడానికి భార త్కు ఎంత తలసరి జీడీపీ అవసరమనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ రఘురాం రాజన్ ఇటీవలే మాట్లాడారు. ‘‘ఒకస్థాయి లో మనం ఇప్పటికీ 1,500 డాలర్ల తలసరి ఆదాయం ఉన్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నాం. 1,500 నుంచి సింగపూర్ ఆర్జిస్తున్న 50 వేల డాలర్ల స్థాయికి చేరుకోవడానికి మనం చేయవలసింది ఎంతో ఉంది. మనది ఇప్పటికీ సాపేక్షి కంగా పేద ఆర్థిక వ్యవస్థే. ప్రతి ఒక్కరి కంటి కన్నీరును తుడవాలంటే భారత్ కనీసం మధ్య ఆదాయదేశంగానైనా మారాలి. సహేతుకంగా పంపిణీ చేసినట్లయితే, 6 వేల నుంచి 7 వేల డాలర్ల తలసరి ఆదాయాన్ని సాధించ గలిగితే తీవ్ర దారిద్య్రంతో మనం తలపడగలుగుతాం. కనీసం ఒక మేరకు సంతృప్తికర స్థాయికి చేరుకోవాలంటే రెండు దశా బ్దాలు కృషి చేయవలసి ఉంటుంది.’’ ప్రస్తుతం చైనా తలసరి జీడీపీ 7,600 డాలర్లకు చేరు కుంది. అంటే రాజన్ చెప్పిన మధ్య ఆదాయ స్థాయిని అది ఈ మధ్యే చేరుకుందని అర్థం. భారత్తో పోలిస్తే చైనా అభి వృద్ధి విభిన్న దశలో జరిగిందని చైనాను సందర్శించిన వారికి బోధపడుతుంది. ఈ రెండు దేశాలను పోల్చి చూడటం సముచితం కాదు కూడా. మనకంటే చైనా ఎంతో ముందం జలో ఉంది మన జీవిత కాలంలో అంటే వచ్చే 30 ఏళ్లలో వారిని మనం అందుకోవడం సాధ్యపడుతుందని నేనయితే భావించడం లేదు. అందుచేత, ఇప్పుడున్న 1,500 డాలర్ల నుంచి 4 రెట్లకు అంటే 6 వేల డాలర్లకు మన జీడీపీ చేరుకోవాలంటే భారత్ చేయవలసింది ఏమిటి? ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే అంశంపైనే భారత్లో ప్రధాన చర్చగా ఉంటోంది. ఏకీకృత వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వంటి ఆర్థిక సంస్కరణల ద్వారా మనం మరింత అధి కంగా, మంచి చట్టాలను చేయవలసిన అవసరముందని మన ఆలోచన. రెండోది. మనకు సుపరిపాలన అవసరం, అంటే అవినీతి రహిత, సమర్థ పాలన అవసరం. అవినీతి, అసమర్థత మన సంస్కృతిలో భాగంగా ఉన్న దేశంలో రెండో అంశం సాధ్యపడుతుందని భావించ డానికి పై రెండు అంశాలను పరిపూర్తి చేయడంతోటే సరిపోదని నేననుకుంటున్నాను. అవసరమైన మార్పులలో ఈ రెండూ ప్రధాన అంశాలు కావు. అధిక ఆదాయాన్ని సాధించిన దేశాలలో పర్యటించిన వారికి అవి భారత్కంటే విభిన్న దశలో వ్యవహరిస్తున్నాయని బోధపడుతుంది. ఆ సమాజాలు వ్యక్తులను గౌరవిస్తాయి. కొత్తవారిని దెబ్బతీయకుండా ఉండటంపై వారు పెట్టే శ్రద్ధ, ఆ సమా జాల్లో కనిపించే సామరస్యతా ధోరణి వంటివాటిని భారత్ లోని అత్యుత్తమ నగరాల్లో కూడా మనం ఏదో ఒక మేరకు కోల్పోయాం. ప్రభుత్వంలో సంస్కరణ కాదు.. సమా జంలో సంస్కరణే దేశాలను సుసంపన్నం చేసింది, వారి తలసరి జీడీపీని అత్యున్నత స్థాయిలో నిలిపింది. ప్రభు త్వం తీసుకొచ్చిన మార్పులపై మాత్రమే మనం దృష్టి పెట్టి నంత కాలం, అభివృద్ధి సాధనలో భారత్ మందకొడితనం కొనసాగుతూనే ఉంటుంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
రాహుల్కి పట్టంగట్టి పార్టీని పాడె ఎక్కిస్తారా?
అవలోకనం రాహుల్కు పగ్గాలు అప్పగించడమంటే కాంగ్రెస్ను దహించేస్తున్న అగ్నికీలల్లో పెట్రోలు పోయడమే అవుతుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ తన 67 ఏళ్ల కొడుకు, రాకుమారుడు చార్లెస్ కోసం సింహాసనాన్ని వదులుకోవడానికి సిద్ధపడటం లేదు. ఆయన మంచి రాజు కాలేడని ఆమె భావించడమే అందుకు కారణం కావచ్చు. ఆమెలాగే సోనియా కూడా కాంగ్రెస్ అధినేతగా కొనసాగాలి. అది ఆమె కుమారునికి రుచించకపోవచ్చు, కానీ ఆమె మొదట ఆలోచించాల్సింది పార్టీ గురించి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టడం గురించిన వార్తా కథనాలు ఈ వారం మళ్లీ దర్శనమిచ్చాయి. దశాబ్ద కాలంగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ఆయనకు ఇప్పుడు 45 ఏళ్లు. కాబట్టి పార్టీలోని ఆయన మద్దతుదార్లు అధికారికంగా ఆయన ఇక పగ్గాలు చేపట్టాలని కోరుకోవడం సహజమే. కాకపోతే ఆయన తల్లి సోనియా గాంధీ ఎందుకు తప్పుకోవాలనే విషయమే అస్పష్టంగా ఉంది. ఈ మార్పును కోరుకోవడానికి రెండు కారణాలున్నాయని తోస్తోంది. ఒకటి, ఎప్పుడో ఒకప్పుడు పాత తరం తప్పుకుని యువతకు చోటివ్వక తప్పదు. ఇప్పుడో అప్పుడో సోనియా కాంగ్రెస్ నాయకత్వాన్ని వదులుకోక తప్పదు. కాబట్టి తన వారసుడ్ని పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకోవడం సమంజసమేనని ఆమెకు కూడా అనిపిస్తుంది. పైగా ఇప్పటికే ఆయనకు పట్టాభిషేకం జరిగింది, కాకపోతే అధికారం చేపట్టడమే మిగిలింది. ఇక రెండవది, తక్కువ పారదర్శకమైన కారణం. అది సోనియా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుందనేది. విదేశాలలో ఆమెకు చికిత్స జరగాల్సిన అవసరమున్నదని కొంత కాలం క్రితం వార్తలొచ్చాయి. వివరాలను వెల్లడి చేయలేదు గానీ అప్పట్లో ఆమె పరిస్థితి అత్యధునాతన వైద్య సహాయాన్ని కోరాల్సినంతటి తీవ్రమైనదిగా ఉన్నదనేది స్పష్టమే. ఆమె కుమారునికి అత్యున్నత పదవిని కట్టబెట్టడం కోసం తాజాగా జరుగుతున్న ప్రయత్నాలకు అది తగిన కారణమేనా? బహుశా కాదు. చివరిసారిగా ఆమె విదేశాల్లో వైద్య చికిత్స చేయిం చుకున్నది ఇటీవల కాదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చక్కగా ఉన్నట్టు ఫొటోలు చెబుతున్నాయి. అలాంటప్పుడు రాహుల్ను అత్యున్నత స్థానానికి పంపాలనే ఈ ఆరాటం ఎందుకు? పార్టీలోని అంతర్గత ఒత్తిడి అందుకు ఒక కారణం కావచ్చు. పార్టీ స్థితి వేగంగా దిగజారిపోతుండటాన్ని చూస్తున్న కాంగ్రెస్వాదులు మార్గ నిర్దేశనంలో కొంత మార్పును కోరుకుంటూ ఉండవచ్చు. ఏదైనా నాటకీయమైన తీవ్ర చర్యను చేపట్టకపోతే పార్టీ కొద్ది కాలంలోనే మరణిస్తుంది. లోక్సభలో దాదాపు 200 స్థానాలను కలిగిన స్థితి నుంచి అది 45 స్థానాలకు దిగజారింది. లోక్సభలో ప్రవే శించలేకపోయిన 150 మంది కాంగ్రెస్ నేతలు ఓడిన ఆ ఎన్నికల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. వారిలో చాలామంది కొన్ని దశాబ్దాల జీవిత కాలాన్ని పార్టీ కోసం పణంగా పెట్టారు. పార్టీ భవితలో వారి వ్యక్తిగత ప్రయోజనాలు సైతం ఉన్నాయి. పార్టీ కుప్పకూలిపోవడమంటే వారు తాము పెట్టిన మదుపును, భవిష్యత్తును కోల్పోవడమే. వారిలో కొందరు లేదా చాలా మంది పార్టీ నాయకత్వం గురించి స్పష్టతను కోరుతుండవచ్చు, ఆందోళన చెందు తుండవచ్చు. కేంద్రంలోనూ, దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాలలోనూ అధికారాన్ని కోల్పోవడమంటే పార్టీ నిధుల సమీకరణ కోసం తంటాలు పడాల్సి వస్తోందని అర్థం. తక్షణమే నాయకత్వ మార్పును కోరడానికి అది మరో కారణం. అయితే అలాంటి మార్పు వల్ల కాంగ్రెస్కు మేలు జరుగుతుందా? అనేదే ప్రశ్న. పార్టీకి నాయకత్వం వహించడంలో సోనియాకు చాలా మంచి రికార్డే ఉంది. ఆమె పార్టీ పగ్గాలు స్వీకరించే నాటికి పార్టీ ఇలాంటి స్థితిలోనే ఉంది. కాంగ్రెసేతర ప్రధాని నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ పలు కుంభకోణాల్లో ఇరుక్కుపోయి లేదా ఆరోపణలకు గురై ఉంది. ఆ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వయంగా ఒక కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ, కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కూడా అదేసమయంలో జరిగింది. ఆ పార్టీకి చెందిన అత్యంత జనాకర్షక నేత అటల్ బిహారీ వాజపేయి ప్రధాని అయ్యారు. మూడు ఎన్నికల విజయాలను (మెజా రిటీని సాధించలేకపోయినా) సాధించారు. బీజేపీ ప్రబల శక్తిగా ఉండి, కాంగ్రెస్ పట్టును కోల్పోతూ ఉన్న కాలంలో సోనియా నాయకత్వాన్ని చేపట్టారు. ఆమె తన పార్టీని పునరుజ్జీవింపజేసి, బీజేపీ ప్రభావం మసిబారడంతోనే, 2004లో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసు కొచ్చారు. అధిక వృద్ధి, సమాచార హక్కు వంటి అద్భుతమైన చట్టాలతో కాంగ్రెస్ రెండో దఫా ఎన్నికల విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. అందువలన సోనియాకు ఫలితాలను సాధించడంలో, సమర్థతలో మంచి చరిత్ర ఉన్నది. గత ఎన్నికల్లో ఆమె చాలా ఘోరంగా ఓడిపోయారు. కానీ గాయపడ్డ కాంగ్రెస్ పార్టీని సంర క్షించి, తిరిగి ఆరోగ్యవంతంగా ఎలా చెయ్యాలో ఆమెకు తెలుసు, ఆ అనుభవం ఆమెకు ఉంది. రాహుల్కు అవి ఉన్నాయా? లేవు. మన్మోహన్సింగ్ రెండోదఫా పదవీకాలంలో రాహుల్కు అనుకూల స్వరాలు వినిపించాయి. ఆయనను పార్టీ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టడం భవితను స్పష్టం చేసింది. కారణాలు ఏైవె నా గానీ ఆయన ఫలితాలను సాధించలేకపోయారు. ఈ కాలంలో కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనను తమ నేతగా చూపింది, ఘోర పరాజయం పాలైంది. ఆయనలో దృష్టి కేంద్రీకరణ, శక్తి, ఉత్సాహం కొరవ డ్డాయని చాలామందే గమనించారు. నరేంద్ర మోదీ కంటే రాహుల్ రెండు దశాబ్దాలు చిన్నవారు. అయినా ప్రధానితో పోలిస్తే దాదాపుగా కాలం చెల్లిపోయిన వ్యక్తిలా కనిపిస్తారు. కాగా సోనియా చక్కగా పొందికగా, దృఢంగా ఉంటారు. ఆమెకు ఏ తీవ్ర అనారోగ్య సమస్యలు లేన ట్టయితే ఇంకా కొన్నేళ్లపాటు క్రియాశీలంగా, చురుగ్గా ఉండే అవకాశం ఉంది. కుమారునికి లేని విశ్వసనీయత ఆమెకుంది. విదేశీ ఉచ్ఛారణతోనే అయినా ఆమె ఏదైనా ఒక ముఖ్య అశంపై ఒక ప్రకటనను చేస్తుంటే, రాహుల్ చేసే ప్రకటన కంటే ఎక్కువ శ్రద్ధగా వినే అవకాశాలు ఎక్కువ. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ 1980ల చివర్లో ఇబ్బందులతో సతమత మౌతుండగా బరోడాలోని మా కళాశాలకు అరుణ్ శౌరి వచ్చారు. బీజేపీ, వీపీ సింగ్ల కూటమి అధికారాన్ని చేపట్టాలనే వాదనకు మద్దతుగా మాట్లాడుతూ ఆయన... ఇల్లు కాలిపోతుండగా మంటలు ఆర్పడానికి గంగాజలమే కావాలని ఎదురు చూడకూడదు అన్నారు. శ్రోతలలోని ఒక విద్యార్థి లేచి... అలా అని మంటల్లో పెట్రోలు చల్లకూడదని శౌరితో అన్నారు. ఇప్పుడు రాహుల్కు పగ్గాలు అప్పగించడం కూడా కాంగ్రెస్ను దహించేస్తున్న అగ్నికీలల్లో పెట్రోలు పోయడమే అవుతుందని అనిపిస్తుంది. బ్రిటన్లోని ఎలిజ బెత్ మహారాణి తన 67 ఏళ్ల కొడుకు, రాకుమారుడు చార్లెస్ కోసం సింహాసనాన్ని వదులుకోవడానికి సిద్ధపడటం లేదు. ఆయన మంచి రాజు కాలేడని ఆమె భావిం చడమే అందుకు కారణం కావచ్చు. ఆమెలాగే సోనియా కూడా కాంగ్రెస్ అధి నేతగా కొనసాగాలి. అది ఆమె కుమారునికి రుచించకపోవచ్చు, కానీ ఆమె మొదట ఆలోచించాల్సింది పార్టీ గురించి. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
సంపదను సమాజానికి తిరిగి ఇవ్వడమే దాతృత్వం!
పారిశ్రామికవేత్త ఆండ్రూ కార్నెగీ 1889వ సంవత్సరం ‘ది గోస్పెల్ ఆఫ్ వెల్త్’ అనే పుస్తకం రాశారు. సంపన్నులు తమ సంపాదనను పేదలకు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సంపన్నులుగా మరణించడం సిగ్గుపడాల్సిన వ్యవహారమని వ్యాఖ్యానించారు. డబ్బుపై, దాతృత్వంపై కార్నెగీ అభిప్రాయాలు చాలామందిని ప్రభావితం చేశాయి. అపరిమితంగా సంపాదించినవారు మరణించడానికి ముందే తమ సంపదలను సమాజానికి ఇచ్చివేయడం అనేది పాశ్చాత్య దేశాల్లో ఒక సంప్రదాయంలా మారింది. యూరప్లో క్రైస్తవ మత ధర్మాన్ని ఒకే ఒక్క మనిషి నిరసన సమూలంగా మార్చివేసింది. అదే ప్రొటెస్టంట్ సంస్కరణ. వచ్చే ఏడాదికి ఆ ఘటన 500 వార్షి కోత్సవం జరుపుకోబోతోంది. భారత్లో ఒకే రోజున ప్రచురితమైన రెండు వ్యాసాలు మరోసారి నాకు ప్రొటెస్టంట్ సంస్కరణను గుర్తుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఆలయాల ఆదాయం 27 శాతం వృద్ధి సాధించినట్లు మే 25న ఒక వార్తా కథనం వచ్చింది. ‘‘పెరుగుతున్న పాపాలే’’ ఈ వృద్ధికి కారణ మని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలు పాప కార్యాలు చేస్తున్నారని వాటి నుంచి బయటపడేందుకు ఆలయాలను సందర్శిస్తూ కానుకలు సమర్పించుకుంటున్నారని ఆయన అన్నారు. అదే రోజు ఉదయ్పూర్ నుంచి మరొక వార్తా కథనం వచ్చింది. ‘‘పవిత్ర స్నానమొనరించి, రూ.11లు చెల్లిస్తే చాలు చేసిన పాపాల నుంచి విముక్తి’’ అని శీర్షిక. 11 రూపాయలు చెల్లించిన భక్తులకు సమస్త పాపాల నుంచి విముక్తి కలిగించే ధ్రువవత్రాన్ని ఇస్తామంటూ రాజస్థాన్లోని ఒక శివాలయం పూజారులు ఒక ప్రతిపాదన చేశారు. భక్తులు చెల్లించే ఈ రూ.11ల్లో కొంత భాగాన్ని దోష నివారణకు వెచ్చిస్తారట. అంటే భవిష్యత్ విఘ్నాల తొలగింపు అన్నమాట.ప్రతి ఒక్కరూ చివరకు అమాయకులు కూడా పాపాలు చేస్తారని దీని అర్థం. ‘‘రైతులు సేద్యం పనులు చేస్తున్నప్పుడు అజాగ్రత్త వల్లో లేక అనుద్దేశపూర్వకంగా కూడా పెద్ద సంఖ్యలో పురుగులను, ఇతర ప్రాణులను చంపుతుంటారు. పక్షులు, పాకెడు జంతువుల గుడ్లను ధ్వంసం చేస్తుంటారు. ఇది వారిలో అపరాధ భావనను కలిగిస్తుంటుంది. పాపాలు చేశామన్న తలంపుతో వారు ఇక్కడికి వస్తుంటారు. ఇలా మొక్కు చెల్లించిన తర్వాత పాప భారం తొలిగిపోయిందన్న భావనతో వెళు తుంటారు’’ అని ఒక పూజారి వివరించారు కూడా. దేవుడి తరపున పూజారులు ఇలా డబ్బు తీసుకునే సంప్రదాయం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నదే. యూరప్లో 500 ఏళ్ల క్రితమే ఇది భారీ స్థాయిలో జరుగుతూ వచ్చింది. రోమన్ కేథలిక్ చర్చ్.. ఫాదరీ శ్రీముఖాలు పేరిట కొన్ని పత్రాలను అమ్మేది. ఈ పేరుతో డబ్బు చెల్లించేవారు తాము చేసిన పాపాలకు గాను మరణానంతరం అనుభవించాల్సిన శిక్షలు తగ్గిపోతాయన్నమాట. ఇలాంటి కేథలిక్ శ్రీముఖాలను క్రీ.శ. 1517 నాటికే చాలా విస్తృతంగా అమ్మే వారు. ఇలా అమ్మగా వచ్చిన డబ్బు వసూలుకు పోప్ తన తరపున ఒక వ్యక్తిని జర్మనీకి పంపేవారు. ఇలా సేకరించిన డబ్బును వాటికన్లోని సెయింట్ పీటర్స్ చర్చి నిర్మాణానికి వెచ్చించేవారు. దీన్ని నిరసిస్తూ ఒక జర్మన్ మతాచార్యుడు కేథలిక్ చర్చి విశ్వాసానికి హాని కలిగిస్తోందని ఆరోపిస్తూ ఒక ప్రకటన వెలువరిం చారు. ఇలా పాపవిముక్తి కోసం మతపరమైన శ్రీముఖాలను అమ్ముకునే అధి కారం పోప్కు లేదంటూ ఆ మతాచార్యుడు తన నిరసనను తన చర్చి తలుపుకు అతికించారు. అతడి పేరు మార్టిన్ లూథర్. ఈ చర్యే ప్రొటెస్టంట్ సంస్కరణకు దారితీసింది. ఈ ఉద్యమం క్రైస్తవ మతంలో చీలికలు తెచ్చింది. దీని వల్లే ఈరోజు అనేక యూరోపియన్ దేశాలు కేథలిక్ దేశాలుగా లేవు. మార్టిన్ లూథర్ కాలపు యూరప్ లాగే, భారతదేశంలో కూడా మతం అనేది ఆర్థిక లావాదేవీలతో కూడి ఉంటోంది. దేవుడి ఆశీర్వాదం కోసం మనం ఆలయా లకు డబ్బు చెల్లిస్తుంటాం. సంపన్న భారతీయులు నగదు ఇవ్వరు. వారు బంగారాన్ని సమర్పిస్తుంటారు. ఎందుకు? ఎందుకంటే నగదు ఇస్తే ఆలయాల్లో ప్రసాదాల కోసం, ఇతర ధర్మ కార్యాలకోసం ఖర్చు పెట్టేస్తారు. కాని బంగారం మాత్రం దేవుడిని శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉంటుంది. తిరుపతి దేవస్థానం వెబ్సైట్ తెలుపుతున్న వివరాల ప్రకారం ఒకే ఒక సంవత్సర కాలంలో తిరుమల దేవాలయం 3,200 కేజీల వెండిని, 2.4 కేజీల వజ్రాలను భక్తుల నుంచి స్వీకరిస్తోంది. ప్రతి ఏటా సగటున దేవాలయానికి వెయ్యి కిలోల బంగారాన్ని భక్తులు చెల్లిస్తున్నారు. 2011వ సంవత్సరంలో ఇలా ఒక కిలో బంగారం (రూ. 28 లక్షలు) దేవుడికి కానుకగా ఇచ్చినవారికి క్యూలో వెళ్లనవసరం లేకుండానే వీఐపీ దర్శన భాగ్యం కల్పించారు. అంటే కోటి రూపాయలతో మొదలెట్టి ఇలా భారీ మొత్తాలను కానుకలుగా సమర్పించేవారికి దేవస్థానంవారు పలురకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ సమాచారం భారతీయుల్లో చాలామందికి ఆశ్చర్యం కలిగించదు. ఎందు కంటే మన ప్రాంతంలో మతం అనేది లావాదేవీలతో ముడిపడి ఉంటోందని మనకు తెలుసు. కొన్ని నెలల క్రితం నేను కాశీకి వెళ్లాను. ఈ అతి పురాతన హిందూ నగరంలో ప్రతి మత సేవకూ ఒక వెల నిర్ణయించారు. దైవ హారతి సమ యంలో దేవుడి ఎదుట ఉండేందుకు పెద్ద మొత్తంలో ప్రజలనుంచి వసూలు చేస్తున్నారు. ప్రతి చోటా తీర్థ యాత్రికులను కస్టమర్లలాగా చూస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే యాత్రికులు కూడా దీన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. ఎందుకంటే ఇదంతా సంస్కృతిలో భాగం. మతానికి వెలువల వాస్తవ కారణాల కోసం భారత్లో చాలా తక్కువ ధర్మకార్యాలు జరుగు తుంటాయంటే మనం ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. సాపేక్షికంగా చూస్తే, విదేశాల్లో ప్రత్యేకించి దాతృత్వం, పరోపకారం రూపంలో వాణిజ్యవేత్తలు భారీ విరాళాలను ఇవ్వడమనేది ఇటీవలి పరిణామం మాత్రమే. అక్కడ 19వ శతాబ్ది వరకు సంస్థాగత దాతృత్వం దాదాపుగా లేదు. సంపన్న వ్యాపారులు నిర్దిష్ట మొత్తంలో చర్చికి నగదు చెల్లించేవారు. దశమాంశం లేదా పదో వంతు పేరిట జరిగే ఈ దాతృత్వ కార్యంలో తమ ఆదాయంలో 10 శాతాన్ని చర్చికి సమర్పించేవారు. 1889వ సంవత్సరంలో పారిశ్రామికవేత్త ఆండ్రూ కార్నెగీ ‘ది గోస్పెల్ ఆఫ్ వెల్త్’ (సంపద సువార్త) అనే పుస్తకం రాశారు. సంపన్నులు తమ సంపాదనను పేదలకు పంపిణీ చేయాలని, సంపన్నులుగా మరణించడం సిగ్గుపడాల్సిన వ్యవహారమని వ్యాఖ్యానించారు. డబ్బుపై, దాతృత్వంపై కార్నెగీ అభిప్రాయాలు చాలామందిని ప్రభావితం చేశాయి. అపరిమితంగా సంపాదించినవారు మరణించడానికి ముందే తమ సంప దలను సమాజానికి ఇచ్చివేయడం అనేది పాశ్చాత్య దేశాల్లో ఒక సంప్రదాయంలా మారింది. బిల్గేట్స్, వారెన్ బఫెట్ వంటి వారు ఇప్పుడక్కడ అరుదైన దాతలుగా లేరు. అయితే యూరప్లో మహా సంపన్నులు మాత్రమే ఇలా చేయడం లేదు. ఒక సగటు డచ్ పౌరుడు నేడు ఏడు ధర్మ కార్యాలకు నెలవారీగా విరాళాలు ఇస్తున్నారు. మరి భారత్లో జరుగుతున్నదేమిటి? భారత్లో ఇది మార్పు చెందనంతవరకు, స్వార్థ కారణాల కోసమే మతాన్ని ఒక ఆర్థిక లావాదేవీగా చూస్తుండటాన్ని మనం నిలిపివేయనంతకాలం, యూరప్ను సమూలంగా మార్చివేసిన నాటి మత సంస్కరణ ఇక్కడ చోటు చేసుకోదు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో 500 సంవత్సరాలకు కూడా అలాంటి మార్పు ఇక్కడ జరగదని మనం నమ్మకం పెట్టుకోవచ్చు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
చేయూత కోసం ‘చేయి’ ఆరాటం
అవలోకనం ఎన్నికల ప్రయోజనాల కోసమే స్వార్థ చింతనతో ఒక కులాన్ని ఆకర్షించడం ఏ రాజకీయ పార్టీకయినా అనుకున్నంత సులభమేమీ కాదు. అలా ఆకర్షించాలంటే వాళ్లకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమివ్వగలదు? బ్రాహ్మణ అభ్యర్థులకు ఆ పార్టీ టికెట్లయితే కేటాయించగలదు. తరువాత ఏమిటి? కాంగ్రెస్ రాజకీయాలు బ్రాహ్మణులను తన వైపు తిప్పుకుంటాయా? రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోబోతున్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించవలసిన వ్యూహం ఎలా ఉండాలి? ఉత్తరప్రదేశ్ అంటే దేశంలోనే పెద్ద రాష్ట్రం (21 కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ర్టం దానికదే ప్రపంచంలో ఐదో పెద్ద దేశం). ఈ సమస్యను పరిష్కరించి ఒక మంచి ఎన్నికల పథకాన్ని రూపొందించి పెట్టడానికి భారతదేశంలోనే అతి సునిశిత రాజకీయ మేధావులలో ఒకరిగా పేర్గాంచిన ప్రశాంత్ కిశోర్ను నియమించుకున్నారు రాహుల్ గాంధీ. ఇంతకీ ఈ కిశోర్ ఎవరంటే 2014 ఎన్నికలలో నరేంద్ర మోదీకీ (చాయ్ పే చర్చ ఆలోచన ఈయనదేనన్నది సుస్పష్టం), తరువాత 2015లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమ యంలో నితీశ్ కుమార్కీ ఎన్నికల వ్యూహాలను రచించి పెట్టిన వ్యక్తే. ఆయనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి సంబంధించిన వ్యూహం ఆలోచించిపెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటిదాకా అందిన వార్తల ప్రకారం రెండు వ్యూహాలను కిశోర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచారు. అందులో మొదటిది- బ్రాహ్మణుల ఓట్ల కోసం వల వేయడం. రెండోది-ముఖ్యమంత్రి అభ్యర్థిగా గాంధీలలో ఒకరిని, అంటే రాహుల్ లేదా ప్రియాంక గాంధీల పేరును ప్రతిపాదించడం. రెండో వ్యూహం ఎంతమాత్రం ఆమోదించడానికి వీలుకానిది. ఒక ప్రాంతీయ నాయకుడి స్థాయికి దిగడానికీ, అలాంటి పదవి చేపట్టడానికీ గాంధీలకి అహం అడ్డువస్తుంది. నిజానికి గడచిన లోక్సభ ఎన్నికల సమయంలో అసలు నరేంద్ర మోదీతో రాహుల్ను పోల్చడానికే కాంగ్రెస్ వర్గాలు ససేమిరా అన్నాయి. ప్రాంతీయ నాయకుడైన మోదీ ఎక్కడ? జాతీయ నాయకుడైన రాహుల్ ఎక్కడ? అని ఆ పార్టీ చెమ్చాలు అహంకరించాయి. దీనికి మోదీ ఎంతో తెలివిగా ఇచ్చిన సమాధానం- నిజమే, రాహుల్ జాతీయ నాయకుడేమిటి; ఇటలీ సంబంధాలను బట్టి ఆయన అంతర్జాతీయ నాయకుడు కూడా, అని. కిశోర్ ప్రతిపాదించిన మొదటి వ్యూహమే చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ వెనుక యాదవులు ఉన్నట్టు, మాయావతి వెంట దళితులు నడుస్తున్నట్టు, అగ్రకులాలు బీజేపీకి మద్దతు పలుకుతున్నట్టు కాంగ్రెస్ను అంటిపెట్టుకున్న కులమంటూ ఏదైనా ఒకటి ఉందని చెప్పలేం. ఒక కులాన్ని మీ పార్టీ వైపు ఆకర్షించడం చాలా అవసరం. ఎందుకంటే విజయ సాధనలో అదే తొలి సోపానం కాబట్టి. ఇక, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటూ మీరు కల్పించిన భరోసాను విశ్వసిస్తే ముస్లింలు వంటి ఇతర వర్గాలు మీ రాజకీయ శిబిరంలోకి వస్తారు. ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణుల ఓట్లను (జనాభాలో వీరు దాదాపు పది శాతం ఉంటారు) సాధించడం కాంగ్రెస్కు సులభమేనన్నది కిశోర్ వినిపిస్తున్న తర్కం. ఎందుకంటే, గతంలో బ్రాహ్మణులు ఆ పార్టీ వెనుకే ఉన్నారు. ఆ మాటయితే నిజమే. గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎన్డీ తివారీ, కమలాపతి త్రిపాఠీ, గోవింద్వల్లభ్ పంత్, శ్రీపతి మిశ్రా వంటి వారు బ్రాహ్మణులే. అయితే ఒకటి, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో విజయం సాధించిన ఘటన మూడు దశాబ్దాల క్రితం మాత్రమే జరిగింది. నేనయితే ఆ రోజులను గుర్తుకు తెచ్చుకోగలను కానీ, చాలామందికి ఆ అవకాశం లేదు. భారత జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వయసు వాళ్లే. నా అంచనా ప్రకారం ఇప్పుడు ఉన్నవారిలో 1985 నాటి ఎన్నికలలో ఓటు వేసిన వారు ఐదు శాతం కంటే తక్కువే ఉంటారు. అంటే గాంధీలకి ఓటు వేసిన జ్ఞాపకం ఉన్నవారు చాలా పరిమితం. సమస్య అంతా ఇదే. దీనికి మించినదీ, రెండోదీ ఇంకో సమస్య ఉంది. ఎన్నికల ప్రయోజనాల కోసమే స్వార్థ చింతనతో ఒక కులాన్ని ఆకర్షించడం ఏ రాజకీయ పార్టీకయినా అనుకున్నంత సులభ మేమీ కాదు. అలా ఆకర్షించాలంటే వాళ్లకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమివ్వగలదు? బ్రాహ్మణ అభ్యర్థులకు ఆ పార్టీ టికెట్లయితే కేటాయించ గలదు. తరువాత ఏమిటి? కాంగ్రెస్ రాజకీయాలు బ్రాహ్మణులను తన వైపు తిప్పుకుంటాయా? నేనయితే సాధ్యం కాదనే చెబుతాను. విధానపరమైన పరిభాషలో చెప్పాలంటే, మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల మీద దృష్టి పెట్టింది. అంటే కింది కులాల సంక్షేమం మీద దృష్టి పెట్టింది. ఇదే జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత వంటి వాటి ద్వారా రూపుకట్టింది. ఇలాంటి సంక్షేమ పథకాలు మధ్య తరగతి వర్గపు ఓటర్లను ఆకర్షించవు. అలాంటిది బ్రాహ్మణులను ఆకర్షిస్తుందంటే అసలు నమ్మకం కుదరదు. నిజానికి గడచిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పడిన ఓట్లలో బ్రాహ్మణుల ఓట్ల శాతం బాగా తగ్గిందంటూ వచ్చిన అధ్యయనాల పునాదిగా వచ్చిందే కిశోర్ వినిపిస్తున్న ఆ తర్కం. 2002 ఎన్నికలలో 50 శాతం, 2007లో 44శాతం, 2012లో 38 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. అయినా బ్రాహ్మణులు బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఎందుకంటే హిందుత్వ సామాజికంగా సంప్రదాయవాదంతో ఉంటుంది. అలాగే బీజేపీ చెప్పే మత సంబంధ విషయాలు - ఆలయాల నిర్మాణం, గోవధ నిషేధం వంటివి వారిని ఆకర్షిస్తాయి. బీజేపీ, ఆరెస్సెస్ రిజర్వేషన్ పట్ల తరచుగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఇటీవల కాలంలో దళిత విద్యార్థుల పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తోంది. చాలా మంది బ్రాహ్మణులు బీజేపీకి సానుకూలంగా ఉండటానికి ఇది కూడా కారణమే. వీటిలో ఏవీ కూడా కాంగ్రెస్ చేయగలిగే స్థితిలో లేదు. ఉత్తరప్రదేశ్లో మిగిలిన బ్రాహ్మణుల ఓట్లు ములాయం సింగ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీ, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీల మధ్య 20 శాతం వంతున చీలిపోయాయి. ఈ చీలిక ఇలాగే కొనసాగవచ్చు. ఎందుకంటే మిగిలిన కులాల మాదిరిగానే బ్రాహ్మణులు కూడా ఓట్ల విషయంలో ఒకే తాటి మీద లేరు. అందులో చాలామంది శక్తిమంతమైన పార్టీల వైపు మొగ్గుతారు. ఎందుకంటే విజేతల వైపు ఉండాలని వారూ కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మొదట ఎలాంటి ఓటర్లను ఆకర్షించగలదో తన విధానాల వేదిక ద్వారా చూసుకోవాలి. అక్కడే దృష్టి పెట్టాలి. కిశోర్ సలహా మేరకు చేయలేకపోతే, కొత్త ఓటర్లను వెతుక్కోవాలి. తరువాత ఆ ఓటర్లకు అనుగుణంగా ఒక విధానం ఏర్పరుచుకోవాలి. కాంగ్రెస్ పేరు దారుణంగా దెబ్బతింది. అలాగే అవినీతికీ, అసమర్థతకీ, కుటుంబ పాలనకీ అది విలాసమైంది. ఇప్పుడు గాంధీలు చాలా విభిన్నమైన స్థితిలో ఉన్నారు. ఎమర్జెన్సీ తరువాత ప్రతిపక్షంలోనే ఉన్నప్పటికీ, నాటి కంటే విభిన్నమైన స్థితిలో ఇప్పుడు ఉన్నారు. ఇవాళ ఆ పార్టీ అంతిమ క్షణాలు లెక్కించుకునే స్థితికి చేరుకుంది. ఓటర్లు ఎవరూ, ఏ కులమూ, ఏ వర్గమూ కాంగ్రెస్ అంటే ఆసక్తి చూపడం లేదు. బ్రాహ్మణులను ఆకర్షించాలన్న ఈ వ్యూహం విజయవంతం కావడానికి కూడా అవకాశాలే లేవు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
మన విద్యాలయాలు నిరుద్యోగుల కార్ఖానాలు
అవలోకనం మన దేశంలోని ఎంబీఏ పట్టభద్రులలో 7% మాత్రమే ఉద్యోగాల్లో నియమించదగినవారని అసోచాం కొద్ది రోజుల క్రితం జరిపిన అధ్యయనంలో తెలిసింది. ఐటీ పరిశ్రమలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. మన పట్టభద్రుల్లో 90% , ఇంజనీర్లలో 75% శిక్షణ గరపడానికి తగిన అర్హతలు లేనివారని నాస్కామ్ అధ్యయనం నిర్ధారించింది. మన విద్యాసంస్థలు ఉద్యోగాల్లో నియమించలేని భారతీయులను తయారుచేస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ను గొప్ప వ్యూహంగా చెయ్యాలంటే వ్యవసాయ పనులలో ఉన్న వారికి తగిన శిక్షణనిచ్చి ఫ్యాక్టరీ ఉద్యోగాలకు తరలించాల్సి ఉంటుంది. ఈ కర్తవ్యాన్ని పాలిటెక్నిక్ కళాశాలల స్థాయిలోనే నిర్వహించాల్సి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ కరెస్పాండెన్స్ కోర్సు డిగ్రీని వెతికి ఇవ్వాలని గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని కోరారు. వాళ్లు నా డిప్లొమాను కూడా వెతికి పెడితే బావుం టుందని నా ఆశ. బరోడాలోని ఎమ్ఎస్ విశ్వవిద్యాలయంలో నేను రెండే ళ్ల (1987-89) కోర్సు చేశాను. చిట్టచివరి పరీక్షలు రాసేశాక సర్టిఫికెట్ తీసుకో కుండానే వచ్చేశాను. ఆ కోర్సు ఇంచుమించుగా నిరర్థకమైనది, సమయాన్ని వృథా చేసేది కావడం వల్లనే నేనా సర్టిఫికెట్ తీసుకోవాలని కూడా అనుకోలేదు. వస్తు తయారీ రంగం భారతదేశపు అతి పెద్ద సమస్యగా ఉన్న నిరుద్యోగానికి గొప్ప పరిష్కారాన్ని చూపగలదని అంటున్నారు కాబట్టి, ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. అది నిజమేనా? నేనలా అనుకోవడం లేదు. ఎందుకో చూద్దాం. 2011లో హార్వార్డ్ ‘కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’కు చెందిన లాన్ ప్రిచెత్ భారత విద్యావిధానం గురించి ఇలా చెప్పారు: ‘‘భారత ఉన్నత వర్గాలకు నిజంగానే గొప్ప విద్య అందుతోంది... ప్రపంచ స్థాయిలో పదిహేనేళ్లు పైబడ్డ 10 శాతం అగ్రశ్రేణి విద్యార్థులను ఎక్కువగా తయారు చేసే దేశాలేవో చూస్తే భారత్ మొదటి వరుసలో ఉంటుంది. అది ఏడాదికి 1,00,000 మంది ప్రపంచస్థాయిలోని 10% అగ్రశ్రేణి విద్యార్థులను తయారు చేస్తుందని అంచనా. ప్రపంచస్థాయిలోని 10% అగ్రశ్రేణి విద్యార్థులను 1,00,000 మందిని తయారుచేసే దేశమే... ఎలాంటి నైపుణ్యాలూ లేని వారిని లక్షల్లో తయారుచేస్తుందంటే నమ్మశక్యం కాదు.’’ ఈ మాటలు కటువుగా ఉన్నాయా? కాదంటాను. నా అనుభవం ఏమిటో చెబితే మీరూ ఆ మాటలు సమంజసమైనవేనని అంగీకరిస్తారు. ప్రిచెత్ చెప్పిన అధ్వానమైన విద్యకు సంబంధించిన మొదటి అంశం, ప్రాథమిక పాఠశాల స్థాయిది. ఆ స్థాయి పిల్లల చదవగల, లెక్కించగల శక్తిసామర్థ్యాలపై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి. కాబట్టి అదే విషయాన్ని నేను ఇక్కడ మళ్లీ ఏకరువు పెట్టను. ఇక ఆయన చెప్పిన రెండో అంశం, ప్రత్యేక రంగాలకు సంబంధించినది. మన దేశంలోని ఎంబీఏ పట్టభద్రులలో 7% మాత్రమే ఉద్యోగాల్లో నియమించ దగినవారని ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియాస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (అసోచాం) కొద్ది రోజుల క్రితం జరిపిన అధ్యయనంలో తెలిసింది. ఐటీ పరిశ్రమలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. మన పట్టభద్రుల్లో 90%, ఇంజనీర్లలో 75% శిక్షణ గరపడానికి తగిన అర్హతలు లేనివారని ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్’ (నాస్కామ్) అధ్యయనం నిర్ధారించింది. మన విద్యాసంస్థలు ఉద్యోగాల్లో నియమించలేని భారతీయులను తయారు చేస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ను గొప్ప వ్యూహంగా చెయ్యాలంటే వ్యవ సాయ పనులలో ఉన్న వారికి తగిన శిక్షణనిచ్చి ఫ్యాక్టరీ ఉద్యోగాలకు తరలించాల్సి ఉంటుంది. ఈ కర్తవ్యాన్ని పాలిటెక్నిక్ కళాశాలల స్థాయిలోనే నిర్వహించాల్సి ఉంది. నేను జౌళి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన రెండేళ్ల డిప్లొమా కోర్సును చదివాను. అప్పుడు నాకు నేత మగ్గాన్ని వాడటం, వడకడం తదితర దారం తయారీ పనులు ఎలా చెయ్యాలో బోధించారు. పాలిటెక్నిక్ కళాశాలలన్నీ అక్కడ ఉండాలని కోరుకోని వారితోనే నిండిపోయి ఉన్నాయని ముందుగా తెలుసుకోవాలి. మాలో చాలా మందిమి అప్పుడే పదో తరగతి పాసైన 16 లేదా 17 ఏళ్ల ప్రాయం వాళ్లం. ఇంకా పెద్ద చదువులు చదవాలనే ఆసక్తిగానీ లేదా గొప్ప ఆశయాలుగానీ లేని వాళ్లం. పాఠశాల చదువు పూర్తిచేశాక, డిగ్రీ కళాశాలలో చేరలేక అక్కడికి చేరిన బాపతు వాళ్లం. బ్లూ కాలర్ (పారిశ్రామిక కార్మికులుగా) పనులు చేయాలని చేరిన వాళ్లు ఎవరైనా ఉన్నట్టు నాకైతే గుర్తులేదు. నా రెండేళ్ల పాలిటెక్నిక్ కళాశాల చదువు అనుభవం ఇది: మేం పనిచేసిన యంత్రాలు నిజంగా పనిచేసేవేం కాదు. అంటే ఆ యంత్రా లను మేం చూడగలమే తప్ప వాటితో పనిచేయించలేం. ఒక కార్మికుడు పని చేసినట్టుగా మేం వాటితో పనిచేసి ఎరుగం. పరికరాలు తదితర సాధన సంపత్తి అంతా కాలం చెల్లినవి (నెహ్రూ ప్రారంభో త్సవం చేసిన యంత్రాలు, అంతకంటే పూర్వ కాలం నాటివి కూడా). చాలా వరకు పనిచేయని యంత్రాలపైనే జాకార్డ్, డాబీ నేత పనిని మాకు నేర్పారు. వాటర్ జెట్ లూమ్స్గానీ, వడకడానికి సంబంధించిన నిజమైన ఆధునిక సాధన సంపత్తిగానీ ఏవీ ఉండేవి కావు. దశాబ్దాల క్రితం అహ్మదాబాద్ మిల్లులలో ఉపయోగించిన పత్తిని వడకడానికి సంబంధించిన యంత్రాలపైనే ప్రధానంగా మా కోర్సు ఉండేది. పాలియెస్టర్ దారం, వస్త్ర తయారీల గురించి సిద్ధాంతాన్ని బోధించేవారు. అంటే అవెలా చేయాలో మాకు తెలియదు. నూలు యంత్రాలు సైతం సాధారణంగా విద్యుదీకర ణ చేసినవి కావు. మా ఉపాధ్యాయులంతా యంత్రాల మీద పని చేయని వైట్ కాలర్ ఉద్యోగులే ఉండేవారు. మిల్లుల్లో పనిచేసిన అనుభవం ఉన్న బ్లూ కాలర్ స్టాఫ్ (కార్మిక సిబ్బంది) మాకు బోధించేవారు కారు. కాబట్టి ఎలాంటి శిక్షణనూ పొందని వారే మాకు బోధించేవారుగా ఉండేవారు. తరగతులు ఇంగ్లిష్ మీడియంలో సాగేవి. మేమెన్నడూ వాస్తవంగా యంత్రాలపై పనిచేయకుండానే మమ్మల్ని పరీక్షించేవారు (మౌఖిక పరీక్ష సహా). మా చుట్టూ ఉన్నవాళ్లు ఎలా పనిచేస్తారో, వారు మరింత సమర్థవంతంగా ఎలా పనిచేయగలుగుతారో తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే మేం వారికి ఆజ్ఞలు జారీ చేయాల్సి ఉంటుందని భావించేవారు. అక్కడి విద్యార్థులంతా మధ్యతరగతి వారే. వారిలో చాలా మంది ఆసక్తితో గాక మరే అవకాశమూ లేక ఆ కోర్సులో చేరినవారు. అందరు విద్యార్థులూ ఆ తర్వాత డిగ్రీ కోర్సులో చేరాలని కోరుకునేవారు. కుటుంబ వ్యాపారాలున్నవారు తప్ప, చాలా మంది ఆ పనే చేశారు. అంతే గానీ, మాలో ఎవరూ ఫోర్మాన్ పని చేయలేదు. నేను ఆ డిప్లొమా కోర్సు ముగిసిన వెంటనే మా కుటుంబ వ్యాపారమైన పాలియెస్టర్ నేత, బట్టతయారీ పనిలో చేరాను. అయితే అంతా మొదటి నుంచి ప్రారంభించి నేర్చుకోవాల్సి వచ్చింది. ఆనాటి నా సహచర విద్యార్థుల్లో ఎవరూ ఫ్యాక్టరీలో సమర్థవంతంగా పనిచేసి ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు మాకా పనిలో శిక్షణను ఇచ్చిందే లేదు. ఎమ్ఎస్ విశ్వవిద్యాలయం నుంచి నేను నా డిప్లొమాను సంపాదించగలిగి నట్టయితే... దాన్ని ఫ్రేమ్ కట్టించి నా జీవితంలో రెండేళ్లను నేనెలా పూర్తిగా వృథా చేశాననే దానికి గుర్తుగా ఉంచుకుంటాను. దానికి అంతకు మించిన ప్రయోజన మేమీ లేదు. వ్యాసకర్త: ఆకార్ పటేల్ (కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నిజం కానుందా?
అవలోకనం క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిలో ఉండి, ప్రభుత్వ వ్యతిరేక గాలి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో సైతం విజయాన్ని సాధించగల జీవశక్తి కాంగ్రెస్లో ఉన్నట్టు అనిపించడం లేదు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ల విషయంలోనూ, శాశ్వత కాషాయ రాష్ట్రాలుగా మారిన గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల విషయంలోనూ కూడా ఇది నిజం. కాంగ్రెస్కు సౌకర్యవంతంగా ఉన్నదని చె ప్పగల రాష్ట్రం దేశంలో ఒక్కటైనా లేదు. ఈ దఫా జరుగుతున్న శాసనసభ ఎన్నికలు గాంధీ కుటుంబానికి ఘోర దుర్వార్తలను మోసుకురానున్నాయి. అవి చర్చను తిరిగి ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’కు తీసుకు వస్తాయి. అది ఈసారి జరగకపోతే ఎప్పుడు జరగనున్నదనేదే మిగిలే ప్రశ్న. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన పిలుపుగా మనం మొదటిసారిగా ‘కాంగ్రెస్-ముక్త్ భారత్’ అనే మాట విన్నాం. కాంగ్రెస్ను తుడిచిపెట్టేయండని దాని అర్థం. బీజేపీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఎంత వరకు సఫలమైంది? మొత్తంగా పరిస్థితిని ఒక్కసారి పరికించి చూద్దాం. మొత్తం ఏడు రాష్ట్రాలలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. వీటిలో ఈశాన్యంలోని మూడు చిన్న రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్, మేఘా లయలూ, దక్షిణాదిలోని రెండు ప్రధాన రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకలూ, ఉత్తరా దిలోని రెండు చిన్న రాష్ట్రాలు హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఉత్త రాఖండ్లో కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలుగుతుందా? అనే అను మానాలున్నాయి. కాబట్టి దాన్ని ఈ విశ్లేషణ నుంచి మినహాయిద్దాం. అక్కడ వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. గత నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దఫాలవారీగా అధికారాన్ని మార్చుకుంటున్నాయి. కాబట్టి ఈసారి అక్కడ కాంగ్రెస్ తిరిగి గెలిచే అవకాశాలు చాలా తక్కువ. హిమాచల్ప్రదేశ్లో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోప ణలపై సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎంత కాలం మనగలరనేది చెప్పడం సులువేమీ కాదు. పైగా అక్కడ ప్రతి పక్షంలో ఉన్న బీజేపీకి సుప్రసిద్ధుడైన స్టార్ నేత ఉన్నారు. ఆయన, అత్యంత శక్తివంతమైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధిపతి అనురాగ్ ఠాకూర్. ఆయనకు సాటి రాగల కరిష్మాగల నేతలెవరూ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్కు లేరు. ఇక కేరళలో, ఈసారి ఎన్నికల్లో వామపక్ష కూటమి చేతుల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని అభిప్రాయ సేకరణలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 19న వెలువడతాయి. ఆ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి కాంగ్రెస్ ఓటమి ఆశ్చర్యం కలిగించదు. ఆ ఎన్నికల్లో గమనించదగ్గ అంశాలు రెండే. ఒకటి, దేశవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయిన కమ్యూనిస్టుల చేతుల్లో కూడా ఓడిపోగల సామర్థ్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించడం. రెండు, మళయాళీ హిందువు లలో మెల్లగా మద్దతును పెచుకుంటున్న బీజేపీ ఓట్ల శాతం పెరగడం. కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వరుసగా పలు కుంభకోణాలను ఎదు ర్కోవాల్సి వచ్చింది. వాటిలో ఒకటి, ఆయన తన స్థోమతకు మించిన విలా సవంతమైన వాచీలను ధరించడం (అవి తనకు కానుకలుగా ఇచ్చినవని ఆయన అంటున్నారు). ప్రభుత్వ కాంట్రాక్టులను పొందిన ఒక కంపెనీలో ఆయన కుమారుడు భాగస్వామిగా ఉండటం మరొకటి. అక్కడి మరో ముఖ్య పరిణామం, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి ఆ పార్టీ నాయకునిగా రంగప్రవేశం చేయడం. అవినీతి ఆరోపణల కారణంగా ఆయన గత శాసనసభకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినా పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయతులలో ఆయనకు బాగా పలుకుబడి ఉంది. ఆయన తిరిగి పార్టీలోకి రావడమంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఎక్కువ అవకాశాలు న్నాయనే అర్థం. మరో రెండేళ్లలో అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు రాష్ట్రాలలో ఒకటైన అస్సాంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రెండవది, బెంగాల్. అస్సాంలో బీజేపీ సునాయాసంగా, మంచి ఆధిక్యతతో గెలుస్తుందని జనాభిప్రాయ సేకరణలు తెలుపుతున్నాయి. ఆ అంచనాలు 2014 జాతీయ ఎన్నికల ఫలితాల సరళికి అనుగుణంగానే ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు వలస రావడం అక్కడి ఎన్నికల ప్రచారంలో ప్రధాన చర్చనీయాంశంగా మారడంతో బీజేపీ దాని వల్ల ప్రయోజనం పొందడంలో అత్యంత అనుకూల స్థానంలో ఉంది. ఇక బెంగాల్లో కాంగ్రెస్, బాగా బలహీనపడ్డ వామపక్షాలతో చేయి కలిపి మమతా బెనర్జీ పార్టీతో తలపడుతోంది. జనాభిప్రాయ సేకరణలు పోటీ తీవ్రంగా ఉంటుందని చెబుతున్నాయి. అయితే, మమత ప్రభుత్వం అవినీతి, అసమర్థత, ఆశించిన ఫలితాలను అందించలేకపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్నా తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని అవి సూచిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ ఉనికిలో ఉండి, ప్రభుత్వ వ్యతిరేకత గాలి తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో సైతం విజయాన్ని సాధించగల జీవశక్తి కాంగ్రెస్లో ఉన్నట్టు అనిపించడం లేదు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ల విషయం లోనూ, శాశ్వత కాషాయ రాష్ట్రాలుగా మారిన గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల విషయంలోనూ కూడా ఇది నిజం. ఈశాన్యంలో, రాజకీయాలు నిజంగానే భావజాలపరమైనవి కావు. స్థానిక నేతలు ఢిల్లీ గద్దెపై ఏ రాజకీయ పార్టీ ఉంటే దానితో జత కలుస్తారు. అక్కడ ఇప్పుడున్న మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలూ అదృశ్యమైపోయే అవకాశమూ ఉంది. కాంగ్రెస్కు సౌకర్యవంతంగా ఉన్నదని చె ప్పగల రాష్ట్రం ఒక్కటైనా లేదు. రాజకీయేతర విషయాలకు సంబంధించి కూడా జాతీయ మీడియాలో ఆ పార్టీ ప్రతిష్ట 2011 నుంచి, అన్నా హజారే ఉద్యమ కాలం నుంచి దెబ్బ తింటూ వస్తూనే ఉన్నట్టనిపిస్తోంది. జాతీయవాదం, ఉగ్రవాదం, అవినీతి వంటి సమస్యలపై ఆ పార్టీ రక్షణ స్థితిలో ఉంది. రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రా అతి తరచుగా ప్రతికూలమైన విషయాలతో వార్తలకెక్కుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ పెద్ద మార్పును ఏమీ సాధించలేని అశక్తతను ప్రదర్శిస్తున్నా కాంగ్రెస్ ఆ కథనాన్ని వినియోగించుకోలేకపోతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికంటే ఎక్కువగా గాంధీ కుటుంబం వార్తల ఎజెండాగా ఏమి ఉండాలనేదాన్ని నిర్ణయించలేకపోతోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలు, నితీశ్ కుమార్ లాంటి రాష్ట్ర స్థాయి నేతలు కాంగ్రెస్ను దెబ్బతీస్తూ ప్రతిపక్ష నాయ కులుగా విశ్వసనీయతను సంపాదించుకుంటున్నారు. ఈ దఫా జరుగుతున్న శాసనసభ ఎన్నికలు గాంధీ కుటుంబానికి ఘోర దుర్వార్తలను మోసుకురానున్నాయి. అవి చర్చను తిరిగి ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’కు తీసుకు వస్తాయి. కాకపోతే అది ఈసారి జరగకపోతే ఎప్పుడు జరగనున్నదనేదే మిగిలే ప్రశ్న. వ్యాసకర్త: ఆకార్ పటేల్ (కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
నినాదాలపై నిఘా సరే... ఆకలికేకల మాటో..?
అవలోకనం ఆంగ్లీకరణకు గురైన మధ్యతరగతిలోని మనం.. భారతదేశంలోని మెజారిటీ ప్రజల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోం. మన బాధలు, ఆరాటాలు, ఆదుర్దాలను మాత్రమే చర్చించాలని తాపత్రయ పడుతుంటాం. మిగిలిన భారతీయులందరూ మనకు అసందర్భం కిందే లెక్క. ఇది జాతి వ్యతిరేకత కాకపోతే దీన్ని మరే పేరుతో పిలవాలి? ఒక విధంగా చూస్తే భారత్ ఓ ప్రత్యేక జాతి. తమది కాని, ప్రజానీకం ఉపయోగించే భాషకు భిన్నమైన భాషలో మాట్లాడే కులీన వర్గాన్ని కలిగిన ఒకే ఒక ప్రధాన దేశం మనది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ మరే ఇతర ప్రధాన నగరం విషయంలో అయినా సరే ఇది ముమ్మాటికీ నిజం. కులీనవర్గం అంటే నా దృష్టిలో జనాభా పరంగా మైనారిటీ లో ఉన్నప్పటికీ ఆర్థిక ఎజెండాలో, జాతీయ వార్తల ఎజెండాలో ఆధిపత్యం చలాయిస్తున్న వర్గమని అర్థం. ఐదు కోట్లమంది భారతీయులకు మాత్రమే పాస్పోర్టులు ఉన్నాయని ప్రభుత్వ డేటా చెబుతోంది. అంటే జనాభాలో ఐదు శాతం మంది అన్నమాట. నా అంచనా ప్రకారం ఇంగ్లిష్ను తమ ప్రథమ భాషగా కలిగిన భారతీయుల కంటే వీరి సంఖ్య ఎక్కువన్నమాట. వీరు తమ ‘మాతృభాష’లో అంటే హిందీ, గుజ రాతీ, తమిళం, మరాఠీ, తెలుగు, ఒరియా, కన్నడ వంటి భాషల్లో మాట్లాడగలు గుతూ ఉండొచ్చు కానీ అంత బాగా మాట్లాడలేరు. అక్షరాలను చదవొచ్చు కానీ వీరు ఈ ‘మాతృభాష’లో సాహిత్యం లేదా వార్తలను చదవలేరు. టీవీ సీరియళ్లు, సినిమా వంటి వాటిలో సంగీతం కోసం తప్పితే, వీరి సాంస్కృతిక ప్రాధాన్యత ఇంగ్లిష్లోని విషయంపైనే మొగ్గుచూపుతుంటుంది. భారతీయులు సాధ్యమైనంత ఎక్కువగా ఇంగ్లిష్ మాట్లాడుతూ, రాస్తుంటా రని, అందుకే ఇప్పుడు ఇంగ్లిష్ని భారతీయ భాషగా గుర్తిస్తున్నారని చెబుతున్నారు. దీన్ని నేను షరతులతో ఒప్పుకుంటూనే, మన టీవీ చానళ్లలో మాట్లాడు తున్న, మన మీడియాలో రాస్తున్న ఇంగ్లిష్ అసలైన భాషకు ముతక రూపం మాత్ర మేనని చెప్పదలిచాను. మరి ఈ రకమైన ఇంగ్లిష్ ఆధిక్యత మనల్ని ఏయే రూపాల్లో ప్రభావితం చేస్తోంది? మొదటి అంశం ఏమిటంటే, పట్టణ మధ్యతరగతి ప్రజల ఆరాటాలను, ఆదుర్దాలను జాతీయ ప్రాధమ్యాలుగా ముందుపీటిని ఉంచడం. పోషకాహార లోపం వల్ల దేశంలో సంభవిస్తున్న మరణాల కంటే విద్యార్థుల నినాదాలకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టడానికి మన మీడియా అమితాసక్తి చూపు తోంది. జాతి వ్యతిరేక నినాదాల వల్ల ఎంతమంది భారతీయులు నేరుగా ప్రభావి తులవుతున్నారో అస్పష్టమే. ఆ నినాదాల వల్ల దేశభక్తిపరులుగా మనం విచారం వ్యక్తం చేసి ఉండొచ్చు. కాని ఆ నినాదాలు మాటలు మాత్రమే. అదే సమయంలో ఒక సంవత్సరంలో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతి ఏటా దేశంలో పోషకాహార లోపం వల్ల 5 లక్షల మంది భారతీయ పిల్లలు విషాద మరణాలకు గురవుతు న్నారు. కానీ టీవీల్లో ఆగ్రహావేశాలతో కూడిన చర్చకు తగిన విషయంగా ఈ మరణాలకు చోటు లభించడం లేదు. ఎందుకంటే ఈ మరణాలు ఇంగ్లిష్ మాట్లాడే మధ్యతరగతిని ఏమాత్రం ప్రభావితం చేయవు. దీనివల్లే మన ఆర్థిక ప్రాధాన్యతలు వక్రీకరణకు గురవుతున్నాయి. జాతీయ వాద మధ్యతరగతిపైనే మీడియా దృష్టి పెడుతోంది కాబట్టి మనం లక్ష కోట్ల విలు వైన బుల్లెట్ ట్రైన్పైనే తీవ్రంగా చర్చిస్తుంటాము. దేశంలో 30 కోట్లమంది ప్రజలు హీనావస్థలో కాకున్నా భయంకరమైన దారిద్య్ర పరిస్థితుల్లో ఉంటున్న విషయం మన కంటికి ఆనదు. దీనికి కారణం చాలా సాధారణమైనది. భారత్లో పేదలకు తమదైన వాణి లేదంతే. మన దేశంలో రాజకీయాలు ఈ మధ్యతరగతి తోనే తీవ్ర వైపరీత్యంతో ప్రభావితం అవుతున్నాయి. ప్రతి సంవత్సరం, కశ్మీరీ వేర్పాటు వాదం లేదా ఇస్లామిక్ ఉగ్రదాడుల కంటే ఎక్కువగా ఈశాన్య భారత్ లేదా మధ్య భారత్లోని తీవ్రవాదుల దాడుల్లోనే భారతీయులు అధికంగా చనిపోతున్నారు. దీనికి సంబంధించిన డేటా చాలా స్పష్టంగా ఉంది. కాని మన పట్టణ మధ్య తరగ తి ఆదుర్దాను ప్రతిఫలిస్తుంది కాబట్టే మీడియాలో ఇస్లామిక్ ప్రమాదంపై పదే పదే చర్చలు జరుగుతుంటాయి. అదే సమయంలో మావోయిస్టు తీవ్రవాదం, ఈశాన్య భారత్లోని వేర్పాటువాదం వీరిని అంతగా ప్రభావితం చేయదనుకోండి. ఇందు వల్లే పాకిస్తాన్కు ఎదురొడ్డుతున్న మన సైనికులు ప్రమాదవశాత్తూ చనిపోయినా వారిని హీరోలుగా చూపిస్తుంటాం. సౌరవ్ కాలియా నుంచి హనుమంతప్ప వరకు సరిహద్దుల్లో చనిపోతున్న పలువురి సైనికుల పేర్లు మధ్యతరగతి భారతీయులకు సుపరిచితమే కానీ ఈశాన్య భారత్లో లేదా ఛత్తీస్గఢ్లో నేలకొరిగిన ఒక పోలీసు లేదా పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్న వారి పేర్లు చెప్పాలంటే మన మధ్య తరగతి తల్లకిందులైపోతుంటుంది. వందలాది భారతీయులు బోట్లు తల్లకిందులై, ఆలయాల్లో తొక్కిసలాటకు గురైన ఘటనల్లో మరణించడం గురించి మన పత్రికలు నిత్యం నివేదిస్తూనే ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో యాదృచ్ఛికంగా విషాహారాన్ని ఆరగించి పిల్లలు మరణించడంపై, నేత్ర చికిత్స శిబిరాల్లో చూపు కోల్పోయిన అంధులపై, కల్తీ సారా వల్ల చూపు కోల్పోతున్న, చనిపోతున్న వారిపై మనం వార్తలు చూస్తూనే ఉంటాం. కాని విద్యార్థుల నినాదాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇలాంటి ఘటనలపై టీవీ చర్చలో లభించదు. కులీనవర్గానికి చెందిన ఒక మహిళ హత్యకు (షీనా బోరా కేసులోవలే) ఇస్తున్న కవరేజితో దీన్ని పోల్చి చూడాలని నేను సూచిస్తున్నాను. ఆంగ్లీకరణకు గురైన మధ్యతరగతిలోని మనం భారతదేశంలోని మెజారిటీ ప్రజల సమస్యలను పట్టించుకోం. మన బాధలు, ఆదుర్దాలను మాత్రమే చర్చించాలని మనం తాపత్రయపడుతుంటాం. మిగిలిన భారతీయులందరూ మనకు అసంద ర్భం కిందే లెక్క. ఇది జాతి వ్యతిరేకత కాకపోతే దీన్ని మరే పేరుతో పిలవాలి? ఇంగ్లిష్ ఆధిపత్యంకి సంబంధించి మరొక అంశాన్ని చూద్దాం. యూరప్ శాస్త్రీయ సంస్కృతిలోకి భారత మధ్యతరగతి చాలా తక్కువగా చొచ్చుకుపో యింది. మనం జనరంజకమైన వాటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటాం. యూరప్ శాస్త్రీయ సంగీతాన్ని, దాని ఏకస్వరమేళనను అర్థం చేసుకోనిదే యూరప్ సంస్కృతి గురించి అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. భారత్లో ఏక స్వర మేళన సంప్రదాయం లేదు. అంటే ఏకకాలంలో రెండు స్వరాలను ఆలపిస్తుం టాం. శాస్త్రీయ సింఫనీ కచ్చేరీని చూస్తున్నవారు ఆ కచ్చేరీలో హీరో లేకపోవడాన్ని గుర్తిస్తారు. సింఫనీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కండక్టర్ (నిర్వాహకుడు) అంటారు. ఈ నిర్వాహకుడు కనీసం ఒక పరికరాన్ని కూడా వాయించరు. తను సమయాన్ని మాత్రమే నిర్వహిస్తుంటారు. సింఫనీలో సంగీతకారులందరూ సమానమే. అదే హిందూస్తానీ లేదా కర్ణాటక సంగీత కచ్చేరీలో అంతరాల వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంటుంది. యూరప్ సమాజానికి ఈ సాంస్కృతిక సమానత్వం, ఏకస్వరమేళనకు ఉన్న సంబంధం ఏమిటి? నిజమైన టీమ్ క్రీడగా చెబుతున్న ఫుట్బాల్ వంటి క్రీడల్లో వారిని ఉత్తమ జట్లుగా నిలుపుతున్నది ఇదేనా? భారతీయులకు ఇది తెలియక పోవచ్చు. పాశ్చాత్య దేశాల్లో మన భారతీయులకు ఆసక్తికరమైన ఏకైక అంశం ఏదంటే పాప్ మ్యూజిక్, ట్వీటర్. ఇవి గాఢతను లేదా అర్థవంతమైన ఏర్పాటును కలిగి ఉండదు. ఇది సారహీనమైనది. అందుకే అనివార్యంగా అర్ధవంతమైనది కాదు. నిజమే. ఇంగ్లిష్ను నేర్చుకోవడం వల్ల భారతీయులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆర్థికపరమైనది. ఇక్కడ సైతం మధ్యతరగతికే ప్రయోజనాలు కలుగుతున్నాయి. కానీ, మన జాతీయ సంవాదం, మన ప్రాధమ్యాలు, మన ఎజెండాకు ఇంగ్లిష్ మాట్లాడుతున్న మధ్యతరగతి కల్గించిన నష్టం తీవ్రాతితీవ్రమైంది. ఆ నష్టాన్ని పూరించడం కూడా సాధ్యం కాదు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
మాటలలో తప్ప చేతలలో కానరాని దేశప్రేమ
ప్రపంచ మంతా తిరిగి చూసినా భారతీయులు తప్ప మరెవరూ ఉయోగించని కొన్ని పదాలు ఉన్నట్టు నేను గమనించాను. ‘నాన్-వెజిటేరియన్’ (శాకాహా రులు కానివారు) అనే పదం ఒక్క అగ్రకులాల, మధ్యతరగతి భారతీయులు మాత్రమే వాడే పదం. మరే ఇతర దేశస్తులకూ ‘నాన్-వెజ్’ అనే పదం తెలియనే తెలియదు. ఒక్క భారత విమానాల్లో తప్ప మరే విమానాల సిబ్బంది ‘వెజ్’ ఆహారం కావాలో, ‘నాన్-వెజ్’ ఆహారం కావాలో ఎంచుకోమని అడగరు. మిగతావారంతా ‘మాంసం’, లేదా ‘చేప’, లేదా ‘చికెన్’ మాత్రమే ఉన్నాయంటారు. అవే ప్రామాణిక భోజన పదార్థాలు. శాకాహారం కావాలంటే ప్రత్యేకంగా కోరవలసి ఉంటుంది. అలాగే, ‘జాతి వ్యతిరేక’ అనే పదం యూరప్ లేదా అమెరికాలో ఎక్కడా వినిపించదు. ఆ పదానికి వ్యతిరేకార్థమిచ్చే ‘జాతీయవాదం’ అనే పదానికి వారి భాషల్లోని అర్థం మంచిది కాకపోవడమే అందుకు కారణం. యూరప్లో రెండు గొప్ప యుద్ధాలకు కారణమైనది జాతీయవాదమే. జాతీయవాద స్వభావం కలిగినవారుగా గుర్తింపు పొందడమంటే ప్రతికూల ముద్రను వేయించు కోవడంగానే అక్కడ చూస్తారు. జాతీయవాదం అనే పదాన్ని మనం ఎంతో సులువుగా ప్రయోగించేస్తుంటాం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలా ఆ పదాన్ని పార్టీ పేర్లలోనూ పెట్టుకుంటారు. కానీ ఏ ఒక్క యూరోపియన్ రాజకీయ పార్టీ జాతీయవాదమనే పదాన్ని ఉపయోగిస్తుందని అనుకోలేను. హిందీ, గుజరాతీలలో జాతీయవాదానికి సమానార్థక పదం ‘రాష్ట్రవాది’. అది కాస్త సౌకర్యవంతమైన పదం. ‘రాష్ట్ర’ అనేది వ్యక్తిలో కోరుకోదగిన పదం. అందుకు భిన్నంగా ‘జాతి’ అనే పదం తటస్థమైనది. ‘జాతీయవాదం’కు ఉర్దూలోనైతే కచ్చితమైన సమానార్థకాన్నిచ్చే ‘కవామ్ పరస్తి’ అనే పదం ఉంది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీ జాతీయవాదాన్ని ‘ఇతర దేశాలకన్నా ఆధిక్యతను వ్యక్తంచేసే తీవ్ర దేశభక్తి రూపం’గా నిర్వచించింది. మరియం-వెబ్స్టర్ డిక్షనరీ దాన్ని ‘ఒక జాతిని మిగతా వారందరి కంటే ఎక్కువ చేసి మాట్లాడుతూ, మిగతా జాతుల, జాతీయాతీత శక్తుల సంస్కృతికి, ప్రయోజనాలకు విరుద్ధంగా తన సంస్కృతిని, ప్రయోజనాలను పెంపొందింపజేసేలా ప్రథమ ప్రాధాన్యా న్నిచ్చేట్టు చేసే’ గుణం. ఈ నిర్వచనం, భారత జాతీయవాదాన్ని కచ్చితంగా అభివర్ణిస్తుందని అనిపిస్తుంది. జాతీయవాద రక్షణ కోసం భారతీయులు ఎంతగా ఉద్వేగ భరితులవుతారో గత కొన్ని రోజులుగా మనం చూశాం. భరతమాత పట్ల మన దృష్టితో విభేదించే నినాదాల పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపాం. హింసకు దారితీయనంత వరకు ఈ అభ్యంతరంతో నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. దురదృష్టవశాత్తూ, ఈసారి కూడా చాలా సార్లు జరిగినట్టే అది హింసకు దారి తీయడం నన్ను ఆశ్చర్యపరచలేదు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వ్యవహారంపై రెండు రోజులు వరుసగా న్యాయవాదులు కోర్టులో ప్రవర్తించిన తీరు మన సంస్కృతికి పూర్తిగా అనుగుణంగానే ఉంది. అయితే నేను మరో విషయం గురించి రాయదల్చుకున్నాను. కాబట్టి ‘జాతీయవాదం’కే తిరిగి వస్తే, భారతీయులు ఇంకా ఏ ఏ ఇతర రూపాల్లో దాన్ని ప్రదర్శిస్తుంటారు? టెలివిజన్ చర్చలను బట్టి చూస్తే, నినాదాలను వ్యతిరేకించడంలోనూ, దేశ ఐక్యత, సమగ్రతల పరిరక్షణ విషయంలోనూ మన మధ్యతరగతిలోని అత్యధికులు జాతీయవాదులనేది స్పష్టమే. అయినాగానీ కేవలం 3 శాతం భారతీయులు మాత్రమే ఆదాయం పన్ను చెల్లిస్తారు. ప్రత్యేకించి ఈ విషయంలో ‘జాతీయవాదం’ బలంగా కనబడదు. అలాగే, పన్నులు చెల్లించేవారిలో అధికులు జీతాలు పుచ్చుకునే వ్యక్తులే. వారి పన్నును యాజమాన్యమే జీతంలోంచి మినహాయించేస్తుంది. తద్వారా పన్నుల దొంగతనానికి పాల్పడే అవకాశం వారికి లేకుండా చేస్తారు. ఈ వేతన మధ్యతరగతి వారు సైతం తమ ‘సాలరీ బ్రేక్-అప్’తో (జీతాన్ని వివిధ విభాగాలుగా చూపడం) పలు జిత్తులను ప్రయోగిస్తుంటారు. కానీ అ విషయాలను చర్చించే సందర్భం కాదిది. టీడీఎస్ అనేది కూడా భారతీయులకే ప్రత్యేకమైన పదబంధం. అది మధ్యతరగతి భారతీయులకే తెలుసు. ‘ఆదాయపు పన్నును మూలం నుంచే మినహాయించుకోవడం’ అని దానర్థం. నాకు తెలిసి మరే దేశంలోనూ ఇలాంటిది ఉన్నట్టు ఎరుగను. పౌరులు కొంత మేరకు దొంగతనం చేస్తారని ప్రభుత్వం ముందస్తుగా ఊహించి, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ముందే ఆదాయం పన్నును మినహాయించేసుకుంటుంది. అలా మినహాయించుకున్న డబ్బులో మీకు వాపసు ఇవ్వాల్సిన దాన్ని రాబట్టుకో వడం సులువేమీ కాదు. అయితే అది కూడా ఇక్కడ చర్చనీయాంశం కాదు. నినాదాలు చేసిన వారిపై ఆగ్రహంగా వ్యక్తమైన ఉద్వేగభరితమైన మన దేశ ప్రేమ, ఇతర విధాలుగా దేశం పట్ల శ్రద్ధ చూపడానికి విస్తరించదు. ఈ భూమండలం మీదే మనం అత్యంత మురికి జీవులం. మన పరమ పవిత్ర నది గంగను సుప్రీం కోర్టు ఆదేశిస్తే మాత్రమే శుభ్రం చేయగలం, అది కూడా ఎంతో కష్టంతో. పౌరులు స్వచ్ఛందంగా దేశం మీద తమ ప్రేమను చూపరు. దేశ చట్టాలను అలవోకగా ఉల్లంఘించడం కూడా భారతీయుల ప్రత్యేకతే. ‘చట్ట విరుద్ధ నిర్మాణం’, ‘దురాక్రమణ’ అనే పదాలే అందుకు ఉదాహరణ. 30 ఏళ్లుగా అమెరికా, యూరప్లకు ప్రయాణాలు సాగిస్తున్నాను. అయినాగానీ అలాంటి పనులు చేసే వ్యక్తులెవరూ నాకు తారసపడలేదు. ఇక్కడయితే ఆ పనులు చేయడం నినాదాల మీద అగ్రహం వెలిబుచ్చడమంత సర్వ సాధారణం. చూడబోతే మన జాతీయవాదం పరిమితమైనదిలా కనిపిస్తోంది. జేఎన్యూ సమస్యకు ప్రభుత్వ ప్రతిస్పందనగా మన విశ్వవిద్యాలయాలన్నీ జాతీయ జెండాను ఎగురవేయాలని శాసించారు. ఇదేమైనా సరైన ప్రభావాన్ని కలుగజేస్తుందా? భరతమాత పట్ల మన భావోద్వేగం సుదృఢమైనది. అయితే అది మన నిజ ఆచరణలో, ప్రవర్తనలో వ్యక్తం కావడం లేదు. మన సెంటి మెంట్లలోనే వ్యక్తమౌతోంది. ఇతరుల చర్యలకు మన ప్రతిచర్యగా మాత్రమే ఆ భావన ఎంత బలమైనదో తెలుస్తుందే తప్ప మన సొంత చర్యల ద్వారా మాత్రం కాదు. మన భారతీయుల విషయంలో జాతీయవాదానికి ఇంగ్లిషు నిర్వచనమే చాలా కచ్చితమైనదని అనుకుంటాను. ‘ఇతరులపై మన ఆధిక్యత’ గురించే ప్రధానంగా మనకు పట్టింపు ఎక్కువ. ‘ఇతరుల సంస్కృతికి, ప్రయోజనాలకు విరుద్ధంగా మన సంస్కృతిని, ప్రయోజనాలను పెంపొందింపజేయడా’నికే మన ప్రాధాన్యం. దేశం కోసం ఏమైనా చేయడం ద్వారానూ, త్యాగాల రూపంలోనూ వ్యక్తమయ్యే నిజమైన దేశ ప్రేమ మనలో లోపించిందని అనిపిస్తుంది. అరుపులు, ఆగ్రహం మాత్రమే మనం ప్రదర్శించేది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
భూముల చోరీలో మనమూ భాగస్వాములమే
అభివృద్ధి కోసం సొంత ఫ్లాట్ ఇచ్చేసేవారు మనలో ఎవరున్నారు? మనలాగే తమ నివాసాలను వదులుకోడానికి ఇష్టపడని బలహీనులు అన్ని త్యాగాలూ చేయాలని మనం పట్టుబడతాం. ప్రభుత్వ వ్యతిరేక హింస తలెత్తితే ఏమిటిది? అని కలవరపడిపోతాం. ఆదివాసుల భూముల దొంగతనం మాటునే ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. మధ్యతరగతికి చెందిన మనం ఈ దొంగతనంలో పూర్తి భాగస్వాములం. ముంబై పొద్దర్ రోడ్లో లతా మంగేష్కర్ నివాస భవనం ఉంది. దాని ముందు ఫ్లైఓవర్ను నిర్మించేట్టయితే దేశాన్నే విడిచిపోతానని పదేళ్ల క్రితం, 2006లో లత ప్రకటించారు. మొదట ఆమె ఆ నిర్మాణం వల్ల తన గొంతు చెడి పోతుందన్నారు. ఆ తర్వాత ‘‘ఆ రోడ్డు మీద డ్రిల్లింగ్ జరిగితే పలు భవనాల పునాదులు కదిలిపోతాయ’’న్నారు. ఇంతకూ ఆ ఫ్లైఓవర్ను నిర్మించలేదనుకోండి. మన దేశంలో బొగ్గు గనుల తవ్వకాన్ని గురించి ఈ వారం నాకో కొత్త విషయం తెలిసింది. దాన్ని మీ ముందుంచుతాను. అభివృద్ధి అనే బృహత్ కార్యక్రమాన్ని మనం ఎంత న్యాయంగా చేపడుతున్నామనే దానికి చెందిన ఒకటి, రెండు అంశాలు చెబుతాను. బొగ్గు గనుల కోసం భూసేకరణపై నివేదికను రూపొందించే పనిలో ఉన్న నా సహోద్యోగి అరుణా చంద్రశేఖర్ ద్వారా అవి తెలిశాయి. ముందుగా దేశంలోని గనుల తవ్వకాన్ని నియంత్రించే చట్టాలనూ, భారత పౌరుల ఆస్తు లను, హక్కులను పరిరక్షించే చట్టాలనూ చూద్దాం. భూసేకరణలో న్యాయమైన పరిహారం, పునరావాసం, పునఃస్థాపన, పారదర్శకతల హక్కు చట్టాన్ని (భూసేకరణ చట్టం) 2014లో చేశారు. ఆ చట్టాన్ని అనుసరించి పునఃస్థాపనకు ‘‘భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే కుటుంబాల ఆమోదం అవసరం. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు లకైతే 70 శాతం, ప్రైవేటు ప్రాజెక్టులకైతే 80 శాతం కుటుంబాలు అందుకు ఆమోదం తెలపాలి.’’ అది సమంజసమనే అనిపిస్తోంది.‘‘షెడ్యూల్డ్ ప్రాంతాలలో సంబంధిత గ్రామ సభల ముందస్తు ఆమోదం అవసరమనే ఏర్పాటు కూడా ఆ చట్టంలో ఉంది.’’ దీనికి తోడు ‘‘సామాజిక ప్రభావ అంచనా’’ కూడా అవసరం. అంటే ప్రభావిత ప్రజా సమూహాలతో సంప్రదింపులు జరిపి... భూసేకరణ వల్ల ప్రజల భూములపైన, జీవనోపాధులపైన కలిగే ప్రభావాన్ని, ఆర్థిక, సామా జిక, రాజకీయ, సాంస్కృతిక పర్యవసానాలను మదింపు చేయడం. ఇది సమంజసమైనదేనని మీరు అనుకునేట్టయితే... బొగ్గు గనుల తవ్వకం కోసం తీసుకునే భూములకు ఈ చట్టం వర్తించదని కూడా మీకు తెలియడం అవసరం. బొగ్గు గనుల విషయంలో నిర్దిష్టంగా భూయజమానులతో సంప్ర దించడమనేదే లేదు. భూములు తీసుకోడానికి ముందు వారి ఆమోదం అవసరం లేదు. ఇక ప్రభావ అంచనా అనే ప్రశ్నే లేదు. లతా మంగేష్కర్ తెలిపిన అభ్యంతరం గురించి తెలిసిన పాఠకులకు... బొగ్గు గనుల కోసం భూసేకరణ వల్ల కలిగే ప్రభావంపై చంద్రశేఖర్ జరిపిన పరిశీలనలోని ఒక చిన్న అంశాన్ని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. తవ్వకం జరిగే ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య స్కూళ్లను మూసేస్తారు. స్కూలు భవనాలు కంపించిపోయేంత పెద్దగా ఆ పేలుళ్ల శబ్దాలు వినవస్తుంటాయి! ఇక షెడ్యూల్డ్ తెగలు, తదితర సంప్రదాయక అటవీవాసుల (అటవీ హక్కుల) చట్టానికి వద్దాం. ఈ చట్టం,‘‘అటవీ వాసులైన షెడ్యూల్డ్ తెగలకు, ఇతర సంప్రదాయక అటవీవాసులకు భూమి తదితర వనరులపై ఉండే హక్కులను గుర్తిస్తుంది. ఈ సమూహాల సభ్యులు తాము ఆధారపడి ఉన్న అటవీ భూమిపైన లేదా సాగుయోగ్యం చేసుకున్న భూమిపైన హక్కులను కోరవచ్చు. సమూహాలు తమ సమష్టి ఆస్తులుగా ఉన్న సమాజ లేదా గ్రామ అడవులు, మత, సాంస్కృతిక స్థలాలు, నీటి వనరులపై సైతం హక్కులను కోరవచ్చు.’’ అటవీ భూములపై హక్కులు ఎవరివని నిర్ణయించడంలో గ్రామ సభలు తప్పక కీలక పాత్ర వహించాలని చట్టం చెబుతుంది. అంతా బాగుందని అనిపిస్తోంది కదా? దురదృష్టవశాత్తూ ఈ చట్టాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆదివాసీ వ్యవహారాల శాఖే చెబుతోంది. షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీల విస్తరణ చట్టం కూడా భూసేకరణను నియంత్రి స్తుంది. దానినే పీఈఎస్ఏ అని కూడా అంటారు. ఈ చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరపడానికి ముందు, అలాంటి ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యే ప్రజల పునరావాసం, పునఃస్థాప నల కంటే ముందు పంచాయతీలను సంప్రదించడం అవసరం. చట్టం ప్రకారం సామాజిక ప్రభావ అంచనాలు అవసరమనే అంశాన్ని ‘‘దాదాపు ఎన్నడూ పాటించరు’’ అని చంద్రశేఖర్ అంటారు. ఆ మదింపు కచ్చితత్వాన్ని లేదా పరిపూర్ణతను అంచనా కట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేకపోవడం కూడా అందుకు ఒక కారణం. ప్రభుత్వం సక్రమంగా పాటించి, అమలుచేసే చట్టం ఏదైనా ఉందంటే, అది భూములను లాక్కోవడాన్ని అనుమతించే బొగ్గు నిక్షేపాల ప్రాంత చట్టం. ఈ చట్టాన్ని అనుసరించి భూసేకరణ గురించి ప్రభుత్వం గెజిట్లో ఒక ప్రకటన ఇస్తుంది (చివరిసారిగా మీరు ప్రభుత్వ గెజిట్ను ఎప్పుడు చదివి ఉంటారు?). ఆ తర్వాత, 30 రోజులలోగా రాతపూర్వకమైన అభ్యంతరాలేవీ రాకపోతే, భూమిని ‘‘(ఎలాంటి చిక్కులూ లేకుండా) పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంచే’’ క్రమం మొదలవుతుంది. దేశంలోని గనులలో దాదాపు మూడో వంతు కోల్ ఇండియా లిమిటెడ్ నియంత్రణలోనే ఉన్నాయి. ఆ సంస్థ విధానాలను పరిశీలించిన ఒక పార్లమెంటరీ కమిటీ... ఆదివాిసీ తెగలకు ‘‘అధికారిక గెజిట్ అందుబాటులోనే ఉండదు. కాబట్టి తమ భూములను ప్రజా ప్రయోజనాల కోసం తీసుకుంటు న్నారని వారికి తెలిసేదెలా?’’ ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనేనని నేనంటాను (అదానీ, జార్ఖండ్లో 200 కోట్ల డాలర్ల బొగ్గు అధారిత విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారనే వార్త ఫిబ్రవరి 6న వెలువడింది). ఆదివాసుల భూముల దొంగతనం మాటునే ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. మధ్య తరగతికి చెందిన మనం ఈ దొంగతనంలో పూర్తి భాగస్వాములం. అభివృద్ధి కోసం సొంత ఫ్లాట్ ఇచ్చేసేవారు మనలో ఎవరున్నారు? మన వర్గ ప్రముఖులైతే అత్యంత అవసరమైన ఫ్లైఓవర్ను సైతం వద్దని వీటో చేయగలరు. మనలాగే తమ నివాసాలను వదులుకోడానికి ఇష్టపడని బలహీ నులైన ఇతరులు మనకు బదులుగా అన్ని త్యాగాలనూ చేయాలని మనం పట్టుబడతాం. ప్రభుత్వ వ్యతిరేక హింస తలెత్తితే ఏమిటిది? అని కలవర పడిపోతాం. భూములు లాక్కోవడం గురించిన ఈ నగ్న సత్యం తెలియడంతోనే ‘‘మావోయిస్టు’’, ‘‘అభివృద్ధి’’ వంటి పదాలకు పూర్తి భిన్నమైన అర్థాలు స్ఫురిస్తాయి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
‘వినూత్న ఆలోచనలు’ అంటే ఇలాంటివేనా?
అవలోకనం భారతీయ పౌరులు మరింత మెరుగైన సేవలు అందుకుని, దేశం పురోగతి సాధించడానికి తోడ్పడుతూ.. కొత్తపుంతలు తొక్కించే వినూత్నమైన ఆలోచనలపై కృషి చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన అత్యున్నతాధికారులను ఆదేశించారు. దీనిపై వారు కొన్ని వారాలపాటు నిశితంగా ఆలోచించి ఒక నివేదికను ప్రధానికి సమర్పించాల్సి ఉంది. వినూత్న ఆలోచనలు అంటే పూర్తిగా తాజా ఆలోచనలు అని అర్థమైనట్లయితే అధికారులకు అవి రావడం కష్టమేనని నా అభిప్రాయం. మనకు తెలిసి ఆధునిక ప్రజాస్వామ్యం వయస్సు 250 ఏళ్లు. (దాని కీలక భావనలు క్రీస్తుకు ముందు 5వ శతాబ్ది నాటి ఏథెన్సుకు సంబంధించినవి). ఆధునిక పౌర ప్రభుత్వం వయస్సు 500 ఏళ్లు ఉండవచ్చు. అంటే పూర్తిగా వినూత్న విషయం ఆవిష్కృతమయ్యేందుకు ఇంకా వేచి ఉండాల్సిరావటం అసంభావ్యం కావచ్చు. కానీ, సృజనాత్మక ఆలోచనలకు నేటికీ అవకాశం ఉందనటం వాస్తవమే. అలాంటి ఒక ఆలోచనను ప్రధాని గతంలోనే గుజరాత్లో ప్రవేశపెట్టారు. గ్రామీణ గృహాలకు, గ్రామీణ పంటపొలాలకు విద్యుత్ సరఫరాను ఆయన పూర్తిగా విభ జించివేశారు. దీంతో ఇళ్లకు నిరంతరాయ విద్యుత్ లభిస్తుంటుంది, వ్యవసాయ మోటార్లు రోజులో కొన్ని గంటలపాటు విద్యుత్తును పొందుతుంటాయి. విద్యుత్ తీగల నష్టాలు (అంటే చౌర్యం అని అర్థం), విద్యుత్తు ఎల్లప్పుడూ తక్కువగానే వస్తున్నందున చార్జీలు ఎందుకు చెల్లించాలంటూ వినియోగదారులు తిరస్కరిం చడం వంటి ప్రత్యేక సమస్యలు తలెత్తే ప్రపంచంలో ఈ సాధారణ ఆవిష్కరణ కూడా చాలా పెద్ద వ్యత్యాసం కలిగివుంటుంది. వినూత్న ఆలోచనలపై ప్రధాని ఆదేశాల గురించి టీఎన్ నీనన్.. బిజినెస్ స్టాండర్డ్లో రాస్తూ, అధికారులు తాజా ఆలోచనలతో ముందుకు రావడం అంత సులభం కాదని చెప్పారు. ‘బ్యూరోక్రాట్లు నియమ నిబంధనలను తు.చ. తప్పకుండా అనుసరించడం లోనే శిక్షణ పొంది ఉంటారు తప్ప వీరు సమస్యల పరిష్కారకర్తలు కారు. అందుకే నూతన ఆలోచనలు సాధారణంగా రాజకీయనేతలు, టెక్నోక్రాట్లు, పౌర సమాజ కార్యకర్తలనుంచే వస్తుంటాయి’ అని నీనన్ రాశారు. సబ్సిడీ బియ్యం పథకం, మధ్యాహ్న భోజన పథకం, సమాచార హక్కు వంటివి వెలుపలినుంచి వచ్చిన ఆలోచనలుగా తను పేర్కొన్నారు. అందుకే పెద్ద విషయాలన్నీ శాసన రూపంలోనే అమల్లోకి వచ్చాయని నా అభిప్రాయం. ఏకీకృత పన్ను వ్యవస్థ లేదా మరింత సమర్థవంతమైన భూసేకరణ చట్టం అనేవి భారత ఆర్థిక పనితీరును నాటకీయం గానే మెరుగుపరుస్తాయని ఎవరైనా వాదించవచ్చు కానీ దీన్ని నేను అంగీకరించ లేను. ఇవి నాటకీయ మార్పు కంటే, సమర్థతను ముందుపీటికి తీసుకువచ్చే చిన్న అంశాలు మాత్రమే. భారత్లో పనిచేయకుండా ఉన్న ప్రధానమైన విషయం ఒక్కటి మాత్రమే. అది సుపరిపాలన అంటూ మోదీ చెబుతున్నటువంటి, అమ లుకు సంబంధించిన పరిమితమైన విషయం కాదు. నేను ఇంతకు ముందు రాసిన దాన్నే మళ్లీ చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత ప్రవర్తన, నైతిక వర్తనలో మార్పు తీసు కురావడం అనేది ప్రభుత్వ వ్యవహార పరిధికి సంబంధించినది కాదు. ఉదా హరణకు స్వచ్ఛ భారత్ అభియాన్నే తీసుకుందాం. మోదీ స్వయంగా వీధుల్లో చీపురు పట్టుకుని చెత్త ఊడుస్తూ ప్రమోట్ చేసిన పథకం ఇది. భారతీయులు మరింత పరిశుభ్రంగడా ఉండాలనడం గొప్ప విషయమే కానీ, అది ప్రభుత్వం చేయవలసిన పనా? నేనయితే అలా భావించడం లేదు. ఇది సామాజిక సంస్కరణ. దీన్ని ప్రభుత్వ అధికారులు, మంత్రులు కాకుండా సమాజం లోపలే, మత విభాగాలు వంటి సంస్థలు చేయవలసి ఉంది. అందుకే మోదీ వాస్తవంగా ఆశిస్తున్న ప్రధాన మార్పు దాన్ని అమలుపర్చగలిగేట టువంటి ఆయన అధికారం వల్ల రాదు. భారత్పై అధ్యయనం చేసి ఇద్దరు ఎంఐటీ ప్రొఫెసర్లు రాసిన ‘పూర్ ఎకనమిక్స్’ (పేదరిక అర్థశాస్త్రం) అనే పుస్తకం మోదీ చదువవలసిన కొన్ని పుస్తకాలలో ఒకటి అని నీనన్ రాశారు. పోతే, ఇద్దరు విద్యావేత్తలు (ఈషర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీ) తమ పరీక్షల్లో భాగంగా, అయిదు ప్రధాన వ్యాధులకు సంబంధించిన ప్రామాణిక రోగ లక్షణాలు న్నట్లు చెప్పుకునే కొందరు నటులను ప్రభుత్వ వైద్యుల వద్దకు పంపించారు. దిగ్భ్రాంతి కలిగించే విషయమేమిటంటే ఈ రోగుల వ్యాధిని నూటికి 97 శాతం వరకు వైద్యులు సరిగా నిర్ధారించలేకపోయారు. ఎందుకంటే రోగుల పట్ల వీరికేమాత్రం పట్టింపు లేదు. సగటున ఒక్కో రోగిని 60 సెకనుల కంటే ఎక్కువగా వీరు పరీక్షించలేదు. కేవలం మూడు శాతం సందర్భాల్లో మాత్రమే వైద్యులు తమ రోగుల వ్యాధిని సరిగ్గా నిర్ధారించే పరిస్థితుల్లో, మీరు చికిత్స చేయించుకోవడానికి బదులు ఇంటిపట్టునే ఉండటం ఉత్తమం. భారత్లో పనిచేసిన హార్వర్డ్ విద్యావేత్త లాంట్ ప్రిచెట్ కూడా భారత ప్రభుత్వంతో ముడిపడిన సమస్యలకు సంబంధించి మరొక రెండు ఉదాహర ణలను చూపారు. మొదటి ఉదాహరణ: ఢిల్లీలోని రోడ్డు రవాణా ఆఫీసులో (ఆర్టీవో) డ్రైవింగ్ లెసైన్సు కోసం వచ్చిన ఒక బ్యాచ్ అభ్యర్థులను ఈయన పరిశీలించి కనుగొన్న విషయం ఏమిటంటే, లంచం ఇవ్వకపోతే డ్రైవింగ్ పరీక్షలో మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారనే. మీరు లంచం ఇస్తే, డ్రైవింగ్ పరీక్షకు హాజరుకాకున్నప్పటికీ మీకు తప్పకుండా లెసైన్స్ వస్తుంది. దీని అర్థం ఏమిటి? మీరు చట్టప్రకారం నడచుకుంటే మీరు శిక్షకు పాత్రులవుతారు. అదే మీరు లంచం ఇస్తే, వాహనాన్ని డ్రైవ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఈ తరహా లంచగొండితనం ఎంత వ్యవస్థీకృతంగా తయారయిందంటే, ఆర్టీవో సిబ్బందికి నేరుగా ముడుపులు ముట్టవు. ఇది ఎంత సమర్థంగా అమలవుతుందంటే, ప్రతిభావంతులైన డ్రైవర్లను మినహాయిస్తే, రోడ్డు రవాణా కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ లెసైన్స్ కోసం ముడుపులు చెల్లించుకోవలసిందే. ప్రిచెట్ పేర్కొన్న మరొక ఉదాహరణ ప్రకారం, రాజస్థాన్లో నర్సులు పని చేయరని పరిశోధనలో తేలింది. వీరిలో సగంమంది ఇంటి వద్ద ఉంటూనే లేదా మరొక పని చేసుకుంటున్నప్పటికీ తమ వేతనాలను మాత్రం క్రమం తప్పకుండా అందుకుంటున్నారని కనుగొన్నారు. నర్సుల హాజరును పర్యవేక్షించే వ్యవస్థను అమలు చేయడం ద్వారా దీంట్లో మార్పు తీసుకురావాలని ఒక ఎన్జీఓ సదుద్దేశంతో ప్రయత్నించింది కాని విఫలమైంది. అప్పుడు కూడా నర్సులు తమ పనికి దూరంగా ఉండటాన్ని కొనసాగించారు. కానీ వారి గైర్హాజరీని తనిఖీ చేసిన ప్రతి సారీ తాము రాకపోవడానికి అధికారికంగానే వారు సంజాయిషీ చెప్పుకున్నారు. భారత్లోని వ్యవహారాలతో పరిచయం ఉన్న వారికి ఇవేవీ దిగ్భ్రాంతి కలిగిం చవు. ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ కుప్పగూలిపోయింది లేదా తన క్రియాత్మక తను కోల్పోయింది. మీరు పోలీసు స్టేషన్ను లేదా ఫుట్పాత్ అంచును పరిశీలించినా ఇది నిజమేనని తేలుతుంది. అయితే ఒకవైపు న్యూఢిల్లీ నిజమైన పరిష్కారాలను ప్రతిపాదించనున్నప్పుడు మనం దీన్ని ప్రభుత్వ సమస్యగా చూడవచ్చా? లేదా సమాజ సమస్యగా చూడవచ్చా? నేనయితే రెండో దానికే మద్దతిస్తాను. అందుకే ప్రభుత్వం, బ్యూరోక్రాట్లు సదుద్దేశంతో దీన్ని మార్చాలనుకున్నా సాధ్యంకాదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
చర్చల్లో అవినీతి కనుమరుగు
అవలోకనం భారతీయ జనతా పార్టీకి, కాం గ్రెస్ పార్టీకి మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బీజేపీ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వంటిది. దీంట్లో షేర్లు అధిక సంఖ్యాక ప్రజల చేతుల్లో ఉంటాయి. కాంగ్రెస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వంటిది. దీంట్లో షేర్లన్నీ ఒకే కుటుంబం చేతిలో ఉంటాయి. బీజేపీ కూడా పూర్తిస్థాయిలో నియంత్రణ కలిగిన కంపెనీయే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది రాష్ట్రీయ స్వయంసేవక్తో ముడిపడి ఉంటుంది. ఆర్.ఎస్.ఎస్. కూడా కుటుంబ వ్యవహారాలనే పోలి ఉంటుంది. కానీ ఇక్కడ వంశపారంపర్యంపై పట్టు పట్టరు. మన ప్రధాని నరేంద్రమోదీ నిరూపించినట్లుగా, సంస్థ వెలుపల ఉన్న చురుకైన వ్యక్తి కూడా తన ప్రతిభపై ఆధారపడి కంపెనీనే మొత్తంగా చేతపట్టుకోవచ్చు. అదే కాంగ్రెస్లో అయితే, వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనా సరే.. అతడు లేదా ఆమె తప్పనిసరిగా ఒక వాస్తవం పట్ల ఓర్పుతో ఉండాలి. అదేమిటంటే, కంపెనీలో తొలి రెండు స్థానాలు కుటుంబ సభ్యులకే తప్ప మరెవ్వరికీ అందుబాటులో ఉండవు. రెండో విషయం.. షేర్లన్నీ వారివే కనుక ఆ కుటుంబ సభ్యులు ఎంత ప్రతిభా రహితులైనా, అసమర్థులైనా సరే, ఆ కుటుంబం పనితీరు, చర్యలను ఉద్యోగులు ఎన్నటికీ ప్రశ్నించలేరు. ఈ విశిష్టత కారణంగా, పార్టీ సభ్యులు ఒక విచిత్రమైన తీరులోనే ప్రవర్తిస్తుంటారు. ఒక ఆస్తికి సంబంధించిన వ్యవహారంలో గాంధీలు విచారణను ఎదుర్కొనవలసిన సందర్భంగా గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు దీనికి సాక్షీభూతంగా ఉంటున్నాయి. మొదట్లో దీన్ని కోర్టులోనే తేల్చుకుంటామని వారు చెప్పినట్లు వార్తలొచ్చాయి. తర్వాత ఈ సమస్య రాజ కీయపరమైనదని (స్పష్టంగానే అలాంటిదేమీ లేదు) ఆ పార్టీ చెప్పడమే కాకుండా దీనికి ప్రభుత్వమే కారణమని ఆరోపించింది. ఈ ఉదంతాన్ని ఎవరు పరిశీలించినా సరే గాంధీలు చేసిన పని నేరపూరితం కాకున్నా అసం దర్భమైన రీతిలో ఉందని చాలా స్పష్టంగా బోధ పడుతుంది. ఆ ఆస్తికి సంబంధించిన లావాదేవీలో ఆర్థికంగా తమకు ఎలాంటి లబ్ధీ చేకూరలేదని, అది చట్టాన్ని కాస్త ఉల్లంఘించిందనుకున్నప్పటికీ ఎవరూ దాంట్లోంచి డబ్బు చేసుకోలేదని వారు వాదిస్తున్నారు. ఈ అంశంపై వీరు ఇంత సాధారణ వైఖరిని ప్రదర్శిం చడం పట్ల మనం ఆశ్చర్యపడకూడదు మరి. వాస్తవమేమిటంటే, జీవించడానికి ఎన్నడూ పని చేయని వారు, మనందరిలాగా ఉద్యోగం కోసం ఎన్నడూ ప్రయత్నించనివారు, తమ జీవితాలను మొత్తంగా ప్రభుత్వ గృహాల్లోనే గడిపేసిన వారు.. వ్యక్తిగత ఆస్తికి, దానికి భిన్నమైనదానికి మధ్య తేడాను చూడలేకపోవడం సహజమే మరి. న్యాయపోరాటం నుంచి రాజకీయ సమరంలోకి వ్యూహాన్ని మార్చాలని నిర్ణయించడానికి ముందు కాంగ్రెస్ నేతలు గులామ్ నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, భూపిందర్ సింగ్ హూడా, కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలు సోనియాగాంధీకి సలహా ఇచ్చినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక పేర్కొంది. ఈ ఆస్తి కేసులో మోతీలాల్ ఓహ్రా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శామ్ పిట్రోడాల పేర్లు కూడా ఉన్నాయి. ఈ నేతలందరికీ వర్తించే ఉమ్మడి అంశం ఏమిటి? ఇక్కడ ప్రస్తావించిన వారిలో ఏ ఒక్కరూ లోక్సభలో లేరు. వీరిలో ఏ ఒక్కరికీ ఎన్నికల్లో గెలవవలసిన అవసరం కానీ, జనాలను ఎదుర్కోవలసిన అవసరం కానీ ఏమాత్రమూ లేదు. వారిచ్చిన సలహా వ్యక్తిగత మైనదే కానీ రాజకీయపరమైనది అయివుండకపోవచ్చు. వాళ్ల ఆకాంక్షలు మొత్తంగా ఆ కుటుంబాన్ని కాపా డటానికి ఉద్దేశించినట్లుగానే తప్ప.. పార్టీని కాపా డదామని, దానికి జరిగిన నష్టాన్ని పూరిద్దామనే ఉద్దేశంతో ఉన్నట్లు లేవు. నేషనల్ హెరాల్డ్ ఆస్తి గొడవను సోనియా గాంధీ కుటుంబం కోర్టులో పోరాడి తేల్చుకోవాలి తప్ప దాన్ని రాజకీయ సమస్యగా మార్చవద్దని, పార్టీని ఈ వ్యవహారంలోంచి దూరం పెట్టాలని కాంగ్రెస్లో ఏ ఒక్కరూ పేర్కొన్నట్లు లేదు. ఎవరైనా ఈ అభిప్రాయానికి వచ్చి నాయకత్వానికి సూచించారనుకోండి.. అలాంటి వారిని వెంటనే కాంగ్రెస్నుంచి సాగనంపుతారు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది మరొక వ్యత్యాసం. ఒకవేళ నిజంగానే నరేంద్రమోదీ ఇలాంటి ఆరోప ణలను ఎదుర్కొన్నట్లయితే, అది బీజేపీలో అంతర్గతంగా అసమ్మతికి దారితీసి ఉండదంటే నమ్మశక్యం కాదు. బిహార్ ఎన్నికల్లో తీవ్రంగా పోరాడి కూడా ఎన్నికల్లో గెలుపు సాధించలేకపోయినందుకే పార్టీలో మోదీపై అసమ్మతి పెచ్చరిల్లింది. అలాంటి స్థితిలో ఆర్థికపరమైన అసంబద్ధత గురించిన ఆరోపణలు మోదీపై వచ్చి ఉంటే ఆయన మనగలగడం కష్టమయ్యేది. బీజేపీలో అసహనం గురించి ఎవర యినా చాలా చెప్పుకోవచ్చు కానీ, కాంగ్రెస్ కంటే అవినీతి విషయంలో అది చాలా తక్కువ సహన భావంతో ఉంటోందన్నది వాస్తవం. నేషనల్ హెరాల్డ్ ఆస్తికి సంబంధించిన కేసును రాజకీయం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది కాబట్టే, పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి కాంగ్రెస్ సుదీర్ఘ జాబితాలో ఉన్న అంశాల్లో దిగువ కోర్టు కేసు కూడా ఒకటిగా మారింది. తాను మళ్లీ ప్రాధాన్యతా స్థితికి రావడం కోసం పార్లమెంటు చర్చను విచ్ఛిన్నపర్చడాన్ని ఒక సాధనంగా కాంగ్రెస్ ఉపయోగించుకుంటోంది. ఇది మంచిదే కావచ్చు కానీ అన్ని పార్టీలూ దీన్ని ఒక ఎత్తుగడగా ఉపయోగిస్తున్నాయి. అది ప్రభావశీలంగా ఉంటోంది కూడా. కానీ దీన్ని ఒకదాని తర్వాత మరొకటిగా ప్రతి సందర్భంలోనూ అన్వయించడం అర్థవంతమేనా? ఒక రోజు ఇది ముఖ్యమంత్రులు, విదేశాంగ మంత్రి అవినీతిపై చర్చగా మొదలవుతుంది. తర్వాతి రోజు వీకే సింగ్ అలవోకగానూ, నిర్లక్ష్యంగానూ చేసిన వ్యాఖ్యపై (అయితే ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదు) చర్చగా మారుతుంది. మూడోరోజు అసహనంపై చర్చగా, నాలుగో రోజు వ్యక్తిగతమైన కోర్టు వ్యవహారంపై చర్చగా మారుతుంది. అయిదో రోజు మళ్లీ అవినీతిపై చర్చ మొదలవుతుంది. వాస్తవానికి ఈ వ్యూహం ఎవరి తలపు లోనో పుట్టుకురాగా, మరెవరో ఆమోదిస్తున్నట్లుగా మనలో సందేహాలు పుట్టుకొస్తుంటాయి. ప్రభుత్వం తల పెట్టిన కొన్ని కార్యక్రమాలపై నిశితచర్చ అవసరమైన సమయంలో ప్రతిపక్షం ఈ రకమైన చెత్త విషయాలను తీసుకురావడమనేది భారతీయులందరి దురదృష్టమే. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
ఉరికొయ్యతో మతం పీటముడిని విప్పగలమా?
అవలోకనం ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి చూడాలనేది నిజాయితీతో కూడిన, సబబైన కోరికేనా అనేదే నా ప్రశ్న. హిందూ, సిక్కు ఉగ్రవాదులను ఉగ్రవాదులుగా చూడటం మనకు తేలికేం కాదు. అఫ్జల్ గురుకు ‘మరణ దండన విధించనిదే సమాజ సమష్టి అంతరాత్మ సంతృప్తి చెంద ద’ని సుప్రీం కోర్టు పేర్కొంది. ముస్లిమేతరులను ఉరితీయడానికి కూడా అలాంటి సమర్థనలను యోచించగలిగేటంత వరకు ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి చూడటం మనకు సాధ్యం కాదు. గత నెల మలేసియాలో మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్ర వాదం గురించి రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరు చేసి చూడాలి. రెండు, ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఉగ్రవాదం. ఇది నిజమేనా? ఈ ఏడాది కశ్మీర్కు వెలుపల దేశవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదం వల్ల చనిపోయినవారి సంఖ్య 21. గత ఏడాది అది నలుగురు కాగా, అంతకు ముందటి ఏడాది 25. అంతకంటే ముందటి ఏడాది ఒకే ఒక్కరు. దేశంలో ఏటా ఐదు లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు పోషకాహార లోపంతో మరణిస్తున్నారు. నిజాయితీతో కూడిన ఏ ప్రమాణం ప్రకారం చూసినా దేశ జనాభాలో సగం మంది పేదలు, అందులో సగం మంది నిరక్ష రాస్యులు. మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే. అయినా ఉగ్రవాదం వాతావారణ మార్పుల కంటే కూడా పెద్ద సమస్యా? భూతాపం పెరుగుదలే చెన్నై వరదలకు కారణమని ప్రధానే అంగీ కరించారు. ఈ వరదల్లో 280 మంది కంటే ఎక్కువ మందే మరణించారు. కాబట్టి ఉగ్రవాదం, అతిశయించి చూపుతున్న సమస్యని నాకు అనిపిస్తుంది. పేదరికం, పోషకాహార లోపం, నిరక్షరాస్యత వంటి సమస్యలను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించుకున్న పాశ్చాత్య దేశాలకు అది తక్షణమైన అత్యవసర సమస్య. భారతీయులలో అత్యధికులకు భిన్నంగా సౌఖ్యంగా సాగిపోతుండే వారి జీవితాలకు ఉగ్రవాదమంటే అందుకు అంతరాయాన్ని కలిగించే సంచలనం. అయితే ఈ వ్యాసాన్ని రాస్తున్నది దాని గురించి కాదు. మన ప్రధాని చెప్పిన మొదటి అంశమైన ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేయడం గురించి. ఇంతకూ దాన్ని అలా వేరుచేయడం ఎలా? కొన్ని వాస్తవాలను చూడండి.. మీరు త మిళం మాట్లాడే హిందువు అయితే, మన మాజీ ప్రధానిని హత్య చేసినందుకు మిమ్మల్ని ఉరితీయరు. 1991లో రాజీవ్ గాంధీని, మరో 14 మందిని ఆత్మాహుతి దాడిలో హతమార్చిన కేసులో మురుగన్, శంతన్, పెరారివలన్ అనే ముగ్గురికి ఉరిశిక్ష విధించారు. అయితే గత ఏడాది వారిని ఉరితీయరాదని నిర్ణయించారు. తమిళనాడు ప్రభుత్వం వారిని కాపాడటంలో చురుకైన పాత్ర పోషించింది. మీరే గనుక పంజాబీ మాట్లాడే సిక్కు అయితే, ఒక ముఖ్యమంత్రిని చంపినందుకు మిమ్మల్ని ఉరితీయరు. పంజాబ్ ముఖ్యమంత్రి బియంత్ సింగ్ను, మరో 17 మందిని ఒక ఆత్మాహుతి దాడిలో హతమార్చిన బలవంత్సింగ్ రాజోనాను ఉరితీయలేదు. తనకు మరణశిక్ష విధించి, తన అవయవాలను దానం చేయాలని రాజోనా కోరినా ఆ పని చేయలేదు. మరో పంజాబీ మాట్లాడే సిక్కు, దేవిందర్పాల్ సింగ్ భుల్లార్ 1993లో ఒక కాంగ్రెస్ నేతపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అతనినీ ఉరి తీయలేదు. గుజరాతీ మాట్లాడే ఒక సింధీ హిందువైన మాయా కొద్నానికి, తోటి గుజరాతీలు 97 మందిని హత్యగావించినందుకు శిక్ష విధించారు. అయినా ఆమె జైలులో గడపాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా లభిస్తున్న బెయిళ్లతో శిక్షపడ్డ నేరస్తురాలై ఉండి కూడా ఆమె జైలు బయటనే గడుపుతున్నారు. అదే మీరు గుజారాతీ మాట్లాడే ముస్లిం అయితే, ఉగ్రవాద ఆరోపణలకు గానూ మిమ్మల్ని ఉరితీస్తారు. యాకూబ్ మెమెన్ కుటుంబానికి తెలిసివచ్చిన నిజం అదే. మెమెన్ను ఉరితీయరాదని కొందరు అన్నారు, నిజమే. అయితే వారు ఉరిశిక్షల రద్దును కోరేవారు. మొదట పేర్కొన్నవారితో సహా అన్ని రకాల నేరస్తుల ఉరిశిక్షలకూ వారు వ్యతిరేకులు. ముస్లిం అయిన మెమన్కు తోటి గుజరాతీల మద్దతు సైతం లభించలేదు. అలాగే మీరు కశ్మీరీ మాట్లాడే ముస్లింలయితే, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలకు మీకు ఉరి వేస్తారు. అఫ్జల్ గురు కుటుంబం ఆ నిజాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి వచ్చింది. గురు కేసులో ఆధారాలు తప్పయి ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ఉంది. అయినా అది అతని మరణ శిక్షను అమలుకాకుండా ఆపలేకపోయింది. తమిళనాడు, పంజాబ్ శాసన సభల్లో తమ రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదులను కాపాడాలని విపరీతమైన రాజకీయ ఒత్తిడి వచ్చింది. ఇక కొద్నానీ గుజరాత్ ప్రభుత్వంలో మంత్రి, ఆమె నాయకుడు స్వయంగా ముఖ్యమంత్రి (నేటి ప్రధాని నరేంద్ర మోదీ). బాధ్యతగల మంత్రి అయి ఉండి కూడా తోటి గుజరాతీలపై ఆమె సాగించిన హత్యాకాండపై ఆయన పల్లెత్తు మాట్లాడలేదు. ఇక్కడ నేను చెబుతున్నవాటిలో కొత్త విషయాలేవీ లేవు. అన్నీ బహిరంగంగా జరిగినవి, అధికారికంగా నమోదైనవే. ఇక మొదట చర్చిన్తున్న విషయానికే తిరిగి వస్తే, నా ప్రశ్న ఒక్కటే. ఉగ్రవాదాన్ని మనం మతం నుంచి వేరుచేయాలనేది నిజాయితీతో కూడిన, సబబైన కోరికేనా? అదే జరగాలని ఒక నేత కోరుకునేట్టయితే ముందుగా చేపట్టాల్సిన చర్యలేమిటి? ఎవరికైనాగానీ, ప్రత్యేకించి ప్రపంచంలోని మనమున్న ఈ ప్రాంతంలోని వారికి ఈ పని చేయడం కష్టమని నేనంటాను. ఉగ్రవాదులు హిందువులో, సిక్కులో అయితే వారిని ఉగ్రవాదులుగా చూడటం మనకు తేలికేం కాదు. వారికి శిక్షలు విధించినా, వారు కూడా ఆత్మాహుతి దాడులనే అవే ఎత్తుగడలను ప్రయోగించినా, వారి చర్యల వల్ల వారు ఎంచుకున్న లక్ష్యాలతో పాటూ అమాయక ప్రజలు కూడా బలైపోయినా అది అంతే. పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి మద్దతునిచ్చినందుకు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించారు. గురుకు ‘‘మరణ దండన విధించనిదే సమాజ సమష్టి అంతరాత్మ సంతృప్తి చెందదు’’ అని భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు పేర్కొంది. ముస్లిమేతరులను ఉరితీయడానికి కూడా మనం అలాంటి సమర్థనలను యోచించగలిగేటంత వరకు, ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి ఆలోచించడం సాధ్యం కాదని నా అభిప్రాయం. - ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
ఈ ‘రాక్ స్టార్’ సంబరాల నేపథ్యం వినోదమే!
అవలోకనం గత 16 నెలలుగా మనం మరీ ఎక్కువగా చూస్తూ వస్తున్న విదేశాల్లోని భారతీయుల గురించిన కథనం ఇది. మన కాలంలో అత్యంత సూక్ష్మబుద్ధి కల రాజకీయనేతల్లో ఒకరు, తనకు ముందటి రాజకీయ నేతల్లో ఎవరికీ లేనంతగా విదే శాల్లోని భారతీయుల్లో గుర్తింపు కలిగిన నేత అయిన మన ప్రధానమంత్రి చుట్టూ మూగుతున్న విదేశీ భారతీయుల గురించే ప్రస్తావిస్తున్నాను. ప్రధానమంత్రిగా పదవీస్వీకారం చేసింది మొదలుగా ఇండియా వెలుపల చేసిన ప్రతి సందర్శనలోనూ నరేంద్రమోదీ భారతీయుల మధ్య మునిగి తేలుతున్నారు. చైనాలో, అమెరికాలో (ఇక్కడయితే ఆయన ప్రేరణ కోసమో లేక ఆశీర్వదించటానికో.. స్టార్ వార్స్ సినిమాలోని - శక్తి మీతోనే ఉండు గాక - అనే వాక్యాన్ని ప్రయోగించడం ద్వారా అమెరికాలోని పలువురు విద్యావంతులను, చైతన్యవంతులైన భారత సంతతిని విభ్రాంతికి గురిచేసి ఉండవచ్చు), లేదా గల్ఫ్లో, ప్రతిచోటా ప్రధాని విదేశాల్లోని భారతీయులను విపరీతంగా ఆకర్షించారు. నరేంద్ర మోదీని ఇలా విదేశాల్లోని భారతీయులు చుట్టుముట్టడాన్ని మన మీడియా అత్యుత్సాహపూరితమైన పదాలతో వర్ణించింది. మోదీకి మనవాళ్లు రాక్ స్టార్ తరహాలో స్వాగతం పలికారని మీడియా పేర్కొంటోంది. దీనర్థం ఏమిటి? రాక్స్టార్లకు జనంలో ఉన్న అభిమానం అనేది వారి జనాకర్షణ నుంచే వస్తుంది. వారిలోని మానవత్వం లేదా వారిలోని అత్యున్నత గుణాల వల్ల జనం వారిని అభిమానించటం లేదు. ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపునుంచి పుట్టుకొస్తున్న కృత్రిమ ధీరోదాత్తత అది. అది పైపై మెరుగులతో కూడిన ప్రేమ, కృత్రిమ ప్రేమ మాత్రమే. ఒక అత్యున్నత విలువలు కలిగిన రాజనీతిజ్ఞుడి విషయంలో ఇలాంటి ప్రేమ వాంఛనీయం కాదు. ఇక్కడ మనం ముఖస్తుతి, విపరీత ప్రశంసల గురించి చర్చించడం లేదు. నాయకుడి సంభాషణలో, చేతల్లో వ్యక్తమయ్యే కొన్ని రకాల ధోరణులే ఇలాంటి స్పందనను కలిగిస్తుంటాయి. గాంధీ ఇలాంటి రాక్ స్టార్ గుర్తింపును పొందుతారని మనం ఊహించలేం. ఎందుకంటే ఆయన దాన్ని కోరుకోరు కూడా. నిజానికి రాక్స్టార్ గుర్తింపు అనేది ఒక క్షణభంగురమైన, అనిశ్చితమైన, అశాశ్వతమైన మనోభావం మాత్రమే. పైగా రాక్స్టార్లు, సినీ నటులు ఒక పరిమిత పరిధిలోని గవ్వలాంటి జీవితం గడుపుతుంటారు. ఈ అంశాన్ని ప్రస్తుతానికి వదిలేద్దాం. ఈ కథనం ప్రధానాంశం మోదీ గురించి కాదు. మోదీ చుట్టూ గుమిగూడుతున్న విదేశాల్లోని భారతీయుల గురించే ప్రస్తుత చర్చ. విదేశీ భారతీయులు ఎందుకిలా చేస్తున్నారో చూద్దాం మరి. అన్నిటికంటే ముఖ్యమైన, మొట్టమొదటి అంశం ఏదంటే, ఇతర దేశాల ప్రజల కంటే భారతీయులు అత్యంత అధికంగా జాతీయవాద తత్వంలో ఓలలాడుతుంటారు. మాతృదేశం గురించి పాటలు పాడుతుంటేనే మన కళ్లలోంచి కన్నీటి ధారలు కారిపోతుంటాయి. కొన్ని తరాలకు ముందే పాశ్చాత్య ప్రపంచంలో స్థిరపడిన భారతీయులు నేటికీ ఇండియాతో తాదాత్మ్యం చెందుతుంటారు. క్రీడా పోటీలు జరుగుతున్నప్పుడు తాము నివసిస్తున్న దేశానికి చెందిన జట్టు భారత్తో ఆడుతున్నప్పపుడు కూడా భారతీయులు మాతృదేశానికే మద్దతు పలుకుతూ ఊగిపోతుంటారు. ఇక రెండో అంశం ఏదంటే వెంటాడుతున్న అపరాధ భావన. ఉదాహరణకు ఇండియాలో రాయితీ ఫీజులతో చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు ధనసంపాదనకు విదేశీ అవకాశాలను ఎంచుకుంటున్నారు. మెరుగైన జీవితం కోసం అలా చేయడం వారికి సహజమే కావచ్చు. కానీ అలా మాతృదేశం వదిలి వచ్చినందుకు చాలామందిని అపరాధభావన ఇంకా వెంటాడుతూనే ఉంది. మోదీ కార్యక్రమాల వంటి వేడుకకు హాజరు కావడం అనేది వీరిలోని జాతీయభావానికి మరింతగా రెక్కలు తొడుగుతుంది. అది తాము భారత్ను నేటికీ బలపరుస్తున్నామన్న సంతృప్తిని వారికిస్తుంది. అదే సమయంలో తాము భారత్ను వదిలిపెట్టి వచ్చామని మనసులో ఎక్కడో దాగి ఉన్న మనోభావాన్ని కాస్త ఉపశమింప జేస్తుంది కూడా. మోదీ సమావేశాలకు హాజరు కావడంలో మూడవ ప్రేరణ ఏమిటంటే ఆత్మన్యూనతా భావం. అంత పెద్ద సంఖ్యలో ఒకచోట చేరడం వల్ల, తాము వాస్తవంగా జీవిస్తున్న దానికంటే మరింత ప్రాధాన్యత ఏదో తమకుందన్న అనుభూతిని వారికి కలిగిస్తుంటుంది. వలస వచ్చిన తోటి భారతీయులను ఇంత పెద్ద కార్యక్రమంలో కలుసుకోవడం అనేది తామంతా ఒకటి అనే ఉమ్మడి భావనను కలిగిస్తుంది. పైగా ప్రవాస భారతీయులలో చాలామంది తమకు నీడనిస్తున్న దేశంతో ప్రత్యేకించి సాంస్కృతిక పార్శ్వంలో ఇప్పటికీ పూర్తిగా మిళితం కాలేకపోతున్నారు. ఉదాహరణకు పటేళ్లను తీసుకోండి. పటేల్ ఎందుకు మోటల్ (హోటల్) బిజినెస్ను ఎంచుకుంటుంటాడు? ప్రత్యేకించి మోటల్ రంగంలో పటేల్ సాధించిన ఈ ఘనవిజయాన్ని మనం గొప్పగా చెప్పుకుంటుంటాము. కానీ ఈ రంగాన్నే అతడు ఎందుకు ఎంచుకున్నాడనే విషయంలో అంత స్పష్టమైన విశ్లేషణ జరగటం లేదు. నా బంధువులు అనేకమంది మోటల్ రంగంలో పనిచేస్తున్నారు. ఈ అంశంపై వారు కాస్త సాధికారతతో మాట్లాడగలరు కూడా. వాస్తవానికి, అమెరికాలో మోటళ్లను నడపటం వల్ల పటేళ్లకు క్యాష్ కౌంటర్ వద్ద తప్పితే అమెరికన్లతో పెద్దగా వ్యవహరించవలసిన అవసరం ఉండదు. అతడి వెనుక వంటశాలలో మజ్జిగ పులుసును చేస్తుంటారు. విశ్రాంతి గదిలోని టీవీలో రామాయణం సీరియల్ వస్తుంటుంది. అమెరికాలోనూ పటేళ్లు నిలుపుకుంటూ వస్తున్న భారతీయ సంస్కృతి ఇదే. విదేశాల్లోని గుజరాతీయులు పరస్పరం కలిసి ఉంటారు. వీళ్లకు స్థానిక అమెరికన్లతో స్నేహం కూడా తక్కువగానే ఉంటుంది. పండుగలు, తదితర సంద ర్భాల్లో తోటి పటేళ్లను కలుసుకోవటం వారికి అమితానందం కలిగిస్తుంటుంది. అలాగే ఆలయాలు నిర్మించడానికి స్వదేశానికి తిరిగి రావటం, తమ ఆధ్యాత్మిక గురువులను కలుసుకోవడం కూడా వారికి పరమ సంతోషాన్ని కలిగిస్తుంటుంది. ఇతర కమ్యూనిటీల విషయంలో కూడా ఇది నిజం. అత్యంత అధిక బల ప్రదర్శనతో మోదీ వంటి వారితో వారు జరిపే సమావేశాలు తమవారిని ఆకర్షించే సహజ స్థలాలుగా ఉంటాయి మరి. అయితే ఇలాంటి సమావేశాల్లో వ్యక్తమవుతున్న అపార శక్తి ప్రదర్శన ఫలితం ఎలాంటిది? సమాధానం ఏమిటంటే పెద్దగా ఫలితం ఉండదనే. సంగీత కచ్చేరి లేదా ప్రదర్శన ముగియగానే రాక్స్టార్ అక్కడినుంచి నిష్ర్కమించే విధంగానే, మోదీ వంటి వారి సమావేశాలకు హాజరవుతున్న వారు కూడా అవి ముగిసిన మరుక్షణం తమ అర్థాన్ని, ఐక్యతను కోల్పోతుంటారు. మోదీతో భారీ జన సందోహం, విదేశీ భారతీయుల అట్టహాసం వంటి వాటి వెనుక ఉన్న తమాషా వెనుక ఉన్న వాస్తవం ఏమిటంటే అవి కేవలం వినోదప్రాయం మాత్రమే. - ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
ఆసక్తికరమైన సరుకు కావలసిందే కానీ...!
అవలోకనం మన ప్రసార మీడియా సంచలనం పేరుతో పసలేని కథనాల వెంటపడుతున్నప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యానికి గురికాలేదు. అదేమంత కొత్త విషయం కాదు. కానీ స్టాక్మార్కెట్ పతనం వంటి ఒక అతి పెద్ద, ఆసక్తికరమైన ముఖ్య కథనం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వస్తున్నప్పుడు కూడా మన మీడియా అసంబద్ధ కథనాలతో పొద్దుపుచ్చడమే చాలా కొత్త విషయం. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. మీడియా ఉన్నది దేనికి? తాజా వార్తలు లేక లోతైన వార్తా కథనాలను అందించాలని కోరుకుంటున్న వాళ్ల కోసమేనా? మన మీడియా అంతటి స్థాయిలో ఉందని నేననుకోవడం లేదు. ఉదాహరణకు.. చైనా మార్కెట్లలో అనిశ్చితి, అస్థిర త్వం తర్వాత ఏం జరగనుందనే అంశంపై ఈ వారం స్టాక్ మార్కెట్లు ప్రకంపించిపోయాయి. ఆగస్టు 24 సోమవారం నాడు నేను కాస్త త్వరగా మేల్కొని, ఆసియా మార్కెట్లు ఒకదాని వెనుక ఒకటి కుప్ప కూలిపోయిన తీరుపై వార్తా కథనాలు చదివాను. అప్పుడు సమయం ఉదయం 5 గంటలయింది. స్టాక్మార్కెట్ పత నం నేపథ్యంలో భారత్లో ఏం జరగనుందో అవగతం చేసుకోవడానికి నేను అంత పొద్దుటే వేచిచూస్తుండిపో యాను. ఇది చాలా ముఖ్యమైన అంశం. యావత్ ప్రపంచ మీడియా దాని గురించి చర్చిస్తూ ఉండేది. మార్కెట్లు ఉద యం 9 గంటలకు ప్రారంభమైనప్పుడు టీవీ చానళ్లను చూడటం ద్వారా స్టాక్ మార్కెట్ పరిణామాల గురించి ఇంకా మంచిగా అర్థం చేసుకోవచ్చని నేను భావించాను. అయితే ఆ సమయంలో మన ఇంగ్లిష్ వార్తా చానళ్లలో కింది కథనాన్ని ప్రసారం చేశారు. పంజాబ్లో ఒక బాలిక తన ఫేస్బుక్లో మోటార్ సైకిల్పై ఉన్న ఓ వ్యక్తి ఫొటోను పోస్ట్ చేసింది. అతగాడు తనను బూతులతో సత్కరించాడని ఆమె రాసింది (అయితే ఆమె నిర్దిష్టంగా ఏం జరిగిందో వివ రించలేదు). ఈ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్న వారు చెబు తున్నట్లుగా ఆ పోస్ట్ను ఆన్లైన్లో విపరీతంగా చూసే శారట. మీడియా ఆ సమయంలో చర్చిస్తూ ఉండిన కథనం ఇదే. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేకుండానే చానళ్లు ఆ వ్యక్తి ఉపయోగించిన అశ్లీల పదాల గురించి చర్చిస్తూపోయాయి. ఇంగ్లిష్లో ఒక్క జాతీయ చానల్ కూడా స్టాక్ మార్కెట్ కల్లో లాన్ని చూపించలేదు, మార్కెట్ కుప్పకూలడంపై చర్చించ లేదు. ఇక బిజినెస్ చానల్స్ విషయానికి వస్తే.. వీటి విశ్లేషణ ఎక్కువగా మదుపుదారులపైనే సాగింది కానీ, స్టాక్ మార్కె ట్ పతనంలోని విస్తృత అంశాలపై ఆసక్తి చూపిన వారిపై ఇవేవీ దృష్టి పెట్టలేదు. మీడియాలో చాలాకాలంగా పని చేస్తున్న నాలాంటి వ్యక్తికి ఇది చాలా కొత్త పరిణామం. మన ప్రధాన స్రవంతి మీడియా.. టాబ్లాయిడ్ తర హాకు కుదించుకుపోవడం గమనించిన మీలాంటి అనేక మంది లాగే నేను కూడా, మీడియా పసలేని కథనాల వెంట పడుతున్నప్పుడు ఆశ్చర్యానికి గురికాలేదు. అది కొత్త విష యమేమీ కాదు. కానీ.. ఒక అతి పెద్ద, ఆసక్తికరమైన ముఖ్య కథనంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు కూడా మన మీడియా అసంబద్ధ కథనాలతో పొద్దుపుచ్చ డమే చాలా కొత్త విషయం. ఇలా జరుగుతుందని నేను అస్స లు ఊహించలేదు. ఆనాటి ఉదయం ఇదే నన్ను నిస్పృహకు గురిచేసింది. మన ఆర్థిక వ్యవస్థలను, అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేసే పరిణామం ఒకటి ద్రవ్య మార్కెట్లలో ఏర్ప డుతోందని ప్రపంచం మనకు తెలుపుతున్న సమయమది. కానీ ఆ సమయంలో ఒక వ్యక్తి ప్రవర్తనపై మరొక వ్యక్తి వ్యాఖ్యకు సంబంధించిన విషయంపైనే మన మీడియా ఆసక్తి చూపుతోంది. ఆ మరుసటి దినం పటేళ్ల ఆందోళన జాతీయ వార్తగా మారిపోయింది. ఇది ఒకే వార్తలోకి పలు అంశాలను తీసు కువచ్చింది: కుల రాజకీయాలు, గుజరాత్ నమూనా, రిజ ర్వేషన్ భావజాలం, అసమానాభివృద్ధి వైైగె రా వగైరా. భార త్లో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన వార్త. ఒక మేరకు ప్రపంచం దృష్టిని కూడా ఇది ఆకర్షించింది. ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘లాస్ ఏంజెల్స్ టైమ్స్’, ‘బీబీసీ’తో సహా పలు విదేశీ మీడియా చానళ్లు ఈ విషయమై నా ఇంటర్వ్యూ తీసుకు న్నాయి. గుజరాత్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఇవి చాలా ఆసక్తి చూపాయి. గుజరాత్ పటేళ్ల ఆందోళన నన్ను ఎంతగానో ఆకట్టు కుంది. నేను కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాడిని అయినందుకు మాత్రమే కాదు. అది విస్తృతంగా జనం వీక్షించే పెద్ద, ముఖ్యమైన కథనం. కానీ బుధవారం నేను పని నుంచి తిరిగి వచ్చి టీవీ ఆన్ చేసినప్పుడు ఇంత పెద్ద కథనాన్ని కూడా సంపన్న కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలిక హత్యా వార్త మరుగున పడే సింది. నిజమే. ఫేస్బుక్లో ప్రచురించిన ఏదైనా పోస్టు కన్నా ఆ బాలిక మరణ ఘటన మరింత తీవ్రమైనదే.. కాదనను. కానీ పది మంది మరణాలకు దారితీయడమే కాకుండా, ప్రధానమంత్రి జోక్యానికి కూడా కారణమైన ఆందోళన కంటే ఈ వార్త ఎంతో ముఖ్యమా? పటేళ్ల ఆందోళన చాలా కాలం గుర్తుండిపోయే తరహా కథనం. కులం, రిజర్వేషన్పై చర్చను రగిల్చేంత శక్తి కలిగిన కథనం ఇది. దీని ప్రాథమిక డిమాండ్ ఏదంటే రిజర్వేషన్ల తొలగింపే. ఇది కూడా పటేళ్లు గతంలో చేసిన పాత డిమాండే. ఈ సమస్య రగులుకొన్నట్లయితే, అగ్రకులాల ప్రజ లకు ఇది అతి పెద్ద సమస్యగా మారుతుంది కూడా. రిజర్వే షన్ కాదు మెరిట్కు పట్టం కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్ను చాలాకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారని అగ్రకు లాలు భావిస్తున్నాయి. పాతికేళ్ల క్రితం మండల్ కమిషన్ నివే దిక తరహాలో దేశ రాజకీయాలనే మార్చివేసేంత శక్తివంత మైన కథనం ఇది. ఇది ఎవరికీ తెలియని రహస్యం కాదు. కానీ మనం మాత్రం పటేళ్ల ఆందోళనపై తక్కువగానూ, ఆ బాలిక హత్యపై ఎక్కువగానూ ప్రసారమవుతున్న వార్తల పైనే దృష్టి పెట్టాం. టెలివిజన్కి ఆసక్తికరమైన సరుకు కావాలన్న విషయం నాకు తెలుసు. దాన్ని నేను గుర్తిస్తాను కూడా. వ్యక్తిగతంగా నాకు ఏమాత్రం ఆసక్తి లేకపోయినప్పటికీ, టీవీలు వినోద, అసందర్భ వార్తలను ప్రసారం చేస్తున్నప్పటికీ వాటితో నాకు పెద్దగా సమస్య లేదు. కానీ, అదే సమయంలో అంతకు మించిన అతి పెద్ద, ప్రముఖ వార్త సంచలనం కలిగిస్తున్న సందర్భంలో అలాంటి పరమ బాధ్యతారహిత వైఖరిని క్షమించడం నాకు కష్టమే. పటేళ్ల డిమాండ్ అనేది ఒక అపరి చిత వ్యక్తి హత్య ఘటనతో సమానమైనస్థాయి కలిగిన కథ నంకాదని దమ్మున్న జర్నలిస్టు ఎవరైనా అంచనా కట్టగలరు. ప్రధాన సమర రంగంలో పూర్తి కార్యాచరణను రిపోర్టు చేయవలసి ఉన్న తరుణంలో, అప్రధాన రంగంలోని అసం బద్ధ అంశాలను నివేదించేందుకు పరుగులు తీస్తున్న టెలివి జన్ మీడియా ప్రత్యేకించి ఇంగ్లిష్ చానళ్లు తమ శ్రోతలకు, వీక్షకులకు ద్రోహం చేస్తున్న మాట నిజం. ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత)aakar.patel@icloud.com) -
ఈ తరహా జాతీయవాదం వద్దే వద్దు...!
శత్రువుతో గుసగుసలాడుతారనే భయం కారణంగా మన సొంత పౌరులనే నిర్బంధించడం ద్వారా ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక’ భారతఖను మనం అవమానిస్తున్నాం. ఇలాంటి చర్యల ద్వారా మనది ఆత్మవిశ్వాసం కలిగిన రిపబ్లిక్ కాదని మనకు మనం ప్రదర్శించుకుంటున్నాం. మనకు ఏ ప్రయోజనం ఒనగూరకపోయినా సరే... మనం అవతలిపక్షాన్ని శత్రువైఖరితోనే చూస్తుండాలనే సంకుచితత్వాన్ని నేను ఇకపై ఆమోదించలేను. పాకిస్తాన్తో భారత్ యుద్ధానికి తలపడుతున్నట్లు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టెలివిజనఖ విశ్లేషకుడిగా నెట్టుకు రావడం ఏమంత సులభమైన విషయం కాదు. అయితే అది నిజమైన యుద్ధం కాదనుకోండి. పొఖ్రానఖ, చాగైలో ఆ మతి హీన పేలుళ్లు (అణుపరీక్షలు) జరిపిన తర్వాత మనకు అలాంటి పరిస్థితి ఇక ఎదురు కాదు కూడా. మనం మాట్లా డుకోవాలా లేదా అనే విషయంలో ఈ చిన్న పిల్లల తరహా వాగ్వాదంపైనే నేనిలా అంటున్నాను... ఎవరైనా తల్చుకుంటే టెలిఫోన్, ఇమెయిల్ ఇతరత్రా మార్గాల్లో సులభంగా ఏ సమాచారాన్నయినా పంపిణీ చేసుకోగలుగుతున్న నేటి కాలంలో ప్రజలను కలుసుకోకుండా మనం ఎందుకు ఆపుతున్నామో అర్థం చేసుకోవడం నాకయితే కష్టమే. అంత ర్జాతీయ దౌత్యంలోని సూక్ష్మభేదాలను బహుశా నేను అర్థం చేసుకోవడం లేదేమో మరి. మూర్ఖత్వంతో, మొండితనంతో ఉండటం కూడా వాస్తవానికి చాణక్య మేథకు సంబంధించిన ఒక యుక్తిగా నాకు అనిపిస్తుంటుంది. ఏమయినప్పటికీ, నేను చెబుతున్నదేమిటంటే, స్వతంత్ర బుద్ధి కలిగిన వారు ఈ రోజుల్లో విశ్లేషకులుగా ఉండటం అంత సులభం కాదనే. టీవీ స్టూడియోలో ఉన్న ఇతరులకు ఇది చాలా సులభమే కావచ్చునేమో కానీ పార్టీ పంథాను లేదా జాతీయ పంథాను అవలంబించడం నాకయితే సాధ్యం కాని పని. నా అభిప్రాయంలో వాస్తవం, సందర్భం అనేవి చాలా ముఖ్యమైనవి. చాలాకాలంగా నేను అంధ జాతీయ వాద దృష్టిని కలిగి ఉండేవాడిని కానీ ప్రపంచాన్ని చదువుతూ, దాన్ని ఎదుర్కొంటూ ఉన్న వారు ఎవరైనా తామున్న స్థితి నుంచి మరింత పరిణతి చెందుతారు. ప్రాంతీయ జాతీయవాద స్వభావం శూన్యతతోనే ఉం టుందని ఎవరైనా అర్థం చేసుకుంటారు. అంటే మీరు నష్ట పోతున్నప్చడు లేదా నష్టపోతున్నట్లు కనిపిస్తున్నప్చడు మాత్రమే నేను లాభపడతానని దీని అర్థం. మీకు కలిగే ప్రయోజనం నాకు నష్టంగా పరిణమిస్తుంది. భారత్లో మన జాతీయవాద వైఖరి ఏమిటి? అది పాకిస్తాన్, చైనా వ్యతిరేక వైఖరే. ఇది ఎలాంటి సూక్ష్మ భేదాన్ని కూడా అనుమతించదు. మనం దీనికి పూర్తిగా ఆమోదమైనా తెలపాలి లేదా పూర్తిగా విరోధించక పోయి నా, కనీసం తిరస్కరిస్తున్నట్లయినా కనిపించాలి. మనకు నష్టం జరుగుతున్నా సరే, లేదా అలాంటి వైఖరి వల్ల భార తఖకు ఎలాంటి ప్రయోజనం కలగకున్నా సరే.. మనం ఎన్న టికీ పాకిస్తానఖ వ్యతిరేకతనే కలిగి ఉండాలి మరి. (హురి యతఖ వేర్పాటువాదులను కలిసేందుకు అనుభవజ్ఞుడైన సర్తాజ్ అజీజ్ను అనుమతించకపోవడంలో భారతఖకు ఒరిగే ప్రయోజనం శూన్యమే). శత్రువుతో గుసగుసలాడుతారనే భయం కారణంగా మన సొంత పౌరులను నిర్బంధిస్తున్నప్చడు, ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక’ భారత్ను మనం అవమాని స్తున్నాం. ఇలాంటి చర్యల ద్వారా మనది ఆత్మ విశ్వాసం కలిగిన రిపబ్లిక్ కాదని మనకు మనం ప్రద ర్శించుకుం టున్నాం. ఏమాత్రం కొత్తగా ఆలోచించడానికి సిద్ధపడని విశ్లేషకుడికి ఇది చాలా స్పష్టతను ఇవ్వగలగాలి. పైగా దీన్ని టెలివిజనఖలో ప్రకటించడం అనేది జాతీయ వ్యతిరేకిగా ఉంటున్నారని ఆరోపణలకు గురయ్యేలా చేస్తుంది. మరొక విషయం ఏమిటంటే ఒక ప్రత్యేక సందర్భంలో ఎవరైనా ఒక నిర్దిష్ట దృక్పథానికి కట్టుబడి ఉన్నప్చడు ఇలాంటి ఆరోపణలకు గురవడం. తర్కం, హేతువు నుంచి తప్పించుకోలేని ఒకరకమైన సిద్ధాంతంతో మనందరం రం గేసుకున్నాం అని మనపై నేరారోపణ చేస్తుంటారు. మనం నిర్దిష్టంగా అర్థం చేసుకోకుండానే లె?ఫ్ట, లిబరలఖ, రైటఖ అనే పదాలను అలవోకగా వాడేస్తుంటాము. దీనికి ఒక కారణ ముందని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే, హిందు వులకు ఎలాంటి అనుకూలతను కలిగించకున్నా, ముస్లిం లకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆగ్రహం, వైరం ప్రతి పాదిం చే హిందూత్వం వంటి విద్వేషంపై ఆధారపడిన వర్గీకరణ లను మనం కలిగి ఉన్నాం. ఇలాంటి విద్వేషాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులు ఎలాంటి సమస్యకు సంబంధించి అయినా సరే.. తమ బుద్ధిని, తమ ఉద్వేగాలను వేరుపర్చుకోవడం కష్టం. అయి తే మనం అలాంటి వారి వెనుక ఎందుకు నిలబడాలి. నా వరకు నేను ఆ వరుసలో నిలబడను, నిలబడలేను కూడా. ‘‘చర్చలు విఫలమైతే పాకిస్తానఖనే తప్చపట్టవచ్చనే అంశంపై స్టూడియోలో ఉన్న మనమంతా అంగీకరిస్తు న్నాం’’ అంటూ ఒక యాంకర్ ఓ చర్చా కార్యక్రమంలో పేర్కొన్నారు. కాని ఆ చర్చలో నేను దానికి అంగీకరించ లేదు. ఇది ఇండియా వెరసి పాకిస్తానఖకు సంబంధించిన సమస్య కాబట్టి భారతీయులందరూ తమ ప్రభుత్వ వైఖరిని బలపర్చాలని ఇలాంటి వారు భావిస్తున్నారు. ఇప్పటికే రేఖలను గీసేశారు.. ఇక ఇరుపక్షాలూ సమరా నికి పోవడమే తరువాయి అని ఈ భావనకు అర్థం. విశ్లేష కులు, రాజకీయనేతలు, పౌరులు, క్రికెటర్లు, లేదా గృహిణు లు ఇలా మనందరం అవతలి పక్షాన్ని శత్రువుగానే చూడా లి, పైగా ఆ శత్రుపక్షం చెప్పే ప్రతి అంశాన్నీ వ్యతిరేకించాలి. దాన్నుంచి మనకు ఏ లబ్ధి ఒనగూరకపోయినా సరే మనం అవతలిపక్షాన్ని అలాగే చూస్తుండాలి. ఇలాంటి మూర్ఖ త్వాన్ని, మూఢత్వాన్ని నేను ఏమాత్రం ఆమోదించను. దీంతో టీవీలో కనిపించటం నాకు కష్టంగానే ఉంటుంది. మరి ఇలాంటి వైఖరిని ఎంతగానో ద్వేషిస్తూ లేదా కనీసం అసంతృప్తిగా చూస్తూ మీరెందుకు ఇంకా టీవీ ప్రసా రాల్లో కనిపిస్తున్నారు? అని ఎవరైనా బుద్ధిమంతులు నన్ను అడగవచ్చు. దీనికి కారణం ఏమిటంటే ఈ పని చేయడానికి నాకు డబ్బు చెల్లిస్తున్నారు. పైగా తరచుగా కాకున్నా కొన్ని సార్లయినా టీవీలో కనిపించడాన్ని నేను ఆస్వాదిస్తుంటాను కూడా. మరొక కారణం ఏదంటే నాలాగే మరి కొందరు కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. వారి సంఖ్య ఏమంత పెద్దది కాక పోవచ్చు కానీ, ఉన్మాదాన్ని, అల్పత్వాన్ని తిరస్కరించే మావంటి బృందం ఒకటి ఉంటుందని విశ్వసించడాన్ని నేను ఇష్టపడతాను. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) ఆకార్ పటేల్, aakarpatel@icloud.com -
చట్ట సభల ప్రతిష్టంభన ఇంకెంతకాలం?
అవలోకనం సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నంత కాలం, బీజేపీ ఊరికే చూస్తుండిపోగలదు. మన ప్రజానీకం ఘటనలను ఉదాసీనంగా అలా తిలకిస్తున్నంత కాలం, మీడియా కేవలం అంచనాలమీదే ఆసక్తి చూపుతున్నంత కాలం ప్రభుత్వ శాసన ఎజెండాలో జాప్యం జరుగుతూంటుంది. వెబ్ మినిస్టర్ ప్యాలెస్ను నిర్వహించే అధికారిక ఇన్చార్జిని బ్లాక్ రాడ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్యాలెస్లో బ్రిటన్ పార్లమెంట్ సమావేశమ వుతుంది. ఈ అధికారిక పదవిని 14వ శతాబ్దం నుంచి కొనసాగిస్తున్నారు. ఇది వారి పార్లమెంటరీ వ్యవస్థ సంప్రదాయాన్ని, ప్రొటోకాల్ కొన సాగింపును ప్రతిబింబిస్తుంది. హౌస్ ఆఫ్ కామన్స్ (ప్రతినిధుల సభ)కు వెళ్లి దాని సభ్యులకు బ్రిటన్ రాణి వార్షిక ప్రసంగానికి రావలసిందిగా సమన్లు పంపడం ఈ బ్లాక్ రాడ్ పనుల్లో ఒకటి. ప్రతినిధుల సభలో అతడు కాస్త వంగి ఇలా చెబుతాడు: ‘మిస్టర్ స్పీకర్, హౌస్ ఆఫ్ పీర్స్లో తక్షణం హర్ మెజెస్టీని కలవవలసిందిగా గౌరవనీయ సభను రాణి ఆదేశిస్తున్నారు.’ ఈ హౌస్ ఆఫ్ పీర్స్నే హౌస్ ఆఫ్ లార్డ్స్ అని కూడా అంటారు. ఇది కులీనుల సభ. అనేక సంవత్సరాలుగా బ్లాక్ రాడ్ చెప్పే ఈ లఘు పంక్తిని లేబర్ పార్టీ ఎంపీ డెన్నిస్ స్కిన్నర్ మొరటు వ్యాఖ్య ఒకటి వెన్నంటి వచ్చేది. డెన్నిస్ మాజీ కోల్ మైనర్, రిపబ్లికన్ కూడా. అంటే అతడు రాజరికాన్ని వ్యతిరేకి స్తాడని అర్థం. రాజరిక వ్యవహారాల్లో అతడి జోక్యం క్లుప్తంగా ఉండేది. అం టే సాధారణంగా ఒక పంక్తితో ముగిసేది కానీ హాస్యస్ఫోరకంగా ఉండేది. ఎందుకంటే హుందాతోకూడిన, లాంఛనప్రాయమైన కార్యక్రమాన్ని ఈ వ్యాఖ్య విచ్ఛిన్నపరిచేది. ఇతడి గురించి పెద్దగా తెలియని పాఠకులకు ఇంటర్నెట్లో డెన్నిస్ స్కిన్నర్ అనే పదాన్ని సెర్చ్ చేయడం ప్రయోజనకరంగానే ఉంటుంది. భారత పార్లమెంటులో ప్రస్తుతం సభకు అంతరాయం కలిగిస్తుండటంపై శుక్రవారం నేను ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఈ డెన్నిస్ స్కిన్నర్ను తలుచుకున్నాను.అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న బీజేపీ నేతలను పదవుల నుంచి తొల గించడం లేదా కనీసం వారిపై తగు చర్యలు తీసుకునేంతవరకు తాను పార్లమెంట్ కార్యక్రమాలను అనుమతించబోనని కాంగ్రెస్ దృఢ వైఖరితో ఉంది. అవినీతి మకిలి అంటుకున్న నేతల్లో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా ఉన్నారు. పరారీలో ఉన్న, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి నిగూఢంగా సాయపడ్డారని వీరిరు వురిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై చర్యకు నరేంద్రమోదీ తిరస్కరించడం, ఆమోదం తెలుపక పోవడంతో కాంగ్రెస్కు ఒక మంచి అవకాశం వచ్చింది. అయితే ఇందులో తప్పక ప్రశ్నించవలసింది ఒకటుంది. కాంగ్రెస్ ప్రస్తుతం చేస్తున్నది చట్టసమ్మతమైం దేనా? బహుశా కాకపోవచ్చు. పార్లమెంటు ఉన్నది శాసనాల రూపకల్పన, చర్చ కోసమే. ప్రభుత్వానికి తన సత్తా ఏమిటో చూపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లయితే దానికి లోక్సభే తగిన వేదిక. ఈ సందర్భంగా పైప్రశ్న మరొక ప్రశ్నకు తావి స్తోంది. కాంగ్రెస్ మంచి రాజకీయాలనే ప్రదర్శిస్తోందా? దీనికి సమాధానం ఉంది. అవును. రాహుల్ గాంధీ వంటి పేలవమైన వక్త లున్న పార్టీకి పార్లమెంటును స్తంభింపచేయడం ద్వారా గుర్తింపు వస్తుంది. కాం గ్రెస్ పార్టీ చర్చల్లో ప్రకాశించేటట్టు కనిపించడం లేదు. మేధోపరమైన భావ ప్రసా రం కోసం వినడాన్ని ఆస్వాదించే దేశం మనది అని మనం భావిస్తున్నట్లయితే, మనం అలా ఉండటం లేదు. సంఖ్యల విషయానికి వస్తే, 44 మంది సభ్యులు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ, ట్రెజరీ బెంచ్లపై ఆధిపత్యం చలాయించేంత బలమైన ది కాదు. ఎలాంటి ఆటంకమూ లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ లోక్సభలో అసంగతమైనదిగా మారిపోతుంది. పార్లమెంటులో కార్యక్రమాలను ఎంత కాలం నిలువరిస్తే, అంతగా కాంగ్రెస్ తాత్కాలికంగా అయినా గుర్తింపు పొందుతుంది. ప్రతిష్టంభన అనేది ఒక ఎత్తుగడ మాత్రమే. దాన్ని ఒక వ్యూహం స్థాయికి మార్చాలన్నా లేదా వ్యూహంలో భాగంగా ఉంచాలన్నా దానికి కొంత యోచన అవసరం. అయితే ఆ పార్టీలో అలాంటిది జరుగుతున్నట్లు నాకనిపించడం లేదు. ఏదేమైనా, అలాంటి ఎత్తుగడలలో కాంగ్రెస్కి సహాయపడే అంశం ఏదైనా ఉందంటే మన మీడియాలో, సాధారణ ప్రజానీకంలో.. సభకు అంతరా యం కలిగించడం పట్ల ఉండే సహనభావమే. పార్లమెంట్ హౌస్కి సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రధాని మోదీ పేర్కొన్న ప్రజాస్వామ్య దేవాలయం అనే భావం విషయంలో అంత భయానకమైనదేమీ లేదు. ‘మా డిమాండ్లను నెరవేర్చు లేదా మేం ఏ పనికీ అనుమతించం’ అనే తరహా విచ్ఛిన్న వైఖరి యునెటైడ్ కింగ్డమ్ పార్లమెంటులో లేదా అమెరికా సంయుక్త రాష్ట్రాల చట్టసభల్లో కాని ఊహించడానికైనా సాధ్యం కాదు.మరి ప్రభుత్వ వైఖరి ఏమిటి? అత్యవసరంగా చట్టరూపం ఇవ్వాల్సిన బిల్లులు దానిముందు చాలానే ఉన్నాయి. సంస్కరణలమందగమనంపై కార్పొరేట్ వర్గాల్లో నెలకొంటున్న చికాకు మోదీని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంలో తప్పు చేస్తున్నదని భావిస్తున్నాను. సెషన్ ప్రారంభం కాకముందే దీన్ని ఎదుర్కోవడానికి తాను ఏదో ఒకటి చేయవలసి ఉందని ప్రభుత్వానికి తెలుసు. కాని అదేమీ చేయలేదు. ఎందుకు? తాను కాంగ్రెస్ను సునాయాసంగా తిప్పికొట్టగల నని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. అదే నిజమైతే దాని వైఖరి తప్పని తేలిపోయింది. కాంగ్రెస్ సభలో అలిసిపోతుందని, ఈ విషయంపై పోరాడి పోరాడి మరో విషయంపై చర్చను చేపడుతుందని ప్రభుత్వం భావించిందంటేనే సబబుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇలాగే జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. పార్లమెంటుకు అంతరాయం కలిగించేంతగా ప్రతిపక్షానికి చికాకు కలిగించిన ఘటనల జాబితాను చూడడానికి గతించిన కాలాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ పక్షాలకు వేడి పుట్టించేలా కనిపించిన అనేక అంశాలు కొద్ది రోజుల్లోనే చల్లబడి పోవడం కూడా జరిగింది. ఆగస్టు మధ్య వరకు వర్షాకాల సెషన్ కొనసాగితే ఇప్పుడు కూడా ఇలాగే జరగవచ్చు. కాని ఇది జూదమే. ఇలాంటిది కాంగ్రెస్కు చొరవ తీసుకునే అవకాశాన్ని అందిస్తుంది కూడా. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నంత కాలం, బీజేపీ ఊరికే చూస్తుండిపోగలదు. ఒక ఉదాసీన జాతి ఊరకే అలా తిలకిస్తున్నంత కాలం, మీడియా కేవలం అంచనాల మీదే ఆసక్తి చూపుతున్నంత కాలం ప్రభుత్వ శాసన ఎజెండాలో జాప్యం జరు గుతూ ఉంటుంది. పార్లమెంటు నిరంతర ప్రతిష్టంభనలో నా అభిప్రాయం ఏమిటంటే... అది మన సంప్రదాయం, ప్రొటోకాల్ రూపం. మనదీ డెన్నిస్ స్కిన్నర్ల జాతే మరి. ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
మతపరమైన మనోభావాలకు అతీతం యోగా
అవలోకనం ఆసనాల్లోనే అత్యంత సమగ్రమైన ఆసనం సూర్య నమస్కారాలు. మీరే మతానికి, జాతికి చెందినవారైనా సరే, ఎవ్వరైనా చేయగలిగిన అత్యుత్తమ వ్యాయామమిది. ముస్లిం బృందాలు ఇలాంటి విషయాల్లో మరింత ఉదారంగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమం వివాదరహితంగా అన్ని మతాలకూ, వర్గాలకూ చేరాలి. అలా చేరనట్లయితే అది ప్రభుత్వ స్వయంకృతాపరాధమే అవుతుంది. భారతీయ పాఠశాలల్లో శారీరక వ్యాయామాన్ని, ప్రత్యేకించి యోగాను మరింతగా అమలు చేయడం మంచిదేనని నేననుకుం టున్నాను. యోగా (శారీరక భంగిమలు అని అర్థం) ఏమంత పురాతనమైనది కాదని, అది ఇటీవలి వ్యవహారమేనని పండితురాలు వెండీ డోనిగెర్ రాశారు. పతంజలి యోగసూత్రాల్లో ఎలాంటి భంగి మలను పేర్కొనలేదు. ఆధునిక యోగా 18, 19 శతాబ్దాలలో యూరో పియన్ల ద్వారా భారత్లో అడుగుపెట్టింది. వ్యాయామంలో ఉన్న ప్రయోజనాలను వారు పసిగట్టారు. రూసో రచన ‘ఎమిలి’ వంటి పుస్తకాల ద్వారా వారు ఉత్తేజం పొందారు. ఈ వాస్తవంతో పలువురు విభేదిస్తూ యోగా పురాతనమైనదని భావిస్తున్నారు. సత్యం ఏదైనా కావచ్చు కానీ యోగా అనేది కోట్లాది భారతీయులు ఎరుకతో ఆచ రిస్తున్న అభ్యాసమన్నది వాస్తవం. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్ వంటి శరీర వ్యాయామ శిక్షకుల కంటే ఎక్కువగా యోగా.. పాఠశాల విద్యార్థులకు సులువుగా నేర్పగలదన్న విషయాన్ని కనుగొనడం పెద్ద కష్టమైన పనేం కాదు. చాలా సంవత్సరాల క్రితం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సు చేస్తున్న సమయంలో యోగా ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలను నేను తెలుసుకున్నాను. యోగా ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి శరీరం ఉపయోగపడుతుందన్నది నేను తెలుసుకున్న ఉపయోగాల్లో ఒకటి. సుదర్శన క్రియ అనే శ్వాస ప్రక్రియను నేర్చుకుంటున్న సెషన్లో నాకు ఈ విషయం బోధపడింది. ఆ సెషన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ ఫొటోను తరగతి ముందు అమర్చారు. ఇష్టమైతే ఎవరైనా ఆ ఫొటోకు నమస్కరించవచ్చు. కాని అది తప్పనిసరి కాదు. నాకు ఆ వ్యవహారం కాస్త అసౌకర్యంగా అనిపించింది. దీంతో నేను ఆ ఫొటో వందనం నుంచి తప్పుకున్నాను. తన పేరుకు ముందు రెండు శ్రీలను ఎందుకు పెట్టుకున్నారంటూ ఒకరడిగిన ప్రశ్నకు రవిశంకర్ ఇచ్చిన కొంటె సమాధానం కూడా నన్ను సంతృప్తిపర్చలేదు. మా తరగతి టీచర్ చెప్పిందాని ప్రకారం, త న పేరుకు మూడు శ్రీలు తగిలించుకుంటే మరీ ఎక్కువ. ఒకే శ్రీని జోడిస్తే మరీ తక్కు వగా ఉంటుందని ఆయన చెప్పారట. ఏదేమైనా, యోగాతో ఎవరైనా ప్రయోజనం పొందగలరనీ, ఎలాంటి మతపరమైన మనోభావాలకు గురికాకుండానే దాని గ్రూప్ సెషన్లలో పాలు పంచుకోవచ్చుననీ చెప్పడానికే నేను ఈ కథనాన్ని మళ్లీ గుర్తు చేశాను. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహించనున్న వివిధ ఆసనాల నుంచి (భంగిమలని అర్థం) సూర్య నమస్కారాలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ వారం తీవ్ర ఒత్తిడికి గురయింది. ముస్లిం విద్యా ర్థులు హిందూ మత ఆచారాలను పాటించేలా భారతీయ జనతా పార్టీ బలవంత పెడుతోందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది. నాకయితే ఇది బాధాకరమైన విషయమే. ఎందుకంటే, సూర్య నమస్కారం అనేది అత్యంత సమగ్రమైన ఆసనం. అంతే కాకుండా మీరే మతానికి, జాతికి చెందినవారైనా సరే, బహుశా ఎవ్వరైనా చేయగలిగిన అత్యుత్తమమైన వ్యాయామం అది. సూర్యనమస్కారాలనేవి నిటారుగా నిలబడటం, శరీరాన్ని విల్లులాగా వెను కకు వంచడం, భూమికి సమాంతరంగా శరీరాన్ని ఉంచి పైకిలేవటం వంటి ఆసనా లతో కూడి ఉంటాయి. వీటిని అభ్యసించే క్రమంలో మన కాళ్లు వెనుకకు వం గుతూ స్ప్రింగ్ లాగా ముందుకు వస్తుంటాయి. సూర్య నమస్కారాల్లో తేలికపాటి కసరత్తు, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ మిళితమై ఉంటాయి. సూర్య నమస్కారాలు మత సంబంధమైనవేనా? నేనయితే అలా అను కోవడం లేదు. యోగాను అభ్యసించేవారిలో కొద్దిమంది సూర్య నమస్కారాలను కూడా చేస్తుంటారు. ఇక లక్షలాదిమంది అమెరికన్లు, యూరోపియన్లు వీటిని సూర్య ఆరాధనా రూపంగా చూస్తున్నారు. ఇది మంచి వ్యాయామం కాబట్టే వారు దాన్ని చేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం ముస్లిం బృందాలు ఇలాంటి విష యాల్లో మరింత సరళత పాటించవలసిన అవసరం ఉంది. తమ సమస్యను వీరు ఘర్షణాత్మకరూపంలో సమర్పించవలసిన అవసరం లేదనుకుంటున్నాను. ఇలా అంటున్నానని ముస్లిం బృందాలు అతిగా స్పందిస్తున్నాయని అర్థమా? ప్రభుత్వం దాని మంత్రుల చరిత్ర, నేపథ్యం మనల్ని మరోలా భావించేలా చేస్తున్నాయి. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలు, పురుషుల నిందాపూర్వకమైన వ్యాఖ్యల ద్వారా మైనారిటీ బృందాలను నిత్యం లక్ష్యంగా చేసుకోవటం జరుగుతోంది. బీజేపీ మాటలు, చేతల ద్వారా తాము ముట్టడికి, బెదిరింపులకు గురవుతున్నట్లు అనేక ముస్లిం బృందాలు భావిస్తున్న విషయాన్ని మనం తప్పక అంగీకరించాలి. తమను రెచ్చగొడుతున్నారని వారు భావించినట్లయితే అందుకు మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అయితే యోగాను ప్రోత్సహించడంలో ప్రభుత్వం చెడుగా వ్యవ హరిస్తోందని నేను భావించటం లేదు. ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తి గతంగా దీనిపట్ల తీవ్రమైన ఉద్వేగం ప్రదర్శిస్తున్నారు. నేను గతంలో పని చేసిన గుజరాతీ దినపత్రికలో మోదీ ప్రతిరోజూ యోగాసనాలు వేసేవారన్న వార్త వచ్చింది. వివిధ ఆసన భంగిమలలో ఆయన ఫొటోలను కూడా మోదీ కార్యా లయం పంపించేది. మోదీ అభ్యర్థన మేరకు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రకటించడం, 175 దేశాలు దానికి మద్దతు ప్రకటించడం అనేది మోదీకి వ్యక్తిగత విజయమని చెప్పాలి. దీంతో ఉత్సాహపడిన కేంద్ర ప్రభుత్వం అతి పెద్దదైన రైల్వేలతోపాటు తన శాఖలన్నింటినీ రోజువారీగా కొన్ని యోగాసనాలను వేయవలసిందిగా కోరింది. అయితే జూన్ 21 ఆదివారం కావడంతో ఇది కాస్త వివాదాస్పదమైంది. ఏదేమైనా ఈ విషయంలో ప్రభుత్వం వివాదాలకు దూరం జరిగితే మంచిది. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పినట్లు, యోగాసనాలు మంచివి, ఇవి అందరికీ, ప్రత్యేకించి పిల్లలకు మేలు చేకూరుస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైనట్లయితే అది ఒకమేరకు స్వయంకృతాపరాధమే అవుతుంది. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం అన్ని కమ్యూనిటీలనూ చేరాలి. అయితే తన గత చరిత్ర, ప్రతిష్ట రీత్యా చూసినప్పుడు ఈ కార్యక్రమం కొంతమేరకు సమస్యాత్మకం అవుతుందని ప్రభుత్వమే ముందుగా ఊహించి ఉండాలి. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) ఆకార్ పటేల్ -
కర్ర పట్టండి కానీ.. కరుకుగా మాట్లాడకండి!!
అవలోకనం ఉగ్రవాదులపై యుద్ధంలో ఉగ్రవాదులను కూడా ఉపయోగించుకుంటామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఇటీవల సియాచిన్లో చేసిన ప్రకటన రాజ్యాంగబద్ధమైన అన్ని హద్దులనూ అతిక్రమించింది. వెంటనే, తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ ప్రతిచోటా హింసాత్మక చర్యలకు మద్దతు ఇస్తోందని పాక్ ఆరోపించింది. దేశ రక్షణ విషయంలో మంత్రి మృదువుగా మాట్లాడుతూనే బడిత కర్ర పట్టుకుంటే మంచిది. రక్షణమంత్రి బడిత కర్రను చేతిలో పట్టుకోవాలి కానీ మృదువుగా మాట్లాడాల్సి ఉంటుంది. కులీన ఐఐటీలో చదివిన మన మనోహర్ పారికర్లో దీనికి వ్యతిరేక కోణం కనబడుతోంది. చిన్న కర్ర, చాలా పెద్ద నోరు పెట్టుకున్న వ్యక్తిని భారత్ తనలో చూస్తోంది. రాజ్యవిధానంలో భాగంగా ఉగ్రవాదులను ఉపయోగించుకోవటం గురించి ఆయన మే నెల 21న మాట్లాడారు. ఆయన అన్న మాట లివి. ‘నేనిక్కడ స్పష్టంగా చెప్పకూడని విషయాలు కొన్ని ఉన్నాయి’ అని అంటూనే వాటిపై చర్చకు దిగారు. ‘ఏ దేశమైనా (పాకిస్తానే ఎందుకు) నా దేశానికి వ్యతిరేకంగా పథకాలు రచిస్తున్నట్లయితే, మనం తప్పకుండా కొన్ని చురు కైన చర్యలు చేపడతాం.’ హిందీ సామెతను ఉటంకిస్తూ ఆయన ఇలా అన్నారు. ‘కాంటేసే కాంటా నికాల్నా. మనం ఉగ్రవాదులను ఉగ్రవాదులతోటే తటస్థం చేయాలి. మనం అలా ఎందుకు చేయకూడదు? మన సైనికుడే ఆ పని ఎందుకు చేయాలి?’ భారత్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఉపయోగించే వైఖరిని అమలు చేసి విఫలమైంది. జమాత్ ఇ ఇస్లామి, ఇతర ఇస్లామిస్ట్ గ్రూపుల వ్యతిరేకులను ఉప యోగించుకోవాలని 1990లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణ యించుకుంది కానీ కశ్మీర్లో ఆ వ్యూహం బెడిసికొట్టింది. ఈ ప్రయోగం త్వరలోనే ముగిసిపోయింది కూడా. భారత్ ప్రయోజనాలకోసం పనిచేసిన కుకా ప్యారీ నేతను అప్పటికి ఇంకా ప్రాబల్యంలో ఉన్న మిలిటెంట్లు కాల్చి చంపారు. మధ్యభారత్లో కూడా ఈ ప్రయోగం విఫలమైంది. ఇక్కడ ప్రభుత్వం మావోయిస్టులపై సాయుధ మిలిటెంట్లను మోహరించింది. ఈ మిలిటెంట్లు అప్పటి నుంచి నిస్సహా యులైన ప్రజలపై పడ్డారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునయినా పారికర్ వంటి మంత్రి తాను చెప్పబోయే మాటల గురించి ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవలసి ఉంది. పారికర్ ప్రకటనతో ప్రతిపక్షం నివ్వెరపోయింది. ‘రక్షణమంత్రి ఒక ఘోరమైన ప్రకటన చేశారు. తన మాట లు ఎంత దూరం వెళ్లాయో ఆయన గుర్తిస్తారనీ, వాటిని వెనక్కు తీసుకోవడానికి తగిన మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను’ అని పి. చిదంబరం ప్రకటించారు. పైగా, ‘పదేళ్ల యూపీయే ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్లోని ఏ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులను లేదా నేరస్థ శక్తులను భారత్ ఎన్నడూ మోహరించలేదు. ఇప్పుడు ఎన్డీయే ప్రభు త్వం కూడా అలా చేయలేదని, ఇకపై చేయబోదని నా నమ్మ కం’ అనేశారు చిదంబరం. ‘రక్షణమంత్రి ప్రకటన అన్ని హద్దులనూ అతిక్రమించిందనీ దాన్ని ఆయన వెంటనే ఉపసంహరించుకోవాల’ని డిమాండ్ చేశారు. అయితే, వాస్తవం చెప్పాలంటే, పారికర్ తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. మే 26న చేసిన మరో ప్రకట నలో, ‘భారత్ను కాపాడేందుకు ఎంతవరకైనా తాను తెగిస్తా ననీ, దేశంపై దాడి చేసేవాళ్ల పని పడతాననీ’ ఆయన దుస్సాహసిక ప్రకటన చేశారు. భారత రక్షణమంత్రి ప్రకటనను పాకిస్తాన్ అంది పుచ్చుకుంది. బలూచిస్తాన్ ఘర్షణల్లో భారత్ జోక్యం చేసు కుంటోందని, తమ దేశానికి వ్యతిరేకంగా ప్రతిచోటా హిం సాత్మక చర్యలకు మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ వెంటనే ఆరోపణకు దిగింది. పారికర్ చేసిన ఈ తరహా ప్రకటన వల్ల కాస్సేపు చప్పట్లు వినిపిస్తాయి కానీ దీర్ఘకాలంలో ఇది మన దేశానికి నష్టం కలిగిస్తుందని బీజేపీ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికీ స్పష్టమయ్యే ఉంటుంది. పాకిస్తానీ బోటును కూల్చి వేశామంటూ గతంలో భారతీయ నావికాధికారి ప్రకటించి ఇదే తప్పు చేశారు. ఇది సమస్యాత్మకంగా మారటం కూడా మనం కొన్ని నెలల క్రితం చూశాం. నా అభిప్రాయం ప్రకారం, మంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన రెండు ప్రతిజ్ఞలను పారికర్ అతిక్రమించారు. ‘రాజ్యాంగబద్ధంగా, శాసనానికి అను గుణంగా పనిచేస్తాన’ని చేసిన ప్రమాణాన్ని, ఉగ్రవాదులను ఉపయోగించుకుంటామంటూ మంత్రి చేసిన ప్రకటన ఉల్లంఘించింది. మంత్రి చేసిన మరొక ప్రతిజ్ఞ గోప్యతకు సంబంధించింది. అంతర్జాతీయ చట్టం అస్పష్టంగా, అనిశ్చి తంగా ఉంటుంది కనుక అన్ని ప్రభుత్వాలూ గోప్యత విష యంలో జిత్తులమారితనాన్ని ప్రదర్శిస్తాయి కానీ కొంత మంది మంత్రులు దాన్ని అతిశయించి చెబుతుంటారు. ‘నా విధులను నెరవేరుస్తున్నప్పుడు అవసరమైతే తప్ప నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను’ అంటూ పారికర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధమైన గోప్యతకు కట్టుబడ్డారు. కానీ, ‘ఉగ్రవా దులను ఉపయోగించుకుంటాం’ అంటూ ఇప్పుడాయన చేసిన ప్రకటన ద్వారా నిజంగానే ప్రభుత్వ విధానాన్ని బహి ర్గతం చేయాలనుకున్నట్లయితే, అది తన విధులను నేర వేర్చడంలో భాగంగా ప్రకటించినట్లు కాదు. భారత్ తక్కువ వనరులు ఉన్న పేదదేశమని పారికర్ అంగీకరిస్తున్నారు. తమకు కూడా సమానంగా పింఛన్లను ఇవ్వాలని రిటైరైన సైనికులు డిమాండ్ చేసినప్పుడు అలా చేయడం ద్వారా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు తెలీవు అంటూ పారికర్ పేర్కొన్నారు. రక్షణమంత్రి పర్యవేక్షణలో భారతీయ వాయుసేన ముందుగా ప్రతిపాదించినటు,్ల 126 రాఫెల్ యుద్ధ విమా నాలను కాకుండా 36 విమానాలను మాత్రమే కొత్తగా కొన బోతోంది. ఈ తగ్గింపుకు అనేక కారణాలుండవచ్చు కానీ వాటిలో బడ్జెట్ అతి కీలకమైనది. ప్రభుత్వం ఏర్పాటు చేయ దలిచిన పర్వత యుద్ధతంత్ర విభాగాన్ని 80 వేలమందితో కాకుండా 35 వేల బలగాలకే కుదించాలని మంత్రి నిర్ణయించారు. ఇంతటి భారీ పథకాల అమలుకోసం డబ్బు ఎక్కడినుంచి వస్తుంది అంటూ మంత్రి ప్రశ్నించారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంది కూడా. ఉగ్రవా దులను ఉపయోగించుకోవడంపై బడాయి పోయినట్లుగా కాకుండా మంత్రి ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడటాన్ని మర్చిపోకుండానే బడిత కర్రను పట్టుకోవడంపైనే తన సమ యాన్ని, శక్తినీ వెచ్చించడంపై దృష్టి పెడితే బాగుంటుంది. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) ఆకార్ పటేల్ -
ఫొటోల నిషేధంతో ప్రకటనల జోరు తగ్గేనా?
అవలోకనం అమెరికాను యుక్త వయసులో తొలిసారిగా దర్శించినప్పుడు అక్కడి రాజకీయ ప్రకటనల్లో, నేతల ఫొటోలకంటే విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఉండటం గమనించాను. అత్యంత విద్యావంత సమాజానికి, అత్యంత అవిద్యావంత సమాజానికి మధ్య అంతరం ఇదే కాబోలు. అయితే విగ్రహాలను ఆరాధించే మనలాంటి సమాజాలకు విషయం కంటే నేతల దర్శనమే ముఖ్యం కావచ్చునేమో.. దేశ రాజకీయ పార్టీలన్నీ ద్వేషించే తరహా తీర్పును భారత సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే ప్రకటించింది. నేనయితే వ్యక్తిగతంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించను కానీ, దాన్ని రాజ్యాంగపరమైన అనౌచి త్యానికి సంబంధించిన విషయమని కానీ లేదా ఈ అంశం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినంత ప్రాధాన్యమైనదని కానీ నేను భావించటం లేదు. కాని ఈ తీర్పు ఇప్పుడు మన మధ్య ఉనికిలో ఉంది. ప్రభుత్వం నగదు చెల్లింపు చేసి ప్రచురించే ఏ ప్రకటనలో అయినా సరే ముగ్గురు వ్యక్తుల ఫొటోలను మాత్రమే ప్రచురించుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా ఆదేశించింది. ఇవి సర్వసాధారణంగా డైరె క్టరేట్ ఆఫ్ ఆడియో-విజువల్ పబ్లిసిటీ -డీఏవీపీ- విడుదల చేసే ప్రకటనలు. భారతీయ ప్రింట్ పత్రికలన్నిటికీ డీఏవీపీ అనే సంక్షిప్త పదానికి అర్థం సుపరిచితమే. ఈ ప్రకటనలను సబ్సిడీ ధరలతో విడు దల చేస్తుంటారు. అయితే వీటి పరిమాణం దృష్ట్యా అన్ని వార్తాపత్రి కలు, టీవీ స్టేషన్లు ఈ తరహా ప్రకటనల కోసం తీవ్రంగా ప్రయత్ని స్తుంటాయి. ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రకటనలు తారస్థాయికి చేరుకుంటాయి కానీ సంవత్సరం పొడవునా కూడా వీటిని విడుదల చేస్తుంటారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, వార్షికోత్సవాలు వంటివి కూడా ఈ ప్రకటనల కింద విడుదల చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తాము సాధించిన విజయాల గురించి చెప్పుకోవడానికి ఈ ప్రకటనలు ఏకైక అతి పెద్ద మార్గంగా ఉంటు న్నాయి. సాధారణంగా ఈ ప్రకటనల్లో ఫొటోలే సింహభాగాన్ని ఆక్రమిస్తుం టాయి. ఈ ఫొటోలను ప్రకటన పైభాగంలో లేదా ప్రకటన స్థలంలో అత్యంత ప్రధానమైన చోట ప్రచురిస్తుంటారు. ఈ ఫొటోలు ఒక అధిక్రమాన్ని అనుసరిస్తుం టాయి. అతి శక్తిమంతులైన నేతలు ఈ ప్రకటనల్లో ప్రధాన స్థానాన్ని పొందుతుం టారు. ఇతరుల కంటే పెద్ద పరిమాణంలో వీరి ఫొటోలు ఆయా ప్రకటనల్లో దర్శనమిస్తాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో ప్రధానమంత్రితో పాటు ఆ ప్రకటనను విడుదల చేసిన శాఖకు చెందిన కేబినెట్ మంత్రి ఫొటోలకు ప్రాధా న్యత లభిస్తుంది. సహాయ మంత్రులు, ఇతరుల ఫొటోలు చిన్న పరిమాణంలో ప్రకటన దిగువ భాగంలో ప్రచురితమవుతుంటాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనల్లో ముఖ్యమంత్రికి ప్రాధాన్యత లభిస్తుంది. ప్రకటనలోని విషయానికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందు కంటే ఇక్కడ ఫొటోకు ఉన్న ప్రాధాన్యత విషయానికి ఉండదు. (డీఏవీపీ వారి ప్రకటనలు నాణ్యమైన డిజైనర్లను ఆకర్షించవు అనేది వాస్తవమే అనుకోండి). స్థానిక స్థాయిలో చూస్తే ఇది కచ్చితమైన రాజకీయ ప్రకటన కాబట్టే నేనిలా చెబుతున్నాను. భారత్కు ఇరుగుపొరుగున ఉన్నవారిని చూస్తే, అక్కడి బిల్బోర్డులన్నీ పూర్తిగా ఫొటోలతో నిండిపోవడాన్ని మనం చూడవచ్చు. వీటిలో టెక్స్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ బిల్ బోర్డులను రాజకీయ పార్టీ నెలకొల్పినట్లయితే, వాటి పైభాగాన ఆ పార్టీ అగ్రనేత కనిపిస్తుంటాడు, అతడి లేదా ఆమె మద్దతు దారుల ముఖాలు కింది వరుసలో ఉంటాయి. ఒకవేళ ఈ బిల్బోర్డులు అధీకృతం కానట్లయితే అవి జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలను అభినందిస్తూ కనబడే ఒక స్థానిక నేత భారీ సైజు ఫొటోను కలిగి ఉంటాయి. అంటే పై స్థాయినేతలతో ఆ నేతకు ఉండే సాన్నిహిత్యానికి ఇది ప్రతీక అన్నమాట. నేను యుక్తవయసులో మొదటిసారిగా అమెరికాకు వెళ్లినప్పుడు, యార్డ్ సైన్లు అని అక్కడి వారు పిలుచుకునే స్థానిక రాజకీయ ప్రకటనలను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అవి కేవలం టెక్ట్స్తో మాత్రమే ఉండేవి (సెనేట్కి ప్రాక్స్మిర్ లేదా సెనేట్కి కాస్టెన్.. ఇలా వ్యక్తుల పేర్లు మాత్రమే వాటిలో ఉండేవి). వాటిలో ఫొటోలు ఉండేవి కావు. వాటి అవసరం లేదనిపిం చేలా అవి కనబడేవి. అత్యంత విద్యావంత సమాజానికి, అత్యంత అవిద్యావంత సమాజానికి మధ్య ఆంతరం ఇదే కావచ్చు మరి. దీన్ని మరింత లోతుగా అంచనా వేస్తే, విగ్రహాలను పూజించేటటువంటి ప్రజ లకు వ్యక్తులు లేదా నేతల దర్శనం అత్యంత ప్రధానం కావచ్చు. మళ్లీ మనం సుప్రీం కోర్టు తీర్పు వద్దకు వస్తే, ఇకనుంచి భారత్లో విడుదలయ్యే వేలాది ప్రకటనలలో ఇకపై కేవలం ముగ్గురి ఫొటోలు మాత్రమే మనం చూస్తాం. వారు భారత రాష్ట్రపతి, ప్రధానితోపాటు.. న్యాయవ్యవస్థ పబ్లిసిటీ సామగ్రిని పెద్దగా జారీ చేయదు కాబట్టి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటో కూడా ఈ ప్రకటనల్లో కనిపించవచ్చు. చమత్కారమేమిటంటే, తమ ఫొటోలను ప్రకటనల్లో ఉపయోగిం చడం సబబేనా అనే విషయాన్ని ఈ ముగ్గురు వ్యక్తులు తమకుతాముగా నిర్ణయించుకోవచ్చునని కోర్టు పేర్కొంది. దీన్ని చమత్కారమని ఎందు కన్నానంటే, మన ప్రధాని తన ఫొటోలు ప్రచురితం కావడాన్ని ఇష్టపడ తారు కాబట్టి, ఇకపై ఆయన ఫొటోలను ఎక్కువగా ఉపయోగించినట్ల యితే వెంటనే అది రాజకీయ దాడిని ఆకర్షించవచ్చు కూడా. మరి, కోర్టు ఇతరుల ఫొటోలను ఎందుకు నిషేధించినట్లు? నాకు ఇది ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే యాడ్లతో కోర్టులకు సమస్య లేదు (డూప్లికేట్ ప్రకటనలు కానట్లయితే, ఉదాహరణకు అనేక విభాగాలు ఒకే విషయంపై ప్రకటనలను జారీ చేస్తుంటాయి. కాబట్టి నా అభిప్రాయంలో అలాం టివి కళాత్మకంగా కానీ నైతికపరంగా గానీ అభ్యంతరకరంగా కనిపించవచ్చు. బహుశా న్యాయస్థానం భారతీయుల విస్తృత మానసికతత్వాన్ని అర్థం చేసుకుని ఇలా ఆలోచించి ఉండవచ్చేమో. ఫొటోలను నిషేధిస్తే యాడ్లు కుదిం పునకు గురై ప్రభుత్వ ధనం కాస్త ఆదా అవుతుందని కోర్టు భావించి ఉండవచ్చు. కారణమేదైనా కావచ్చు.. కానీ రాజకీయ పార్టీలు ఈ తీర్పును స్వీకరించవు. తమకు అందుబాటులో ఉన్న ఏకైక అతి ముఖ్యమైన సందేశ సాధనాలను తొలగి స్తున్న విషయానికి సంబంధించి మన నేతలు ఐక్యంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మన నేతలు అత్యంత సూక్ష్మబుద్ధి కలవారు. మనలో చాలామంది కంటే వీరు తమపై తాము చక్కటి అవగాహన కలిగిన వారు కాబట్టి ఈ అవ రోధాన్ని ఎలా అడ్డుకోవాలనే విషయంపై వీరంతా కలసి పనిచేయవచ్చు కూడా. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com)· ఆకార్ పటేల్ -
ఆ వి‘చిత్రసీమ’లో అతడే ఒక మూవీ
అవలోకనం సల్మాన్కు శిక్ష పట్ల బాలీవుడ్ తటస్థంగా లేదా అంటీముట్టనట్లుగా ఉంటుందని మనం భావించకూడదు. లేదా సల్మాన్, సంజయ్దత్ వంటి స్టార్ల పట్ల వారు చెబుతున్నదాన్ని మనం సీరియస్గా తీసుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ హీరోలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే అత్యంత శక్తిమంతులు. ఈ స్టార్ల ప్రాపకం ఉన్నంత వరకే నటీనటులు, ఇతరుల సంబంధాలు ఉనికిలో ఉంటాయి. ఇది మొఘల్ చక్రవర్తి తన సేవకులపై దయతల్చడం లాంటిదే. నాలాగే సంవత్సరాల తరబడి ముంబై శివారులోని బాంద్రాలో జీవిస్తున్న పలువురికి సల్మాన్ఖాన్ పలుకుబడితో బాగానే పరిచయముంది. బాలీవుడ్కి చెందిన సుప్రసిద్ధ ఖాన్ త్రయం బాంద్రాలోనే నివసిస్తున్నారు కాని వీరిలో సల్మాన్ఖాన్ విభిన్నమైన వ్యక్తి. షారుక్ఖాన్ బంగ్లా మన్నాట్ చాలా పెద్దది. ప్రధాన రహదారి మీదే అతడి బంగ్లా గేట్ కనిపిస్తుంది. ఆతడి అభిమానులు సాధారణంగా ఆ ఇంటి గేటు ముందే తచ్చాడుతుంటారు. ఆమిర్ఖాన్ ఇంటి ముందు చాలా తక్కువ మందే కనిపిస్తుంటారు. ఎందుకంటే అతను ఇతరుల కంటే మరీ గోప్యత పాటించేవాడు మరి. అదే సల్మాన్ విషయానికి వస్తే ఆయన ఇంటికి ఎదురుగా సెలవురోజుల్లో కానీ, పండుగ దినాల్లో కానీ లేదా పనిదినాల్లో కానీ ఎల్లప్పుడూ పెద్ద గుంపు కనిపిస్తూంటుంది. నిజమైన అర్థంలో అతడు స్టార్ పవర్ కలిగినవాడే. నా ఈ పరిశీలనను బాంద్రా పోస్టాఫీసు కూడా బలపరుస్తుంది. సల్మాన్ ఖాన్కు వచ్చే ఉత్తరాలు తక్కిన ఇద్దరు ఖాన్లతో పోలిస్తే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేవని గతంలో నేను పనిచేసిన దినపత్రిక నివేదించింది. నాకు గుర్తున్నంతవరకు షారుఖ్ఖాన్, ఆమిర్ఖాన్ ఇద్దరికీ వచ్చే ఉత్తరాలు, కానుకల కంటే కనీసం నాలుగైదు రెట్లు ఎక్కువగా సల్మాన్ఖాన్కే వచ్చేవి. ఇప్పుడు సల్మాన్ఖాన్కు శిక్ష పడడానికి కారణమైన ఆ ప్రమాదం జరగడానికి సంవత్సరం ముందు ఐశ్వర్యారాయ్ తండ్రి మా పత్రిక కార్యాలయానికి వచ్చారు. ఐశ్వర్య గురించి ఆయన అప్పట్లో ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లని పించింది. సల్మాన్తో సంబంధం కంటే ఆమెతో అతడి ప్రవర్తన ఆ ముసలాయనను ఎక్కువగా భయపెట్టింది. సల్మాన్ అర్థరాత్రి వారి ఇంటికి వచ్చేవాడు. తలుపు తెరవకపోతే దాన్ని బద్దలు కొట్టడానికి కూడా సిద్ధపడేవాడని ఆయన చెప్పాడు. తమ ఇద్దరి మధ్య వ్యవహారం నుంచి బయటపడాలని ఐశ్వర్యారాయ్, ఆమెను వదిలేయడానికి సల్మాన్ సుతరామూ ఇష్టపడని కాలమది. షారుఖ్ఖాన్, ఐశ్వర్యారాయ్లతో అజీజ్ మీర్జా నిర్మిస్తున్న చిత్రం సెట్స్పై ఉన్నప్పుడు, ఒకరోజు సల్మాన్ రోడ్డుమీది కొచ్చి, షూటింగ్ జరగకుండా అడ్డుకున్నాడు. షారుఖ్ను ఇది తీవ్రంగా చికాకుపర్చింది. తర్వాత ఇద్దరిమధ్యా మరింత విరోధం ఏర్పడింది. అదే సమయంలో ముంబై సమీపంలో ఉన్న సల్మాన్ఖాన్ ఫాంహౌస్లో వన్యప్రాణులను చట్టవిరుద్ధంగా నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి. సల్మాన్ను దోషిగా తేల్చిన కృష్ణ జింక వేట ఘటనకు కొద్ది సంవత్సరాలకు ముందే ఇది జరిగింది. అంటే చాలా కాలం నుంచి సల్మాన్ వివాదాలు సృష్టిస్తున్నాడనీ, తనకు కౌన్సిలింగ్ ఇవ్వక తప్పదన్న విషయం సుస్పష్టమే. నిజానికి బాలీవుడ్లో పలువురు వ్యక్తులు సల్మాన్ను ప్రోత్సహిస్తూ, మద్దతిస్తూ వచ్చారు. ఇప్పుడు తనకు హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పడ్డాక, గాయకుడు అభిజిత్ వంటి ఇన్సైడర్లు రోడ్ల మీద నిద్రించినందుకు బాధితులనే తప్పుపట్టారు. కాబట్టే వారు చావును కొనితెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఆ ఘటనలో వారేమీ రోడ్డుపై నిద్రించలేదు. ఎలాంటి ఘటన జరిగినా సరే సల్మాన్ఖాన్కు మద్దతివ్వడాన్ని ఇలాంటి వారు కొనసాగిస్తూనే ఉంటారు. ప్రపంచంలోని మూడు అత్యంత విజయ వంతమైన చిత్రపరిశ్రమల్లో బాలీవుడ్ ఒకటి. తక్కినవి హాంకాంగ్, హాలీవుడ్. వీటన్నిటిలోనూ స్టార్ సిస్టమ్ ఉంది. కానీ బాలీవుడ్ ఈ విషయంలో చాలా చిన్నది. ఇక్కడ నలుగురు లేక అయిదుగురు హీరోలు మాత్రమే ఓపెనింగ్ వసూళ్లకు గ్యారంటీ ఇచ్చే స్థాయిలో ఉంటున్నారు. ఓపెనింగ్ వసూళ్లంటే చిత్రం విడుదలైన తొలి కొద్ది రోజుల్లోనే అది సాధించగలిగిన డబ్బు. ఈ ఓపెనింగ్ రోజులే ఏ సినిమానయినా హిట్ లేదా ఫట్ చేయగలవు. ఈ హీరోలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే అత్యంత శక్తివంతులు. కానీ ఆ శక్తిని వారు తమ ప్రతిభ ద్వారానే సాధించుకున్నారనే చెప్పాలి. అమితాబ్ బచ్చన్ తన కుమారుడిని ఏ స్థాయిలో ప్రోత్సహించినప్పటికీ, ఖాన్లు సాధిస్తున్న విజయాల బాటలోకి అతడిని మలచలేకపోయారు. ఎందుకంటే సల్మాన్, షారుఖ్, ఆమిర్ మాదిరి జనం అభిషేక్ను ఆమోదించకపోవడమే కారణం. అయితే ఇక్కడ మరొక అంతర్గత విషయం ఉంది. బాలీవుడ్లో దర్శకులు, గాయకులు, మేకప్ వృత్తినిపుణులు వంటివారు ఎంత ప్రతిభావంతులైనా సరే, ఈ ముగ్గురు హీరోల్లో ఎవరో ఒకరితో ముడివేసుకున్నవారే లేదా ఇతరులతో చిన్న చిన్న సినిమాలతో సరిపెట్టుకునేవారే. దీనికి కొన్ని మినహాయింపులున్నాయి. ఉదాహరణకు గుల్జార్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి వారు. కాని వీరిదేమంత పెద్ద సంఖ్య కాదు. ఈ కథానాయకుల కక్ష్యలో ఉన్న చాలామంది వ్యక్తుల సంబంధబాంధవ్యాలు పరాన్న స్వభావంతో ఉంటాయి. వారి ప్రాపకం ఉన్నంత వరకే ఈ సంబంధాలు ఉనికిలో ఉంటాయి. ఇది మొఘల్ చక్రవర్తి దయతల్చడం లాంటిదే. అయితే అలాంటి ప్రాపకం పొందినవారు పరిపూర్ణమైన, బేషరతు విశ్వాసం ప్రదర్శిం చాలనుకోండి. తనతో ఎవరు పనిచేయాలో హీరోనే నిర్ణయిస్తాడు. హాలీవుడ్లా కాకుండా ఇక్కడ మరెన్నో విషయాలు ప్రభావితం చేస్తుంటాయి కూడా. ఉదాహరణకు సల్మాన్ కుటుంబం కూడా అతడి ప్రాజెక్టుల్లోకి నిత్యం చొరబడుతుంటుంది. ఎందుకంటే స్టార్ ఇక్కడ సినిమాకు ముఖ్యమైనవాడే కాదు. అతడే ఒక మూవీ మరి. దశాబ్దం క్రితం హిందూస్తాన్ టైమ్స్ పత్రికను ముంబైలో ప్రారంభించిన ప్పుడు, దాని తొలి ప్రధాన కథనం సల్మాన్కి సంబంధించిందే. తనకున్న అండర్ వరల్డ్ సంబంధాలతో ఆమె అంతు చూస్తానంటూ సల్మాన్.. ఐశ్వర్యారాయ్ను బెదిరిస్తున్న టెలిఫోన్ సంభాషణలే ఆ కథనం. ఈ టెలిఫోన్ సంభాషణపై పోలీసులు రికార్డు చేసిన రాతప్రతే ఆ కథనానికి మూలం. సల్మాన్ ఫోన్ను చట్టవిరుద్ధంగా ట్రాప్ చేసిన పోలీసులు తర్వాత ఆ రికార్డింగుల నుంచి దూరం జరిగారు కానీ, ఆ కథనం మాత్రం నిజమైనదేనంటూ పత్రిక క్రైమ్ రిపోర్టర్ జె.డే (తర్వాత కాల్పుల్లో చనిపోయాడు) కూర్చి పంపారు. సల్మాన్ చేసిన ఆ సంభాషణలోనే ప్రీతి జింటా గురించి అతడు చేసిన అసభ్య వ్యాఖ్యలను కూడా మా పత్రిక అప్పట్లో మళ్లీ ప్రచురించింది. విచిత్రమేమిటంటే, ఆ వ్యాఖ్యలు చేసిన సల్మాన్పై కాకుండా వాటిని ప్రచురించిన పత్రికపై ఆమె కేసు పెట్టింది. నిజానికి ఈ వారం తనను కోర్టు దోషిగా ప్రకటించాక, సల్మాన్కు తన మద్దతును తెలుపడం కోసం ఆమె బెంగళూరులో తన ఐపీఎల్ క్రికెట్ జట్టు ఆడుతున్న మ్యాచ్కు కూడా డుమ్మా కొట్టేసింది. దీంట్లో ఆశ్చర్యపడాల్సిన విషయమేదీ నాకు కనిపించలేదు. సల్మాన్ పట్ల బాలీవుడ్ తటస్థంగా లేదా అంటీముట్టనట్లుగా ఉంటుందని మనం భావించకూడదు. లేదా సల్మాన్, సంజయ్దత్ వంటి స్టార్ల పట్ల వారు చెబుతున్నదాన్ని మనం సీరియస్గా తీసుకోవలసిన అవసరం కూడా లేదు. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత, aakar.patel@icloud.com) -
మత సహనం మన సహజ గుణం
మనది, మతాల మధ్య నిరంతర యుద్ధాలు, అప్పుడప్పుడూ శాంతి విరామాలతో సాగిన చరిత్ర కాదు. నిజానికి అందుకు విరుద్ధంగానే మన చరిత్ర సాగింది. మత సహనం భారత ఉపఖండం స్వాభావిక లక్షణం. వివిధ రూపాలలో వ్యక్తమయ్యే హిందూ మతం.. దాన్ని పాటించిందనీ, అదే ఇతర మతాలలో కూడా వ్యాప్తి చెందిందని ఎవరైనా అనొచ్చు. ఆ వాదన నిజమే కావచ్చని నేనూ అంగీకరిస్తాను. ‘‘షారుఖ్, సల్మాన్, అమీర్లతో కూడిన బాలీవుడ్ ఖాన్ల త్రయం విస్తృత జనాదరణను పొందడం... భారతీయులు స్వాభావికంగా లౌకిక వాదులేననీ, రాజకీయ ఉద్దేశాలతో లేదా వంచనతో పెడదోవ పట్టిస్తే తప్ప వారందుకు విరుద్ధంగా ప్రవర్తించరని సూచించడం లేదా?’’ audiomatic.in అనే వెబ్సైట్లో నేను వారం వారం నిర్వహించడం ప్రారంభించిన వీడియో ఆడియో పాడ్కాస్ట్లో ఓ మహిళ అడిగిన ప్రశ్న ఇది. అది నేను తరచుగా ఆలోచిస్తున్న విషయం కూడా. నిజాయితీగా చెబుతున్నా.. ఆ విషయంలో నేనెప్పుడూ ఇదమిత్థంగా ఒక నిర్ణయానికి రాలేకపోయాను. నేను పాకిస్తాన్లో ఉండగా, ప్రత్యేకించి హిందువుల సాంగత్యం తక్కువగా ఉండే పంజాబ్ లాంటి ప్రాంతాల్లో సైతం నాకు తరచూ ఇంచుమిం చుగా ఇలాంటి ప్రశ్నే ఎదురయ్యేది. బాలీవుడ్ ప్రేమ కథలకు హిందూ-ముస్లిం కోణం ఉండేట్టయితే, తప్పనిసరిగా అది హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయే అవుతుందని పాక్ పత్రికా సంపాదకుడు, క్రికెట్ నిర్వాహకుడు, రాజకీయవేత్త నజామ్ సేథీ ఒకసారి వ్యాఖ్యానించారు. ఉదాహరణకు మణి రత్నం ‘బొంబాయి’. నాకు సరిగ్గానే గుర్తుండినట్టయితే, భారతీయులు అందుకు విరుద్ధమైనదాన్ని... అంటే ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి ప్రేమను ఆదరించరన్నట్టు సేథీ మాట్లాడినట్టున్నారు. నిజమేనా? కాదంటాను. బాలీవుడ్ డెరైక్టర్లు, రచయి తలు కొందరు పూర్తిగా అలాంటి అలోచనతోనే స్క్రిప్టును సరిగ్గా అలాగే తయారుచేస్తారనడంలో సందేహం లేదు. కానీ వాస్తవాన్ని చూడాలి. ముగ్గురు ఖాన్లూ హిందువులను పెళ్లి చేసుకున్నవారు లేదా సహజీవన బంధంలో ఉన్నవారే. వారి స్థాయిలో విజయవంతం కాలేకపోయిన సైఫ్ అలీఖాన్ను కూడా కలిపితే నలుగురు ఖాన్లవుతారు. సైఫ్, కరీనా కపూ ర్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిళ్లు, ప్రేమలతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. దీన్నే మనం వెండి తెరకు కూడా వర్తింపజేసి... హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమ కథైతే ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమేమీ ఉండదని ఊహించవచ్చు. దీనికి సంబంధించి రెండో పార్శ్వం కూడా ఉంది. అది బాలీవుడ్ సినిమాల ఇతివృత్తాలు, మన స్టార్ల వ్యవస్థ. భారీ చిత్రాలు సహా చాలా వరకు హిందీ సినిమాల్లో ప్రత్యేకించి కథా నాయకుడి పాత్ర స్వభావంలో ఏ మంత పస ఉండదు. మూసపోతలో చదునుగా, కేవలం ద్విముఖమైనదిగానే ఉం టుంది. సల్మాన్ఖాన్ ఏ పాత్రనైనా అలాగే పోషిస్తాడు. అదే, మనిషిగా సల్మాన్ నిజస్వభావమని ఊహిస్తుంటారు. ప్రేక్ష కులు ఆ మనిషికి ఆకర్షితులవుతుం టారే తప్ప ఆ పాత్రకు కాదని ఇది విదితం చేస్తుంది. దశాబ్దాల తరబడి మీడియా ఆ నటుడి స్వభావంలోని భిన్న కోణాలు, అంచులు, చీకటి ప్రాంతాల గురించి చెప్పినదంతా నిజమేనని ప్రేక్షకులు ఊహిస్తారు. అతడు ఎవరు, ఏమిటనేదానితో సహా ప్రేక్షకులు అతన్ని అలాగే అభి మానిస్తారు. వెండితెరపై ముస్లిం అబ్బాయిగా సల్మాన్ హిం దూ అమ్మాయిని ప్రేమించినా వారికి సమస్యేమీ కాదు. దిలీప్కుమార్లాంటి ముస్లిం నటులు హిందూ పేర్ల వల్ల తమకు ఆమోదనీయత లభిస్తుందని భావించిన రోజులనాటి గతం నుంచి బాలీవుడ్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటోం ది. అది సమంజసమైనదేనా? గొప్ప ఖాన్ల త్ర యంతో మన అనుభవాన్ని బట్టి కాదనే మనకు అనిపిస్తుంది. ప్రపంచంలో ఒక భాగంగా ఉన్న మన ప్రాంతంలోని సమాజాలు కొన్ని దశాబ్దాల్లోనే అంత గొప్పగా మారిపోయిందేమీ లేదు. నేటి కంటే 1950ల నాటి బాలీవుడ్ ప్రేక్షకులు ఏమంత భిన్నంగా ఉండేవారేమీ కారు. బాలీవుడ్ కేవలం ఒక సూచికేనని, దానికున్న విస్తృత వ్యాప్తి దృష్ట్యా ఉత్తమ సూచిక కూడానని నేనూ అంగీకరి స్తాను. అయితే మన దేశంలో రెండు మతాల మధ్య సంబం ధాల చరిత్ర అతుకులమయమని కూడా ఆమోదిస్తాను. అప్పుడప్పుడు విరుచుకుపడేవే అయినా తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగిన మాట వాస్తవం. దశాబ్దాల తర్వాత అవి తగ్గినట్టనిపిస్తుంది. ఒకే పరిసరాల్లోని భిన్న మతాల ప్రజలు భిన్న ఆవాస ప్రాంతాలవారుగా విడిపోయి ఉండటం కనబ డుతుంది. ప్రత్యేకించి అహ్మదాబాద్, బరోడావంటి సనా తనవాద నగరాల్లో ఇది ఎక్కువ. అలాంటి చోట్ల ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాల చట్టం లాంటి చట్టాల ద్వారా ఈ విభజనను ప్రోత్సహించింది. దేశంలోని అన్ని మతాలవారిలోనూ పరమత సహనం ఉన్నమాట వాస్తవం. లౌకికత అనేది సంక్షిష్టమైన పదం. ఈ సందర్భంగా దాన్ని వాడవచ్చా, లేదా? నాకు తెలీదు. మత సహనం భారత ఉపఖండపు స్వాభావిక లక్షణం. వివిధ రూపాలలో వ్యక్తమయ్యే హిందూ మతం దాన్ని పాటించిం దనీ, అదే ఇతర మతాలలో కూడా వ్యాప్తి చెందిందని ఎవ రైనా అనొచ్చు. ఆ వాదన నిజమే కావచ్చని నేనూ అంగీకరి స్తాను. ఎవరైనా మనల్ని మోసగించి, రెచ్చగొడితే తప్ప స్వాభావికంగానే భారతీయులం పరమత సహనం గలవా రం/ లౌకికవాదులం. అది నాకు చాలా హాయి గొలిపే యోచన. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత - ఆకార్ పటేల్ ఈమెయిల్: aakar.patel@icloud.com) -
ఆ ‘ఆత్మహత్యలు’ అందరికీ గుణపాఠమే!
‘దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదమైన జై జవాన్ జై కిసాన్ను కాంగ్రెస్ పార్టీ మర్ జవాన్ మర్ కిసాన్ గా మార్చేసింది. గుజరాత్లో రైతులు తమ జీవితాలను ముగించుకోవాలని భావించడం లేదు’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ 2014 మార్చి 30న పేర్కొన్నారు. ‘అవినీతిమయమైన, అస మర్థ, జాతివ్యతిరేక’ యూపీఏ పాలన లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటు న్న కాలంలో మోదీ వ్యాఖ్య ఇది. ‘ఈ సమస్య చాలా పాతది. దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. మన రైతులను ఆత్మహత్యలు చేసుకోనీయవద్దు. గత ప్రభు త్వాలు ఎంతైనా చేసి ఉండవచ్చు కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. మనం దీనిపై తీవ్రంగా ఆలోచించి సామూహికం గానే ఒక పరిష్కారాన్ని కనుగొనవలసి ఉంది’ అని ప్రధాని నరేంద్రమోదీ 2015 ఏప్రిల్ 23న పేర్కొన్నారు. ‘స్వచ్ఛమైన, సమర్థమైన, దేశభక్తియుతమైన’ ఎన్డీయే హ యాంలోనూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న కాలంలో మోదీ ఈ వ్యాఖ్యానం చేశారు. తన కళ్లముందే ఒక రైతు దేశ రాజధానిలో ఉరి వేసుకుని చనిపోయిన ఘటన జాతీయ మీడియా దృక్పథాన్ని మార్చి వేసింది. అందుకే ఈ విషాదాన్ని రికార్డు చేసి పదే పదే ఆ ఘటనను ప్రసారం చేస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైతు ఆత్మహ త్యపై బీజేపీని ఆప్ తప్పు పట్టింది. ఆప్ని బీజేపీ తప్పుప ట్టింది. ఆప్, కాంగ్రెస్ రెండూ పరస్పరం ఆరోపించుకు న్నాయి. అయితే దీర్ఘకాలిక పరిణామాలు స్పష్టమే. ఈ సమ స్యను బీజేపీ ఇక ఏమాత్రం విస్మరించలేదు. లోక్సభలో ఈ సమస్యపై చర్చ జరుగుతున్నప్పుడు, రైతుల ఆత్మహత్యలను రాజకీయం చేయవద్దని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. రాజకీయం చేసిందెవరు? రైతుల ఆత్మహత్యలను ఎన్నికల ప్రచారాంశంగా మార్చిన తర్వాత మోదీ కానీ, బీజేపీ కానీ ప్రస్తుతం దానితో కలసి జీవించాల్సిందే తప్ప దానిపై ఆరోపణలు ఉండకూడదు. మిగతా జనాభాతో పోలిస్తే భారతీయ రైతుల ఆత్మహ త్యల రేటు 47 శాతం మేరకు ఉందని ది హిందూ పత్రిక 2013లో పేర్కొంది. 2011లో లక్ష మంది రైతులకుగాను 16.3 శాతం మంది ఆత్మహత్యలు నమోదయ్యాయి. మొత్తం దేశ జనాభాలో ఆత్మహత్యల రేటు 11.1 శాతం మాత్రమే. 1995 నుంచి కనీసం 2,70,940 మంది భారతీయులు ఆత్మ హత్య చేసుకున్నారని ది హిందూ తెలిపింది. 95 నుంచి 2000 వరకు ఆరేళ్లలో సగటున 14,462 మంది రైతులు ఆత్మ హత్యల పాలయ్యారు. 2001 నుంచి 2011 వరకు 11 ఏళ్లలో రైతుల ఆత్మహ త్యల వార్షిక సగటు 16,743గా నమో దైంది. అంటే రోజుకు 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే 2001 నుంచి దాదాపుగా ప్రతి అర్ధగంటకూ ఒక రైతు ఆత్మహత్య పాలవుతున్నట్లు లెక్క. ఈ లెక్కలు పూర్తి కథను చెప్పక పోవచ్చు. అదే ఏడాది బీబీసీ.. యూఎస్ మెడికల్ జర్నల్ లాన్సెట్లో ప్రచురించిన ఒక భారీ అధ్యయనాన్ని పేర్కొంటూ 2010 సంవత్సరంలో భారత్లో 19 వేల మంది రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని తెలిపింది. కాబట్టి మోదీ చెప్పినట్లు ఇది చాలా పాతది, లోతైనది, విస్తృత వ్యాప్తి కలిగినట్టిది. రైతులను చంపుతున్నారంటూ ఇతర ప్రభుత్వాలను నిందించేటప్పుడు మోదీ సైతం దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి మరి. ఈ సమస్య కేవలం మనదే కాదు. ఇది అంతర్జాతీయ సమస్య అని న్యూస్వీక్ పత్రిక అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, భారత్లలో రైతుల ఆత్మహత్యలను పేర్కొంటూ సోదాహరణంగా తెలిపింది. హగ్గింగ్టన్ పోస్ట్ విలేకరి టెరెజియా ఫార్కాస్ ఎందు కిలా జరుగుతుందో వివరించారు. ఆర్థిక ఒత్తిళ్లు, పశు వ్యాధు లు, పంటలు సరిగా పండకపోవడం, వాతావరణ మార్పు, ప్రభుత్వ విధానాలు, చట్టాలు మొత్తంగా రైతు జీవితాన్ని ధ్వంసం చేస్తున్నాయి. అధిక ఒత్తిడికి నిరాశా నిస్పృహ తోడై కుంగుబాటుకు దారితీస్తోంది. ఆదుకునే ఆపన్న హస్తాలు లేవని భావించినప్పుడు ఆత్మహత్యే శరణ్యమనే భావన మొదలవుతుంది. గత డిసెంబర్లో మోదీ ప్రభుత్వానికి నిఘా సంస్థ రైతుల ఆత్మహత్యలపై ఒక నివేదిక సమర్పించింది. రైతుల ఆత్మహత్యలకు సహజ కారణాలు, మానవ తప్పిదాలు ప్రధా న కారకాలని ఈ నివేదిక తెలిపింది. అకాల వర్షాలు, పెనుతు పానులు, కరువు, వరదలు వంటివి పంటలను దెబ్బ తీస్తుం డగా, ధరల విధానాలు, మార్కెటింగ్ సౌకర్యాల లేమి అనేవి పంట చేతికొచ్చిన తర్వాత నష్టాలకు కారణమవుతున్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదించింది. కాబట్టి నిఘా నివేదిక ప్రకారం ఈ పరిస్థితికి ప్రభు త్వాన్నే నిందించాల్సి ఉంటుంది. మోదీ గుణపాఠం నేర్చు కుంటున్నట్లుగానే, జరుగుతున్న పరిణామాల నుంచి ఎవ్వ రూ తప్పించుకోలేరు కూడా. ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత, aakar.patel@icloud.com) -
సమస్త ఉగ్రవాద చర్యలకూ వాళ్లే కారణమా?
ఆకార్ పటేల్ ఉగ్రవాద చర్యల్లో పట్టుబడిన వారందరూ ఒక మతానికి సంబంధించిన వారని కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్ ప్రకటించడం తప్పు. భారత్లో జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు ముస్లింలు బాధ్యులు కారని గణాంకాలు సుస్పష్టం చేస్తున్నాయి. భారతీయ ముస్లింల లో చాలామంది ఉగ్ర వాదులేనా? ఈ అంశం తోపాటు ఈ వారం మరొక అవాంఛనీయ ఘటన కూడా నా దృష్టి కి వచ్చింది.. ‘రాజీవ్ గాంధీ ఒక తెల్లమ్మాయి ని కాకుండా నైజీరియా మహిళను పెళ్లాడి ఉంటే, కాంగ్రెస్పార్టీ ఆమె నాయ కత్వాన్ని ఆమోదించేదా?’ ఇది కేంద్ర మంత్రి గిరి రాజ్సింగ్ చేసిన వ్యాఖ్య. భారత్లో సర్వసాధార ణంగా రంగుకు సంబంధించి ఉనికిలో ఉంటున్న జాతివివక్షతను ఈ వ్యాఖ్య బయటపెట్టింది. ‘ప్రధా ని నరేంద్రమోదీ దీనిపై తగు చర్య తీసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ నైజీరియా రాయబారి ఓబీ ఓకోన్గోర్ బాధను వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఎప్పటిలాగే ప్రధాని పెద్దగా పట్టించుకోలేదు. ‘గిరిరాజ్ సింగ్ నోరుమూయించడానికి 5 కారణాలు’ అనే శీర్షికతో ప్రముఖ ఇంగ్లిష్ వెబ్ సైట్ రెడిఫ్.కామ్ ఒక కామెంటరీని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ వెబ్సైట్ గత ఏడాది మంత్రి చేసిన ప్రకటనను ఆ కామెంటరీలో పొందుపర్చింది. ‘ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారం దరూ ఒకే మతానికి చెందినవారుగా ఉండటం నిజం కాదా? ఒక ప్రత్యేక మతాన్ని నేను నిందించ దల్చుకోలేదు. మన ఘనత వహించిన సెక్యులర్ పార్టీలు దీనిపై ఎందుకు మౌనం పాటిస్తున్నాయి?’ గిరిరాజ్సింగ్ వేసిన ప్రశ్న ఇది. బహుశా కేంద్ర మంత్రి ముస్లింల గురించే ప్రస్తావించి ఉంటారు. అయితే ఉగ్రవాద చర్యల్లో పట్టుబడిన వారందరూ ఒక మతానికి సంబంధించినవారని ఆయన ప్రక టించడం సరైంది కాదు. అయితే భారత్లో జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు ముస్లింలే బాధ్యులా? ‘ది సౌత్ ఆసియన్ టెర్రిరిజం పోర్టల్’ ఇటీవలే దేశవ్యా ప్తంగా దాడుల్లో మృతులు, ఘటనల జాబితాను ప్రకటించింది. మరింత సహాయకారిగా ఆ పోర్టల్ ఘర్షణలు జరిగిన ప్రాంతం వారీగా జాబితాను రూపొందించింది. దీనిప్రకారం 2014లో ఉగ్రవాదం (లేదా తీవ్ర వాదం) వల్ల భారత్లో 976 మంది చనిపోయారు. వీరిలో 465 మంది ఈశాన్య భారత్లో మృతి చెం దారు. ఇక మావోయిస్టు గ్రూప్కు చెందిన వామపక్ష తీవ్రవాదం వల్ల 314 మంది మరణించారు. ఉగ్ర వాదానికి మూలబిందువుగా మనం భావిస్తున్న జమ్మూకశ్మీర్లో మృతుల సంఖ్య 193 మంది మాత్రమే. ఈ ఘర్షణాత్మక ప్రాంతాలకు వెలుపల నలుగురిని మాత్రమే హతమార్చినట్లు ఇస్లామిక్ తీవ్ర వాదం బాధ్యతను ప్రకటించుకుంది. 2013లో మావోయిస్టులు ఎక్కువగా 421 మందిని హతమా ర్చగా, 251 మందిని చంపిన ఈశాన్య తీవ్రవాదం రెండో స్థానంలో నిలిచింది. కశ్మీర్లోనూ, ఆ రాష్ట్రం మినహా బయటి రాష్ట్రాలలో ఇస్లామిక్ హింసలో చనిపోయింది 206 మంది. 2012లో కూడా ఇదే విధంగా మావోయిస్టులు 367 మందిని, ఈశాన్య ఉగ్రవాదం 326 మందిని, కశ్మీర్ తీవ్రవాదులు 117 మందిని చంపివేయగా ఈ మూడింటికీ వెలుపల ఇస్లామిక్ ఉగ్రవాద బాధితుల సంఖ్య కేవలం ఒక్కటి మాత్రమే. 2011లో మావోయిస్టు హింసలో 602 మంది చనిపోగా, ఈశాన్య భారత్ ఘర్షణల్లో 246 మంది చనిపోయారు. ఇక కశ్మీర్, దాని వెలు పల ఇస్లామిక్ తీవ్రవాద చర్యల్లో 225 మంది హతు లయ్యారు. గత దశాబ్దంగా దేశంలో హింసాత్మక చర్యలు తగ్గుముఖం పడుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే భారత్లోని ఉగ్రవాదుల్లో అధికులు హిందువులే అన్నది స్పష్టం. అయితే వీరి ని హిందువులు అనడానికి బదులుగా మనకు సౌక ర్యవంతంగా ఉంటుందని మావోయిస్టులు అని ముద్రవేసేశాం. ఇక మన ఉగ్రవాదుల్లో రెండో స్థానంలో ఉన్నవారు ఈశాన్య భారత్లోని గిరిజ నులు, కొంత మంది క్రైస్తవులు. కశ్మీర్ వెలుపల వేర్పాటువాదంకేసి చూస్తే, వీరు చేపడుతున్న హిం సాత్మక, ఉగ్రవాద చర్యలు ప్రపంచంలోనే అతి తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు, భారత్లో హిందువులతో పోల్చిచూస్తే మన దేశంలో ఉగ్ర వాద చర్యల్లో పాల్గొంటున్న ముస్లింల సంఖ్య అతి తక్కువేనని స్పష్టమవుతోంది. భారత్లో ఏదైనా పార్టీ జరుగుతున్నప్పుడు ‘ముస్లింలందరూ ఉగ్రవాదులు కారు కానీ, ఉగ్రవా దులందరూ ముస్లింలుగానే ఎందుకు రికార్డుకెక్కు తున్నారు’ అనే ప్రశ్నను ఎన్నిసార్లు వింటూ వచ్చా నో లెక్కచెప్పలేను. నిజాలను నిగ్గుతేల్చితే ముస్లిం లందరూ ఉగ్రవాదులు కారు. ఆ అంచనాకు సమీ పంగా కూడా వారు లేరు. మన దేశంలో సామా న్యులు ముస్లింలపై అలాంటి వాదనలు చేస్తుం డటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రవచనాలను నిత్యం వల్లించడం చూస్తుంటే, ఎంతటి అనుచిత వ్యక్తులు కేంద్ర ప్రభుత్వంలో భాగమై ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సూత్రవిరుద్ధమైన ఇలాంటి వ్యక్తులను మోదీ ఎందుకు ఉద్దేశపూర్వకంగా తన మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని గిరిరాజ్ వ్యాఖ్య తర్వాత ఒక టీవీషోలో నేను ప్రశ్నించాను. మోదీ తాను బహిరం గంగా చెప్పలేని విషయాలను వారి ద్వారా చెప్పిం చాలనుకుంటున్నారు. గిరిరాజ్ ఇలాంటి సందర్భా ల్లో వ్యక్తపరుస్తున్న ప్రతి పదంతోనూ మోదీకి ఏకీ భావం ఉంది. అందుకే తనకు కేంద్ర మంత్రివర్గం లో స్థానం దక్కింది. కేంద్ర కేబినెట్లోని అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ వంటి శాంతమూర్తుల జాబి తాను ఈ చర్చలో భాగంగా చదువుతున్న బీజేపీ ప్రతినిధిని నా వ్యాఖ్య తీవ్రంగా కలవరపర్చింది. అయితే సుష్మా, జైట్లీవంటి వ్యక్తులు బీజేపీకి చెందిన ఏ మంత్రివర్గంలో అయినా సభ్యులుగా చేరగలుగుతారు. మోదీకి ముందు కూడా వీరు కేంద్రంలో నేతలుగా ఉండేవారు. కానీ గిరిరాజ్, నిరంజన్ జ్యోతి (హిందూయేతరులను ‘బాస్టర్డ్స్’ పదంతో సత్కరించిన వ్యక్తి) వంటి మోదీ తీసు కొచ్చిన కొత్త మంత్రులతోటే అసలు చిక్కు. వీళ్లు ఎంత బోగస్ ప్రకటనలను చేసినా సరే మోదీ వాటిని అంగీకరిస్తున్నారు కాబట్టే ఇలాంటివారు కేబినెట్లో భాగం అవుతున్నారు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్:aakar.patel@icloud.com -
ఇది సార్క్ యాత్రే కానీ పాక్ యాత్ర కాదే..!
జమ్మూకశ్మీర్ రాష్ట్ర చరిత్రలోనే నేడు అత్యంత స్పల్పస్థాయిలో హింసాత్మక చర్యలు జరుగుతున్నాయి. పైగా కశ్మీర్ లోపల వేర్పాటువాద భావన తగ్గుముఖం పడుతోంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో పాకిస్తాన్ కంటే భారత్కే సౌకర్యవంతంగా ఉండబోతోందన్నది వాస్తవం. భారత విదేశీ మంత్రి త్వశాఖ కార్యదర్శి ఎస్. జయశంకర్ మంగళవా రం పాకిస్తాన్ పర్యటన సందర్భంగా అద్భుత ఫలితాలను భారత్ ఆశించడం లేదని పీటీఐ వార్తా నివేదిక తెలిపిం ది. ఆయన చేస్తున్నది సార్క్ పర్యటనే కానీ పాక్ పర్యటన కాదని నొక్కి చెప్పింది. పదవీ విరమణ చేసిన దౌత్యవేత్తకు ఈ వార్తను చూపించాను. ఈ కథనం జయశంకర్ పాక్ పర్యటనపై అంచనాలను తగ్గించడానికే లీక్ చేశా రని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే నిజమైతే పాకి స్తాన్తో భారత సంబంధాలలో పెనుమార్పు చోటు చేసుకుంటోందన్నమాట. నా అంచనా ప్రకారం భారత్ ప్రస్తుత ఆలోచనాతీరును ఈ లీక్ ప్రతిఫలి స్తోంది. పాకిస్తాన్తో సంబంధాలు అంత ముఖ్యం కాదన్నదే ఇప్పటి మన ఆలోచనా తీరు. నేను ఎందుకిలా చెబుతున్నానో వివరించనీ యండి. భారత్ ప్రధానంగా రెండు అంశాలపై పాకి స్తాన్తో వ్యవహరిస్తోంది. అవి ఉగ్రవాదం, కశ్మీర్. వీటిలో మొదటిది భారత్కు ప్రధాన సమస్య కాగా, రెండోది పాకిస్తాన్కు ముఖ్య సమస్య. వాస్తవమేమి టంటే, భారత్లో ఉగ్రవాదం ఎన్నడూ లేనంత తక్కువస్థాయిలో ఉంది. కశ్మీర్, ఈశాన్య భారతం, మావోయిస్టు యుద్ధ రంగాలకు వెలుపల ఈ ఏడాది భారత్లో ఉగ్రవాద దాడుల్లో ఏ ఒక్కరూ మరణిం చలేదు. గత ఏడాది దేశం మొత్తం మీద ఉగ్రవాద దాడుల్లో నలుగురు మాత్రమే చనిపోయారు. అం తకు మునుపటి ఏడాది 25 మంది చనిపోగా వీరిలో 18 మంది హైదరాబాద్లో ఇండియన్ ముజాహి దీన్ చేసినట్లు చెబుతున్న దాడిలో చనిపోయారు. కాగా, ఆ మునుపటి ఏడాది అంటే 2012లో ఉగ్ర వాద దాడుల్లో ఒక్కరంటే ఒక్కరే చనిపోయారు. భారతీయ మీడియా చెబుతున్న దాని ప్రకారం మనం పాకిస్తాన్లోని మిలిటెంట్ బృందాల ముట్ట డిలో ఉన్నామన్నమాట. నిజానికి, ఇస్లామిక్ హింసా త్మక చర్యలకు సంబంధించి చూస్తే, యూరోపియ న్లతో పోలిస్తే భారతీయులు సురక్షితంగానే ఉన్నా రు. ఉగ్రవాద దాడులకు భారతీయ నగరాలు ప్రపం చంలోనే అత్యంత తక్కువగా ప్రభావితమవుతు న్నాయి. ఈ కోణంలో చూస్తే భారత్కు పాకిస్తాన్ అవసరం చాలా తక్కువే అని చెప్పాలి. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ అందించిన వివరాలు వేళ్ల మీద మాత్రమే లెక్కించవచ్చు. ముంబై నగరంపై దాడిచేసిన వారిని విచారించడం వేగవంతం కావల సిన అవసరం ఉంది.. పలువురు పాకిస్తానీయులు సైతం దీన్ని గుర్తిస్తున్నారు. అయితే ఇది ప్రధాన సమస్య కాదు. భారత్కు సంబంధించినంతవరకు సీమాంతర ఉగ్రవాదమే ప్రధానమైంది. ఇది ఇప్పుడు అన్ని కాలాల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉందని నేను మళ్లీ చెబుతు న్నాను. భారత్లో ఉగ్రవాద చర్యలు పెరగడానికి పాకిస్తాన్దే బాధ్యత అని మనం చెబుతున్నట్లయితే, ఆ ఉగ్రవాదాన్ని తగ్గించడంలో కూడా పాకిస్తాన్ బాధ్యతే ఎక్కువగా ఉందని మనం అంగీకరించి తీరాలి. ఈ విషయానికి సంబంధించి మోదీ ప్రభు త్వం పాకిస్తాన్ నుంచి తనక్కావలసిందాన్ని ఇప్ప టికే చాలావరకు పొందిందనే చెప్పాలి. నా అభి ప్రాయం ప్రకారం పాకిస్తాన్తో తీవ్రంగా వ్యవహ రించవలసిన అవసరం ఇప్పుడు లేదని భారత ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపున పాకిస్తాన్కు కశ్మీర్ ప్రధాన సమస్య. దాని పరిష్కారమే ఆ దేశానికి కీలకమైనది. ఇక్కడే భారత్పై రెండు రంగాల్లో ఒత్తిడి పడుతోం ది. మొదటిది కశ్మీర్లో ఉగ్రవాదం. దీనికి పాకిస్తాన్ మద్దతు ఉంది. అసంఖ్యాక భారతీయ సైనికులు కశ్మీర్ ఉగ్రవాదంతో పోరులో కూరుకుపోయేలా పాక్ చేయగలుగుతోంది. రెండో అంశం ఏదంటే, ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనేందుకు చాలా మంది కశ్మీరీలు నేటికీ వ్యతిరేకత తెల్పుతుండటమే. వీరి దృష్టి నేటికీ ఆజాదీ పైనే ఉంది. 2001లో జమ్మూకశ్మీర్లో 4,507 మంది హతమయ్యారు. రాష్ట్ర చరిత్రలో అది అత్యంత హింసాత్మకమైన ఏడా ది. 2003 వరకు ప్రతి ఏటా 2 వేల మంది హతం కాగా, 2004 నుంచి 2006 వరకు ఈ సంఖ్య వెయ్యి కి పడిపోయింది. 2011 నుంచి హతమైన ఉగ్రవాదు లు, పౌరులు, సైనికుల సంఖ్య 200 లోపు మాత్ర మే. కాగా గత దశాబ్ది మొత్తంమీద ఈ సంవత్సరం అత్యంత సురక్షితమైన, తక్కువ హింసాత్మక చర్య లు జరిగిన ఏడాదిగా నమోదయింది. కశ్మీర్లో గత 25 ఏళ్లలో అంటే వేర్పాటువాదం ప్రారంభమైనప్పటినుంచి అత్యంత తక్కువ స్థాయి హింస జరుగుతోంది. రాజకీయ రంగం విషయానికి వస్తే కశ్మీర్లో ఓటు వేస్తున్న వారి సంఖ్య ప్రస్తుత సమస్యలు ప్రారంభం కావడానికి ముందు (అంటే 1980ల చివరలో) నాటి స్థాయికి చేరుకున్నాయి. ఇతర రాష్ట్రాలలోని భారతీయుల వలెనే కశ్మీరీయు లు అనేకమంది తమ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేస్తున్నారు. వేర్పాటువాదుల పట్ల సానుభూతి చూపే ముఫ్తీ మహమ్మద్ సయీద్కి చెందిన పీడీపీ సైతం వేర్పాటువాద భావనలను ప్రధాన స్రవంతి రాజకీయాలలో కలిపేస్తోంది. అయితే దీంతో వేర్పా టువాద మనోభావాలు ముగిసిపోతాయని అర్థం కాదు. ఏమైనప్పటికీ పైన పేర్కొన్నట్టుగా కశ్మీర్లో హింసాత్మక చర్యలు దాదాపు లేకుండాపోయాయి కాబట్టి కశ్మీర్ వివాదంపై చర్యలు తీసుకోవడంపై భారత్పైనే ప్రస్తుతం ఒత్తిడి పడుతోంది. ఉగ్రవాదం, కశ్మీర్ అనే రెండు సమస్యలకు వెలుపల, ఇరు దేశాల వాణిజ్యం చట్టబద్ధ, చట్టవ్య తిరేక మార్గాల్లో దోబూచులాడుతోంది. మధ్య ఆసి యా నుంచి పాకిస్తాన్ ద్వారా భారత్కు రావలసిన ఇంధన సరఫరా అప్ఘానిస్తాన్లో సమస్యల కారణం గానే ఆగిపోయింది కానీ దానికి పాకిస్తాన్ కారణం కాదు. కాబట్టి దీనిపై ఇక చర్చించవలసిన అవస రమేంటి? ఇకపోతే వీసాలు వంటి చిన్న చిన్న విషయా లున్నాయి. దీనికి సంబంధించి కరాచీలో వేరుపడి పోయిన కుటుంబాల పట్ల బీజేపీ ఎలాంటి సాను భూతీ చూపడం లేదు. ఎందుకంటే ముస్లింలు ఈ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలలో ఉండరు. పైగా ప్రభుత్వంలో వీరి తరపున ప్రాతినిధ్యం వహించే బలమైన లాబీ బృందం కూడా లేదు. ఈ విషయం లో వీరెన్ని బాధలకు గురవుతున్నా ఎవరికీ పట్టింపు లేదు. ఈ అన్ని కారణాలవల్ల ప్రస్తుతం భారత్ తాను సౌకర్యవంతంగా ఉన్నట్లు, వచ్చే వారం జర గనున్న సమావేశంలో పాకిస్తాన్తో నింపాదిగా వ్యవహరించగలనని భావిస్తున్నట్లు నేను అభిప్రా యపడుతున్నాను. ఆకార్ పటేల్ (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్: aakar.patel@icloud.com -
నేత హితవు సరే.. మరి అనుచరుల వైఖరి...!
క్షేత్రస్థాయిలో అనుచరులు యథావిధిగా వ్యవహరిస్తుంటే, నేతలు మాత్రం బుజ్జగింపు మాటలు వల్లించడం వృథాప్రయాస అని చాలాకాలం క్రితం మాజీ ప్రధాని వీపీ సింగ్ స్పష్టంచేశారు. మత సహనంపై మోదీ తాజా ప్రకటన బీజేపీ, సంఘ్పరివార్లపై ప్రభావం చూపగలదా? దివంగత ప్రధాని విశ్వ నాథ్ ప్రతాప్సింగ్ గతంలో భారతీయ జనతా పార్టీ గురించి ఒక విషయం చెప్పారు. ఆ విషయం ఆయన ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే కాదు నేటికీ అంతే నిర్దిష్టంగా, అంతే సుస్పష్టంగా ఉండటం ఆశ్చర్యం గొలిపిస్తుంది. విషయానికి వస్తే 1980ల చివర్లో బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజపేయిలు రాజీవ్ గాంధీని ఓడించడానికి ప్రయత్నిస్తున్న కాలంలో వీపీ సింగ్ కూడా వారితో చేయి కలిపారు. ఆ సమయంలోనే అయోధ్య ఉద్యమం ఊపందు కుంది. ఈ ఉద్యమం భారత్ను దెబ్బతీస్తుందని తర్వాత గ్రహించిన వీపీ సింగ్ ఆ ఇద్దరు నేతల భాగస్వామ్యంతో తెగదెంపులు చేసుకున్నారు. అయితే ఈ పరిణామం వీపీ సింగ్ ప్రభు త్వాన్ని కూడా కూల్చేసింది. లౌకికత్వాన్ని కాపాడ టం కోసం తన్ను తాను బలిపెట్టుకున్నట్లుగా ఆయన తర్వాత ఘనంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత తన జీవితం చివరి సంవత్సరాల్లో ఆయన.. బీజేపీని ఓడించడమే ప్రధాన రాజకీయ లక్ష్యంగా కలిగిన వివిధ బృందాలను ఏకం చేయడానికి ప్రయ త్నిస్తూ గడిపారు. ఆ సమయంలో ఒక పత్రికా రచ యిత వీపీసింగ్కు ఒక విషయం చెప్పారు. వాజ పేయి నిగ్రహం ప్రదర్శిస్తారనీ, ఐక్యతను, సహనభావాన్ని ఆయన బోధిస్తారు కాబట్టి బీజేపీ మొత్తం గా మతతత్వపార్టీ కాదనీ ఆ మాటల సారాంశం. అయితే వీపీ సింగ్ ఆ విలేకరికి సమాధాన మిస్తూ బీజేపీ ఎల్లవేళలా దూకుడుగా మాట్లాడా ల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఈ విషయాన్ని నిజంగా వినవలసిందీ, ఆలోచించవలసిందీ బీజేపీ మద్దతుదారులే అన్నారాయన. క్షేత్రస్థాయిలో వాళ్లు ఎలాంటి భాష వాడుతున్నారు? మీడియా ముందు సీనియర్ పార్టీ నాయకులు వల్లించే ధర్మోపదేశాల కంటే ఇదే ముఖ్యం. క్షేత్రస్థాయిలో వారు విషం కక్కుతున్నారని వీపీ సింగ్ ముక్తాయించారు. మన ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఈ వారం సామరస్యం, సహనభావం గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. అది విన్నాక నాకు సరిగ్గా నాటి వీపీ సింగ్ అభిప్రాయం మరోసారి గుర్తు కొచ్చింది. ఢిల్లీలో చర్చిలకు వ్యతిరేకంగా హింసా త్మక చర్యలు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల మధ్యే మోదీ తన పద్ధతికి భిన్నంగా ఒక చర్చిలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల ఇద్దరు భారతీయులను కేరళలో కేథలిక్ మత సంప్రదాయానుసారం మహనీయు లుగా ప్రకటించారు. వారు కురియకోస్ అలియాస్ చవర, యుప్రేసియా. వీరిలో చవర గురించి మోదీ ఇలా ప్రస్తావించారు. ‘‘విద్య చాలా తక్కువమందికే అందుబాటులో ఉన్న కాలంలో ప్రతి చర్చి కూడా ఒక పాఠశాలలా కావాలని చవర ఆనాడే నొక్కి చెప్పారు. ఆ విధంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యా ద్వారాలను ఆయన తెరిచారు’’ సంస్కృత భాషకు సంబంధించి తనకున్న పరిజ్ఞానం ప్రదర్శిస్తూ మోదీ ఈ సందర్భంగా సహనభావం, బాహాటత్వం గురించి బోధించారు. హిందువులు విశ్వ సామరస్యతను విశ్వసించడమే కాకుండా, అన్ని మతాలూ సత్యమేనని ఆమోదిస్తా రంటూ స్వామి వివేకానంద చేసిన ప్రవచనాన్ని కూడా ఆయన ఉటంకించారు. చాలాకాలం క్రితం నేను మోదీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసు కెళ్లాను. సహన భావం గురించి తాను మాట్లాడద లచుకోలేదనీ, హిందూ సమ్మతి, సానుకూలత పట్లే మనం దృష్టి పెట్టాలని మోదీ స్పష్టంగా చెప్పారు. దాంతో పోలిస్తే సహనభావం అనేది ఒక మెట్టు కింద ఉంటుందన్నారు. అయితే ఈ వారం క్రిస్టియన్ కార్యక్రమంలో మాట్లాడినప్పుడు ఆనాటి తన సూత్రీకరణ నుంచి వైదొలిగి కొన్ని అంశాలను చాలా స్పష్టంగా చెప్పారు. ఏ రకంగా చూసినా ఇవి చాలా ముఖ్య మైనవి. ఆయనేమన్నారంటే... ‘‘ఒక మతాన్ని లేదా విశ్వాసాన్ని కలిగి ఉండే, కొనసాగించే, స్వీకరించే స్వేచ్ఛ పౌరుల వ్యక్తిగత అభీష్టమని మనం గుర్తిస్తాం. నా ప్రభుత్వం సంపూర్ణ మత స్వాతంత్య్రానికి కట్టుబడి ఉంటుంది. ఎలాంటి నిర్బంధం, లేదా అనుచిత ప్రభావాలకు గురి కాకుండా అతడు లేదా ఆమె తన మతాన్ని కొనసాగించడంలో, పర మతాన్ని అవలంబించే విషయంలో పరిపూర్ణ హక్కు కలిగి ఉంటారన్నదే నా భావన. మెజారిటీ కావచ్చు లేదా మైనారిటీ కావచ్చు ఏ మత బృందమైనా సరే.. ప్రచ్ఛన్నంగా లేదా బహిరంగంగా ఇతరుల పట్ల విద్వేషాన్ని ప్రేరేపించడాన్ని నా ప్రభుత్వం ఏ పరిస్థితుల్లోనూ అనుమతించదు. నాది అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చే ప్రభుత్వం.’’ ప్రధాని మోదీ ఎంత స్పష్టంగా ఈ విషయా లను ప్రస్తావించారన్నది ఇక్కడ కీలకం. తన పార్టీ లోని మంత్రివర్గంలోని కొందరు సభ్యులు, పార్టీలో, సంఘ్ పరివార్లోని మిత్రులు కొందరు మతప రంగా చేసిన వ్యాఖ్యలు తనను గాయపర్చాయని ప్రధాని తేల్చి చెప్పారు. ఇలాంటి భాషను మళ్లీ ఎవరైనా ఉపయోగిస్తే అప్పుడు మోదీ చేసిన ఉపన్యాసం ఆధారంగా మీడియా ఆయననే బాధ్యు డిని చేయవచ్చు. చర్చి కార్యక్రమంలో చేసిన ఆ ప్రసంగం మోదీ వ్యక్తిత్వంలోని ఒక అంశాన్ని వెలికి తెచ్చింది. ఇది తరచుగా తన్ను తాను ప్రదర్శించుకోదు. ఇది ఆయన గుజరాతీ స్ఫూర్తిలో భాగం. సిద్ధాంతానికి మొండిగా కట్టుబడటం కంటే ప్రయోజనాలను సిద్ధించుకోవడం కోసం రాజీధోరణి ప్రదర్శించే స్ఫూర్తి అది. అభివృద్ధికి సంబంధించిన సమస్య లతో వ్యవహరించేటప్పుడు తనలోని ఈ పార్శ్వా న్ని మోదీ క్రమం తప్పకుండా ప్రదర్శిస్తారు. సంఘ్ పరివార్ సిద్ధాంతవేత్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రూపొందించిన ఆరెస్సెస్ ఆర్థిక సిద్ధాంతాన్ని ఆయన ఇలాంటి సందర్భాల్లో తక్కువ చేసి, పక్కనపెట్టేస్తారు కూడా. అయితే మత విశ్వాసానికి సంబంధించిన అంశాలపై మోదీ నిజంగానే చాలా తక్కువగా బయటపడతారు. అందుకే ఆయన చర్చిలో చేసిన ఈ ప్రసంగం చాలా ముఖ్యమైంది. మనం చివరకు నాయకుడి అసలైన మాటలు విన్నాం. ఆయన ఎటు నిలబడుతున్నారో తెలుసు కున్నాం. తన మంత్రివర్గ సహచరుల నుంచి, సంఘ్ పరివార్లోని ఇతరుల నుంచి కూడా ఇదే విధమైన భాష వస్తుందని, ఇలాంటి ప్రకటనే వారి నుంచి కూడా రావాలని మనం ఎదురుచూస్తున్నాం. క్షేత్ర స్థాయిలో అనుచరులు యథావిధిగా వ్యవహరి స్తుంటే, నేతలు మాత్రం బుజ్జగింపు మాటలు వల్లిం చడం వ్యర్థప్రయాస అని చాలా సంవత్సరాల క్రితం వీపీ సింగ్ స్పష్టంగా పేర్కొన్నారు మరి. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
మోదీ ప్రాభవానికి ఇదో పరీక్ష!
అవలోకనం ప్రజల్లో రాక్ స్టార్గా, అన్ని సమస్యలనూ పరిష్కరించే పరిరక్షకుడిగా అభిమానుల గుర్తింపు పొందిన మోదీ, ఇటీవల కాలంలో తన గురించి విస్తృతంగా జరిగిన ప్రచారాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. తన పద్నాలుగేళ్ల రాజకీయ జీవితంలో మొట్ట మొదటిసారిగా నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10న జరిగిన ఒక ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అంగుష్టమాత్రంగా కనిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది. మోదీ 2001లో పూర్తికాలం రాజకీయ నేత అయ్యారు. ఆ సంవత్సరం ఆయన గుజరాత్ సీఎం పదవిలోకి దూసుకొచ్చారు. ఆ రాష్ట్రంలో అప్పటికే బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. 1995 నుంచే గుజరాత్లో బీజేపీ ఆధిక్యతలో ఉండేది. సీఎం కేశూబాయ్ పటేల్ను అంతర్గత సంక్షోభం కారణంగా తప్పించవలసినప్పుడు మోడీ ముందు పీఠికి వచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే గుజరాత్లో తీవ్రస్థాయిలో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. టీవీలో సమగ్ర ప్రచారం కారణంగా ఈ దాడులు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ హింసాత్మక ఘటన జరిగిన కొద్ది నెలలకే, అంటే 2002 చివర్లో మోదీ ఎన్నికల్లో తన మొదటి విజయాన్ని కైవసం చేసుకున్నారు. గుజరాత్లో బీజేపీకి అది మూడో విజయం. 2007, 2012 సంవ త్సరాలలో కూడా మోదీ గుజరాత్ శాసనసభ ఎన్ని కల్లో భారీ మెజారిటీతో అధికారం సాధించి పెట్టా రు. బీజేపీకి గుజరాత్ తన మద్దతును కొనసాగిస్తూ వచ్చిందన్న వాస్తవాన్ని పక్కనబెట్టి, అభివృద్ధిపై తాను దృష్టి పెట్టడం, తన ప్రజాకర్షణ, మొత్తంమీద తన రాజకీయ మేధ వల్లే గుజరాత్లో విజయం సాధిస్తున్నామనే ఆలోచన మోదీ మనస్సులో ప్రవే శించింది. ప్రత్యేకించి జాతీయ మీడియాలోని మోదీ ఆరాధకులు దీన్ని మరింత వ్యాప్తి లోకి తీసుకొచ్చా రు. మీడియాలోని చాలామంది ఆకర్షణీయమైన వక్తగా మోదీ సమర్థత ప్రాతిపదికనే కాకుండా, మిగతా రాజకీయనేతల కంటే భిన్నంగా ఆలోచిస్తూ, తన దార్శనికతను ఫలింపచేసుకునే వ్యక్తిగా కూడా తనలో ఓ విశిష్టత ఉందని భావించారు. ఈ ఆకర్ష ణను జాతీయస్థాయిలో, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించిన కారణంగానే 2014 సార్వ త్రిక ఎన్నికల్లో మోదీ అద్భుత విజయానికి దారి ఏర్పడింది. ఢిల్లీలో ప్రస్తుత పరాజయం మోదీకి తొలి ఓట మి మాత్రమే కాదు. ఈ పద్నాలుగేళ్ల కాలంలో తొలి సారిగా తనకు తానుగా తిరస్కరణకు గురయ్యారనే చెప్పాలి. ప్రజల్లో రాక్ స్టార్గా గుర్తింపుపొందిన మోదీ, అన్ని సమస్యలనూ పరిష్కరించే పరిరక్షకు డిగా అభిమానులు భావించిన మోదీ, ఇటీవల కాలంలో తన గురించి విస్తృతంగా జరిగిన ప్రచా రాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమ య్యారు. గోధ్రా అల్లర్ల కవరేజి జరిగినప్పటినుంచి భారత మీడియా ఆయన్ని బజారు వర్తకుడిగా భావించేది. కానీ విదేశీ మీడియా తన గురించి ఏమనుకుంటోందన్న అంశం పట్లే మోడీ ఎక్కువగా ఆకర్షితుడవుతూ వచ్చారు. బ్రిటన్కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ మోదీ ప్రస్తుత పరాజయంపై పతాక శీర్షికలో ఒక వ్యంగ్య వ్యాఖ్య ను ప్రచురించింది. అతి శక్తివంతుడైన భారత ప్రధా నమంత్రి ఒక నిలువుచారల జాకెట్ కారణంగా ఓడి పోయాడా? అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయినప్పుడు ఢిల్లీలో మోదీ ధరించిన పది లక్షల రూపాయల ఖరీదైన సూట్ గురించే ఈ ప్రస్తావన. పైనుంచి కిందివరకు తన పేరును ముద్రించిన ఆ మోటు సూటును ధరించినప్పుడు మోదీని అంతవ రకూ ఆరాధిస్తూ వచ్చిన కొంతమంది ప్రజలు వెన క్కుతగ్గారు. అయితే 2001 నుంచి మోదీని అనుసరి స్తూ వచ్చిన వారు మోదీ స్వభావ సిద్ధంగానే అలా వ్యవహరించారని సమర్థించారు. అహ్మదాబాద్లో పదేళ్ల క్రితం నేను ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఒక ఫొటోగ్రాఫ్ను విడుదల చేసింది. రాష్ట్రంలోని మూడు డజన్లకుపైగా అత్యంత సీనియర్ ఉన్నతాధికారులతో కూడిన తన మొత్తం సెక్రటేరియట్తో మోదీ కలసి దిగిన ఫొటో అది. కచ్ రాణా ప్రాంతంలో జరుగుతున్న సమావేశం మధ్యలో ఆ ఫొటో దిగారు. నేపథ్యంలో మిరిమిట్లు గొలిపే సుందర ఛాయాచిత్రాలను ప్రదర్శించడా నికి తప్పితే దీనికి మరే ప్రాధాన్యతా లేదు. కౌబాయ్ టోపీ, జాకెట్, సన్గ్లాసెస్ ధరించి సరికొత్త రూపం లో మోదీ ఆ సమావేశాన్ని నిర్వహించారు. మొన్న ఒబామాతో సమావేశంలో ఆ విలాసవంతమైన సూట్ను ధరించాలన్న పేలవమైన నిర్ణయం ప్రభా వాన్ని మోదీ ఏమాత్రం గుర్తించలేకపోయారు. ఇలాంటి వాటిపై మోదీ ఎవరి సలహా అయినా తీసు కుని ఉంటారని ఆయన చంచాలు తప్ప మరెవరైనా ఊహించి ఉండరు. దురదృష్టవశాత్తూ మోదీ తన్ను తాను మంచి శ్రోతగా ఇతరులు చెప్పే ప్రతిదాన్ని ఆలకించే వ్యక్తిగా మలచుకుంటున్నారనడానికి నాకెలాంటి తటపటాయింపూ లేదు. మోదీని అంచ నాలకు భిన్నమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్న వారికే ఆ సూట్ని ఇచ్చి ఉంటే బాగుండేది. మోదీని ఒక ఫ్యాషన్ ్రపతిరూపంగా అభివర్ణిస్తూ బరాక్ ఒబామా చమత్కారయుతంగా చేసిన వ్యాఖ్యను ప్రధాని సరిగా గ్రహించారా అన్నది నా సందేహం. నిలువెల్లా తన పేరును ముద్రించిన ఆ అసభ్యకర మైన సూట్ను గుజరాత్లో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే ధరిస్తారు. గతనెలలో ఒక గుజరాతీ వాలా వజ్రాలు పొదిగిన చెప్పులను గర్వంగా చూపిస్తున్న వార్తను కూడా మనం చూశాం. వీటన్నింటికీ పరా కాష్టగా అభిమానులు మోదీ విగ్రహాన్ని ఉంచిన ఆలయాన్ని ఒక గుజరాతీ మంత్రి ప్రారంభించ నున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈలోగా ప్రసిద్ధ పత్రిక ఎకనమిస్ట్ ఇలా రాసిం ది: ‘ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో తన పార్టీ వైఫల్యానికి మోదీయే ప్రధాన బాధ్యత వహించాలన్న వాస్త వాన్ని అంగీకరించడం అసౌకర్యంగానే కనిపించ వచ్చు’. ‘మనం దేన్నయినా సాధించగలమని, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప జేయగలమని, పనిచేసే ప్రభుత్వాన్ని అందించగలమని, కోట్లాదిమందిని దారిద్య్రం నుంచి బయటపడవేయగలమనీ నమ్మ కాన్ని కలిగించిన నేతగా మోదీ దేశంలోనూ, విదేశా ల్లోనూ భావోద్వేగాలను ప్రేరేపించారు. కాని వాస్త వంగా ఈ వైపుగా చాలా కొద్ది మార్పులే జరిగాయి. ఢిల్లీ ఎన్నికలు సూచించినట్లుగా ప్రజల్లో నిరాశా నిస్పృహలు పెరిగిపోతున్నాయి’ అని ది న్యూయా ర్క్ టైమ్స్ పేర్కొంది. బీజేపీ సహచర మంత్రులు, దాని పార్లమెంటు సభ్యులూ ఉపయోగిస్తున్న ప్రజలను విడదీసే భాషను అడ్డుకోవడంలో మోదీ వైఫల్యం చెందడమే ఈ పరాజయానికి కారణమని విదేశీ వార్తా సంస్థల కథనాలు అంచనా వేశాయి. ఈ వాదనను నేను పాక్షికంగా మాత్రమే అంగీ కరిస్తాను. గత కొద్ది నెలలుగా బీజేపీ, వీహెచ్పీలు చేస్తున్న చేష్టలతో చాలామంది ప్రజలు విసిగిపో యారన్నది వాస్తవం. అయితే చాలావరకు గమ నిస్తే, ఆమ్ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లలో చాలావరకు సానుకూలమైనవే ఉన్నాయని బోధపడుతుంది. అవి బీజేపీకి వ్యతిరేకమైనవిగా కనిపించడం లేదు. నా అవగాహన మేరకు చూస్తే, భావజాలం, లేదా కులం వంటి పలు కారణాలతో బీజేపీవైపు మొగ్గు చూపుతున్న ఓటర్లు ఇప్పటికీ ఆ పార్టీవైపే ఉన్నారు. ఇంత పరాభవంలో కూడా దాని ఓటు షేరు 32 శాతానికి తగ్గకపోవడం దీన్నే సూచిస్తోంది. ఇంత మద్దతుతో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అవలీలగా గెలిచే పరిస్థితి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ వైపు మళ్లిన 20 శాతం ఓట్లే బీజేపీని ఓడించాయి. దేశవ్యాప్తంగా భారీగా, తక్షణ మార్పును తీసుకువస్తానంటూ మోదీ చేసిన వాగ్దా నాన్ని ఢిల్లీ విషయంలో చేశారు కాబట్టే అరవింద్ కేజ్రీవాల్కు అఖండ విజయం సిద్ధించింది. అయితే భవిష్యత్తులో మోదీ ఈ స్థాయిలో ఓట ర్లను కోల్పోతారని నేను ఊహించడంలేదు. తన ప్రవర్తన విషయంలో కొన్ని తప్పులు చేసి ఉంటాడ న్నది నిజమే అయినప్పటికీ, తన రాజకీయాలకు ఢిల్లీ తీర్పు తిరస్కరణ వంటిదని మోదీ భావించడం లేదు. మోదీ దేశ రక్షకుడు అనే భావం దేశ ప్రజల్లో నేటికీ సజీవంగానే ఉంది. నిజానికి ‘ఆబ్ కీ బార్ మోదీ సర్కార్’ స్థాయిలోనే ‘పాంచ్ సాల్ కేజ్రీవాల్’ నినాదం కూడా అదే రీతిలో గుబాళిస్తోంది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) Aakar.patel@icloud.com -
ఆంక్షలులేని అపరిమిత స్వేచ్ఛ సాధ్యమేనా?
అవలోకనం మన దేశంలో ఏ ప్రచురణ సంస్థ అయినాగానీ, కోట్లాది మంది మనోభావాలను గాయపరుస్తుందని తెలిసి తెలిసీ అలాంటి కార్టూన్ను ప్రచురిస్తుందని ఊహించడం కష్టం. సాహసిక సంపాదకులెవరైనా అందుకు మొగ్గినా అది కొని తెచ్చిపెట్టే సమస్యలకు జంకుతారు. హింస, బెదిరింపులు మాత్రమే కాదు చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. నాకు గుర్తున్నంత వర కు ఒకప్పటి నా బాస్ ఎమ్జే అక్బర్కు పత్రికా రచనకు సంబంధించి భగవదాజ్ఞలాంటి ఒకే ఒక్క నియమం ఉం డేది. అది నా మాటల్లో చెప్పాలంటే, నీకు ఇష్ట మొచ్చింది ఏదైనా, ఏ విషయంపైన అయినా రాయి. కానీ మతాన్ని మాత్రం ఎన్నడూ పరిహసించవద్దు. ఆయన అలా చెప్పింది పత్రికలు మతం పట్ల గౌరవం చూపాలనో లేక మతాన్ని అపహాస్యం చేయడం వల్ల సాధార ణంగా మన దేశంలో వచ్చి పడే సమస్యల నుండి తప్పించుకోవాలనో నాకు తెలియదు. బహుశా ఆయనకు ఆ రెండు ఉద్దేశాలూ ఉండి ఉండవచ్చు. ఫ్రెంచి వార పత్రిక ‘చార్లీ హెబ్డో’పై జరిగిన దాడి గురించి ‘బిజినెస్ డైలీ’లో టీఎన్ నైనన్ ఇలా రాశారు: చాలా సమాజాలు, ప్రత్యేకించి పాశ్చాత్య సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగమైన సమాజాలు ఇతరులను నొప్పించే హక్కుతో సహా వాక్ స్వాతంత్య్రంపై ఎలాంటి పరిమితులనూ అంగీకరిం చవు లేదా అతి తక్కువగా మాత్రమే అంగీకరి స్తాయి. ఫ్రెంచి విప్లవ కాలంనాటి మానవ హక్కుల ప్రకటనలోని వాక్ స్వాతంత్య్రాన్ని అవి మానవుని అత్యంత విలువైన హక్కుగా భావిస్తాయి. అయితే సకల మతాల సమానత్వం (సర్వ ధర్మ సమభావ్) అనే విశాల సంప్రదాయం గల మన దేశంలో ఏ ప్రచురణ సంస్థ అయినాగానీ, కోట్లాది మంది మనోభావాలను గాయపరుస్తుందని తెలిసి తెలిసీ అలాంటి కార్టూన్ను (మొహమ్మద్ ప్రవక్తపైన) ప్రచురిస్తుందని ఊహించడం కష్టమని కూడా నైనన్ అన్నారు. అవును, సాహసిక సంపాదకులెవరైనా అందుకు మొగ్గినా అది కొని తెచ్చిపెట్టే సమస్యలకు జంకుతారు. హింస, బెదిరిం పులు మాత్రమే కాదు, చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. వాక్ స్వాతంత్య్రం విషయంలో సమస్యలను ఎదుర్కొన్న అనుభవం మన దేశానికి ఉంది. జవహర్లాల్ నెహ్రూ అంతటి గొప్పవాడే ఈ ప్రాథమిక హక్కుతో ఎలా వ్యవహరించాలనే విషయంలో సందిగ్ధంతో ఉండేవారు. 1950 జనవరి 26న రాజ్యాంగంలోని 19 (1)(ఎ) పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రానికి హామీని ఇచ్చింది. పదిహేను నెలల తర్వాత, నెహ్రూ ఆ హామీ నుండి వెనక్కు తగ్గి, ఆంక్షలను విధించారు. దేశంలో వాక్ స్వాతం త్య్రాన్ని పరిమితం చేసే అరడజను చట్టాలున్నాయి. వాటిలో పలు చట్టాలు వింతగా ఉంటాయి. అయితే అలాంటి పరిమితుల విషయంలో మనదే అత్యంత సున్నితమైన వైఖరి అని, వాక్ స్వాతంత్య్రం ప్రాథ మిక హక్కేగానీ, నిరపేక్షమైనది కాదు అని నీనన్ తన వ్యాసంలో అన్నారు. ప్రజా భద్రత, సభ్యత, నైతికతల కారణంగా దాన్ని రాజ్యాంగం పరిమితం చేసింది. అయితే ఇవన్నీ వ్యాకోచత్వం కలిగిన భావనలు. మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బ తీసే రాతలపై సైతం నిషేధం ఉంది. అది సూత్రానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఏవి మిత్ర దేశాలు, ఏవి కావు అనే విషయంలో ఆమోదం పొందిన జాబితా లేదనే సమస్యా ఉంది. మత హింసలను రెచ్చగొట్టడం, వైషమ్యాలను పెంపొందింపజేయడం, ఒక మతాన్ని అవమానించ డం, మత భావనలను గాయపరచడం వంటి అంశాలకు ప్రత్యేక చట్టాలున్నాయి. అవీ కొత్తవేమీ కాదు. వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలను విధించే మన చట్టాలు 1837లో రూపొందించినవి. 33 ఏళ్ల వయస్సులోనే థామస్ మెకాలే భారత శిక్షాస్మృతిని తయారుచేయడం ప్రారంభించాడు. 175 ఏళ్లుగా అది ఇంచుమించుగా అలాగే ఉంది. మనం ఆధుని కత అలంకారాలతో బతుకుతున్నా, మన సంస్కృతి ఎంతగా మార్పు లేకుండా నిలిచి పోయిందో ఇది తెలియజేస్తోంది. ఆనాటి శిక్షా స్మృతి, వలసవాద చట్టాలు స్వతంత్ర భారతంలో కూడా అమలవు తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లిషువాళ్లు మనల్ని కచ్చితంగా అంచనా కట్టారు. మన ప్రవర్తనను, బాహ్య ప్రేరణలకు మన ప్రతిస్పం దనను సరిగ్గా ఊహించి ముందుగా చెప్పగలిగారు. అది మెకాలేను చాలా గొప్పవాడిని చేసింది. 1984లో, 1993లో, 2002లో మనలో ఎందరు పాశవికంగా మారుతారో ఆత్మవిశ్వాసంతో 1837 లోనే ఆయన చెప్పగలిగాడు. రాజ్యాంగం ఎన్నో గొప్ప, విశ్వజనీన వాగ్దానాలను చేసింది. అయితే మత హింస అనే మన దేశ వాస్తవికతకు అది లొంగిపోయింది. వాక్ స్వాతంత్య్రంపై చర్చలో ముందు వరు సన నిలిచే పాత్రికేయులు ఈ సమస్యకు ఉన్న మంచి, చెడు అనే రెండు పార్శ్వాలను చూడటం తేలికేం కాదు. చార్లీ హెబ్డో యూదు వ్యతిరేకత కార ణంగా తమ పాత్రికేయుల్లో ఏ ఒక్కరిని తొలగిం చడం నేను ఎరుగను. ఇస్లాంపై దాడి చేయడంలో ఆ పత్రిక చూపే ఉత్సాహాన్ని చూసి, అలాంటి ఉదం తం జరిగిందని తెలిసి ఆశ్చర్యపోయాను. ‘సినె’ కలం పేరుతో పని చేసే సైన్ మారిస్ సినె (80) అనే పాత్రికేయుడు 2009 జూలైలో చార్లీ హెబ్డో అనే ఆ వ్యంగ్య పత్రికలో రాసిన ఒక కాల మ్కు గానూ యూదు వ్యతిరేక విద్వేషాన్ని రెచ్చ గొట్టిన ఆరోపణలను ఎదుర్కొంటున్నట్టు ‘డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక అప్పట్లోనే తెలిపింది. ఆ రచన పారిస్ మేధావి వర్గంలో అత్యంత ఆగ్రహావేశ భరిత మైన చర్చను రగిల్చింది. సినెను ఆ పత్రిక నుండి తొలగించడంతో అది ముగిసింది. ఆ వివాదాస్పద కాలమ్లో సినె 22 ఏళ్ల సర్కో జీకి, ఒక ఎలక్ట్రానిక్స్ గూడ్స్ చెయిన్ వారసురాలు, యూదు జాతీయురాలు అయిన జెస్సీకా సెబావన్ దోర్తీతో నిశ్చితార్థం వార్త ఆధారంగా... నాటి అధ్య క్షుని కుమారుడు యూదు మతంలోకి మారడానికి రంగం సిద్ధం చేసుకున్నాడనే నిరాధారమైన పుకారు పుట్టింది. దానిపై సినె వ్యాఖ్యానిస్తూ, ఆ పిల్లాడు భవిష్యత్తులో బాగా పైకి వస్తాడంటూ పరిహాసోక్తిని విసిరాడు. యూదులకు, సామాజికంగా విజయవంతం కావడానికి ముడిపెట్టి ఆ కాలమ్ పక్షపాత వైఖరిని ప్రదర్శించిందంటూ అత్యున్నతస్థాయి రాజకీయ వ్యాఖ్యాత ఒకరు ఘాటుగా దుయ్యబట్టాడు. చార్లీ హెబ్డో సంపాదకుడు ఫిలిప్పె వాల్ క్షమాపణ చెప్పా లని సినెను కోరాడు. కానీ అతగాడు తిరస్కరించి, అంతకంటే తన మర్మావయాలను కత్తిరించుకుం టానని కేకలేశాడు. సినెను తొలిగించాలన్న వాల్ నిర్ణయాన్ని తత్వవేత్త బెర్నార్డ్ హెన్రీ లెవీ సహా సుప్రసిద్ధ మేధావులంతా సమర్థించారు. కొందరు వామపక్ష వ్యక్తి స్వేచ్ఛావాదులు మాత్రమే వాక్ స్వాతంత్య్రం పౌరుల హక్కు అంటూ సినెను సమర్థించారు. వారిదీ కపటత్వమే కావచ్చు. అయితే మనం దరిలాగే చార్లీ హెబ్డోకు కూడా వాక్ స్వతంత్రంపై సందేహాలున్నాయి. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) Aakar.patel@icloud.com -
వాజపేయికి సరే...
అవలోకనం నెల్సన్ మండేలా, సచిన్ తేండూల్క ర్కు కానీ, జవహర్లాల్ నెహ్రూ, గుల్జా రీలాల్ నందాకు కానీ కలిపి ఏదైనా అవార్డు ఇస్తే దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. భారతదేశ అత్యున్నత పౌర అవార్డు భారతరత్న. కానీ, ఈ అవార్డు గ్రహీతలలో చాలామంది (45 మందిలో 25 మంది) రాజకీయ నేతలే. ఇది రాజకీయాల్లో జీవన సాఫల్య అవార్డుగా కనబడుతోంది. ఈ అవార్డును స్వీకరించిన వారి పేర్ల జాబితాను చూసినట్లయితే ఇది మరింతగా తేటతెల్లమవుతుంది. మన రాజకీయ పార్టీలలో అధికారంలో ఉన్నవారు తమకు తామే గౌరవించుకోవడం కద్దు. భారతరత్న కూడా దీనికి మినహా యింపు కాదు. ఉదాహరణకు రాజీవ్గాంధీ తన రాజకీయ జీవి తంలో పెద్దగా సాధించినదేమీ లేదు కానీ, ఆయనకూ ఈ అవార్డు దక్కింది. తన తల్లి ఇందిరాగాంధీకి కూడా భారతరత్న ఇచ్చారు కాబట్టి సొంత ఇంటి వ్యవహారంలా రాజీవ్కు కూడా అవార్డు ప్రకటించేశారు. మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వక పోవడంపై భారతీయులు దీర్ఘకాలంగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు కానీ, ఆయనకు భారతరత్న అయినా ఎందుకివ్వలేక పోయామనే ఆలోచన కూడా చేయరు. తాజాగా భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారి వాజ పేయి కూడా ఇలాంటి వ్యవహారాలను తేలిగ్గా తీసుకున్నారు. పైగా, తన మోకాళ్లకు చికిత్స చేసి సరిచేసిన డాక్టర్ చిత్తరంజన్ రనవత్కు భారత్ అత్యున్నత మూడో అవార్డు పద్మవిభూషణ్ను అందించారు. ఒక జాతిగా మనం అవార్డులను పెద్దగా పట్టించుకోవడం లేదని నా అభిప్రాయం. మన సాయుధ బలగాలకు కూడా ఇది వర్తిస్తుంది. 1999లో భారతీయ సైన్యం తన అత్యున్నత అవార్డు పరమవీర చక్రను మరణానంతరం 19 ఏళ్ల యోగేంద్ర యాదవ్కు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే హవల్దార్ యాదవ్ చనిపోలేదని, తూటాల గాయాలతో ఆసుపత్రిలో ఉండి తేరుకుంటున్నాడని తర్వాత తెలియవచ్చింది. వాజపేయి చాలావరకు మంచిగానే వ్యవహరించేవారు. ప్రతి కూల వ్యక్తులు ఎక్కువగా ఉన్న పార్టీలో ఆయన అత్యంత ఇష్టుడు. తనకు భారతరత్న అవార్డు ఇవ్వడంలో నాకెలాంటి భేదాభిప్రాయం లేదు. ఆయన కన్నా ముందు ఆ అవార్డును పుచ్చుకున్న రాజకీయనే తలను చూసినప్పుడు నా ఈ అభిప్రాయం సరైనదే అని పిస్తుంది. అయితే రాజకీయ జీవితం గడుపుతూ జీవన సాఫల్యం అవా ర్డును వాజపేయి పొందిన సందర్భంగా అందరూ ఉపేక్షిస్తున్న కొన్ని అంశాల్లోకి తరచి చూడాలనుకుంటున్నాను. ఇప్పటినుంచి రాబోయే దశాబ్దాలలో ఎవరైనా రాయబోయే వాజపేయి జీవిత చరిత్ర (జీవిత చరిత్రను రాసే కళలో భారతీయులకు అంత మంచి పేరు లేనప్పటికీ) ఒకే ఒక క్రూర సత్యంతో ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఆ వాస్తవమేమిటంటే వాజపేయి, ఆయన భాగస్వామి ఎల్కే అద్వానీ ద్వేష భావంతో చేపట్టిన ఒక సమస్య వారి పార్టీకి ప్రజాదరణ తెచ్చిపెట్టింది కానీ, దానికి ప్రతిఫలంగా 3,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అద్వానీతో పోలిస్తే వాజపేయి మంచి మనిషి అనే భావన (పావురం, రాబందు) వట్టి బూటకం మాత్రమే. అధికారంలో ఉన్నప్పుడు అద్వానీ ఒక అడుగు వెనక్కు వేశారన్న వాస్తవం దీన్ని స్పష్టంగా ప్రదర్శించింది. రెండో విషయం ఏమిటంటే, ఇటీవలి దశాబ్దాల్లో 1998-99లో మాత్రమే భారత్లో విదేశీ పెట్టుబడులు ప్రతికూల రేటును నమోదు చేశాయి. అంటే విదేశీ నిధులు వాస్తవంగా భారత్ నుంచి తరలిపోయాయని అర్థం. పోఖ్రాన్లో వాజపేయి చేసిన దుస్సా హసమే దీనిక్కారణం. అణ్వస్త్ర పరీక్ష వల్ల భారత్కు ఎలాంటి వ్యూహాత్మక లబ్ధి దక్కకపోగా, ఈ ఘటన భారత్ అభివృద్ధిని, ఉద్యో గాలను అడ్డుకుని దారిద్య్రాన్ని మరింతగా పెంచింది (అయితే భారత్ 1997 నాటి కన్నా ఇప్పుడు మరింత సురక్షితంగా ఉందా అన్నది ఆలోచించాల్సిందే) అప్పట్లో దేశంలో నెలకొన్న అనిశ్చితి, హింస, అభివృద్ధికి సం బంధించిన డేటాను ఎవరూ సవాలు చేయలేదు కాబట్టి వాజపేయి అణు పరీక్ష ఘటనతో జరిగిన నష్టం గురించి తెలుసుకుని ఉండాలి. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మోసకారి పద్ధతులతో వ్యవహరిస్తుండగా, భారతీయ పర్యాటక రంగం తక్కు వ అభివృద్ధిని నమోదు చేసింది. పైగా ప్రతికూల వృద్ధి దశలతో దేశం వరుసగా దెబ్బతింటూ వచ్చింది. మన దేశ ప్రతికూల వృద్ధి రేట్లు 1984 (-8.5%), 1990-91, (-1.7% చొప్పున), 1993 (-5.5%), 1998లో (-7%), 2002 (-6%) నమోదయ్యాయి. ఢిల్లీ దాడులు, బాబ్రీ మసీదు తదనంతర దాడులు, పోఖ్రాన్, గుజరాత్ దాడులు ఈ సంవత్సరాల్లోనే జరిగాయని గుర్తుంచుకోవాలి. వాజపేయికి సంబంధించిన చివరి అంశం ఏమిటంటే, పెద్దగా ఎవరూ గుర్తించని ఆయన కవిత్వమే. ఉదాహరణకు, ఒక కవితను ఇక్కడ చూద్దాం. పృథ్వీ పర్ మనుష్య హై ఐసా ప్రాణి హై జో భిద్ మే అకేలా, ఔర్ అకేలె మై భిద్ సే ఘిరా అనుభవ్ కర్తా హై (భూమ్మీది జీవులలో / మానవుడు మాత్రమే గుంపులో ఒంటరితనాన్ని అనుభవించగలడు. ఒంటరిగా ఉన్నప్పుడు జనం చేత దొమ్మీకి గురి కాగలడు). క్యా ఖోయా, క్యా పాయా జగ్ మే, మిల్తే ఔర్ బిచడ్తే మగ్ మే, ముజే కిసీ సే నహిన్ షికాయత్, యద్యాపీ చలా గయా పాగ్-పాగ్ మే, ఏక్ దృష్టి బేటి పార్ దలేన్ యాదోంకి పొట్లి తటోలన్ (కలిసి, విడిపోయే ఈ ప్రయాణంలో భూమ్మీద నాకు దక్కిందీ, పోగొట్టుకుందీ ఏమిటి? ప్రతి అడుగులో నేను మోసాన్ని చూశాను, కానీ నాకెలాంటి బాధలు లేవు. ఫిర్యాదులూ లేవు, ఎందుకంటే, గతాన్ని మథిస్తూ, స్మృతులను చెరుగుతున్నాను). మనసుకు తగిలేటట్టు ఉండే వాజపేయి ఉచ్చారణతో దీన్ని మీరు చదివినట్లయితే ఈ కవిత మరింత బాగా ఉంటుంది. కాని దానిపై నాకు సందేహమే. కొన్నేళ్ల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియా క్రెస్ట్ ఎడిషన్ కోసం నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాజపేయి, నరేంద్ర మోదీ కవితలపై జరిగిన ఇంటర్వ్యూ అది. దాన్ని నాకు నేను మళ్లీ పునరావృత్తి చేయడం కంటే ఆ వ్యాఖ్యను ఇక్కడ ఉల్లేఖిస్తాను. ‘‘మోదీ, వాజపేయిలలో ఏ ఒక్కరూ నైపుణ్యం కల కవులు కారు. సహజ ప్రపంచాన్ని వారు పరిశీలించలేరు. వీరి కవితలు ప్రాథమిక మైనవి. ఈ కవితలు అంటుగట్టినట్లు ఉంటాయి. మోదీ కవితలు వాజపేయి కవితల కంటే కాస్త మెరుగైనవి. ఎందుకంటే, మోదీ అమూర్త, అస్పష్ట ఆలోచనను చేపడతారు. అయితే వాజపేయి కవిత మాత్రం ఊహించలేనంత వాచ్యార్థంతోనూ, నిస్తేజంగాను ఉంటుంది’’. ఇది నిజమని నేను నేటికీ భావిస్తున్నాను. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) aakar.patel@gmail.com -
గుణపాఠం దేవుడెరుగు... చర్చలే మెరుగు
సరిహద్దులకవతల పాకిస్తాన్ పౌరులను అధికంగా హతమార్చడం ద్వారా ఆ దేశానికి గుణపాఠం నేర్పామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇది నిజంగా గుణపాఠమే అయితే ఈ ఒక్క ఘటనతో సరిహద్దు అవతల నుండి కాల్పులు శాశ్వతంగా ఆగిపోతాయని ఆయన హామీ ఇవ్వగలరా? పాకిస్తాన్ వ్యవహారాలపై భారతీయ మీడియాలోని నిపుణులను విస్తృతార్థంలో రెండు బృందాలుగా విభజించవచ్చు. వీరిలో మొదటి బృందాన్ని అవతలి పక్షం మెతకవైఖరితో కూడుకున్నదిగా చూస్తుం టుంది. తొలి బృందంలోని వారు అన్ని సందర్భాల్లోనూ పాక్ ప్రభుత్వంతో నిల కడైన సంభాషణలను కొనసాగించాలని ప్రబోధిస్తుంటారు. పాకిస్తాన్లో సైన్య, రాజకీయ రంగాల మధ్య ఘర్షణ వాస్తవ మని, ఈ ఘర్షణే భారత్పై ప్రభావం చూపుతుంటుందని వీరి భావన. ఈ బృందం అభిప్రాయం ప్రకారం భారత్ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ రాజకీయ నేతలు శాంతి, పురోగతి మార్గంలో ఉండేలా చూడవలసిన అవసరముంది. దీనర్థం ఏమిటంటే కశ్మీరీ వ్యక్తులతో, బృందాలతో పాకిస్తాన్ హై కమిషనర్ చర్చలు జరపడం వంటి చికాకు కలిగించే ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ, పాక్ రాజకీయ నేతలతో మనం వ్యవహారాలు నడుపుతూనే ఉండాలి. ముంబయ్లో లష్కర్ ఇ తోయిబా దాడులు వంటి నిజమైన దురాగతాలు చోటు చేసుకుంటున్నప్పటికీ మనం పాకిస్తాన్ రాజకీయ వర్గాలతో చర్చలు జరుపుతూనే ఉండాలని ఈ బృందం అభిప్రాయం. ఇక రెండవ బృందం విషయానికొస్తే దాన్ని అవతలి పక్షం కఠినవైఖరి గల బృందంగా లెక్కిస్తూంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వ విధానం శిలాసదృశంగా, మార్పులేనితనంతో ఉంటుందని భావించేవారు ఈ బృందంలో ఉంటారు. భారత్ పట్ల విధానం, అభిప్రాయాలపై పాకిస్తాన్ సైన్యం ఎల్లప్పుడూ ఆధిపత్యం చలాయిస్తూంటుందని వీరి విశ్వాసం. ఈ చట్రంలో, పాకిస్థానీ రాజకీయనేతలు దుష్ట లేదా అసంబద్ధ స్వభావంతో ఉంటారు. పైగా భారత్ పట్ల పాకిస్తాన్ శాశ్వత శత్రుత్వాన్ని కొనసాగిస్తుందని ఈ బృందం అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో, దానికి గుణపాఠం నేర్పడం సాధ్యపడినప్పుడు, పాకిస్తాన్ను పట్టించుకోకుండా ఉండాలి. దాంతో నిజమైన ప్రయోజనం లేనందున, అన్ని వేళల్లో ఆ దేశంతో వ్యవహారాలకు దూరంగా ఉండాలి అని రెండో బృందం ఆలోచన. గత రెండు దశాబ్దాలుగా భారత ప్రభుత్వ వ్యవస్థ ఆలో చనా ధోరణిపై ఈ రెండో బృందమే ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది. కొన్ని సందర్భాలను మినహాయిస్తే (పంజాబీలైన ఐకే గుజ్రాల్, మన్మోహన్సింగ్ హయాం మినహా) మృదు స్వభా వంతో ఆలోచించే నాయకులే భారత్లో లేకుండాపోయారు. భారతీయజనతాపార్టీ పాక్పట్ల దృఢవైఖరినే ప్రదర్శిస్తూవచ్చిం ది. అయితే ఇది సానుకూల ఫలితాలను సాధించలేదనుకోండి. బీజేపీ విధానాలు కొన్ని సందర్భాల్లో భారతీయ ప్రయోజనా లకు వ్యతిరేకంగా పరిణమించాయి కూడా. కార్గిల్లో విద్రోహానికి గురైనంతవరకు నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్ పట్ల మెతకవైఖరి తోనే ఉన్నారని చెబుతుంటారు. కానీ వాస్తవమేమిటంటే, వాజ్ పేయి హయాంలోనే భారత్ తన అణు కార్యక్రమాన్ని ఆయు ధీకరించింది. ఎందుకంటే ఆయన ఆలోచనా విధానం అతివాద దృక్పథంలోనిదే. వాజపేయి హయాంలో జరిగిన రెండో వరుస పోఖ్రాన్ అణు విస్పోటనలు భారత్కు ఎలాంటి వాస్తవ ప్రయో జనాలను కలిగించలేదన్న సత్యాన్ని అంగీకరించాలి. నిజానికి దానికి విరుద్ధ ఫలితాలే సంభవించాయి. దీంతో పాకిస్తాన్ వెను వెంటనే అణుపరీక్షలు జరిపి సాయుధ సంసిద్ధతను సాధించింది. దీంతో సాంప్రదాయిక అణ్వాయుధాలలో తనకున్న అనుకూలతను భారత్ కోల్పోయింది. ఈ అణు చ్ఛత్రం కిందే పాక్ వైపునుంచి మిలిటెంట్ వంచన, దురాగతాలు కొనసాగా యి. చివరకు నాటి దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ దీనికి అంతం పలికారు. డేటా సైతం దీన్ని బలపరుస్తోంది. 2001లో కశ్మీర్లో జరిగిన దాడుల, ప్రతిదాడుల ఘటనల్లో 4,507మంది చనిపోగా, 2012 నాటికి అవి 117కు తగ్గిపోయాయి. ఇందులో నూ 84 మంది మిలిటెంట్లు చనిపోయారు. గత సంవత్సరం కశ్మీర్లో దాడుల ఘటనల్లో 181 మంది చనిపోగా, ఈ సంవ త్సరం ఇంతవరకు 147 మంది చనిపోయారు. 1990 నుండి ఇంత తక్కువ మంది దాడుల్లో చనిపోవడం ఇదే తొలిసారి. అంటే కశ్మీర్లో మిలిటెంట్ హింస తగ్గిపోయినట్లే అని అర్థం. ఉగ్రవాదాన్ని అనుమతించి చేయూతనిస్తున్న వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరుష పదాలతో ఖండించారు కానీ, పాకిస్తాన్ మద్దతుతో భారత్కు వ్యతిరేకంగా సాగుతున్న హింస పెద్దగా తగ్గింది లేదన్నదే వాస్తవం. కశ్మీర్లో హింసాత్మక చర్యలకు పాకిస్తాన్ మూలం అనే విషయాన్ని మనం గుర్తించకపోతే తప్ప, సమస్యను రాజకీయంగా పరిష్కరించేవరకు ఇలాంటి చర్యల స్థాయి కొనసాగుతుందని మనం అంగీకరించి తీరాలి. కఠిన వైఖరికి ప్రతినిధి అయిన నరేంద్రమోదీ తన చర్యల పర్యవసానాలను ఏమాత్రం ఆలోచించకుండానే పాకిస్తాన్తో చర్చలను రద్దుచేశారని నా అభిప్రాయం. పాకిస్తాన్ గురించి చాలా కఠినంగా తను మాట్లాడి ఉండవచ్చు కానీ, చర్చల ప్రక్రియ రద్దుపై తన నిర్ణయాన్ని పక్కనబెట్టి ఆయన ఈ వారం శత్రువైన నవాజ్ షరీఫ్తో కరచాలనం చేయవలసివచ్చింది. కొందరు అంచనా వేసినట్లుగా తప్పనిసరైంది కాబట్టే మోదీ అలా చేయవలసి వచ్చింది. ఎందుకంటే మోదీ విధానం ఇక్కడో లేదా మరెక్కడో లేదు. ఆయనది కేవలం అంగవిన్యాసం మాత్రమే. భరించలేనప్పుడు, ఆచరణ సాధ్యం కానప్పుడు కఠినంగా వ్యవహరించడం, గడుసుతనాన్ని ప్రదర్శించడమే ఇది. అయితే ఈ అవసరార్థ మండిపాటుతనం భారతీయులకు తీసుకొచ్చే ప్రయోజనం ఏమిటి? బీజేపీలోకాని, మీడియాలో ఉన్న దాని అతివాద మద్దతుదారులలో కాని ఏ ఒక్కరు కూడా దీన్ని వివరించలేరు. సరిహద్దుల్లోని మన పౌరులను వారు చంపుతున్న దానికంటే అధిక సంఖ్యలో వారి పౌరులను అధికంగా చంపడం ద్వారా తాను పాకిస్తాన్కు గుణపాఠం నేర్పానని ఇటీవలివరకు రక్షణ మంత్రిగా వ్యవహరించిన అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇది నిజంగా గుణపాఠమే అని భావించినట్లయితే చాలామంది భారతీయులు దీంతో ఏకీభవించరు. ఈ ఒక్క ఘటనతో సరిహద్దు అవతల నుండి కాల్పులు శాశ్వతంగా ఆగిపోతాయని జైట్లీ హామీ ఇవ్వగలరా? అలాంటి హామీ ఆయన ఇవ్వలేకపోతే, పరిణామాలు వేడెక్కినప్పుడు వాటిని చల్లబర్చడానికి బదులుగా పాకిస్తాన్తో చర్చించకుండా, కలసి శాంతికి కృషి చేయకుండా మనం సాధించే ప్రయోజనం ఏమిటి? శాంతి ప్రతిపాదనల కంటే పాక్ పట్ల కఠినంగా ఉండాలనే వైఖరి ఏమంత దృఢమైంది కాదు. గత 20 ఏళ్లుగా ఇది స్పష్టమవుతూనే వచ్చింది. వాస్తవాలు దీన్ని సూచిస్తున్నాయి కూడా. బీజేపీ ఉపఖండాన్ని అణుయుద్ధ క్షేత్రంగా మార్చింది కాబట్టి, పాకిస్తాన్పై కండబలాన్ని ప్రదర్శించేంత బలం భారత్కు లేదు. కశ్మీర్పై అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని భారత్ తిరస్కరిస్తోంది. కనీసం ఈ క్షణంలో భారత్, పాకిస్తాన్తో చర్చించబోదు. అయితే ఈ పరిస్థితి మారనుంది. భారత్ దాంతోపాటు పాక్ పట్ల కఠినవైఖరిని ప్రదర్శిస్తున్న బృందం కాస్త లొంగిపోయే, లోబడే క్రమంలోకి ఇది ప్రయాణించనుంది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) - ఆకార్ పటేల్ -
అమెరికాలో పండనున్న ‘పటేళ్ల’ పంట
అమెరికాలో అత్యంత విజయవంతమైన సామాజికవర్గాలలో గుజరాత్కు చెందిన పటేల్ కమ్యూనిటీ ఒకటి. ఆ దేశంలోని మొత్తం మోటల్స్ (హోటళ్లు)లో సగం వరకు వీళ్లే నిర్వహిస్తున్నారు. 20వ శతాబ్దికి ముందు ఎలాంటి వ్యాపార చరిత్ర లేని పటేళ్లు పరదేశంలో హోటల్ రంగంలో పూర్తి ఆధిపత్యం చలాయించడమే ఒక విశేషం. ఇప్పుడు అమెరికా వలస విధానంపై ఆ దేశాధ్యక్షుడు ఒబామా జారీ చేసిన తాజా డిక్రీ పటేళ్ల పంట పండించనుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం నేను పాఠశా లలో చదువుతున్నప్పుడు నా స్నేహితుడు అమెరికాకు వెళ్లేందుకు వీసాకోసం దర ఖాస్తు చేస్తూ తన చివరి పేరును మార్చు కున్నాడు. అతడు పటేల్. అదే పేరుతో దరఖాస్తు చేసినట్లయితే తన వీసాను తిరస్కరించే అవకాశం ఖచ్చితంగా ఉం దని అతడు భావించాడు. అది నిజమో కాదో నాకయితే తెలీదు (నేను కూడా 16 సంవత్సరాల వయసులోనే దరఖాస్తు చేసి వీసా పొందాను). కానీ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న పటేళ్లు అప్పటికే చాలామంది ఉండేవారన్న మాట నిజం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా అమెరికా వలస విధానంలో ప్రకటించిన మార్పు అమెరికాలోని అక్రమ వలస దారులకు ప్రత్యేకించి 5 లక్షల మంది భారతీయుల ప్రతిపత్తిని చట్ట బద్ధం చేయనుంది. వీరిలో చాలామంది గుజరాత్కి చెందిన పటేల్ సామాజిక వర్గానికి చెందినవారే. వలసవిధానంలో మార్పుచేస్తూ ఒబామా ఇచ్చిన ఆదేశం 41 లక్షలమంది అమెరికా సంతతి పిల్లల తల్లిదండ్రులకు, ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన 3 లక్షల మంది పిల్లలకు వరంగా మారిందని మీడియా సమాచారం. అమెరికాలో నివసిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న నిపుణత కలిగిన వలస ఉద్యోగులు, పట్టభద్రులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సదవకా శాన్ని కల్పిస్తూ ఒబామా వలస విధానంలో విస్తృత మార్పులను ప్రకటించారు. అమెరికాను ఇతర ప్రపంచ దేశాల కంటే ముందు నిలపడంలో మరింత పారదర్శకతతో వ్యవహరించడానికి ఇది వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. గత సంవత్సరం ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం అమెరికాలో 1.5 లక్షల మంది పటేళ్లు ఉన్నారని అంచనా. అయితే చాలామంది పటేళ్లు తమ చివరి పేర్లకు అమిన్ వంటి పేర్లను ఉపయోగిస్తున్నం దున వీరి సంఖ్య 2 లక్షల వరకు ఉండవచ్చు. అమెరికాలో ఉన్న పటేల్ వర్గీయులలో చాలామంది చట్టబద్ధంగా వచ్చినవారే. అమెరికాలో అత్యంత విజయవంతమైన సామాజిక వర్గాలలో వీరిదీ ఒకటి. అమెరికాలోని మొత్తం మోటల్స్ (హోటళ్లు) లో సగం వరకు భారతీయులు.. అందులోనూ పటేల్ సామాజికవర్గమే నిర్వహిస్తోం దని 1999లో తుంకు వరదరాజన్ అనే విలేకరి న్యూయార్క్ టైమ్స్లో రాశారు. పటేళ్లు ఎవరంటే, ‘వైశ్యులు లేదా వర్తకులు. అరేబియన్ సముద్రం పక్కన ఉండే భారతీయ రాష్ట్రం గుజరాత్లో మధ్యయుగాల్లో రాజులకు చెల్లించవలసిన పదో వంతు పన్నును లెక్కించడానికి వీరిని నియమించేవారు. వీరి మూలం గుజరాత్. వీరి రక్తంలోనే వ్యాపారం నిండి ఉంటుందని భారతీయులలో చాలా మంది ప్రజల నమ్మకం. పటేళ్లు కూడా దీన్ని నమ్ముతున్నట్లే కనిపిస్తారు’ అని ఆ విలేకరి రాశారు. ఇది నిజం కాదు. స్వయంగా పటేల్ వర్గీయులే నమ్మేసేటంత స్థాయిలో వారు తమ గురించి తాము తారస్థాయిలో ప్రచారం చేసుకున్నట్లు చెప్పుకునే కల్పనాగాథల నుండి ఇవి పుట్టుకొచ్చాయి. వాస్తవానికి పటేళ్లు కూడా పాటిల్, రెడ్లు, యాదవులు, గౌడలు, జాట్లు వంటి ఇతర రైతాంగ కులాల్లో భాగమైన రైతులు. నాలుగు కిందిస్థాయి సవర్ణులు లేదా గుర్తింపు పొందిన కులాల నుండి వీరు వచ్చారు. మనుస్మృతిలో వీరిని శూద్రులుగా పేర్కొన్నారు. అయితే పటేళ్లు ఈ నాలుగు సామాజిక బృందాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటారు. ఎందుకంటే వీరు శాకాహారులు, పైగా వీరు వ్యాపారంవైపు మొగ్గు చూపారు. అయితే వీరికి వ్యాపారం ఒక వారసత్వంగా రాలేదు. 20వ శతాబ్దికి ముందు వీరికి ఎలాంటి వ్యాపార చరిత్రా లేదు. కానీ జైన్ వ్యాపారుల ఆధిపత్యంలో ఉన్న గుజరాత్లో వ్యాపార సంప్రదాయాన్ని వీరు పుణికిపుచ్చుకున్నారు. అయితే పటేళ్లు హార్డ్వేర్ స్టోర్లు, పెట్ షాపులు, ఔషధ విక్రయ సంస్థలలో ప్రవేశించకుండా మోటల్స్లో తమ అదృష్టాన్ని ఎందుకు చూసుకున్నారు అనే అంశాన్ని న్యూయార్క్ టైమ్స్ రచయిత వరద రాజన్ సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఒక కారణం ఏదంటే మోటల్స్ వ్యాపార స్థాయి విభిన్నమైనది. పైగా మోటల్స్ను విస్తరించుకోవచ్చు. రెండో కారణం ఏమిటంటే మోటల్స్ వ్యాపారం పటేళ్లకు ద్వంద్వ గుర్తింపును తెచ్చిపెడుతుంది. మోటల్స్ కౌంటర్ నుంచి వీరు అమెరికాతో వ్యవహరిస్తారు. కౌం టర్ వెనుక కిచెన్లో కధీ-బాత్ (గుజరాత్ ఆహారం) వంట వండ టం, టెలివిజన్లలో రామాయణం, బాలీవుడ్ సినిమాలను చూడటం ద్వారా వీరు అమెరికాలోనే భారత్ను పునఃసృష్టి చేయగలరు. మోటల్ వ్యాపారం మేధస్సు కంటే కష్టపడటం అవసరమైన వ్యాపారం. పటేళ్లు దాన్నే కోరుకున్నారు. అందుకనే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న పటేల్ సైతం ఆ దేశానికి సంపద లాంటి వాడు. ఎందుకంటే అతడు తనకు, తన కమ్యూనిటీకి కట్టుబడి ఉంటాడు తప్పితే దేశానికి అతడు ఉపద్రవం, కంటకం కాదు. పైగా, పాశ్చాత్య ప్రపంచంలో భారతీయ వలస ప్రజలకు పాకిస్థానీయులు, బంగ్లాదేశీయుల కంటే మించిన మంచి పేరుంది. దీనికి ఒక కారణం ఏమిటంటే సాధారణంగా వలస భారతీయులు ఉన్నత సామాజికవర్గానికి సంబంధించిన వారై ఉండటం. పైగా అన్ని అర్హతలూ కలిగిన వృత్తి జీవుల్లా కనిపిస్తారు. మరొక కారణం ఏమిటంటే ప్రత్యేకించి యూరప్లోని పాకిస్థానీ, బంగ్లాదేశీ వలస దారులలో చాలామంది తీవ్ర మతాభినివేశం కలిగి ఉన్నారు. వీరు అరబ్ బృందాలతో జత కట్టారు. దీంతో వీరు హానికరంగా తయారయ్యారు. వీరిలో నిరుద్యోగం పరాకాష్టకు చేరింది. దీంతో పాకిస్థానీ, బంగ్లాదేశీ వలసదారులను ఆతిథ్య దేశం లేదా ఖండం ఒక ఉపద్రవంగా చూస్తోంది. నా పాకిస్థానీ మిత్రుడొకరు ఇటీవల ఒక విషయం చెప్పారు. ప్రత్యేకించి అమెరికాలో ఉన్న కొంతమంది పాకిస్థానీయులు ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్థాన్తో ముడిపడి ఉంటే వచ్చే సమస్యలనుండి తప్పించుకోవడం కోసం ఫక్తు భారతీయుల్లా వ్యవహరిస్తున్నారట. మరోవైపున యూరప్లోని ఉపఖండ రెస్టారెంట్లలో చాలా వాటిని బంగ్లాదేశీయులు సమర్థవంతంగా నడుపుతున్నారు కానీ ఇవి ఇండియన్ రెస్టారెంట్లుగా గుర్తింపు పొందాయి. బంగ్లాదేశ్ అంటే ఎక్కడుంది, వాళ్లెవరు అనే పరిజ్ఞానం లేకపోవడం వల్ల కావచ్చు.. యూరప్లో ఇండియన్ బ్రాండ్ మరింత ఆకర్షణీయంగా మారింది. మూడో కారణం ఏమిటంటే భారతీయ ఆహారంగా పశ్చిమ దేశాలకు పరిచితమైనది బెంగాలీ ఆహారమే. ఈ నేపథ్యంలో అమెరికా వలస విధానంపై ఒబామా జారీ చేసిన తాజా డిక్రీ మూడు ఉపఖండ బృందాలకూ దోహదపడు తుంది కానీ, భారతీయులు ప్రత్యేకించి పటేళ్లకే ఇది ఎక్కువగా ఉపకరిస్తుంది. పటేల్ కమ్యూనిటీకి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు కూడా ఇది మంగళకరమైన వార్తే. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) - ఆకార్ పటేల్ -
‘స్వచ్ఛ భారత్’కు సవరణ అవసరం
పరిశుభ్రత విషయంలో ప్రజలు తమ అపరాధాన్ని అంగీకరించేలా చేయడం వరకు ప్రధాని నరేంద్ర మోదీ చేసింది సరైందే. అయితే బహిరంగ స్థలాల పరిశుభ్రతపై మాత్రమే దృష్టి పెట్టడం తప్పు. వ్యక్తులు చెత్త వేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. సాంస్కృతికపరమైన ఈ అలవాటు ఇకపై కొనసాగకుండా చర్యలు చేపట్టాలి. ఇతరులు ఏం చేస్తున్నా సరే.. మనం మాత్రం చెత్త వేయకూడదన్నది జాతి నేర్చుకోవాల్సిన పాఠం. అవలోకనం మన దేశం మాదిరే, థాయ్లాండ్లో అనేక కార్లలోని డాష్ బోర్డుల్లో, శుభం కలగడానికి అదృష్టదేవత చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటారు. అయితే థాయ్ కార్లలోని విగ్రహాలు భారత్లో లాగా కారు లోపలికి కాకుండా రోడ్డుకు అభిముఖంగా తమ ముఖాలను ప్రదర్శిస్తుంటాయి. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ‘నేను సురక్షితంగా ఉం డేలా చూడు’ అనేలా మన ప్రవృత్తి ఉం టుంది. ‘ఎవరూ గాయపడకుండా ఉండేలా రోడ్డును గమనించు’ అన్నది థాయ్ ప్రజల వైఖరి. థాయ్లాండ్ పరిశుభ్రమైన దేశం. సాపేక్షంగా అది పేద దేశమే అయినప్పటికీ (నిజానికి భారత్లాగే పేద దేశం) వారి బహిరంగ స్థలాలు పరిశుభ్రంగా ఉంటాయి. నేడు వారి బహిరంగ మరుగు దొడ్లు దాదాపుగా మచ్చలేని విధంగా ఉండటమే కాదు.. యూరోపి యన్ దేశాల కంటే మంచిగా... ఒక్కోసారి వాటికంటే ఉత్తమంగా కూడా ఉంటాయి. బ్యాంకాక్లోని వీధులకు, ముంబై, ఢిల్లీ వీధు లకు, అలాగే ఢాకా, లాహోర్, కరాచీ నగరాల్లోని వీధులకు మధ్య కూడా ఏమాత్రం పోలిక ఉండదు. మనది అభివృద్ధి చెందుతున్న దేశం (అంటే ఆర్థికవ్యవస్థ మాత్రమే కాదు.. ఇప్పటికీ ఆదిమ స్వభావంతో ఉంటున్న నాగరికత, సంస్కృతి కూడా ‘అభివృద్ధి’ చెందవలసి ఉంది). థాయ్లాండ్ అభివృద్ధి చెందిన దేశం. దీనికి వారు అనుసరిస్తున్న బౌద్ధ మతంలోని హీనయాన శాఖ కూడా ఒక కారణమని నేనంటాను. దీన్ని తెరవాద అని కూడా పిలుస్తారు. తెరవాద శాఖను పాటిస్తున్న శ్రీలంక, వియత్నాం, థాయ్లాండ్, కాంబోడియా, బర్మా వగైరా దేశాలన్నీ ఒకరకమైన ఏకత్వాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇది ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యుత్తమ ప్రయత్నమైన స్వచ్ఛ భారత్ కార్యక్రమం (క్లీన్ ఇండియా మిషన్) అనే అంశాన్నే నేను ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్నాను. ఈ వారం ములాయం సింగ్ యాదవ్ కోడలు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. స్వచ్ఛ భారత్పై మోదీ వైఖరిని మహాత్మాగాంధీతో ఆమె పోల్చి చూపారు. ఆమెతో నేను ఏకీభవిస్తాను. ప్రధాని ఒక గాంధియన్ తత్వాన్ని ఆచరిస్తున్నారని భావిస్తున్నాను. నిజానికి గాంధీజీ కూడా మోదీ ప్రయత్నాన్ని ఆమోదించేవారు. అయితే మోదీ మనస్సులో ఈ ఆలో చన కొత్తది కాదన్నది వాస్తవం. ఆర్ఎస్ఎస్ అత్యంత ప్రభావశీల నేత ఎం.ఎస్ గోల్వాల్కర్ జీవిత చరిత్రను రచించిన సందర్భంలో మోదీ ఒక పిట్టకథని జోడించారు. ఒకసారి గురూజీ (గోల్వాల్కర్) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లా రు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ఉదయం 4 గంటల 30 నిమి షాలకు చేరుకుంది. అక్కడ అది 45 నిమిషాలు ఆగింది. ఆ సమ యంలో స్వయంసేవకులు గురూజీ, రైలు లెట్రిన్ను ఉపయోగిం చుకునేందుకు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి సీనియర్ స్వయంసేవక్ అయిన బాపూరావ్ మోఘేతో మాట్లాడుతూ ఆ రోజు కార్యక్రమం ఏమిటని గురూజీ అడిగారు. కార్యక్రమ వివరాలను గమనించిన గురూజీ తర్వాత బాపూరావ్ని ఒక ప్రశ్న అడిగారు, రైలు టాయ్లెట్లలో ఒక చిన్న నోటీసున యినా మీరు గమనించారా? చూశానన్నారు బాపూరావు. గురూజీ అప్పుడన్నారు. ‘రైలు ఒక స్టేషన్లో ఆగి ఉన్నప్పుడు లెట్రిన్ను ఉపయోగించవద్దని అక్కడ రాసి ఉంది. నేను ఈ నిబం దనను అన్ని వేళలా తప్పకుండా పాటిస్తాను’. ఈ పిట్టకథను ప్రస్తావించిన మోదీ దానికి మరో ప్రశ్నను జోడించారు. ‘ఎన్ని లక్షలమంది ప్రయాణికులు ఈ నోటీసును చూసి ఉంటారో కాస్త ఊహించండి. వాస్తవానికి వీరిలో ఎంతమంది దీన్ని పాటించి ఉంటారు’? స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మోదీ ఒక ప్రతిజ్ఞ రూపొందించారు. దాని ద్వారా ఇతరులు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. ‘‘నేను ఈ ప్రతిజ్ఞను స్వీకరిస్తున్నాను. పరిశుభ్రతకు నేను కట్టు బడి ఉంటాను. దీనికోసం సమయాన్ని కేటాయిస్తాను. పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి నేను సంవత్సరా నికి 100 గంటలు కేటాయిస్తాను అంటే వారానికి రెండు గంటలన్న మాట. నేను చెత్త వేయను, ఇతరులను వేయనీయను. నేనూ, నా కుటుంబం, నా నివాస ప్రాంతం, నా గ్రామం, నా పనిస్థలం అన్ని చోట్లా పరిశుభ్రత కోసం ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను’’. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే పలు దేశాల్లో అక్కడి పౌరులు చెత్త పారవేసే చర్యలను చేపట్టకపోవడం, ఇతరులు చెత్త పోయడాన్ని అనుమతించకపోవడం వల్లే అది సాధ్యమైందని నా విశ్వాసం. ఈ దృఢవిశ్వాసంతోటే, గ్రామాల్లో, పట్టణాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమ సందేశాన్ని నేను ప్రచారం చేస్తాను. ఈ రోజు నేను స్వీకరిస్తున్న ఈ ప్రతిజ్ఞను స్వీకరించవలసిందిగా వందమంది వ్యక్తులను నేను ప్రోత్సహిస్తాను. పరిశుభ్రత కోసం తమ వంద గంటలను వారు కేటాయించేలా ప్రయత్నాలు చేపడతాను. ప్రస్తుతం జరుగుతున్న ముఖ్యమైన పని ఏమిటంటే, ఇతరులు కూడా ఈ ప్రతిజ్ఞను స్వీకరించేలా చేయడం, (మోదీ పలువురు సెలబ్రిటీలను ఇలా పురమాయించారు) అలాగే కొన్ని బహిరంగ స్థలాలను శుభ్రపర్చేందుకు సమయాన్ని కేటాయించేటట్లు చేయ డం. భారత్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి చేయవలసిన అనేక పనుల జాబితాను కేంద్ర ప్రభుత్వం పొందుపర్చింది. ఆ వివరాలు పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెబ్సైట్లో ఉన్నాయి. మోదీ అవలంబించిన విధానం పట్ల నాకు కొంత భేదాభిప్రా యం ఉంది. ప్రజలు తమ అపరాధాన్ని అంగీకరించేలా చేయడం వరకు ఆయన చేసింది సరైందే. అయితే తర్వాత బహిరంగ స్థలాలను పరిశుభ్రపర్చడంపై దృష్టి పెట్టడం తప్పు. వ్యక్తులు చెత్త వేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. సాంస్కృతికపరమైన ఈ అలవాటు ఇకపై కొనసాగకుండా చర్యలు చేపట్టాలి. బహిరంగ స్థలాల్లో చీపుర్లు పట్టి ఫొటోలు తీయడం వెనుక, భారత్ను మురికి దేశంగా మారుస్తున్నది ఇతరులే అనే సందేశం వ్యక్తమవుతోంది. దీని నుంచే, ‘కాబట్టి బహిరంగ స్థలాలను పరిశు భ్రం చేయడంలో నేను సహాయం చేయాలి’ అనే భావనవస్తోంది. దీన్ని మనం మార్చాలి. ఈసారి విగ్రహం మనవైపే చూస్తుం డాలి కాని రోడ్డుకు అభిముఖంగా కాదు. ఇతరులు ఏం చేస్తున్నా సరే.. మనం మాత్రం చెత్త వేయకూడదు. ఇది జరిగినట్లయితే, మోదీ ప్రారంభించిన మంచి ప్రయత్నం మరింత ఉత్తమంగా విజయవంతమవుతుంది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఆకార్ పటేల్ -
సమర్థ నేతలు కావలెను!!
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు పరిపాలనపైనే దృష్టి పెట్టిన నరేంద్ర మోదీకి, ప్రధాని అయ్యాక కేంద్రంలో ప్రాధాన్యతలు మారాయి. శాసనాలు, విధానాల రూపకల్పన ఇప్పుడాయన ప్రధాన విధి. దానికి అత్యంత నమ్మకస్తులు, తెలివైన వారు అవసరం. గోవా ముఖ్యమంత్రి పారికర్ వీరిలో ఒకరు. ఆరు నెలల క్రితం భారత కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రెండు ముఖ్యమైన మంత్రి పదవులను ఒకే వ్యక్తికి అప్పగించారు. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు రెండింటినీ తనవద్దే అట్టిపెట్టుకు న్నారు. కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనవిగా పరిగణిస్తున్న నాలుగు మంత్రిత్వ శాఖల్లో ఇవి రెండు. (మరో రెండు శాఖలు హోం, విదేశీ వ్యవహా రాలు). పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు జైట్లీ మాట్లాడుతూ కొద్ది వారాల వరకు అంటే మరొకరు దాన్ని స్వీకరించేంతవరకు మాత్రమే రక్షణ శాఖను తన వద్ద ఉంచుకుంటానని చెప్పారు. ఆ మరొకరు మరెవరో కాదు మాజీ జర్నలిస్టు అరుణ్ శౌరీనే అని ఆ సమయంలో ఒక అంచనా ఉండేది. ప్రధానమంత్రి మనస్సులో ఎవరు ఉండేవారో కానీ, ఆ వ్యక్తి ఉనికి బయటకు రాలేదు. ఈ లోగా మే నెల దాటి నవంబర్ కూడా వచ్చేసింది. ఈ కారణం వల్లే భారతీయ జనతా పార్టీలో చక్కటి ఆలోచనాపరుడిగా కనిపిస్తున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ను ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోనికి తీసుకు వస్తు న్నారని పత్రికా వార్తలు సూచిస్తున్నాయి. అత్యంత సమర్థత కనబరుస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవిని వదులు కుని ఢిల్లీకి ఎందుకు రావలసివస్తోందన్నది ప్రశ్న. ప్రత్యేకించి, ప్రధాని మోదీ ఎంపిక చేసుకోవడానికి 300 మందికి పైగా లోక్సభ, రాజ్యసభ ఎంపీలు అందుబాటులో ఉండగా, ఢిల్లీకి బయట ఉన్న వ్యక్తిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు? ప్రతిభా లేమికి సంబంధించిన ఈ సమస్య ముందుకు రావడానికి రెండు కారణాలు ఉంటున్నాయి. మొదటి సమస్య సాధారణమైంది. ప్రత్యేకించి, వాస్తవమైన లేదా తాము కనుగొన్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆగ్రహావేశాలను ప్రదర్శించడాన్ని ప్రాతిపదికగా కలిగి ఉన్న హిందుత్వ వంటి బలమైన భావజాలం ఒక రకం వ్యక్తులను సులభంగా ఆకర్షిస్తుంది. గురూజీ గోల్వాల్కర్, వీరసావర్కార్, దీనదయాళ్ ఉపాధ్యాయ్ వంటి వ్యక్తుల రచనలవైపు ఆకర్షితులయ్యే ఇలాంటి వ్యక్తులు వారి ఆలోచనల్లో మాత్రం సూక్ష్మతను, చురుకుదనాన్ని కలిగి ఉంటారని మనం భావించకూడదు. అందుకే ప్రస్తుతం దాదాపు 280 ఎంపీ స్థానాలున్న బీజేపీ కంటే, గతంలో 200 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే సమర్థమైన, చురుకైన నాయకులు ఎక్కువగా ఉండే వారు. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకోవడానికి ముగ్గురు అగ్ర శ్రేణి ఆర్థికమంత్రులు (మన్మోహన్ సింగ్తోపాటు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ) అందుబాటులో ఉండేవారు. కానీ నరేంద్ర మోదీకి మాత్రం రక్షణ శాఖకు కూడా సమయాన్ని వెచ్చించగలి గిన ఒకే ఆర్థిక మంత్రిని మాత్రమే ఉపయోగించుకోవల్సి వస్తోంది.తమ ఆలోచనల్లో నమ్రతను, కార్యదక్షతను ప్రదర్శించే బీజేపీ నేతలు (జైట్లీ, పారికర్) ఉన్నారు కానీ వీరు హిందుత్వ అంశాలపై తక్కువ సైద్ధాంతికతను కలిగి ఉండటమే కాకుండా, కాస్త సరళంగానూ ఉంటున్నారు. రెండో సమస్య మరింత నిర్దిష్టమైనది. ఇది ప్రధాని అభద్రతకు సంబంధించిన విషయం. కేంద్ర మంత్రిమండలిలో కొంతమంది ప్రతిభావంతులు, అనుభవజ్ఞులు ఉన్నారు కానీ వారిని ఆయన ఉపయోగించదల్చుకోలేదు. దీనికి కారణం ఏమంటే వారు మరీ వృద్ధులైపోయారు (ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ ఇద్దరూ లోక్సభలో ఉన్నారు వారికి పనిలేదు) లేదా వారు మరీ చిన్నవారుగా ఉన్నారు (వరుణ్ గాంధీ, అత్యాశపరుడు, చురుకైనవాడు, మరిన్ని బాధ్యతల కోసం ఎదురుచూస్తుంటారు). వీరిని పక్కన ఉంచడానికి అసలు కారణం ఏమంటే, వీరు మోదీని గదమాయించగలరు. మంత్రిమండలిలోకి వీరిని తీసుకుంటే మోదీ వారితో వ్యవహరించలేరు. గుజరాత్లో కూడా మోదీ ఇలాగే చేశారు. కేశుభాయ్ పటేల్, కాశీరామ్ రాణా వంటి అనుభవజ్ఞులైన నేతలను వారి మద్దతుదారులను కూడా మోదీ అధికార పదవులకు దూరంగా ఉంచారు. అయితే గుజరాత్లో తను చేసి చూపగలిగినదాన్ని ఢిల్లీలో కూడా ప్రతికల్పన చేయాలంటే ఒక అడ్డంకి ఉంది.అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మాదిరే, గుజరాత్ను నడపడంలో మోదీ దృష్టి ప్రధానంగా పరిపాలనపైనే ఉండేది. స్పష్టంగా చెప్పాలంటే చాలావరకు కేంద్రం నుంచి వచ్చే విధానాలను అమలు చేయడమే. వాజ్పేయీ ప్రభుత్వం విద్యుత్ రంగం విషయంలో ప్రైవేట్ కంపెనీలకు తలుపులు తెరిచినప్పుడు దాన్ని గుజరాత్లో మోదీ అద్భుతంగా అమలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ మిగులు అధికంగా ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి నుండి వచ్చేది. కేంద్ర విధానాలను గుజరాత్లో అమలు చేయడానికి మోదీ ఉన్నతాధికారుల బృందాన్ని నియమించారు. వీరు మంత్రుల విధులతో వ్యవహరించేవారు. రాజకీయ నేతల జోక్యాన్ని తోసిపుచ్చారు. ఈ మొత్తం పనిపై కేవలం ఇద్దరు మంత్రులకు మాత్రమే వాస్తవంగా బాధ్యత ఉండేది (సౌరభ్ పటేల్, అమిత్ షా). వీరిలో ఏ ఒక్కరికీ కేబినెట్ స్థాయి ఉండేది కాదు. అలా వారు తమ పనిని బ్యూరోక్రాట్ల ద్వారా మోదీ నేరుగా పర్యవేక్షిస్తున్నారన్న అవగాహనతో ఉండేవారు. ఢిల్లీకి తరలి వెళ్లాక, పని స్వభావం మారింది. మోదీ ఇప్పు డు శాసనాల రూపకల్పన, విధానాలపైనే దృష్టిని కేంద్రీకరిం చాల్సి ఉంది కాని వాటి అమలు పట్ల కాదు. ఇది ఆయన పని పద్ధతికి అంతరాయం కలిగించింది. గుజరాత్లో మాదిరే తాను నమ్ముతున్న పీయూష్ గోయెల్, నిర్మలా సీతారామన్ వంటి మంత్రులకు ఎక్కువ పని అప్పగించడం ద్వారా పరిస్థితులను తన అదుపులో ఉంచుకోవాలని మోదీ ప్రయత్నించారు. వీరి ద్దరూ మోదీకి ప్రీతిపాత్రమైన ఇంధనం, వాణిజ్యం, పరి శ్రమలు వంటి పోర్ట్ఫోలియోలను నిర్వహించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రధాన విధి ఏదంటే శాసన, విధాన రూపకల్పనే. దీన్ని నిర్వహించడం కోసం మోదీకి అత్యంత తెలివైన వ్యక్తులు అవసరం. కానీ అలాంటి వారు ఆయనకు అందుబాటులో లేరు. అయితే వారి దురదృష్టమో లేక ప్రభుత్వ దురదృష్టమో కానీ, మోదీ కోరుకోని వ్యక్తులే కేంద్ర మంత్రిమండలిలో ఉన్నారు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఆకార్ పటేల్ -
అందరాని అంబరానే నల్లధనం
విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి రాబట్టి, ఒక్కొక్కరికీ లక్షలకు లక్షల రూపాయలు పంచడమనే ఎన్నికల వాగ్దానం నుండి ప్రభుత్వం మెల్లగా దూరంగా జరుగుతుందనేది స్పష్టమవుతూనే ఉంది. ఆదాయపు పన్ను శాఖ ‘‘దేశంలోని నల్లధనం ఎంత భారీ ప్రమాణంలో ఉన్నదో గ్రహించి దానిపై నుండి దృష్టిని మరల్చరాద’’ని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇప్పుడు అంటున్నారు. సమస్యను ఈ దృష్టి నుండి చూడటమే సరైనదని నా అభిప్రాయం. విదేశాల్లోని నల్లధనం ఖాతాదార్ల పేర్లలో అత్యధికం గుజరాతీలవే. దేశీయ నల్లధనంపైకి దృష్టిని మరల్చేట్టయితే, ముందుగా చూడాల్సింది గుజరాత్ ఆర్థిక వ్యవస్థను, అక్కడి ప్రభుత్వం పనితీరునే. నల్లధనం ఆరోపణలను బాధ్యతారహితంగా ప్రచారంచేస్తూ, ప్రజల్లో ఆగ్రహాన్ని రగిల్చిన టెలివిజన్ చానల్స్ ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ పట్ల అసంతృప్తితో ఉన్నాయి. ఆయన అమలు చేయలేని వాగ్దానాన్ని చేశారని వాటికి స్పష్టమయ్యేసరికి అవి ఆయనపైకే ఎదురు తిరుగుతాయని నా అంచనా. భారతీయులు విదేశాల్లో దాచిన నల్లధనం ఎంత? నిజానికి ఎవరికీ నిజం తెలియదు. 8,000 కోట్ల డాలర్లని 2011 నాటి ఓ అంచనా. అది చాలా ఎక్కువని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ దాన్ని ప్రశ్నించారు. భారత వాణిజ్య మండలి అసోచామ్ అంచనా ప్రకా రం నల్లధనం మొత్తం 2 లక్షల కోట్ల డాలర్లు. అంటే దేశ స్థూల జాతీయోత్పత్తికంటే ఎక్కువ. సుప్రసిద్ధ కాలమిస్టు స్వామినాథన్ అయ్యర్ నల్లధనం మరీ ఎక్కువగా ఏమీ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. భారత బ్యాంకులతో పోలిస్తే స్విట్జర్లాండ్ బ్యాంకుల వడ్డీ రేట్లు చాలా తక్కువ. కాబట్టి అక్కడి బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం ఆర్థికంగా ఏమంత తెలివైన పని కాదని, పెద్ద ఎత్తున అలాగేమీ జరిగి ఉండకపోవచ్చని ఆయన వాదన. నల్లధనం అంటే ఏది? అసలు నల్లధనం అంటే కచ్చితంగా ఏమిటి? ఈ ప్రాథమిక అవగాహన విషయంలోనే చాలా గందరగోళం ఉంది. ఆదాయపు పన్ను ఎగవేసిన డబ్బంతా నల్లధనం. ఈ నిర్వచనం ప్రకారం మన దేశ వయోజన జనాభాలో చాలా పెద్ద భాగం వద్ద, బహుశా మెజారిటీ వద్ద నల్ల ధనం ఉంటుంది. సోనియా గాంధీ కుటుంబం భారీ ఎత్తున ముడుపు లు పుచ్చుకుని కూడబెట్టిన సొత్తునంతా విదేశాలకు తరలించిందని భారతీయ జనతా పార్టీ ఆరోపణలు గుప్పించింది. ఆ డబ్బును తిరిగి వెనక్కు రప్పిస్తామని వాగ్దానం చేసింది. కాబట్టి లంచాలు పుచ్చుకొని కూడబెట్టి, విదేశాల్లో దాచిన డబ్బే ‘‘నల్లధనం’’ అని చాలా మంది విశ్వసిస్తున్నారు. అతిశయోక్తులతో కూడిన రాజకీయ ఆరోపణలు, ఊహాత్మక అంచనాలు, బాధ్యతారహితమైన మీడియా కలసి ఇలా భారత ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దాన్ని బీజేపీ సొమ్ము చేసుకుంది. ముందుగా అద్వానీ, ఆ మీదట నరేంద్ర మోదీ ఆ అస్త్రాన్ని అందుకున్నారు. బీజేపీ దృష్టిలో నల్లధనమంటే అవినీతితో ముడిపడి ఉన్న అంశం. ప్రభుత్వం మారితే చాలు, పరిష్కారం చేసేయగలి గినంతటి సులువైన సమస్య. ప్రచార దుమారంలో గల్లంతైన వాస్తవాలు మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక సభలో ఇలా అన్నారు: ‘‘ఈ గజ దొంగలు విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బునంతా వెనక్కు తీసుకొస్తే, ప్రతి పేద భారతీయునికి 15 నుంచి 20 లక్షల రూపాయలు వస్తా యి. అంత డబ్బు మూలుగుతోందక్కడ. మన పార్లమెంటు సభ్యుడు రైల్వే లైను గురించి మాట్లాడారు. ఈ నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తే, మనకెక్కడకు కావాలంటే అక్కడికి రైల్వే లైన్లను నిర్మించుకోవచ్చు. ఈ దేశాన్ని లూటీ చేయడాన్ని వాళ్లు అనుమతించారు. ఇప్పుడు వాళ్లు సిగ్గు విడిచి ‘‘ఆ డబ్బును ఎలా వెనక్కు తీసుకురాగలం?’’ అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రభుత్వాన్ని నడిపింది వాళ్లు, సమాధానాలు చెప్పాల్సింది మోదీ! బీజేపీకి అవకాశం దొరికిన రోజున, అందులోని ప్రతి పైసాను వెనక్కు తెస్తుంది, పేద భారతీయుల కోసం ఉపయోగిస్తుంది.’’ ఈ మోదీ ప్రసంగాన్ని జనవరి 9న యూట్యూబ్లో ఉంచారు కూడా. నల్లధనం గురించి మోదీ అంచనాలను, దాన్ని ఆయన వెనక్కు తీసుకురాగలగడాన్ని కూడా మీడియా సవాలు చేసి ఉండాల్సింది. కానీ ఎన్నికల ప్రచారపు మాయాజాలంలో వాస్తవాలు కొట్టుకు పోయాయి. అవకాశం ఇచ్చినా నత్తనడకేనా? మోదీ కోరినట్టుగానే బీజేపీకి ఆ అవకాశం లభించింది. కానీ నాటకీయమైన ఆ మార్పును మాత్రం అది తేలేకపోయింది. ప్రధానమంత్రిగా మోదీ మొట్టమొదటి రోజున నల్లధనం వేట కోసం ప్రత్యక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. కానీ ఆ తర్వాత ఆ సమస్య తిరిగి పాత బాటలోకే జారిపోయినట్టుంది. బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్యం స్వామి, రామ్జెఠల్మానీల వంటి వారు సహా (వారిద్దరిలో ఎవరినీ సమతూకం కలిగిన వ్యక్తులని చెప్పుకోలేం) ఆ పార్టీలో అందరిదీ అదే వైఖరి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే విదేశాల్లో బ్యాంకు ఖాతాలున్న భారతీయులందరి జాబితా అందింది. సిట్ దాన్ని పట్టుకునే దర్యాప్తు చేస్తోంది. ఆ జాబితాలో కొన్ని వందల మంది ఉన్నారు. అందులో సగం మంది చట్టబద్ధంగానే ఖాతాలున్నవారని (ప్రవాస భారతీయు లు) భావిస్తున్నారు. చట్టవిరుద్ధంగా విదేశీ బ్యాంకు ఖాతాలను కలిగిన 18 మంది పేర్లను ఈ ఏడాది ఏప్రిల్లోనే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సమస్యపై చురుగ్గా వ్యవహరిస్తున్న సుప్రీం కోర్టు వత్తిడి వల్ల ముగ్గురు చట్టవిరుద్ధ విదేశీ ఖాతాదార్లపై చర్యలు తీసుకున్నట్టు పేర్కొంటూ ఇప్పుడు మరో మూడు పేర్లను బహిరంగపరచారు. అయితే ఆ ముగ్గురూ ఆ ఆరోపణలతో విభేదించారు. ప్రత్యేకించి వారిలో ఏ ఒక్కరూ మరీ అంత పెద్ద సంపన్నవంతులేం కారు. ఇంతకూ వారు విదేశాల్లో దాచింది ఎంత మొత్తమో, అందులో ఎంత తిరిగి రాబడతారో చెప్పనే లేదు. నీరుగారిపోతున్న మోదీ వాగ్దానం నల్లధనాన్ని తిరిగి రాబట్టి, ఒకొక్కక్కరికీ లక్షలకు లక్షలు పంచడమనే తమ మునుపటి వాగ్దానం నుండి ప్రభుత్వం మెల్లగా దూరంగా జరుగుతుందనేది స్పష్టమౌతూనే ఉంది. ఇక దృష్టిని కేంద్రీకరించాల్సింది. దేశంలోనే ఉన్న నల్లధనంపైనేననీ, ఆదాయపు పన్ను శాఖ ‘‘దేశంలోని నల్లధనం ఎంత భారీ ప్రమాణంలో ఉన్నదో గ్రహించి దానిపై నుంచి దృష్టిని మరల్చరాద’’ని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇప్పుడు అంటున్నారు. ‘‘దేశంలో నల్లధనం ఎక్కువగా ఉన్న శాఖలను వేటాడటానికి శాయశక్తులా కృషి చేయాల’’ని ఆయన ఆదాయపు పన్ను శాఖలోని సీనియర్ అధికారులను కోరారని ఒక నివేదిక తెలిపింది. నల్లధనం సమస్యను ఈ దృష్టి నుండి చూడటమే సరైనదని నా అభిప్రాయం. నల్లధనం ఖాతాదార్ల పేర్లలో అత్యధికం (మొదటి 18 మంది జాబితాలో 15 మంది, తర్వాతి ముగ్గురి జాబితాలో ఒకరు) గుజరాతీలవే. దేశీయ నల్లధనంపైకి దృష్టిని మరల్చేట్టయితే, ముందుగా చూడాల్సింది గుజరాత్ ఆర్థిక వ్యవస్థను, అక్కడి ప్రభుత్వం పనితీరునే. నల్లధనం ఆరోపణలను బాధ్యతారహితంగా ప్రచారం చేస్తూ, ప్రజల్లో ఆగ్రహాన్ని రగిల్చిన టెలివిజన్ చానల్స్ ఈ అంశంపై ఇప్పటికే ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నాయి. ఆయన అమలు చేయలేని వాగ్దానాన్ని చేశారని వాటికి స్పష్టమయ్యేసరికి అవి ఆయనపైకే ఎదురు తిరుగుతాయని నా అంచనా. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)