Shaukat Ali
-
అది పరువు హత్యే...!
చిత్తూరు అర్బన్: సంచలనం సృష్టించిన యాస్మిన్ భాను (26) అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమెది ఆత్మహత్య కాదని, పరువు హత్యేనని నిర్ధారణ అయ్యింది. కన్న కూతురు ఇతర మతస్తుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక కూతురిని హత్య చేసిన తండ్రి షౌకత్ అలీ (56), వరుసకు సోదరుడు అయిన మహ్మద్ బాషా అలియాస్ లాలా (29)ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు అబ్దుల్ కలామ్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటన వివరాలను చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య బుధవారం మీడియాకు వివరించారు. పోలీసులను ఆశ్రయించినా లేని ఫలితం! చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మింద గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కూతురు యాస్మిన్ భాను బీటెక్ చదివే సమయంలో సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భాను తన ప్రేమ విషయం పెద్దలకు చెబితే వారు అంగీకరించలేదు. పైగా తమ సమీప బంధువుతో ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన పెళ్లి చేయాలని నిశ్చయించి, అందరికీ శుభ లేఖలు కూడా పంచేశారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీన యాస్మిన్ భాను, సాయితేజ ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి ముప్పు ఉందంటూ చంద్రగిరి డీఎస్పీని కూడా ఆశ్రయించారు. దీనితో షౌకత్ అలీని చంద్రగిరికి పిలిపించి, వీళ్ల జోలికి వెళ్లొద్దంటూ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అటు తర్వాత సాయితేజ భార్యతో తన సొంత ఊరైన పూతలపట్టు మండలంలోని పోటుకనుమ గ్రామంలో కాపురం పెట్టాడు. కొద్ది రోజుల్లోనే తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు యాస్మిన్ భానుతో ఫోన్లో మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు.నమ్మించి గొంతు నులిమి..ఆగిపోయిన వ్యక్తితోనే పెళ్లి చేసి, కూతురిని దుబాయ్ పంపాలనుకున్న షౌకత్ అలీ.. ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసి వెళ్లాలని తల్లి కోరడంతో, ఏప్రిల్ 13వ తేదీన భర్తతో కలిసి యాస్మిన్భాను చిత్తూరుకు కారులో వచి్చంది. అప్పటికే మరో కారులో వేచివున్న లాలా, వారి మరో సమీప బంధువు అబ్దుల్ కలాం.. భానును వారి కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి బయలు దేరారు. మధ్యలో తండ్రి షౌకత్ అలీ కూడా కారులో ఎక్కాడు. మాపాక్షి గ్రామ సమీపంలోకి వెళ్లిన తర్వాత, సాయితేజను వదిలేసి తాను చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని యాస్మిన్ను తండ్రి షౌకత్ కోరాడు. ఆమె ఎంతకూ ఒప్పుకోలేదు. దీనితో కూతురి కాళ్లను తొక్కిపెట్టి, అప్పటికే తెచ్చుకున్న తాడుతో ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. ఆపై బాలాజీ కాలనీలోని తన ఇంటివద్దకు వెళ్లి మృతదేహాన్ని ఇంట్లో పడేసి వెళ్లిపోయాడు. తన కుమార్తె కొన ప్రాణాలతో ఉందేమోనని భావించిన తల్లి ముంతాజ్, స్థానికుల సాయంతో యాస్మిన్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన భర్త తిట్టడంతోనే భాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంతాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతిగా ఈ కేసును తొలుత పోలీసులు నమోదు చేశారు. తన భార్యను కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు సాయితేజ పోలీసులకు చెప్పడం, యాస్మిన్ గొంతుకు రెండుసార్లు తాడు బిగించిన ఆనవాళ్లు ఉండటంతో కేసు దర్యాప్తు మరో దిశలో సాగింది.పరారీలో ఉన్న షౌకత్ అలీతో పాటు లాలాను పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కారు, తాడును స్వా«దీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది. -
చిత్తూరులో పరువు హత్య?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఇటీవల వెలుగు చూసిన యువతి అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. మతాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందనే కక్షతో కుటుంబ సభ్యులే యువతిని కడతేర్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ చిత్తూరు మండలం తుమ్మిందలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడి మూడో కుమార్తె యాస్మిన్ భాను (26) బీటెక్ చదువుతుండగా పూతలపట్టు మండలం పోటుకనుమకు చెందిన దళిత యువకుడు సాయితేజను ప్రేమించింది. ప్రేమ విషయం పెద్దలకు చెబితే పట్టించుకోలేదు. పైగా ఈ ఏడాది ఫిబ్రవరి 9న యాస్మిన్ భానుకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీంతో సాయితేజను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న యాస్మిన్.. ఫిబ్రవరి 6న ఇంటినుంచి వెళ్లిపోయి సాయితేజను పెళ్లి చేసుకుంది. అనంతరం సాయితేజ, యాస్మిన్ పూతలపట్టులోని పోటు కనుమలో కాపురం పెట్టారు. ఇంటికి పిలిచి మరీ చంపేశారు ఆ తరువాత తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు, కుటుంబ సభ్యులు తరచూ ఫోన్లు చేసి యాస్మిన్తో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఓసారి షౌకత్ అలీ గడ్డంతో ఉండటాన్ని చూపించి ‘నీ తండ్రి బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఓసారి ఇంటికి రా’ అని కుటుంబ సభ్యులు యాస్మిన్ను కోరగా ఆమె అంగీకరించింది. దీంతో సాయితేజ ఈ నెల 13న యాస్మిన్ను ఆమె బంధువుల ద్వారా ఇంటికి పంపించాడు. ఆ తరువాత కుటుంబ సభ్యుల సాయంతో యాస్మిన్ పీకకు తాడు బిగించి తండ్రి షౌకత్ అలీ చంపేసి.. తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లితో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం హత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. ఓ కారును స్వాదీనం చేసుకుని, షౌకత్ అలీ, యాస్మిన్ అన్న లాలా, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కుల మతాలు వేరుకావడంతో పరువుపోయిందని భావించి యాస్మిన్ను ఆమె తండ్రి షౌకత్ అలీ తాడుతో పీక బిగించి హత్య చేశాడని ఆమె భర్త సాయితేజ ఆరోపిస్తున్నాడు. ఇదే విషయం ఆస్పత్రి వద్ద యాస్మిన్ తల్లి కూడా చెప్పిందన్నాడు. -
ప్యార్ కీ కహానీ
you don't need someone to complete you.. you only need someone to accept you completely.. అన్నట్టే ఉంటుంది. ఇక్కడ పరిచయం చేస్తున్న ఈ జంట! షౌకత్ అలీఖాన్, శిరీష.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్లో హ్యాండీక్రాఫ్ట్స్ షోరూమ్ రన్ చేస్తుంటారిద్దరూ! ..:: సరస్వతి రమ షౌకత్ అలీ కశ్మీరీ... శిరీష హైదరాబాదీ. ఎలా కలిశారు మరి? షౌకత్ వాళ్లు నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు. షౌకత్ అందరికన్నా చిన్నవాడు. 1990ల్లో కశ్మీర్లో పరిస్థితులు బాగా లేకపోవడంతో షౌకత్ను రాజస్థాన్లోని అన్నయ్య దగ్గరికి పంపించారు అతడి తల్లిదండ్రులు. కొన్నాళ్లకు అన్నయ్యతో పాటు చెన్నై వెళ్లాడు. 1995లో మరో అన్నయ్య కుటుంబంతో హైదరాబాద్ చేరాడు. శిరీష వాళ్లున్న కాంప్లెక్స్లోనే ఇల్లు తీసుకున్నాడు. వాళ్ల పిల్లలు ఇంచుమించు శిరీష వయస్కులే. దాంతో వాళ్లతో ఆమెకు ఇట్టే స్నేహం కుదిరింది. షౌకత్ అప్పుడప్పుడు హైదరాబాద్లోఉన్న అన్నవాళ్ల దగ్గరకి వస్తూండడంతో షౌకత్ కూడా శిరీషకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. అలా ఆ స్నేహం తెలియకుండానే ఓ కమిట్మెంట్ అయింది శిరీషకు. 2000లో.. షౌకత్ మీద ఇంట్లోవాళ్ల ఒత్తిడి మొదలైంది పెళ్లి చేసుకొమ్మని. కానీ అప్పటికే అతని మనసులో శిరీష ఉంది. అప్పుడు శిరీష డిగ్రీ చదువుతోంది. షౌకత్ వ్యాపారంలో ఉన్నాడు. ఒకవేళ ఇంట్లో వాళ్లు వద్దన్నా శిరీషను పోషించుకునే మార్గమైతే ఉందన్న ధైర్యంతో ఆమె చేయి పట్టుకున్నాడు. జీవితభాగస్వామి అయ్యాడు. ఈ పెళ్లి షౌకత్ తల్లిదండ్రులకు కొంత జీర్ణంకాకపోయినా అన్నయ్యలు మాత్రం సంబరపడ్డారు. కారణం అడిగితే ‘మా అన్నయ్య పిల్లలతో శిరీషకున్న ఫ్రెండ్షిప్ ఆటోమెటిగ్గా అన్నయ్య వాళ్ల కుటుంబానికీ ఆమెను దగ్గర చేసింది. అప్పుడు అమ్మానాన్నలు కొంత ఫీలయినా మిగతా మా కుటుంబమంతా హ్యాపీగానే ఉంది’ అంటాడు షౌకత్. మరి మీ ఇంట్లో అని శిరీషని అడిగితే ‘మా ఇంట్లో ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకంటే కాస్త లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న కుటుంబం మాది. మా సర్కిల్లో ఇలాంటి పెళ్లిళ్లు చాలానే జరిగాయి. కాబట్టి పెద్దగా పట్టింపుల్లేకపోవడమే కాదు సపోర్ట్ కూడా దొరికింది’ అని ఆమె చెప్పేలోపే ‘పెళ్లయ్యాక కొన్నాళ్లు శ్రీనగర్లో ఉన్నాం. అక్కడ మాకు ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీ ఉండేది. దాన్ని చూసుకున్నాను. తర్వాత ఫుడ్ మార్కెటింగ్ సెక్టార్లోకి వెళ్లా. చాలా నష్టమొచ్చింది. పెళ్లిలో శిరీషకు పెట్టిన జ్యువెలరీ అంతా తీసేశాను. ఆ టైమ్లో శిరీష పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికీ అదే సపోర్ట్ కంటిన్యూ అవుతోంది’అంటాడు షౌకత్ కల్చరల్ డిఫ్రెన్సెస్.. ‘ఏమీ ఫేస్ చేయలేదు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం మాత్రం తప్పలేదు. షౌకత్ వాళ్ల పేరెంట్స్ కశ్మీరీ మాట్లాడేవాళ్లు. నాకర్థమయ్యేది కాదు. ఒకే కాంపౌండ్లో వీళ్ల ఇద్దరన్నయ్యలు, పేరెంట్స్ విడివిడిగా ఉండేవారు. కిచెన్, డైనింగ్ ఏరియా మాత్రం కామన్. నాకు వంటే కాదు మిగిలిన పనులూ పెద్దగా వచ్చేవి కావు. అక్కడ కూడా ఎక్కువగా వాళ్ల అన్నయ్యల పిల్లలతోనే కలిసుండేదాన్ని. ఏదన్నా పని రాక, చేయకపోతే అత్తగారు కశ్మీరీలో ఏదో అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు’ అని శిరీష చెప్తుంటే ‘అమ్మ ఏమంటుందో అప్పుడప్పుడు నేను ఇంగ్లిష్లోకి ట్రాన్స్లేట్చేసి చెప్పేవాడిని. తిట్టిన తిట్టును కూడా పాలిష్ చేసి సాఫ్ట్గా చెప్పేవాడిని. తను తిట్టినా పెద్దవాళ్లు కదా అని శిరీష లైట్గా తీసుకునేది’ అని భార్య పెద్దమనసును వివరించాడు షౌకత్. ‘అందుకే కశ్మీరి నాకు రాకపోవడాన్ని లాంగ్వేజ్ప్రాబ్లం అని అనుకోకుండా అడ్వాంటేజ్ అనుకునేదాన్ని’ హిందూ, ముస్లిం.. ..అనే తేడా మామధ్య ఎప్పుడూ రాలేదంటారిద్దరూ ముక్త కంఠంతో. ‘నేను నాస్తికురాలినే. తను నమాజ్ చేసుకుంటాడు. మసీద్కి వెళ్తాడు. మా పెళ్లయి 15 ఏళ్లవుతుంది. మా మధ్య గొడవలకు మతం, కల్చర్ లాంటివెప్పుడూ కారణాలు కాలేదు’ శిరీష. ‘టూర్స్కి వెళ్లినప్పుడు అక్కడి దేవాలయాలకు వెళ్తాం. ఒకరి నమ్మకాలను, అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటాం అంతే!’ అంటాడు. ‘అలాగని మిగిలిన విషయాల్లో అప్ అండ్ డౌన్స్ లేవని కాదు.. చాలా ఉన్నాయి. కానీ వాటినే పట్టుకొని కూర్చోలేదు. మా కామన్ ఫోకస్ అంతా మంచి జీవితం, మా పిల్లలు మనాన్, ఆల మీదే!’ శిరీష. ‘ఆ లక్ష్యం కోసం ఇద్దరం కష్టపడ్తాం. ఫ్యామిలీ, బిజినెస్ రెండిటికీ ఇద్దరం టూ పిల్లర్స్మి. నాది ఫిజికల్ స్ట్రెన్త్ అయితే తనది ఎమోషనల్ బ్యాలెన్స్’ షౌకత్. ‘మా మధ్య వచ్చిన ఏ గొడవైనా మా రిలేషన్ని స్ట్రాంగ్చేసిందే తప్ప బలహీనపర్చలేదు’ శిరీష. ‘ఓపెన్మైండెడ్.. ట్రస్ట్, రెస్పెక్ట్’ఈ మూడే తమ అనుబంధానికి మూడు ముళ్లు అంటూ తమ లవ్ స్టోరీకి ఎండ్ టచ్ ఇచ్చారు షౌకత్ అండ్ శిరీష! ఫొటోలు: జి.రాజేష్