ఆటోను ఢీకొన్న లారీ | A Lorry hits auto four people died | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ

Published Wed, May 24 2017 7:59 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

ఆటోను ఢీకొన్న లారీ - Sakshi

ఆటోను ఢీకొన్న లారీ

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..

► ఆరుగురి దుర్మరణం.. నలుగురికి తీవ్ర గాయాలు
► విజయనగరం జిల్లాలో ఘటన  
 
విజయనగరం:  ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించగా నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం విజయనగరం జిల్లా డెంకాడ మండలం చందకపేట సమీపంలో విజయనగరం-నాతవలస ఆర్‌ అండ్‌ బీ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. 
విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన ముక్కుబంగార్రాజు శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం స్టాండ్‌నుంచి ఆటో నడుపుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ప్రయాణికుల్ని ఎక్కించుకుని నాతవరం దాటి విజయనగరం వైపు వస్తుండగా ఎదురుగా అతివేగంతో వస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో రెండు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది.
 
అందులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతి చెందినవారిలో పూసపాటిరేగ మండలం గులివిందపేటకు చెందిన గులివింద అప్పలనాయుడు(45), అదే మండలం చోడమ్మ అగ్రహారానికి చెందిన ఆవాల శంకరరావు(48), భోగాపురం మండలం మాల నందిగాంకు చెందిన మిరప గోవింద(37), డెంకాడకు చెందిన బంగారి సూరి(34), విజయనగరం పట్టణంలోని కోరాడ వీధికి చెందిన ఆర్‌.రాజేష్‌(23), శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నెల్లిమర్ల అప్పారావు(30) ఉన్నారు.
 
గాయపడిన డెంకాడకు చెందిన బంగారి అప్పారావు, పి.శ్రీను, ఆటోడ్రైవర్‌ ముక్కు బంగార్రాజు, విజయనగరానికి చెందిన ఆర్‌.రాజశేఖర్‌లు విజయనగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మితిమీరిన వేగంతో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్‌లు వెనువెంటనే పరారయ్యారు. డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎల్‌.కె.వి.రంగారావు, విజయనగరం ఆర్డీఓ శ్రీనివాసమూర్తి పరిశీలించారు. జిల్లా కేంద్రాస్పత్రిలో ఉన్న మృతుల కుటుంబీకులను, క్షతగాత్రులను జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పరామర్శించారు. కాగా, మృతుల కుటుంబీకుల ఆర్తనాదాలతో విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రి శోకసంద్రమైంది. మృతులు, గాయపడిన వారిలో అత్యధికులు ప్రైవేటు కంపెనీల్లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిపైనే ఆయా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.
 
చందకపేట రోడ్డు ప్రమాదంపై  వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
విజయనగరం జిల్లా డెంకాడ మండలం చందకపేటలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement