
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా ప్రపంచ బ్యాంకు సహకారాన్ని అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరారు. శుక్రవారం సమగ్ర శిక్షా కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు షబ్నం సిన్హా, కార్తిక్ పెంటల్, నీల్ బూచర్లతో ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య అభివృద్ధి పథకం’ గురించి వెబినార్ సమావేశం జరిగింది. ఈ వెబినార్లో విద్యాశాఖ మంత్రి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
► రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకువస్తోంది. బడ్జెట్లో 16 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడం చరిత్రలో ఇదే మొదటిసారి.
► మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నాం.
► విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపడానికి ‘మన బడి నాడు నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
► మంత్రితో పాటు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ఆంగ్లమాధ్యమ ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి. సమగ్ర శిక్షా ఏఎస్పీడీ∙ఆర్.మధుసూదనరెడ్డి, పాఠశాల విద్య సలహాదారులు డాక్టర్ ఎ.మురళి తదితరులు పాల్గొన్నారు.