ఏపీ ఎంసెట్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.
మార్పులు, చేర్పులకు 19, 20న చివరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఎంసెట్లో 1 నుంచి 35వేల ర్యాంకు అభ్యర్థులు గురు, శుక్రవారాల్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తొలిరోజు దాదాపు 8వేల మంది ఆప్షన్లు ఎంచుకున్నారని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ పేర్కొంది. వీరిలో ట్యాప్ ర్యాంకర్లు ఇంకా ఆప్షన్లు నమోదు చేయలేదని, జేఈఈ మెయిన్స్తో సహా ఇతర ప్రవేశపరీక్షలు రాసిన విద్యార్థులు అక్కడా మంచి ర్యాంకులే సాధించినందున వారి ప్రాధాన్యతలు ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలు, ప్రముఖ ప్రైవేటు సంస్థలపై ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇక ధ్రువపత్రాల పరిశీలనకు 29,968 మంది సర్టిఫికెట్లను ఇచ్చారని అధికారులు వివరించారు. ఆయా ర్యాంకుల అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో నిర్ణీత సమయంలో ఎన్నిసార్లయినా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, మార్పులు చేర్పులు చేసుకోవచ్చని అడ్మిషన్ల కమిటీ ప్రత్యేకాధికారి రఘునాథ్ వివరించారు. మరుసటి రోజు నుంచి తక్కిన ర్యాంకర్లకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందన్నారు. మళ్లీ 19, 20 తేదీల్లో మాత్రమే మొత్తం ర్యాంకర్లందరూ తమ ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి రెండు రోజులు చివరి అవకాశమిస్తామని చెప్పారు. జూన్ 22న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.