
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. దీంతో దేశంలోనే మరెక్కడా లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కాలపరిమితి నిర్ణయించే పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో అమలులోకి తీసుకురానున్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న సంగతి తెలిసిందే.
► నిజానికి సంక్షేమ ఫలాలు అందుకోవాలంటే గతంలో లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన పనిలేదని, ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
► ఈ కొత్త విధానం ప్రకారం.. దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తారు.
► ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందనున్నాయి. లబ్ధిదారుల జాబితా, అర్హతలు, లబ్ధిపొందే విధానం వంటి వివరాలను అక్కడ ఏర్పాటుచేస్తారు.
► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితిలో పరిశీలన పూర్తిచేస్తారు. వాటికి సంబంధించిన సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందజేస్తారు.
► ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులను 1902 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయవచ్చు.
► వ్యవసాయ అనుబంధ సేవలకు 1907కు, టెలి మెడిసిన్ సేవలకు 14410, అవినీతిపై ఫిర్యాదులు 14400, దిశ 181, మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా, ఇసుకపై ఫిర్యాదులను 14500కు ఫోన్ చేయవచ్చు. (సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలన భేష్: టీడీపీ సీనియర్ నేత)
Comments
Please login to add a commentAdd a comment