ఏటీఎం పాతనేరస్తుడి అరెస్టు
Published Fri, Jan 3 2014 3:32 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
బాపట్ల టౌన్, న్యూస్లైన్ :ఏటీఏం కేంద్రాలకు వచ్చే అమాయకులను మభ్యపెట్టి వాళ్ల నగదును స్వాహా చేసే ఏటీఏం పాతనేరస్తుడు కాటూరి వెంకటేష్ను గురువారం పట్టణ పోలీసులు అరెస్టుచేశారు. 13 నెలల వ్యవధిలో వెంకటేష్ రెండుసార్లు అరెస్టవడం గమనార్హం! గతంలో కూడా ఇలాంటి నేరాలకే పాల్పడి అరెస్లు అయి బెయిల్ పై బయటకు వచ్చినప్పటీ అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈనెల 30న బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బిల్లా తారక మల్లేశ్వరరావు పాతబస్టాండ్ సెంటర్లో ఉన్న ఏటీఎంలో డ్రా చేసేందుకు వెళ్లాడు .ఏటీఎంలో నుంచి నగదు రాకపోవడంతో సెక్యూరిటీను పిలిచారు. అదే సమయంలో అక్కడ ఉన్న వెంకటేష్.. తానే సెక్యూరిటీ గార్డును అని చెప్పి కార్డు రెండుసార్లు పెట్టి అతని పిన్కోడ్ తెలుసుకున్నాడు.
అదే గదిలో పక్కనే ఉన్న మరో ఏటీఏంలో కార్డును స్వైప్ చేసి ఏటీఏం పనిచేయడం లేదని అతనికి కార్డు ఇచ్చేశాడు. అతను బయటకు వెళ్లిన వెంటనే పిన్కోడ్ ఎంటర్చేసి రూ. 3 వేలు డ్రాచేశాడు. అప్పటినుంచి పోలీసులు ఏటీఏం కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాలు, స్థానికులను విచారించగా వెంకటేష్ బండారం బయటపడింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరం మండలం, వీరంకివారిపాలేనికి చెందిన కాటూరి వెంకటేష్ అనేక పర్యాయాలు ఏటీఏం నేరాలకు పాల్పడి లక్షలాది రూపాయల నగదు కాజేసిన సంఘటనలు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, తిరుపతి, బాపట్ల, హైదరాబాద్ ప్రాంతాల్లోని ప్రాధాన కూడళ్లలోని ఏటీఏంలు.., సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాల వద్ద తానే సెక్యూరిటీ గార్డు అని చెప్పి అమాయకుల ఏటీఏం కార్డు రహస్య నంబర్ తెలుసుకొని డూప్లికేట్ ఏటీఏం కార్డు తిరిగి ఇచ్చి తర్వాత ఆ ఖాతాలో ఉన్న నగదు స్వాహా చేయడం షరామామూలే!
Advertisement
Advertisement