బిఎస్ఎన్ఎల్లో భర్తీ కాని జిఎం పోస్టు
తలెత్తుతున్న పాలనాపరమైన ఇబ్బందులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ః
జిల్లా బీఎస్ఎన్ఎల్ను నడిపించాల్సిన నాథుడు లేకపోవడంతో ఇబ్బందులొస్తున్నాయి. జనరల్ మేనేజర్ పోస్టు కొన్నాళ్లుగా ఖాళీగా ఉంది. విశాఖ కేంద్రంగా పదోన్నతి పొందిన ఓ అధికారి ఇక్కడకు పక్షం రోజులకోసారి వచ్చి వెళ్లిపోతున్నారు. తాత్కాలిక అధికారిగా ఎలాంటి అర్హత లేని డీఈని సూపర్వైజింగ్ అధికారిగా వేశారు. శ్రీకాకుళం జిల్లా జీఎంగా ఉన్న మహంతి గత ఏడాది మేలో బదిలీపై వెళ్లారు. డీజీఎంగా పనిచే సిన ఉమామహేశ్వరరావు కూడా గతేడాది చివర్లో ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. డీఈగా కె.ఎన్.మూర్తి పనిచేస్తున్న కె.ఎన్.మూర్తికి ఎలాంటి అధికారాలూ ఇవ్వలేదు. దీంతో బీఎస్ఎన్ఎల్ జిల్లా పాలన కుంటుపడింది. ఆదాయం తగ్గిపోయింది. కనెక్షన్ల సంఖ్య తగ్గిపోతోంది.
అక్కడలా..ఇక్కడిలా..
హైదరాబాద్లో 20మంది జీఎంస్థాయి అధికారులున్నా శ్రీకాకుళం పోస్టింగుపై సుముఖంగా లేరని తెలిసింది. ఇండియన్ టెలికాం సర్వీసెస్కు ఎంపికైన ఉద్యోగార్ధులు ఈ జిల్లాను చిన్నచూపు చూస్తున్నారు. ఇక్కడి జీఎం పోస్టు ఖాళీ అయి 9నెలలవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఔట్ఫీల్డ్ సిబ్బంది గతంలో 24మంది ఉంటే ఇప్పుడు 16కు చేరింది. ఏటా 30మంది రిటైరవుతున్నారు. ఈ యేడాది కూడా 32మంది ఉద్యోగ విరమణ చేస్తున్నారు. జిల్లాను నడిపించాల్సిన జీఎం లేకపోవడంతో పాలనాపరమైన అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సిబ్బందికి కనీసం సెలవు కావాల్సినా విశాఖ వెళ్లి మంజూరు చేయించుకోవాల్సిన పరిస్థితి. లైన్మన్లు ఇక్కడి అడ్మిన్ విభాగంలోనే ఉండిపోతున్నారు. అప్పట్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించడంతో కనీస పర్యవేక్షణ బాధ్యత లేకుండా పోయింది. స్టాఫ్ మోనిటరింగ్ చూడాల్సిన బాధ్యత కొరవడింది. కేబుల్ పనిచేయకపోతే అది ఏ స్టేజ్లో ఆగిపోయిందో చూసే వ్యక్తే లేరు. సాప్ట్వేర్ అమలు, అభివృద్ధి చేయాల్సిన జీఎం పోస్టు ఖాళీగా ఉండడంతోనే ఇలా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి.
-జిల్లా వ్యాప్తంగా 100టెలీఫోన్ ఎక్స్చేంజీలున్నాయి. 2014లో 50వేలున్న ల్యాండ్లైన్ కనెక్షన్లు ఇప్పుడు 20వేలకే పరిమితమయ్యాయి. చాలా ప్రాంతాల్లో సిగ్నల్ టవర్లు లేకపోవడంతో సిమ్ కార్డులూ పనిచేయక ఖాతాదారులు ప్రత్యామ్నాయంగా ఇతర ఆపరేటర్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు.
హలో..నాథుడేరీ
Published Wed, Feb 10 2016 12:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement