
చంద్రబాబుకు మతి భ్రమించింది: వెన్నపూస
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయనను వెంటనే పిచ్చాస్పత్రికి తరలించాలని గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీకి ఓట్లు వేయకుంటే రేషన్ కట్ చేస్తామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. సీఎం పదవిలో ఉంటూ చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వెన్నపూస గోపాల్ రెడ్డి మండిపడ్డారు.
నంద్యాల ఉప ఎన్నిక ఓటమి భయంతోనే ఆయన అభద్రతాభావానికి గురవుతున్నారన్నారు. తనకు ఓటేయకపోతే పెన్షన్లు ఇవ్వనని చంద్రబాబు ఎలా అంటారని నిలదీశారు. చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతన్నారని అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు ప్రమాదకరమని...ఇప్పటికైనా చంద్రబాబు బెదిరింపు ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. పెన్షన్లు, రోడ్ల కోసం ఖర్చు పెట్టేది సీఎం చంద్రబాబు సొంత డబ్బు కాదని...అది ప్రజల డబ్బని తెలుసుకోవాలని చురకలంటించారు.
కాగా తాను రాష్ట్రానికి, అన్ని వర్గాల ప్రజలందరికి ముఖ్యమంత్రినని మరిచిన చంద్రబాబు...జనంతో కక్ష సాధింపు ధోరణితో మాట్లాడిన విషయం తెలిసిందే. తానిచ్చిన పెన్షన్లు తింటున్నారని...తాను వేసిన రోడ్లపై నడుస్తున్నారని...కానీ తనకు ఓట్లు మాత్రం వేయడం లేదని చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. ఓట్ల వేయని గ్రామాలను పక్కకు పెడతానని హెచ్చరించారు. అయితే చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.