
సాక్షి, తిరుపతి: ఎన్నికలకు మూడు నెలల ముందు ఇచ్చిన హామిని.. ఎన్నికల తరువాత మూడు నెలల్లో అమలు చేయడం సామాన్యమైన విషయం కాదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో భాస్కర్రెడ్డిని సంఘమిత్రలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబపై ప్రజలకు నమ్మకం ఉందని తెలిపారు. సంఘమిత్రలు ఉంటే గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. ప్రతి గ్రామంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరచి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సంఘమిత్రలను అదేశించారు.
అమ్మబడి, రైతుభరోసా, ఫించన్లు, ఉగాదినాటికి గృహాలు, ఆరోగ్య శ్రీ, ఆటో కార్మికులు ఇలా ఒకే వర్గమని లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో కొన్నిచోట్ల అవినీతి జరిగిందని.. అలాంటి వాటిని సరిద్దిదుకునే సమయం వచ్చిందన్నారు. సంఘమిత్రలు భవిష్యత్తులో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా ఆర్చర్యం లేదన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలాగా సంఘమిత్ర వ్యవస్థను సీఎం జగన్ గుర్తించాలని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. తమ కష్టాన్ని గుర్తించి ఇచ్చిన హామిని నేరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, తమ వెన్నంటి ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంఘమిత్రలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment