
అభిమానుల ప్రార్థనలతో కుట్రలు చేధించుకొచ్చా: జగన్
రాజమండ్రి: అభిమానాలు అందరి ప్రార్థనలు, ఆత్మీయత, ఆ దేవుడి దీవెనలతో కుట్రలను చేధించుకుని మీ మధ్యకు రాగలిగానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. కంబాల చెరువు జంక్షన్కు చేరుకున్న జగన్ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. జక్కంపూడి ఇంట్లో ఇటీవల వివాహమైన సింధు దంపతులను ఆశీర్వదించారు.
అనంతరం జంక్షన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న జనంను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సమైక్య శంఖారావాన్ని పూరిస్తానని జగన్ చెప్పారు. ప్రసంగించాలని జనం కోరారు. తాను ఎక్కవ సమయం మాట్లాడలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దని కోరారు. తాను ఒక పెళ్లికి వెళుతున్నానని, మళ్లీ ఇక్కడికి వస్తానని వారికి నచ్చజెప్పారు. జగన్ ప్రసంగం చివరలో జై తెలుగు తల్లీ - జై సమైక్యాంధ్ర - జోహార్ వైఎస్ఆర్ - జోహార జక్కంపూడి అని నినదించారు. జనం జై జగన్, జై జగన్... అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.
ఉప్పొంగి ప్రజాభిమానం
అంతకు ముందు మధురపూడి విమానాశ్రయం నుంచి జగన్ రాజమండ్రి రావడానికి నాలుగు గంటలు పైగా సమయం పట్టింది. ప్రజాభిమానం ఉప్పొంగటంతో జగన్ ముందుకు కదలలేకపోయారు. జగన్ వస్తున్నట్లు తెలిసి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మధురపూడి విమానాశ్రయం వద్దకు తరలి వెళ్లారు. విమానాశ్రయం వద్ద జగన్కు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా జగన్ను చూసేందుకు జనం తరలి రావడంతో విమానాశ్రయం నుంచి రాజమండ్రి వరకు ట్రాఫిక్ జాం అయింది.
మదురపూడి విమానాశ్రయం నుంచి రాజమండ్రి పది కిలో మీటర్లు వరకు దారి పొడువునా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అభిమానుల తాకిడితో ఆయన కాన్వాయి ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.