
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
కంబాలచెరువు : పిల్లలను ప్రిన్సిపాల్ జ్యోత్స్న వేధిస్తోంది అంటూ రాజమండ్రిలోని ఆర్యాపురంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఆందోళనకు దిగారు. విద్యార్థులను కొట్టడంతో పాటు రోజూ మెకాళ్లపై నిలబెడుతోందని, గుంజీలు తీయిస్తోందని తల్లిదండ్రులు మండిపడ్డారు. అంతేకాదు దీనిపై అడిగేందుకు వెళ్లిన తల్లిదండ్రులపై కూడా జ్యోష్న దురుసుగా ప్రవర్తిస్తోందని, మీ పిల్లల్ని చదివిస్తే చదివించండి లేకపోతే తీసుకుపొండి అని అక్కడున్న ఫైళ్లను తమ ముఖాలపైకి విసిరికొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రిన్సిపాల్, ఏజీఎంలను నిలదీశారు. గతంలో తమ పిల్లల ఫీజులు రూ.17 వేలు చెప్పి ఇప్పుడు 24 వేలు చెల్లించమంటున్నారని, స్కూలు డ్రెస్ వేసుకుని రాకపోతే పిల్లలను చెంపలపై కొడుతున్నారని తక్షణం ప్రిన్సిపాల్ను తొలగించాలని డిమాండ్ చేశారు.
పిల్లను ఎందుకు కొట్టావని ఓ విద్యార్థి తల్లి వస్తే ఆమెపై ప్రిన్సిపాల్ దాడి చేసిందని ఆరోపించారు. ఈ విషయాలన్నీ స్కూల్ ఏజీఎం వేణుగోపాల్కు చెప్పినా ఆయన ఏమీ స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన జరుగుతుండగా మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని ఏజీఎం వేణుగోపాల్, ప్రిన్సిపాల్ జ్యోత్స్న, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ను తొలగిస్తామని ఏజీఎం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడు వచ్చి విద్యార్థులు, తల్లిదండ్రులకు బాసటగా నిలిచారు. కాగా ప్రిన్సిపాల్తో తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున ్నట్టు తెలిసింది.
గాజులు ఎప్పుడు తొలగిస్తారు
స్కూల్కు పిల్లలు వేసుకుని వచ్చిన గాజులను ప్రిన్సిపల్ పగులకొట్టేస్తోంది. చెవికున్న వస్తువులను తీయించేస్తోంది. ఆడవాళ్లకు గాజులు ఏ సమయంలో పగులకొడతారు. అసలు వీళ్లు విద్యాబోధన చేస్తున్నారా? దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. - నాగరాజు, విద్యార్థిని తండ్రి
పిల్లలను తీసుకెళ్లిపోమంటోంది
ఏదైనా విషయం జరిగి అడిగేందుకు వస్తే దూకుడుగా మాట్లాడుతూ మీ పిల్లలను తీసుకునిపోండి అంటూ ప్రిన్సిపాల్ సమాధానం చెబుతోంది. పిల్లలను దారుణంగా హింసిస్తోంది. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలి.
- జి.జ్యోతి, విద్యార్థి తల్లి
నా ముఖానికి ఫైల్ విసిరి కొట్టింది
మా అమ్మాయిని గూబపై కొట్టింది. దీనిపై అడిగేందుకు వెళితే టేబుల్పై ఉన్న ఫైల్ను నా ముఖానికి విసిరి కొట్టింది. భారీగా ఫీజులు చెల్లిస్తుంది మమ్మల్ని, మా పిల్లల్నీ కొట్టేందుకా?. దీనిపై విద్యాశాఖ స్పందించాలి.
- కైరో, విద్యార్థి తల్లి