
సాక్షి, అమరావతి: చంద్రబాబు అనుసరించిన అప్రజాస్వామిక, అరాచక విధానాలు, అవినీతి, అప్పులు, ఆశ్రితపక్షపాతం, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలన్న ఆలోచనా ధోరణే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అఖండ విజయాన్ని సాధించి పెట్టిందని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పౌరసమాజం అభిప్రాయపడ్డాయి. వైఎస్ జగన్ శాసనసభలో అడుగుపెట్టినప్పటి నుంచి అడుగడుగునా ఆయన్ను అవమానించిన తీరే చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని, ఆ తీరే ఆయన ఓటమికి కారణమైందని పేర్కొన్నాయి.
నూతన ప్రభుత్వానికి అప్పులు మిగిల్చిన వ్యవహారమై ప్రజలకు అన్ని వ్యవహారాలు తెలిసేలా శ్వేతపత్రాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర విభజన సందర్భంగా వచ్చిన రూ. 86 వేల కోట్ల అప్పు ఇప్పటికి రూ. 2.14 లక్షల కోట్లకు ఎందుకు చేరిందో వివరించాలని డిమాండ్ చేశాయి. ఏయే శాఖల్లో అప్పులు ఎందుకు తీసుకున్నారోనన్న అంశంపై కొత్త ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరాయి. ఏపీ ఫైబర్గ్రిడ్ సహా అన్ని శాఖల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపైనా విచారించాలని రాష్ట్ర మేధావుల సంఘం కోరింది. దానికి ముందే అప్పులపై శ్వేతపత్రాన్ని ప్రకటించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చేతనా సమాఖ్య కాబోయే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.