
డయల్ 100 పోస్టర్ను ఆవిష్కరిస్తున్న ఎస్పీ సత్యయేసుబాబు, పోలీసు అధికారులు
ఒంగోలు: అసాంఘిక వ్యవహారాలు, అనుమానిత వ్యక్తుల కదలికలు, రోడ్డు ప్రమాదాలకు సంభందించిన లేక ఇతరత్రా ఏ అత్యవసర సమాచారం అయినా 100కు ఫోన్ చేస్తే సహాయం అందించేందుకు పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. బుధవారం స్థానిక గెలాక్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో డయల్ 100 వాల్పోస్టర్ను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలపై వేధింపులు, దాడులు జరిగినా, రోడ్డు ప్రమాదాలు అలాగే ఏ ఇతర ప్రమాదాలు సంభవించినా, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే పరిస్థితి ఉన్నా, పేకాట, వ్యభిచారం లాంటివి జరుగుతున్నా, గంజాయి విక్రయం/వినియోగం వంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినా, అనుమానిత వ్యక్తులు లేదా నేరస్తుల కదలికలను గుర్తించినా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదులపై పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా, సరిగ్గా స్పందించకపోయినా, మీ పట్ల దురుసుగా అమర్యాదకరంగా ప్రవర్తించినా, లంచం అడిగినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment