
ఎవరేమనుకుంటే నాకేం..
సాక్షి ప్రతినిధి, క డప:
చెప్పెందుకే శ్రీరంగ నీతులు..అన్నట్లుగా మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. ఏఎండకు ఆగొడుగు పడుతూ ఎప్పటికప్పుడు రాజకీయ అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తుండటమే అందుకు కారణం. అపార రాజకీయ అనుభవం ఉన్నా అనైతికతతో వ్యవహరిస్తుండటం పరిపాటిగా మారింది. మైదుకూరు శాసనసభ్యుడు డీఎల్ రవీంద్రారెడ్డి పాతతరం నాయకుడు. రాజకీయ ఉద్ధండుడిగా పేరుగాంచిన ఆయన ఐదేళ్ల కాలంలో పదవుల కోసం అనైతికంగా వ్యవహరిస్తూ అపకీర్తిని మూటగట్టుకుంటున్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన డీఎల్ను మైదుకూరు ప్రజలు ఆదరించారు. మహానేత వైఎస్ వర్గంలో ప్రముఖుడిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ అకాలమృతి చెందారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు ఏనాడూ ప్రత్యక్ష్య విమర్శలకు దిగని డీఎల్ ఆయన చనిపోయాక ఆరోపణలు గుప్పించసాగారు. మంత్రి పదవి కోసమే డీఎల్ అలా చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తూ వచ్చారు. మంత్రి పదవి రాగానే దివంగత వైఎస్ కుటుంబాన్ని డీఎల్ టార్గెట్గా చేసుకున్నారు. మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డిపై సైతం ఆరోపణలు చేశారు. డీఎల్ చర్యలు మింగుడుపడని కిరణ్ తన మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చేశారు. ఇటీవలి కాలంలో వైఎస్పై డీఎల్ పొగడ్తలతో ముంచెత్తుతుండటం గమనార్హం.
ప్రజలు ఛీత్కరించినా మారని వైనం....
మహానేత వైఎస్పై విమర్శలు చేసిన డీఎల్కు ప్రజలు తమ తీర్పుతో బుద్ధి చెప్పినా కనువిప్పు కల్గలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. మంత్రిగా ఉంటూ కడప పార్లమెంటు ఉప ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు డిపాజిట్టు ద క్కలేదు. నైతిక విలువలు పాటించే నేతలు ఎవరైనా సరే ప్రజాతీర్పుకు విలువ ఇచ్చి మంత్రి పదవిని త్యజించేవారు. అయితే డీఎల్ ఇటువంటివాటిని ఖాతరు చేయకుండా పదవిలో కొనసాగారు.
‘దేశం’ నేతలతో సమావేశం...
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన డీఎల్ రవీంద్రారెడ్డి ఆపార్టీ సభ్యునిగా ఉంటూ తెలుగుదేశం నేతలతో సమావేశం నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ నేతలతో జట్టు కట్టి ఉంటే కొంతలో కొంతైనా నైతికత చాటుకునే అవకాశం ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని టీడీపీ నేత పుట్టా సుధాకర్యాదవ్తో కలిసి స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక కోసం డీఎల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్రమించిన పదవిలో ఉంటూ టీడీపీ నేతలతో సమావేశం కావడం ఏమేరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక జగన్పై విమర్శలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇటీవల రాజకీయ వైరాగ్యాన్ని ప్రదర్శించి, మీదారి మీరు చూసుకోండని అనుచరులకు హితబోధ చేసిన డీఎల్ టీడీపీ సమావేశానికి హాజరు కావడంపట్ల తెలుగు తమ్ముళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు.