
విద్యా సేవలు ప్రశంసనీయం
గుంటూరు ఎడ్యుకేషన్
పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న రెడ్డి జనాభ్యుదయ మండలి విద్యా సేవలు ప్రశంసనీయమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. స్థానిక నగరంపాలెంలోని రెడ్డి విద్యార్థి వసతి గృహంలో ఉడుముల నర్సిరెడ్డి 28వ వర్థంతి సందర్భంగా శుక్రవారం రాత్రి విద్యార్థులకు ప్రతిభా ఉపకార వేతనాలు అందజేశారు.
మోదుగుల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం తాము చదువు కోలేకపోయినా విద్య పరమార్థాన్ని గుర్తెరిగిన దాతలు 100 గదులతో వసతి గృహం నిర్మించి, 500 మందికి భోజన వసతితోపాటు చక్కటి గ్రంథాలయంలో పాఠ్య పుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు.
విద్యార్థులు తమ ఎదుగుదలకు దాతలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు.
ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్య ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా రెడ్డి జనాభ్యుదయ మండలి వెబ్సైట్ను ప్రారంభించి, విద్యార్థులకు రూ. 10 లక్షలు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కళ్ళం గ్రూపు సంస్థల అధినేత కళ్ళం హరనాథరెడ్డి, రెడ్డి జనాభ్యుదయ మండలి అధ్యక్షుడు భీమవరపు పిచ్చిరెడ్డి, రెడ్డి జనసేవా మండలి అధ్యక్షుడు చల్లా అంజిరెడ్డి, వడ్లమాని రవి, కోశాధికారి వి. మైసూరారెడ్డి, వీసీఆర్ రెడ్డి, కసిరెడ్డి శివారెడ్డి, భీమవరపు సుబ్బారెడ్డి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.