
మత్స్యకారుల తరపున పోరాడతాం: వైఎస్ జగన్
విశాఖ : హదూద్ తుఫానులో నష్టపోయిన మత్స్యకారుల తరపున గట్టిగా పోరాడతామని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఫిషింగ్ హార్బర్ను పరిశీలించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ దాదాపు 400 మరబోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని మత్స్యకారులు చెబుతున్నారని, ఆ నష్టపరిహారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
ఫిషింగ్ హార్బర్పై 20వేల కుటుంబాలు బతుకుతున్నాయని, ప్రతి ఇంటి పైకప్పులతో పాటు శ్లాబులు కూడా ఎగిరిపోయాని వైఎస్ జగన్ అన్నారు. అయితే నష్టాన్ని అంచనా వేయడానికి ఎవరూ ఇంతవరకూ రాలేదని మత్స్యకారులు చెబుతున్నారని, వెంటనే అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. తక్షణమే ఒక్కో ఇంటికి రూ.5వేలు సాయాన్ని అందించాలన్నారు. అలాగే, చేపల వేటకు వెళ్లే బోటు ఒక్కొక్కటి ఎనిమిది మందిని పోషిస్తుందని, అవన్నీ బాగా పాడైపోయినందున బోటు మరమ్మతుల కోసం కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మత్స్యకారులకు నాలుగు రోజుల్లో ఒక్కపూటే పులిహోర పొట్లాలు అందాయన్నారు.