
నిర్దేశిత కక్ష్యలోకి జీశాట్ –19
ఈనెల 5వతేదీన సాయంత్రం 5.28 గంటలకు షార్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్3 డీ1 రాకెట్ ద్వారా రోదసిలోకి పంపిన జీశాట్–19 ఉపగ్రహాన్ని 170 కిలోమీటర్లు పెరిజీ (భూమికి దగ్గరగా), 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. హసన్లోని నియంత్రణ కేంద్రం(ఎంసీఎఫ్) ఉపగ్రహాన్ని తమ అదుపులోకి తీసుకుని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టింది. శనివారం ఉదయం 7.59 గంటలకు నాలుగోసారి అంటే ఆఖరి విడతగా 488 సెకెన్ల పాటు ల్యామ్ ఇంజిన్లు మండించి ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా స్థిరపరిచారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత సోలార్ ప్యానెల్స్ విచ్చుకుని చక్కగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఉపగ్రహం సుమారు పదేళ్ల పాటు సేవలను అందిస్తుంది.