విశాఖ హెచ్పీసీఎల్లో సోమవారం కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది.
విశాఖ : విశాఖ హెచ్పీసీఎల్లో సోమవారం కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. అగ్ని ప్రమాదంలో గల్లంతు అయిన వారి వివరాలను హెచ్పీసీఎల్ యాజమాన్యం ఇప్పటివరకూ స్పష్టంగా ప్రకటించలేదు. మృతుల సంఖ్యను కూడా అధికారులు స్పష్టంగా వెల్లడించలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై జ్యూడిషియల్ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు హెచ్పీసీఎల్లో కూలింగ్ టవర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ నిన్న కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా సంఘటన స్థలం వద్ద ఐదు సంప్పుల్లో ఉన్న వ్యర్థాలను క్రేన్, కాంట్రాక్ట్ కార్మికుల సాయంతో తొలగించారు. శుక్రవారం రాత్రి నుంచి శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.
శనివారం తొలగింపు కార్యక్రమంలో భాగంగా సుమారు ఐదు మృతదేహాలను వెలికితీయగా, ఆదివారం తొలగింపులో మరో రెండు మృతదేహాలను గుర్తించినట్టు సమాచారం. అయితే దీనిని సంస్థ యాజమాన్యం నిర్థారించడం లేదు. అటువంటిదేమి లేదని శనివారంతోనే శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తొలగించినట్టు వివరించారు. ఆదివారం తొలగింపు చేపట్టిన కార్యక్రమంలో ఎటువంటి మృతదేహాలు లభ్యం కాలేదని, కేవలం సంప్లో ఉన్న వ్యర్థాలను తొలగించామన్నారు. నేడు కూడా తొలగింపు ప్రక్రియ కొనసాగే అవకాశముంది.