రేపే భారీ పెట్టుబడుల సదస్సు | Huge investment conference is tomorrow | Sakshi
Sakshi News home page

రేపే భారీ పెట్టుబడుల సదస్సు

Published Thu, Aug 8 2019 4:59 AM | Last Updated on Thu, Aug 8 2019 9:23 AM

Huge investment conference is tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల సదస్సు విజయవాడలో శుక్రవారం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ పేరుతో జరిగే ఈ సదస్సులో దక్షిణ కొరియా, యూకే, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 35 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్‌ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ఈ సదస్సు ఉద్దేశమని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ పథకాలు, విధానాలను ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు తెలియచేయనున్నట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి వీలుగా ఆయా దేశాలను ఇక్కడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరనున్నారు. పెట్టుబడుల సదస్సు సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.  
 
విదేశాల్లో కార్యాలయాలు  
పెట్టుబడులను ఆకర్షించడానికి దేశ విదేశాల్లో పెట్టుబడుల ప్రోత్సాహక కార్యాలయాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో బిజినెస్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే టోక్యో, సియోల్‌ వంటి ఎంపిక చేసిన విదేశీ రాజధానుల్లో కార్యాలయాలు నెలకొల్పనున్నారు. సీఐఐ, ఫిక్కీ వంటి సంస్థల సహకారంతో పెట్టుబడుదారులతో సంప్రదింపులు జరుపుతారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా పలు రంగాల్లో పేరున్న ప్రముఖులను పిలిచి, ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపన, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement